Sunday, August 23, 2026

Kaala Yavanundu Srikrishnuni Mida Dandethi Madhurapuramunu Muttadi Veyuta - కాల యవనుండు శ్రీకృష్ణుని మీద దండెత్తి మథురాపురమును ముట్టడి వేయుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
కాల యవనుండు శ్రీకృష్ణుని మీద దండెత్తి మథురాపురమును ముట్టడి వేయుట

ఈ విధంగా బలరామకృష్ణులు మధురలోకి ప్రవేశించారు. యుద్ధం జరిగిన పద్ధతిని గురించి శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజుకు చెప్పి తాను యథేచ్చగా విహరిస్తూ ఉండినాడు. కానీ, జరాసంధుడు మిక్కిలి క్రోధంతో లోకంలో ఉండే దుర్మార్గులైన రాజులను సమకూర్చుకుని పదిహేడుసార్లు పదిహేడు అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకుని మథురపై దండెత్తాడు. 

శ్రీకృష్ణుడు కోటలాంటి తన భుజశక్తితో కాపాడుతున్నయాదవులతో జరాసంధుడు యుద్ధం చేశాడు. ఉన్న బలమంతా ఊడ్చిపెట్టుకు పోయింది. మళ్లీ పదునెనిమిదవసారి యుద్దానికి వస్తున్నాడు. ఆ సమయంలో కలహాలు పెట్టడం అనే విద్యలో ప్రవీణుడైన నారదుడు కాలయవనునివద్దకువెళ్లి ఇలా అన్నాడు.

యవనా! నీవు నీ తిరుగులేని బాహుబలగర్వంతో లోకంలోని రాజులనందరినీ జయించావు. మబ్బులను గాలి ఎలా ఎగుర గొడుతుందో అలా వారిని నాశం చేశావు. అలాంటి నీవు ఎందుకు యాదవులను గెలవడం లేదు? వాళ్లను మరచిపోయావా? లేక ఆ మాత్రం శౌర్యం లేదా? తెలివి తక్కువ స్థితిలో ఉన్నావా? భయపడ్డావా? అల్పత్వాన్ని పొందావా? ఏమో తెలియదుమరి!

యాదవులలో ఒకడున్నాడు. వాడు గొప్పబలంతో ఈ భూమిపై వెలిగిపోతున్నాడు. జరాసంధుడు మొదలైన రాజులను తొలగదోలాడు. అలాంటివాడు ఇంకొకడు ఈ నేలపై లేడు. వాడు చేస్తున్నపనులగురించి చెపుతాను. వినవయ్యా!

ఆలా నారదుడు చెప్పగా విని కాలయవనుడు ఇలా అన్నాడు.

నారదా! ఏమన్నావు? నీవు చెప్పుతున్నావే ఆ మనిషి ఏ రూపంలో ఉంటాడు? ఎంతటివాడు? ఏ తీరుగా అతడు ప్రవర్తిస్తాడు? యుద్దాలు చేయడంలో భుజబలం ఏ మాత్రం ఉంటుంది? యుద్ధభూమిలో నా బాహుబల శౌర్యాన్ని తట్టుకొని నిలవగలడా? గర్వసమృద్ధి కలవాడేనా?; చెప్పు!

అలా కాలయవనుడు అడుగగా, దానికి బదులుగా దేవముని నారదుడు ఇలా అన్నాడు.

ఓ యవనరాజా! ఆయన నల్లనివానమబ్బువంటి శరీరం ఉన్నవాడు. తామరపూలవంటి కాంతిమంతమైన; కండ్లున్నవాడు; నిండుచందమామవంటి గుండ్రనిముఖం ఉన్నవాడు; ఎత్తైన, పొడవైన చేతులున్నవాడు; శ్రీవత్సమనే పుట్టుమచ్చతో అందంగా ఉన్నవిశాలవక్షఃస్థలం కలవాడు. 

కౌస్తుభమణిని పతకంగా ధరించినవాడు. వైభవోపేతమైన పసుపుపచ్చని పట్టువస్త్రాన్ని తాల్చిన వాడు; మొసలి ఆకారంలో ఉండే చెవి కుండలాలతో ప్రకాశిస్తుండేవాడు. అతడు ఇంతటివాడు, అంతటివాడు అని చెప్పడానికి వీలుకానివాడు. అన్నిదిక్కులలో నిండి ప్రకాశించేవాడు. ఏ సమయంలో ఏమి చేయాలో తెలిసి ప్రవర్తించేవాడు. ఎంతో నేర్పు ఉండి అతణ్ణి ఎలా పట్టుకోవాలో తెలిస్తే తప్ప పట్టుబడేవాడు కాడు.

ఈ విధంగా చెబుతూ నారదుడు శ్రీ కృష్ణుణ్ణి గురించి ఇంకా వివరంగా వర్ణించి చెప్పాడు. అంతా వినికూడా కాలయవనుడు ఆ మాటలను లక్ష్యపెట్టకుండా, నారదునితో ఇలా అన్నాడు.

నారదా! ఈ యాదవుడనగా ఎంతటివాడు? ప్రళయకాలంలోని యముడే అయినా సరే, నన్ను ఎదిరిస్తే నేను చేత కాదని చెప్పను. యుద్ధం చేస్తాను. నా కర్కశహస్తాలు ధరించిన ఈ ధనుస్సు నుంచి రకరకాల బాణాలను ప్రయోగిస్తాను. అవి బంగారు పింజలు ఉండే బాణాలు. వాటినుంచి వెలువడే అగ్నిజ్వాలలతో అతణ్ణి - బూడిద చేస్తాను.

కాలయవనుడు ఇలా నారదునితో అన్నాక, మూడుకోట్లమంది మ్లేచ్చవీరులతో చాలా వేగంగా ప్రయాణిస్తూ మధురానగరం మీద దండెత్తాడు. మధురలో విడిది చేశాడు. శ్రీకృష్ణుడు దీన్ని చూచాడు. బలరామునితో కలిసి ఇలా ఆలోచించాడు.

విశ్వకర్మ కృష్ణనియోగంబున సముద్రములో ద్వారకా నగరమును నిర్మించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Srikrishnudu Kalindi Mitravinda Nagnajiti Bhadra Lakshana Yanu Varala Barinayamaaduta - శ్రీకృష్ణుడు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారల బరిణయమాడుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీకృష్ణుడు కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ యను వారల బరిణయమాడుట తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరా...