Friday, April 10, 2026

Chapter 11 The story of the birth of the planet Mercury - అధ్యాయము 11 బుధుని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 11

బుధుని జన్మవృత్తాంతము

ఋషులిట్లనిరి : అపురూరవ మహారాజెవరు? దేవకన్యక యూర్వశి యెవర్తుక? ఆ మహారాజునకు కష్టములెట్లు గలిగెను? ఆ కథ మాకు వినిపింపుము. నీ ముఖకమలమునుండి వెడలు మధురసామృత మెంత గ్రోలినను తనివితీరదు. నీ వాక్కుల నుండి యమృతరసమే కురియును. అమృతములో లేని దివ్యరసము నీ వాక్కులందు గలదు. అమరుల మృతమున దనియరు. అట్లే మేము నీ వాగమృతమున దనియకున్నాము. 

సూతుడిట్లనియెను : మునులారా ! మున్ను శ్రీ వ్యాసునిచే చెప్పబడిన సుమనోహర దివ్యకథ నా బుద్ధికి దోచినట్లు వివరింతును వినుడు. దేవగురుడు బృహస్పతి. అతని భార్య తార. ఆమె సురూపమును ¸ వనమును కలది. అందమగు అవయవములు కలది. మదన పరవశ. ఒకనాడు రూప¸ వనశాలిని యగు ఆ భామిని ఆ కాలమున యజ్ఞము నాచరించున్న చంద్రుని గృహమునకేగి అతని కంటబడెను. ఆ రాజముఖిని గాంచగనే చంద్రుడు కామాతురుడయ్యెను. ఆమెయును చందురుని చూచి మిక్కిలిగా కామపీడిత యయ్యెను. ఇట్లు తారాశశాంకులు పరస్పరా సురాగమున కామార్తులైరి. మదోన్మత్తులగుచు కామబాణ పీడితులైరి. కామమదమత్తులును పరస్పరానురాగాన్వితులునగు వారిరువురును అట్ల క్రీడించుచు ఎన్నియో దినములు గడిపిరి. ఇది తెలిసి గురుడు విచారగ్రస్తుడై తారను ఇంటికిదోడ్కొని రమ్మని తన శిష్యునంపెను. కాని చంద్రునిచే వశీకృతయగు నామె రాలేదు.

అట్లే మాటిమాటికి గురుడు పంపుశిష్యులను చంద్రుడు తిరుగ బంపుచుండెను. కడకు ఆ యుదారమతి యగు బృహస్పతి తానే బయలుదేరి సోమునింటికేగి మదాన్వితుడై నవ్వు చంద్రుని గని పట్టరాని రోషమున నతని కిట్లనియెను: 

"చంద్రా ! ధర్మనిందితమైన పనిజేసితివేమి? సుందరియగు నా భర్యను నీవట్టె పెట్టుకొని యంటివేమి? దేవతలలోని వాడవగు చంద్రా! నీకు గురుడను. నీవు యాగముచేయుచున్న వాడవు గదా! ఓరీ మూఢా! నీవు గురుభార్య ననుభవించితివే! మీదుమిక్కిలి ఇపుడును వదలకున్నావు. బ్రహ్మహంత సువర్ణాపహారి సురాపాయి గురుతల్పశాయి వారి సంసర్గము కలవాడు అను వీరు పంచమహాపాతకులు. నీవు మహాపాపివి. దురాచారివి. అతినిందితుడవు. నీవు నా యంగన ననుభవించి నందున దేవలోకార్హుడవు కావు. ఇకనైన నా యసితేక్షణను వదలిపెట్టుము. నా యింటికామెను గొనిపోదును. కానిచో నీవు దుష్టాత్ముడవని గురుభార్యనే కూడినవాడవని లోకమున కెలుగెత్తి చాటుదును" అని పలుకుచున్న క్రుద్ధుడును భార్య యొక్క యెడబాటుచే దుఃఖితుడునైన గురునితో 

చంద్రుడిట్లనియెను: "బ్రాహ్మణులు కోపముననే యపూజ్యులగుదురు. దర్మశాస్త్రము లెఱింగిన వారు పూజార్హులు. క్రోధయుక్తులు పూజయందు విడువదగినవారు. అనఘా! నీ భార్య నీ యింటికే రాగలదు. ఆ చిన్నది నా యింటిలోనే యున్నను నీకు గల్గునష్టమేమి? ఆమె తన యభీష్టము ననుసరించి కామ సుఖార్థినిగదా! ఇచట కొన్ని నాళ్లిట్టులే యుండి తన యిష్టముననుసరించి యింటికి వచ్చును. పాతకము చేసినను ఋతుమతియైన పిదప స్త్రీ దుష్టురాలుగాదనియు, పాతకియైనను వేదకర్మలాచరించుటచే విప్రుడెన్నడును నింద్యుడుగాడు అనియు గురు వర్యులగు మీరు దర్మశాస్త్ర సమ్మతమైన పలుకు మున్ను పల్కితిరి, అని చంద్రుడు పలుకగనే గురుడు మరింత దురపిల్లెను. అతడు చేయునదిలేక స్మరాతురుడై చింతావశుడై తన యింటి మొగము పట్టెను. ఇట్లు కొన్ని దినములు గడచిన పిదప గురుడు చింతాపరవశుడై మరల త్వరితగతితో నోషదీపతి యింటికేగెను. ద్వారపాలు రడ్డగించుటచేత గురుడు బయటనే యుండెను. చంద్రెడంతకును బయటికా రాలేదు. గురునకంతకంతకును కోపము మితిమీరు చుండెను. ఇతడు నాకు శిష్యుడు. గురుపత్ని తల్లియేయగును. ఐన నితడు ధర్మముతో నా దానిని బల్మితో తానే యుంచుకొనెను. ఇపుడు నేనితనిని శిక్షింతును.

