Friday, October 10, 2025

Sagarudu - సగరుడు

సగరుడు హిందూ పురాణాల్లో సత్య యుగానికి చెందిన గొప్ప చక్రవర్తి. సూర్య వంశం లేదా ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. రామాయణంలో దశరథ మహారాజుకి ఈయన పూర్వీకుడు.

ఆయోధ్యను భాషుడను రాజుపాలించుచుండెను. హైహయులు దండెత్తి భాషుని రాజ్యమాక్రమించుకొన్నారు.అంత భాషుడు నిండు గర్భినియగు పట్టమహిషితో కులగురువగు ఔర్వుని ఆశ్రమమును పోయాడు. 

తన సవతి గర్భవతి అయినదని తనకా అదృష్టం లేదని భాషుని మరియొక భార్య పట్టమహిషికి విషం పెట్టింది. ఇది ఎవరకీ తెలియదు. దాంతో గర్భం స్తంభనమైంది. ఏడు సంవత్సరములైననూ ఆమెకు పురుడు రాలేదు. ఇంతలో రాజు ముసలివాడై మరణించాడు. పట్టమహిషి సహగమనానికి పాల్పడినది. కాని ఔర్వుడు నిండు గర్భణి అయినా ఆమెను అగ్ని ప్రవేశము చేయవద్దని వారించాడు. 

ఆమె గురువు వచనాల ప్రకారం ఆ ప్రయత్నం మాని ఆశ్రమమందే కాలక్షేపం చేస్తోంది. కొంతకాలమునకు ఆమె ఒక మగ బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డ విషంతో సహా జన్మించాడు.ఆ విషయము తెలిసికొని ఔర్వమహర్షి ఆ బిడ్డకు సగరుడని పేరు పెట్టాడు. గరమునగా విషయు. విషముతో పుట్టుటచే ఆతనికి సగరుడు అని నామకరణం చేశాడు ఆ మహర్షి. సగురుడు, తల్లి ఆశ్రమ మందే ఉంటున్నారు. సగరుడు పెద్ద వాడయ్యాడు. సమస్త విద్యలు నేర్చుకొన్నాడు. తల్లి వల్ల విషయాలు తెలిసికొని శత్రువులపై దండెత్తి వారినందరను జయించాడు. అతడు రాజ్యాభిషిక్తుడై సప్తద్వీపసమేతముగా భూమండలాన్ని పాలించసాగాడు. ఆయనకి ఇద్దరు భార్యలు ఒకరు విదర్భ రాజకుమారి వైదర్భి. మరొకరు శివి వంశానికి చెందిన శైబ్య. వారివల్ల సంతానం కలుగలేదు.భార్యలను వెంటబెట్టుకుని అతడు ఔర్వమహర్షి ఆశ్రమానికి వచ్చి సంతానం కావాలని అర్థించాడు. గురువు కరుణతో శైబ్యకు అసమంజసుడూ కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి.

సగరుని అశ్వమేధ యాగాన్ని చేయగా  ఆ యాగాన్ని భగ్నం చేయడానికి ఇంద్రుడు యాగదేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు. వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు దిలీపుడు. దిలీపుని కొడుకు భగీరధుడు.

భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆ పై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.

Aurva Maharshi - ఔర్వ మహర్షి

భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్రవానుడు. అప్రవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు. బుచి యూరువు మరుగున పుట్టిన బిడ్డడగుటచే అతడు ఔర్వువయాడు. 

ఔర్వుడు బాల్యము నుండియు తపస్సులో మునిగి యుండెడివాడు. అతని తపశ్శక్తి అనలముగా మారినది. ఆ అగ్ని వలన ఉపద్రవము కలుగునని అతని పితృదేవతలు ఔర్వుని చేరి కుమారా?నీ తపోశ్శక్తిచే జనించిన అగ్నిని సముద్రమున విడిచిపెట్టు. అది సముద్రమును దహించును. లేకున్న ఉపద్రవములు కలుగును అని పలకగా ఔర్వుడు దానిని సముద్రమున విడిచిపెట్టాడు. అది ఔర్వానలమై గుర్రం ముఖంతో సముద్ర జలమును త్రాగనారంభించెను. అదే బడబానలం. అనంతరం ఔర్వుడు బ్రహ్మచర్యవ్రత చేయసాగాడు. అంత దేవతలు, రాక్షసులు ఆ మహర్షి వద్దకు వచ్చి పెండ్లి చేసికొని పిల్లలను కనుమని పలికారు. అతడు అందుకు అంగీకరింపలేదు. అతని బ్రహ్మచర్య దీక్షకు అచెరువంది హిరణ్యకశిపుడు శ్రద్ధాభక్తులతో ఆ మహర్షి నమస్కరించి శిష్యునిగా స్వీకరించమని కోరాడు. ఔర్వుడు సంతసించి హిరణ్యకశిపునకు కోరిన వరాలిచ్చి సంతుష్టిపరచి శత్రుభీతి ఉండదని అభయమిచ్చి పంపాడు.

ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు 'కందని' (కందశి) అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ. ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. దుర్వాసుడు తన భార్యయగు కందనితో సమస్త భోగములు అనుభవింపసాగాడు. తనే కోపి. తనకన్న తన భార్య మరీ కోపి. కలహప్రియ. కటుభాషిణి కావడంతో ఆమె బాధ భరించలేక ఆ మహర్షి ఆమెను భస్మం చేశాడు.ఆ విషయం మామ యగు ఔర్వ మహర్షికి తెలియగా వచ్చి అల్లుని నిందించి అవమానాల పాలగుదవని శపించాడు.

ఆయోధ్యను భాషుడను రాజుపాలించుచుండెను. హైహయులు దండెత్తి భాషుని రాజ్యమాక్రమించుకొన్నారు.అంత భాషుడు నిండు గర్భినియగు పట్టమహిషితో కులగురువగు ఔర్వుని ఆశ్రమమును పోయాడు. 

తన సవతి గర్భవతి అయినదని తనకా అదృష్టం లేదని భాషుని మరియొక భార్య పట్టమహిషికి విషం పెట్టింది. ఇది ఎవరకీ తెలియదు. దాంతో గర్భం స్తంభనమైంది. ఏడు సంవత్సరములైననూ ఆమెకు పురుడు రాలేదు. ఇంతలో రాజు ముసలివాడై మరణించాడు. పట్టమహిషి సహగమనానికి పాల్పడినది. కాని ఔర్వుడు నిండు గర్భణి అయినా ఆమెను అగ్ని ప్రవేశము చేయవద్దని వారించాడు. 

ఆమె గురువు వచనాల ప్రకారం ఆ ప్రయత్నం మాని ఆశ్రమమందే కాలక్షేపం చేస్తోంది. కొంతకాలమునకు ఆమె ఒక మగ బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డ విషంతో సహా జన్మించాడు.ఆ విషయము తెలిసికొని ఔర్వమహర్షి ఆ బిడ్డకు సగరుడని పేరు పెట్టాడు. గరమునగా విషయు. విషముతో పుట్టుటచే ఆతనికి సగరుడు అని నామకరణం చేశాడు ఆ మహర్షి. సగురుడు, తల్లి ఆశ్రమ మందే ఉంటున్నారు. సగరుడు పెద్ద వాడయ్యాడు. సమస్త విద్యలు నేర్చుకొన్నాడు. తల్లి వల్ల విషయాలు తెలిసికొని శత్రువులపై దండెత్తి వారినందరను జయించాడు. అతడు రాజ్యాభిషిక్తుడై సప్తద్వీపసమేతముగా భూమండలాన్ని పాలించసాగాడు. ఆయనకి ఇద్దరు భార్యలు ఒకరు విదర్భ రాజకుమారి వైదర్భి. మరొకరు శివి వంశానికి చెందిన శైబ్య. వారివల్ల సంతానం కలుగలేదు.భార్యలను వెంటబెట్టుకుని అతడు ఔర్వమహర్షి ఆశ్రమానికి వచ్చి సంతానం కావాలని అర్థించాడు. గురువు కరుణతో శైబ్యకు అసమంజసుడూ కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుడు గురువుకు నమస్కరించి వెళ్ళిపోయాడు.

