Saturday, August 29, 2026

Saalvundu Sivaprasadambuna Soubhakavimanambu Vadasi Dwarakapuripai Dandetthuta - సాల్వుండు శివప్రసాదంబున సౌభకవిమానంబు వడసి ద్వారకాపురిపై దండెత్తుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
సాల్వుండు శివప్రసాదంబున సౌభకవిమానంబు వడసి ద్వారకాపురిపై దండెత్తుట

పరీక్షిన్మహీపతీ! వినండి. ఇంతకు ముందు రుక్మిణీవివాహసమయంలో శిశుపాలునికి సహాయంగా సేనలతో వచ్చి, శ్రీకృష్ణునిచే ఓడింపబడ్డ రాజులలో సాళ్వుడనేవాడు ఒకడు కలడు. వాడు శ్రీకృష్ణనియందు ఈర్ష్యను పెంచుకొని, ఈ
ర్ష్యాగ్ని జ్వాలలతో 'యాదవుల నందరిని నాశనం చెస్తా'నని జరాసంధాది రాజుల సమక్షంలో మొండిగా ప్రతిజ్ఞ చేశాడు. వెనువెంటనే అత్యంతనిష్ఠతో ఒకానొక ప్రశాంత ప్రదేశాన్ని చేరుకొని పరమేశ్వరుణ్ణిగూర్చి తపస్సు చేయటానికి పూనుకున్నాడు.

సాల్వుడు ధైర్యంవిడువక, తీవ్రమైన పట్టుదలతో, ప్రతిరోజూ పిడికడు దుమ్మును మాత్రమే ఆహారంగా తీసుకొంటూ కఠినమైన నియమాన్ని అవలంబించి ఫాలలోచనుడు, పశుపతి, ఉమానాథుడు స్వరసంహారకుడూ అయిన పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేయడం ప్రారంభించాడు.

ఆ సాల్వుడు దృఢమైన నిశ్చలభక్తిభావంతో పరమశివుని పదపద్మాలపై మనస్సు నిలిపి, సంవత్సరంపాటు నిర్విరామంగా తపస్సు చేశాడు. అందువల్ల వానిభక్తిమహిమకు పరమేశ్వరుడు వశుడై

పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'నీవు ఏ వరం కోరినా ఇస్తాను వేడుకో' - అనగా అప్పుడు ఆ సాల్వుడైన రాచతపసి శంకరునికి ప్రీతితో

తాను కావించిన తపస్సుకు వశుడై, ప్రత్యక్షమయిన పరమేశ్వరునికి సాల్వుడు భక్తిభావంతో నమస్కరించాడు; నొసటిమీద అంజలిని చేర్చి, ఆనందంతో విప్పారినముఖంతో ఇలా విన్నవించాడు. 'శరణాగతులపై దయావర్షాన్ని కురిపించే శంకరా! నీ భక్తుడనగు నన్ను రక్షింపదలంచినట్లైతే, నా కోరికను నీకు వినిపిస్తున్నాను, వినుము!' - అన్నాడు.

భక్తులకు వరాలు ప్రసాదించే పరమేశ్వరా! గరుడులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, దేవతలు - ఈ దేవజాతుల నాయకుల కెవ్వరికీ సాధ్యంకానిదై, నా ఇష్టమైన చోట్లకు ఆకాశమార్గంలో స్వేచ్చగా సంచరించగల వాహనాన్ని నాకు ప్రసాదించు.

సాల్వుని కోరికమేరకు శంకరుడు అనువైన ఒక పట్టణాన్ని నిర్మించి ఇమ్మని మయుణ్ణి ఆజ్ఞాపించాడు. తదనుగుణంగా మయశిల్పి ఇనుముతో ఒక పట్టణాన్ని తయారుచేసి, 'సౌాభక' మనే పేరుపెట్టి సాల్వునికిచ్చాడు. అతడు ఆనందంతో దాన్ని అధిరోహించి, యాదవులమీద తనకున్న శత్రుత్వాన్ని తలచి, గర్వంతో కన్ను మిన్ను గానక వెళ్లి, సేనలతో ద్వారకను ముట్టడించాడు.

ఆ ముట్టడిలో నదులను, ఉద్యానవనాలను ధ్వంసం కావించాడు. సరస్సులను, బావులను, కందకాలను గజిబిజిచేసి పూడ్పించాడు. కోటగోడలను, బురుజులను కూలద్రోయించినాడు. రక్షణయంత్రాలను, పతకాలను తునుకలుగా నరికించాడు. గోపురాలను, మిద్దెలను, మేడలను, చంద్రశాలలను కాల్చివేయించాడు. సువర్ణరత్నాది అమూల్య వస్తుసముదాయాన్ని పూర్తిగా కొల్లగొట్టినాడు. ప్రజలను చెరపట్టి అధికారులైన వారిని అవమానించాడు. ఈ రీతిగా ద్వారకలోని ప్రజానీకాన్ని పెక్కు బాధలకు గురిచేశాడు.

అంతటితో ఆగక, సాల్వుడు విమానంతో ఆకాశంలోకి ఎగిరిపోయి, అక్కడనుండి శక్త్యాయుధాలను, బండలను, వృక్షాలను, బాణాలను వరుసగా ద్వారకపై కురిపించాడు; దుమ్మును, ఇసుకను దట్టంగా వర్షింపజేస్తూ, సుడిగాలుల ద్వారా ద్వారకను అమితంగా కల్లోల పరుపసాగాడు.