గురుడు ద్వారము చెంతనే నిలుచుండి యిట్లు కేకలు పెట్టుచుండెను : 

"ఓరీ మందా! పాపీ! సురాధమా! ఇంకను లోననే పండుకొని యున్నావా! వేగమే నా ప్రియకామినిని నాకిమ్ము. లేనిచో నిన్ను శపింతును. నా ప్రియను నా కీయనిచో నిన్ను భస్మమొనర్పగలను."

సూతుడిట్లనియెను : ఇట్లు గురుని పరుషవాక్కులు విని వెంటనే చంద్రుడింటిలోనుండి వెలుపలకు వచ్చెను. చంద్రుడు పక పక నవ్వుచు గురున కిట్లనియెను : 

"ఏమో యెక్కువగ పలుకుచున్నావే? సర్వశుభలక్షణ లక్షితయగు ఈ అసితా పాంగి నీకు యోగ్యురాలుగాదు. నీకు తగిన కురూపను చేపట్టుము. ఒక్క బిచ్చగాని యింట నిట్టివరవర్ణిని యుండదగదు. మందమతీ! స్త్రీకి తనకు సాటివాడగు ప్రియునివలన రత్యానందము కలుగును. నీ వీ కామశాస్త్ర మర్మము లెఱుగవు. దుర్మతీ! ఇంక నీవు యథేష్టముగ పోవచ్చును. నేను ఆ కామినిని ఈయను. నీ చేతనైనది చేసికొమ్ము. ఈ వరవర్ణిని నీయను కామార్తుడవగు నీవు శపించినను నాకదితగులదు. గురూ! ఈ కాంతను నేనీయను. నీ కిష్టమైనది చేసికొమ్ము.'' 

సూతుడిట్లనియెను: చంద్రుడట్లు పలుకగా గురుడు చేయనదిలేక కిన్కబూని పెల్లుదురపిల్లి వేగనింద్రుని కడకరిగెను. క్రుంగిన మదితో చింతం బొగులుచుండిన గురుని దర్శించి ఇంద్రుడు అర్ఘ్యపాద్యాదివిధుల బూజించెను.

పరమోదారు డింద్రుడు దీనదశలో నున్న గురునకిట్లనియెను : 

"మహాభాగా! మీ మోము విన్నబోయియున్నదే! శోకార్తుడవైతివేమి? మీ చింతవేమి? నీవు నా గురుడవు. నా యేలుబడిలో నిన్నెవ్వడవమానించెను? ఈ లోకపాలురతోడి నా సైన్యమంతయును నీ యధీనము. బ్రహ్మ విష్ణువు శివుడు దేవతలెల్లరు నీకు సాయమొనర్పగలరు. మీ చింతయేమో వేగిరమే వెల్లడించుడు'' 

గురుడిట్లనియెను : "సులోచనయగు నా పత్ని తారను తారేశుడు తన చేజిక్కించుకొనెను. ఎన్ని మారులు వేడికొన్నను ఆ దుష్టాత్ముడు తిరిగి యామెను నా కిచ్చుటలేదు. ఇపుడు నేనేమిచేతును? నీవే నాకు శరణము. నేను మిక్కిలి క్లేశపడుచున్నాను. నాకీ విషయమున సాయమొనర్పుము.

ఇంద్రుడిట్లనియెను : "ధరజ్ఞా! సువ్రతా! మహామతీ! నీ వింక దుఃఖించకుము. నేను నీ దాసుడను. నీ కాంతను తప్పక తెప్పించి యిత్తును. నేనిపుడే నా దూతనంపుదును. ఆ మదమత్తుడప్పటికిని నీ భార్యనీయనిచో సురసైన్యముతో నతని మార్కొని యుద్ధము చేయుదును. అని యిటుల నింద్రుడు గురునోదార్చి విచారదర్శియు చతురుడునగు దూతను వార్త నందించుటకై చంద్రునికడ కంపెను. సువిచక్షణుడగు ఆ దూత వెంటనే చంద్రలోకమేగి రోహిణీ పతితో నిట్లు పలికెను : 

