Wednesday, August 19, 2026

Chintamani Gruham - Srimatha - చింతామణి గృహం - శ్రీమాత

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - చింతామణి గృహం - శ్రీమాత

జనమేజయా! అదే దేవీసదనం. వేయిస్తంభాల మండపాలు నాలుగు ఉంటాయి. శృంగారమండపం - ముక్తిమండపం - జ్ఞానమండపం - ఏకాంతమండపం అని వరసగా వాటిపేర్లు. 

ఆనేక వితాన సంయుక్తాలు(మేల్కట్టులు). అనేక ధూప పరిధూపితాలు. కాంతిలో కోటిసూర్యసమానాలు. ఆ శుభమండ పాలకు చుట్టూ కాశ్మీరవనం. మల్లికావనం. కుందవనం. వాటిలో అసంఖ్యాక కస్తూరిమృగాలు మృగమదాన్ని స్రవిస్తూ ఉంటాయి. 

ఆక్కడే ఒక పెద్ద సరోవరం ఉంది. అది సుధారసపూర్ణం. దానికి రత్ననిర్మిత సోపానపంక్తి. అందులో మహాపద్మవనం. పద్మాల పై ముసురుకొనే గండుతుమ్మెదలు. వాటి ఝంకారాలు. హంసకారండవాది జలపక్షి బృందాలు. వాటి కలకూజితాలు. దిక్తటాలకు వ్యాపించే సుమధుర పద్మపరిమళం. ఈ వనాల పరిమళంలో మణిద్వీపమంతా ఘుమఘుమలాడుతూ ఉంటుంది.

శృంగారమండపంలో జగదంబిక వివిధ సంగీత గానాలు ఆలకిస్తూంటుంది. ముక్తిమండపంలో తపస్వులకూ దేవీ ఆరాధన తత్పరులకూ యోగులకూ ముక్తి ప్రసాదిస్తూంటుంది. మూడవ మండపంలో జ్ఞానోపదేశాలు చేస్తుంటుంది. నాల్గవ ఏకాంత మండపంలో మంత్రిణులతో కలిసి నిత్యమూ జగద్రక్షణ గురించి సమాలోచనలు జరుపుతూంటుంది.

జనమేజయా! చింతామణి గృహంలో పది సోపానాలతో ఒక మంచకం ఉంది. శక్తితత్త్వాలు పదీ - పది సోపానాలు. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు నల్గురూ దానికి ఖురాలు(కోళ్ళు). ఫలకమేమో సదాశివుడు. దానిమీద భువనేశ్వరుడు మహాదేవుడు విరాజిల్లు తుంటాడు. మహాదేవియే విలాసార్థం ద్విధాభూత(రెండుగా) అయ్యిందని తెలునుగదా! 

సృష్టికి ఆదిలో ఇతడే తదర్ధాంగ మహేశ్వరుడు. కందర్ప దర్పనాశకుడు. కోటి కందర్ప సుందరుడు. పంచవక్త్రుడు. త్రినేత్రుడు. మణిభూషణ భూషితుడు. పరశు - హరిణ - వరద - అభయహస్తుడు. పదహారేళ్ళ పడుచువాడు. మహాసర్వేశ్వరుడు. కోటి సూర్యప్రతీకాశుడు. కోటిచంద్ర సుశీతలుడు. శుద్ధస్పటిక సంకాశుడు. ఈ భువనేశ్వరుడి వామాంకంలో కూర్చుని ఉంటుంది శ్రీ భువనేశ్వరి.

నవవిధ రత్నాలు పొదిగిన కాంచీదామం(వడ్డాణం). మేలిమిబంగారంలో వైదూర్యాలు తాపించిన అంగదాలు. శ్రీచక్రరూపంలో ఉండే తాటంకాలు. వాటి తళతళలతో మెరిసిపోతున్న ముఖపద్మం. అర్జచంద్రరేఖను జయించే నెన్నొసలు. దొండపండుల్లాంటి పెదవులు. కస్తూరీకుంకుమతిలకాలు దిద్దుకున్న ఫాలభాగం. శిరస్సున సూర్యచంద్రుల్ని తనలో ఇముడ్చుకునే దివ్య చూడామణి. ఉదయభానుబింబంలాంటి నాసాభరణం(ముక్కుపుడక). మేలిముత్యాలు వేలాడుతున్న చింతాకపతకం. చందనం కర్పూరం కుంకుమలు కలిపి ఒత్తుగా అద్దుకున్న స్తనమండలం.

విచిత్ర వివిధ భూషణాలు ఎన్నో ధరించి విరాజిల్లుతూంటుంది. శంఖంలాంటి మెడ. దానిమ్మగింజల్లాంటి పలువరుస. అనర్ఘమణులు పొదిగిన కిరీటం ధరించిన శిరస్సు. మదించిన తుమ్మెదలు(వంటి) కదలాడుతున్న ముంగురులతో మురువైన ముఖపద్మం.

