Wednesday, August 19, 2026

Janamejayudiki Manashanthi - జనమేజయుడికి మనశ్శాంతి

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - జనమేజయుడికి మనశ్శాంతి

జనమేజయా! నారదుడికి నారాయణమహర్షి చెప్పినదంతా నీకు నేను చెప్పాను. నువ్వు ఆడిగినదంతా వివరించాను. మహాద్భుతమైన ఈ మహాదేవీ పురాణాన్ని విన్నవారందరూ కృతకృత్యులవుతారు. దేవికి అత్యంతప్రియతములవుతారు. 

కనక నువ్వుకూడా దేవియజ్ఞం చెయ్యి. నీ పూర్వీకులను ఉద్ధరించు. నీ తండ్రిపొందిన దుర్గతికి అసలే ఖిన్నుడవై ఉన్నావు కనక దేవీయజ్ఞం నిర్వహించి పరీక్షిత్తుకు ఉత్తమగతులు కల్పించు. మహాదేవీమంత్రం నీకు ఉపదేశిస్తాను. గ్రహించు. విధివిధానంగా జపిస్తే జన్మ సఫలమవుతుంది. -' అన్నాడు వ్యాసభగవానుడు.

శౌనకాది మహామునులారా! ఈ మాటవిన్న జనమేజయుడు సంబరపడి పరిశుద్ధుడై ఆ మునీశ్వరుణ్ణి ప్రార్థించి దేవీప్రణవసంజ్ఞకమైన మహామంత్రాన్ని దీక్షావిధితో ఉపదేశం పొందాడు. 

నవరాత్రి సమయంలో ధౌమ్యాదిమహర్షులను ఆహ్వానించి దేనికీ లోభించకుండా మహాదేవీ యజ్ఞం నిర్వహించాడు, బ్రాహ్మణులను రావించి ఈ దేవీభాగవత పురాణ పారాయణ జరిపించాడు. 

సువాసినీ పూజలూ కుమారీపూజలూ బ్రహ్మచారిపూజలూ అసంఖ్యాకంగా చేశాడు. బ్రాహ్మణులకు అన్నసంతర్పణ జరిపాడు. దీనులకూ అనాథులకూ పుష్కలంగా ధన కనక వస్త్రాదులను కానుకలుగా సమర్పించాడు. యజ్ఞం ముగిసింది. 

జనమేజయుడు సంస్థానంలో కొలువుతీరాడు. ఆకాశంనుంచి నారదుడు ఆవతరించాడు. మహతి మోగించుకుంటూ వచ్చాడు. ప్రకాశిస్తున్న అగ్నిశిఖలాగా ఉన్నాడు. నారదుణ్ణి చూడటంతోనే మహారాజు హడావిడిగా అభ్యుత్థానం చేశాడు. స్వాగతంపలికి ఆర్ఘ్యపాద్యాలిచ్చి సముచితాసనం మీద కూర్చోబెట్టాడు. కుశలప్రశ్నలు అయ్యాయి.

మహర్షీ! నీ రాకతో ధన్యుణ్ణి అయ్యాను. సనాథుణ్ణి అయ్యాను. ఆజ్ఞాపించు - ఏమి చెయ్యమంటావో! 

మహారాజా! ఇవ్వేళ దేవలోకంలో ఒక వింత చూశాను. ఆశ్చర్యంనుంచి ఇంకా తేరుకోలేదంటే నమ్ము, ఆ విశేషం నీకు చెప్పి వెడదామనిపించి వచ్చాను. దుర్గతిని పాందిన నీతండ్రి ఇవ్వేళ దివ్యరూపం ధరించి స్వర్గంలో కనిపించాడు. దేవతలూ అప్సరసలూ అతణ్ణి స్తుతిస్తున్నారు. 

దివ్యవిమానం అధిరోహించాడు. మణిద్వీపానికి తరలివెళ్ళాడు. ఇదంతా దేవీభాగవతశ్రవణంవల్ల కలిగిన పుణ్యఫలం. నువ్వు నిర్వహించిన మహాదేవీయజ్ఞానికి వెంటనే దక్కిన పుణ్యం. నీతండ్రి దుర్గతినుంచి విముక్తుడై సుగతిని పొందాడు. 

