Sunday, August 16, 2026

Gayatri Mahima - Goutamudi Katha - గాయత్రీ మహిమ - గౌతముడి కథ

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ మహిమ - గౌతముడి కథ

జనమేజయా! ఒకప్పుడు ప్రాణికోటి కర్మవశాన పదిహేను సంవత్సరాల కరువు వచ్చింది. వానలు లేక అంతటా దుర్భిక్షం విలయతాండవం చేసింది. ఇంటింటా మృతదేహాలే. లెక్క పెట్టటం ఎవరితరమూ కాలేదు. ఆకలి తట్టుకోలేక చనిపోయినవారు చనిపోగా మిగిలినవారు పందుల్నీ కుక్కల్నీ గుర్రాల్నీ ఏ జంతువు దొరికితే ఆ జంతువుని చంపుకుని తిన్నారు. 

కొందరు మానవశవాలనే భక్షించారు. తల్లి కొడుకునీ, మగడు భార్యనీ భక్షించే భయంకర దుర్భిక్షమది. ఈ దశలో బ్రాహ్మణులకు ఒక ఆలోచన వచ్చింది. గాయత్రీ జపమహిమ కారణంగా గౌతముడి ఆశ్రమంలో దుర్భిక్షం లేదని సుభిక్షంగా ఉందనీ వింటున్నాం. ఇప్పటికే చాలా ప్రాణికోటి అక్కడికి చేరుకుందనీ సుఖంగా జీవిస్తోందనీ తెలిసింది.

కనక మనంకూడా వెళ్ళి ఆ మహర్షినే ఆశ్రయిద్దాం - అని నిశ్చయించుకుని అగ్నిహోత్రాలతో కుటుంబాలతో గోవులతో దాసదాసీజనంతో అందరూ బయలుదేరి వెళ్ళారు. అన్ని దిక్కులనుంచీ ఒక్కసారిగా తరలివెళ్ళారు. అంతమంది బ్రాహ్మణులను చూసి గౌతముడు సగౌరవంగా నమస్కరించాడు. ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. కుశలప్రశ్నలు వేశాడు. ఆగమనకారణం తెలుసుకున్నాడు. అందరికీ అభయమిచ్చాడు.

ఇది మీ ఇల్లే అనుకోండి. నేను మీ దాసుణ్ణే అనుకోండి. ఈ దాసుడు ఉండగా మీకు చింత ఏమిటి! మీవంటి తపోధనుల రాకతో నేను నిజంగా ధన్యుణ్ణి అయ్యాను. మీ దర్శనభాగ్యం చేతనే ఎవరికైనా దుష్కృతాలన్నీ సుకృతాలైపోతాయి. మీరంతా ఇలా వచ్చి పాదధూళితో నా గృహాన్ని పావనం చేస్తున్నారు.

నాకంటే ధన్యుడెవడు! ఇక్కడే అందరూ హాయిగా ఉండండి. మీ మీ సంధ్యావందన జపాదికాలు నిర్విఘ్నంగా జరుపుకోండి - అని అందరినీ ఊరడించి ధైర్యం చెప్పి విడిది చేయించాడు. తరవాత తాను లోపలికి వెళ్ళి గాయత్రిని ప్రార్థించాడు.

నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే ।
వ్యాహృత్యాది మహామంత్రరూపే ప్రణవరూపిణి ॥

మహావిద్యా! వేదమాతా! పరాత్పరా! వ్యాహృతి త్రయంతో (భూర్భువః స్వః) మహామంత్రస్వరూపా! ఓంకార రూపిణీ! సామ్యావస్థాత్మికా! హ్రీంకారరూపిణీ! స్వాహా - స్వధా స్వరూపా! సకలార్థప్రదాయిని! నమో నమః. నమో నమః. భక్తకల్పలతా! అవస్థాత్రయ సాక్షిణీ! తుర్యాతీతస్వరూపా! సచ్చిదానంద రూపిణీ! సర్వవేదాంతసంవేద్యా! సూర్యమండలవాసినీ! ప్రాతఃకాలంలో రక్తవర్ణంలో బాలారూపిణివై, మధ్యాహ్న సమయంలో యువతివై, సాయంవేళలో కృష్ణవర్ణంలో వృద్ధవై అలరారే జగన్మాతా! నమో నమః. సర్వభూతసృష్టికీ అరణివంటిదానా! పరమేశ్వరీ! అనుగ్రహించు.

గౌతముని ప్రార్థనకు సంతోషించి గాయత్రీమాత ప్రత్యక్షమయ్యింది. అందరినీ అన్నపానాలతో పోషించడానికి విలుగా పూర్ణపాత్రను ప్రసాదించింది. మహర్షీ! నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఈ పాత్ర. స్వీకరించు - అని అందించి అంతర్థానం చెందింది.

అన్నరాశులు పర్వతాకారంగా ఆవిర్భవించాయి. షడ్రసోపేతంగా వంటకాలు ఆవిర్భవించాయి. కోరుకున్న భూషణాలూ వస్త్రాలూ యజ్ఞసామగ్రి పాత్రసామగ్రి సంబారాలూ - గౌతముడు ఏక్షణాన ఏది కావాలనుకుంటే అది సమృద్దిగా అందించింది ఆ గాయత్రి పూర్ణపాత్ర. విప్రులకు ఆయా వస్తువుల్ని పుష్కలంగా వంచిపెట్టాడు. 

గోమహిషాది పశువులుకూడా ఆవిర్భవించాయి. వాటినీ విప్రులకు బహూకరించాడు. వాటికి కావలసిన ఆహారమూ అందింది. గౌతముడి సూచనప్రకారం అందరూ కలిసి అక్కడ అనేక యజ్ఞాలు నిర్వర్తించారు. ఆశ్రమప్రాంతం స్వర్గసీమను తలపించింది. సమస్త సమృద్దులతో కళకళలాడింది. ముల్లోకాలలోనూ ఏ సుందర వస్తువు ఉన్నా అదల్లా అక్కడ ఆవిర్భవించింది. 

వస్త్ర చందన, భూషలతో విప్రులందరూ దేవపురుషుల్లాగా ఉంటే వారి స్త్రీలందరూ దేవతాస్త్రీలే ఆనిపించారు. ఆ దివ్యవస్త్రాలుగానీ ఆ దివ్యభూషణాలుగానీ అలా ఉన్నాయి. ఆశ్రమ మండలంలో నిత్యోత్సవంగా కాలం గడుస్తోంది. రోగ - రాక్షస - చోర భయాలు లేవు. 

శతయోజన విస్తీర్ణమైన ఆశ్రమమండలం ఇంకా రకరకాల ప్రాణికోటిని ఆకర్షించింది. ఎవరు వచ్చినా ఏది వచ్చినా అందరికీ స్వాగతం పలికాడు గౌతముడు ఆదరించి పోషించాడు.

యజ్ఞయాగాలు నిరంతరంగా పుష్కలంగా జరగుతూండటంతో దేవతలూ సంతోషించారు. మహర్షిని కీర్తించారు. ఇంద్రుడైతే మరీ మరీ కొనియాడాడు. ఆశ్రమంలో కల్పవృక్షం ఏదో ఉండి కోరికలు తీరుస్తున్నట్టుంది. లేకపోతే భూమండలం కరువుతో కటకటలాడుతోంటే వీరికి ఈ సమృద్ది ఎలా సాధ్యం అనుకున్నాడు.

పన్నెండేళ్ళు గడిచాయి. గౌతముడు అందరినీ పోషిస్తూనే ఉన్నాడు. అలాగని ఏ కొంచెమూ గర్వపడలేదు. గాయత్రీదేవికి ఒక దివ్యమందిరం కట్టించాడు. మునివిప్రులంతా అక్కడచేరి భక్తిశ్రద్ధలతో ముప్పొద్దులా అర్చించారు. మంత్ర పురశ్చరణలు సాగించారు. 

జనమేజయా! ఇప్పటికీ ఆ మందిరం అక్కడ ఉంది. గాయత్రీమాత బాలగా యువతిగా వృద్దురాలిగా త్రిసంధ్యల్లోనూ దర్శనమిస్తోంది. 

బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం





Mahadevi Aatmavishkaram - మహాదేవి ఆత్మావిష్కారం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - మహాదేవి ఆత్మావిష్కారం

భాస్వజ్జపాకుసుమాభ, బాలకోటిరవిప్రభ, బాలశీతాంశుమకుట, వస్త్రాంతర్వ్యంజితస్తని. వర - పాశ
- అంకుశ - అభయ హస్తాలు నాలుగు, రమణీయాంగి, కోమలాంగలతిక, శివ, భక్తకల్పద్రుమం, అంబిక, నానాభూషణ భూషిత, త్రినేత్ర, మల్లికామాలికా కబరీజూట విరాజిత. ఆమెకు నాల్గువైపులా నాలుగువేదాలూ రూపుదాల్చి నిలబడి స్తుతిస్తున్నాయి.

ఆమె పెదవుల కాంతులు వ్యాపించినంతమేరా నేల పద్మరాగాలు తాపించినట్టు అవుతోంది. ప్రసన్న స్మేరవదన, కోటి కందర్పసుందర, రక్తాంబరపరీధాన, రక్తచందన చర్చిత, ఉమాదేవి, హైమవతి, నిర్వ్యాజకరుణామూర్తి, సర్వకారణకారణ - మహేంద్రుడు దర్శించాడు.

భక్తినిర్ఝరులు గుండెల్లో పొంగులెత్తాయి. కన్నులు చెమ్మగిల్లాయి. గొంతు గద్గదమయ్యింది. తనువు
పులకించింది. ఉక్కిరిబిక్కిరి అవుతూ సాష్టాంగపడ్డాడు. స్తుతులూ నుతులూ జాలువారాయి. అమ్మా! ఆ యక్ష రూపం ఏమిటి? ఎందుకు ఆలా అవతరించావు? ఇప్పటికీ ఆర్థం కావడంలేదు. అనుగ్రహించు తల్లీ! - అని అభ్యర్థించాడు. కరుణసముద్రం పలికింది -

ఇంద్రా! నా రూపమే పరబ్రహ్మం. సర్వకారణకారణం. మాయాధిష్ఠానం. సర్వసాక్షి, నిరామయం.
సర్వవేదాలూ ఏ పదాన్ని శిరసావహిస్తున్నాయో, సర్వతపస్సులూ సారాంశంగా ఏ పదాన్ని చెబుతున్నాయో, సర్వతపస్వులూ దేన్ని కోరి బ్రహ్మచర్యం పాటిన్తున్నారో - ఆ పదాన్ని ఒక్కముక్కలో నీకు చెబుతున్నాను. గ్రహించు - 

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ తదేవాహుశ్చ హ్రీమ్మయమ్‌

ద్వే బీజే మమ మంత్రే స్తో ముఖ్యత్వేన సురోత్తమ ॥

సురనాయకా! ఓమ్‌ అనే ఒక్క అక్షరమే పరం బ్రహ్మ, దాన్నే హ్రీమ్‌ మయంగానూ పలుకుతున్నారు.
ఇవి రెండే నా మంత్రంలో ముఖ్యమైన బీజాక్షరాలు. నన్ను నేను భాగద్వయం చేసుకుని జగత్తులు
సృష్టిస్తున్నాను. అందులో ఒక భాగం (ఓమ్‌) సచ్చిదానందనామకం. రెండవది మాయాప్రకృతి సంజ్ఞితం, ఆ మాయయే (హ్రీమ్‌) పరాశక్తి. నేను శక్తిమతిని, ఈశ్వరిని, జాబిల్లి వెన్నెలల్లాగా నేనూ మాయా అవిభాజ్యలం, అభిన్నలం. ఈ మాయ నాదే. సామ్యావస్థాత్మిక. 