"మహాభాగా! మహామతీ! ఇంద్రుడు నీ కొకమాట చెప్పుమని నన్నంపెను. నా ప్రభువనిన పలుకులు పలుకుచున్నాను. నీవు దర్మజ్ఞుడవు నీతివిదుడవు. నీ తండ్రి అత్రియును ధర్మాత్ముడు. కాన నీవు నింద్యమైన కార్యము చేయదగదు. ఎల్లరును తమ తమ భార్యలను యథాశక్తిగా ఎచ్చరికతో గాపాడుకొనవలయును. ఈ విషయమున కలహముకూడ జరుగునకాశము కలదు. అందు సందియము లేదు. నీవు నీ భార్యనెటుల రక్షించుకొనదలతువో గురుడును తన భార్య నటులే రక్షించుకొన దలచును. సుధానిధీ! ఎల్లభూతములను స్వాత్మభావమున జూడుము. నీ కిరువదెనమండ్రుగురు దక్షకన్యకలు గలరు. వారినందఱిని స్వేచ్ఛగ ననుభవింపుము. గురు భార్యను మాత్రము విడిచిపెట్టుము. నీవంటి గొప్పవాడే యహంకరించి నింద్య కార్యము సేయుటకు పూనుకొన్నచో నిక మూర్ఖుడునట్లే ప్రవర్తించును గదా. దాని వలన ధర్మము నశించును. మనోరమ యగు గురు నిల్లాలిని వదలిపెట్టుము. నీ నిమిత్తమున విబుధులలో కలహము చెలరేగకుండుగాక!"

ఆ యింద్రుని సందేశమాలించి చంద్రుడించుక కినుకబూని ఇంద్రుని దూతతో వక్రభంగి నిట్లు పలికెను. 

"ఓ మహాబాహో! నీవును ధర్మజ్ఞుడవే! దేవేంద్రుడవే! నీ పురోహితుడు నీతో సమానుడే. మీ యిద్దఱి బుద్ధులును సమానములే. చాలమంది పరోపదేశమున పండితులు. ఏ పనియైన తామే చేయవలసి వచ్చినపుడు అట్లే యాచరించువారు దుర్లభులు. ఎల్లరును బృహస్పతి రచించిన ధర్మశాస్త్రమును ప్రమాణముగ నంగీకరింతురు గదా! తన్నువలచిన కామినిని అనుభవించుట దోసముగాదని దాని యందే కలదు. ఇంతకు వీర్యవంతున కందఱును తనవారే. పాపము! బలహీనున కొక్కడును తనవాడునువాడు లేడు. ఈమె స్వీయ - ఆమె పరకీయ యను భేదములు మందమతుల భ్రమలే. ఈ తారకు నా యందనురాగమున్నంతగా బృహస్పతియందు లేదు. అనురాగవతిని వదలిపెట్టుటేమంత ధర్మము గాదు. న్యాయమును గాదు. అనురాగముగల దానియందే సంసారముగాని విరక్తురాలియందు కాదుగదా! ఆ గురుడు తనయన్న భార్య యందనురక్తుడైన నాటనుండియే యీమె కతనియందు విరక్తి గిగినది. దూతా! ఇక నీవు వెళ్లవచ్చును. నే నీ వరారోహన గురున కీయను. నీవు నా మాటగ స్వయముగ నింద్రునకిట్లు దెల్పుము: 

"ఓ యింద్రా! నీవు దేవపతివి. నీకు తోచినది చేసికొనుము." 

సూతుడిట్లనియెను : అని చంద్రుడు పల్కగా విని దూత యింద్రుని చెంతకేగి చంద్రుని మాటలతనికి వినిపించెను. అదివిని యమరపతి కోపాతిరేకమున తన గురునకు సాయము సేయ సేననాయత్త పరచెను. శుక్రునకు గురునకు సరిపడదు. ఆ ద్వేషముతో శుక్రుడు చంద్రునిజేరి తారను మరల గురునకీయ వద్దని యిట్లు చెప్పెను. 

"ఓ మహామతీ ! ఆర్యా ! ఆ యింద్రునితో నీకు పోరాటము సంఘటిల్లినచో నా మంత్రశక్తిచేత నేను నీకు సాయపడుదును. చంద్రుడు గురుదారను బొందెననియును శుక్రుడు గురునకు శత్రువనియు శివుడెఱింగి బృహస్పతికి తానండగ నిలిచెను.

ఆ సమయమున తారకాసుర సంగ్రామమువలె సురాసురుల నడుమ పెక్కేండ్లు ఘోరమైన పోరు సంఘటిల్లెను. ఆ దేవదానవ సంగ్రామము గూర్చి విని వారిని శాంతింప జేయుటకు బ్రహ్మయును హంసవాహనమెక్కి యక్కడి కేతెంచెను. అపుడు బ్రహ్మ చంద్రునితో నిట్లు పలికెను : 

"నీవా గురుపత్నిని వదలుము. కానిచో శ్రీ విష్ణువునకు జెప్పి నిన్ను నశింపజేతును. 

పిమ్మట బ్రహ్మశుక్రుని వారించి యిట్లనియెను : "ఓ మహామతీ! దైత్యుల సహవాస దోషమున నీ మతియు నన్యాయమే తలపెట్టుచున్నదా? 

