Saturday, August 15, 2026

Aascharyam - ఆశ్చర్యం

రామాయణం సుందరకాండ 55వ సర్గ - ఆశ్చర్యం

క్రుద్ధః పాపం న కుర్యాత్కః 
క్రుద్ధో హన్యా ద్గురూ నపి

క్రుద్ధః పరుషయా వాచా
నరః సాధూ నధిక్షిపేత్‌


లంక ముట్టించి హనుమంతుడు సముద్రతీరం చేరి నీటిలో తోక తడుపుకుంటూ మంటలలో మాడే లంకా నగరాన్ని చూస్తున్నాడు.

ఒక వంక భయం, మరొకవంక అసహ్యం కలిగాయి. ఈ అకార్యం ఎందుకు చేశాను. ఆగ్రహం కలిగితే దానిని వివేకంతో అణచిపెట్టాలేకాని యింత అఘాయిత్యం చెయ్యడమా! కోపాన్ని నిగ్రహించుకోగలవారే ధీమంతులు.

కోపంలో చెయ్యని పాపం వుండదు. గురుహత్య, సజ్జనహింస వంటి పనులు కోపిష్ఠి అనాయాసంగా సాగిస్తాడు. ఎవరితో ఏం మాట్లాడాలో కూడా వాడికి తెలియదు. అందుచేతనే పాముకుబుసం విడిచేటట్లు ధీమంతులు క్రోధాన్ని విసర్జించాలి.

దుర్బుద్దుడనై, లజ్జా విహీనతతో ఈ దహనకాండ సాగించాను. సీతాదేవి ఏమవుతుందో అనే ఆలోచనే లేదు నాకు. ఇప్పుడింక ఏం చెయ్యను. స్వామి ద్రోహం జరిగిపోయింది.

ఈ లంకాదహనంతో సీతాదేవికూడా తగుల బడివుంటే ఏం కావాలి? నా సర్వ ప్రయత్నం వ్యర్థం. రావణుడిమీద ఆగ్రహంతో సర్వనాశనం చేసుకున్నాను.

ఇప్పుడింక నేను అగ్నిగుండంలో దూకాలి. మహాసాగర బడబాగ్నికి ఆహుతి కావాలి. లేదా సముద్రంలో తిమింగలాలకు ఆహారం అవుతాను.

సుగ్రీవుని సమ్ముఖానికి ఎలా వెళ్ళగలను? రామ లక్ష్మణులను చూడగలనా ఈ దశలో. ఈ లంకాదహనంతో ముల్లోకాలూ కపి ప్రకృతిని పరిహసించి తీరతాయి. రాజసంతో ఎంత దారుణానికి ఒడిగట్టాను.

సీత మరణించిందని వినగానే రామ లక్ష్మణులు ప్రాణం విడిచిపెడతారు. అది చూచిన సుగ్రీవుడు బంధుకోటితో ప్రాణత్యాగం చేస్తాడు. అయోధ్యలో భరత శతృఘ్నులు మాత్రం జీవిస్తారా!

కోపం కారణంగా యింతపని చేసిన అదృష్టహీనుణ్ని, అని చింతించే, హనుమంతునికి కొన్ని శుభశకునాలు గోచరించగా:

మాంగళ్యదేవతయైన సీతను అగ్ని దహించదు. ఆవిడే అగ్ని రూపిణి. అగ్నిని అగ్ని బాధిస్తుందా! రాముని భార్యను, పతివ్రతా శిరోమణిని అగ్ని దరిజేరలేదు.

సీతా రాముల ప్రభావంచేత కాకపోతే అగ్ని నా లాంగులాన్ని మండించి నన్ను భాధించకుండా వుంటుందా! నా తోకను తగలబెట్టని అగ్ని సీతపై ప్రసరిస్తుందా!

అవసర
యితే జానకీదేవియే అగ్నిని దహిస్తుంది, కాని అగ్నికి ఆవిడను దహించే శక్తిలేదు, అనుకుంటూండగా, గగన చారులయిన చారణులు:

ఓహో! హనుమంతుడెంత భయంకర కృత్యం సాధించాడు. సర్వలంకానగరం భస్మమై ఆర్తనాదాలతో వున్నా, జానకీదేవి అచంచలంగా ఆశోకవనంలో యథాపూర్వం వున్నది.