సగరుడు చాలాకాలం రాజ్యం చేసి చివరకు ఔర్వుని చేరి తత్త్వముపదేసించమని అర్థించాడు. అంత ఆ మహర్షి అనేక విషయాలు తెలిపాడు. ఔర్వునికి తెలియని విషయాలు లేవు. అతడు మేధావి అస్ఖలిత బ్రహ్మచారి, తపోనిధి, ఉపకారి. అటువంటి మహర్షి చరిత్ర నిజంగా చాలా గొప్పది.

Chyavana Maharshi - చ్యవన మహర్షి

చ్యవన మహర్షి వృత్తాంతము మహాభారతము, దేవీభాగవతము, అష్టాదశ పురాణాలలో చెప్పబడింది చ్యవన మహర్షి తల్లిదండ్రులు భృగు మహర్షి పులోమ దంపతులు. ఒకనాడు భృగు మహర్షి స్నానానికి వెళుతు అగ్నిహోత్రాన్ని సిద్దము చేయమని భార్యకు చెప్పుతాడు అప్పటికే ఆవిడ గర్భవతి ఆవిడ తనకు పుట్టబోయే బిడ్డ బ్రహ్మర్షి కావాలని కోరుకుంటూ ఉంటుంది. అగ్నిహోత్రము వెలుగుతుండగా పులోముడు అనే రాక్షసుడు ఆవిడ ఎవరు అని అగ్నిహోత్రుడిని అడుగుతాడు నిజము చెపితే మహర్షికి కోపము వస్తుంది అబద్ధము చెపితే పాపము వస్తుంది ఏమి చేయాలో తోచని అగ్నిహోత్రుడు భృగు మహర్షి భార్య అని చెపుతాడు. ఆ రాక్షసుడు పంది రూపములో ఆవిడను ఎత్తుకుపోతుండగా గర్భము లోని శిశువు భూమిపై పడతాడు ఆ పిల్లవాడి తేజస్సుకు రాక్షసుడు భస్మము అవుతాడు. అలా క్రిందపడిపోవటం వలన ఆ బాలుడికి చ్యవనుడు అనే పేరు వచ్చింది విషయము తెలుసుకున్న భృగు మహర్షి అగ్నిహోత్రుడిని సర్వము భక్షించేవాడిగాను, అతి క్రూరుడిగాను అవమని శపిస్తాడు దేవతలు బ్రతిమాలగ మహర్షి శాపాన్ని ఉపసంహరించు కుంటాడు. 

ఉపనయనము తరువాత చ్యవనుడు తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్లి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ఉండగా చుట్టూ పుట్టలు పెరిగి ముసలివాడు అవుతాడు.  ఒకనాడు ఇక్ష్వాకు వంశస్తుడైన శర్వాతి సైన్యము భార్య కూతురులతో అరణ్యానికి వస్తాడు అతనికి కూతురు సుకన్య చాలా అందగత్తె ఆవిడ పుట్టలో మెరుస్తున్న కళ్లను చూచి మిణుగురు పురుగులని భావించి పుల్లతో పొడుస్తుంది ఫలితముగా చ్యవనుడి కళ్ళు పోతాయి ఆగ్రహించిన మహర్షి శర్వాతి సైన్యానికి అందరికి మలమూత్రాలు రాకుండా శపిస్తాడు. రాజు చ్యవనుడిని, తనకూతురు తప్పును క్షమించమని వేడుకుంటాడు భవిష్యత్తు తెలిసినవాడు అవటం వలన చ్యవనుడు సుకన్యను తనకు ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు అంతటి మహర్షి తనకు భర్తగా రావటము తన అదృష్టముగా భావించి సుకన్య చ్యవనుడిని వివాహము చేసుకోవటానికి సంతోషముగా అంగీకరిస్తుంది. 

సుకన్య ముసలి వాడైన భర్తను భక్తి శ్రద్దలతో సేవిస్తూ ఉంటుంది. వీరికి ప్రమతి, దధీచి అప్రవానుడు అనే ముగ్గురు కుమారులు ఉంటారు. ఒక రోజు సుకన్య నదికి నీరు తెచ్చు కోవడానికి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళ్ళుతున్న అశ్వనీ దేవతలు సుకన్యని చూసి ఏవరీ నవయవ్వన సుందరాంగి అని అనుకొని పరిచయం అడుగగా సుకన్య చ్యవన మహర్షి భార్యనని చెబుతుంది. అప్పుడు వారు ఆ గుడ్డి మునితో కాలం వెలిబుచ్చే బదులు తమతో వచ్చి సర్వసుఖాలు అనుభవించమని కోరుతారు. దానికి సుకన్య అంగీకరించక తన పాతివ్రత్య ధర్మాన్ని తెలుపుతుంది. అప్పుడు అశ్వనీ దేవతలు ఒక పరీక్ష పెట్టదలచి ముసలి వాడు గుడ్డి వాడు అయిన చ్యవన మహర్షిని తాము తమ వైద్యశక్తులతో తమ వలే నవయవ్వనుడిని చేస్తామని ఆమె తన భర్తని గుర్తించమని పల్కుతారు. ఆ విషయం చ్యవన మహర్షికి తెలుపగా చ్యవన మహర్షి అందుకు అంగీకరిస్తాడు. ఆ ముగ్గురు నదిలో స్నానము చేసి బయటకు వస్తారు. ఆ ముగ్గురు చూడడానికి ఒకే విధంగా నవయవ్వనంలో ఉంటారు. ఆ ముగ్గురుని చూసి మొదట తన పతి ఎవరని సంశయించి జగన్మాతని ప్రార్థించి చ్యవనుడీని గుర్తిస్తుంది. దానికి అశ్వనీ దేవతలు కూడా సంతసించి తమకు సెలవు ఇవ్వమని చ్యవన మహర్షిని కోరుతారు. అప్పుడు చ్యవన మహర్షి తనకు యవ్వనము ప్రసాదించిన కారణమున ఏదైన వరము కోరుకోమంటాడు. అప్పుడు అశ్వనీదేవతలు తమకు యజ్ఞయాగాదులలో సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ సోమరస పానం కావాలని కోరుకుంటారు. చ్యవనుడు మామగారి అభివృద్ధికి ఒకయజ్ఞము చేయిస్తూ అశ్వని దేవతలకు సోమపానము ఇస్తుంటే ఇంద్రుడు అడ్డుపడతాడు అయిన చ్యవనుడు అశ్వనీదేవతలతో సోమపానము చేయిస్తాడు ఆగ్రహించిన ఇంద్రుడు చ్యవనుడిని చంపటానికి వజ్రాయుధాన్ని తీస్తాడు. కానీ చ్యవనుడు అగ్ని నుంచి ఒక భయంకర రాక్షసుడిని పుట్టించి ఇంద్రుడి మీదకు వదులుతాడు భయపడ్డ ఇంద్రుడు చ్యవనుడిని క్షమించమని అడుగుతాడు ఆరాక్షసుడిని మద్యము త్రాగేవారిలోని జంతువులలో ఉండమని మహర్షి ఆదేశిస్తాడు ఇంత జరిగినా ఆగ్రహము తగ్గని ఇంద్రుడు ఒకపర్వతాన్ని చ్యవనుడు పైకి విసురుతాడు కానీ ఆ మహర్షి తపోబలము వల్ల ఆ పర్వతము ఇంద్రుడిపైకే వస్తుంది అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగి మహర్షుల జోలికి పోరాడు అని నిర్ణయించుకుంటాడు. 

కొంతకాలము తరువాత చ్యవనుడు గంగా యమునా సంగమములో నీటిలో మునిగి తపస్సు చేస్తుండగా అయన చుట్టూ నీటిలోని చేపలు నీరు ప్రదక్షిణాలు చేస్తుంటాయి అలా 12 ఏళ్ళు తపస్సు చేసినాక ఒకనాడు జాలర్లు విసిరినా వలలో చేపలతో పాటు చ్యవనుడు కూడా చిక్కుంటాడు ఆయనను వలలో చూసిన జాలర్లు తమ తప్పుని మన్నించమని వేడుకుంటారు కానీ చ్యవనుడు మీరు చేసిన తప్పు ఏమిలేదు మీరు మీ కుల వృత్తిని మీరు చేశారు చేపలతో పాటు నన్నుకూడ అమ్ముకోండి అని అంటాడు జాలర్లకు ఏమిచేయాలో పాలుపోక రాజు నహుషుడు దగ్గరకు వెళతారు రాజు చ్యవనుడికి ఏమి ఇస్తానన్న అంగీకరించడు ఆ సమయములో రాజు దగ్గరకు మరో మహర్షి కవిజాతుడు వచ్చి గోవు బ్రాహ్మణులకు సమానము కాబట్టి గోవును జాలర్లకు ఇమ్మని సలహా ఇస్తాడు గోవు మహత్యము తెలుసుకున్న రాజు గోవును జాలర్లకు ఇస్తాడు జాలర్లు మేము ఆవును ఏమి చేసుకుంటాము అని ఆగోవును చ్యవనునికి దానము గా ఇచ్చి నమస్కరిస్తారు ప్రసన్నుడైన చ్యవనుడు జాలర్లకు స్వర్గలోక ప్రాప్తి నహుషునికి ఇంద్రపదవి దక్కుతుంది అని దీవిస్తాడు. 

మునులు దేవతలు ఇష్టాగోష్టి జరుపుతున్న సమయములో బ్రహ్మ భృగు, కుశిక వంశాలలో బ్రాహ్మణక్షత్రియ సంకరము జరిగి బ్రహ్మర్షి పుడతాడని చెపుతాడు.  

కానీ ఈ సంకరము ఇష్టము లేని చ్యవనుడు కుశిక వంశాన్ని నాశనము చేస్తే సంకరము తప్పుతుందని భావించి కుశిక రాజును ఎన్నో విధాలుగా పరీక్షించిన కుశికరాజు వినయవిధేయలతో భక్తితో చ్యవనుడిని సేవించగా నీ వంశములో బ్రహ్మర్షి పుడతాడు అని దీవిస్తాడు. ఆయనే విశ్వామిత్రుడు. 

ఒకసారి చ్యవనుడు నర్మదా నదిలో స్నానము చేస్తుండగాఒక పెద్దపాము ఆయనను పాతాళలోకానికి లాక్కుపోతుంది. అక్కడ ఆయనకు నాగ కన్యలు భక్తి శ్రద్దలతో సేవచేస్తారు పాతాళరాజు అయినా ప్రహ్లాదుడు మహర్షిని చూసి ఇంద్రుడు తనను చంపటానికి పంపాడని అనుమానిస్తాడు. కానీ ఆ మహర్షితో మాటాడినాక తన భయము నిరాధారం అని భావించి ఆయనకు నమస్కారము చేసి ,"మహాత్మా మీరు అనేక నదులలో స్నానమాచరించి ఉంటారు ఏ నది స్నానము పుణ్యమైనది" అని అడుగుతాడు దానికి చ్యవనుడు ,"రాజా నీవు విష్ణుభక్తుడివి మనస్సు పవిత్రముగాలేకుండా ఏ నదిలో స్నానము చేసినా ఉపయోగము ఉండదు. తీర్ధయాత్రలకంటే నదీస్నానములకన్నా సత్యము, భూతదయ, శుచిత్వము కలిగి ఉండటం ముఖ్యము ఇవన్నీ ఉంటె అటువంటి వారి పాదాల వద్దకు అన్ని తీర్ధాలు వస్తాయి. అయినా నీవు అడిగావు కాబట్టి ముఖ్యమైన మూడు తీర్ధాలు చెపుతాను అవి నైమిశము, చక్రతీర్ధము, పుష్కరమునే ఈ మూడు భూలోకము లోని పవిత్రమైన తీర్ధాలు." అని చెపుతాడు విన్న ప్రహ్లాదుడు సంతుష్టుడై భక్తి ప్రపత్తులతో చ్యవన మహర్షిని సేవించి ఆశ్రమానికి పంపుతాడు.

Druvudu - ధ్రువుడు

భారత ఇతిహాసములలో శ్రీ మహావిష్ణువు చేత ఆశీర్వదించబడి అంతరిక్షంలో ఇప్పటికి ధ్రువ నక్షత్రముగా ధ్రువక్షితిలో మనకు కనిపిస్తున్న స్వాయంభువ మనువు వంశ రాకుమారుడు. పెద్దలు ఇప్పటికి చిన్న పిల్లలకు భక్తికి, కార్య నిశ్చయానికి ఉదాహరణగా ధ్రువోపాఖ్యానం (ధ్రువ చరిత్ర) చెబుతారు. ధ్రువోపాఖ్యానం విష్ణు పురాణములోను, మహాభాగవతము నాల్గవ స్కందములో ముఖ్యముగా ప్రస్తుతించబడుతుంది. ఋగ్వేదం ప్రకారము ధ్రువ అంటే రెండు అర్థాలు కనిపిస్తున్నాయి.ఒకటి ధ్రువ నక్షత్రము, మరొకటి నిలకడ స్థితి. గృహ్యసూత్ర, మహాభారతం, సూర్యసిద్ధాంతం ధ్రువ నక్షత్రం గురించి ప్రస్తుతించడింది. ధ్రువ అంటే ఒక నిలకడ స్థానము నుండి బయలు దేరే ప్రదేశాన్ని ధ్రువ అని పిలుస్తారు.

ధ్రువుడి వంశ చరిత్ర
స్వాయంభువ మనువుకి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యల వలన ధ్రువుడు (సునీతి) ఉత్తముడు (సురుచి) అనే ఇద్దరు కుమారులు కలిగారు. కాలప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి చూసి వెర్రి నవ్వు నవ్వి నీకు తండ్రి తొడ పై ఎక్కే అధృష్టం లేదు, అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది. నీకా అధృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెబుతుంది. 