అంత శుక్రుడు చంద్రుని వారించి "ఆ గురునాలినింక విడనాడుము. నీకిట్లు చెప్పుమని నీ తండ్రియే నన్నంపెను." అనెను. 

సూతుడిట్లనియెను : శుక్రుని మాటలు విని చంద్రుడు అప్పటికి గర్భవతి యగు గురుని యిల్లాలిని తిరిగి గురునకు నప్పగించెను. గురుడు తన భార్యను మరల గ్రహించి, సంతసించి తన యింటి కరిగెను. దేనదానవులును దమ తమ నెలవుల కరిగిరి. బ్రహ్మ తన లోకమేగెను. శంకరుడు కైలాసము జేరెను. గురుడు తన మనోరమ దార యగు తారను మరల బడసి సంతసించెను. కొన్ని నాళ్లకొక శుభ దినమున శుభ తార యందు తార యందొక సుపుత్రుడుదయించెను. ఆ శిశువు గుణములలో తారాపతినే పోలియుండెను. గురుడు సంతుష్టుడై యా కుమారునకు జాతకర్మ మున్నగు కార్యములు యథావిధిగ జరిపెను. 

మహామతి చంద్రుడునపుడు పుత్త్ర జననము విని "ఈ శిశువు నీ కుమారుడు గాడు. మద్వీర్య సంజాతుడు. జాతకర్మాది విదులను నీ వొనర్చితివేమి ?" అని దూతచే గురునకు వార్త నంపెను.

దూతవాక్కులు విని గురుడు "నను బోలి యున్నందున ఇతడు నా కొడుకు. ఇందు సందేహము లేదు" అని సమాధానమంపెను. అపుడు దేవదానవులు మరల వాదించుకొనుచు సంఘములుగ కయ్యమునకై గుమికూడిరి. శాంతికాముడగు బ్రహ్మ మరల నచ్చటికి విచ్చేసి దుర్మదులై రణమొనర్ప జూచువారిని వారించెను. 

మరియు దర్మాత్ముడగు బ్రహ్మ తారతో "వరారోహా! ఈ తనయుడెవరివాడో నిక్కము పలుకుము. జరిగినదంతయు నీవు చెప్పిననే కాని వీరు శాంతించరు" అని పలికెను. అపుడా వరవర్ణిని తారాధిపతివై పోరగన్నుల నగి తల వంచుకొని యా శిశువు చంద్రుని పుత్రుడేయని మెల్లగ బల్కి లోనికేగెను. అంత చంద్రుడు ముదమంది తన తనయుని నెత్తుకొని యతనికి బుధుడను పేరు పెట్టి తన నెలవున కేగెను. బ్రహ్మ తన లోకమున కేగెను. సురలింద్రుని గూడి నాక లోకము చేరిరి. ఇట్లెల్ల వారును దమ తమ నిలయముల కరిగిరి. 

ఇట్లు గురుని భార్యయందు చంద్రుని వనల బుధుడు జన్మించెను. ఇదే బుధుని జన్మ వృత్తాంతము. మున్ను సత్యవతీ సుతుడగు వ్యాసుని వలన నిదంతయును వింటిని. ఇపుడదే మీకు వినిపించితిని.

అధ్యాయము 12 సుద్యుమ్నస్తుతి

పంచాంగం

Chapter 10 Vyasa, having a son, performs penance for Shiva - అధ్యాయము 10 వ్యాసుడు పుత్రార్థియై శివుని గూర్చి తపమొనర్చుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 10

వ్యాసుడు పుత్రార్థియై శివుని గూర్చి తపమొనర్చుట


ఋషు లిట్లనిరి : సూత మహర్షీ! మహా తేజస్వియగు వ్యాసుడీ దివ్యదేవీ పురాణమును రచియించి శ్రీ శుకునిచే దానిని చదివించెనంటివి. వ్యాసుడు తపమొనరించి శుకునెట్లుద్భవింపజేసెను? నీవా వ్యాసుని వలన విన్నదంతయు మాకు విశదమొనరింపుము. 

సూతు డిట్లనియెను : సత్యవతీ తనయుడు వ్యాసుని వలన యోగి వరుడగు శుకుని జన్మమెట్లుగల్గెనో యా వృత్తాంతము దెల్పెదను. పూర్వము సత్యవతీ సుతుడగు వ్యాసుడు రమణీయమైన మేరుగిరి శిఖరముపై నియమముతో పుత్రునికై ఘోరతపమాచరించెను. ఆ తపోనిధి పుత్రార్థియై నారదుని వలన నేకాక్షరమంత్ర రాజమగు వాగ్బీజమంత్రము నుపదేశము పొంది జపించుచు మహామాయను ధ్యానించు చుండెను. వ్యాసుడు తనకు నింగి గాలి నిప్పు నీరు నేలయను పంచభూతముల శక్తులతో సంపన్నుడగు పుత్రుడు గలుగవలయునని నిశ్చయించుకొనెను. అందులకై వ్యాసుడు నిరాహారియై దీక్షతో నూరేండ్లు తపమొనరించెను. శివాశివుల నారాధించెను. సకల భూతయోనియగు మహాశక్తియే యెల్లెడల బూజనీయయని తలంచి వ్యాసుడాదేవిని నిరంతరము గొలుచుచుండెను. లోకమందశక్తుడు నింద్యుడగును. శక్తుడు పూజ్యుడగును. ఆ మేరుగిరి శిఖరముపై అద్భుతకర్ణికారవనము శోభిల్లుచుండును. అందు వేల్పులు క్రీడలందు మునిగి తేలుచుందురు. మునులు తపములు సేయుచుందురు. అచట మధుర సంగీతరవములు వీనుల విందులు సేయును. అట్టి సుమనోహరమైనచోట ధర్మాత్ముడు సత్యవతీ సుతుడునగు వ్యాసుడు తపము సేయ మొదలుపెట్టెను.

