Saturday, August 1, 2026

Bhasmadharana Mahima - The Glory of Wearing Sacred Ash - భస్మధారణ మహిమ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మధారణ మహిమ

నారదా! ఈ భస్మధారణ మాహాత్మ్యం ఎంత చెప్పినా తరగదు. ఇంకా ఉంది. విను. ఇప్పటికి జాబితాలోకెక్కిన పాతకాలేకాక ఇంకా మహాపాపాలు ఏమైనా ఉంటే అవ్వికూడా నశిస్తాయి భస్మోద్దూళన భస్మధారణలతో అనడం ముమ్మాటికీ సత్యం. ఇది యతీశ్వరులకు జ్ఞానాన్నీ, వానప్రస్థులకు విరక్తినీ, గృహస్థులకు ధర్మవృద్ధినీ, బ్రహ్మచారులకు స్వాధ్యాయశక్తినీ, శూద్రులకు పుణ్యాన్నీ, ఇతరులకు పాపక్షయాన్నీ అపారంగా కలిగిస్తుంది. సర్వభూతరక్షణకోసం విభూతిని ధరించాలనీ ఉద్దూళన చేసుకోవాలని వేదం చెబుతోంది. ఇది యజ్ఞంతో అన్నివిధాలా సరిసమానమంటోంది. మాహేశ్వరులకు ఇది చిహ్నం, సర్వులకూ విజ్ఞానప్రదం అని పేర్కొంటోంది. బ్రహ్మవిష్ణుమహేశ్వరులూ వారి అంశావతారాలూ ఇంద్రాది దేవతలూ వరుణాది దిక్పాలకులూ సరస్వతీ లక్ష్మీపార్వతులూ వారి అంశదేవీమూర్తులూ శచీప్రముఖ సకలదేవ కాంతలూ యక్ష రాక్షస గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సమస్తజాతులవారూ మునులూ ఋషులూ యోగులూ తపస్వులూ చతుర్వర్ణాలవారూ సంకరజాతులవారూ అపభ్రంశులూ - వారూ వీరూ అని తేడా లేకుండా అందరూ భస్మోద్దూళన భస్మధారణలు చేసినవారే. చేస్తున్నవారే. చెయ్యవలసినవారే. శిష్టులు అంటే వీరే. ఇంకెవరూ కారు. ఒక్కమాటలో దీని మాహాత్మ్యం చెప్పాలంటే శివలింగంలాగా చింతామణిలాగా పంచాక్షరీ మంత్రంలాగా ఈ విభూతి అనేది మోక్షలక్ష్మిని వశీకరించుకునే దివ్యౌషధం.

విభూతిని ధరించివస్తే మూర్ఖుడా పండితుడా అనే ప్రశ్న లేదు. అతడికి భోజనం పెట్టాలి. అతడు భుజిస్తే పార్వతీపరమేశ్వరులు వచ్చి భుజించినట్టే

భస్మధారిని అనుసరించినా స్తుతించినా శ్రద్ధగా సేవించినా పాపాలు తొలగిపోతాయి. పూజనీయుడవుతాడు. త్రిపుండ్రధారికి భిక్షవే స్తే సర్వవేదాలూ చదివినంత, సకలసత్కర్మలూ అనుష్ఠించినంత పుణ్యం వస్తుంది. నిత్యమూ శిరస్సున విభూతిని ధరించేవాడు అడవుల్లో ఉన్నా అరణ్యాల్లో ఉన్నా అది కాశీక్షేత్రమే. భస్మధారిలో మిగతా యోగ్యతలు పరిశీలనీయాలు కానేకాదు. అవగుణాలు ఎన్ని ఉన్నా పరిగణనీయాలు కానేకాదు. శివసంతతితో సమానుడు. పూజనీయుడు. ఒకవేళ దుశ్శీలుడయ్యుండి ఎదుటివారిని మోసగించడంకోసమనే విభూతి పెట్టుకున్నా ఒళ్ళంతా పులుముకున్నా అతడు ధన్యుడే. పావనుడే. నూరు యజ్ఞాలు చేసినవారు వెళ్ళే లోకాలకు తానూ వెడతాడు. అనుకోకుండా విభూతి వొంటికి తగిలినా క్రీడావినోదంగా ధరించినా భయపడి పెట్టుకున్నా అతడు శివుడితో సమానుడే. పూజనీయుడే. విభూతిధారణ ఏ కారణంగా ఎవరు ఎలా చేసినా ముగ్గురమ్మలకూ ముగ్గురయ్యలకూ తృప్తినీ ఆనందాన్నీ కలిగిస్తుంది. దాన యజ్ఞ తప స్తీర్థయాత్రలకు అందని పుణ్యం విభూతిధారణతో వచ్చి వాడిలో పడుతుంది. నిజం. అవి అందించే పుణ్యాలు ఈ పుణ్యంలో పదహారవవంతుకికూడా సాటిరావు. తన చిహ్నాలను ధరించిన ప్రజలను రాజుగారు ఎలా తనవాళ్ళని గుర్తిస్తాడో అలా శివుడు త్రిపుండ్రధారులను తనవాళ్ళుగా భావిస్తాడు. నిర్మలహృదయంతో విభూతిని ధరిస్తే సాక్షాత్తూ రుద్రుణ్ణి వశీకరించుకొన్నట్టే. మిగతా ఆచారాలూ అనుష్ఠానాలూ ఏమీ లేకపోయినా సరే నెన్నొసట విభూతితో అడ్డబొట్టు ఉంటేచాలు అతడు ముక్తిని పొందడం తథ్యం. కులమూ గోత్రమూ వ్రతమూ జ్ఞానమూ ఇత్యాదులతో పనీలేదు, పరీక్షా లేదు. నారదా! శివమంత్రంకన్నా గొప్ప మంత్రం లేదు. శివుడికన్నా గొప్ప దైవం లేడు. శివార్చనకన్నా గొప్ప పుణ్యం లేదు. విభూతి కన్నా గొప్ప తీర్థం లేదు. రుద్రవేత్రాగ్నికన్నా గొప్ప తీర్థం ఈ విభూతి. సర్వదుఃఖవిధ్వంసకం. సర్వపాప విమోచకం. విభూతిధారి - ఎవడైనా ఆగుగాక - ఎక్కడ ఉంటే అక్కడ సర్వభూతగణ - సర్వతీర్థగణ పరివృతులై పార్వతీపరమేశ్వరులుంటారు. పంచాక్షరీ శివమంత్ర పరిపూతమైన ఈ విభూతిని, శివుడుకోరి అలంకరించుకునే ఈ భస్మాన్ని నెన్నుదుట త్రిపుండ్రాలుగా ధరిస్తే చాలు - అక్కడ బ్రహ్మదేవుడు రాసిన చెడురాతలన్నీ చెరిగిపోతాయి.

