Tuesday, August 25, 2026

Rathidevi Pradyumnasahithayai Gaganamargambuna Dwarakaku Bovuta - రతీదేవి ప్రద్యుమ్నసహితయై గగనమార్గంబున ద్వారకకు బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
రతీదేవి ప్రద్యుమ్నసహితయై గగనమార్గంబున ద్వారకకు బోవుట

ప్రద్యుమ్నుడు శంబరుణ్ణి వధించి ఆనందిస్తున్నాడు. అప్పుడు ఆకాశగమనం చేసేరతీదేవి అతణ్ణి తీసుకొని ఆకాశమార్గంలో ద్వారకానగరం పై భాగంలో వస్తుంటే

ప్రద్యుమ్నుడు మెఱపుతీగతో కూడిన మేఘంవలె రతీదేవితో కలసి, ఆకాశంనుండి బయలుదేరి, స్త్రీలు తిరుగుచున్న అంతఃపురానికి వచ్చాడు.

నీలమేఘశరీరుడు, ఆజానుబాహుడు, నల్లని చిక్కని వంకర ముంగురులు కలవాడు, పసుపు పచ్చని వస్త్రం తాల్చినవాడు, విశాల వక్షఃస్థలం గలవాడు; సన్నని నడుముకలవాడు, విచ్చిన కలువరేకులవంటి కన్నులు గలవాడు, చిఱునగవు చిందించేవాడూ, అయిన ప్రద్యుమ్నుణ్ణి చూచి, అంతఃపుర స్త్రీలు ఈ వస్తుండేవాడు కృష్ణుడేమో అని భ్రాంతిపడ్డారు. ఆయన ఎదుటపడకుండా, కంటికి కానరాకుండా తప్పుకొన్నారు.

అంతఃపురస్త్రీలు గుంపులు కట్టి ప్రద్యుమ్నుని విమర్శగా చూడలేదు. వారిలో కొందరు ఇతడు కృష్ణుడే అన్నారు. మరికొందరు ఇతని పోలికలు కొన్ని కృష్ణునిలో లేవన్నారు. ఇంకా కొందరు తొందరపడకుండా ఇత డెవరో ముందుముందు కనుక్కుందా మనుకున్నారు.

అంతఃపురస్త్రీలు వచ్చిన ఆ పురుషుడు కృష్ణుడనుకొని అతనివెంట కొంతదూరం వెళ్లారు. తర్వాత “ఇతడు కృష్ణుని మాదిరిగా ఉన్నాడు గాని కృష్ణుడుమాత్రం గాడు” అని తేల్చుకొన్నారు. తర్వాత వింతగా, మెల్లమెల్లగా ప్రద్యుమ్నుణ్ణి సమీపించారు.

అంతఃపురస్త్రీలందరూ ప్రద్యుమ్నుణ్ణి పరీక్షగా చూస్తూ ఉన్నారు. అప్పు డక్కడకు సద్గుణరాశీ, శ్రీకృష్ణుని పెద్దభార్యా, విదర్భరాజైన భీష్మకుని కూతురూ - రుక్మిణికూడా వచ్చింది. ఆమె కడగంటి చూపులతో ఆ చిన్నవాని వాలకమంతా గమనించింది. వెంటనే ఆమెకు మాతృభావం ఏర్పాడి, చన్నులనుండి పాలుకారటం మొదలయింది. తత్తరపడుతూ, దీనంగా రుక్మిణి చెలికత్తెతో ఇలా అనింది.

కమలాల్లాంటి కన్నులు గలవాడూ, మన్మథుని సౌందర్యాన్ని మించిన సౌందర్యం కలవారిలో అగ్రగణ్యుడూ, చంద్రబింబాన్ని పోలిన ముఖం, కలవాడూ, సింహంనడుమువంటి సన్నని నడుము గలవాడూ అయిన ఈ పడుచువాడు ఎక్కడినుండి ఇక్కడికి వచ్చాడో? ఈ శుభలక్షణునికి జన్మనిచ్చిన అదృష్టవంతురాలు పూర్వజన్మలో ఏ వ్రతాలు చేసిందో? ఏ ఉత్తమపుణ్యదంపతులకు ఇతడు జన్మించాడో?

చెలీ! నేను మొదట కన్నబిడ్డకు నీళ్లుపోసి, పాలిచ్చి పురిటింటిలో పెద్దపరుపుమంచంమీద నిద్రపోయాను. నాపసికందును తల్లిపాలకు దూరంచేసి, ఏపాపబుద్ధులు ఏరీతిగా దొంగిలించారో? ఏతల్లి నాముద్దుకూనను అక్కున చేర్చుకొనిందో?

సఖీ! నాసందిటికి దూరమయినప్పటినుండి ఈనాటివరకూ కుమారుని వృత్తాంతం చెవినిబడలేదు. వాడెక్కడున్నాడో? ఏంచేస్తున్నాడో కదా!

నా కుమారుడు ఈనాటివరకూ బతికి ఉంటే, జనులు అతని శరీరసౌష్టవాన్నీ, కార్యదక్షతనూ, యౌవనదశనూ, సౌందర్యాన్నీ ప్రశంసిస్తూ ఉండేవారు. వాడు ముమ్మూర్తులా ఇతనంతవాడయ్యుండేవాడు. ఏ మాత్రమూ అనుమానించాల్సిన పనిలేదు.

