Saturday, August 29, 2026

Sruti Geethalu - శ్రుతి గీతలు

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - శ్రుతి గీతలు

జనక శ్రుతదేవులకథ ముగించిన శుకునితో శ్రోత అయిన పరీక్షిత్తు మళ్లీ ప్రశ్నించాడు. “అయ్యా! ఘటపటాది వస్తు జాతానికి ఎలా ఉంటాయో అలా బ్రహ్మతత్త్వానికి సత్త్వరజస్తమోగుణాలు, రూపం, కార్యకారణబంధం ఉండదుగదా! అలాంటి వస్తుజాతతత్త్వాన్ని వర్ణించే స
త్త్వాదిగుణాలకు లోబడిన వేదాలు భగవత్తత్వాన్ని ఎలా నిర్వచించగలవు?” ఈ సందేహాన్ని నివృత్తి చేయుము అన్నాడు. 

అపుడు పరీక్షిత్తుతో శుకుడు ఇలా చెప్పాడు. "చేతనపదార్దాలు, చైతన్యరహిత వస్తువులు అన్నిటిలో ఉన్న ఈశ్వరుడు 'సర్వ' అనే శబ్దంతో సంబోధించబడతాడు. అన్ని ప్రాణుల్లో ప్రాణాలు, ఆత్మ, శరీరం, వాటి అంగాలు, హృదయం, మనస్సు వీటిల్ని సృష్టించి జీవులకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. 

కాబట్టి, వేదాలు భగవంతుని రూపగుణవైభవాల్ని ప్రతిపాదించేవే. అవి ముఖ్యసాధనాలు. వేదాల్లో భగవంతుణ్ణి వర్ణించే స్తోత్రాలన్నీ ఉపనిషత్తులంత గొప్పవి. వీటిని ఋషుల పరంపరచే పొంది ఎవడు శ్రద్ధాసక్తులతో అనుసంధించుకొనునో వానికి మోక్షం తథ్యం. 

నారాయణునిపేరుమీదుగాగల ఒక ఉపాఖ్యానం ఈ విధానాన్ని వివరిస్తుంది. భగవద్భక్తుడైన నారదుడు ఒకనాడు కలాపగ్రామంలోని నారాయణాశ్రమానికి వెళ్లి, ఋషులతో ఉన్న నారాయణుడనే ఋషిని, నువ్వు నన్ను అడిగినట్టే అడిగినాడు. ఆయన గతంలో ఇలాగే శ్వేతద్వీపవాసులైన సనకసనందనాదులు అడిగిన ఇదే సందేహానికి సనందనుడు చెప్పిన జవాబును నీకు (నారదునికి) తెలుపుతాను. అని చెప్పసాగాడు. 

ఒక చక్రవర్తి నిద్రించినపుడు అతని గుణగణాలు, శౌర్యము, దక్షతలను వందిమాగధులు ఎలా స్తోత్రం చేస్తారో అలాగే యోగనిద్రా పరవశుడైన భగవంతుణ్ణి, వేదాలు స్తోత్రంచేస్తున్నాయి. ఈ స్తోత్ర భాగాలైన వేదాలు అలాంటి సత్యాన్ని ప్రవచిస్తున్నాయి. అని నారదునికి చెప్పినాడు. 

ఆ 'నారాయణాఖ్యమైనగాథను' నారదునికి చెప్పిన దాన్ని విస్తారంగా శ్రుతిగీతాల రూపంలో శుకుడు మళ్ళీ చెప్పసాగాడు.

ఓ విష్ణూ! నీకు జయం. జయం. అన్ని జంతువులకు జ్ఞానం నీవల్లనే కలుగుతోంది. కనుక ఆ జ్ఞానంతో వారుచేసే దోషాల్ని సుగుణాలుగా భావించి, షడ్గుణపరిపూర్ణుల్నిచేసి, ఆత్మలలో తిరుగాడుతూ, కార్యమూ కారణమూ నీవే అయి ప్రవర్తిస్తున్న నీయందే వేదాలు ప్రవర్తిస్తాయి. సత్త్వరజస్తమోగుణాలతో కూడిన స్వభావంనుండి మాకున్న బంధం తెంపు. యోగుల హృదయాల్లో నిరంతరం ఉండేవాడా! నీకు జయం.

అంతేగాక, యోగులు ఈ భౌతిక సృష్టిని, దీనిలోని ప్రతివస్తువును బ్రహ్మస్వరూపంగానే భావిస్తారు. ప్రళయకాలంలో సర్వప్రకృతీ నశించినా నీవొక్కడవే మిగిలిపోతావు. సృష్టి, లయాలలో ఈ సర్వప్రపంచం నీలోనే పుటుతూంది. కుండలు మొ॥ మట్టితో చేసిన వస్తువులు - మట్టిలోనే కలిసినట్లు బుద్ధి వాక్‌ కర్మలు నీలోనే లీనమవుతున్నాయి.

జ్ఞానులు భూమి పైపుట్టి జీవితంలో 'అనివార్యమైన కర్మలు' చేస్తూ, తద్ద్వారా పాపాదులు, ఆపై తిరిగి జన్మలు ఎత్తడం కాక, నీపై శ్రద్ధపెట్టి సేవిస్తూ కృతార్థులు అవుతూరు.

పురాణపురుషా! కాల, లయాదిక స్వరూపమైన ఈ సృష్టిలోని ప్రాపంచికులు, సర్వపాపవినాశకరమైన నీ అమృత కథలతో తరిస్తూ

నిండు వేసవిఎండకు తీవ్రంగా మాడుతున్న బాటసారి ఒక్కసారి చల్లనినీటిస్నానంచేస్తే ఎలా ఆనందిస్తాడో, సంసారమనే తాపాన్ని భరించలేక నిన్ను సేవించే మహానుభావులు దాన్ని పోగొట్టుకుంటారు. ఇక ముసలితనం, మరణం, మనోవాంఛలు వీటినుండి నీ భక్తులు విముక్తులు అవుతారని ప్రత్యేకించి చెప్పేపనేముంది?

అంతేగాక, దేహి శాశ్వతం, దేహం అశాశ్వతం (దేహి = జీవుడు, దేహం = శరీరం)అనే అంశాలతో కూడిన పంచకోశాలు అభివృద్ది చెందుతాయి; అందులోని పంచమకోశం అయిన ఆనందమయుడివి నీవే! నీవు స్వయం ప్రకాశకుడవు. నీవు అధీనంలో ఉంచుకోవడంవల్లే ప్రకృతి, మహత్తు, అహంకారరూప ఆత్మ, పంచతన్మాత్రలు, పంచభూతాలు, వాటి తత్త్వంతో కూడిన సృష్టిలక్షణాలు, విశ్వకార్యాలు, తత్‌సాధన కారణాలు అన్నీ సర్వసమర్థంగా, నియమబద్ధంగా జరుగుతున్నాయి.

(పంచకోశవ్యవస్థ: 1. అన్నమయకోశం 2. ప్రాణమయకోశం 3. మనోమయకోశం 4. విజానమయకోశం 5. ఆనందమయకోశం. ఇందులో మొదటిది ప్రాథమికం. అట్టడుగుపొర, దానిమీదిపొర ప్రాణమయం, దానిపై పొర మనోమయం. దానిపై ఉన్నది విజ్ఞానమయం. అన్నిటికన్న పైన ఉన్నతస్థానంలో ఉండేది ఆనందమయకోశం. ఒక త్రికోణాకారంగా ఈ పంచకోశాలను సంభావిస్తే త్రికోణంలోని శిఖరాగ్రభాగమే ఆనందమయకోశం. తిరుమల శ్రీవారి దేవాలయంలో స్వామి గర్భగుడిపైగల విమానం పేరు 'ఆనందనిలయ విమానం'. ఇదే ఏడవ కొండపై స్వామి గర్భగ్భహంలో నిలబడిన అధిష్టానం, మూలవిరాట్‌ విగ్రహం. స్వామి ఆనందమయుడని దీని అంతరార్థం!)

ధీరజనులని పేరొందిన కొందరు శరీరధారులు నిన్ను సేవించి, ఇహపరసౌాఖ్యాలు పొందుతారు. (వీరుడు వేరు. ధీరుడు వేరు. వీరుడంటే యుద్ధవీరుడు. ధీరులంటే నిశ్చయాత్మమైన బుద్ది శక్తితో ప్రకాశించే, ఆధ్యాత్మికసాధకులు. వీరు సాధన చేస్తూ పోగా ఒకనాటికి ధీరజనోత్తములవుతారు.).

భగవంతుణ్ణి సేవింపనేరని దుష్టులు తమదేహాల్ని ఉచ్చ్వాసనిశ్శ్వాసాలతో నింపుతూ, తోలుతిత్తులై మారి తిరుగుతూ, దేహాన్నే ప్రేమిస్తూ, అదే తమ జీవిత సర్వస్వంగా భావిస్తుంటారు.