ఆ పరుష భాషణానికి చింతాక్రాంతుడై ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు సునీతి ధ్రువుడితో నాయనా కాలప్రభావం వలన నీ తండ్రి తనను దాసీ కంటే తక్కువగా చూస్తున్నదని, కష్టం కలిగించే పలుకులైన సవతి సరైన విషయం చెప్పిందని, శ్రీహరి పాదధ్యానము వలన జరగనివి ఉండవని స్వాయంభువ మనువు శ్రీహరిని ధ్యానించి ఉత్తమ గతి పొందాడని చెబుతుంది. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి రాజధాని నుండి అడవికి బయలుదేరాడు.

ధ్రువుడికి నారదుడు నారాయణ మంత్రొపదేశం
అప్పుడు మార్గమధ్యములో నారదుడు కనిపించి ఎక్కడికి వెళ్ళుతున్నావు అని అడుగగా ధ్రువుడు అప్పటి వరకు జరిగిన వృత్తాంతం తన సవతి తల్లి చేత పొందిన అవమానం చెబుతాడు. నారదుడు ధ్రువుడిని ఓదార్చి రాజధాని నగరం పంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ధ్రువుడి పట్టుదలకు మెచ్చి యమునా నది తీరములో ఉన్న మధువనంలో ధర్భాసీనుడవై ప్రాణాయామ నిష్ఠతో శ్రీ మహావిష్ణువును ఆరాధించమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రము ఉపదేశిస్తాడు. 

ధ్రువుడు యమునానదిలో త్రికరణ శుద్ధిగా స్నానము చేసి దర్భాసీనుడై నారాయణు గురించి తపస్సు చేస్తాడు. ముందు మూడు రోజులకు ఒకమారు వెలగ పండు లేదా రేగి పండు తినేవాడు తరువాత ఆరు రోజులకు ఒకమారు పండి రాలిన ఆకులు తింటు తపస్సు చేశాడు. ఆ తరువాత మూడు నెలలు తొమ్మిది రోజులకు ఒకమారు మంచి నీరు త్రాగి తపస్సు చేశాడు. ఆ తరువాత 12 రోజులకు ఒకమారు గాలి పీల్చి తపస్సు చేశాడు. మరికొన్ని రోజులకు గాలి కూడా పీల్చకుండా తపస్సు చేస్తూండగా సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం సృష్టించబడి దేవతలు నారాయణుడి వద్దకు వెళ్ళి విషయం విన్నవిస్తారు. అప్పుడు నారాయణుడు ధ్రువుడు తన గురించి తపస్సు చేస్తున్నాడని, వాని వలన ఈ ఉపద్రవం వస్తున్నదని చెప్పి వానికి ప్రత్యక్షం అయ్యి దీక్ష విరమింప జేస్తానని చెబుతాడు.

శ్రీమహా విష్ణువు దర్శనం
నారాయణుడు ధ్రువుడికి శంఖ చక్రాలతో ప్రత్యక్షమై ధ్రువుడి శిరస్సు నిమిరగా ధ్రువుడు 12 శ్లోకాలతో నారాయణుడిని స్తుతిస్తాడు. దానికి నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో సప్తఋషులు, నిఖిల తారాగణాలు, సూర్యచంద్రులు నిరంతరం ప్రదక్షిణం చేసే ధ్రువక్షితి అనే స్థానం కలిపిస్తున్నానని చెప్పి, ఆ ధ్రువక్షితికి చేరే ముందు కొన్ని రోజులు రాజ్యపరిపాలన చేయమంటాడు. 

ఆ విధంగా నారాయణుడిని ప్రసన్నం చేసుకొని ఆశీర్వాదం పొందిన ధ్రువుడు తిరిగి రాజధాని చేరుకొంటాడు. రాజధాని చేరుకొనిన ధ్రువుడిని చూసి తండ్రి ఉత్తానపాదుడు సంతోషం పొంది, రాజ్యానికి పట్టాభిషేకం చేసి వానప్రస్థాశ్రమమునకు వెళ్తాడు. శింశుమాన ప్రజాపతి కుమార్తె అయిన భ్రమి అనే గుణవతిని వివాహం చేసుకొని కల్ప, వస్తర అనే కుమారులను సంతానంగా పొందుతాడు. అనంతరం వాయివు కుమార్తె అయిన ఇలా అనే కన్యకని వివాహం చేసుకొని ఆమె వలన కుమారుడిని, కుమార్తెని పొందుతాడు.

యక్షులతో యుద్ధం
ఒకరోజు తన సోదరుడైన ఉత్తముడు అరణ్యానికి వేటకు వెళ్ళి ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఆ వార్త విన్న సురుచి అగ్నిలో ప్రవేశించి ప్రాణ త్యాగం చేసింది. ఈ రెండు విషయాలు మనస్థాపం కలిగించి ధ్రువుడు హిమయత్పర్వతం లోయలో ఉన్న అలకపురిలో ఉన్న యక్షుల మీద యుద్ధం ప్రకటించాడు. కొద్ది సేపటి తరువాత యుక్షులు మాయ యుద్ధం చేయట మొదలుపెట్టారు. వారితొ మాయాయుద్ధం చేసే దారి తోచక ఆలోచిస్తుంటే మునులు ప్రత్యక్షమై నిఖిపలోకాలకు మూల కారకుడైన నారాయణుడిని స్మరించమని చెబుతారు. నారాయణుడిని స్మరించి నారాయాణాస్త్రం సంధించగా యక్షుల శక్తి సన్న గిల్లి వారి కాళు చేతులు మొండలు విరిగి క్రింద పడి పోయాయి.

అప్పుడు ధ్రువుడి తాత స్వాయంభువ మనువు ప్రత్యక్షం అయి దేహాభిమానం కలిగిన పశుపక్ష్యాదులు చేసే కిరాతక కృత్యాన్ని చేస్తున్నడని, నారాయణుడిని ప్రసన్నం చేసుకొనిన నీకు అది సరికాదని హితబోధ చేశాడు. అంతేకాక యక్షులతో యుద్ధం వల్ల శివునికి సన్నిహితుడైన కుబేరుడికి ఆగ్రహం వచ్చిందని చెబుతాడు. 

ధ్రువుడు తన తాత మాటలు విని విరమించాడని తెలుసుకొని కుబేరుడు సంతోషించి, ధ్రువుడు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు కుబేరుడికి నమస్కరించగా కుబేరుడు ధ్రువునితో మీతతా మాటలు విని యుద్ధం ఆపినందుకు సంతోషంగా ఉన్నది, నిర్మలమైన శ్రీమహావిష్ణువును సదా స్మరిస్తూ జీవననం జరపమని సెలవిచ్చి వెళ్ళిపోతాడు.

ధ్రువుడు ధ్రువ నక్షత్ర ముక్తి
ధ్రువుడు రాజధాని చేరి భూరి దానాలతో యజ్ఞాలు సాగించి కొంత కాలం పరిపాలన చేశాడు. తరువాత రాజ్యాన్ని తన కూమారుడికి అప్పగించి, తపస్సు చేసుకోవడానికి బదరికావనములో పద్మాసీనుడై శ్రీ మహావిష్ణువు స్మరిస్తూ కాలం వెల్లబుచ్చుతుండగా ఒకరోజు నందసునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్యవిమానం మీద ధ్రువుడిని తీసుకొని వెళ్ళడానికి వస్తారు. ధ్రువుడా దివ్యవిమానం ఎక్క లేకపోతుండగా యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమని చెబుతాడు. అలా వెళ్ళుతుండగా ధ్రువుడు నారాయణ సేవకులతో తన తల్లిని చూడవలెనని కోరిక ఉన్నదని తెలుపగా వారి ముందు ఉన్న విమానం పైనున్న సునీతిని చూపించగా ధ్రువుడు ఆనందిస్తాడు.నేటికి మనకు కనిపించే ధ్రువనక్షత్రము ధ్రువుడి నారాయణ భక్తి సామ్రాజ్యపాలన ఫలంగా లభించనదే అని చెబుతారు.