ప్రళయంలో సకలజగత్తులూ నాలో లీనమై అభిన్నంగా ఉంటాయి. కర్మపరిపాకవశాన ప్రాణికోటికి పునస్సృష్టిలో పునర్జన్మలూ పునారూపాలూ నానుంచి అభివ్యక్తమవుతుంటాయి. అంతర్ముఖమైన అవస్థను 'మాయ' అంటారు. బహిర్ముఖమైన అవస్థను తమస్సు అంటారు. దానినుంచే ప్రాణికోటి సంభవిస్తుంది.

సృష్టి సమయంలో అదే రజోగుణమవుతుంది. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణత్రయాత్మకులయ్యారు. 

త్రిమూర్తులలో రజోగుణాధికుడు బ్రహ్మ సత్త్వగుణాధికుడు విష్ణువు. తమోగుణాధికుడు రుద్రుడు.
స్థూలదేహం - బ్రహ్మ. లింగదేహం(సూక్ష్మదేహం) శ్రీహరి. కారణదేహం రుద్రుడు. తురీయావస్థను నేనే.

సామ్యావస్థ అన్నానే అది. సర్వాంతర్యామిరూపిణి. అటుపైని పరంబ్రహ్మమైన నా రూపం -
రూపవర్జితం. అందుకనే నారూపం నిర్గుణమూ సగుణమూ అని రెండు విధాలు. వీటిలో నిర్గుణరూపం మాయారహితం. సగుణరూపం మాయాసహితం. 

నేను జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి జీవుల్ని వారి కర్మానుసారంగా ప్రేరేపిస్తూ ఉంటాను. సృష్టి స్థితి తిరోధానాలకు నేనే ప్రేరణ. బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులను కారణాత్మకులుగా చేసేది నేనే. నాకు భయపడినా ఆజ్ఞగా గాలివీస్తున్నాడు. సూర్యుడు వెలుగుతున్నాడు. మీరంతా చేసే పనులు నా ఆజ్జలే. 

కనక నేను సర్వోత్తమను. నా అనుగ్రహం వల్లనే రాక్షసయుద్ధాల్లో మిమ్మల్ని జయం వరిస్తోంది. మిమ్మల్ని కీలుబొమ్మలుగా (కొయ్యబొమ్మలుగా - కాష్ఠపుత్తలికోపమాన్‌) ఆడిస్తున్నది నేనే. ఒక్కొక్కప్పుడు మీకూ ఒక్కొక్కప్పుడు దైత్యులకూ విజయం అందిన్తుంటాను. నేను స్వతంత్రను. నా ఇచ్చయే నాది. కర్మానురోధంగా అన్నీ చేస్తుంటాను.

సురోత్తమా! సర్వాత్మికను నన్ను విస్మరించి మీరు విజయగర్వంతో విర్రవీగారు. అది అంతా మీ
ప్రయోజకత్వమే అని అహంకరించారు. మోహంలో పడ్డారు. మీ కళ్ళు తెరిపించాలనే అనుగ్రహబుద్ధితో మీ శరీరాల్లో ఉన్న నా శక్తుల్ని బయటకు తీసి తేజోమండలంగా యక్షరూపంగా అవతరింపజేశాను. 

మీ అహంకారాలను అణిచివేశాను. మీ శక్తిహానత మీకు తెలిసివచ్చేట్టు చేశాను. కనక ఇకనుంచీ నిరహంకారులై సచ్చిదానంద రూపిణిని నన్ను శరణువేడండి - అని చెప్పి అంతర్ధానం చెందింది.

జనమేజయా! అప్పటినుంచీ ఇంద్రాదిదేవతలందరూ అహంకారం విడిచిపెట్టి పరమేశ్వరీ
పాదపద్మాలను ఉపాసించ నారంభించారు. త్రిసంధ్యల్లోనూ గాయత్రిని జపించడం, యజ్ఞభాగాలను మహాదేవికి నివేదన చెయ్యడం - ఇత్యాది కార్యక్రమాలు అనుష్ఠించారు. 

ఈ రకంగా అందరూ సత్యయుగంలో గాయత్రీ జపతత్పరులూ తారహృల్లేఖా జపనిష్ణాతులూ అయ్యారు. తక్కిన హరి - హరోపాసనలు ఏవీ నిత్యకర్మలు కాదు. గాయత్రీ ఉపాసన ఒక్కటే నిత్యవిధిగా వేదాలు అన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇది ఒక్కటి చేస్తే చాలు ద్విజులకు కృతకృత్యత్వమే. 

తక్కిన సత్కర్మలు ఏవి చేసినా చెయ్యకపోయినా గాయత్రీమాత్రనిష్ణాతుడైతే చాలు ద్విజుడు ముక్తి పొందుతాడని మనువే స్వయంగా చెప్పాడు.

అంతటి శక్తి సంపన్నమూ వేదత్రయప్రతిపాదితమూ అయిన గాయత్రీ ఉపాసనను విడిచిపెట్టి హరి - హరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం. అందుకని తొట్టతొలి కృతయుగంతో ద్విజోత్తములందరూ గాయత్రీ రూపాన దేవీ పాదపద్మాలను ఉపాసించారు.

గాయత్రీ మహిమ - గౌతముడి కథ





Indraadi Devatalaku Devi Gunapatham - ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం

పూర్వకాలంలో మదోద్దతులై దైత్యులు దేవతలతో యుద్ధం చేశారు. అది నూరేళ్ళు సాగిన మహాయుద్ధం. మహావిస్మయ కారకం. నానాశస్త్ర ప్రహరణాన్వితం. నానామాయా విచిత్రితం. జగద్వినాశకరం. ఎట్టకేలకు పరాశక్తి కృపావిశేషంవల్ల దేవతలు జయించారు. దైత్యులు స్వర్గాన్నీ భూగోళాన్నీ విడిచి పాతాళానికి పారిపోయి తలదాచుకున్నారు. 

అప్పుడు దేవతలు అది అంతా తమ ప్రయోజకత్వమే అనుకుని పరాక్రమాలను పరస్పరం ప్రశంసించుకొన్నారు. మోహవిభ్రాంతిలోపడి చంకలు కొట్టుకుంటూ తమనుతాము తెగ పాగుడుకున్నారు.

మనకు జయం కలగక చస్తుందా! మన మహిమ అటువంటిది. మనం సర్వోత్తరులం. మహావీరులం. మనముందు దైత్యులు ఎక్కడ నిలుస్తారు. పామరులు, పిరికి పందలు, పరాక్రమహీనులు. మనమో - మహాయశస్వులం, తేజస్వులం, సృష్టిస్థితిలయకారకులం. దైత్యులు మనకొక లెఖ్ఖా!

ఇలా మోహం తలకెక్కి పరాశక్తి మహిమను పూర్తిగా మరిచిపోయి చిందులు తొక్కుతున్న దేవతలను చూసి జగదంబిక జాలిపడింది. కరుణిద్దామనిపించి యక్షరూపంలో అవతరించింది. ఆ రూపం - కోటిసూర్య ప్రతీకాశం. చంద్రకోటిసుశీతలం. విద్యుత్కోటి సమానాభం. హస్తపాదాదివర్జితం. ఎప్పుడూ ఎక్కడా విన్నది కాదు, కన్నదికాదు. ఆ రూపం ఆ తేజస్సు పరమసుందరంగా అద్భుతావహంగా ఉంది.

ఏమిటిది? ఏమిటిది? దైత్యుల దుశ్చేష్టకాదుగదా! ఏదో తెలియని మహామాయ కాదుగదా! దేవతలం - మనకే ఇంత విస్మయాన్ని కలిగిస్తున్నదే దీన్ని ఎవరు నిర్మించి ఇటు పంపి ఉంటారు చెప్మా!

దేవతలంతా గుమికూడి చర్చలు జరిపారు. ఆ రూపం దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వని అడగాలి. పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి. బలాబలాలు తేల్చుకోవాలి. అప్పుడు ప్రతిక్రియ చెయ్యాలి - అని ఒక వ్యూహం నిర్ణయించారు.

వెంటనే ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి పిలిచాడు. వహ్నీ! దేవతలకు నువ్వేకదా ముఖస్థానీయుడివి అంచేత నువ్వే వెళ్ళు. అదేమిటో తెలుసుకో - అని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవుడు త్వరత్వరగా వెళ్ళాడు.

ముందుగా ఆ యక్షరూపమే - నువ్వెవడవు అని అగ్నిని ప్రశ్నించింది. నీ శక్తి ఎంతో చెప్పమంది. నేను అగ్నిని. జాతవేదసుడను. అన్నింటినీ దహించివెయ్యగల శక్తి నన్ను నమ్మి నాలో ఉంది - అని అగ్నిదేవుడు బదులు పలికాడు. ఓహో! అలాగా! అయితే ఈ గడ్డిపరకను దహించు. నువ్వు ఉంది అని చెప్పుకుంటున్న శక్తి నీలో ఉందో లెదో చూస్తాను - అంటూ ఆ యక్షతేజోరూపం ఒక గడ్డిపరకను అగ్నిదేవుడి ముందుకి విసిరింది. 

వహ్నిదేవుడు ఎంతగానో ప్రయత్నించాడు. తన బలం అంతా కూడగట్టుకుని మరీ ప్రయత్నించాడు. కానీ ఎంతకీ ఆ గడ్డిపరకను ఏమీ చెయ్యలేకపోయాడు. సిగ్గుపడిపోయాడు. తనకేమయ్యింది ఇవ్వేళ? అంతుబట్టలేదు.

దేవతల దగ్గరికి పరుగుపెట్టాడు. దేవతలంతా ఒక్కసారిగా మీదపడ్డారు. ఎవరో ఏమిటో తెలుసుకువచ్చావా? అగ్నిదేవుడు సిగ్గుతో ముఖం దించుకున్నాడు. జరిగినదంతా చెప్పాడు. మన బతుకులు వట్టి బూటకాలు. వృధాభిమానంతో విర్రవీగుతున్నాం. ఛీ - ఛీ అని ముగించి తొలగిపోయాడు.

ఇంద్రుడికి పట్టుదల వచ్చింది. వాయుదేవుణ్ణి పిలిచాడు. జగత్తులో అంతటా నువ్వే నిండి ఉన్నావు. నీ కదలికలతోనే అన్నీ కదిలేది. నువ్వు ప్రాణరూపివి. ప్రాణికోటికి సర్వశక్తి విధాయకుడివి. నువ్వు వెళ్ళి తెలుసుకునిరా. నీకన్నా సమర్థుడెవడు? - అని గాలిదేవుడికి కాస్త గాలికొట్టి పంపించాడు. 

