లోక కంటకుడైన రావణుడు హనుమంతుని చూసి:
ఈ మహాతేజస్వంతుడైన వానరుడు ఎవడై ఉంటాడు, నాడు నేను కైలాసాన్ని చలింపజేసిననాడు నన్ను శపించిన నందీశ్వరుడా!
కాకుంటే-
బాణాసురుడా! అని ఆలోచిస్తూ ప్రహస్తుని వైపు తిరిగి:
వీడెవడో! ఎక్కడనుంచి వచ్చాడో, అశోకవనం ఎందుకు ధ్వంసం చేశాడో, రాక్షస జనాన్ని ఎందుకు భయపెట్టాడో! మన వారితో పోరాటానికి ఎందుకు తలపడ్డాడో వివరంగా అడుగు, అన్నాడు.
ప్రహస్తుడు: ఓ వానరా! నువ్వు భయపడకుండా నిజం చెప్పు. సత్యం పలికితే నీకు విముక్తి లభిస్తుంది.
దేవేంద్రుని దూతగా వచ్చావా! యమ, వరుణ, కుబేరులలో ఎవరయినా చారకృత్యానికి పంపారా! విజయకాంక్షతో విష్ణువే పంపించాడా? ఆకారంలో వానరత్వం వున్నా నీ తేజస్సు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది.
ఈ లంకా నగరంలో ఎందుకు అడుగుపెట్టావో, నిజం చెపితే నిన్ను విడిచిపెడతాం, లేదా నీ ప్రాణాలు దక్కవు, అన్నాడు.
హనుమ: ఇంద్ర, యమ, వరుణ, కుబేరులతో నాకు ఏ సంబంధమూ లేదు. విష్ణు ప్రేరణతో నేను రాలేదు. నేను వానరుడను. ఆ వానర ప్రకృతితోనే ఇలా వచ్చాను. మీ రాజును దర్శించే కోరికతో ఈ వనం ధ్వంసం చేశాను. బలవంతులైన మీ రాక్షసులు నన్ను ఎదుర్కోబోతే ప్రాణరక్షణార్థం వారితో యుద్ధం చేశాను. దేవ, దానవులు నన్ను బంధించలేరు. శస్త్రాస్త్రాలు నన్ను బాధించవు. అది నాకు పితామహుడిచ్చిన వరం. మీ మహారాజును చూడాలనే కోరికతో నేను బంధితుడనైనట్లు నటించి ఇలా వచ్చాను, అని రావణుని వెపు తిరిగి:
లంకేశ్వరా! సుగ్రీవ సందేశంతో నీ దగ్గరకు వచ్చాను. ఆయన సోదరప్రేమతో నీ కుశలం అడగమన్నాడు. ఆయన చెప్పిన మాటలు సావధానంగా వింటే ఇహపరాలలో నీకు శ్రేయస్సు కలుగుతుంది.
సందేశం
లంకేశ్వరా! సుగ్రీవ సందేశంతో నీ దగ్గరకు వచ్చాను. ఆయన సోదరప్రేమతో నీ కుశలం అడగమన్నాడు. ఆయన చెప్పిన మాటలు సావధానంగా వింటే ఇహపరాలలో నీకు శ్రేయస్సు కలుగుతుంది.
No comments:
Post a Comment