Uttarashada Nakshatra - ఉత్తరాషాఢ నక్షత్రం

ఉత్తరాషాఢ నక్షత్రము

నక్షత్రం - ఉత్తరాషాఢ
అధిపతి - రవి
గణము - మానవ
జాతి - పురుష
వృక్షం - పనస
జంతువు - ముంగిస
నాడి - అంత్య
పక్షి - గరుడము
అధిదేవత - విశ్వేదేవతలు
రాశి - 1, పాదం ధనస్సు, 2, 3, 4 పాదాలు మకరం

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో ఉత్తరాషాఢ నక్షత్రము 21వ నక్షత్రము. ఈ నక్షత్రం పూర్తిగా శుభకరం. ఇందులో 1వ పాదం ధనురాశిలో మిగతా మూడు మకర రాశిలో ఉంటాయి. ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస.

ఈ రాశివారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలా అలా ఎదుగుచూ ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరికెడి అవకాశాలు వీరికి దక్కుతాయి.

వీరు తక్కువగా మాట్లాడెదరు, అణకువ కలిగి ఉంటారు. సొంతవారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసి మెలిసి ఉండదలచుకొనెదరు, క్రొత్త స్నేహములు చేయుట నేర్చుకొనెదరు.

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. పై చదువులు వీరికి కలసి వస్తాయి.

వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిసివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసివస్తాయి. తక్కినవారికి వీరు వీలు కలిగిస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసివస్తాయి.

వీరు తల్లిదండ్రులని మించిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించిపోతారు. కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, థన సహాయాన్ని చేస్తారు.నక్షత్రములలో ఇది 21వ నక్షత్రం.

ఉత్తరాషాఢ నక్షత్రము జాతకులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు మరియు మృదువుగా మాట్లాడతారు. వీరు ఆధ్యాత్మికంగా ఉంటారు మరియు ఇతరులను గౌరవిస్తారు. వీరు ప్రతి పనిని నిజాయితీగా చేస్తారు మరియు ఆలోచనల పట్ల వీరు స్పష్టంగా ఉంటారు.

ఎన్నడూ ఇతరులను మోసగించడం లేదా ఏదైనా సమస్యను సృష్టించడం చేయరు. చక్కటి హృదయాన్ని కలిగి ఉండటం వల్ల, అనేకసార్లు వీరు తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటారు.

వీరు ఎవరినీ సులభంగా నమ్మరు, అయితే, నమ్మడం ప్రారంభించినట్లయితే, వారి కోసం ఏదైనా చేయగలుగుతారు. వీరు సులభమైన జీవితాన్ని ఇష్టపడతారు మరియు ఎలాంటి నిర్ణయాన్ని కూడా వేగంగా తీసుకోరు.

వీరు ఎవరినైనా విశ్వసించినట్లయితే, వారి వద్ద నుంచి వీరు సూచనలను తీసుకుంటారు. వీరికి ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఉంటుంది. జపం, తపం, వ్రతం మొదలైనవి వీరిని జీవితంలో విజయపథంలోనికి తీసుకెళతాయి. ఒక్కసారి ఆధ్యాత్మిక పథంలోనికి నడవడం ప్రారంభించిన తరువాత, అన్ని బంధాలు మరియు వైవాహిక జీవితం పట్ల విముఖత కనిపించవచ్చు.

కష్టపడి పనిచేయడమే కాకుండా, వీరు నిరంతరం పని చేయడానికి ఇష్టపడతారు. విద్య లేదా పని ఇలా ఏవిషయంలోనైనా వీరు ఇతరుల కంటే ముందుంటారు. బాల్యం నుంచి వీరు కుటుంబం యొక్క బాధ్యతలను చేపడతారు. అయితే, వీరు యువకులుగా ఉన్నప్పుడు చక్కటి సంతోషాన్ని పొందుతారు. వీరు అన్ని సమస్యలకు సిద్ధంగా ఉంటారు. ఏదైనా సంబంధం ఏర్పరుచుకోవడానికి ముందు, ఆ వ్యక్తి గురించి వీరు బాగా తెలుసుకుంటారు, లేనిపక్షంలో వీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనవచ్చు.

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల జీవిత భాగస్వామికి బాధ్యత మరియు ప్రేమ ఉంటాయి, అయితే అతడి/ ఆమె ఆరోగ్యం వీరికి ఆందోళన కలిగించవచ్చు. వీరు బాగా చదువుకుంటారు మరియు టీచింగ్ లేదా బ్యాంకింగ్ రంగాల్లో వీరు అపరిమితైన విజయాన్ని సాధిస్తారు.


ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము
ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు. వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవ గణానికి చెందినవారు. కాబట్టి వీరు సమయానికి తగ్గ రీతిలో ప్రవర్తించగలిగే చాకచక్యం కలిగి ఉంటారు. ఇక వీరికి ఆత్మవిశ్వాసం, అతిశయం కలగలుపుగా ఉంటాయి.

ప్రభుత్వపరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. ప్రజా నాయకులుగా, ప్రజా అధికారులుగా రాణించగల నేర్పు వీరికి ఉంటుంది. అగ్ని సంబంధిత, పసుపు వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి.

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆటంకం లేకుండా విద్య సాగుతుంది. వీరికి 5 సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత పదేళ్ళ వరకు చంద్ర దశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు.

15 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు.

రాహువు అనుకూలంగా ఉంటే, ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 40 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు క్రమంగా తగ్గుతాయి.

సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. 56 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. 75 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.


ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదము
ఉత్తరాషాఢ నక్షత్ర రెండవ పాదములో జన్మించిన జాతకులు మానవ గణానికి చెందిన వారు కనుక సమయానికి తగ్గ రీతిలో ప్రవర్తించగల నేర్పు కలిగి ఉంటారు. ఇక వీరు తండ్రి పట్ల కొంత విముఖత కలిగి ఉంటారు.

తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల, అతిశయం ఉంటుంది. ప్రభుత్వ పరిశ్రమలు, కర్మాగారాలలో ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. వీరు శ్రమించి పట్టుదలతో పని చేయగలరు. వీరు నిర్వహకులుగా చక్కగా పని చేయగలరు. పరిశ్రమలను స్థాపించి నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది.

ఈ జాతకులకు విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 4 సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్ర దశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు.

14 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 21 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు.

రాహువు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 39 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి.

సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. 55 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.

ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదము
ఈ పాదములో జన్మించిన వారికి తండ్రి మీద కొంత విముఖత కలిగి ఉంటారు. అయితే తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల మెండుగా ఉంటుంది. వీరికి ప్రభుత్వ పరిశ్రమలు, కర్మాగారాలోని ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి.