వాయుదేవుడు ఉబ్బిపోయాడు. మహావేగంగా వెళ్ళాడు. యక్షరూపం మళ్ళీ అదే ప్రశ్నవేసింది. నేను వాయువును. సర్వశక్తి సంపన్నుడను. దేనినైనా ఎగురగొట్టగలను. నావల్లనే ఈ జగత్తు బతుకుతోంది - అంటూ సగర్వంగా పలికాడు. అయితే ఈ గడ్డిపరక కదుపు - అంది యక్షరూపం. లేకపోతే తలదించుకుని నోరుమూసుకుని వచ్చినదారినే వచ్చినచోటుకే ఫో - అనికూడా అనేసింది.

వాయుదేవుడికి అభిమానం పొడుచుకు వచ్చింది. గట్టిగా ప్రయత్నించాడు. గడ్డిపరకను కదిలించలేకపోయాడు. శృంగభంగమయ్యింది. తలదించుకుని నోరుమూసుకుని పరుగుతీశాడు. ఇంద్రాదులకు వృత్తాంతం చెప్పాడు. ఇదేమిటో అస్సలు తెలియడం లేదు. మనం అసమర్దులం. మిథ్యాభిమానులం. అదేదో అలౌకిక యక్షతేజస్సు. పరమదారుణ తేజస్సు - అనేసి తానూ జారుకున్నాడు.

ఈసారి దేవతలంతా కలిసి ఇంద్రుణ్ణి ఎగద్రోశారు. నువ్వు దేవనాయకుడవు. యక్షుల్ని బాగా ఎరుగుదువు. కనక నువ్వే వెళ్ళు అంటే వెళ్ళు అన్నారు. సరే, తెలుసుకుని వస్తాను - అంటూ దేవేంద్రుడు సగర్వంగా బయలుదేరాడు. యక్షరూపాన్ని తరిమాడు. ఆ తేజోరూపం ఇంద్రుణ్ణి తరిమింది. చాలాదూరం తరుముకుంటూ వెళ్ళి చటుక్కున మాయమయ్యింది. 

మాటా మంతీ వినపడటం లేదు. ఇంద్రుడికి దిక్కుతోచలేదు. దారుణమైన అవమానమనిపించింది. తననే మాయ చేసిందా? కనుగప్పి పారిపోయిందా? దేవసభకు ఏ ముఖంపెట్టుకుని వెళ్ళను! ఏమి చెప్పను! దేవతలముందు ఎంత అవమానం! మహాత్ములకు అభిమానమే ధనమన్నారు. అది పోయాక బతికి ఏమి లాభం? చావుతో సమానం. కనక నాకిక మరణమే శరణం - అని నిశ్చయించుకుని ఆ పని చెయ్యబోయాడు.

సరిగ్గా అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. సహస్రాక్షా! మాయాబీజాక్షరం జపించు, సుఖపడతావు - అంది. వెంటనే అక్కడే తపస్సుకి కూర్చున్నాడు. కన్నులన్నీ మూసుకుని మాయాబీజాక్షరాన్ని లక్షసంవత్సరాలు నిరాహారుడై జపించాడు.

ఒక చైత్ర నవమినాడు సూర్యుడు నడినెత్తికి వచ్చినవేళ మళ్ళీ అదే యక్షరూపం అదే తేజఃపుంజం అదే ప్రదేశంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యింది. అయితే ఈసారి ఆ తేజోమండలానికి మధ్యలో నవయౌవనంలో ఉన్న కుమారీ రూపం కనిపించింది.

మహాదేవి ఆత్మావిష్కారం





Deeksha Svikaram - దీక్షా స్వీకారం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - దీక్షా స్వీకారం

అటుపైని గురువుగారు శిష్యుణ్ణి ఆగ్నికుండం దగ్గరకి పిలవాలి. అప్పటికే శిష్యుడు స్నానం చేసి సంధ్యవార్చి వస్త్రద్వయం ధరించి బంగారు ఆభరణం దాల్చి కొత్త కమండలువు చేతబట్టి సిద్ధంగా ఉండాలి. గురుసన్నిధికి వచ్చి నమస్కరించాలి. సభాసదులకూ కులదేవతకూ నమస్కరించాలి. పీటమీద కూర్చోవాలి. 

అప్పుడు అతణ్ణి గురువుగారు కృపాదృష్టులతో చూడాలి. తన చైతన్యం అతని శరీరంలోకి ప్రవేశించినట్లు భావించాలి. హోమం చెయ్యడంవల్ల లభించిన దివ్యదృష్టితో అధ్వసంశోధన చెయ్యాలి. ఇతడు శుద్ధాత్ముడవుతాడా కాడా? దేవతానుగ్రహానికి యోగ్యుడా కాదా? పరిశీలించాలి. 

శిష్యుడి శరీరంలో షడధ్వ పరిశీలన చెయ్యాలి. పాదాలలో కళాధ్వాన్నీ సంధిబంధాల్లో తత్త్వాధ్వాన్నీ నాభిలో భువనాధ్వాన్నీ హృదయంలో వర్ణాధ్వాన్నీ ఫాలభాగంలో పదాధ్వాన్నీ మూర్ధంలో మంత్రాధ్వాన్నీ విశోధించాలి.

ఒక్కొక్క అధ్వాన్ని పరిశోధిస్తున్నప్పుడు శిష్యుణ్ణి దర్భకూర్చతో తాకుతూ, శోధయామ్యముమధ్వానం స్వాహా అంటూ - నేతితో తడిపిన తిలలు తారాఢ్యంగా ఎనిమిదేసిసార్లు హోమం చెయ్యాలి. ఇలా ఆరింటికీ చేశాక ఆ షడధ్వాలూ బ్రహ్మలో లీనమైనట్టు భావించాలి.

మళ్ళీ వాటిని సృష్టిమార్గాన పునరుత్పాదన చెయ్యాలి. అప్పుడు మళ్ళీ తన చైతన్యాన్ని శిష్యుడిలో లీనం చెయ్యాలి. పూర్ణాహుతి ఇచ్చి మంత్రాధిష్ఠాన దేవతను కలశంలోకి ఆవాహన చెయ్యాలి. మళ్ళీ వ్యాహృతులతో హోమం చేసి అగ్నికి ఆంగాహుతులిచ్చి అగ్నిని ఆత్మయందు విసర్జించాలి.

శిష్యుడి కళ్ళకు గుడ్డకట్టాలి. నేత్రమంత్రం జపిస్తూ ఆగ్నికుండంనుంచి శిష్యుణ్ణి మండలంలోకి తీసుకువెళ్ళాలి. ముఖ్యదేవికి అతడి చేతులతో పుష్పాంజలి సమర్పింపజెయ్యాలి. కళ్ళకు కట్టిన గుడ్డ విప్పాలి. దర్భాసనం మీద కూర్చోబెట్టాలి. కల్పోక్తవిధంగా శిష్యదేహంలో భూతశుద్ది చెయ్యాలి. న్యాసాలు జరపాలి. 

అప్పుడు వేరొక మండలంలో కూర్చోబెట్టాలి. కుంభంలో ఉన్న చిగురాకుల్ని శిష్యుడి శిరస్సున ఉంచి మాతృకను జపించాలి. దేవతాత్మకాలైన ఆ కుంభోదకాలతో స్నానం చేయించాలి. వెంటనే రక్షార్థంగా వర్ధనీజలం చిలకరించాలి. అప్పుడు శిష్యుడు లేచి బట్టలు మార్చుకోవాలి. 

భస్మావలేపనం చేసుకోవాలి. గురుసన్నిధికి రావాలి. అప్పుడు దయామయుడై గురువుగారు తన హృదయంనుంచి మహాదేవి నిర్గమించి శిష్యుడి హృదయంలో ప్రవేశించినట్టు భావించాలి. ఆ ఉభయదేవీ మూర్తులకూ ఐక్యాన్ని భావిస్తూ గంధపుష్పాదులతో పూజచెయ్యాలి. తన కుడిచేతిని శిష్యుడి శిరన్పుపై ఉంచి కుడిచెవిలో - మహాదేవీ మహామంత్రాన్ని ముమ్మారు ఉపదేశించాలి. 

వెంటనే ఆరంభించి శిష్యుడు ఆ మంత్రాన్ని నూటయెనిమిదిసార్లు జపించాలి. దేవతారూపుడైన గురువుగారికి సాష్టాంగనమప్కారం చెయ్యాలి. తన సర్వస్వమూ సమర్పించాలి. యావజ్జీవితమూ అనన్యబుద్ధిగా మెలగాలి. ఋత్విక్కులకు దక్షిణలిచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. 

సువాసినులకూ కుమారీమణులకూ వటువులకూ దీన అనాథ దరిద్రులకూ లోభించకుండా బట్టలూ భోజనాలూ పెట్టాలి. ధనసువర్ణాదులుకూడా యథాశక్తిగా ఇవ్వవచ్చు. తన కృతార్థతను గుర్తించి ఆ మహామంత్రాన్ని నిత్యమూ ఉపాసించాలి.

నారదా! ఉత్తమోత్తమమైన దీక్షావిధి సవిస్తరంగా నీకు తెలియజేశాను. ఇదంతా బాగా భావన చేసి దేవిపాదపద్మాలను సమాశ్రయించు. ఇంతకన్నా బ్రాహ్మణుడికి ఉత్తమ ధర్మంలేదు. వేదమార్గానుయాయులు వారివారి గుహ్యోక్త పద్ధతుల్లో మంత్రోపదేశాలు చెయ్యవచ్చు, పొందవచ్చు. 

ఇప్పుడు నేను చెప్పింది సనాతనమైన తాంత్రికరీతి. గురువులు చెప్పిన మార్గంలో ప్రయాణించడమే ఎప్పటికీ శ్రేయస్కరం. నువ్వు అడిగావు నేను చెప్పాను. పరాంబికను సేవించు. త్రికరణశుద్ధిగా ఉపాసించు. నిత్యమూ నేను అలా ఆరాధించి ఇలా పరనిర్వృతిని (అత్యంత మనశ్శాంతి) పొందుతున్నాను - అని నారాయణమహర్షి సంభాషణ ముగించాడు. 

కన్నులు మూసుకుని దేవీపాదపద్మాలను ధ్యానిస్తూ సమాధిలో మునిగిపోయాడు. నారదుడు వినయవినమితగాత్రుడై ఆ మునిశిఖామణికి ఆ జ్ఞానస్వరూపునికి ఆ కృపాజలనిధికి ఆ అమృతాంతరంగునికి ఆ శిష్యవత్సలునికి ఆ నిష్ఠానిధికి సాష్టాంగనమస్కారం చేసి, దేవీ దర్శనలాలసుడై వెంటనే తపస్సుకి వెళ్ళిపోయాడు.

శౌనకాది మహామునులారా! నారదనారాయణ సంవాద రూపంగా ఈ విశేషాలన్నీ మా గురువుగారు వ్యాసభగవానుడు జనమేజయమహారాజుకు ఉపదేశించారు. వాటినే యథాతథంగా మీకు నేను చెబుతున్నాను. ఇంతకుమించి ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదు - అన్నాడు సూతమహర్షి.