దేవా! సూక్ష్మదర్శనులైన మహానుభావులు కొందరు నిన్ను జఠరాగ్ని స్వరూపుడివి అని భావిస్తారు. ఆరుణులనే ఋషులు నిన్ను సుషుమ్ననాడీద్వారంలో సంచరిస్తూ హృదయస్థ సూక్ష్మరూపిగా నిన్ను భావిస్తారు. హృదయపద్మంనుండి వెడలి, బ్రహ్మరంధ్రానిచేరి పరమకాంతిరూపుడిగా నిన్ను ధ్యానించి నీలో లీనమై మోక్షంపొంది, జన్మరహితులు అవుతారు. 

(ఉదరస్థుడైనవహ్ని - వహ్ని అండే అగ్ని. ఇది వైదికమైన త్రేతాగ్నులకంటే వేరైంది. ఉదరస్థమైన అగ్ని - జఠరాగ్ని (వైశ్వానరాగ్ని)

ఈ 'జఠరాగ్ని'యే మానవులు తినే వివిధాలైన ఆహారపదార్థాలను జీర్ణంచేసి శరీరానికి శక్తినిచ్చేవిధంగా పనిచేసే అగ్ని. ఆకలికావడానికి కూడా ఈ అగ్నియే మూలకారణం. జఠరాగ్నికే 'వైశ్వానరాగ్ని' అని కూడా పేరు. సృష్టిలో ప్రతి ప్రాణి ఉదరంలో జఠరాగ్నిరూపంగా ఉండేవాడే 'వైశ్వానరాగ్ని'.)

దేవా! కట్టెల్లో ఉండే అంతర్గతుడైన అగ్నిదేవుడు, కర్రలలోని దోషాలకు అతీతంతా పరిశుద్ధంగా ఎలా ఉంటాడో అలా నీ సంకల్పంచేత సృష్టించబడ్డ ఈ జీవరాశుల్లో వాటి లోపాలతో సంబంధంలేక అంతర్యామిగా (జీవాత్మల్లో) నెలకొని, వాటి వాటి జన్మాదికాల సమయంలో గర్భంలోని రోతల్ని అంటకుండా ఉంటూ, సకల జీవరాశి ఆత్మలపట్ల సముడవైన బ్రహ్మగా నిన్ను గుర్తించి, ఇహపరాల్లోని ఫలాలతో నిమిత్తంలేక రజోగుణ భిన్నులై ఉంటూ నిన్ను సేవించేవారు కొందరు. నీ సంకల్పానికి అధీనంగా ఉండే శరీరాల్లో జీవకోటిని నీ మహద్భూతాంశగా భావించి నీ చరణారవిందాల్ని కొలిచి జన్మమృత్యు బంధచక్రాన్ని తప్పించుకొని, కృతార్ణులయ్యేవారు మరికొందరు.

పరమాత్మా! నీ లక్షణము సులభంగా అర్ధంకాదు. అర్ధం కావడం కోసం రామ, కృష్ణాది అవతారాల్ని సేవిస్తుంటారు. ఆ అవతారగాథల కథామృతంలో ఓలలాడిన ప్రశాంత చిత్తులు వేరే మోక్షంకోరరు. మరికొందరు పుణ్యాత్ములైన యోగులు ఆచరించినట్టు నీ పాదపద్మాలపై మనసులగ్నంచేసి భక్తుల్ని ఆరాధిస్తారు గాని మోక్షం కోరరు.

(భగవత్కథామృతం, భాగవతులసేవనం మోక్షంకంటె శ్రేష్ఠాలని తాత్పర్యం.)

నిత్యుడవైన ఓ స్వామీ! ఈ భూమిపై కొందరు గొప్ప భక్తిచే తమదేహాలు నీకు అర్పణచేసి, నీ పాదాలు అర్చిస్తూ, పరమానందంతో జీవిస్తారు. మరికొందరుమాత్రం, నిన్ను పూజించక, వ్యర్థంగా జీవిస్తూ అనేక జన్మలు పొంది, అనేక దేహాలతో బాధలు అనుభవిస్తూ ఉంటారు.