ఆ మాటలు విన్నాడు. అతని హృదయం సంతోషతరంగిత మయింది. అయినా ఒక్కమారు తన కంటితో అమెను చూసి వెళ్ళాలని నిశ్చయించుకుని శింశుపా వృక్షం చేరి, ఆ ఛాయలో వసివాడకుండా వున్న సీతను చూసి:

అమ్మా! నేను అదృష్టవంతుడను, అని చేతులు జోడించాడు.

నాయనా! ఇంత సాహసం నీకే సాధ్యం, సత్కీర్తిని సాధించే బల పరాక్రమాలు నీకే ఉన్నాయి. ఒక్క విషయం, మరచిపోకు. రామచంద్రుడు లంకానగరాన్ని తన బాణాలతో చీకాకు పరచి నన్ను తీసుకువెళ్ళడం మంచిది. ఏది ఎలా చెయ్యాలనేది ఆయనకు 
నం చెప్పనవసరంలేదు, అని జానకీదేవి అనగా హనుమంతుడు:

అమ్మా! త్వరలోనే రామచంద్రుడు వానర భల్లూక సేనా సమేతం వచ్చి అఖిల శత్రునాశనం చేసి నీ మనస్సుకి ఆనందం కలిగిస్తాడు! ఇక నాకు సెలవమ్మా, అని బయలుదేరి సముద్రతీరాన వున్న అరిష్ట పర్వతం అధిరోహించాడు.

మహోన్నతమైన ఆ గిరి శిఖరాల మీద మేఘాలు ఉత్తరీయాలవలె వున్నాయి. రాళ్ళమీద సూర్యకిరణాలు పడి కనులు మిలమిల లాడిస్తున్నట్టుంది. సెలయేటి మంద్రధ్వనులు వేదగానాన్ని తలపించాయి. అకాశాని కెదిగిన దేవదారు వృక్షాలు పర్వతుడు మహామహులు పైకెత్తినట్లున్నాయి. గాలికి వూగిసలాడే రెల్లుతోటలతో అది కంపిస్తున్నట్టుంది. వాయుపూరితములయి వెదురువనాలు నిర్విరామంగా కూజిస్తున్నాయి. మహాసర్పాల వూపిరి పర్వతం విడిచే నిట్టూర్పులా, మంచునిండిన గండశిలలు ధ్యానసమాధులలో మునులవలె వున్నాయి.

వివిధ వర్ణశోభిత సుమరాజితో తరువులు.

ఆ పరిసరాలలో మహర్షి, యక్ష, కిన్నర, గంధర్వులు.

సింహాలతో గుహలు.

శార్దూలాల విహారాలు.

ఆ పర్వతం ఎక్కి ఒక్కమారు కలయజూసి దేహం పెంచి, కుప్పించి, గగనవీధికి లేచాడు.

అ పాదతాడనానికి పర్వతం, ముక్కముక్క అయింది. పిడుగుపడి మోడువారి నట్లయాయి మహావృక్షాలు. విరిగిపడే గుహలలో సింహాల గర్జనలు దిక్కులు దద్దరిల్ల జేశాయి.

ఆ కొండమీది విద్యాధర స్త్రీలు భయభీతలై జారిన వస్త్రాలతో చెదరిన అలంకారాలతో గగన మార్గానికి లేచారు.

కాకోల విషసర్పాలు తలలు చుట్టుకుని, నడుములు విరిగి మరణించాయి. అంత ఎత్తయిన కొండ హనుమంతుని పాదపీడనంతో పాతాళానికి దిగి, అక్కడ ఒక కొండ వుండేదని గుర్తులేకుండా పోయింది. గగన వీధిని బయలుదేరాడు హనుమంతుడు.

మిత్రసమాగమం

No comments:

Post a Comment

Angada - అంగదుడు

రామాయణం సుందరకాండ 60వ సర్గ - అంగదుడు మారుతి మాటలు విని అంగదుడు: సీతను చూసి వచ్చామే కాని ఆవిడను తీసుకురాలేదని చెప్పడం మనవంటి మహాపరాక్రమ సంపన్...