రామాయణం సుందరకాండ 38, 39, 40 సర్గలు - సందేశం
హనుమా! నీ మాటలు నా హృదయోనికి ఆశ్వాసనం కలిగిస్తూ, పెరుగుతూన్న పంట చేనుకి సకాలంలో పడిన వాన చినుకుల్లా ఉన్నై. శూరశ్రేష్ఠుడయిన రామునికి నా స్పర్శ ఎంత చల్లదనం కలిగిస్తుందో అలానే నీ మాటలు అలరించాలి. ఇంతకు ముందు నీకు కాకాసురుడి కథ చెప్పాను.
మరొక గుర్తుంది.
ఒకనాడు నా బొట్టు జారిపోగా ప్రక్కనున్న మణిశిల తీసుకుని అరగదీసి దానితో నా బుగ్గన చుక్క ఉంచాడాయన. అది మరచిపోలేదని చెప్పు,
ఇంద్ర, వరుణ సమ పరాక్రమోపేతుడవైన నువ్వు నీ భార్యను ఎవడో అపహరిస్తే, రాక్షసమధ్యంలో క్లేశాలు పడుతూంటే ఎలా సహించ గలుగుతున్నావు? అని అడిగినానని చెప్పూ,
నా సర్వసంపదలకూ ఆధారభూతమూ, ప్రాణప్రదమూ అయిన ఈ చూడామణిని చూచినప్పుడు ఆయనను చూచినంత సంతోషం కలుగుతుంది. ఇది పంపుతున్నానని చెప్పు.
ఈ బాధలూ, రాక్షస స్త్రీల హృదయవిదారక పరుష భాషణాలూ, ఆయన కోసమే భరిస్తున్నాను.
నెలలోగా ఆయన రాకపోతే నేను బ్రతకనని గట్టిగా చెప్పు. ఈ రావణ రాక్షసుని క్రూరదృష్టి నేను భరించలేను, అని శోకదీన వదనయై ఆగింది జానకీదేవి.
అప్పుడు హనుమంతుడు:
అమ్మా! ఆయన నీ కంటె దుఃఖంలో ఉన్నాడు.
లక్ష్మణుడూ అదే దశలో వున్నాడు. నీ వార్త నేను చెప్పగానే వారుభయులూ హుటాహుటి వచ్చి తన పరాక్రమంతో లంకానగరాన్ని భస్మం చేస్తారు. రావణుని సంహరించి నిన్ను తీసుకువెడతారు. మరేదయినా అయనకు విశ్వాసం కలిగించే ఆనవాలు ఇస్తావా? అని అడిగాడు.
జానకి : ఈ చూడామణి నా శిరోభూషణం. అంతకంటె ఉత్తమ మయిన అనవాలు లేదు, అంది.
హనుమంతుడు ప్రయాణ సన్నద్దుడై శరీరం పెంచుతున్నాడు.
అప్పుడు జానకి;
హనుమా! రామ లక్ష్మణ సుగ్రీవుల క్షేమం అడిగానని చెప్పడం మరువకు. వారందరినీ యిక్కడకు తీసుకురాగల శక్తి నీకే ఉన్నది. నాస్థితి చూశావు కదా! ఈ విషయాలన్నీ వివరంగా ఆయనకు
చెప్పాలి సుమా! నీకు శుభమగు గాక అంది.
హనుమంతుడు సంతోషంతో 'వచ్చినపని అయింది' కాని మరికొంత మిగిలినట్టు ఉంది, అని ఆలోచిస్తూ ఉత్తరదిశగా సాగాడు.
అశోకవన విధ్వంసం
No comments:
Post a Comment