శ్రమించి పని చేయగల నేర్పు ఉంటుంది. వీరు నిర్వహకులుగా చక్కగా పని చేయగలరు. పరిశ్రమలను స్థాపించి నిర్వహించగల నేర్పు ఉంటుంది. ఈ జాతకులకు స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి రెండు సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్ర దశ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో వీరికి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు.

12 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగానే సాగిపోతుంది. 19 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు.

37 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. 53 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ సమయంలో ఖర్చులు అధికమవుతాయి. 72 సంవత్సరాల తరువాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.

ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగవ పాదము
ఉత్తరాషాఢ నక్షత్ర నాల్గవ పాదములో జన్మించిన వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. మానవ గణానికి చెందిన జాతకులు కనుక వీరికి సమయానుకూలంగా ప్రవర్తించగలిగే నేర్పు ఉంటుంది. ఇక వీరికి ఆత్మవిశ్వాసం, అతిశయం కలగలుపుగా ఉంటాయి.

ప్రభుత్వ పరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ రంగంలో పని చేయడం వీరికి అనుకూలం. ప్రజానాయకులుగా, ప్రజా అధికారులుగా వీరు సమర్ధతతో పని చేయగలరు. మధ్యవర్తులుగా కూడా నేర్పుతో వ్యవహరించగలరు. అగ్ని సంబంధిత, పసుపు వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో తక్కువగా ఉన్నాసరే పెరిగేకొద్ది ఎదుగుతూ ఉన్నత స్థితికి చేరుతారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరికెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువగా మాట్లాడెదరు, అణకువ కలిగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుంటారు. క్రొత్త స్నేహములు చేయుటలో ముందుంటారు.  కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకానొకప్పుడు వీరు నేరప్రవృత్తి అయిన నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి. ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి, బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. గోప్యత పాటిస్తారు. పై చదువులు వీరికి కలసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. తోటి వారికి కూడా సహాయం చేస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మించిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. మీరు గౌరవప్రదమైన ప్రవర్తన, ఆధ్యాత్మిక అంతర్దృష్టి, నీతి బలం, నిజాయితీ కలవారు. తరచూ 'బ్రహ్మాంశ' (దైవసారం)తో పుట్టినవారిగా చెబుతారు, సహజంగా మంచి, సున్నితమైన ప్రవర్తన చూపిస్తారు, ఇది మీకు గౌరవం, ఆరాధన తెస్తుంది. దేవాలయాకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, ధన సహాయాన్ని చేస్తారు. కానీ, అప్పు ఇవ్వరు. ఆర్థికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పరులు.

ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్లు గొప్ప గుణాలు కలిగి, నిజాయితీ, స్వచ్ఛత, జ్ఞానానికి చిహ్నంగా ఉంటారని బృహత్ జాతకం, సారావళి, జాతక పారిజాతం లాంటి ప్రాచీన జ్యోతిష గ్రంథాలు చెబుతాయి.  

మీ ఉనికి ప్రభావవంతంగా ఉంటుంది, స్వతంత్ర ఆలోచనలు, గట్టి నమ్మకాల వల్ల స్నేహితులు, సమాజంలో తరచూ చర్చలు లేదా భిన్నాభిప్రాయాలకు కేంద్రంగా ఉంటారు. శారీరకంగా చురుకుగా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి, క్రమంగా వ్యాయామం, క్రమశిక్షణ జీవనంతో దేహదారుఢ్యం కాపాడుకుంటారు. 

ఉత్తరాషాఢ జాతకులు సహజంగా ఉదారులు, పరోపకారులు, తమ వనరులు, జ్ఞానాన్ని ఇష్టంగా పంచుకుంటారు. మీ జీవితం సాధారణంగా ఆనందం, శ్రేయస్సు, సంతృప్తితో నిండి ఉంటుంది, ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఆప్యాయ సంబంధాల వల్ల ఇది మరింత బాగుంటుంది. వాళ్లు మీ మానసిక సంతృప్తికి ఎంతో దోహదం చేస్తారు.

ఇతరుల సహాయాన్ని గుర్తుంచుకుని, సహాయం చేసినవాళ్ల పట్ల జీవితకాల కృతజ్ఞత, విధేయత చూపిస్తారు. మీ ఆధ్యాత్మిక ఆసక్తి, విధేయత సవాళ్లను సున్నితంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. 

మీకు ఎక్కువ మంది పిల్లలు, బలమైన కుటుంబ బంధాలు ఉంటాయని గ్రంథాలు చెబుతాయి.

మీరు స్వతంత్రులు, ఆకర్షణీయంగా, సంపన్నులుగా ఉంటారు. ధైర్యం, జ్ఞానం, సున్నితమైన ప్రవర్తనతో కూడిన అందమైన రూపం కలిగి ఉంటారు. గ్రంథాలు పొడవైన ముక్కు, శరీరంలో చేప ఆకారంలో ప్రతీకాత్మక గుర్తులు ఉండవచ్చని చెబుతాయి, ఇవి అదృష్టం, సంతాన భాగ్యం, వ్యక్తిగత ఆకర్షణను సూచిస్తాయి. వినయం, ఓర్పు, ఇతరుల పట్ల సున్నితత్వం పెంచుకోవడం మీ సద్గుణాలను మెరుగుపరుస్తుంది, సంపన్న, గౌరవనీయ, సంతృప్తికర జీవితాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మీ గట్టి అభిప్రాయాలు మొండితనంగా మారకుండా చూసుకోవాలి.

ఉత్తరాషాఢ నక్షత్రపు అధిదేవత - విశ్వదేవుళ్ళు .వీరు మొత్తం పది మంది సోదరులు. 
వారు - వసు, సత్య, క్రతు, దక్ష, కాళ, కామ, ధ్రితి, కురు, పురురవ, మాద్రవ.


ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల నక్షత్రపు ఫలములు

నక్షత్రపు పేరు                    నక్షత్రములు                                        ఫలం

పుట్టిన నక్షత్రము                కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ    ఒంటికి శ్రమ

సంపత్తు నక్షత్రము            రోహిణి, హస్త, శ్రవణం                    డబ్బుల లాభం

ముంపు తెచ్చు                  మృగశిర, చిత్త, ధనిష్ఠ                    పనికి చేటు
నక్షత్రము

సంపత్తు నక్షత్రములు    ఆరుద్ర, స్వాతి, శతభిష                    బాగు

వేఱైన నక్షత్రములు        పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర        ప్రయత్నము పాడు అగుట

సాధన నక్షత్రములు        పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర    పని నెఱవేరుట, మంచిది

నైత్య నక్షత్రములు        ఆశ్లేష, జ్యేష్ట, రేవతి                            బంధనం

వీరితో బాగా పడిన             
అశ్విని, మఖ, మూల                        హాయి
నక్షత్రములు

మిక్కిలి బాగా పడిన         
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ    హాయి, కలిసి వచ్చును
నక్షత్రములు

నక్షత్ర శాంతి:

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
తన్నో విశ్వే ఉప' శృణ్వంతు దేవాః ।
తద’షాఢా అభిసంయంతు యజ్ఞమ్ ।
తన్నక్షత్రం ప్రథతాం పశుభ్యః' ।
కృషిర్వృష్టిర్యజ'మానాయ కల్పతామ్ ।
శుభ్రాః కన్యా' యువతయ' స్సుపేశ’సః ।
కర్మకృత'స్సుకృతో' వీర్యా'వతీః ।
విశ్వా”న్ దేవాన్, హవిషా' వర్ధయ'౦తీః ।
అషాఢాః కామముపా'యంతు యజ్ఞమ్ ॥

నక్షత్ర గాయత్రి
ఓం విశ్వేదేవాయ విద్మహే 
మహాషాఢాయ ధీమహి 
తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – తాతపూడిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.
రెండవ పాదం – మచర శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి.
మూడవ పాదం – సత్యవాడలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
నాలుగవ పాదం – సుందరపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి.




