శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీకృష్ణమూర్తినందుని వరుణనగరమునుండి కొనితెచ్చుట నందగోపుడు ఏకాదశినాడు ఉపవాసవ్రతం చేసి, శ్రీహరిపూజచేసి, రాక్షసులు సంచరించేవేళ అని తెలియక, వేకువజాము కాకముందే ద్వాదశీస్నానం చేయడానికి యమునానదినీటిలో ప్రవేశించాడు. అప్పుడు వరుణునిదూత నందుణ్ణి వరుణనగరానికి కొనిపోయాడు. తక్కిన గోపకులు నందగోపుడు కనబడనందున కలతచెంది, బలరామకృష్ణులను పేర్లతో పిలుస్తూ శబ్దాలు చేశారు. ఈశ్వరుడైన కృష్ణుడు తన తండ్రిని మోసంతో వరుణదూత తీసుకొనిపోయి వరుణుని దగ్గర చేర్చడం తెలుసుకొని, వెంటనే వరుణుని నగరానికి వెళ్ళాడు.
(సాయంసంధ్యలు పొద్దుకుంకే సమయాన్ని 'అసురసంధ్య' అంటారు. అలాగే వేకువజాముకు ముందు అసురులు సంచరించే వేళ అంటారు. ఆ సమయాల్లో ఏ శుభకార్యమూ చేయరు.)
ఇలా వచ్చిన శ్రీకృష్ణునిచూచి వడివడిగా శ్రీకృష్ణుణ్ణి పూజించి వినమ్రుడై, ఓ దేవా! నా యింటికి విచ్చేశావు అని ఆప్యాయంగా పలికాడు.
మాధవా! ఎన్నడూ, ఎవరూ పొందశక్యంగాని పెనుత్రోవలో ఏ విభుని పాదపద్మాలను ఆసక్తితో ధ్యానించేవారు నడుస్తారో, అలాంటి భక్తులకు సంతోషం ప్రసాదించే స్వామివి నీవు. నీవు రావడంవల్ల నా మనసు పరమానందంతో నిండి పోయింది. నా కోరికలు ఫలించాయి. నీ సేవలో నా శరీరం పావనమైంది.
(ఆనందం పొందేవి రెండు. అటు శరీరం ఇటు మనసు. ఇవి రెండూ సంతోషం పొందాయి అంటే వరుణుడు స్వామిదర్శనంతో ధన్యుడయినట్లే!)
ఈ జగాలన్నిటినీ కప్పినమాయ ఏ పరమేశుడవైన నిన్ను కప్పలేక నీకు దాస్యం చేస్తూ ఉంటుందో, అలాంటి మహాత్మా! సుజనులను రక్షించేవాడివి, దేదీప్యమానశుభమూర్తివి, సుజన రక్షకుండవు, తపస్సే ధనంగా గలిగినవారికి చక్రవర్తివి అయిన నీకు నా శరీరతాపం తొలగించుకోవడానికి వందనాలు సమర్పిస్తున్నాను.
ఓ జనక వత్సలా! నిర్మల భక్తవత్సలా! ఈ నా భటుడు కొంతైనా మనసులో వివేకంలేనివాడై, నీ తండ్రిని వరుణలోకానికి తీసుకొని వచ్చాడు. నీ తండ్రిని దయతో తీసుకొని పొమ్ము! వీడు చేసినద్రోహాన్ని మరచిపొండి! నన్నూ ఈ భటుణ్ణి మన్నించండి. నీ క్షమాగుణంవల్లనే నేను బతికిపోతాను.
ఇలా పలుకుతూ ఉన్న వరుణుణ్ణి శ్రీకృష్ణుడు కరుణించాడు. ఆయన తనతండ్రి అయిన నందుణ్ణి తోడుకొని గోకులానికి తిరిగివచ్చాడు. అప్పుడు నందరాజు కృష్ణుడు తనను వరుణపురంనుండి విడిపించుకొని తీసుకొనివచ్చిన విషయాన్ని సమగ్రంగా బంధువులకు వర్ణించి చెప్పాడు. బంధువులు శ్రీకృష్ణుణి సాక్షాత్తూ పరమాత్ముడు అని భావించారు. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు కూడా తన బంధువుల భావాన్ని గ్రహించాడు. వారి కోరికను నెరవేర్చడానికి యమునానదిలో ఓ మడుగైన బ్రహ్మకుండంలో ముంచెతాడు.
