Tuesday, August 4, 2026

Vaishvadevam - వైశ్వదేవం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - వైశ్వదేవం

నారదా! పురశ్చర్యాప్రసంగంతో జ్ఞాపకం వచ్చింది. వైశ్వదేవం గురించికూడా చెబుతాను విను. దేవయజ్ఞ - బ్రహ్మయజ్ఞ - భూతయజ్ఞ - పితృయజ్ఞ - మనుష్యయజ్ఞాలని పంచయజ్ఞాలు. అలాగే ఛుల్లి(పొయ్యి), పేషణి, ఉపస్కరం, కండణి, ఉదకుంభం - ఆని పంచసూనాలు. 

పొయ్యిలోగానీ ఇనపపాత్రలోగానీ భూమిమీదగానీ కుండపెంకులో(మూకుడు వగైరా) గానీ వైశ్వదేవం చెయ్యరాదు. కుండంలో లేదా స్థండిలంలో(పాత్ర) చెయ్యాలి. చేతితోగానీ చేటతోగానీ చర్మనిర్మితులతోగానీ అగ్నిని విసరకూడదు. 

విప్రముఖంనుంచి అగ్నిపుట్టింది కనక నోటితో ఊదిమాత్రమే ప్రజ్వలింపజెయ్యాలి. చర్మపటకంతో విసిరితే వ్యాధిగ్రస్తుడవుతాడు. చేటతో విసిరినవాడు ధనం నష్టపోతాడు. చేతితో విసిరినవాడు మృత్యువువాత బడతాడు. కనక నోటితో ఊదటమే కర్మసిద్ధికి ఉపకారకం.

పళ్ళూ పాలూ పెరుగూ దుంపలూ కూరగాయలూ ఇత్యాదులతో వైశ్వదేవహోమం చెయ్యాలి. ఇవ్వి ఏవీ దొరక్కపోతే పుడకలూ ఆకులూ గడ్డీ - వీటితో చెయ్యవచ్చు. నేతిలో ముంచి హోమం చెయ్యాలి. నూనెగానీ ఉప్పుగానీ తగలకూడదు. పెరుగూ(పాయసాలు) పాలల్లోనైనా ముంచి చెయ్యవచ్చు. ఇవీ దొరక్కపోతే ఆయామంతత్రాలతో రవ్వంత నీరు చిలకరించి ఆ వస్తువుల్ని (దుంపలూ కూరలూ) హోమం చెయ్యాలి. 

ఎండిపోయినవీ నిలవున్నవీ (పర్యుషితం - చద్ది) చేస్తే కుష్ఠవ్యాధి వస్తుంది. ఎంగిలివి హోమం చేస్తే(ఉచ్చిష్టం) శత్రువులకు లొంగిపోవలసి వస్తుంది. గిడచబారి గట్టిగా తయారైన వాటితో (రూక్షాలు) హోమం చేస్తే దారిద్య్రం దాపురిస్తుంది. ఉప్పుగానీ నూనెగానీ తగిలిందో మహాపాపం చుట్టుకుంటుంది.

నిప్పుల్ని బూడిదదులిపి మంటచేసి అగ్నికి ఉత్తర దిగ్భాగంలో మంత్రపూర్వకంగా హోమం చెయ్యాలి. ఇలా వైశ్వదేవం చెయ్యకుండా భోజనం చేసిన బ్రాహ్మణ గృహము కాలసూత్ర నరకకూపంలో తలకిందుల్లా పడతాడు. కూరగాయ, ఆకుకూర, దుంప, పండు ఏదో ఒకటి - తన ఆహారం ఏదైతే దాన్ని అగ్నిలో వేల్చాలి. 

ఈ వైశ్వదేవం కాకముందే భిక్షుకుడెవరైనా భిక్షార్ధియై గుమ్మంలోకి వస్తే  వైశ్వదేవంకోసమని కొన్నితీసి ప్రక్కనపెట్టి, భిక్షవేసి పంపించవచ్చు. వైశ్వదేవీకృతదోషాన్ని భిక్షుకుడు తొలగిస్తాడు తప్ప భిక్షుకృతదోషాన్ని వైశ్వదేవం తొలగించలేదు.

పక్వాన్నానికి యతి - బ్రహ్మచారులు అధిపతులు. వారికి పెట్టకుండా గృహస్థు భుజిస్తే చాంద్రాయణవ్రతం ప్రాయశ్చిత్తంగా చేసుకోవాలి. వైశ్వదేవం ముగించాక గోగ్రాసం వెయ్యాలి. ఎలాగంటే - ఓ సురభీ! వైష్ణవీ! మాతా! విష్ణుపదస్థితా! నేనిస్తున్న గ్రాసాన్ని స్వీకరించు అని అభ్యర్థిస్తూ గోభ్యశ్చ నమః అంటూ పూజించి సమర్పించాలి. ఇలా చేస్తే కామధేనువు(సురభి) అనుగ్రహిస్తుంది.

గోశాలనుంచి తిరిగివచ్చి ఇంటివాకిట్లో కొంచెంసేపు - పాలు పితికినంతసేపు (గోదోహనకాలం) - నిలబడాలి. అతిథుల కోసం ఎదురుచూడటం. ఇంటికి వచ్చి అతిథి వట్టినే తిరిగి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అలా తిరిగివెళ్ళే అతిథి తన పాపాన్ని మనకు అంటగట్టి మన పుణ్యమంతా మూటగట్టుకుపోతాడు.

తల్లిదండ్రులూ సోదరులూ గురువూ బిడ్డలూ సేవకుడూ ఆశ్రితులూ అతిథులూ అభ్యాగతులూ అగ్నిదేవుడూ - వీరంతా గృహస్థుకి పోష్యులు(తాను పోషించవలసినవారు).

ఈ గృహస్థాశ్రమ ధర్మాలను తెలుసుకుని మోహవిభ్రాంతి విడిచి జీవయాత్ర సాగించాలి. వీడు - నావాడు, వీడు పరాయివాడు అనే భేదబుద్ధి ఉండకూడదు. ధర్మం తప్పకుండా ఇలా నడుచుకుంటే సోమయాగఫలం లభిన్తుంది. పంచమహాయజ్ఞాలనూ చక్కగా నిర్వహిస్తే ఎంతటి దరిద్రుడైనా ధనవంతుడవుతాడు.

పంచ ప్రాణాగ్ని హోత్రం




No comments:

Post a Comment

Brahmacharyam - బ్రహ్మచర్యం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - బ్రహ్మచర్యం అధఃశయానుడూ(నేలమీద పడుకునేవాడు). ధర్మాత్ముడూ జితేంద్రియుడూ వినయవంతుడూ మితాహారీ శాంతచిత్తుడూ నిత్...