చెలీ! ఆ నాటి నా కొడుకే ఈ రూపమూ, రంగూ, నడక, నవ్వూ చూపులూ, గొంతూ, గాంభీర్యమూ, లావణ్యమూ తప్పకుండా ప్రాప్తించి ఉండాలి. ఇతడే అతడు కావటానికి అర్హుడు. మిగిలినవారికి నాప్రాణనాయకునిపోలిక లుండటానికి అవకాశమే లేదు. ఇతనిపట్ల నాకు ఆసక్తి పెరుగుతూంది.

మనస్సు సంతోషపూర్ణ మవుతోంది. ఎడమబుజం అదరుతోంది. కన్నులు ఆనందబాష్పాలతో అతిశయిస్తూన్నాయి. స్తనాలలో పాలు పయికుబుకుతూన్నాయి. మేలు కలుగవచ్చునేమో!

అని ఉయ్యాలవలె అటునిటు ఊగుతున్న మనస్సుతో అనేకవిధాల భావాలకు లోనై

రు
క్మిణి ఇతడు నా కుమారుడే అని చెప్పాలని మొదట సంకల్పించింది. కానీ మనస్సులో మహాసంశయం కలిగిన తర్వాత వీడు నా కుమారుడు కానట్లైతే సవతులు గుంపుగూడి పరిహసిస్తారని భావించింది. (ఇలా ఏ నిర్ణయమూ చేయలేకుంది.)

ఈ విధంగా రుక్మిణి ఆలోచిస్తుండగా కృష్ణుడు అంతఃపుర రక్షకులవల్ల జరిగిందంతా విన్నాడు. వెంటనే, దేవకీవసుదేవులతో పాటు వచ్చాడు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ, మాటమాత్రమైనా చెప్పలేదు. 

అంతలోనే నారదుడు వచ్చి, శంబరుడు శిశువయిన ప్రద్యుమ్నుణ్ణి అపహరించికొని వెళ్లటం మొదలయిన వృత్తాంతాలు తెలియజేయగా

మరణించిన బాలుడు బ్రతికి చాలాయేళ్లకు మరలా ఇల్లుచేరినట్లుగా ఇతడు వచ్చాడు. ఈనాడు మంచినడవడిగల ఇతణ్ణి ఆకస్మికంగా చూచాము. పూర్వజన్మలో మనము ఎటువంటి తపస్సు చేశామో? (గొప్ప తపస్సు చేసి ఉంటామని భావం)

ఆ విధంగా పలికి అంతఃపురస్త్రీలూ కృష్ణుడూ మొదలయిన వారూ మనోజ్ఞమయిన వస్త్రాలతో, భూషణాలతో, అలంకరించబడిన రతీప్రద్యుమ్నుల్ని సత్కరించి, ఆనందించారు. అప్పుడు రు
క్మిణి కుమారుణ్ణి అక్కున చేర్చికొని

నాయనా! కుమారా! నా చనుబాలు త్రాగటానికి వీలులేకుండా చేసి, నిన్ను శంబరాసురుడు సముద్రంలో పడేశాడా? నిన్ను చూచి ఎన్నేళ్లయిందో! నీవు ఏ విధంగా బ్రతికి బయటబడ్డావు? ఏ పూనికతో యుద్ధంలో శంబరుణ్ణి గెల్చావు? ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతూందయ్యా! ఇంతకాలానికి నిన్ను చూచాను. కృతార్థురాలి నయ్యాన్నాయనా!!

రుక్మిణీదేవి ఈ విధంగా పలికి, కొడుకును చూచి మహానందం పొందింది. కోడలిని పొగడింది. వేడుకలతో కాలక్షేపం చేస్తూ ఉన్నది. ద్వారకా పట్టణప్రజలు కూడా ప్రద్యుమ్నుని రాక విని సంతోషించారు. వారిలో

శ్రీకృష్ణుని భార్యలు లక్ష్మీనారాయణుల కుమారుడయిన మన్మథుణ్ణి చూచి, శ్రీ కృష్ణుణ్ణి చూచినప్పటిమాదిరిగా పరవశిస్తారట! ఇక పరాయిఆడువారు మన్మథుణ్ణి చూచి మోహాంధకారంలో మునిగినవాళ్లు కావటం వింతగాదు గదా!

ఇంతవరకూ చెప్పి శుకుడు ఇంకా ఈ విధంగా అన్నాడు.

శ్రీకృష్ణుడు లోకాపవాద నివృత్తికొఱకు స్యమంతకమణిని దెచ్చుట





No comments:

Post a Comment

Srikrishnudu Keligrhamunandu Rukminidevitho Virasocktu Laduta - శ్రీకృష్ణుడు కేళీగృహమునందు రుక్మిణీదేవితో విరసోక్తు లాడుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీకృష్ణుడు కేళీగృహమునందు రుక్మిణీదేవితో విరసోక్తు లాడుట ఈ వచనంలో కవి రుక్మిణీదేవి సౌధంలోపలి మంది...