అతని మహోగ్ర తేజము చరాచరలోకములనే వెలిగించెను. ధీమంతుడగు ఆ పారాశర్యుని జడ లగ్నివర్ణములయ్యెను. అతని తపము వేడిమికి దేవేంద్రుడే గడగడలాడెను. ఇంద్రుని భయవ్యాకులత్వములను రుద్రుడు గాంచెను. అపుడా రుద్రభగవాను డింద్రున కిట్లనియెను: 

"ఓ యింద్రా! ఏల భీతుడవైతివి? నీకు గలిగిన శోకమునకు కారణమేమి? తాపసులను గని యెవ్వడు నెప్పుడును కోపము జెందకూడదు. మహర్షులు నన్ను శక్తి సంపన్నునిగ దెలిసికొని తపమొనర్తురు. తాపసు లెప్పుడు నితరులకు కీడు తలపెట్టరు." అను వచనములాకర్ణించి "ఆ వ్యాసుడేల తపమొనర్చు చుండెను. అతని మదిలోని కోర్కి యెట్టిది?" అని ఇంద్రుడడుగ "ఆ వ్యాసుడు పుత్రుని కొరకు కఠిన తపమొనర్చుచున్నాడు. వ్యాసునకు తపముతో నూరేండ్లు నిండినవి. కాన నతనికిపుడు శుభకరుతనయుని ప్రసాదింతును" అని రుద్రుడనెను. మధుర దయాసముద్రుడు ప్రసన్నవదనుడు జగద్గురువునగు రుద్రుడు వ్యాసుని జేరి యిట్లనియెను: 

"ఓ సత్యవతీ తనయా! వ్యాస మునీ! లెమ్ము. నీకు సత్పుత్త్రుడుదయించుగాక! ఓ యనఘా! అమిత తేజోనిధియు జ్ఞానియు నీకు పేరు ప్రతిష్ఠలు దెచ్చువాడును లోక ప్రియుడునగు పుత్త్రుడు నీకు జన్మించుగాక! అతడు సత్త్వగుణ సంపన్నుడు సత్యవిక్రముడు పూర్ణాత్ముడు గాగలడు." 

సూతుడిట్లనెను : అను శివుని శివంకరవచనములు విని వ్యాసుడు శివునకు నమస్కరించి తన యాశ్రమమున కరిగెను. అతడు తాను పెక్కేండ్లు పడినపాట్లకు బాధపడుచు –

అరణిలో గుప్తమైయున్న యగ్నిని మరల బొందుట కరణిని మథించుచుండెను. అపుడతని డెందమున పుత్ర కామమును గలిగెను. దండముతో నరణిని జేర్చి మథించగ మథించగా నగ్ని యుదయించెను. నాకు పుత్ప్రోత్తికి హేతువగు స్త్రీ లేనేలేదు! నాకీ యగ్నితో సమానుడగు పుత్రుడెట్లు కలుగును? కుల్పోత్పన్న రూప సంపన్న తరుణి కాళ్ళకు సంకెళ్ళవంటిది అగు కాంతను నేనెట్లు పరిగ్రహింతును? ఆమె పుత్రోత్పత్తిలో యోగ్యురాలు, పాత్రివ్య్రత జీవన రూపవతి కామిని కావచ్చును. అట్టి స్వేచ్ఛాసుఖ విధాయిని యగు నారి బంధన కారిణి. ప్రణవ స్వరూపుడగు శివు డంతటివాడే ఉమా రాగపాశ బంధములచే బద్ధుడయ్యె గదా! ఇట్లు దుర్ఘటమైన గార్హస్థ్యము నేనెట్లు నెఱపగలను అని వ్యాసుడు విచారించు చుండెను. అంతలో దివ్య కామిని యగు ఘృతాచి వ్యాసునకెట్ట యోదుట నింగిపై దోచెను. చపలములగు క్రీగంటి చూపులతో తన సమీపమున ఉన్న ఆ అప్సరః శ్రేష్టుని చూచి వ్యాసుడు వ్రతపరాయణుడయ్యు కామబాణవ్యాప్తమనస్కుడయ్యెను. ఆ సంకటము విషయమున నేనేమి చేతునని అతడు తలపోసాగెను. ఇపుడు ధర్మము ముందు దుస్తరమైన కామము పెల్లుబికినట్లున్నది. నన్నే మోసగించవచ్చిన యీ రమణిని నే నొకవేళ నంగీకరింతు ననుకొందము. అపుడు బ్రహ్మవాదులు తాపసులును కామ లోలుడనగు నన్ను గేలిసేతురు. 

'ఇతడే నూరేండ్లెంతో ఘోరముగ తపించి యొక యచ్చర కొంగుబట్టుకొని తన సర్వస్వమామె ముందుంచెను' అని వారందురు. సాటిలేని సుఖము లభించినచో నిందవచ్చినను సరే! గృహస్థాశ్రమమున పుత్త్రజన్మము గల్గినచో నది సర్వసుఖము గలిగించును. అది జ్ఞానులకు మోక్షానందమును గల్గించును. ఈ దేవకన్యవలన నాకట్టి పుణ్యము గలుగదు. తొల్లి పురూరపు డూర్వశికి వశుడై తుదకామెచేతనే తిరస్కరింపబడెను అను కథను నేను నారదుని వలన వింటిని.

అధ్యాయము 11 బుధుని జన్మవృత్తాంతము

పంచాంగం

Chapter 9 Vishnu kills Madhu Kaitabhu by the grace of Sridevi - అధ్యాయము 9 శ్రీదేవి దయచే విష్ణువు మధుకైటభుల పరిమార్చుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 9

శ్రీదేవి దయచే విష్ణువు మధుకైటభుల పరిమార్చుట

సూతు డిట్లనియెను : జగద్గురుడగు విష్ణుని దేహమందలి కన్నులు ముక్కు నోరు గుండె ఱొమ్ములనుండి నిద్ర తొలగిపోయెను. అపుడా తామసశక్తి హరి మేను విడనాడి గగనసీమపై నొప్పుచుండెను. ఆ హరియు మాటి మాటి కావులించుచు మేలుకాంచెను. మహాతేజుడు శ్రీహరి భయపీడితుడైన బ్రహ్మను గనుంగొని మేఘగంభీర భాషలతో నతని కిట్లు పలికెను: 

"ఓ భగవానుడా! కమలజా! నీ తపము వదలి యిటకేల యరుగుదెంచితివి? మఱియు చింతా తరుడవై భయభీతుడవై వైక్లబ్యమున నేలయుంటివి? 

బ్రహ్మ యిట్లనియెను: ఓ దేవా! నీ చెవుల మలమునుండి భీకరాకారులు బలవంతులు మధుకైటభులను దనుజులను పుట్టిరి. జగత్పతీ! దేవా! వారివలన భయమున నేను నీ సన్నిధి చేరితిని. నేను భయగ్రస్తుడను-విచేతనుడను. నన్ను త్వరగా కాపాడుము. 

విష్ణు విట్లనియెను: నీ విచటనే యుండుము. నేనేగి వారి యంతు తేల్చుకొందును. ఆ మూఢుల కాయువు మూడినది. లేనిచో నాతోడ నేల బోరవత్తురు? 

సూతు డిట్లనియెను: ఆ దేవేశుడట్లు పలికినంతనే యా మదమత్తులు విక్రమవంతులు నగు రక్కసులు వేల్పు పెద్దను వెదకుచు నచటి కేతెంచిరి. ఓ మునులారా! ఆ సంద్రమునందు నిరాధారులై విగతజ్వరులై మదగర్వమున విఱ్ఱవీగు దైతేయులు బ్రహ్మతో నిట్లనిరి: 

"మానుండి పరుగెత్తి నీ వితని చెంత కెల వచ్చితివి? మాతో రణము సల్పుము. ఈ పురుషుడు చూచుచుండగనే యిపుడే నిన్ను బరిమార్తుము. ఆ పిదప పాపసెజ్జపై పరున్న యితనిని హతమార్తుము కాన నీవు మాతో బోరుము. లేక మీకు దాసుడనైతి ననుము.

సూతు డిట్లనియెను : వారి పలుకులు విని జనార్దనుడు వారి కిట్లనియెను: 

"ఓ దైత్యులారా! మీరు నాతో సంగర మొనరింపుడు. మహాబలులారా! మదయుతులగు మీ కండకావరమంతయు నిపుడే యంతమొందింతును. మీ కిష్టమైనచో నాతో సంగర మొనరింపుడు. 