ఇలా కన్నతండ్రికి సద్గతి కల్పించి కృతకృత్యుడవయ్యావు. నువ్వు ధన్యుడవు. నిజంగా నీ జీవితం సఫలం. తండ్రిని నరకంనుంచి ఉద్ధరించావంటే నువ్వు కులభూషణుడివి. ఇవ్వేళ దేవలోకంలో నీకీర్తి మారుమ్రోగిపోతోంది. సంతోషం పట్టలేక ఈ శుభవార్త నీకు చెబుదామనీ, నువ్వూ ఆనందిస్తావనీ వచ్చాను.

నారదుడి మాటలు వింటూంటే జనమేజయుడికి తనువు పులకించింది. కన్నుల్లో ఆనందబాష్పాలు తాండవించాయి. ఆపుకోలేక వ్యాసభగవానుడి పాదాలమీద సాష్టాంగపడ్డాడు. 

మహానుభావా! ఇది ఆంతా నీ అనుగ్రహమే. నన్ను కృతార్థుణ్ణి చేశావు. నమస్కరించడం తప్ప నేను చెయ్యగలిగివ ప్రత్యుపకారం ఏదీ లేదు. ఇలాగే ఎల్లవేళలా నన్ను అనుగ్రహించు. 

జీరవోయిన గొంతుతో ఇలా పరవశించి పలుకుతున్న జనమేజయుణ్ణి మనసారా ఆశీర్వదించి తల నిమిరాడు వ్యాసుడు. రాజా! అన్ని బంధనాలనూ తెగతెంపులు చేనుకుని దేవీపాదపద్మాలను నిరంతరం సేవించు. ధ్యానించు. ఉపాసించు. 

దేవీభాగవతాన్ని రోజూ పారాయణగా పఠించు. అంబాయజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో చెయ్యి. చేయించు. నీకు మోక్షం అనాయాసంగా లభిస్తుంది. భవబంధనాలు తమంతట తామే తెగిపోతాయి. హరి-హరుల పురాణాలు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కలిపివా ఈ దేవీ భాగవత మహిమలో. పదహారవవంతుకైనా సాటిరావు. ఇది నిజం. ఇది అఖిలవురాణసారం. అఖిలవేదసారం.

మూలప్రకృతిని ప్రతిపాదించేది కనక ఇదొక్కటే నిజమైన పురాణం. మిగిలినవన్నీ నామమాత్రపురాణాలు. దీన్ని చదివితే వేదపఠనఫలం దక్కుతుంది. కనక ఇదొక్కటే పండితులకూ పామరులకూ జ్ఞానులకూ యోగులకూ ముముక్షువులకూ - అందరకూ అవశ్యపఠనీయం. మరచిపోకుసుమా! ఇక మరి నేను వెళ్ళివస్తా. 

నీకు శుభమగుగాక! - అని పలికి వ్యాసుడు నిర్మమంగా నిష్క్రమించాడు. నారదుడూ దీవించి వెళ్ళిపోయాడు. ధౌమ్యాది మహర్షులు సెలవు తీసుకున్నారు.

అందరూ తమ తమ ప్రదేశాల్లో ప్రాంతాల్లో దేవీభాగవత ప్రశంసలు చేశారు. పారాయణలు జరిపారు. జనమేజయుడు రోజూ పఠిస్తూ పఠింపజేసి వింటూ సంతుష్టుడై రాజ్యపరిపాలన ధర్మబద్ధంగా సాగించాడు.

శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి





No comments:

Post a Comment

Sridevibagavatham - Phalashruthi - శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - శ్రీదేవీభాగవతం - ఫలశ్రుతి శౌనకాది మహామునులారా! మీరు గ్రహించవలసిన రహస్యం మరొకటి ఉంది. ఆదిలో ఈ దేవీభాగవతం సా...