జితేంద్రియులు, యోగులు ఐన ముని శ్రేష్ఠులూ; విరోధభావంతో నిత్యం స్మరించే శిశుపాలాది శత్రువులూ; పాముల పడగలవంటి లేత చేతులతో నిన్ను నిత్యం కాగిలించుకొసి ప్రేమలు కురిపించే గోపికలూ; మేమూ, అందరం నీ కృపకు పాత్రులమేగదా! (జపం, తపం, యోగం, భక్తి వైరం, ప్రేమ - ఏ రూపంలోలైనా నిన్ను ఆరాధిస్తే నీ కృప లభిస్తుంది.)

ఓ పద్మాక్షా! నీ సహజస్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడడం ఎవ్వరికీ సాధ్యంకాదు. శాస్త్రాలు వివేచించి, విశ్లేషించి, సమన్వయించి నీ గుణగణ ప్రవర్తనాదుల్ని కొంత తెలిసేట్టుగా చేస్తున్నాయి. ఈ సృష్టి పుట్టకముందే నీవొక రూపాన్ని ధరించగా బ్రహ్మాది దేవతలందరూ అందుండి జన్మించారు. ఆ సృష్టికి పూర్వం నువ్వెలా ఉండేవాడివో, ఏ కొంతైనా నీ విశేష రూపరేఖావిలాసాదులేవో మేము ఊహించగలమా? మేము చ్యుతులం. నీవు చ్యుతిలేనివాడివి. నీ రూపస్థితి వాక్కులకూ, మనస్సుకూ అతీతమైనది. అది ఆత్మకుమాత్రమే గోచరిస్తూంది.

సకలచరాచర జగత్స్వరూపుడవైన నిన్ను అర్ధం చేసుకోక, ఈ సృష్టికి (నీవుకాక) పరమాణువులే కారణమని చెప్పే కణ్వ, గౌతమాది పరమాణు సిద్ధాంతకారులూ, ప్రకృతియే తనకుతానుగా పుట్టిందని, దానినుండే సృష్టి అంతా పుట్టిందనీ భావించే కపిలాది సాంఖ్యసిద్ధాంతకారులూ, దేహమేతప్ప పరమాత్మ, పరలోకాదులూ ఉండవనే బౌద్ధులూ మొదలైన వారు తప్పుడు వాదనలతో తమసిద్ధాంతాల్ని సమర్థించుకొంటూ, నిన్ను తెలియలేరు. అదృష్టవంతులైన యోగులుమాత్రమే నిన్ను దర్శించగల్గుతున్నారు. వారికినీవు ప్రత్యక్షం అవుతావు కనుక పైవారి సిద్ధాంతాలు అబద్దాలు అని తేలుతున్నాయి. సకల చరాచరవస్తుజాతంలో అంతర్యామిగా నీవు ఉన్నావని తెలియక కొన్ని శాశ్వతాలు, కొన్ని అశాశ్వతాలు అని విపదీత బుద్ధితో యోచించే కొందరు నీ దివ్యతత్త్వాన్ని అర్థంచేసుకోలేరు. జగత్తే శరీరంగా ఉండీ; నిన్ను గూర్చి - కడియాలు, కిరీటాలు, కుండలాలు అంటూ వివిధ రూపాలుగా ఉన్నాా వాటిలో అన్నిటా బంగారమే ఉన్నట్టు - నీవు కూడా జగత్తులోని ప్రాణులన్నిటిలో అవి హేయంగా ఉన్నాా శత్రుభావంతో ఉన్నా శుభంకరంగా ఉన్నా అన్నిటా నీవే ఉన్నావని భగవతత్త్వాన్ని తెలుసుకొన్న జ్ఞానులు అనుభవపూర్వకంగా గ్రహిస్తారు.

ఓ కృష్ణా! నీ పాదపద్మారాధనతో నిరంతర సేవకులైన భక్తులు మృత్యువును తిరస్కరించి, సంసారమహాసముద్రాన్ని దాటి, పవిత్రులై లోకాలన్నీ పవిత్రంచేసే ప్రవర్తనలతో నిత్యశోభనకరమైన మోక్షాన్ని పొందుతారు.

(మృత్యువును తిరస్కరించి, సంసారసాగరాన్ని దాటి, పవిత్ర జీవనంతో లోకాన్ని పునీతం చేస్తూ ఏకొందరో పుణ్యాత్ములు నిత్యశోభనమైన ముక్తిని గొప్ప వైభవంతో పొందుతున్నారట! వారు భగవత్పదయుగ నిరంతర సేవాసక్తులు! ఇటువంటివారే జీవన్ముక్తులు.)

నిన్ను తిరస్కరించి, పూజించని హీనమతులను - జంతువుల్ని తాళ్లతో బంధించినట్లు - భవబంధాలరూపంలో బంధించి, అనేక నామాలు, దేహాలు (జన్మలు) ఇచ్చి దాటశక్యంగాని సంసారసముద్రంలో పడవేస్తావు.

క్రియాకర్మాదులు, తదంగాలు లేకున్నా అశరీరుడవైనా నీవు స్వతంత్రమూర్తివి. బ్రహ్మాదులు నీ అధీనులు. చరాచరరూపాలకుగల ప్రాణికోటిని నీవు నియంత్రించే అధిపతివి. నీ దయగలవారికి ముక్తి కరతలామలకం. నీ దయలేనివారికి నరకాది దుర్గతులే! వారు వివిధ జాతులలో పుట్టి, అణురూపంలో దేహాల్లో ఉంటారు. వారిలోకూడా నీవు అంతరాత్మవై ఉంటావు.

(అంతరాత్మ : భగవంతుడు సర్వ ప్రాణికోటిలో ప్రవేశించి హృదయస్థానంలో కూర్చొని అన్నింటికీ సాక్షియై గమనిస్తుంటాడు.)

ఆలోచిస్తే - భూమ్మీద నీటిబుడగలు పుట్టి నశిస్తున్నట్టు తాత్కాలికజీవితాలుగా, దేవ మనుష్య తిర్యగాదిదేహాలు అంటిపెట్టుకొని ఉండే ఈ ఆత్మలన్నింటినీ

కృష్ణా! రాక్షససంహారీ! భక్తపారిజాతా! భవబంధవిమోచనా! కమలనాభా! ప్రాణికోటిలోని ఆత్మలన్నింటినీ తిరిగి నీవు ప్రళయకాలంలో నీలో లయింపచేసికొంటావు సృష్టి అంతటికీ నీవే కారణభూతుడవు.

ఓ పరమేశ్వరా! ఇంద్రియాల్ని జయించామని అనుకొంటూన్నా - స్ధిత ప్రజ్ఞులు కానంతవరకూ-మనస్సు కోరికలతో చలిస్తూనే ఉంటుంది. కనుక స్వతంత్రంగా తిరుగుతూండే గుర్రాన్ని నూలిత్రాడుతో బంధించడం - ఎలా సాధ్యంకాదో అట్లే ఈ చంచలమైన మనస్సును వివేకంతో బంధించి, అధీనంలోకి తెచ్చుకోవాలి, అలా తెచ్చుకోలేకపోతే - మోక్షసాధనకు సరైన ఉపాయం (మార్గం) లభించక మానసికంగా దుఃభిస్తూనే ఉంటారు.

“చపల స్వభావంతో ఉండేదీ, నిలుకడలేనిదీ, అయిన మనస్సు ఏయే విషయాలపై సంచరిస్తుందో ఆయాచోట్లనుండి దాన్ని మరలించి ఆత్మలోనే స్థాపితం చేయాలి. అంటే ఆత్మకు అధీనంగా చేయాలి” అన్నాడు గీతా ప్రవక్త.

పద్మాక్షా! నీవు పరిపూర్ణుడవై ఉండగా, శ్రేష్ఠములైన నీ పాదపద్మాల్ని కొలువనివారు, చోదకుడులేని పడవనెక్కిన వ్యాపారివలె భవసాగరంలో మునిగిపోతారు సుమా!

నా భార్య, నా కొడుకు, నా ఇల్లు, నా పొలం అంటూ వాటిమీద మమకారం పెంచుకొని, జీవించేవాడు ఈ భవసాగరంనుండి ఎన్నటికీ బయటకు రాలేడు.

శ్రేష్ఠులైన భాగవతులు (భక్తులు) అనేకాలైన పవిత్ర తీర్ధాలవలె సేవింపదగినవారు. వారి ఉనికి పవిత్ర తీర్ధరాజం. తమ పుణ్యప్రవర్తనలచే ఇతరులకు ఆదర్శమైనవారూ. ఈర్షాదులులేనివారూ, నిన్ను ఆరాధించి భవబంధాలు తొలగినవారూ, ప్రాణికోటిపట్ల సమబుద్ధి కల్గినవారూ, ప్రాప్తించింది అతిహీనమైనా (ఉముక అయినా) బంగారంవలె స్వీకరించి తృప్తిపడేవారూ, కోపతాపాలు లేనివారూ, తమ పాదజలాలు తీర్ధంగా గ్రహింపదగిన పుణ్యపాదులు. అటువంటి యోగివరులే సదాసేవ్యులు. వారిని సేవించినవారికి మోక్షపదవి లభిస్తుంది.

సత్యమైన ప్రకృతివలన పుట్టిన ఈ ప్రపంచం అంతా సత్యం కావాలి. బంగారంతో చేసిన ఆభరణాల్లో బంగారమే ఉంటుందిగదా! అని సాంఖ్యులు వాదిస్తారు. సృష్టించబడనిది సత్యం కాదు. వ్యతిరేకవ్యాప్తి నియమం ప్రకారం ఇది కుదరదు. నిత్యసత్యబ్రహ్మంలో తర్కం కుప్పకూలుతుంది. ప్రపంచం మిథ్య, సత్యంకాదని అద్వైతులు పైసాంఖ్యవాదాన్ని ఖండిన్తారు. ఈ జగత్తంతా బ్రహ్మవిరచితం అయితే కార్యకారణ సిద్ధాంతం ప్రకారం కారణుడైన భగవంతుడున్నపుడు, కార్యమైన జగత్తు ఉన్నట్టేకదా! అపుడు జగత్తు మిథ్య ఎలా అవుతుంది? అని తిరిగి సాంఖ్యులు ఖండిస్తారు. బహుగ్రంథప్రతిపాదితమైన జగన్మిథ్యావాదం అబద్ధం ఎలా అవుతుంది అని అద్వైతులు వాదిస్తారు. కర్మవశులైన జడులు అవిద్యవల్ల చెడ్డ వాదనలతో కుతర్కం సాయంతో అంధులు పరంపరగా స్వీకరించే అజ్ఞానంవలె ఒక గ్రంథంనుండి మరోగ్రంథానికి అద్వైతభావనను అందించుకుంటారు. అంతేగాని, పుస్తకాల్లో ఉందని జగన్మథ్య అనడం కుదరదని, సాంఖ్యులు మొదలైనవారు అద్వైతాన్ని ఖండిస్తారు.

కారణ రూపమైన భగవంతుని రచనగా ఈ సృష్టి సూక్ష్మరూపంలో ఉంటుంది. స్థూలంగా అంతా మిథ్యే. జగత్తు బాధాకారకం. (ముక్తి ఆనందకారకం,) కాబట్టి, ఓ భగవంతుడా! ఈ సృష్టి నీకు శేషభాగమే. జీవుల ఆత్మలలో అంతర్వామివైన నీకు దేహిచేసే కర్మలవల్ల లభించే పాపపుణ్యాలు అంటవు. వాటిని అనుభవించవలసిన దేహికి సాక్ష్యంగా మాత్రం నిలుస్తావు. అలాంటి నిన్ను ప్రాణులు జ్ఞానశూన్యులై గుర్తించలేరు. కంఠానికి అతికినట్టుండే ఆభరణంలోని మణి నిత్యం ప్రకాశిస్తున్నా అది మెడలో వేసుకున్నవాడికి కనపడనట్టు వారి హృదయపద్మాల్లో ప్రకాశించే నిన్ను వాళ్లు దర్శించలేరు. బ్రహ్మాండానికి అధినాయకుడవైన నిన్నే వేదార్థాలు వివరిస్తాయని శ్రుతులు మహావిష్ణువును అభినందించిన విధాన్ని సనందన ఋషి మహర్షులకు చెప్పాడని నారాయణుడనే ఋషి నారదునికి చెప్పాడు. నారదుడు వేదవ్యాసునికి దాన్ని చెప్పగా మాతండ్రి వ్యాసుడు నాకు చెప్పినదాన్ని పరీక్షిన్మహారాజా! నీకు చెప్పాను. ఇది వేద, శాస్త్ర పురాణేతిహాససారం. ఉపనిషత్తులతో సమానమైన రహస్యం. దీన్ని విన్నవారికీ, పఠించినవారికీ సకలశుభాలు కల్గుతాయని, పాపాలు నశిస్తాయనని శుకమహర్షి చెప్పాడు. అది విని పరీక్షిత్తు శుకునితో ఇలా అన్నాడు.

పరీక్షిత్తునకు శుకయోగి విష్ణు సేవా ప్రాశస్త్యంబు సెప్పుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం

జ్యోతిషశాస్త్రము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Bhrugumaharshi Trimurtula Prasasyambu Sodhinchutaku Bovuta - భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్యంబు శోధించుటకు బోవుట సమస్త సంభారాలతో అనేకాలైన చక్కటి యాగాలు సరస్వతీ ...