సూతు డిట్లనియెను : హరి మాటలు విని వారు క్రోధమున నెఱ్ఱబారిన గుండెలతో నిరాధారమైన నీటిలోనే యుండి యుద్ధము సేయ దలపెట్టిరి. అంత మధువు శ్రీహరితో రణ మొనర్ప నాయత్తమయ్యెను. కైటభుడూరుకుండెను. వారు మత్తమల్లవీరులవలె పోరదొడగిరి. మధు వలసట జెందగనే కైటభుడు హరితో నాలము సల్పుచుండెను. ఆ మధుకైటభు లొకరి తరువాత నొకరు రాగాంధులై ప్రభవిష్ణువగు విష్ణునితో బాహుయుద్ధమునకు దలపడిరి. ఆకసమునుండి శ్రీదేవియు బ్రహ్మయు నిరువురును వారి పోరితము తిలకించుచుండిరి. దురము సలుపు దానవు లెంతకు నలయుటలేదు. కాని హరి డస్సిపోయెను. ఈ రీతిగ నాలము జరుగుచుండగ నైదు వేలేండ్లు గడచినవి. భగవంతు డంతట వారి వధోపాయమునుగూర్చి తన మదిలో నీ రీతి విచారించదొడగెను: 

"నేను వీరితో నైదు వేలేండ్లుగ బోరితిని. ఐనను వీరికి శ్రమ గలుగుటలేదు. కాని నేనలసితిని. ఇదంతయు జూడగ నాకచ్చెరువు గలుగుచున్నది. నా బలవీర్యములు నేడేమైనవి? వీరింకను కుశలముగనే యున్నారు. ఇందులకేమి కారణమో?" ఇట్లు హరిని గని మదోన్మత్తులగు దనుజులు సంతసమున మేఘగంభీర నిస్వనమున హరితో నిట్లనిరి: 

"విష్ణూ! నీలో బలముడిగినచో రణములో నలసట చెందినచో నేను మీ దాసుడనైతినని తలపై దోయిలించుము. కాక నీకు లావే యున్నచో తిరిగి మాతో గయ్యము సేయుము. మొదట నిన్ను జంపి పిదప నలుమోములుగల యీ మహాపురుషుని నంతమొందింతుము."

సూతు డిట్లనియెను : వారి మాటలు విని భగవంతుడు సామపూర్వకముగ నింపుసొంపు దనరు పలుకులతో సాగర మందున్న దానవులకిట్లనియెను : 

"మహావీరులు జంకిన - యలసిన - శస్త్రము వదలినవానిపైగాని బాలునిపైగాని దెబ్బకొట్టరు. ఇది సనాతన ధర్మము. మీతో నే నైదు వేలేండ్లు బోరితిని. మీరిరువురును సమబలులు, సోదరులు. ఎడతెరపి లేక బోరువారు. నేను మాత్ర మొక్కడనే! మీరు నట్ట నడుమ సేద దీర్చుకొని కయ్య మొనర్చుచున్నారు. ఇక మీదట నేను సైత మలసట దీర్చుకొని పిమ్మట మీతో తప్పక పోరు సల్పుదును. కనుక నేను విశ్రమించి వచ్చి న్యాయమార్గమున రణము సలుపు దనుక బలశాలురు మదోత్కటులు నగు మీరు తాలిమి బూనుడు. 

సూతు డిట్లనియెను : ఆ హరి వాక్కులు విని రాక్షసులు అతనిపై విశ్వాసముంచి విష్ణుడు విశ్రాంతినొందిన పిమ్మట మరల సమరము కొనసాగించదలచి దూరముగ తొలగియుండిరి. చతుర్భుజుడగు వాసుదేవుడు రక్కసులను దూరమందే కాంచి వారి చావు కారణమును తన మనస్సులో నిట్లు విచారించుచుండెను. అంతలో హరి కీ విధముగ జ్ఞానోదయమయ్యెను. శ్రీదేవీ వరము నుసరించి వీరు స్వచ్ఛందమరణులు. వీరు నశింపరు. నేను వీరితో వ్యర్థముగ రణమొనర్చితిని. నా పడిన శ్రమయంతయు వమ్మైనది. ఇక ముందెట్లు వీరిని గెలువగలనో తెలియుట లేదు. నేనెదిరించినచో వరమదగర్వితులగు వీరిచ్చోటు వీడి కదలరు. చావకున్నచో వీరు మరింత దుఃఖకారకులగుదురు. భగవతి వీరి కొసగిన వరమతి దుర్భరమైనది. ఎంత దుఃఖితుడైనను తాను స్వయముగ చావగోరుకొనడు గదా! రోగియై యుండియు దీనుడైయున్నను నెవ్వడును చావగోరడు. ఇంక నీ బలమదోన్మత్తులు తమ చావు తామే యేల కోరి తెచ్చుకొందురు? కనుక నిత్తఱి కామప్రదాయినియగు శ్రీ విద్యాశక్తిని నేను శరణు వేడుదును. ఆమె సుప్రసన్న కానిదే కోరికలు సిద్ధింపవు.