ఆ ప్రకారంగా సాల్వుడు అకస్మాత్తుగా ద్వారకాపురిని ముట్టడించి యుద్ధం సాగిస్తూ ఉండగా

ఆ సమయంలో త్రిపురాసురులనే భయంకరులైన రక్కసులవల్ల మిగుల బాధింపబడిన భూలోకంవలె ఆ ద్వారకానగరం సాల్వునిచేత అమితమైన ఇక్కట్టులకు పాల్పరుపబడి తల్లడిల్లుతూ ఉండగా

ద్వారకలోని జనుల కలతపాటును గమనించి, భగంతుడూ, రథికశ్రేష్ఠుడూ అయిన ప్రద్యుమ్నుడు 'భయపడకండి!' - అని ప్రజలను ధైర్యపరుస్తూ మహోత్సాహంతో దివ్యములైన అనేకాయుధాలను దాల్చి, సైన్యాలు సేవిస్తుండగా, మత్స్యధ్వజం ప్రకాశిస్తూ ఉన్న గొప్పతేరు నెక్కి యుద్ధభూమికి బయలుదేరాడు.

శ్రీకృష్ణునికుమారుడైన ప్రద్యుమ్నుడు ప్రజానీకానికి ధైర్యం చెపుతూ, రణోత్సాహంతో సమరభూమికి వెళ్లుతున్న సమయంలో

అతిశయించిన తమ బాహువుల బలపరాక్రమాలచేత శత్రువులను సంహరించే సామర్థ్యంగలవారైన కృతవర్మ, గదుడు, భానువిందుడు, శుకుడు, సాత్యకి, సారణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, అనిరుద్దుడు, అక్రూరుడు మొదలయిన యాదవవీరులందరూ యుద్ధరంగానికి పయనమయినారు.

(గదుడు = బలరాముని తమ్ముడు(రోహిణి ఆరుగురుకుమారులలో ఒకడు).
భానువిందుడు = ఒకానొక యాదవవీరుడు.
శుకుడు = ద్వారకాపురిలోని యదువీరులలో ఒకడు.
సాత్యకి = సత్యకుడను యాదవరాజుయొక్క కుమారుడు. 'యుయుధానుడు” అనేది ఇతని నామాంతరం.
సారణుడు = బలరాముని సోదరులలో ఒకడు (గదుని తమ్ముడు).
చారుదేష్ణుడు = శ్రీకృష్ణునికి రుక్మిణియందు కలిగిన కుమారుడు.
సాంబుడు = శ్రీకృష్ణునికి జాంబవతియందు కలిగిన కుమారుడు.
మకరకేతనాత్మజుడు = అనిరుద్దుడు (ప్రద్యుమ్నునికొడుకు).
శ్వఫల్క తనూభవుడు = శ్వఫల్కుని పుత్రుడు (అక్రూరుడు).
కృతవర్మ = వృష్టివంశంలో జన్మించిన ఒక రాజు. ద్వారకాపురివాస్తవ్యుడు. మహారథియైన వీరుడు. శ్రీకృష్ణభక్తుడు.)

భూమి కంపిస్తూ ఉండగా, అనేకాయుధాల మితిమీరిన కాంతులు సూర్యబింబాన్ని కప్పివేయగా, చతురంగబలాలతో కూడినవారై, యాదవవీరులందరు శత్రువులకు భయం కలిగించే స్వరూపాలతో యుద్దరంగాని కేగినారు.

ఆ విధంగా అరివీరభయంకరంగా బయలువెడలిన యదువీరుల చతురంగబలాలు, తొలుత వెళ్లిన ప్రద్యుమ్నుని రథాన్నిసైతం దాటిపోయి, సమరోత్సాహంతో సాల్వుని సేనలను కమ్ముకొన్నట్లుగా ఎదిరించాయి. అప్పుడు ఆ యిరు పక్షాలనడుమ సాగినసమరం (పూర్వపు) దేవదానవుల యుద్ధంవలె ఎడతెరపిలేనిదిగా గోచరించింది.

రాజేంద్రా! ఆ సైన్యాల్లోని విలుకాండ్రయొక్క అల్లెత్రాళ్లటంకారాలు, మదపుటేనుగుల ఘీంకారాలు, వీరభటుల హుంకారాలు, యుద్ధభేరుల భాంకారాలు, తప్పెటలవంటి చర్మవాద్యాల భయంకరధణధణధ్వనులు, వీరవరుల పౌరుషవాక్యాలు - ఈ శబ్దాలు విరోధులను కలవరపరుస్తూ భూమ్యాకాశాలు నిండిపోయాయి.

గుర్రాల గిట్టలవల్ల, రథచక్రాలవల్ల, సైనికుల పాదాలవల్ల భూతలంనుండి లేచిన ధూళీ సమూహం ఆకాశాన్ని చీకట్లతో నింపింది. ఆ చీకట్లను పొగొడుతూ సైనికుల చేతులలోని కత్తులు మున్నగు ఆయుధాల కాంతులు ఆకాశసంచారులైన దేవజాతులకు కన్నులు మిఱుమిట్లు గొల్పుతూ ఆకాశమంతటా విస్తరించాయి.

