వైదూర్యప్రాకారం గడిస్తే ఇంద్రనీలప్రాకారం. ఇదీ దశయోజనోత్తుంగమే. కక్ష్యలో మధ్యభాగమంతా ఇంద్రనీలమణిమయమే. ఇక్కడ తటాకంలో ఒక పద్మం ఉంటుంది. అది బహుయోజన విస్తృతం. షోడశారం(పదహారు రేకలుంటాయి). షోడశకోణాలతో ఇది సుదర్శన చక్రంలా ప్రకాశిస్తూంటుంది.
ఇందులో పదహారు శక్తులకూ పదహారు సౌధాలున్నాయి. అన్ని సౌకర్యాలతో అన్ని సౌందర్యాలతో అన్ని సమృద్దులతో తులతూగుతుంటాయి.
ఈ షోడశశక్తుల పేర్లు ఏమిటంటే - కరాళి, వికరాళి, ఉమ. సరస్వతి, శ్రీ, దుర్గ, ఉష, లక్ష్మి, శ్రుతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య.
వీరంతా నీలమేఘాల్లాగా ఉంటారు. కరవాలాలు ధరించి ఉంటారు. ఆఖేటక ధారిణులు (కూడా వేటకుక్కలుంటాయని), యుద్ధప్రియలు. వీరు జగన్మాతకు సేనానులు. ప్రతిబ్రహ్మాండశక్తులకు నాయికలు.
దేవీశక్తిని ఆవహింపజేసుకుని బ్రహ్మాండాలను క్షోభపెడుతుంటారు. నానా రథసమారూఢలు. నానాశక్తి సమన్వితలు. వీరి పరాక్రమం వర్ణించాలంటే ఆదిశేషుడైనా చాలడు.
అష్ట మంత్రిణులు
No comments:
Post a Comment