సూతమహర్షి! వినయశీలివి కనక నువ్విలాగే అంటావు. ఎన్నెన్ని విశేషాలు చెప్పావు! ఎంతెంత సందేహాలు తీర్చావు! నీ జ్ఞానం నీ పరిజ్ఞానం అమోఘం. అనన్యం. ఇంతా విన్నాక జనమేజయు డేమన్నాడు? వ్యాసుడు ఇంకా ఏమి చెప్పాడు? అది కూడా తెలియజెయ్యి. వినాలని మాకందరికీ కుతూహలంగా ఉంది - అన్నారు శౌనకాది మహామునులు. సూతుడిప్పుడింక వ్యాసజనమేజయ సంభాషణగా కథను కొనసాగించాడు.

హే భగవన్‌! వ్యాస! సర్వధర్మజ్ఞా! సర్వశాస్త్ర విదాంవరా! ద్విజులందరూ శక్తిని ఆరాధించాలనే కదా వేదం చెప్పింది. సంధ్యాకాలాల్లో నేమిటి ఇతర సమయాల్లో నేమిటి జగన్మాతనే నిత్యమూ ఉపాసించాలి. మరి ఆలాంటప్పుడు కొందరు ద్విజులు దేవీ వరివస్యను(సేవ) విడిచిపెట్టి ఇతరదేవతలను ఆరాధిస్తున్నారెందుకని?

కొందరు వైష్ణవులు కొందరు గాణపత్యులు కొందరు కాపాలికులు కొందరు బౌద్దులు కొందరు దిగంబరులు - ఇలా రకరకాలవారు కనిపిస్తున్నారు. వేదవాక్కుపట్ల వీరికి శ్రద్ధలేనట్టేనా? ఈ సందేహం నువ్వే తీర్చాలి. బుద్ధిమంతులూ పండితులూ నానాతర్కవిచక్షణులూ అయ్యుండీ వేదాలపట్ల శ్రద్ధలేకపోతే ఎలాగ? స్వీయశుభపరంపరను ఎంతటి బుద్ధిహీనుడైనా కోరి భంగపరచుకోడే. 

అటువంటిది వీరంతా దేవీసేవను విడిచి పెట్టేశారంటే కారణమేమిటో ఊహించలేకపోతున్నాను. దయచేసి ఈ సందేహం తెముల్చు. ఆలాగే నీ ప్రసంగంలో మణిద్విపమహిమను గురించి వాచవిగా చెప్పావు. దేవీ నివాసమన్నావు. దాన్ని సవిస్తరంగా కన్నులకు కట్టించు. నేను భక్తుణ్ణి. శ్రద్దగా వింటున్నవాణ్ణి. నాలాంటివారికి గురువులు ప్రసన్నులై గుహ్యాతి గుహ్యాలను సైతం ప్రకటం చేస్తారుగదా! (ప్రసన్నాస్తు వదంత్యేవ గురవో గుహ్యమప్యుత 8 - 8)

జనమేజయమహారాజా! అడగవలసింది అడగవలసిన సమయంలో అడిగావు. బుద్ధిమంతుడవు. వేదాలపట్ల శ్రద్ధ కలవాడవు. కనక నీకు దాచకుండా అన్నీ చెప్పవలసిందే. నీ సందేహాలు తీరుస్తాను. విను.

ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం





Sthandila Kunda Samskaralu - స్థండిల కుండ సంస్కారాలు

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - స్థండిల కుండ సంస్కారాలు

నారదా! ఇక్కడ చెయ్యవలసిన స్థండిల కుండసంస్కారాలు చెబుతాను. తెలుసుకో. మూలమంత్రంతో వీక్షించి అస్త్రమంత్రంతో ప్రోక్షించి తాడన చెయ్యాలి. కవచంతో అభ్యుక్షణం జరిపి ముమ్మారు స్తవం చెయ్యాలి. పాగగ్రాలుగానూ ఉదగగ్రాలుగానూ చుట్టూ రేఖలు గియ్యాలి. 

దేవీపీఠాన్ని ప్రణవోచ్చారణతో అభ్యుక్షణచేసి అర్చించాలి. ఆధారశక్తితో ఆరంభించి పీఠమంత్రాంతంగా ఇది జరగాలి. ఆ పీఠంలో పార్వతీపరమేశ్వరులను ఆవాహన చెయ్యాలి. గంధాదులతో ఉపచారాలతో శ్రద్ధగా అర్చించాలి. ఋతుస్నానం చేసి కామాతురయై శంకరుడితో సంగమిస్తున్నట్టు దేవిని ధ్యానించాలి. 

ఆ దంపతుల క్రీడా విశేషాన్ని కొంచెంసేపు భావించాలి. అటుపైని ఒక పాత్రతో అగ్నిని తెచ్చి ముందుంచుకోవాలి. రాక్షసాంశను విడిచిపెట్టి పూర్వోక్తంగా వీక్షణాదులతో వహ్నిని సంస్కరించాలి. రం బీజముచ్చరించాలి.

అటుపైని చైతన్యయోజన చేసి ప్రణవంతో అభిమంత్రించాలి. ఏడుసార్లు గురువు ధేనుముద్రను ప్రదర్శించాలి. దర్భతో రక్షణ చేసి తనుత్రాణం కప్పాలి. ముమ్మారు ప్రదక్షిణం చేసి జానువులు నేలపై అన్చి కూర్చోవాలి. అగ్నికుండం మీద (చెయ్యిసాచి) తారమంత్రం జపించాలి. 

శివబీజబుద్దితో అగ్నిని దేవీయోనిలో ఉంచాలి. ఆపైని పార్వతీపరమేశ్వరులను ఆచమింపచెయ్యాలి. చిత్పింగళ హన దహ పదయుగ్మమూ సర్వజ్ఞాజ్ఞాపయ స్వాహా మంత్రమూ జపిస్తూ వహ్నిదీపనం చెయ్యాలి. స్తుతించాలి.

అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాశనమ్‌ 

సువర్ణవర్ణమమలం సమిద్దం విశ్వతోముఖమ్‌ 


ఇలా స్తుతించాక వహ్నిమంత్రానికి షడంగరార్చన జరపాలి. సప్తార్చిః స్వస్తిపూర్ణః ఉత్తిష్ఠపురుషః ధూమవ్యాపీ సప్తజిహ్వః ధనుర్ధరః ఈ క్రమంలో షడంగన్యాసం చెయ్యాలి. హేమవర్ణుడూ త్రినేత్రుడూ పద్మసంస్థితుడూ ఇష్టశక్తి స్వస్తికధరుడూ మంగళప్రదుడూ పరముడూ ఆయిన వహ్నిని ధ్యానించాలి. కుండమేఖలోపరిభాగాన మంత్రపరిషేచన చెయ్యాలి. 

ఆ తరుపరి దర్భలు పరచాలి. పరిధులు ఉంచాలి. త్రికోణ - వృత్త - షట్కోణ - సాష్టదళంగా సభూపురంగా వహ్నియంత్రం లిఖించాలి. భావన చెయ్యాలి. దాని మధ్యభాగాన వహ్నిదేవుణ్ణి వైశ్వానరప్రభృతి మంత్రాలతో అర్చించాలి. 

షట్కోణాలలో హిరణ్య - గగన - రక్త - కృష్ణ - సుప్రభ - బహురూప - అతిరక్తిక అనే సప్తజిహ్వలనూ పూజించాలి. కేసరాలలో ఆంగపూజ చేసి, దళాలలో శక్తిధరుడు స్వస్తికధరుడు జాతవేదసుడు సప్తజిహ్వుడు హవ్యవాహనుడు అశ్వోదరజుడు వైశ్వానరుడు కౌమారతేజుడు విశ్వముఖుడు దేవముఖుడు తారాగ్ని అనే మూర్తులను అర్చించాలి. సాయుధులుగా దిక్పాలకులను నాలుగు దిక్కులా నిక్షేపించి పూజించాలి.

ఆ తరవాత స్రుక్‌ స్రువాలనూ (కర్రతెడ్డు) ఘృతాన్నీ సంస్కరించి హోమక్రియ సాగించాలి. ఆజ్యంలో దక్షిణభాగాన్ని స్రువంతో తీసుకుని అగ్నిదేవుడి కుడికంటిలో వేస్తూ అగ్నయే స్వాహా అంటూ హోమం చెయ్యాలి.

అలాగే నెయ్యిలో ఎడమభాగం తీసుకుని సోమాయ స్వాహా అనీ, మధ్యభాగం తీసుకుని అగ్నీషోమాభ్యాం స్వాహా అనీ వామ - మధ్యమ నేత్రాలలో హోమం చెయ్యాలి. మళ్ళీ దక్షిణభాగం తీసుకుని అగ్నయే స్విష్టకృత్‌ స్వాహా అంటూ ముఖసీమలో హోమం చెయ్యాలి. 

తరవాత సతారమైన వ్యాహృతులతో చేసి అగ్నిమంత్రాలతో ముమ్మారు హోమం చెయ్యాలి. అయ్యాక ప్రణవంతో ఎనిమిదేసి చొప్పున రెండుసార్లు ఘృతాహుతులు చెయ్యాలి. ఇవ్వి గర్భాధానాది సంస్కారాల నిమిత్తంగా చేసే ఆహుతులు.

నారదా! గర్భాధానం - పుంసవనం - సీమంతోన్నయనం - జాతకర్మ - నామకరణం - ఉపనిష్క్రమణం - అన్నప్రాశనం - చూడాకర్మ - మౌంజీబంధం - మహావ్రతం - ఔపనిషదీవ్రతం - గోదానం - ఉద్వాహం - అని వేదం కొన్ని సంస్కారాలు చెప్పింది.

ఆపైని పార్వతీపరమేశ్వరులను మళ్ళీ పూజించి విసర్జన పలకాలి. అయిదు సమిధలతో అగ్నినే ఉద్దేశించి హోమం చెయ్యాలి. ఆవరణకు ఒకటి చొప్పున ఆహుతులివ్వాలి. అయ్యాక స్రువంతో నెయ్యిని స్రుక్కులోకి నాలుగుసార్లుగా తీసుకుని స్రువంతోనే ఆచ్చాదించి పట్టుకుని గురువుగారు లేచి నిలబడి వౌషడంతమంత్రంతో అగ్నికి ఆహుతి ఇవ్వాలి.

తరవాత మహాగణేశ మంత్రంతో పది ఆహుతులు చెయ్యాలి. దేయమంత్రాధిదేవతను ధ్యానించి మూలమంత్రంతో ఇరవైఅయిదు ఆహుతులను ఉభయ ముఖైకీకరణంకోసమని వహ్నిముఖభాగంలో ఇవ్వాలి. ఇచ్చి వహ్ని - మంత్రాధిదేవతల ఐక్యాన్ని భావించాలి. 