ప్రకృతి సంబంధమైన కామకర్మలలో పరవశం పొందుతూ, ఉత్తమ అధమ స్థితులకు లోనవుతూ, భ్రాంతిలో జీవిస్తున్న ఈ జనం ఇహలోకంలో అసాధారణమైన నా నిజస్థితి విశేషాలను తెలుసుకోలేకుండా ఉన్నారు - అని కృష్ణుడు తలంచాడు.
అని ఇలా ఆలోచించినవాడైన శ్రీకృష్ణుడు దయాస్వభావంగలవాడై వ్రేపల్లెవాసులకు మాయకులో పడనిదీ, తేజోరూపమైందీ, నిరూపించవీలుగానిదీ, సత్యమైందీ, జ్ఞానస్వరూపమైందీ, ఆనందమయమైందీ, అంతటానిండినదీ, పాపరహితులు గణాతీతస్థితిని పొందిన తరువాత పొందేదీ, స్వామివారికీ ఆత్మీయమైందిగా ఉండేది అయిన శాశ్వతమైన తన లోకాన్ని చూపించాడు.
ఈ విధంగా శ్రీకృష్ణుడు - ముందు అక్రూరుడు పొందిన పుణ్యలోకాన్ని పూర్తిగా చూపి, బ్రహ్మలోకాన్ని గూడా నందాదులకు కనిపింపజేశాడు. వారు ఆనందించి ఆశ్చర్యపడుతూ పరమాత్మ స్వరూపుడైన శ్రీకృష్ణమూర్తిని స్తోత్రం చేస్తూ పూజించారు. ఆ తర్వాత
ఆ సమయంలో శరదృతువు వచ్చింది. శరద్రాత్రులు కలువలకు మేలుగలిగే సమయాలుగా, మన్మథుడికి యుద్ధస్థానాలుగా, విరహాలకు తలలు వాల్చిన వేళలుగా, చక్రవాకపక్షులకు రతిసమయాలుగా, యువతులు విషయాలలో చిక్కుకొనే వేళలుగా, శరత్చంద్రుని దట్టమైన వెన్నెలలో దిక్కులు ప్రకాశించేవిగా, జారులకు దుర్దశలుగా అయ్యాయి.
శరదృతువులోని పున్నమిరాత్రి నిండుచంద్రుడు కలిగిందై ఆ మన్మథశాస్త్రానికి వ్యాఖ్యానంగా, కలువపూలకు వికాసం ఇచ్చేదిగా, మన్మథుని విజృంభణం కలిగిందిగా, జారుల నిబ్బరాన్ని పోగొట్టెదిగా, భయపడిన చక్రవాకాలు కలిగిందిగా, అందరికీ ప్రీతిని గలిగించేదిగా వచ్చింది.
ఓ పరీక్షిన్మహారాజా! భర్త తన భార్యముఖంమీద కుంకుమపూత పూసినట్లుగా చంద్రుడు తన ఉదయవేళలోని ఒప్పిదమైన కిరణాల ఎరుపుదనంతో తూర్పుదిక్కు అనే స్త్రీ యొక్క ముఖాన్ని రంజింపజేశాడు.
ఆ సమయంలో మన్మథుడు విటులసేనపైన దండెత్తడానికి సిద్ధంచేసుకొన్న గుడారం మీద మెరిసే బంగారుకలశమో అన్నట్లుగా నునుపై - ఆ మన్మథుడు కాముకులయొక్క ధైర్యం అనే తీగను తెగగొట్టడానికి ఎత్తిన విష్ణుచక్రమో అన్నట్లుగా గుండ్రనిదై - ఆ మదనుడు బాటసారుల ప్రణయకోపాలను కాల్చడానికి ప్రోగుచేసిన నిప్పుల కుప్పో అన్నట్లుగా ఎర్రనిదై - ఆ పంచబాణుడు విరహిణులు అనే మృగాలను వేటాడడానికి తనవెంట తెచ్చుకొన్న మోహపుదీపమో అన్నట్లుగా కాంతిగలదై, చకోరాలు సంతసించగా, ఆకాశమండలంలో, ఉదయ పర్వతం చెంత పున్నమినాటి చంద్రబింబం ఉదయించింది.
శరద్రాత్రి గాన మొనర్చు కృష్ణు సన్నిధికి గోపికలు వచ్చుట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment