Sunday, August 16, 2026

Indraadi Devatalaku Devi Gunapatham - ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం

పూర్వకాలంలో మదోద్దతులై దైత్యులు దేవతలతో యుద్ధం చేశారు. అది నూరేళ్ళు సాగిన మహాయుద్ధం. మహావిస్మయ కారకం. నానాశస్త్ర ప్రహరణాన్వితం. నానామాయా విచిత్రితం. జగద్వినాశకరం. ఎట్టకేలకు పరాశక్తి కృపావిశేషంవల్ల దేవతలు జయించారు. దైత్యులు స్వర్గాన్నీ భూగోళాన్నీ విడిచి పాతాళానికి పారిపోయి తలదాచుకున్నారు. 

అప్పుడు దేవతలు అది అంతా తమ ప్రయోజకత్వమే అనుకుని పరాక్రమాలను పరస్పరం ప్రశంసించుకొన్నారు. మోహవిభ్రాంతిలోపడి చంకలు కొట్టుకుంటూ తమనుతాము తెగ పాగుడుకున్నారు.

మనకు జయం కలగక చస్తుందా! మన మహిమ అటువంటిది. మనం సర్వోత్తరులం. మహావీరులం. మనముందు దైత్యులు ఎక్కడ నిలుస్తారు. పామరులు, పిరికి పందలు, పరాక్రమహీనులు. మనమో - మహాయశస్వులం, తేజస్వులం, సృష్టిస్థితిలయకారకులం. దైత్యులు మనకొక లెఖ్ఖా!

ఇలా మోహం తలకెక్కి పరాశక్తి మహిమను పూర్తిగా మరిచిపోయి చిందులు తొక్కుతున్న దేవతలను చూసి జగదంబిక జాలిపడింది. కరుణిద్దామనిపించి యక్షరూపంలో అవతరించింది. ఆ రూపం - కోటిసూర్య ప్రతీకాశం. చంద్రకోటిసుశీతలం. విద్యుత్కోటి సమానాభం. హస్తపాదాదివర్జితం. ఎప్పుడూ ఎక్కడా విన్నది కాదు, కన్నదికాదు. ఆ రూపం ఆ తేజస్సు పరమసుందరంగా అద్భుతావహంగా ఉంది.

ఏమిటిది? ఏమిటిది? దైత్యుల దుశ్చేష్టకాదుగదా! ఏదో తెలియని మహామాయ కాదుగదా! దేవతలం - మనకే ఇంత విస్మయాన్ని కలిగిస్తున్నదే దీన్ని ఎవరు నిర్మించి ఇటు పంపి ఉంటారు చెప్మా!

దేవతలంతా గుమికూడి చర్చలు జరిపారు. ఆ రూపం దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వని అడగాలి. పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి. బలాబలాలు తేల్చుకోవాలి. అప్పుడు ప్రతిక్రియ చెయ్యాలి - అని ఒక వ్యూహం నిర్ణయించారు.

వెంటనే ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి పిలిచాడు. వహ్నీ! దేవతలకు నువ్వేకదా ముఖస్థానీయుడివి అంచేత నువ్వే వెళ్ళు. అదేమిటో తెలుసుకో - అని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవుడు త్వరత్వరగా వెళ్ళాడు.

ముందుగా ఆ యక్షరూపమే - నువ్వెవడవు అని అగ్నిని ప్రశ్నించింది. నీ శక్తి ఎంతో చెప్పమంది. నేను అగ్నిని. జాతవేదసుడను. అన్నింటినీ దహించివెయ్యగల శక్తి నన్ను నమ్మి నాలో ఉంది - అని అగ్నిదేవుడు బదులు పలికాడు. ఓహో! అలాగా! అయితే ఈ గడ్డిపరకను దహించు. నువ్వు ఉంది అని చెప్పుకుంటున్న శక్తి నీలో ఉందో లెదో చూస్తాను - అంటూ ఆ యక్షతేజోరూపం ఒక గడ్డిపరకను అగ్నిదేవుడి ముందుకి విసిరింది. 

వహ్నిదేవుడు ఎంతగానో ప్రయత్నించాడు. తన బలం అంతా కూడగట్టుకుని మరీ ప్రయత్నించాడు. కానీ ఎంతకీ ఆ గడ్డిపరకను ఏమీ చెయ్యలేకపోయాడు. సిగ్గుపడిపోయాడు. తనకేమయ్యింది ఇవ్వేళ? అంతుబట్టలేదు.

