Tuesday, August 4, 2026

devimahima - bruhadradhudi puurvajanma sruthi - దేవీమహిమ - బృహద్రథుడి పూర్వజన్మ సృతి

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - దేవీమహిమ - బృహద్రథుడి పూర్వజన్మ సృతి

నారదా! ఇక్కడ నీకొక కథ చెప్పాలి విను. పూర్వం హిమాలయపర్యతాల్లో ఒక చక్రవాకపక్షి ఉండేది. అది ఆకాశమార్గాన ఆయాదేశాలపై ఎగురుతూ వచ్చి వచ్చి కాశీపట్టణం చేరుకుంది. ప్రారబ్ధం బాగుండి అన్నపూర్ణాదేవి మందిరం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏవో పడిఉన్న మెతుకుల్ని ఏరుకు తినే మిషతో తనకు తెలియకుండానే ఆ మందిరానికి ప్రదక్షిణ చేసింది. ఆ తరవాత అక్కడినుంచి ఎగిరి ఎటో వెళ్ళిపోయింది.

కాలాంతరాన మరణించింది. సరాసరి స్వర్గం చేరుకుంది. దివ్యరూపం దరించి రెండు కల్పాలపాటు దివ్యభోగాలు అనుభవించింది. భూలోకంలో క్షత్రియవంశాన మగబిడ్డగా పునర్జన్మ పొందింది. బృహద్రథుడు అనే పేరుతో ఆ మగబిడ్డ ఎదిగి యువకుడై పట్టాభిషక్తుడయ్యాడు. 

అతడికి త్రికాలజ్ఞత సహజంగానే సిద్దించింది. యజ్ఞయాగాదులు చేస్తూ సత్యవాదిగా జితేంద్రియుడుగా ధార్మికుడుగా ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. అతి దుర్లభమైన పూర్వజన్మస్మృతి అతడికి ఉన్న విషయం ఎలాగో ప్రజలకు తెలిసి బాగా ప్రచారంలోకి వచ్చింది. 

మునీశ్వరులకు తెలిసింది. వారు ఆశ్చర్యచకితులై దర్శనార్థం వచ్చారు. బృహద్రథుడు భక్తిశ్రద్ధలతో అతిథిమర్యాదలు జరిపాడు. కుశలప్రశ్నలు అయ్యాక మునీశ్వరులు తాము వచ్చిన పని ఎమిటో చెప్పారు.

మహారాజా! నీకు పూర్వజన్మస్మృతి ఉంది. త్రికాలజ్ఞత ఉంది. ఏ పుణ్యవిశేషంతో నీకు ఈ శక్తులు లభించాయి? తెలుసుకుందామని వచ్చాం. కాకపోతే, చెప్పదగినదే అయితే తెలియపరిచి మమ్మల్ని ఆనందింపజెయ్యి.

మునీంద్రులారా! ఇందులో రహస్యమేమీలేదు. అంతా అమ్మవారి దయ. పూర్వజన్మలో నేను ఒక చక్రవాకపక్షిని. అల్పజీవిని. కాశీలో అన్నపూర్ణ మందిరానికి ప్రదక్షిణం చేశాను. తెలిసి చేసింది కాదు. అయినా అమోఘఫలం దక్కింది. ఆ పుణ్యవిశేషం వల్ల స్వర్గసుఖాలు రెండు కల్పాలపాటు అనుభవించాను. ఈ జన్మలో మహారాజునూ సార్వభౌముడనూ అయ్యాను.

పూర్వజన్మ స్మృతితోపాటు భూత భవిష్యద్వర్తమానాలను తెలుసుకునే శక్తి అబ్బింది. జగదంబిక పాదాలను స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి ఎంత ఫలం దక్కుతుందో ఎవరూ చెప్పలేరు, ఊహించలేరు. ఆ తల్లి మహిమను తలుచుకుంటే చాలు నాకు కళ్ళు చెమ్మగిల్లి ఆనందబాష్పాలు జాలువారతాయి. 

జగన్మాతను ఉపాసించనివారి జన్మలు వ్యర్థం. వారు తల్లిని మరిచిపోయిన కృతఘ్నులు. పాపాత్ములు. హరిహరోపాసనలు నిత్యవిధులు కావు. పరాదేవతోపాసన ఒక్కటే నిత్యమనీ సత్యమనీ శ్రుతి చెబుతోంది. మీవంటి జ్ఞానులకు నేను చెప్పేదేమిటి? భగవతి పాదాంభోజాలను నిరంతరం సేవించవలసిందే. ఇంతకన్నా ఈ జగత్తులో సేవించదగిన మరొక వస్తువు నిర్గుణంగానీ సగుణంగానీ ఏదీ లేదు.

బృహద్రథుడి సమాధానం మునిశ్వరుల సంశయాలను తీర్చింది. సంతృప్తులై ఆనందబాష్పాలు ఒత్తుకొంటూ తమతమ ఆశ్రమాలకు తిరిగివెళ్ళారు.

నారదా! ఇంతటి ప్రభావం కలది దేవీపూజ. దాని ఫలం ఎంత అని ఎవరైనా అడగగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరి జన్మ సఫలమో వారికి ఈ పూజపట్ల శ్రద్ధ కలుగుతుంది. ఎవరి జన్మ సంకరమో నిష్ఫలమో వారికి శ్రద్ధ కలగదు. శ్రద్ధ కలగడానికైనా నోచుకుని ఉండాలి.

మధ్యాహ్నసంధ్య




No comments:

Post a Comment

Brahmacharyam - బ్రహ్మచర్యం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - బ్రహ్మచర్యం అధఃశయానుడూ(నేలమీద పడుకునేవాడు). ధర్మాత్ముడూ జితేంద్రియుడూ వినయవంతుడూ మితాహారీ శాంతచిత్తుడూ నిత్...