యాదవ, సాల్వసేనలు పరస్పరం భీకరంగా ఎదిరించి, బాణాలచే విరోధుల ఎముకలను పగులగొట్టుతూ, గొప్ప గదలతో నడితలలపైన, నొసళ్లమీద గట్టిగా బాదుతూ, కోపంవల్ల కన్నులనుండి నిప్పురవ్వలు రాలుతూ ఉండగా, రణోత్సాహం రంజిల్లగా పోరాడాయి.

ఆ తీరున యాదవ, సాల్వసేనలు హోరాహోరిగా యుద్ధంచేస్తుండగా ప్రద్యుమ్నుడు చూచి

ఆ సమయంలో ఆ సంకులసమరాన్ని తిలకించిన ప్రద్యుమ్నుడు వీరావేశంతో విజృంభించి, సూర్యభగవానుడు తన కిరణాలతో కారుచీకట్లను పటాపంచలు కావించినట్లు, మహిమగల తన దివ్యాస్త్రజాలంతో సాల్వుడు పన్నిన మాయాజాలాన్ని విలాసంగా భేదించి నశింపజేశాడు.

అంతేగాక

అతిరథుల్లో శ్రేష్ఠుడయిన ప్రద్యుమ్నుడు బంగారుఱెక్కలు గలిగిన ఇఱువదియైదు బాణాలు ప్రయోగించి, సాల్వుని సేనాపతిని బాగా నొప్పించాడు. ఇంకా, కోట్లకొలదీ ఇంద్రునివజ్రాయుధంల్లాంటి బాణాలను అనేకంగా ప్రయోగించి, సాల్వుని మూపును గొప్పగా గాయపఱచాడు. అంతటితో విరమింపక, ప్రళయకాలంలోని భైరవునివలె విజృంభించి యుద్ధం చేయసాగినాడు.

ప్రద్యుమ్నుడు పదిపదిబాణాలతో సాల్వునిమిత్రులైన మహారాజులను నొప్పించాడు. మూడు మూడు బాణాలు ప్రయోగించి రథ, గజ తురగాలను నేలగూల్చినాడు. ఒక్కొక్క బాణంచేత సైనికుల బలగర్వాన్ని అణచివేశాడు. ఈ రీతిగా ఎదురులేని విధంగా పరాక్రమించినాడు.

మెరునగధీరుడు, నిర్భయుడు, శత్రువుల్ని సంహరించేవాడు నయిన ప్రద్యుమ్నుణ్ణి, ఆశ్చర్యకరమయిన ఆతని పరాక్రమ నైపుణ్యానికి మెచ్చి, స్వపక్షమందలి సైనికులతోపాటు, శత్రుపక్షంలోని సైనికులుసైతం పక్షపాతంలేని నిర్మల బుద్ధితో ప్రశంసించారు.

ఆ రీతిగా ఇరువైపుల సైనికులు ప్రద్యుమ్నుని పరాక్రమాన్ని ప్రశంసిస్తూవున్న సందర్భంనందు

ప్రద్యుమ్నుని పరాక్రమాన్ని ఉభయ సైన్యాలు కొనియాడుతూ ఉన్న ఆ సమయంలో సాల్వుడు శ్రీకృష్ణుడి మఱియొక కుమారుడైన సాంబునిపై ఎన్నో బాణాలను ప్రయోగించి మిక్కిలి నొప్పించాడు. వెంటనే సాంబుడు విల్లెక్కిడి సాల్వుని ఱొమ్ముపై పదునైదు బాణాలను వేసి, ఇఱువదివాడిగల బాణాలు వేసి వాడి సౌభకవిమానం అల్లాడేటట్లు చేసినాడు.

పరీక్షిద్రాజేంద్రా! రథికులలో ఉత్తముడైన గదుడు రాహుముఖాన్నిపోలిన భీకరబాణసమూహాలను ప్రసరింపజేసి, శత్రువుల శిరస్సులను ఆ బాణాలకు గుత్తులుగా గూర్చి పైకెత్తి చూపుతూ, పరాక్రమప్రదర్శనమనే ఆటలో ఆసక్తుడై ఉండినాడు. ఆ సమయంలో ఆకాశంలో దేవతాబ్బందాలు అతనిపరాక్రమకేళిని తిలకిస్తూ ప్రశంసించసాగారు.

భూనాథా! శ్రీకృష్ణునిసోదరుడైన సాత్యకి తీవ్రమైనకోపంతో చతురంగబలసహితమై యున్న సాల్వుని సౌభక విమానమనే చీకట్లను మిఱుమిట్లుగొల్పుచున్న సూర్యకిరణాలను పోలిన వాడిబాణాలచే పటాపంచలు కావించాడు. ఆతని పరాక్రమాన్ని ఇరువైపులనున్న సైనికులు మిగుల ప్రశంసించినారు.

భానువిందుడు అహంకరించియున్న శత్రుపక్షసైన్యమనే అరణ్యాన్ని తీక్ష్ణమైన దావానలంవంటి తన బాణసముదాయంతో దహించి, చూర్ణంచేసి వైచాడు. అలాంటి ఆతని ధనుర్విద్యాకౌశలాన్ని తిలకించిన ఆకాశంలోని దేవతలసమూహం తమ తమ మనస్సులలో ఎంతగానో మెచ్చుకొన్నారు.

రుక్మిణీతనయుడైన చారుదేష్ణుడు కోపంతో విజృంభించి, వాడియైన బాణ పరంపరను ప్రయోగించి సాల్వుని సేనానుల్ని అందరినీ మారిరేగిన రీతిగా సంహరించి, ఉత్సాహంతో గట్టిగా సింహగర్జన చేశాడు.