నారదా! విభూతిని సర్వాంగాలకూ ఆలదుకొన్నవాడికి ధనం దానం చేస్తే ఆ దాత చేసుకున్న పాపాలన్నీ నశించిపోతాయి. శ్రుతులూ స్మృతులూ అఖిలపురాణాలూ విభూతి మహిమను ఎంతగానో కొనియాడుతున్నాయి. అంచేత ఆందరూ దీన్ని అలంకరించుకోవడం శ్రేయస్కరం. తెల్లని విభూతిని నుదట పెండెకట్టులుగా పెట్టుకుని మూడుపూటలా సంధ్యవార్చిన విప్రుడు శివలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు. యోగీశ్వరుడు ఆపాదతలమస్తకంగా త్రిసంధ్యల్లోనూ భస్మస్నానం చేస్తే చాలు అతడికి యోగసిద్ది కల్గుతుంది. ఇది జలస్నానంకన్నా ఎన్నోరెట్లు గొప్పది. గృహస్థులకు వంశవర్ధకం. సర్వతీర్థాలలోనూ క్రుంకులాడిన పుణ్యఫలం ఒక భస్మస్నానంతో లభిస్తుంది. మహాపాతకాలూ ఉపపాతకాలూ అన్నీ మండుతున్న అగ్నిలో ఎండుకట్టెల్లాగా దహించుకుపోతాయి. భస్మస్నానానికి సాటివచ్చే స్నానమే లేదు. ఇలాగని శివుడే సాక్షాత్తుగా ప్రశంసించి తానూ స్వయంగా నిత్యమూ భస్మస్నానాన్ని చేస్తున్నాడు. అప్పటినుంచీ బ్రహ్మాదిదేవతలూ ఋషి ముని గణాలూ సకలసత్కర్మాచరణలకూ ఆరంభంలో పనిబూని భస్మస్నానం చేస్తున్నారు. అందుచేత ఈ ఆగ్నేయమైన భస్మస్నానాన్ని చేసినవారందరూ ఈ శరీరాలతోనే రుద్రులుగా పరిగణింపబడుతున్నారు. భస్మస్నాతులనూ భస్మధారులనూ సందర్శించినవారు సైతం దేవాసురమునీంద్రులచేత వంద్యులవుతున్నారు. దర్శించి గౌరవసూచకంగా లేచి నిలబడినవారికి దేవేంద్రుడంతటివాడు సాష్టాంగపడతాడు. భస్మధారులకు అభక్ష్యభక్షణాది దోషాలు ఏమీ అంటవు. అన్నీ హాయిగా ఆరగించవచ్చు. జలస్నానం చేసినా భస్మస్నానం కూడా చేస్తేనే బ్రహ్మచారులూ గృహస్థులూ వానప్రస్థులూ సర్వపాపవినిర్ముక్తులవుతారు. సద్గతి(ముక్తి) పొందుతారు. యతీశ్వరులకు ఈ ఆగ్నేయభస్మస్నానం మరీ విశేషంగా ఫలప్రదమవుతుంది.

భస్మస్నానం




No comments:

Post a Comment