ఆంగదేవతలకు విడివిడిగా ఆరు ఆహుతులివ్యాలి. వహ్ని - మంత్రాధిదేవతలకు నాడీ సంధానం సంకల్పించి పదకొండుసార్లు ఘృతహోమం చెయ్యాలి. తదనంతరం కల్ఫోక్తద్రవ్యాలతోగానీ తిలలతోగాని దేవతామూలమంత్రోచ్చారణ పూర్వకంగా గజాంతక సహస్రకం హోమం చెయ్యాలి.

ఈ హోమవిధానంతో మహాదేవినీ పరివార దేవిబృందాలను (ఆవృతిదేవీః) అగ్నిదేవుణ్ణీ సంతృప్తి
పరిచినట్టూ వారు సంతృప్తి చెందినట్టూ భావించాలి.

దీక్షా స్వీకారం





Deeksha Pradanam - దీక్షా ప్రదానం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - దీక్షా ప్రదానం

నారాయణమహర్షీ! రకరకాల పూజలూ ధ్యానాలూ అనుష్ఠానాలూ వివరంగా తెలియజేశావు. కానీ వాటికి సంబంధించిన దీక్షావిధానం ఏమిటి? అది కొంచెం వివరించు.

నారదా! ఏ వ్రతానికైనా దీక్షముఖ్యం. అది లేనిదే పూజచేసే అధికారమే సిద్ధించదు. దీక్ష దివ్యజ్ఞానాన్ని ఇస్తుందనీ పాపాలను క్షయింపజేన్తుందనీ వేదతంత్రవిశారదులు నిర్వచించారు.

కనక దేవ గురు వహ్నిపూజాదులన్నింటికీ దీక్షాస్వీకారం తప్పనిసరి. దీక్షను ఇచ్చినవారూ పుచ్చుకున్నవారూ కూడా విశుద్ధులవుతారు.

దీక్షనిచ్చే గురువు ప్రాతఃకాలంలో స్నానసంధ్యాధికమంతా యథావిధిగా ముగించుకుని కమండలువులో జలం నింపుకుని మౌనిగా నదీతీరంనుంచి ఇంటికి రావాలి. సరాసరి యాగమంటపం దగ్గరలో సముచితాసనంమీద కూర్చోవాలి. ఆచమించాలి. ప్రాణాయామం చెయ్యాలి. 

కమండలుజలంలో గంధపుష్పాలు కలుపుతూ అస్త్ర మంత్రాన్ని ఏడుసార్లు జపించాలి. ఆదే మంత్రాన్ని పఠిస్తూ ఆ నీళ్ళతో యాగమంటపాన్ని సంప్రోక్షించాలి. ఊర్ద్వోదుంబరంలో గణపతిపూజ చెయ్యాలి. లక్ష్మీసరస్వతులను పువ్వులతో ఆర్చించాలి. 

ద్వార దక్షిణభాగాన గంగా గణపతులనూ వామభాగాన యమునా - క్షేత్ర పాలకులనూ నిక్షేపించి అర్చించాలి. గుమ్మంలో ఆస్త్ర మంత్రంతో అస్త్రదేవతను పూజించాలి. మంటపమంతా దేవీమయమైనట్టు భావించాలి. 

అదే మంత్రం చదువుతూ అంతరిక్షగత - భూమిగత విఘ్నాలను పారద్రోలాలి. అప్పుడు గుమ్మం ఎడమ భాగాన్ని తాకుతూ కుడికాలు మెట్టి లోపలికి ప్రవేశించాలి.

కలశం స్థాపించాలి. సామాన్యార్ఘ్యం నిర్వహించాలి. ఆ జలంతో నైరృతిదిశలో వాస్తునాథుడినీ బ్రహ్మదేవుణ్ణీ గంధపుష్పాక్షతలతో అర్చించాలి. అదే జలంతోనూ పంచగవ్యంతోనూ తోరణస్తంభం వరకూ మండపంలోపల సంప్రోక్షించాలి. అంతా దేవీమయమైనట్టు హృదయంలో భావించాలి. 

భక్తితో మూలమంత్రం జపిస్తూ దర్భలతో అంతటా నీళ్ళు చిలకరించాలి. శరమంత్రం పఠిస్తూ మంటపంలోపలి నేలను చరవాలి (తాటించాలి). హుం మంత్రం పఠిస్తూ అభ్యుక్షణం చెయ్యాలి. ధూపంవేసి వికారాలను పారద్రోలాలి. దర్భలతో మార్జని చేసి అంతటా అన్నింటినీ సమ్మార్జించాలి. ఈశాన్యదిక్కున మార్జించి "తత్పుంజం" స్థాపించి పుణ్యాహవాచనంచేసి దీనానాథులను తృప్తిపరచాలి.

అటుపైని మెత్తని ఆసనంమీద తూర్పుముఖంగా కూర్చుని తన గురువునూ దేయమంత్రదేవతనూ ధ్యానించి నమస్కరించాలి. భూతశుద్ధి చేసుకుని దేయమంత్రానికి ఋష్యాదిన్యాసం చెయ్యాలి. ఋషిని శిరోభాగాన, ఛందస్సును ముఖభాగాన, అధిదేవతను హృదయపద్మాన, బీజాక్షరాన్ని గుహ్యభాగాన, శక్తిని పాదద్వయాన విన్యసించాలి. 

మూడుసార్లు చప్పట్లు కొట్టి దిగ్బంధం చెయ్యాలి. ఛోటికాత్రయ పూర్వకంగా (చిటికెలు) ప్రాణాయామం చేసి మూలమంత్రంతో స్వశరీరంలో మాతృకాన్యానం చెయ్యాలి. 

ఓం అం శిరసే నమః ఇత్యాదిగా క్రమపద్ధతిలో ఈ న్యాసం జరగాలి. ఇలాగే మూలమంత్రాన్ని షడంగంగా కరాంగుళీ హృదయాదుల్లో న్యసించాలి. ప్రణవాక్షరపూర్వకాలూ నమః - స్వాహా - వషట్‌ - హుం - వౌషట్‌ - ఫట్‌ పదాంతాలూ అయిన ఆరుమంత్రాలతో చేసే న్యాసాన్ని షడంగకం అంటారు.

అటు పైని మూలమంత్ర వర్ణన్యాసంకూడా తత్తత్‌ కల్ఫోక్తప్రకారంగా చెయ్యాలి. అయ్యాక స్వశరీరంలో శుభాసనాన్ని సంభావించాలి. అందులో దక్షిణభుజాన ధర్మాన్ని వామభుజాన జ్ఞానాన్ని ఎడమతొడలో వైరాగ్యాన్ని కుడితొడలో ఐశ్వర్యాన్ని ముఖంలో అధర్మాన్ని - ఇలాగే ఆయా భాగాలలో ఆయా అంశాలను నియమానుసారం విన్యసించాలి. ఈ సింహాసనానికి ధర్మార్ధ కామమోక్షాలు నాలుగు కోళ్ళు. అధర్మాదులు శరీరం.

ఈ సింహాసనంలో మధ్యభాగం హృదయం. అది మృదువు. కనక అక్కడ అనంతరూపమైన ప్రపంచపద్మాన్ని విన్యసించాలి. (అనంతుణ్ణీ ప్రపంచపద్మాన్నీ అనిగానీ). ఆ నిర్మల పద్మంలో సూర్య చంద్ర - పావకులను కళలతోసహా సమంత్రకంగా న్యసించాలి.

సూర్యుడికి పన్నెండు చంద్రుడికి పదహారు అగ్నికి పది కళలుంటాయని పెద్దలు చెప్పారు. వాటితోసహా వారిని ధ్యానించాలి.

ఈ ముగ్గురికీ పైని సత్వరజస్తమోగుణాలను సంభావించాలి. ఆత్మ - ఆంతరాత్మ - పరమాత్మ - జ్ఞానాత్మలను న్యసించాలి. ఇది పీఠకల్పన. అముకాసనాయ నమః ఇత్యాది మంత్రంతో ఆసనపూజచేసి దానిమీదకు పరాంబికను ధ్యానించి ఆవాహన చెయ్యాలి.

దేయమంత్ర అధిదేవతనుకూడా ఇలాగే కల్పోక్త ప్రకారంగా ఆవాహనచేసి మానసోపచారాలతో అర్చించాలి. ముద్రలు ప్రదర్శించాలి. అవి దేవికి ఆనందకారకాలు.

అటుపైన (శరీర - మండప) వామభాగాగ్రంలో షట్కోణమండలాన్నీ దానిలో వర్తుల మండలాన్నీ దాని మధ్యలో చతురస్ర మండలాన్నీ దాని నడుమ త్రికోణమండలాన్నీ (భావనారూపంగా) లిఖించాలి.

అందులో శంఖముద్రను ప్రదర్శించాలి. షట్కోణాలలో షడంగాలను పూలతో పూజించాలి. ఆగ్నేయాది కోణాలలో ఈ షడంగకార్చన చెయ్యాలి. శంఖానికున్న ఆధారపాత్రను తీసి అస్త్రమంత్రోదకంతో ప్రోక్షించి ఆ మండలంలో స్థాపించాలి. 

మం వహ్నిమండలాయ అనే మంత్రంతో దశకళాత్మకుడైన అగ్నిని అర్చించాలి. (శంఖ) ఆధారపత్ర స్థాపనలో అముకదేవ్యా ఆర్ఘ్యపాత్రస్థానాయ నమః ఆంటూ ఆ మంత్రాన్ని పఠించాలి. ఈ ఆధారపాత్రకు తూర్పునుంచి ఆరంభించి ప్రదక్షిణక్రమంలో ఆగ్నికళలు పదింటికీ పూజచెయ్యాలి, 

అటుపైని మూలమంత్రంతో శంఖాన్ని ప్రోక్షించి ఆధారపాత్రలో ఉంచాలి. అప్పుడూ మూలమంత్రమే పఠించాలి. ఆం సూర్యమండలాయ అనే మంత్రంతో ద్వాదశకళలూ అర్చించాలి. అముకదేవ్యర్ఘ్యపాత్రాయ నమః అనాలి. 

శం శంఖాయ నమః అంటూ శంఖాన్ని ప్రోక్షించి ఆందులో సూర్యుడి పన్నెండు కళలకూ కుసుమార్చన చెయ్యాలి. విలోమమాతృకను విలోమ మూలమంత్రంతో ధ్యానించాలి. శంఖంలో నీళ్ళు నింపి చంద్రకళాన్యాసం చెయ్యాలి. 

ఉం సోమమండలాయ నమః అనే దానితో మొదలుపెట్టి అముకార్ఘ్యామృతాయ అనే హృన్మంత్రంవరకూ ఆయా మంత్రాలను ఉచ్చరిస్తూ షోడశకలాత్మకుడిని అర్చించాలి. అదే మంత్రంతో సృణిముద్రతో జలార్చన చెయ్యాలి. సకల తీర్థాలనూ శంఖజలంలోకి ఆవాహనచేసి ఎనిమిదిసార్లు మంత్రోచ్చారణ జరపాలి. 

షడంగాలనూ ఆ జలంలో విన్యసించి హృదయస్థానంలో ఈ జలార్చన చెయ్యాలి. మత్స్యముద్రతో శంఖంపైన ఆచ్చాదన పట్టి మూలమంత్రాన్ని ఎనిమిదిసార్లు జపించాలి. ఆ పైని దక్షిణదిగ్భాగంలో శంఖప్రోక్షణిని ఉంచాలి. శంఖంలోని నీళ్ళు కొంచెంగా ప్రోక్షణిలో పోసి అంతటా జల్లాలి.

