Sunday, August 23, 2026

Muchukundhudu Srikrishnuni Stotramu Cheyuta - ముచుకుందుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేయుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -
ముచుకుందుడు శ్రీకృష్ణుని స్తోత్రము చేయుట

ఈశ్వరా! ఈ ప్రపంచంలో స్త్రీ పురుషరూపాలతో ఉన్న జనం నీ మాయాజాలంలో తగుల్కొని. నిన్ను పూజించరు. ధనం ఒక రోగంలాగా వాళ్లను పీడిస్తుంది. ఇల్లు, సంసారం, సుఖం అనే ఆలోచనలతో కళ్లు మసకబారతాయి. సుఖాల మాయలో పడతారు. కోరికలు వాళ్లను మోసం చేస్తాయి.

బావి మీద గడ్డి పెరిగి ఉంటుంది. మేక దాన్ని చూచి తినాలనే ఆశతో దగ్గరికి వెళ్లి, బావిని గమనించక అందులో పడిపోతుంది. అలాగే జీవికూడా లెక్క లేనన్ని జన్మలనెత్తుతుంది. అలా జన్మలెత్తుతూ ఎత్తుతూ చివరకు తాను చేసిన పుణ్యకర్మలకు ఫలితంగా కర్మభూమిలో పదే పదే పుట్టి 'మనిషిగా మంచిశరీరంతో జన్మించికూడా చివరకు మూఢుడై' నీ పై భక్తిలేనివాడై ఇల్లూ వాకిలి అనే మమకారంలో పడతాడు.

భార్య, పిల్లలు, ధనసంపాదన అనే వాటిలో పడిపోయాను. మహారాజ్యవైభవంతో మత్తెక్కిపోయిన మనస్సు కలవాడినైనాను. ఈ శరీరంపైన అంతులేనిఆశ పెంచుకున్నాను. ఈ ఆలోచనలలో పడిననాకు ఈశ్వరా! ఎంతోకాలం వృథాగా గడిచిపోయింది

ఈశ్వరా! కుండలాంటి, గోడలాంటి పెళుసై చంచలమైన ఈ శరీరంలో ప్రవేశించి, నేను రాజును అనుకుంటూ, రథ గజ తురగ పదాతిబలంతో గర్విస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటినేగాని నిన్ను తెలుసుకోలేక పోయాను.

పలువిధములైన కోరికలూ, సుఖాలు మున్నగు ఇంద్రియ విషయాలపై మిక్కిలి ఆశగల్గినవాణ్ణి, మత్తుణ్ణి, నీవు ఏమరుపాటు చెందక అంతకస్వరూపుడివై - పాము కనిపెట్టి యుండి తటాలున ఎలుకను ఒడిసి పట్టుకున్నట్లు సమయం రాగానే పట్టి హరిస్తావు.

ఈశ్వరా! ఈ శరీరం రాజు అనే పేరుతో పిలువబడుతూ, రథాలతో, ఏనుగులతో సేవించబడుతూ కాలక్రమంలో భయంకరమైన జంతువుల చేత తినబడడంవల్ల మలమనీ, క్రిములతో నిండిందనీ, బూడిద అనీ వ్యవహరింపబడుతున్నది.

అన్ని దిక్కులను గెలుచుకుని, తన సాటివాళ్లు తనను గురించి పొగడుతూ ఉంటే, ఉన్నతమైన ఆసనం ఎక్కి కూర్చొని సార్వభౌముడు అనిపించుకుంటాడు మనిషి. అంత స్థాయికి వెళ్లినప్పటీకీ కూడా ఆడవాళ్ల మందిరాలలో శృంగార క్రీడల్లో కాలం గడుపుతూ ఉంటాడు తప్ప - నిన్ను వెతకాలని(తెలుసుకోవాలని) అనుకోడు.

ఈశ్వరా! అజ్ఞాని అయినవాడు, మనస్సును కట్టడిచేసి, భోగాలను మానేసి; ఇంద్రియాలను అణచి, తపస్సు చేసి ఇంద్రపదవి కోరుకుంటాడు తప్ప, శాశ్వతమైన ముక్తి నిచ్చే నీ సన్నిధిని కోరుకోడు.

శ్రీకృష్ణా! సంసారంలో పడి పరిభ్రమించేవాళ్లకు నీ దయ ఎప్పుడు పూర్తిగా కలుగుతుందో అప్పుడే వాళ్లబంధాలన్నీ తెగిపోతాయి. బంధాలన్నీ అలా తెగిపోగానే సత్పురుషులతో సాంగత్యం కలుగుతుంది. అలాంటి సాంగత్యంతో నీపై భక్తి సిద్ధిస్తుంది. నీపై భక్తివల్ల ఉత్తమమైన ముక్తి కలుగుతుంది. నాకు సత్పురుష సాంగత్యంకంటె ముందే రాజ్యబంధం నుంచి విముక్తి లభించింది. ఇది నీ దయవల్లనే కదా దేవా! నీసేవ తప్ప నాకు కృష్ణా! వేరే ఏమీ వద్దు. విజ్ఞుడైన వాడెవడైనా ముక్తిదాయకుడవైన నిన్ను విడిచి, ఆత్మబంధాన్ని కోరుకుంటాడా? (కోరుకోడు.)

కాబట్టి సత్త్వం, రజస్సు, తమస్సు అనే మూడుగుణాలతో పాటు వచ్చే సంపద, శత్రుమరణం, ధర్మం మొదలైన వాటిల్ని నేను వదిలేస్తాను. ఈశ్వరుడవు, విజ్ఞానఘనుడవు, మాయక్రమ్మనివాడవు, గుణరహితుడవు, నీకు సమానుడూ, అధికుడూ లేనివాడవు, పరమపురుషుడవు అయిన నిన్ను ఆశ్రయిస్తాను. 

ఎంతోకాలంగా కర్మఫలాలవల్ల వేదన పొందుతున్నాను. మళ్లీ ఆ కర్మవాసనలు వీడక దుఃఖాన్ని పొందుతున్నాను. ఆశ వదలడం లేదు. చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు మనస్సు అనే ఆరు ఇంద్రియాలు శత్రువులయ్యాయి. వాటిల్ని గెలువలేక పోతున్నాను. 

అలాంటి నాకు శాంతి ఎక్కడిది? ఆపదల్లో అల్లల్లాడిపోతున్న నా భయాన్ని పోగొట్టు. నన్ను రక్షించు అని ముచుకుందుడు వేడుకున్నాడు, ఆ మాటలకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

రాజులకు అలంకారమైనవాడా! ముచుకుందా! నీ బుద్ధి మంచిది. నీవు పరులకోసం ఏ విధంగా ప్రవర్తించినా కూడా ఆశలకు, కోరికలకు ప్రలోభపడడం లేదు. ఇది నీకు మంచిది. స్వచ్చమైన ప్రవర్తనతో నన్ను సేవించేవాళ్లు ధన్యులు. సంసారమాయకు వాళ్లు ఏ విధంగానూ కట్టుబడరు. నీకు అచంచలమైన భక్తి కలుగుతుంది. ఈ లోకాన్నంతా పరిపాలించు. మానడం దేనికి? (మానవద్దు.)

“రాజా! నీవు మునుపటికాలంలో క్షాత్రధర్మాన్ని పాటిస్తూ, జంతువులను వేటాడావు. నీకు అదొక వేడుక. కానీ దాని కర్మఫలం ఒకటి ఉంటుంది. నీవు తపస్సు చేసి ఆ కర్మఫలం నుండి విముక్తి పొందు. తర్వాత వచ్చేజన్మలో బ్రాహ్మణ శ్రేష్ఠుడవై అన్ని జీవులపట్ల స్నేహభావంతో ఉండి నన్ను చేరుకుంటావు వెళ్లు” అని శ్రీకృష్ణుడు చెప్పాడు.

ముచుకుందుడు శ్రీకృష్ణుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేస్తూ నమస్కారం చేశాడు. గుహనుంచి బయటికి వచ్చాడు. బయట మనుషులు, పశువులు, చెట్టు, తీగలు మొదలైన వాటిని చూశాడు. అవన్నీ చిన్న చిన్న దేహాలతో ఉన్నాయి. వాటిల్ని చూడగానే - 'ఓహో కలియుగం దగ్గర పడుతోంది' అనుకున్నాడు. ఉత్తరం వైపు తిరిగి, తపస్సుకు వెళ్లాడు. సంశయాలను విడిచి పెట్టాడు. బంధాలను వదలిపెట్టాడు. శ్రీమహావిష్ణువు పై మనస్సు నుంచాడు. 

గంధమాదనపర్వతాన్ని చేరాడు. అలానే నరనారాయణులనే మహామునులు నివాసమున్న బదరికాశ్రమానికి వెళ్లాడు. ప్రశాంతమైన మనస్సుతో శ్రీమహావిష్ణువును పూజిస్తూ ఉన్నాడు. ఇలా ముచుకుందుణ్ణి శ్రీకృష్ణుడు వీడ్కొన్నాడు.

పద్మాలవంటి అందమైన కండ్లున్న శ్రీకృష్ణుడు ఏ మాత్రం తరగని పరాక్రమం అనే సూర్య కాంతితో దిక్కుల నడిమి ప్రాంతాన్ని కప్పివేస్తూ తిరిగి మథురానగరానికి వచ్చాడు. పట్టణానికి ఆటంకంగా చక్రాకారంలో నిలబడ్డ ఆ యవన సమూహాన్ని యుద్ధంలో తన అతిశయం, మహత్త్వం, ప్రకాశించేరీతిగా చంపాడు.

జరాసంధుడు ప్రవర్షణగిరిని దహించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Srikrishnudu Lokapavada Nivruttikoraku Syamantakamanini Decchuta - శ్రీకృష్ణుడు లోకాపవాద నివృత్తికొఱకు స్యమంతకమణిని దెచ్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీకృష్ణుడు లోకాపవాద నివృత్తికొఱకు స్యమంతకమణిని దెచ్చుట పరీక్షిన్మహారాజా! సత్రాజిత్తు అనే రాజు మొ...