Thursday, August 13, 2026

Trijata Swapnam - త్రిజట స్వప్నం

రామాయణం సుందరకాండ ఇరువది ఎడవ సర్గ - త్రిజట స్వప్నం

ఓసి మూర్ఖురాలా! నువ్వు ఆత్మహత్యకు సిద్దమయావంటే ఇప్పుడే నిన్ను చీల్చుకు తినగలం, అని కొందరు గర్జిస్తుంటే, వారిలో పెద్దదయిన త్రిజట అప్పుడే నిద్రలేచి:

ఓ పిచ్చినన్నాసులారా! జనకరాజసుతను, దశరథుల యింటి కోడలిని తినడం మీ తరంకాదు. మిమ్మల్ని మీరే కాల్చుకు తినాలి. ఈవిడభర్తకు విజయం, లంకకు వినాశనం కలిగే కాలం అసన్నమయినట్లు నా కిప్పుడే కలవచ్చింది; అనడంతో, మిగిలిన వారందరూ భయభీతలై ఆమె దగ్గరగా చేరి;

తెల్లవారుఝామున వచ్చిన కలలు జరిగితీరుతాయంటారు. నీకు వచ్చిన కల వివరంగా చెప్పు, అన్నారు.

త్రిజట: స్వచ్చమైన ఏనుగుదంతాలతో నిర్మించిన పాలకీ. ఎన్నో హంసలు దాన్ని మోస్తున్నాయి. ఆ పాలకీ మీద ధవళవస్త్రాలతో రామలక్ష్మణులు కనిపించారు. అంతలోనే సముద్రం ఒడ్డున ఉన్న 
తెల్లని పర్వతంమీద సీతాదేవి స్వచ్చవసన ధారియై రామునితో విహరిస్తున్నది.

మరోకల: పెద్ద పర్వతమంత ఏనుగు. దానికి నాలుగు దంతాలు. ఆ ఏనుగుమీద రామ లక్ష్మణులు, వారు సీతాదేవి దగ్గరకు వచ్చారు. ఆవిడ కూడా ఆ ఏనుగు ఎక్కింది. భర్తృసన్నిధానంలో ఆవిడ
చేతులెత్తి సూర్యచంద్రులను అందుకుంటున్నది. ఆ ఏనుగు లంకానగరంవైపు వచ్చింది.

మరోకల: ఎనిమిది జతల తెల్లని వృషభాలు లాగే రథం మీద రాముడు సీతా సమేతం ఈ నగరానికి వచ్చాడు. అంతలో ఆయన సూర్యకాంతులీనే పుష్పకం మీద బయలుదేరి ఉత్తరాభిముఖంగా
వెళ్ళాడు. అలా వెడుతున్న ఆ రామచంద్రుని చూచి ముల్లోకాలూ భయపడుతున్నట్టు అనిపించింది. ఆ తేజోమూర్తిని చూస్తుంటే ఈ పృథ్విలో ఆయనను జయించే వారుండరనే నమ్మకం కలిగింది. పాపాత్ములకు స్వర్గ ప్రవేశార్హత ఉండదుకదా!

ఇంతలో మరోకల: మన రావణ ప్రభువు మత్తుగా త్రాగి, శరీరమంతా నూనెపూసుకుని, ఎర్రనిబట్టలతో, కరవీరపుష్పాలమాలతో, పుష్పకంమీద నుండి క్రిందపడ్డాడు. ఆయనను ఒక స్త్రీ (నల్లని వస్త్రాలు ధరించి, జుట్టులేనిది) యీడుస్తున్నది.

అంతలో నూనె త్రాగుతూ, గంతులువేస్తూ, నవ్వుతూ, ఇంద్రియాల పట్టుతప్పి తిరుగుతూ, గాడిదల రథం మీద బయలుదేరాడు. వెడుతూ వెడుతూ క్రిందపడ్డాడు. పడుతూనే భయంతో లేచి దిగంబరుడై పిచ్చిగా ప్రేలుతూ ఎదుటవున్న దుర్గంధభూయిష్టమయిన గోతిలో ములిగాడు.

అంతలో ఎర్రనిచీరతో, బురదశరీరంతో ఉండే నల్లనిస్త్రీ ఒకతె 
న ప్రభువుకి ఉరిత్రాడుపోసి దక్షిణదిశగా ఈడ్చుకుపోయింది. అదేదశలో కుంభకర్ణుడూ కనిపించాడు.

రావణకుమారులందరూ బుర్రగొరిగించుకుని, నూనె పూసుకున్నారు. రావణుడు వరాహంమీద, కుంభకర్ణుడు ఒంటెమీద, ఇంద్రజిత్తు మొసలిమీద దక్షిణంగా పోతున్నారు.

విభీషణుడు మాత్రం తెల్లనివస్త్రాలు, పువ్వులు ధరించి, శంఖ దుందుభి ధ్వానాలు సాగుతుంటే, నృత్య గీతాలతో నవ్వుతూ నాలుగుదంతాల ఏనుగు మీద తెల్లగొడుగునీడలో ఉన్నాడు. ఆయనతో వాని మంత్రులు నలుగురూ ఉన్నారు.

మన రాక్షసులందరూ ఎర్రని వస్త్రాలు, పూలు ధరించి, తప్పతాగి తిరుగుతున్నారు. ఈ లంకానగరం చతురంగబలసమేతం సాగరాభిముఖంగా పోయి ములిగింది.

మరో క్షణంలో,

ఈ నగరాన్ని రామదూతయైన వానరు డొకడు అగ్ని దగ్ధం చేసినట్లు.

రాక్షసనారీజనం తెగత్రాగి విపరీత ధ్వనులతో, పరుష భాషణాలతో, ఆడుతున్నట్లు,

కుంభకర్ణాదు లందరూ గోమయంతో నిండిన గుంటలో పడినట్లు నా కలలో చూశాను.

ఇదంతా చూస్తుంటే-

ఈ లంకకు ముప్పు వచ్చినట్లే, నిస్సందేహంగా రాముడు లంకా నగరాన్ని సర్వనాశనం చేసి తీరుతాడు.

అందుచేత మనమందరం ఈ సీతాదేవిని శరణువేడాలి. ఇంతకంటె మనకు దారిలేదు. ఈ జనకరాజ నందన మనలను కరుణతో కాపాడుతుంది. నా మాట విని మీరందరూ ఆవిడపాదాలమీద పడండి.

అదిగో చూశారా! ఆవిడ పద్మదళ విశాలనయనం ఎలా వికసిస్తున్నదో ఆమె ఎడమభుజం అదురుతున్నది చూడండి.

అది శుభసూచన.

రామచంద్రుడు ఎదురుగా వున్నట్టు ఆమె శరీరం అంతా పులకిస్తున్నది!

అదిగో, ఆ చెట్టు కొమ్మమీద పక్షికూత విన్నారా! ఎంత సంతోషంగా వినిపిస్తున్నదో! చుట్టాలు వచ్చి పలకరిస్తున్నట్లు లేదూ! అని త్రిజట అంటూంటే సీతాదేవి సంతోషభరిత వదనంతో-

నీ కల నిజమయితే మీ అందరికీ నేను అభయం యిస్తాను, అంది.

శుభసూచనలు

No comments:

Post a Comment

Viswasam - విశ్వాసం

రామాయణం సుందరకాండ 32వ సర్గ - విశ్వాసం ఆ మాటలు విన్న సీత మనస్సు తృప్తిపడింది. హనుమంతుని వైపు తిరిగి: అయితే నర వానరులకు సఖ్యం ఎలా కలిగింది? ను...