ఈ సంప్రోక్షణతో ప్రదేశమూ తానూ పూజాద్రవ్యాలూ విశుద్ది పొందినట్లు భావించాలి.

అటుపైని గురువుగారు తన ఎట్టయెదుట ఉన్న వేదికపై సర్వతోభద్రమండలాన్ని లిఖించాలి. కర్ణికామధ్యం లిఖించి అందులో తెల్లటి బియ్యం నింపాలి. వాటిమీద దర్భలు పరిచి సలక్షణమైన కూర్చను ఉంచాలి. ఆధారశక్తితో ఆరంభించి పీఠమంత్రాంతంగా అర్చన చెయ్యాలి. 

చిల్లులూ బొడిపెలూలేని కొత్త కుంభం తెచ్చి అస్త్రజలంతో క్షాళన చెయ్యాలి. మూడుపేటల ఎరుపుదారంతో తంతువేష్టనం చేసి తారమంత్రం ఉచ్చరిస్తూ నవరత్న కూర్చ గంధపుష్పాదుల్ని ఆ కుండంలో వెయ్యాలి. పీఠానికీ కుంభానికీ ఐక్యాన్ని భావించాలి.

ప్రతిలోమమంత్రోచ్చారణ చేస్తూ ఆ తీర్థోదకాలతో మాతృకాపూజ చెయ్యాలి. మూలమంత్రం జపిస్తూ ఆ కుంభాన్ని దేవతగా అర్చించాలి. రావి - పనస - మామిడి చిగుళ్ళతో కుంభవదనాన్ని ఆచ్చాదించాలి.

చషకంలో (చిన్నపాత్ర) పళ్ళూ అక్షతలూ ఉంచి వస్త్రయుగ్మం చుట్టి ప్రాణస్థాపనమంత్రంతో ప్రాణస్థాపన చెయ్యాలి. ఆవాహనాది ముద్రలు పట్టి ఆ పరాంబికను ఆనందపరచాలి. అటుపైని కల్పోక్త ప్రకారంగా పరమేశానిని ధ్యానించాలి. ముందుగా స్వాగతం పలికి కుశలప్రశ్నలు వెయ్యాలి. 

పాద్యం అర్ఘ్యం ఆచమనం మధుపర్కం అభ్యంగనస్నానం రక్త క్షౌమ వస్త్రయుగ్మం మణిభూషలు - ఇత్యాదిగా షోడశోపచారాలూ చెయ్యాలి. మాతృకార్చనా విధానంలో సంపుటిత వర్ణమంత్రాలతో ఈ ఉపచారాలు శ్రద్ధగా జరపాలి. ఇది అయ్యాక నైవేద్యం సమర్పించాలి.

ప్రతిద్రవ్యాన్నీ కేవలం ప్రోక్షణీజలంతోనే సంప్రోక్షించి నివేదించాలి. మరింక ఏ పాత్రలో నీరూ వాడకూడదు. ఆ తరవాత నవావరణ సాంగదేవీపూజ నిర్వర్తించి వైశ్వదేవం చెయ్యాలి. దక్షిణ దిగ్భాగాన స్థండిలం ఏర్పాటుచేసి అగ్నిని నిక్షేపించాలి.

మూర్తిలో ఉన్నదేవతను ఆక్కడకు ఆవాహన చెయ్యాలి. పూజించాలి. ఆహృతులతో మూలమ౦త్రంతో హోమం చెయ్యాలి. నేతిపాయసాన్ని పాతికసార్లు హోమంచేసి కొసరుగా వ్యాహృతులతో పునర్హొమం చెయ్యాలి. గంధాదులతో అర్చించి దేవిని మళ్ళీ పీఠంమీద పెట్టాలి. 

అగ్నికి విసర్జన చెప్పి దశదిశలకూ బలి చల్లాలి. దేవీపార్షదులకు పంచోపచారాలు చేసి తాంబూలం ఛత్రం చామరం దేవికి సమర్పించాలి. మూలమంత్రాన్ని వెయ్యిసార్లు జపించాలి. ఆ జపాన్ని అమ్మవారికి సమర్పించాలి. 

ఆటు పైని ఈశాన్యకోణంలో వికిరం చెయ్యాలి. కర్కరిని స్థాపించి దుర్గను ఆవాహనచేసి పూజించాలి. రక్ష రక్ష అనాలి. అస్త్రమంత్రమే జపిస్తూ ప్రదక్షిణగా మంత్రోదకం జల్లి అక్కడ కర్కరిని ఉంచి ఆస్త్రదేవతను ఆరాధించాలి. అంతా అయ్యాక గురుశిష్యులిద్దరూ మౌనంగా భోజనం చెయ్యాలి. ఆ రాత్రికి ఆ యాగశాలలో వేదికపై నిద్రించాలి.

స్థండిల కుండ సంస్కారాలు





Gayatri Ashtottara Sahasram - గాయత్రీ అష్టోత్తర సహస్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ అష్టోత్తర సహస్రం

గాయత్రీ సహస్ర నామావళి
నారదా! మహర్షీ! సాధు సాధు. అడగవలసింది అడిగావు. నువ్వు మహాప్రాజ్ఞుడివి. సందేహంలేదు. కనకనే చెబుతున్నాను, ఆలకించు. నీ సందేహాలు మూడింటికీ ఒక్కటే సమాధానం. ఒక్కటే సాధనం. అదే శ్రీగాయత్రీ అష్టోత్తర సహస్రనామమాల. సృష్టికి ఆదిలో భగవంతు డుపదేశించిన సహస్రనామాలను నీకు ఉపదేశిస్తున్నాను.

వీటిని జపించడం విద్యాప్రదం. బ్రహ్మజ్ఞానదాయకం. భుక్తిముక్తి ప్రదం. దీనికి ఋషి సాక్షాత్తూ చతుర్ముఖుడు. గాయత్రియే అధిదేవత. ఛందస్సు అనుష్టుప్పు. హల్లులన్నీ బీజాక్షరాలు. స్వరాలన్నీ(అచ్చులు) శక్తులు. మాతృకాక్షరాలతో అంగన్యాసకరన్యాసాలు. సాధకుల హితం కోరి ముందుగా ధ్యానశ్లోకం చెప్పి, తరవాత సహన్రనామమాల చెబుతాను. 

రక్తశ్వేతహిరణ్య నీలధవళైర్యుక్తాం త్రినేత్రోజ్జ్వలామ్‌
రక్తాం రక్తనవప్రజం మణిగణైర్యుక్తాం కుమారీమిమామ్‌ ।
గాయత్రీం కమలాసనాం కరతలన్యావద్ధకుండాంబుజామ్‌
పద్మాక్షీం చ వరస్రజం చ దధతీం హంసాధిరూఢాం భజే ॥

ఆచింత్యలక్షణా 
అవ్యక్తా అర్థమాతృమహేశ్వరీ అమృతార్ణవమధ్యస్థా అజితా ఆపరాజితా 
అణిమాదిగుణాధారా అర్కమండలసంస్థితా అజరాజా అపరాధర్మా అక్షసూత్రధరా అధరా 
అకారాది క్షకారాంతా అరిషడ్వర్గభేదినీ అంజనాద్రిప్రతీకాశా అంజనాద్రి నివాసినీ అదితిః అజపా 
అవిద్యా ఆరవిందనిభేక్షణా అంతర్బహిస్థితా అవిద్యాధ్వంసినీ అంతరాత్మికా అజా ఆజముఖావాసా 
అరవిందనిభాననా అర్ధమాత్రా అర్థదా అనజ్ఞా అరిమండలమర్దినీ ఆసురఘ్నీ ఆమావాస్యా అలక్ష్మీఘ్నీ ఆత్యజార్చితా 

ఆదిలక్ష్మీః ఆదిశక్తిః ఆకృతిః ఆయతాననా(అయుతాననా) ఆదిత్యపదవీచారా ఆదిత్యపరిసేవితా ఆచార్యావర్తనా ఆచారా ఆదిమూర్తివాసినీ ఆగ్నేయా ఆమరీ ఆద్యా ఆరాధ్యా ఆసనస్థితా ఆధారనిలయా 50) ఆధారా ఆకాశాంతనివాసినీ ఆద్యాక్షరసమాయుక్తా ఆంతరాకాశరూపిణీ ఆదిత్యమండలగతా అంతరధ్వాంతనాశినీ 

ఇందిరా ఇష్టదా ఇష్టా ఇందీవరనిభేక్షణా ఇరావతీ ఇంద్రపదా ఇంద్రాణీ ఇంద్రరూపిణీ ఇక్షుకోదండసంయుక్తా ఇషుసంధానకారిణీ ఇంద్రనీలసమాకారా ఇడాపింగళరూపిణీ ఇంద్రాక్షీ ఈశ్వరీ ఈహాత్రయవివర్జితా

ఉమా ఉషా ఉడునిభా ఉర్వారుకఫలాననా ఉడుప్రభా ఉడుమతీ ఉడుపా ఉడుమధ్యగా ఊర్ధ్వా ఊర్ధ్వకేశీ ఊర్థ్వాధోగతిభేదినీ ఊర్థ్వబాహు (క్రి) ప్రియా ఊర్మిమాలావాగ్రంథదాయినీ 

ఋతం ఋషిః ఋతుమతీ ఋషిదేవనమస్కృతా ఋగ్వేదా ఋణహర్త్రీ ఋషిమండలచారిణీ ఋద్ధిదా ఋజుమార్గస్థా ఋజుధర్మా ఋతుప్రదా ఋగ్వేదనిలయా ఋజ్వీ ఌప్తధర్మప్రవర్తినీ ఌతారివరసంభూతా ఌతాదివిషహారిణీ (100) 

ఏకాక్షరా ఏకమాత్రా ఏకా ఏకైకనిష్ఠితా ఐంద్రీ ఐరావతారూఢా ఐహికాముష్మికప్రదా 

ఓంకారా ఓతా ఓతప్రోతనివాసినీ ఔర్వా ఔషధసంపన్నా ఔపాసనఫలప్రదా, అండమధ్య స్థితా అఃకారమనురూపిణీ

కాత్యాయనీ కాళరాత్రిః కామాక్షీ కామసుందరీ కమలా కామినీ కాంతా కామదా కలకంఠినీ కరికుంభస్తనభరా కరవీరసువాసినీ కల్యాణీ కుండలవతీ కురుక్షేత్రనివాసినీ కురువిందదళాకారా కుండలీ కుముదాలయా కాలజిహ్వా కరాళాస్యా కాళికా కాలరూపిణీ కమనీయగుణా కాంతిః కాలధారా కుముద్వతీ కౌశికీ కమలాకారా కామచారప్రభంజినీ కౌమారీ కరుణాపాంగీ కకుబంతా కరిప్రియా కేసరీ కేశవనుతా కదంబ కుసుమప్రియా (150) కాళిందీ కాళికా కాంచీ కలశోద్భవసంస్తుతా కామమాతా క్రతుమతీ కామరూపా కృపావతీ కుమారీ కుండనిలయా కిరాతీ కీరవాహనా కైకేయీ కోకిలాలాపా కేతకీకుసుమప్రియా కమండలుధరా కాళీ కర్మనిర్మూలకారిణీ కలహంసగతిః కక్షా కృతకౌతుకమంగళా కస్తూరీతిలకా కమ్రా కరీంద్రగమనా కుహూః కర్పూరలేపనా కృష్ణా కపిలా కుహరాశ్రయా కూటస్థా కుధరా (కమ్రా) కుక్షిస్థాఖిలవిష్టరా 