శుకుడు సమరవిజయకాంక్షగలవాడై, తన భుజబలాన్ని చూపరులు పొగిడే విధంగా శౌర్యాతిశయంతో బాణాలు ప్రయోగిస్తూ, శత్రువులబలాలను (సేనలను) నశింపజేశాడు.

బలభద్రుని తమ్ముడైన సారణుడు శత్రుసైన్యాలు భీతిల్లేటట్లుగా ఉగ్రరూపుడై ఉత్సాహంతో సమీపించి, బల్లెములు, బాణాలు, ఈటెలు, గదలు, కత్తులు మొదలైన ఆయుధాలను నిరంతరం ప్రయోగిస్తూ సాల్వుని సేనలోని గుఱ్ఱాలను, ఏనుగులను, రథాలను ఖండించి వేశాడు; సైనికులను సంహరించి యమపురికి పంపివేశాడు.

మహావీరుడైన అక్రూరుడూ ఆయన సోదరులూ గొప్ప భుజబల పరాక్రమంతో మెరసి, చక్రప్రాసాది అనేక ఆయుధాలను ప్రయోగించి విరోధులను వధించారు.

పరీక్షిన్మహారాజా! రథికోత్తముడైన కృతవర్మభూపతి బాణాలచే శత్రువీరుల కవచాలను భేదించి వాళ్లశరీరాలను పెక్కుగాయాలు గావించి, ముక్కలు ముక్కలుగా నరికివేయసాగాడు. అది అద్భుతకృత్యమని శత్రుసైనికులు సైతం పొగడసాగారు. వారిలో కొందరు విరోధులు భయంచేత పారిపోతూవుండగా, యుద్ధధర్మాన్ని అవలంబించి కృతవర్మ వారిని చంపక విడిచిపెట్టాడు.

కృతవర్మ చేసిన తీవ్రమైన యుద్ధంవల్ల సాల్వునికి ఆగ్రహం కలిగింది. తదనుసారం ఆతడి సాభకవిమానం మాయా ప్రభావంతో విజృంభించింది.

పరీక్షిన్మహారాజా! ఆ సౌభకవిమానం తన మాయాబలంచేత ఒక పర్యాయం ఆకాశంలో కనపడుతుంది. ఒకమారు భూమిమీద నిలుస్తుంది. ఒకమారు కొండశిఖరంమీద వర్తిస్తుంది. ఒకసారి సముద్రమధ్యంలో విహరిస్తుంది. ఒకవేళలో ఒక్కటిగానూ, మరుక్షణంలో అనేక రూపాలుగానూ కనబడుతుంది. ఒకమారు చుట్టూ ప్రాకారంతో చూపట్టుతుంది. మరియొకమారు ఏమీ లేకుండగా కనిపిస్తుంది. ఒక మాటు గొప్పకొఱవిని గిరగిర త్రిప్పినట్లు భయంకరంగా దర్శనమిస్తుంది. ఈ విధంగా మాయావిమానం యాదవులు కలవరపడేలాగున అనేకవిధాలుగా తిరిగింది.

ఈ రీతిగా సౌాభకవిమానం విజ్బంభించేసరికి, అంతవరకు యాదవుల సేనలవల్ల జాలినొందియున్న తన సైన్యాన్ని సాల్వభూపతి మళ్లీ యుద్దానికి ప్రేరేపించి

అప్పుడు సాల్వుడు ఎడతెగకుండా అగ్నిశిఖలలాంటి బాణాలను యాదవ సైన్యంపై ప్రయోగించాడు. అయినప్పటికీ యాదవుల బలాలు వెనుకంజ వేయకుండా ధైర్యంతో యుద్ధం సాగించాయి.

ఆ సమయాన ఇరు పక్షాల యోధులూ అలసిపోకుండా పౌరుషంతో పోరాడసాగారు. అప్పుడు వాళ్లలో పేరుమోసిన యోధులమధ్య ద్వంద్వయుద్ధం ఆరంభమయింది.

యుద్ధ ఆరంభమైన సమయంలో ప్రద్యుమ్నుడి బాణజాలంచేత బాధింపబడిన ద్యుముడనే పేరుగల సాల్వుని మంత్రి గొప్పగదను ధరించి అధికమైన బలంతో (ప్రద్యుమ్ను కుమారుణ్ణి ఎదుర్కొన్నాడు)

నైపుణ్యం, పరాక్రమం, గర్వం వెల్లడి అవుతుండగా ద్యుముడు ప్రద్యుమ్నుణ్ణి సమీపించి వక్షఃస్థలం పగిలేటట్లు గదతో కొట్టినాడు. ఆ దెబ్బతో అతడు విలవిలలాడిపోయి, మేనెల్ల గగుర్పాటు నొందగా, చేతిలోని ఆయుధాల్ని జారవిడిచి, కనులు మూడలుపడగా, రథంమీద మూర్చపోయాడు.

యుద్ధధర్మం చక్కగా తెలిసినవాడు, నీతి కోవిదుడు, ధైర్యశాలి అయిన దారుకతనయుడు ప్రద్యుమ్నుని రథాన్ని యుద్ధరంగంనుండి వేగంగా ప్రక్కకు తోలుకొని వెళ్లాడు. అంతలో ప్రద్యుమ్నుడు మూర్చనుండి తేఱుకొనినాడు.

