సంధ్యావిధానం సమగ్రంగా తెలియజేశాను. ద్విజులందరూ ప్రాతఃకాలంలో తప్పనిసరిగా ఆచరించాలి. ఇది అయ్యాక స్వయంగా అగ్నిహోత్రం(అగ్నికార్యం) చేసుకోవాలి. అటు పైని పంచాయతన పూజ. శివ శివా గణపతి సూర్య విష్ణు పూజలు. (పురుషకృత) శ్లోకాలతోగానీ అపౌరుషేయ మంత్రాలతోగానీ(వ్యాహృతులు) ఈ పంచాయతనపూజ చేసుకోవచ్చు. హ్రీశ్చతే ఇత్యాదికమైన మూలమంత్రాలు ఉన్నాయి. వాటితోనూ చెయ్యవచ్చు. ఎవరి ఆచారాన్నిబట్టివారు చేసుకోవాలి. పార్వతీదేవిని మధ్యలోఉంచి, ఈశాన్యంలో శ్రీమహావిష్ణువునుంచి, ఆగ్నేయంలో శివుణ్ణి ఉంచి, నైరృతిదిశలో గణపతిని నిల్పి, వాయవ్యంలో సూర్యుణ్ణి నిల్పి - పంచాయతన పూజ చెయ్యాలి. ముందుగా పార్వతీదేవిని అర్చించి తరవాత తక్కిన దేవతలకు పూజలు చెయ్యాలనేది క్రమం. షోడశమంత్రాలతో షోడశోపచారాలు అందరికీ చెయ్యాలి. విష్ణుమూర్తిని అక్షతలతోనూ, గణేశ్వరుణ్ణి తులసితోనూ, దుర్గామాతను గరికపోచలతోనూ(దూర్వా) శివుణ్ణి మొగలి పువ్వులతోనూ అర్చించకూడదంటారు.
మల్లికా - జాతి - కుటజ - పనస - కింశుక - వకుళ - కుంద - లోధ్ర - కరవీరక - శింశుపా - అపరాజిత - బంధూక - అగస్త్య - మదంత - సింధువార - పలాశ - దూర్వాంకుర - బిల్వదళ - కుశమంజరికా - శల్లకీ - మాధవి - అర్క - మందార - కేతకి - కర్ణికార - కదంబ - పున్నాగ - చంపక - యూథికా - తగర ప్రముఖ పత్రపుష్పాలు జగదీశ్వరికి అత్యంతప్రీతికరాలు. గుగ్గులంతో ధూపమూ నువ్వులనూనెతో దీపమూ అమ్మవారికి ఇష్టం. వీటితో పూజించి మూలమంత్రం జపించి అటు పైని విప్రుడు వేదాభ్యాసం చెయ్యాలి. ఇక అప్పటినుంచీ కుటుంబ పోషణకు అవసరమైన పనులు చేసుకోవాలి. తృతీయ దినభాగాన్నంతటినీ వీటికి ఉపయోగించుకోవచ్చు.
No comments:
Post a Comment