చూస్తున్న హనుమంతుని కన్నుల నీరు నిండింది. ఉత్తములయిన కుల, గురు, వృద్ధుల శిక్షణలో పెరిగిన లక్ష్మణుని వంటివానికి పూజ్యుడూ, గురువూ అయిన రామచంద్రుని భార్యకు యిటువంటి క్లేశం కలిగిందంటే కాలం ఎంత బలీయమయినదో!
ఈవిడకు రామ లక్ష్మణుల ధీ ధీరశక్తులు పూర్తిగా తెలుసు కనుకనే అంతగా కలతపడడంలేదు. వర్షాకాలపు మేఘాలను చూచి గంగానది క్షోభిస్తుందా!
కుల రూప గుణ శీలాలలో యిద్దరూ సమానులే. అందువల్లనే ఈమెకు అయన, ఆయనకు ఈవిడ తగినవారు.
ఈ విశాలాక్షికోసం వాలిని నేలకూల్చాడు రాముడు.
రావణసముడయిన కబంధుణ్ణి హతమార్చాడు.
విరాధుడికీ అదే గతి పట్టింది. వాడేం తక్కువవాడా! శంబరాసురు నంతటివాడు.
భీకరాకారులయిన ఖర దూషణాదులతో వారి సేన పదునాలుగు వేలు జనస్థానంలో నామ రూపాలు లేకుండా పోయింది; యీవిడకోసం.
సర్వవానరేశ్వరు డయిన వాలిని నేలకూల్చి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపింది యీవిడ కోసమే.
నదీ నద సాగరాలు లంఘించి లంకానగరాన్ని నేను చూడగలిగానంటే ఈ యిల్లాలి వల్ల కాదా!
ఈవిడ కోసం రామచంద్రుడు ముల్లోకాలు తలక్రిందులు చేసినా ఆశ్చర్యంలేదు.
ఈ జనకరాజనందనతో చూస్తే త్రిలోకాధిపత్యం గడ్డిపరక. దర్మపరుడైన జనకుని పుత్రిక, పతివ్రతా శిరోమణి.
విదేహాధీశుడు యజ్ఞంకోసం నాగలిపట్టి దున్నుతున్నవేళ పద్మపరాగ సమధూళినుండి బైెటపడ్డ దీవిడ.
పూజ్యుడూ, పరాక్రమోపేతుడూ అయిన దశరధుని యింటికి కీర్తిని తెచ్చిపెట్టిన పెద్దకోడలు.
ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ఆత్మవేత్త అయిన రాముని ప్రియపత్ని.
అటువంటి నారీమతల్లి ఈ రాక్షసజన మధ్యంలో పడింది. సర్వరాజ భోగాలూ విడిచి భర్తృవాల్లభ్యంతో అరణ్యక్లేశా లనుభవించడానికి ఆయనతో వచ్చిన ఉత్తమురాలు.
కందమూలఫలాలు తింటూ హాయిగా భర్తను సేవించుకున్నది. ఎన్నడూ క్లేశాలు ఎరుగనిది, ఈ నా డింతటి అవస్థ అనుభవిస్తునది.
శీలసంపన్నయైన యీవిడకోసం రాము డెదురు చూస్తున్నాడు. ఈవిడ దొరికితేచాలు భూ మండలమంతా సాధించిన సంతోషం కలుగుతుంది రామునికి.
ఇక్కడ బంధుజనం లేరు, భోగాలు లేవు. అయినా యీవిడ జీవించకలుగుతున్నదంటే రామసమాగమకాంక్ష కాక వేరేమున్నది.
ఈవిడ తన చుట్టూ వున్న రాక్షసగణాన్ని కాని, పూల తీవెలనుకాని చూస్తున్నట్టులేదు. రామదర్శనమందే ఏకాగ్రమై ఉన్నది, యీవిడ మనస్సు.
ఈ పద్మనయనను, సుఖబోగార్హను యీ దశలో చూస్తుంటే నా మనస్సు చింతామయి మవుతున్నది.
రామ లక్ష్మణుల రక్షణలో ఉండవలసిన యీ భూజాత యీ వికృతాకార జన మధ్యంలో ఉన్నది.
మంచు దెబ్బతిని వాడిన పద్మంలా దుఃఖపరంపరతో కృశించి ఉంది. ప్రియుడు దూరమయిన చక్రవాకిలా దీనంగా ఉంది.
పూలబరువుతో వంగిన కొమ్మలతో ఉన్న ఈ అశోకం కూడా యీవిడకు సంతోషాన్ని కలిగించడంలేదు. మంచుపొరల అడ్డంలేని శీతకిరణుడు కూడా యీమెకు సుఖం ప్రసాదించలేకపోతున్నాడు, అలా ఆలోచిస్తూ కూర్చున్నాడు హనుమంతుడు.
No comments:
Post a Comment