శౌనకాది మహామునులారా! మీరు గ్రహించవలసిన రహస్యం మరొకటి ఉంది. ఆదిలో ఈ దేవీభాగవతం సాక్షాత్తూ జగదంబికా ముఖపద్మంనుంచి అర్ధశ్లోకాత్మకంగా ఆవిర్భవించింది.
వేదసారంగా వటపత్రశాయికి ఉపదేశించింది. అటుపైని దాన్ని శతకోటి గ్రంథంగా విస్తరించాడు బ్రహ్మదేవుడు. దాని సారమంతా ఒకచోటికి చేర్చి పద్దెనిమిదివేల శ్లోకాలూ పన్నెండు స్కంధాలుగా సంగ్రహపరచి శుకుడికోసమని వ్యాసుడు ఉపదేశించాడు.
ఇదీ దీని చరిత్ర. అలనాటి ఆ శతకోటి విస్తర దేవీమహాభాగవతం నేటికీ దేవలోకాన బహుళప్రచారంలో ఉంది.
మహామునులారా! ఈ దేవీభాగవతంతో సాటివచ్చే మరొక పవిత్రగ్రంథం ఈ సృష్టిలోనే లేదు. ఇది సర్వపాపవినాశకం. ఏ పదాన్ని ఉచ్చరించినా అశ్వమేధఫలం దక్కుతుందంటే అది స్తవం కాని వాస్తవం. పౌరాణికుణ్ణి ఆహ్వానించి వస్త్రాద్యాభరణాలతో అర్చించి సంతుష్టిపరచి వ్యాసుడిగా సంభావించి అతడి నోటినుంచి ఏకాగ్రచిత్తంతో ఉపవాస దీక్షతో దీన్ని విన్నవారూ నిజహస్తాలతో లిఖించినవారూ పఠించినవారూ లిఖింపజేసినవారూ సర్వకిల్బిషవిముక్తులై సుఖశాంతులతో భోగభాగ్యాలతో సకలసమృద్దులతో నిండు నూరేళ్ళు జీవించి కట్టకడపట మణిద్వీపం చేరుకుంటారు. తరతరాలనూ తరింపజేస్తారు.
మహామునులారా! ఈ దేవీభాగవతంతో సాటివచ్చే మరొక పవిత్రగ్రంథం ఈ సృష్టిలోనే లేదు. ఇది సర్వపాపవినాశకం. ఏ పదాన్ని ఉచ్చరించినా అశ్వమేధఫలం దక్కుతుందంటే అది స్తవం కాని వాస్తవం. పౌరాణికుణ్ణి ఆహ్వానించి వస్త్రాద్యాభరణాలతో అర్చించి సంతుష్టిపరచి వ్యాసుడిగా సంభావించి అతడి నోటినుంచి ఏకాగ్రచిత్తంతో ఉపవాస దీక్షతో దీన్ని విన్నవారూ నిజహస్తాలతో లిఖించినవారూ పఠించినవారూ లిఖింపజేసినవారూ సర్వకిల్బిషవిముక్తులై సుఖశాంతులతో భోగభాగ్యాలతో సకలసమృద్దులతో నిండు నూరేళ్ళు జీవించి కట్టకడపట మణిద్వీపం చేరుకుంటారు. తరతరాలనూ తరింపజేస్తారు.
పురాణ శ్రవణం పూర్తయ్యాక ప్రౌష్టపదీ పూర్ణిమనాడు పౌరాణికుణ్ణి సత్కరించాలి. బంగారంతో సింహప్రతిమ తయారుచేయించి ఇవ్వాలి. దక్షిణగా కపిలగోవును(పాడిఆవును) దూడతోసహా సమర్పించాలి. బంగారు గొలుసుతో అలంకరించి మరీ ఇవ్వాలి. అధ్యాయసంఖ్యకు సమానంగా బ్రాహ్మణులకు సంతర్పణ చెయ్యాలి.
అంతేసంఖ్యలో సువాసినుల్నీ కుమారీముణుల్నీ వటువుల్నీ అర్చించాలి. దేవీబుద్దితో వీరిని వస్త్రాభరణ పుష్పమాలికలతో పూజించాలి. పాయసాన్నాలు పెట్టాలి. ఈ పురాణగ్రంథాన్ని ఎవరికి దానం చేసినా భూదానఫలం దక్కుతుంది. ఇహలోకంలో సుఖంగా జీవించి అంతంలో దేవీపట్టణం చేరుకుంటారు.
నిత్యమూ దేవీభాగవతాన్ని. పఠించేవారికీ వినేవారికీ ఎప్పుడూ ఎక్కడా అసాధ్యమంటూ ఎదీ ఉండదు. పరాజయం అనే మాటకూడా వినిపించదు. అపుత్రకులకు సంతానప్రాప్తి, నిర్ధనులకు ధనలాభం, విద్యార్థులకు విద్యాలబ్దితోపాటు కీర్తి - కలుగుతాయి.
వంధ్యగానీ కాకవంధ్యగానీ మృతవంధ్యగానీ వింటే ఆ దోషాలు తొలగిపోతాయి. ఇంటిలో నిత్యమూ ఈ గ్రంథాన్ని పూజిస్తే చాలు లక్ష్మీదేవి ఇక ఆ ఇంటిని విడిచి పెట్టదు. బేతాళ డాకినీ రాక్షసాదులు అటువైపు తొంగిచూడటానికి సైతం భయపడతారు. జ్వరంతో బాధపడేవారిని స్పృశించి ఈ పురాణాన్ని మండలంరోజులు పఠిస్తే జ్వరముపశమిస్తుంది.
నూరుసార్లు పఠిస్తే క్షయరోగం నశిస్తుంది. ఒక్కొక్క అధ్యాయంగా సంధ్యాసమయంలో పారాయణచేసిన వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. శరన్నవరాత్రుల్తా పఠిస్తే జగదంబిక సంతోషించి కోరినదానికన్నా వెయ్యి రెట్టుగా వరాలు కురిపిస్తుంది.
శైవులు పఠిస్తే పార్వతి, వైష్ణవులు పారాయణచేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తారు. సౌరమతంవారూ గాణపత్యులూ ఎవరు పఠించినా వారి ఇష్టదేవత ఆనందిస్తుంది. వైదికులు గాయత్రీదేవి ప్రీతికోసం తప్పకుండా దీన్ని పఠించాలి. ఎవరు ఏ ఉపాసన చేసినా అది శక్తి ఊపాసనమే అవుతుంది.
కనక ఆ శక్తి సంతుష్టికోసం ఈ భాగవతాన్ని పారాయణ చెయ్యవలసిందే. చదువురానివారూ చదవలేనివారూ చదవరానివారూ పురాణశ్రవణం చేస్తే చాలు. వారికీ అంతపుణ్యమూ లభిస్తుంది. ఇది నిర్ణయం. ఇది నిశ్చయం. ఇది నిస్సందేహం.
శౌనకాది మహామునులారా! ఊరికే వెయ్యిమాటలు ఎందుకుగాని సారాంశమేమిటంటే - ఇది వేదసారం. వేదపఠన సదృశం. వేదశ్రవణ సమానం. సచ్చిదానందరూప గాయత్రీప్రతిపాదిత హ్రీమయి ఆ మహాదేవి మనకు సద్బుద్దివైభవాన్ని ప్రసాదించుగాక!
సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితామ్ ।
నమామి హ్రీమ్మయీం దేవీం ధియో నః ప్రచోదయాత్ ॥
సూతమహర్షి కన్నులు ముకుళించి దేవిని ధ్యానిన్తూ నమస్కరించాడు. నైమిశారణ్యవాసులు శౌనకాది మహామునులు ఆనంద పారవశ్యంనుంచి మెల్లగా తేరుకున్నారు.
సూతమహర్షిని శ్రద్ధాభక్తులతో ఘనంగా సత్కరించారు. అందరూ ప్రసన్న హృదయులయ్యారు. దేవీపాదాంబుజార్బకులయ్యారు. ఈ పురాణ శ్రవణ ప్రభావంతో అందరూ పరనిర్వృతిని (బ్రహ్మానందాన్ని) పాందారు. అడ్డదిడ్డంగా ఏవేవో ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టామో శ్రమపెట్టామో క్షమించమంటూ సూతుణ్ణి బతిమాలుకున్నారు. లెంపలు వేసుకుంటూ మళ్ళీమళ్ళీ నమస్కరించారు.
సంసారసముద్రాన్ని దాటించేందుకు మాపాలిటి నావవు నువ్వేనని మ్రొక్కారు.
అంబాచరణకమలభృంగాయమాణుడు సూతుడు సంతోషించి. అందరినీ ఆశీర్వదించి పునరాగమనాయ చ అని వీడ్కోలు తీసుకుని బయలుదేరాడు.
శ్రీదేవీభాగవతం సంపూర్ణం
No comments:
Post a Comment