ఖడ్గఖేటకరా ఖర్వా ఖేచరీ ఖగవాహనా ఖట్వాంగధారిణీ ఖ్యాతా ఖగరాజోపరిస్థితా ఖలఘ్నీ ఖండితజరా ఖండాఖ్యానప్రదాయినీ ఖండేందుతిలకా

గంగా గణేశగుహపూజితా గాయత్రీ గోమతీ గీతా గాంధారీ గానలోలుపా (200) గౌతమీ గామినీ గాథా గంధర్వాప్సరసేవితా గోవిందచరణాక్రాంతా గుణత్రయవిభావితా గంధర్వీ గహ్వారీ గోత్రా గిరీశా గహనా గమీ గుహావాసా గుణవతీ గురుపాపప్రణాశినీ గుర్వీ గుణవతీ గుహ్యా గోప్తవ్యా గుణదాయినీ గిరిజా గుహ్యమాతంగీ గరుడధ్వజవల్లభా గర్వాపహారిణీ గోదా గోకులస్థా గదాధరా గోకర్ణనిలయాసక్తా గుహ్యమండలవర్తినీ ఘర్మదా ఘనదా ఘంటా ఘోరదానవమర్దినీ ఘృణిమంత్రమయీ ఘోషా ఘనసంపాతదాయినీ ఘంటారవప్రియా ఘ్రాణా ఘృణిసంతుష్టకారిణీ ఘనారిమండలా ఘూర్ణా ఘృతాచీ ఘనవేగినీ జ్ఞనధాతుమయీ

చర్చా చర్చితా చారుహాసినీ చటులా చండికా చిత్రా (250) చిత్రమాల్యవిభూషితా చతుర్భుజా చారుదంతా చాతురీ చరితప్రదా చూళికా చిత్రవస్త్రాంతా చంద్రమఃకర్ణకుండలా చంద్రహాసా చారుదాత్రీ చకోరీ చంద్రహాసినీ చంద్రికా చంద్రధాత్రీ చౌరీ చౌరా చండికా చంచద్వాగ్వాదినీ చంద్ర చూడా చోరవినాశినీ చారుచందనలిప్తాంగీ చంచచ్చామరవీజితా చారుమధ్యా చారుగతిః చండిలా చంద్రరూపిణీ చారుహోమప్రియా చార్వాచరితా చక్రబాహుకా చంద్రమండలమధ్యస్థా చంద్రమండలదర్పణా చక్రవాకస్తనీ చేష్టా చిత్రా చారువిలాసినీ చిత్స్వరూపా చంద్రవతీ చంద్రమాః చందనప్రియా చోదయిత్రీ చిరప్రజ్ఞా చాతకా చారు హేతుకీ ఛత్రయాతా ఛత్రధరా ఛాయా ఛందఃపరిచ్చదా ఛాయాదేవీ ఛిద్రనఖా ఛన్నేంద్రియవిసర్పిణీ (300) ఛందో
నుష్టుప్ప్రతిష్ఠాంతా ఛిద్రోపద్రవభేదినీ ఛేదా ఛత్రేశ్వరీ ఛిన్నా ఛురికా ఛేదనప్రియా

జననీ జన్మరహితా జాతవేదా జగన్మయీ జాహ్నవీ జటిలా జేత్రీ జరామరణవర్జితా జంబూద్వీపవతీ జ్వాలా జయంతీ జలశాలినీ జితేంద్రియా జితక్రోధా జితామిత్రా జగత్ప్రియా జాతరూపమయీ జిహ్వా జానకీ జగతీ జరా జనిత్రీ జహ్నుతనయా జగత్త్రయహితైషిణీ జ్వాలాముఖీ జపవతీ జ్వరఘ్నీ జితవిష్టపా జితాక్రాంతమయీ జ్వాలా జాగ్రతీ జ్వరదేవతా జ్వలంతీ జలదా జ్యేష్ఠా జ్యాఘోషాస్ఫోటదిఙ్ముఖీ జంభిని జృంభణా జృంభా జ్వలన్మాణిక్యకుండలా ఝిం
ఝికా ఝణనిర్ఘోషా ఝంఝామారుతవేగినీ (350) ఝల్లరీవాద్యకుశలా ఞరూపా ఞభుజా

టంకబాణసమాయుక్తా టంకినీ టంకభేదినీ టంకీగుణకృతాఘోషా టంకనీయమహోరసా టంకారకారిణీ ఠఠశబ్దనినాదినీ డామరీ డాకినీ డింభా డుండుమారైకనిర్జితా డామరీతంత్రమార్గస్థా డమడ్డమరునాదినీ డిండీఖసహా డింభలసత్క్రీడాపరాయణా డుంఠివిఘ్నేశజననీ ఢక్కహస్తా ఢిలివ్రజా నిత్యజ్ఞానా నిరుపమా నిర్గుణా నర్మదా నదీ

త్రిగుణా త్రిపదా తంత్రీ తులసీ తరుణా తరుః త్రివిక్రమపదాక్రాంతా తురీయపదగామినీ తరుణాదిత్యసంకాశా తామసీ తుహినాతురా త్రికాలజ్ఞానసంపన్నా త్రివళీ త్రిలోచనా త్రిశక్తిః త్రిపురా తుంగా తురంగవదనా తిమింగిలగిలా తీవ్రా త్రిప్రోతా తామసాదనీ తంత్రమంత్రవిశేషజ్ఞా (400) తనుమధ్యా త్రివిష్టపా త్రిసంధ్యా త్రిస్తనీ తోషాసంస్థా తాళప్రతాపినీ తాటంకినీ తుషారాభా తుహినాచలవాసినీ తంతుజాలసమాయుక్తా తారహారావళిప్రియా తిలహోమప్రియా తీర్థా తమాలకుసుమాకృతిః తారకా త్రియుతా తన్వీ త్రిశంకుపరివారితా తలోదరీ తిరోభూ(భా)షా తాటంకప్రియవాదినీ త్రిజటా తిత్తిరీ తృష్ణా త్రివిధా తరుణాకృతిః తప్తకాంచనసంకాశా తప్తకాంచనభూషణా త్రైయంబకా త్రివర్ణా త్రికాలజ్ఞానదాయినీ తర్పణా తృప్తిదా తృప్తా తామశీ తుంబురుస్తుతా తార్‌క్ష్యస్థా త్రిగుణాకారా త్రిభంగీ తనువల్లరిః థాత్కారీ థారవా థాంతా

దోహినీ దీనవత్సలా దానవాంతకరీ దుర్గా దుర్గాసురనిబర్హిణీ దేవరీతిః దివారాత్రిః ద్రౌపదీ (450)
దుందుభిస్వనా దేవయానీ దురావాసా దారిద్య్రోద్భేధిని దివా దామోదరప్రియా దీప్తా దిగ్వాసా దిగ్విమోహినీ దండకారణ్యనిలయా దండినీ దేవపూజితా దేవవంద్యా దివిషదా ద్వేషిణీ దానవాకృతిః దీనానాథస్తుతా దీక్షా దైవతాదిస్వరూపిణీ ధాత్రీ ధనుర్ధరా ధేనుః ధారిణీ ధర్మచారిణీ ధరంధరా ధరాధారా ధనదా ధాన్యదోహినీ ధర్మశీలా ధనాధ్యక్షా ధర్మవేదవిశారదా ధృతిః ధన్యా ధృతపదా ధర్మరాజప్రియా ధ్రువా ధూమావతీ ధూమకేశీ ధర్మశాస్త్రప్రకాశినీ

నందా నందప్రియా నిద్రా నృనుతా నందనాత్మికా నర్మదా నళినీ నీలా నీలకంఠసమాశ్రయా నారాయణప్రియా నిత్యా (500) నిర్మలా నిర్గుణా నిధిః నిరాధారా నిరుపమా నిత్యశుద్ధా నిరంజనా నాదబిందుకళాతీతా నాదబిందుకళాత్మికా నృసింహినీ నగధరా నృపనాగవిభూషితా నరకక్లేశశమనీ నారాయణపదోద్భవా నిరవద్యా నిరాకారా నారదప్రియకారిణీ నానాజ్యోతిస్సమాఖ్యాతా నిధిదా నిర్మలాత్మికా నవసత్రధరా నీతిః నిరుపద్రవకారిణీ నందజా నవరత్నాఢ్యా నైమిశారణ్యవాసినీ నవనీతప్రియా నారీ, నీలజీమూతనిస్వనా, నిమేషినీ నదీరూపా నీలగ్రీవా నిశీశ్వరీ నామావళిః నిశుంభఘ్నీ నాగలోకనివాసినీ తప్తజాంబూనదప్రఖ్యా నాగలోకాధిదేవతా నూపురాక్రాంతచరణా నరచిత్తప్రమోదినీ నిమగ్నారక్తనయనా నిర్ఘాతసమనిస్వనా నందనోద్యాననిలయా నిర్వ్యూహోపరిచారిణీ

పార్వతి పరమోదారా పరబ్రహ్మాత్మికా పరా పంచకోశవినిర్ముక్తా (550) పంచపాతకనాశినీ పరచిత్తవిధానజ్ఞా పంచికా పంచరూపిణీ పూర్ణిమా పరమా ప్రీతిః పరతేజఃప్రకాశినీ పురాణీ పౌరుషీ పుణ్యా పుండరీకనిభేక్షణా పాతాళతలనిర్మగ్నా ప్రీతా, ప్రీతివివర్ధిన, పావనీ పాదసహితా పేశలా పవనాశినీ ప్రజాపతిః పరిశ్రాంతా పర్వతస్తనమండలా పద్మప్రియా పద్మసంస్థా పద్మాక్షీ పద్మసంభవా పద్మపత్రా పద్మపదా పద్మినీ ప్రియభాషిణీ, పశుపాశ వినిర్ముక్తా, పురంధ్రీ పురవాసినీ పుష్కలా పురుషా పర్వా, పారిజాత సుమప్రియా, పతివ్రతా పవిత్రాంగీ పుష్పహాసపరాయణా, ప్రజ్ఞావతీ - సుతా, పౌత్రీ పుత్రపూజ్యా పయస్వినీ పట్టిపాశధరా పంక్తిః పితృలోకప్రదాయినీ పురాణీ పుణ్యశీలా ప్రణతార్తివినాశినీ (600) ప్రద్యుమ్నజననీ పుష్టా పితామహపరిగ్రహా పుండరీకపురావాసా పుండరీకసమాననా పృథుజంఘా పృథుభుజా పృథుపాదా పృథూదరీ ప్రవాళశోభా పింగాక్షీ పీతావాసాః ప్రచాపలా ప్రసవా పుష్టిదా పుణ్యా ప్రతిష్ఠా ప్రణవాగతిః పంచవర్ణా పంచవాణీ పంచికా పంజరస్థితా పరమాయా పరజ్యోతిః పరప్రీతిః పరాగతిః పరాకాష్ఠా పరేశానీ పావినీ పావకద్యుతిః పుణ్యభద్రా పరిచ్చేదా పుష్పహాసా (పృథూదరీ) పీతాంగీ పీతవసనా పీతశయ్యా పిశాచినీ పీతక్రియా పిశాచఘ్సీ పాటలాక్షీ పటుక్రియా పంచభక్షప్రియాచారా పూతనాప్రాణఘాతినీ పున్నాగవనమధ్యస్థా పుణ్యతీర్దనిషేవితా పంచాంగీ పరాశక్తిః పరమాహ్లాదకారిణీ పుష్పకాండ స్థితా పూషా (650) పోషితాఖిలవిష్టపా పానప్రియా పంచశిఖా పన్నగోపరిశాయినీ పంచమాత్రాత్మికా పృథ్వీ పథికా పృథుదోహనీ పురాణన్యాయమీమాంసా పాటలీపుష్పగంధినీ పుణ్యప్రజా పారదాత్రీ పరమార్గైకగోచరా ప్రవాళశోభా పూర్ణాశా ప్రణవా పల్లవోదరీ ఫలినీ ఫలదా ఫల్గుః పూత్కారీ ఫలకాకృతిః ఫణీంద్రభోగశయనా ఫణిమండలమండితా

బాలబాలా బహుమతా బాలాతపనిభాంశుకా బలభద్రప్రియా వంద్యా బడబా బుద్దిసంస్తుతా బందీ బిలవతీ బడిశఘ్నీ బలిప్రియా బాంధవీ బోధితా బుద్ధిః బంధూక కుసుమప్రియా బాలభానుప్రభాకారా బ్రాహ్మీ బాహ్మణదేవతా బృహస్పతిస్తుతా బృందా బృందావనవిహారిణీ బలాకినీ బిలాహారా బిలవాసా బహూదకా బహునేత్రా (700) బహుపదా బహుకర్ణావతంసికా బహుబాహుయుతా బీజరూపిణీ బహురూపిణీ బిందునాదకళాతీతా బిందునాదస్వరూపిణీ బద్ధగోధాంగుళిత్రాణా బదర్యాశ్రమవాసినీ బృందారకా బృహత్‌స్కంధా బృహతీ బాణపాతినీ బృందాధ్యక్షా బహునుతా బనితా బహువిక్రమా బద్ధపద్మాసనాసీనా బిల్వపత్రతలస్థితా బోధిద్రుమనిజావాసా బడిస్థా బిందుదర్పణా బాలా బాణాసనవతీ బడబానలవెగినీ బ్రహ్మాండబహిరంతఃస్థా బ్రహ్మకంకణ సూత్రిణీ

భవానీ భీషణవతీ భావినీ భయహారిణీ భద్రకాళి భుజంగాక్షీ భారతీ భారతాశయా భైరవి భీషణాకారా భూతిదా భూతిమాలినీ భామినీ భోగనిరతా భద్రదా భూరివిక్రమా భూతవాసా భృగులతా భార్గవీ భూసురార్చితా భాగీరథీ భోగవతీ భవనస్థా (750) భిషగ్వరా (భామినీ) భోగినీ భాషా భవానీ భూరిదక్షిణా భర్గాత్మికా భీమవతీ భవబంధనమోచనీ భయనీయా భూతధాత్రీ (రంజితా) భువనేశ్వరీ భుజంగవలయా భీమా భేరుండా భాగధేయినీ

మాతా మాయా మధుమతీ మధుజిహ్వా మధుప్రియా మహాదేవీ మహాభాగా మాలినీ మీనలోచనా మాయాతీతా మధుమతీ మధుమాంసా మధుధ్రువా మానవీ మధుసంభూతా మిథిలాపురవాసినీ మధుకైటభసంహర్త్రీ మేదినీ మేఘమాలినీ మందోదరీ మహామాయా మైథిలీ మసృణప్రియా మహాలక్ష్మీః మహాకాళీ మహాకన్యా మహేశ్వరీ మాహేంద్రీ మేరుతనయా మందారకుసుమార్చితా మంజుమంజీరచరణా మోక్షదా మంజుభాషిణీ మధురద్రావిణీ ముద్రా (800) మలయా మలయాన్వితా మేధా మరకతశ్యామా మాగధీ మేనకాత్మజా మహామారీ మహావీరా మహాశ్యామా మనుస్తుతా మాతృకా మిహిరాభాసా ముకుందపదవిక్రమా మూలాధారస్థితా ముగ్ధా మణిపూరకవాసినీ మృగాక్షీ మహిషారూఢా మహిషాసురమర్దినీ

యోగాసనా యోగగమ్యా యోగా యౌవనకాశ్రయా యౌవనీ యుద్దమధ్యస్థా యమునా యుగధారిణీ యక్షిణీ యోగయుక్తా యక్షరాజప్రసూతినీ యాత్రా యానవిధానజ్ఞా యదువంశసముద్భవా యకారాదిహకారాంతా యాజుషీ యజ్ఞరూపిణీ యామినీ యోగనిరతా యాతుధానభయంకరీ

రుక్మిణీ రమణీ రామా రేవతీ రేణుకా రతిః రౌద్రీ రౌద్రప్రియాకారా రామమాతా రతిప్రియా రోహిణీ [850) రాజ్యదా రేవా రమా రాజీవలోచనా రాకేశీ రూపసంపన్నా రత్నసింహాసనస్థితా రక్తమాల్యాంబరధరా రక్తగంధానులేపనా రాజహంససమారూఢా రంభా రక్తబలిప్రియా రమణీయయుగాధారా రాజితాఖిలభూతలా రురుచర్మపరీధానా రథినీ రత్నమాలికా రోగేశీ రోగశమని రావిణీ రోమహర్షిణీ రామచంద్రపదాక్రాంతా రావణచ్చేదకారిణీ రక్తవస్త్రపరిచ్చిన్నా రథస్థా రుక్మభూషణా

లజ్జాధిదేవతా లోలా లలితా లింగధారిణీ లక్ష్మీః (లోలా) లుప్తవిషా లోకినీ లోకవిశ్రుతా లజ్జా లంబోదరీ (దేవీ) లలనా లోకధారిణీ

వరదా వందితా విద్యా వైష్ణవీ విమలాకృతిః వారాహీ విరజా వర్షా వరలక్ష్మీః విలాసినీ వినతా వ్యోమమధ్యస్టా (900) వారిజాసనసంస్థితా వారుణీ వేణుసంభూతా వీతిహోత్రా విరూపిణీ వాయుమండలమధ్యస్థా విష్ణురూపా విధిప్రియా విష్ణుపత్నీ విష్ణుమతీ విశాలాక్షీ వసుంధరా వామదేవప్రియా వేలా వజ్రిణీ వసుదోహినీ వేదాక్షరపరీతాంగీ వాజపేయఫలప్రదా వాసవీ వామజననీ వైకుంఠనిలయా వరా వ్యాసప్రియా వర్మధరా వాల్మీకిపరిసేవితా

శాకంభరీ శివా శాంతా శారదా శరణాగతిః శాతోదరీ శుభాచారా శుంభాసురవిమర్దినీ శోభావతీ శివాకారా శంకరార్ధశరీరిణీ శోణా శుభాశయా శుభ్రా శిరస్సంధానకారిణీ శరావతీ శరానందా శరత్‌ జ్యోత్స్నా శుభాననా శరభా శూలినీ శుద్ధశబరీ శుకవాహనా శ్రీమతీ శ్రీధరానందా (950) శ్రవణానందదాయినీ శర్వాణీ శర్వరీవంద్యా షడ్భాషా షడృతుప్రియా షడాధారస్థితా షణ్ముఖప్రియకారిణీ షడంగరూపా 

సుమతిః సురాసురనమస్కృతా సరస్వతీ సదాధారా సర్వమంగళకారిణీ సామగానప్రియా సూక్ష్మా సావిత్రీ సామసంభవా సర్వవాసా సదానందా సుస్తనీ సాగరాంబరా సర్వైశ్వర్యప్రియా సిద్ధిః సాధుబంధుపరాక్రమా సప్తర్షిమండలగతా సోమమండలవాసినీ సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా సర్వోత్తుంగా సంగహీనా సద్గుణా సకలేష్టదా సరఘా సూర్యతనయా సుకేశీ సోమసంహతిః

హిరణ్యవర్ణా హరిణీ హ్రీంకారీ హంసవాహినీ క్షౌమవస్త్రపరీతాంగీ క్షీరాబ్ధితనయా క్షమా

గాయత్రీ సావిత్రీ పార్వతీ సరస్వతీ వేదగర్భా వరారోహా (1000) శ్రీగాయత్రీ పరాంబికా

ఇతి సాహస్రకం నామ్నాం గాయత్య్రాశ్చైవ నారద ।
పుణ్యదం సర్వపాపఘ్నం మహాసంపత్తిదాయకమ్‌ ॥ 

నారదా! ఇది గాయత్రీదేవి నామసహస్రం. అత్యంత పుణ్యప్రదం. సర్వపాప నివారకం. మహాసంపత్ప్రదాయకం. వీటిని జపిస్తే గాయత్రీదేవి ఎంతగానో ఆనందిస్తుంది. అనుగ్రహించి అభీష్ట వరాలు కురిపిస్తుంది. 

అష్టమి తిథినాడు పఠిస్తే విశేషంగా ఫలిస్తుంది. జపం చేసుకుని పూజలూ హోమాలూ ధ్యానాలూ ముగించి ఈ వెయ్యి నామాలనూ పఠిస్తే చాలు భుక్తీ ముక్తీ లభిస్తాయి. ఇది అత్యంత గుహ్యమైన నామసహస్రం. ఎవరికిబడితే వారికి చెప్పెయ్యకూడదు. మంచి భక్తుడవునా కాదా, మంచి శిష్యుడవునా కాదా పరిశీలించి పరీక్షించి అప్పుడు ఉపదేశించాలి. 

భ్రష్టులైన సాధకులకూ బంధువులకూ అస్సలు చెప్పకూడదు. ఈ లిఖితప్రతి ఎవరి ఇంటిలో ఉంటే వారికింక భయమనేదే లేదు. అతిచంచల అనిపించుకునే లక్ష్మీదేవి వారి ఇంటిలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుంది. దరిద్రులకు ఇది నిధి వంటిది. 

ముముక్షువులకు ముక్తిరూపం. రోగార్తులకు దివ్యౌషధం. బంధితులకు బంధవిమోచకం. బ్రహ్మహత్యాది మహాపాపాలను సైతం నశింపజేస్తుంది. అంతేకాదు బ్రహ్మసాయుజ్యాన్ని అందిస్తుంది. ఇది సత్యం. సత్యం. తిరుగులేని నత్యం.

దీక్షా ప్రదానం





Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...