Wednesday, August 26, 2026

Naraduni Valana Vruthanthamunu Vini Krishnudu Banasurunipai Dandetthuta - నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట

శరత్కాలమేఘం పాదరసంవంటి స్వచ్చమైన శరీరకాంతిగలవాడూ, సాటిలేని అదృష్టసంపన్నుడు అయిన నారదుడు దయాబుద్ధిగలవాడైై; శ్రీకృష్ణుణ్ణి సేవించడానికి వచ్చాడు.

ఈ విధంగా వచ్చిన నారదమునిని సుధర్మాసభలో శ్రీకృష్ణుడు, యదు, వృష్టి, భోజ, అంధకవీరులు అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉన్నతాసనంలో కూర్చుండ పెట్టి దేవమునిని గౌరవించాడు. నారదుడు అనిరుద్ధుని వృత్తాంతమంతా స్పష్టంగా తెలిపాడు. శ్రీకృష్ణుడు బాణాసురునిపై యుద్దానికి మంచి ముహూర్తం నిర్ణయించి, సైన్యాన్ని సిద్ధం చేసేందుకు వేత్రహస్తుల్ని నియమించి, తానూ యుద్దానికి సిద్ధమయ్యాడు.

(యదు, వృష్టి, భోజ, అంధకములనేవి నాల్గు రాజవంశాల పేర్లు. యదువంశానికి చెందినవాడు నందగోపుడు, ఆయన భార్య యశోద. కృష్ణుని పెంచి పెద్ద చేసినవారు. వృష్టి వంశపురాజు వసుదేవుడు, దేవకీదేవి. శ్రీకృష్ణుని తల్లితండ్రులు, భోజవంశపురాజు కుమార్తె కుంతీదేవి. ఈయనకు కుంతిభోజుడనీ పేరు. అంధక వంశపురాజు ఉగ్రసేనుడు. ఆయన కుమారుడు కంసుడు.

తండ్రిని చెరసాలలో బంధించి సింహాసనమెక్కినవాడు, కంసుని ఆస్థానంలోని మల్లయుద్ధ వీరులైన చాణూరముష్టికులు అంధకదేశీయులు. శ్రీకృష్ణుడు ఈ మల్లయుద్ధ వీరులిద్దరినీ, మేనమామ కంసుణ్ణి సంహరించి, తాతగారైన ఉగ్రసేనుణ్ణి సింహాసనాసీనుణ్ణి చేశాడు.)

శ్రీకృష్ణుడు హారాలు, కిరీటం, భుజకీర్తులు, చేతికడియాలు, ఉంగరాలు, నూపురాలు మున్నకు అలంకారాలూ, ఆభరణాలూ ధరించాడు. చేతుల్లో గద, శంఖం, చక్రం ప్రకాశించగా సువాసనగల చందనం అద్దినవక్షఃస్ధలం పై గల, కౌస్తుభమణి కాంతులు వ్యాపించగా పసుపురంగు పట్టువస్త్రం కుచ్చిళ్లు ఏర్పడేటట్లు కట్టాడు. సారథి దారుకుడు రథాన్ని సిద్ధం చేసుకొనిరాగా, తూర్పుకొండపై సూర్యుడు ఎక్కినట్లు - సంతోషాతిశయంతో - ఆ రథాన్ని ఎక్కాడు.

శ్రీకృష్ణుడు రథం ఎక్కగానే బ్రాహ్మణులు ఆశీర్వదించారు. ముత్తైదువలు అక్షతలు చల్లారు. వందిమాగధులు కైవారాలు చేశారు. స్తోత్రపాఠకులు చేసే ప్రశంసలకు కృష్ణుడు ఆనందించాడు.

బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు మొదలైన ప్రముఖ యదు, వృష్టి, భోజ, అంధకవీరులు శత్రుబలనిర్మూలనకై చతురంగ బలసమేతులై పండ్రెండు అక్షౌహిణులతో, పూర్వం ఆకాశగంగ భగీరథుని వెంటవెళ్లిన విధంగా కృష్ణుని వెంట నడిచారు.

కొన్ని దినాల తరువాత యాదవవీరులు శోణనగరం హద్దులు దాటి, ఆ నగరాన్ని చేరారు. అంతట

యాదవసైన్యం శోణపురప్రాంతానికి చేరి నదులను, సరస్సులను, విహార స్థలాలనూ, ఉద్యానవనాలను, యజ్ఞస్థలాలను నాశనం చేశారు. అనేక అగడ్తలను పూడ్చారు. యంత్రాలను పాడుచేశారు. గోపురాలను పడగొట్టారు. రాజభవనాల్ని కూలద్రోశారు. ప్రాకారాలను నేలకూల్చారు. అమితోత్సాహంతో తలుపులను బ్రద్దలుకొట్టారు.

యాదవవీరులు శోణపురాన్ని అనేకవిధాలుగా నిరోధించారు. రాక్షసరాజగు బాణుడు కోపోగ్రమూర్తియై సైన సంసిద్ధతకై యుద్ధభేరి మ్రోగించగా

భూమి కుమ్మరిసారెవలె తిరిగింది. ఆదివరాహస్వామియొక్క గిట్టల తాకిడికి కలతచెందిన నదీనదాల్లాగా సముద్రాలు క్రిందుమీదుగా లేచే అలలతో పొర్లాయి. శివుని చేతిలోని శూలం దెబ్బలకు రాలే పిడుగులవలె నక్షత్రాలు నేల రాలాయి. భయంకరమైన గాలికి ఎగిరిన బూరుగుదూది విధంగా మేఘాలు చెల్లాచెదరయ్యాయి. పర్వతాలు కంపించాయి. స్వర్గం క్షోభించింది. దేవతల గుండెలు కలతపడ్దాయి. దిక్కులు చలించాయి. విమానాలు దారితప్పాయి. సూర్యచంద్రులు మార్గం తప్పారు.

యుద్ధసన్నాహానికి సిద్ధపడ్డ బాణుడు బంగారుకవచాన్ని రత్నకాంతులతో కూడిన కిరీటాన్ని కుండలాలను, హారాలను ధరించి ప్రాసం, తోమరం, గద, ఖడ్గం మొదలైన అనేక ఆయుధాలతో తన సైన్యం శత్రు సైన్యాలకు దీటుగా ఇరువైపుల నడువగా ఉన్నతమైన రథం ఎక్కి మహాశౌర్యంతో యుద్దానికి వెళ్లాడు. ఆ సమయంలో

బాణాసురునికి సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట







No comments:

Post a Comment

Naraduni Valana Vruthanthamunu Vini Krishnudu Banasurunipai Dandetthuta - నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట శరత్కాలమేఘం పాదరసంవంటి స్వచ్చమైన శరీ...