(సనత్కుమారుని అంశతో రుక్మిణీ కృష్ణులకు జన్మించిన తనయుడు ప్రద్యుమ్నుడు. ఇతడు పూర్వజన్మంలో మన్మథుడు. ప్రద్యుమ్నుడు శంబరుడనే రాక్షసుణ్ణి సంహరించడంచేత ఈతనికి 'శంబరారి' అను పేరు ఏర్పడింది.)

మూర్చనుండి తేరుకొనిన ప్రద్యుమ్నుడు సారథిని మందలించినాడు. 'శత్రువీరులు నవ్వుకొనేటట్లుగా, శ్రీకృష్ణుడు, బలరాముడు ఎగతాళిచేసేటట్లుగా యుద్ధభూమినుండి నా రథాన్ని ప్రక్కకు తప్పించి అపకీర్తి తెచ్చావు. యదువంశంలో జన్మించిన వీరవరులు శౌర్యాన్ని విడనాడి, ఈ విధంగా యుద్ధరంగంనుండి ఎన్నటికీ తొలగిపోరు.'

ప్రద్యుమ్నుడు పై విధంగా సారథిని మందలించగా, సారథి రథియైన ప్రద్యుమ్నకుమారునితో ఇలా పల్కినాడు.

శత్రువులచేత రధికుడు బాధింపబడినపుడు సారథీ, సారథి దెబ్బతిన్నప్పుడు రథికుడూ సమయానుకూలంగా పరస్పరం సంరక్షించుకోవటం గొప్పదైనయుద్ధధర్మం. కాబట్టి, నేను రథాన్ని ప్రక్కకు మరలించినాను అందుకు నీవు చింతింపక, శత్రువుల్ని జయించడానికి ప్రయత్నించు.

సమరధర్మాన్నిగూర్చి సారథి ఆవిధంగా వివరించగా వినిన రథి(ప్రద్యుమ్నకుమారుడు) సంతోషించాడు.

గొప్పగా భుజబలం సమకూడిన వీరుడైన ప్రద్యుమ్నుడు సారథిపలికిన సమరనీతి వాక్యాలకు సంతోషించాడు. వెంటనే విల్లెక్కుపెట్టి, ధనుష్టంకారంతో శత్రుసమూహాలను భయభ్రాంతుల్ని చేస్తూ, ద్యుమునిపైకి తన రథాన్ని నేర్పుతో వేగంగా తోలించాడు.

ఆ రీతిగా నిపుణతతో రథముమీద వేగంగా ద్యుముణ్ణి సమీపించినవాడై

ప్రద్యుమ్నుడు రథంమీద ద్యుముణ్ణి సమీపించినాడు. రోషంతోగూడిన శౌర్యంతో వానిశరీరాన్ని గాయాలపాలు గావించాడు. నాలుగు బాణాలతో (నాలుగు) గుఱ్ఱాలను, ఒకబాణంచేత సారథిని సంహరించాడు. రెండమ్ములచే పతాకాన్ని ధనుస్సును పొడిపొడి కావించాడు. చివరగా ఒకేయొక పదునైనబాణంతో ద్యుముని కంఠాన్ని ఖండించాడు.

ప్రద్యుమ్నుని వీరవిజ్బంభణం చూచి, సాంబుడు మొదలయిన యోధవర్యులు ప్రద్యుమ్నుణ్ణి ఎంతో కొనియాడి, పదునైన బాణజాలంతో తాటిపండ్లను నెలమీద ఒక్కుమ్మడిగా రాల్చిన విధంగా సాల్వుని సైనికుల శిరస్సులను వేగంగా ఖండించి వేశాడు.

ఆ విధంగా సాంబుడు మొదలైన యోధవరులు సాల్వునిసేనలను సంహరించిన వేళయందు

సాల్వుని సేనలకు, యాదవ సైన్యాలకూ జరిగిన ఆ భీకరసంగ్రామంలో గుర్రాలు కూలిపడినాయి. ఏనుగులు కుప్పలుగా భూమిపై పడిపోయాయి. రథాలు పొడిపొడి అయిపోయాయి. భటులు నేలపై పడిపోయారు. ఆ సమయంలో భూతాలు, రక్కసులు, పిశాచాలు గుంపులై ఆనందంతో రక్తపానం చేస్తూ, మాంసాలను నంజుకొంటూ, ఎముకలు కొరుకుతూ, జతలుగా కూడి చప్పట్లు తట్టుతూ మైమరచి నాట్యం చెయ్యసాగాయి.

ఆ యుద్ధరంగంలో మఱోవైపున

ఆ యుద్దరంగంలోని గజసైన్యాలుండే ప్రదేశం ఒక సముద్రంలాగా గోచరిస్తూ ఉన్నది. ఖండించబడ్డ ఏనుగుల గండభాగాలే మొసళ్లు, పొడవైన తొండాలే సర్పాల సమూహాలు, ఏనుగుల అరికాళ్లే తాబేళ్లు, ఏనుగుల దంతాలే ముత్యపు చిప్పలు. కుంభస్థలాలనుండి జారిపడిన ముత్యాలే సముద్రమందలి రత్నాలు. ఏనుగుల తెగిపడ్డతోకలే జలగలు; విడివడిన ఏనుగులమెడలభాగాలే కప్పలు ఏనుగులమెదడుసమూహం సముద్రంలోని బురద. ఏనుగుల శరీరాలనుండి బయల్పడిన (రక్తంతో తడిసి యొఱబడిన) ప్రేవులే సముద్రమందలి పవడపు తీగలు. ఏనుగుల శరీరాలనుండి వెలువడిన నరాలే సముద్రపు పాచి తీగలు. ఎముకల నడుమ నుండు మూలుగే నురుగుల గుంపులు. పొడిపొడియైన ఎముకలే ఇసుక దిబ్బలు; ఏనుగుల శరీరాలనుండి పారిన రక్తసమూహములే సముద్రజలములు. ఏనుగులు ఒరిగి పడుచూ కావించిన ఆర్తనాదాలే సముద్రతరంగాలు గొప్ప ధ్వనులు. ఈ రీతిగా ఆ యుద్ధభూమి ప్రాంతం సముద్రంతో సరిపోలినదై గోచరించింది.

ఈ విధంగా యాదవులసేనలు, సాల్వుని సేనలు ఒకరినిమఱొకరు జయించాలనే పట్టుదలతో గూడిన కోరికతో తూర్పుపడమరసముద్రాలు పోరాడినట్లు ఇరువదేడు దినాలు అతిభీకరరీతిని యుద్ధంచేశాయి. ఆ సమయంలో ఇంద్రప్రస్థ పురినుండి ద్వారకకు వస్తూ మధ్యమార్గంలో కానవచ్చిన అపశకునాలను పరికించి, శ్రీ కృష్ణుడు సారథియైన దారుకునితో ఇలా అన్నాడు.

'చూచావా! దారుకా! ఆకాశంలోనూ, భూమిమీదా మహాభయంకరంగా అపశకునాలు గోచరిస్తున్నాయి. నేను ఇంద్రప్రస్థపురిలో కుదురుగా ఉంటూ ఉండగా గమనించి, శిశుపాలుని స్నేహితులైన రాజులు కొందరు నా పట్టణాన్ని నశింపజేసే కపటోపాయంతో దండెత్తి వచ్చిన్నట్లు తోస్తున్నది. రథాన్ని వేగంగా పోనీ!

అలాగ శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించగానే దారుకుడు అతిత్వరగా తేరును పోనిచ్చాడు. ద్వారకను సమీపించిన వాసుదేవుడు శత్రుసేనలతో తలపడి యుద్ధంచేస్తున్న యాదవ సైన్యాలను, ఆకాశమార్గంలో మాయాప్రభావంతో మోసగిస్తూ యదువీరులకు సాధ్యంకాకుండా ఉన్న సౌభకవిమానాన్నీ అందులోవున్న సాల్వుణ్ణి చూచాడు. వాని సమీపానికి రథాన్ని తోలించాడు. శ్రీకృష్ణుణ్ణి వీక్షింపగానే యాదవసేనలు పరమానందం పొందాయి. చైతన్యం కోల్పోయి, దైన్యంతో ఉన్న తన సైన్యాన్ని పరికించి, సాల్వుడు పూనికతో విజ్బంభించాడు.

నిప్పురవ్వలు అన్నివైపులా చెదరిపడుతుండగా, ఆకసంలో మంటలు ప్రసరిస్తూ ఉండగా; చిరుగంటల ధ్వనులచే దిక్కుల నడిమి ప్రదేశమంతా వణకుతుంటే మహాభయంకరమయిన 'శక్తి' అనే దివ్యమైన ఆయుధాన్ని సాల్వుడు శ్రీకృష్ణుని సారథియైన దారుకునిపైకి విసరివేసినాడు. అది చుక్క తెగిపడుతున్నట్లుగా రాసాగింది.

వెలుగులీనే ఒకానొక నక్షత్రం ఆకాశంలోనుండి తెగిపడిన రీతిగా వేగంగా దారుకునిమీదికి దూసుకొని ఆ దివ్యశక్తి వస్తూవుండగా, దాన్ని శ్రీకృష్ణుడు ఒక్కబాణంతో మధ్యమార్గంలోనే పొడిపొడిగా చేసి నేలపై రాలేట్లు చేశాడు.

గొప్ప బాహుబలసంపన్నుడైన శ్రీకృష్ణు డంతటితో శాంతించక, మొక్కవోని పరాక్రమంతో, కొఱవి త్రిప్పినట్లుగా ఆకాశంలో భీకరంగా తిరుగుతూ చూడ శక్యం గాకుండా ఉన్నసౌభకవిమానాన్నీ అందులో ఉన్న సాల్వుణ్ణీ మిక్కిలి వాడియైన సూర్యకిరణాలవంటి పదునైన పదహారు బాణాలను బాగా నాటుకొనేటట్లుగా ప్రయోగించాడు.

సాల్వుడు మిగుల కోపించి, తనధనుస్సును మేఘం ఉఱిమినట్లుగా ధ్వనింపజేస్తూ శ్రీకృష్ణుని ఎడమభుజంలో నాటుకొనే టుగా వెడల్పు మొనలుగల బాణాలను వేగంగా ప్రయోగించాడు. ఆ దెబ్బకు తెగువను కోల్పోయిన కృష్ణుడు శార్‌ఙ్గమనే తన వింటిని రథంపై జారవిడిచినాడు. అందుకు ఆకసంలో ఉన్నదేవతలు భీతిల్లి చూడసాగారు.

శ్రీకృష్ణుడు వింటిని తేరుపై జారవిడిచినందుకు ప్రకృతియందలి భూతాలు హాహాకారాలు చేశాయి. అంతలో ఆయన సాల్వుని బాణాలవలన కలిగిన బాధనుండి తేరుకొన్నాడు. అది గమనించిన సాల్వుడు భుజశౌర్యం ప్రైరేపిస్తూండగా శ్రీకృష్ణుణ్జి చూచి యుద్ధఉత్సాహంతో ఇలా పల్కాడు.

'కృష్ణా! నా మిత్రుడు (శిశుపాలుడు) కోరిన కన్యకను (రుక్మిణిని) నీవు నీతి మాలినవాడివై అన్యాయంగా స్వీకరించావు. అది చాలక ధర్మజుని సభాస్థలిలో ఏ మరుపాటున ఉన్న ఆతణ్జి పగబూని ఆగ్రహంతో సంహరించావు. అటువంటి కలుషాత్ముడివైన నీవు నేడు రణరంగంలో (నిలిచినాతో పోరాడాలి)

కలుషాత్ముడవైన నీవు యుద్ధరంగంలో అధైర్యంతో పారిపోక, భుజబలంతో నా ఎదుట ధైర్యంగా నిలువబడ గలిగినట్లయితే, నా మిత్రుణ్ణి సంహరించిన పాపానికి పరిహారంగా నిన్ను నా యొక్క కర్కశబాణాగ్నిజ్వాలలలో ముంచివేసి పగ తీర్చుకుంటాను.

ఆ విధంగా బీరాలు పలికిన సాల్వుని మాటలకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. 'ఓరీ మూఢుడా! బలపరాక్రమాలుగల శూరునివలె ప్రేలుతున్నావు. నీకు చావు మూడిన సంగతిని గుర్తించలేకుండా ఉన్నావు - అని పల్కి తన గదను గిరగిర త్రిప్పి, ఒడుపుగా వానిపై విసరాడు.

ఆ విధంగా శ్రీకృష్ణుడు గదాయుధాన్ని సాల్వునిపై విసిరవేసిన తర్వాత

అప్పుడు శ్రీకృష్ణుని గదాఘాతంచేత తన నోటినుండీ, ముక్కునుండీ రక్తం స్రవిస్తూ ఉండగా సాల్వుడు తీవ్రంగా మూర్చపోయాడు. కొంతసేపటికి మెల్లగా తేరుకొన్నవాడై, అక్కడ నిలువకుండా వెంటనే సౌభకంతోపాటు మాయమైపోయాడు.

ఆ విధంగా సాల్వుడు విమానంతోకూడా అదృశ్యమైపోయిన సందర్భంలో

ఆ సమయంలో ఆకసంనుండి ఒకానొక మనుష్యుడు (బిగ్గరగా) దుఃఖిస్తూ శ్రీకృష్ణునివద్దకు వచ్చాడు. ఆయన పాదకమలాలకు వందనం చేసి, ఇలా విన్నవించాడు. 'దేవా! (మీ తండ్రియైన) వసుదేవుణ్ణి క్రూరుడైన సాల్వుడు బంధించి తెచ్చాడు.'

('ఆనకము' అంటే తప్పెటవంటి వాద్యం; 'దుందుభి' అనగాభేరి. వసుదేవుడు జన్మించిన సమయంలో దేవతలు ఆకాశం నుండి శుభసంతోషసూచకంగా ఈ రెండువిధాలైన వాద్యాలను మ్రోయించారు. అందుచేత, వసుదేవునికి “ఆనక దుందుభి" - అనే నామధేయం సార్ధకంగా ఏర్పడింది.)

దేవదేవా! ఈ విషయాన్ని మీకు తెల్పేనిమిత్తం తల్లి దేవకీదేవి నన్నిక్కడికి పంపింది - అని చెప్పగా, శ్రీకృష్ణుడు తండ్రియెడగల ప్రేమాధిక్యంచేత తీవ్రమైనవిషాదానికి లోనయ్యాడు.

'దేవ దానవ గంధర్వ మానశ్రేష్ఠులైన వారికి కూడా జయింపరాని బలరామదేవుడు జాగరూకతతో కాపాడుతూ ఉండగా, హీనబలుడైన సాల్వునిచే తండ్రియగు వసుదేవుడేలాగున పట్టువడినాడోకదా!' - అని వాసుదేవుడు ఆశ్చర్యంతో ఆలోచింపసాగాడు.

అలా అనుకొంటూ, మనస్సు వికలత పొందగా దైవనిర్ణయాన్ని తప్పించడానికి ఎవరికైనా, ఏవిధంగానైనా సాధ్యంకాదు గదా! - అని దుఃఖిస్తూ విచారంతో పలుకుతూవుండగా, అంతలో ఆ సాల్వుడు(తన మాయాబలాన్ని ప్రదర్శింపసాగాడు)

అంతలో సాల్వుడు మరల కనిపించాడు. మాయావసుదేవుణ్ణి కల్పించి బంధించుకొని వచ్చాడు. “కృష్ణా! వీడే మీ తండ్రి. నీ యెదుటే వీని శిరస్సును ఖండించివేస్తాను. బలంకలవాడవైతే రక్షించుకో!” - అని పరుషంగా దుర్భాషలు పల్కుతూ, ఖడ్గాన్ని జలిపిస్తూ కల్పితవసుదేవుని శిరస్సును క్రుంచి, ఆ తలతోపాటు సౌభకవిమానంలోకి వెళ్లిపోయాడు. ఆ దృశ్యాన్ని చూచిన శ్రీకృష్ణుడు సాధారణమనుష్యునివలె కొంతసేపు అత్యంతదుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు తనసైన్యంలోని ప్రముఖులు కొందఱు సందర్భోచితాలైన పల్కులతో ధైర్యపరుస్తూ, కర్తవ్యాన్నిగూర్చి ప్రబోధించారు. అదంతా మయుడనే రక్కసునిద్వారా సాల్వుడు నేర్చుకొన్న మాయా విద్యాప్రభావమేనని శ్రీకృష్ణుడు ఆలోచించి తెలిసికో గలిగాడు. అంతలో 'వసుదేవుడు పట్టుబడినాడ'ని చెప్పిన దూతా, ఆ మాయాకళేబరమూ మాయమైపోయాయి.