Thursday, October 9, 2025

Sukra - శుక్రుడు

స్వభావము - మృదు, శుభుడు
అధిపతి -పరమశివుడు
లింగము -స్త్రీ
తండ్రి - భృగు, విష్ణుద్వేషి.
తల్లి: - హిరణ్య కశిపుని కుమార్తె ఉష
భార్య - 
పిల్లలు -
వారం - శుక్రవారం లేదా భృగువాసరే 
రుచి -పులుపు
జాతి -బ్రాహ్మణ
వర్ణము - తెలుపు, మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక.
ఇతర నామాలు కావ్యుడు, సితుడు, భృగుసుతుడు, దానవాచార్యుడు, ఉశనుడు 
శరీరంభాగం - సంతానోత్పత్తి వ్యవస్థ
అధి దేవత -ఇంద్రియాని. ఏడు వయసును సూచిస్తాడు.
నక్షత్రాలు  - భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ
రాశులు - వృషభం, తులా
దిక్కు -ఆగ్నేయము
వాహనం - రథం
తత్వం - జలతత్వం,
జీవులు -
ప్రకృతి -శ్లేష్మ, వాత
ఋతువు -వసంతం
లోహము -వెండి
రత్నము -వజ్రము
గ్రహ సంఖ్య -
గుణం -రజోగుణము
ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం
జప సంఖ్య - 16000
మిత్రులు -శని, బుధులు
శత్రువులు -రవి, చంద్రులు
సములు - కుజుడు, గురువులు
శుక్ర మహా దశ - 20 సంవత్సరములు

జ్యోతిషశాస్త్రంలో, శుక్రుడు (వీనస్) మీన రాశిలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు, అంటే మీన రాశిలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు. కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.

శుక్రుడికి అనుకూలమైన ఇతర స్థానాలు 1, 2, 3, 4, 5, 7, 9, 10, 11 స్థానాలు, 

అలాగే గురువు, బుధుడు వంటి శుభ గ్రహాలతో కలిసి పంచమ స్థానంలో ఉండటం.

శుభ గ్రహాల కలయిక: శుభ గ్రహాలైన గురువు (బృహస్పతి), బుధుడు వంటి గ్రహాలు శుక్రుడితో కలిసి పంచమ స్థానంలో (ఫైన్త్ హౌస్) ఉన్నప్పుడు అది మంచి యోగంగా పరిగణిస్తారు.

శుక్రుడు జాతకంలో బలహీనంగా లేదా అశుభ స్థానాల్లో ఉంటే ఆర్థిక సమస్యలు, సంబంధాలలో ఇబ్బందులు, మరియు సౌభాగ్యం లేకపోవడం వంటివి తలెత్తుతాయి. ఈ దోష నివారణకు పరిహారాలు పాటించవలసి ఉంటుంది.

శ్రీకృష్ణుడు కుచేలుడికి అనుగ్రహించిన అపార ధన సంపత్తిని ఉశనుడు అపహరించబూనడంతో ఈశ్వరుడు ఆగ్రహించి శుక్రుడిని సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఉశనుడు తన తపశ్శక్తితో ఈశ్వరుడి ఉదరంలో ప్రవేశించి అతడిని స్తుతించసాగాడు. బోళాశంకరుడైన ఈశ్వరుడు ఉశనుడికి అభయం ఇచ్చి, శుక్ర శోణిత రూపంలో బయటకు పంపాడు. అప్పటి నుండి అతడికి శుక్రుడన్న పేరు సార్థకమయింది. చైత్ర శుద్ధ ఏకాదశి నాడు మఖ నక్షత్రంలో మన్మధ సంవత్సరంలో ఉశనుడు శుక్రుడిగా అవతరించాడు. శివుడు అతడి స్తుతికి మెచ్చి ధన్వీర్యాలకు అధిపతిగానూ, రాక్షసులకు గురువుగానూ చేసి గ్రహమండలంలో స్థానం కల్పించాడు. అసురుల గురువైన శుక్రుడు వారి అభ్యున్నతి కొరకు ఘోర తపస్సు చేసాడు. ఈశ్వరుడిని మెప్పించి మృతసంజీవనీ విద్యను సాధించాడు. శుక్రుడు సంపదలకు, మంత్రాలకు, రసాలకు, ఔషధులకు అధిపతి. అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన శుక్రుడు తన సంపదలను దానవ శిష్యులకు అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. వర్షాలపై ఆధిపత్యం వహిస్తూ అతివృష్టి, అనావృష్టికి కారకుడౌతాడు. వర్షాలను నిరోధించే వారిని శాంతింపచేస్తాడు.

శుక్రుడు శారీరక సుఖము, భార్య, యౌవనం, సౌందర్యం, రాజసము, వినోదము, స్త్రీలు, ఐశ్వర్యం, జలవిహారం, ఆభరణములు, సౌందర్య సాధనములు, చతుష్షష్టి కళలు, వీర్యము, మన్మధుడు, సుగంధద్రవ్యములు, గౌరి, లక్ష్మి ఆలయములు, క్రీడా ప్రదేశములు, పాలు, పాల కేంద్రాలు, పాలకు సంబంధించిన వస్తు విక్రయము, వస్త్రములు దానికి సంబంధించిన వృత్తులు, అలంకార సామాగ్రి, పరిమళ ద్రవ్యములు వాటికి సంబంధించిన వృత్తులు, పానీయములు, పండ్లరసాలు వాటికి సంబంధించిన సంస్థలు, పెట్రోలు వాహనములు, నౌకలు, సముద్ర యానం, రస సంబంధం ఉన్న నిమ్మ, నారింజ, కమలా, బత్తాయి మొదలైన పండ్లు, నేత్ర, సుఖ, చర్మ, కంఠముకు సంబంధించిన రోగములు, దర్జీ, కళాసంబంధ వృత్తులు, సౌందర్య సంబంధిత వృత్తులు, స్నేహితులు, బహుమతులు, హనీమూన్, ప్రేమ, విందులు విలాస విహారాదులు, పూలు, అలంకరణ సామాగ్రి, లౌక్యము, లాభము, ఒప్పందము, ఆకర్షణ మొదలైన వాటికి కారకుడు.

వ్యాధులు-  
గర్భాశయ, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాధులు మొదలైన వాటికి కారకుడు.

కుజుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలైనవి కలుగుతాయి.

బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం,

శనితో కలిసిన సుఖ వ్యాధులు,

రాహువుతో కలిసిన గర్భ సంబంధిత వ్యాధులు,

కేతువుతో కలిసిన సంతాన లేమి.

ద్వాదశ స్థానాలలో శుక్రుడు
1.    శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందరశరీరం కలిగిన వాడు, సుఖజీవి, చిరంజీవి ఔతడు.

2.    శుక్రుడు ద్వితీయస్థానమున ఉన్న బహువిధములుగా సంపదలు కలవాడు, కవి ఔతాడు.

3.    తృతీయముస్థానమున శుకృడు ఉన్న జాతకుడు భార్యాహీనుడు, కష్టవంతుడు, బీదవాడు, దుఃఖవంతుడు, అపకీత్రి కలవాడు ఔతాడు.

4.    చతుర్ధస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు వాహనములు కలవాడు, మంచిగృహం కలవాడు, నగలు, వస్త్రములు, సుగంధద్రవ్యములు కలవాడు ఔతాడు.

5.    పంచమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు అపారధనవంతుడు, ఇతరులను రక్షించు వాడు, బహుమేధావి, పుత్రులు కలవాడు ఔతాడు, భార్య వల్ల లాభం, సుఖ సంసార జీవితంలో లాభం

6.    షష్టమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు శతృవులు లేని వాడు, ధనమును లేని వాడు, యువతుల చేత వంచింపబడిన వాడు, విచారగ్రస్తుడు ఔతాడు.

7.    సప్తమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు మంచి కళత్రం ఉన్న వాడు, పరస్త్రీ ఆసక్తుడు, కళత్రం లేని వాడు, ధనవంతుడు ఔతాడు.

8.    అష్టమ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడు, రాజు ఔతాడు.

9.    నవమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు భార్యాబిడ్డలు, సంతానం, ఆప్తులు కలిగి రాజాశ్రయం కలిగి అభివృద్ధి చెందుతూ ఉంటాడు.

10.    దశమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగినవాడు, మిత్రులు కలిగిన వాడు, ప్రభువు ఔతాడు.

11.    ఏకాదశ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడు, బహు సుఖవంతుడు ఔతాడు.

12.    ద్వాదశము స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతుడు, ధనవంతుడూ ఔతాడు.


శ్రీ శుక్ర అష్టోత్తర శతనామావళి

శ్రీ శుక్ర అష్టోత్తరశతనామ స్తోత్రం


Monday, October 6, 2025

Saphala Ekadashi - సఫల ఏకాదశి

సఫల ఏకాదశి

సఫల ఏకాదశి రోజున ప్రతి ప్రయోగం విజయవంతమవుతుంది. ఈ రోజున ఆరోగ్యానికి సంబంధించిన 
ఉపవాసం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు ఉపవాసం డబ్బు, వ్యాపారంలో లాభాన్ని ఇస్తుంది. పిల్లలను లేనివారికి పిల్లల కొరకు, పిల్లలు బాగా వృద్ధిలోకి రావడానికి ఈ ఉపవాసం పాటిస్తారు. ఉద్యోగంలో విజయానికి ఇది అత్యంత అనుకూలమైన వ్రతం.

ఈ రోజు శ్రీ హరిని ఎలా పూజించాలి?
ఏకాదశి ఉదయం లేదా సాయంత్రం శ్రీ హరిని తెల్ల చందనం లేదా గోపీ చందనం నుదుటిపై పూసుకుని శ్రీ హరిని పూజించండి. శ్రీ హరికి పంచామృతం, పూలు, కాలానుగుణ పండ్లను సమర్పించండి. ఉపవాసం పాటించినట్లయితే, సాయంత్రం ఆహారం తీసుకునే ముందు, నీటిలో దీపదానం చేయండి. ఈ రోజున పేదవారికి వెచ్చని బట్టలు, ఆహారాన్ని దానం చేయడం కూడా శ్రేయస్కరం.

ఉద్యోగంలో విజయం కోసం పూజ
మీ కుడి చేతిలో నీరు, పసుపు పువ్వులు తీసుకుని, మీ ఉద్యోగంలో విజయం కోసం వరం కోసం ఆ శ్రీ మహా విష్ణువును ప్రార్ధించండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి నారాయణ కవచాన్ని పఠించండి. సఫల ఏకాదశి రోజు నుండి, 11 రోజుల పాటు నిరంతరం నారాయణ కవచాన్ని పఠించండి. ఉద్యోగ సమస్యలు తీరుతాయి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు.

డబ్బు సమస్య
డబ్బుకు సంబంధించిన ఏదైనా పని ఆగిపోయినట్లయితే, ప్రతిరోజూ ఉదయాన్నే నీటిలో ఎర్రటి పువ్వులు వేసి సూర్య భగవానుడికి సమర్పించండి. ప్రతిరోజు సాయంత్రం నెయ్యితో  దీపం వెలిగించండి. మీ పని త్వరలో పూర్తి అవుతుంది.

సంతానం పొందడం కోసం
వెండి పాత్రలో పంచామృతాన్ని హరికి సమర్పించండి. "ఓం నమో నారాయణాయ" మంత్రాన్ని 108 సార్లు జపించండి. పంచామృతాన్ని ప్రసాదంగా తీసుకుని సంతానం కలగాలని ప్రార్థించండి.

సఫల ఏకాదశి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు మరియు ధర్మరాజు యుధిష్ఠిరుడి మధ్య సంభాషణ సమయంలో సఫల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ప్రస్తావించబడింది. ఈ ఏకాదశి ఉపవాసం ద్వారా 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం లభిస్తుంది అని నమ్ముతారు. కాబట్టి, ఈ రోజున ఒక వ్యక్తి ఉపవాసం ఉంటే, అతని/ఆమె బాధలన్నీ ముగుస్తాయి, అదృష్టం అనుకూలంగా ఉంటుంది కోరికలు నెరవేరుతాయి.

సఫల ఏకాదశి కథ
పురాతన కాలంలో చంపావతి నగరాన్ని మాహిష్మత రాజు పరిపాలించేవాడు. అతనికి నలుగురు కుమారులు ఉన్నారు, వారిలో లుంభక చాలా క్రూరమైన వాడు. అతను తన తండ్రి డబ్బును చెడు పనులకు ఖర్చు చేసేవాడు. అతని పనులకు చింతించి, రాజు అతన్ని బహిష్కరించాడు. అయినప్పటికీ లుంభక దోపిడి మరియు దొంగతనాల అలవాట్లు మానలేదు. 

ఒక సారి, అతనికి 3 రోజులు ఆహారం లభించలేదు. అటూ ఇటూ తిరుగుతూ ఓ సన్యాసి ఆశ్రమం వద్దకు చేరుకున్నాడు. ఆ రోజు సఫల ఏకాదశి. కాబట్టి, సన్యాసి అతనికి స్వాగతం పలికి ఆహారాన్ని అందించాడు. ఋషి యొక్క ఈ ప్రవర్తనను చూసి లుంభక మారిపోయాడు. సన్యాసి పాదాలపై పడి ఆయన ఆశీస్సులు కోరాడు. సన్యాసి అతన్ని తన శిష్యుడిగా చేసుకున్నాడు. 

కాలక్రమేణా, లుంభక మంచి పనులు చేయటం ఆరంభించాడు. సన్యాసి మార్గదర్శకత్వంలో  లుంభక ఏకాదశి  ఉపవాసం ప్రారంభించాడు. అతను పూర్తిగా మారిపోయి మంచివాడిగా మారినప్పుడు, సన్యాసి అతనికి తన అసలు రూపం చూపించాడు. అది సన్యాసి రూపంలో వున్నది అతని తండ్రి. దీని తర్వాత, లుంభక రాజుగా తన బాధ్యతలను గొప్పగా నిర్వహించి అందరికీ  ఆదర్శంగా నిలిచాడు. అతను జీవించి ఉన్నంత వరకు సఫల ఏకాదశికి ఉపవాసం ఉండేవాడు.

Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...