ఏనాడూ క్షీణించని - మచ్చలేని చందమామలాంటి ముఖం. జాహ్నవీజలావర్తం(నీటిసుడి) వంటి పొక్కిలి. మాణిక్య శకలాలు పొదిగిన ఉంగరాలు అన్నివేళ్ళకూ. పద్మపత్రాలలాగా ముచ్చటైన మూడుకన్నులు. పద్మరాగమణులకు మరింత మహారాగాన్ని కల్పిస్తే జగదీశ్వరీశరీర కాంతికి సాటిరావచ్చు.

చేతులకు రత్నకంకణాలు. వాటికి రత్నకింకిణులు(చిరుమువ్వలు). మెడలో ముత్యాలదండలు. మణిహారాలు. వాటికి అందాల పతకాలు. రత్నాంగుళీయకాల కాంతులతో రత్నకంకణాల ప్రభలతో ధగధగలాడుతున్న చేతులు. 

అమ్మవారు ధరించిన కంచెలకు (రవిక) రత్నాల బుటాలు. మల్లికా పరిమళాలను సహజంగానే గుబాళించే కేశపాశం. అందులో తురిమిన మళల్లెచెండ్లు. వాటికోసం మూగుతున్న తేటిపిండ్లు (తుమ్మెదగుంపులు).

సువృత్త నిబిడోత్తుంగ కుచభారాలస - ఆ శివ. పాశాంకుశవరదాభయ హస్తచతుష్టయవిరాజిత - ఆ సురపూజిత. సర్వశృంగారవేషాఢ్య. సుకుమారాంగవల్లరి. సౌందర్యధారాసర్వస్వ. అనిర్వ్యాజ కరుణామయి. నిజసల్లాపమాధుర్య తిరస్కృతకచ్చపి, కోటీందు కోటీనకాంతిమయి. సఖీజన - దాసీజన - దేవాంగనా - దేవతాబ్బంద పరివేష్టిత.

ఇచ్చా జ్ఞానక్రియా శక్తిత్రయ సమన్విత. లజ్జ - తుష్టి - పుష్టి - కీర్తి - కాంతి - క్షమ - దయ - బుద్ధి - మేధ - స్మృతి - లక్ష్మి - వీరు అక్కడుండే దేవాంగనలు. జయ - విజయ - అజిత - అపరాభిత - నిత్య - విలాసిని - దోగ్ద్రి - అఘోర - మంగళ - ఈ తొమ్మిదిమంది పీఠశక్తులూ పరాంబికను సేవిస్తుంటారు.

పరమేశ్వరికి పార్శ్వభాగంలో శంఖ - పద్మనిధులు రెండు ఉంటాయి. వాటినుంచి నవరత్నవాహిని కాంచనవాహిని సప్తధాతువాహిని అనే నదులు వెలువడుతుంటాయి. ఇవి సుధాసముద్రంవరకూ ప్రవహించి అందులో లీనమవుతాయి.

భువనేశ్వరీదేవి తన వామాంకభాగాన విరాజిల్లుతోంది. కాబట్టే మహేశుడికి సర్వేశత్వం సిద్ధిస్తోంది. జనమేజయా! ఆ చింతామణిగృహం సహస్రయోజన విస్తీర్ణం. దీనికి ఉత్తరంగా ఉన్న శాలలు ఒకదానికంటే ఒకటి రెట్టింపు. ఇది నిరాధారంగా అంతరిక్షంలో వెలుగొందుతూంటుంది. 

మహాప్రళయంలోగాని పునస్సృష్టిలోగానీ అవసరాన్నిబట్టి ఇది సంకోచ - వికాసాలు (పటవత్‌) నిత్యం పొందుతూ ఉంటుంది. మహోమయి మహాదేవి నివసిస్తోంది కనక శాలలన్నింటిలోకీ ఈ చింతామణి గృహమే కాంతిపరమావధి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ - నాగ - మనుష్యజాతుల దేవీ ఉపాసకులందరూ చేరేది ఇక్కడికే.

దేవక్షేత్రంలో ప్రాణాలు విడిచిన వారికీ దేవీ నిరంతరార్చన తత్పరులకూ గమ్యం ఇదే. ఇక్కడ దేవి మహోత్సవస్వరూపిణి. ఘృత - దుగ్ధ - దధి - మధుకుల్యలేకాక ద్రాక్షారస - జంబూరస - ఆమ్రరస - ఇక్షురస జీవనదులు వేలసంఖ్యలో ప్రవహిస్తుంటాయక్కడ. కోరుకున్న ఫలాలను ఇచ్చే (కోరికలను ఫలింపజేసే) వృక్షాలూ వాపీకూపతటాకాలూ కోకొల్లలు. 

అన్నీ ఇష్టపాన ఫలప్రదాలే. ఏదీ తక్కువది కాదు. అక్కడ నివసించేవారికి రోగాలుగానీ జుట్టునెరిసే ముసలితనంగానీ ఏనాటికీ రావు. చింతలులేని కామక్రోధమాత్సర్యాలు లేని జీవితాలు. అందరూ యౌవనులే. స్త్రీ సహితులే. సహస్రాదిత్య వర్చసులే. శ్రీభువనేశ్వరిని సతతమూ భజిస్తూ ఉంటారు. 

వారిలో కొందరు సాలోక్యం పొందితే, కొందరు సామీప్యాన్నీ, కొందరు సారూప్యాన్నీ, కొందరు సాన్నిధ్యాన్నీ పొందుతున్నారు. ప్రతిబ్రహ్మాండంలోనూ ఉండే దేవతలందరూ సమష్టి రూపాలలో వచ్చి అమ్మవారికి సేవలు చేస్తుంటారు. సప్తకోటి మహామంత్రాలూ సకలమహావిద్యలూ రూపుదాల్చి వచ్చి ఆ సామ్యావస్థాత్మికను ఆ శివను ఆ కారణ బ్రహ్మరూపను ఆ మాయాశబల విగ్రహను నిరంతరం ఉపాసిస్తూ ఉంటాయి.

మహారాజా! మహత్తరమైన మణిద్వీపాన్ని వర్ణించి చెప్పాను. అది కాంతిమయం. కోటి సూర్యచంద్రులుగానీ కోటి మెరుపులుగానీ, కోటి ఆగ్నులుగానీ దాని కాంతిలో కోట్యంశంలో కోట్యంశానికైనా సాటిరావు.

ఒక్కొక్కసారి అది విద్రుమ సంకాశం. ఒక్కొక్కసారి మరకతచ్చవిమంతం. ఒక్కొక్కసారి విద్యుద్భాను సమచ్చాయం. ఒక్కొక్కసారి మధ్యందిన మార్తాండననిభం. ఒక్కొక్కసారి విద్యుక్కోటి మహాధారాసారకాంతితతం. ఒక్కొక్కసారి సిందూరనీలేంద్రం. ఒక్కొక్కసారి మాణిక్య సదృశచ్చని. 

హీరసార మహాగర్భ ధగద్ధగితదిక్తటం.. దావానలసమం. తప్తకాంచనసన్నిభం. చంద్రకాంతమణి కాంతితుల్యం. సూర్యోద్గారసమం. దాని శృంగాలూ ప్రాకారగోపురాలూ(బురుజులు) రత్నమయాలు. అక్కడి చెట్లకు రత్నపత్రాలు, రత్నఫలాలు. నర్తించే మయూరాలు. మణితధ్వనులు చేసే పావురాలు. కాకలీస్వరాలు వినిపించే కోకిలలు. శుకాలాపాలు - మారుమ్రోగుతుంటాయి. 

తేటనీటితో నిండిన సరోవరాలు. వాటిలో వికసించే రత్నపంకజాలు. శతయోజనాలకు వ్యాపించే సుగంధాలు. మందమారుతానికి కదలాడుతున్న చెట్లు - ఇవన్నీ ఆ మణిద్వీపంలో పంచేద్రియతర్పణం చేస్తాయి. చింతామణి గృహకాంతులు నిండిన ఆకాశం. రత్నకాంతులతో ధగధగలాడుతున్న దిగంతాలు. వృక్షలతాకుసుమగంధ పరిపూరితం. ధూపధూపితం. 

రాజా! ఇదీ మహోజ్ఞ్యలమణిద్వీపం. అక్కడున్న మందిరాలలోని నిలువుటద్దాలలో పరావర్తనం చెంది కిటికీలనుంచి(సోరణగండ్లు) వెలువడుతున్న కాంతిపుంజాలతో దశదిశలనూ సమ్మోహపరుస్తూంటుంది.

అది ఐశ్వర్యానికి పరకోటి. శృంగారానికి పరాకాష్ఠ. సర్వజ్ఞతకు పరమావధి. తేజస్సుకి పరసీమ. పరాక్రమానికి చివరిమాట. సర్వోత్తమగుణానికి తుదిపలుకు. దయాగుణానికి చివరిపలుకు. బ్రహ్మలోకాంతంవరకూ ఉండే ఆనందాలన్నీ ఇక్కడే అంతర్భవిస్తూంటాయి. అది ఆనందానుభవానికి చివరిమెట్టు..

జనమేజయా! ఇది మహత్తరమైన మణిద్వీప వర్ణన. మహాదేవికి పరంస్థానం. సర్వలోకోత్తమోత్తమం. దీన్ని స్మరిస్తేచాలు పాపాలు నశిస్తాయి. అవసాన సమయంలో గుర్తు చేసుకోగలిగినవారు అక్కడికే చేరుకుంటారు.

ఈ అయిదు అధ్యాయాలనూ సమాహిత చిత్తంతో నిత్యమూ పఠించేవారికి భూతప్రేతపిశాచాది బాధలు ఉండనే ఉండవు. నూతన గృహనిర్మాణ సమయంలో వాస్తుయజ్ఞంలో దీన్ని తప్పక పారాయణ చెయ్యాలి. సకల శుభాలూ కలుగుతాయి. 

జనమేజయుడికి మనశ్శాంతి





No comments:

Post a Comment

Srikrishnudu Kuberabhatundagu Shankhachuudundanu Guhyakuni Samharinchuta - శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  శ్రీకృష్ణు౦డు కుబేరభటుండగు శంఖచూడుండను గుహ్యకుని సంహరించుట మరొక వెన్నెలరాత్రి బలరామకృష్ణులు ప్రకా...