ఆ సమయంలో మునీంద్రులు కొందరు మాయావిముక్తుడు, జయశీలుడు, విష్ణుస్వరూపుడు, కమలదళనేత్రుడు - అయిన శ్రీ కృష్ణునివద్దకు వచ్చి, భక్తియుక్తులై, వినయంతో ఇలా విన్నవించారు.

'పాపరహితుడవైన పుండరీకాక్షా! సమస్తమానవులూ సంసారమనే పలురకాలై ఉండే దుఃఖసముద్రంలో మునిగి గట్టుచేరజాలక కొట్టుమిట్టాడుతున్న వేళలో నిన్ను ధ్యానించి ఆ దుఃఖాలను నివారింపజేసికొంటూ ఉంటారు. అటువంటి సద్గుణాలకు నిలయుడవై, దేవతలందరకు ముఖ్యాధారుడవై పరటబ్రహ్మస్వరూపుడవై, పరమయోగీంద్రులకు సైతం అందరానటువంటి ఉత్కృష్టమైన చిదానందస్వరూపంతో ప్రకాశిస్తూవుండే నీ వెక్కడ? అల్పులైనవారి మనస్సుల్లో ఆవిర్భవించే భయం, మోహం, శోకం మొదలగునవి ఎక్కడ? నిజంగా నీవు వాటికి అతీతుడవు కదా!' - అని ఈ విధంగా సన్నుతించి ఆమునీశ్వరులు తమదారిన తాము వెళ్ళిపోయారు.

శ్రీకృష్ణుడు తనమీద వాడిబాణాలు ప్రయోగిస్తూవున్న సాల్వుణ్ణి సంహరింప నిశ్చయించాడు. అందువల్ల, వర్షధారలవంటి తీవ్రమైన బాణజాలంతో ఆకాశాన్నంతటినీ కప్పివేసి శీఘ్రంగా ఆతని కిరీటంలోని రత్నాన్సీ, వాని ధనుస్సునూ, కవచాన్నీ భేదించి వేశాడు.

శ్రీకృష్ణుడు జగద్విఖ్యాతమైన వీరవిజ్బంభణగల అమితమైన శక్తితో ఆకాశంనిండా మెఱుగులు ప్రసరించేటట్లుగా తన గొప్పగదను అమితవేగంగా త్రిప్పి, విసరి వేసినాడు. అలా శీఘ్రంగా విసరివేసి, త్రిపురాలలాంటిదీ, గొప్ప మాయాప్రభావంకలదీ అయిన సౌభకవిమానాన్ని పొడిపొడి గావించి కూల్చి వేశాడు.

ఆ విధంగా శ్రీకృష్ణుడు తన గదాయుధపు దెబ్బచేత మయుడు నిర్మించిన మాయావిమానాన్ని (సౌభకాన్ని) పొడిపొడి గావించి, సముద్రంపై రాలిపడేట్టు చేశాడు. అప్పుడు సాల్వుడు కోరలు పెరికివేసిన (క్రూరసర్పంలాగా పారుషం నశించి, మాయాశక్తిని కోల్పోయి చిన్నబోయియున్న వాడైనప్పటికిని తగ్గని పరాక్రమంతో ఆకాసంనుండి క్రిందికి దిగినాడు, కోపం వహించి (గదనుచేత పూనినాడు)

ఓ రాజా! సాల్వుడు ఆగ్రహంతో వజ్రాయుధంవంటి భీకరమైన గదను ధరియించి శ్రీకృష్ణు
ణ్ణి  ఎదుర్కోవడానికి వచ్చాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన ఖడ్గంతో గదను పూనియున్న వానిచేతిని కఠోరమైనరీతిలో ఖండించివేశాడు.

శ్రీకృష్ణుడు అంతటితో ఆగక, ప్రళయకాల సూర్యమండలప్రభలను వెదజల్లుతూ ఉండే అజేయమైన సుదర్శనచక్రాయుధాన్ని చక్కగా చేతిలో ధరించి సాల్వరాజుపై ప్రయోగించాడు.

దేవేంద్రుడు వజ్రాయుధంచేత వృత్రాసురుణ్ణి సంహరించిన విధంగా శ్రీకృష్ణుడు సుదర్శనచక్రంచేత మకుటమణి కాంతులచేత ప్రకాశిస్తూవున్న సాల్వుని శిరస్సును శౌర్యంతో శీఘ్రంగా ఖండించివేశాడు.

శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట







No comments:

Post a Comment

Sri Krishnudu Danthavaktruni Vadhinchuta - శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు కపటియైన సాల్వుణ్ణీ, ఆతనిసౌభకవిమానాన్నీ...