దేవతల దగ్గరికి పరుగుపెట్టాడు. దేవతలంతా ఒక్కసారిగా మీదపడ్డారు. ఎవరో ఏమిటో తెలుసుకువచ్చావా? అగ్నిదేవుడు సిగ్గుతో ముఖం దించుకున్నాడు. జరిగినదంతా చెప్పాడు. మన బతుకులు వట్టి బూటకాలు. వృధాభిమానంతో విర్రవీగుతున్నాం. ఛీ - ఛీ అని ముగించి తొలగిపోయాడు.

ఇంద్రుడికి పట్టుదల వచ్చింది. వాయుదేవుణ్ణి పిలిచాడు. జగత్తులో అంతటా నువ్వే నిండి ఉన్నావు. నీ కదలికలతోనే అన్నీ కదిలేది. నువ్వు ప్రాణరూపివి. ప్రాణికోటికి సర్వశక్తి విధాయకుడివి. నువ్వు వెళ్ళి తెలుసుకునిరా. నీకన్నా సమర్థుడెవడు? - అని గాలిదేవుడికి కాస్త గాలికొట్టి పంపించాడు. 

వాయుదేవుడు ఉబ్బిపోయాడు. మహావేగంగా వెళ్ళాడు. యక్షరూపం మళ్ళీ అదే ప్రశ్నవేసింది. నేను వాయువును. సర్వశక్తి సంపన్నుడను. దేనినైనా ఎగురగొట్టగలను. నావల్లనే ఈ జగత్తు బతుకుతోంది - అంటూ సగర్వంగా పలికాడు. అయితే ఈ గడ్డిపరక కదుపు - అంది యక్షరూపం. లేకపోతే తలదించుకుని నోరుమూసుకుని వచ్చినదారినే వచ్చినచోటుకే ఫో - అనికూడా అనేసింది.

వాయుదేవుడికి అభిమానం పొడుచుకు వచ్చింది. గట్టిగా ప్రయత్నించాడు. గడ్డిపరకను కదిలించలేకపోయాడు. శృంగభంగమయ్యింది. తలదించుకుని నోరుమూసుకుని పరుగుతీశాడు. ఇంద్రాదులకు వృత్తాంతం చెప్పాడు. ఇదేమిటో అస్సలు తెలియడం లేదు. మనం అసమర్దులం. మిథ్యాభిమానులం. అదేదో అలౌకిక యక్షతేజస్సు. పరమదారుణ తేజస్సు - అనేసి తానూ జారుకున్నాడు.

ఈసారి దేవతలంతా కలిసి ఇంద్రుణ్ణి ఎగద్రోశారు. నువ్వు దేవనాయకుడవు. యక్షుల్ని బాగా ఎరుగుదువు. కనక నువ్వే వెళ్ళు అంటే వెళ్ళు అన్నారు. సరే, తెలుసుకుని వస్తాను - అంటూ దేవేంద్రుడు సగర్వంగా బయలుదేరాడు. యక్షరూపాన్ని తరిమాడు. ఆ తేజోరూపం ఇంద్రుణ్ణి తరిమింది. చాలాదూరం తరుముకుంటూ వెళ్ళి చటుక్కున మాయమయ్యింది. 

మాటా మంతీ వినపడటం లేదు. ఇంద్రుడికి దిక్కుతోచలేదు. దారుణమైన అవమానమనిపించింది. తననే మాయ చేసిందా? కనుగప్పి పారిపోయిందా? దేవసభకు ఏ ముఖంపెట్టుకుని వెళ్ళను! ఏమి చెప్పను! దేవతలముందు ఎంత అవమానం! మహాత్ములకు అభిమానమే ధనమన్నారు. అది పోయాక బతికి ఏమి లాభం? చావుతో సమానం. కనక నాకిక మరణమే శరణం - అని నిశ్చయించుకుని ఆ పని చెయ్యబోయాడు.

సరిగ్గా అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. సహస్రాక్షా! మాయాబీజాక్షరం జపించు, సుఖపడతావు - అంది. వెంటనే అక్కడే తపస్సుకి కూర్చున్నాడు. కన్నులన్నీ మూసుకుని మాయాబీజాక్షరాన్ని లక్షసంవత్సరాలు నిరాహారుడై జపించాడు.

ఒక చైత్ర నవమినాడు సూర్యుడు నడినెత్తికి వచ్చినవేళ మళ్ళీ అదే యక్షరూపం అదే తేజఃపుంజం అదే ప్రదేశంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యింది. అయితే ఈసారి ఆ తేజోమండలానికి మధ్యలో నవయౌవనంలో ఉన్న కుమారీ రూపం కనిపించింది.

మహాదేవి ఆత్మావిష్కారం





No comments:

Post a Comment

Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...