ఇట్లు తలంచి హరి నింగిపై నున్న మనోహర శివ స్వరూపిణియగు యోగనిద్రను దర్శించెను. అమేయాత్ముడు యోగవిదుడునగు హరి ఆ రాక్షసులను చంపుటకై వరదాయినియు త్రిభువనేశ్వరియు నగు యోగనిద్రను దోయిలించి ఇట్లు సంస్తుతించెను : 

"దేవీ! మహామాయా! సృష్టి సంహారకారిణీ! అనాదినిధనా! చండీ! భుక్తి ముక్తి ప్రదాయినీ! నీకు నా వందనములు. దేవీ! నీ సగుణ నిర్గుణ స్వరూపములు నే నెఱుంగజాలను. నీ విచిత్ర చరిత్రము లనంతములు. వాని నన్నిటి నెవ్వడు పేర్కొనగలడు? నీ దుర్ఘటమైన ప్రభావ విశేషము లెఱింగితిని. నేను నిద్రయందుండగ చేష్టలు దక్కియుంటిని. అపుడు బ్రహ్మ నన్ను మేలుకొలుపుటకు పలుమారు యత్నములు జరిపెను. కాని నా యింద్రియములు చేతలుడిగియుండుటచే మేల్కొనజాలకుంటిని. నీ ప్రభావముననే నిద్రించితిని. మరల నీ మూలముననే మేలుకొంటిని. ఈ ఘోర సంగర మొనర్చితిని. ఇందు నేనే యలసితిని గాని నీ వర మహిమ గల యీ దానవుల లయలేదు. ఇంతేకాక వారు బ్రహ్మను చంపుటకు బూనుకొనిరి. నేను వారిని ద్వంద్వ యుద్ధమునకు బురికొల్పితిని. వారితో మహాసాగరమునం దతి ఘోరముగ బోరు సల్పితిని. కాని వారి చావునకు నీ వరమడ్డుగ గలదని తెలిసికొంటిని. ఇపుడు సర్వశరణ్యవగు నిన్నే నే శరణుగోరుచున్నాను. ఓ దేవార్తి వినాశినీ! ఈ దానవులు వరదాన దర్పితులు. నేను యుద్ధముచే ఖిన్నుడనైతిని. కాన నాకిపుడు సాయపడుము. ఆ పాపులు నన్ను జంపన సమకట్టి యున్నారు. నేనేమి చేతును? ఎక్కడి కేగుదును? ఇట్లు హరి వాక్కులు విని అతి దీనముగ ప్రణమిల్లుతున్న దేవదేవుడు వాసుదేవుడు సనాతనుడునగు హరిని గని దేవి నగి యిట్లనియెను : 

"దేవదేవా! నీవు మరల స్వయముగ యుద్ధ మొనరించుము. వీరిని మోసముతో జంపుము. నేను నా మాయాశక్తిచే వీరి బుద్ధులను మోహింపజేయుదును. అపుడా శూరులు మాయా మోహితులగుదురు. నీవు వెంటనే వారిని చంపుము."

ప్రీతి పూర్వకములగు శ్రీదేవి పలుకులు హరి వినెను. అంతలో ఆ మహావీరులగు దానవులు యుద్ధకాములై మహాసాగరమందలి సమరస్థలము జేరిరి. వారట విష్ణుని గని సంతసిల్లి "ఓ మహాకామా!చతుర్భుజా! నిలునిలుము. మాతో యుద్ధ మొనరింపుము. నిజముగ జయాపజయములు దైవాధీనములు. బలవంతుడే సాజముగ గెలుపొందును. కాని యొకొక్కప్పుడు దుర్బలుడును దైవబలమున జయమందును. కనుక మహాత్ము డెప్పుట్టునను హర్షశోకములందరాదు. తొలుత పెక్కురు రక్కసులు దేవతల చేతులలో మడిసిరి గదా! ఇప్పడు నీవు మాత్రము మాతో బోరుచు పరాజయమొందితివి" అనిరి. ఇట్లు పలికి మహాబలులగు దైత్యులు సమరమునకు తలపడిరి. అద్భుతకర్ముడగు హరి వారిని గాంచి తన బలముకొలది పిడికిట వారిని పోటు పొడిచెను. అపుడా పోటు మొనగాండ్రు హరిని మరల పిడికిళుతో పొడిచిరి. ఇట్లు వారికి పరస్పరము దారుణ రణము సంఘటిల్లెను. నారాయణుడా వీర్యవంతుల యుద్ధ నైపుణ్యము గాంచి దీనదృక్కులతో తన సమక్షమునందున్న భగవతిని దర్శించుచుండెను. 

సూతుడిట్లనియె : అపుడు దేవి కరుణ భావమున కందుచున్న హరిని పరికించి వెంటనే మరులు రేకెత్తించు వాడితూపులవంటి చూపులతో దానవులను జూచెను. ఒకేసారి పెద్దగ నవ్వెను. చిరునగవు నెయ్యము చిందులాడు దేవి నెమ్మొగముగాంచి యాపాపాత్ములు మోహమాదాంధులైరి. వారు నిర్మలకాంతులీను దేవీ రూపమునే మాటి మాటికి మనసుందు దలంచుచు మదనబాణహతులై యామెనే చూడ దొడగిరి. ఆ మహాదేవి మహిమవలన వారు మోహితులైరని కార్యకుశలుడగు భగవాను డూహించెను. అతడు నవ్వుచు మేఘగంభీర ఘోషముతో వారికిట్లనియెను; 

"మీరలు మహావీరులు. పరమడుగుడు. మీ యుద్ధమునకు సంతుష్టుడనైతిని. మీకు వరమీయదలచితిని. నాతో తొలి పెక్కురు రక్కసులు బోరిరి. కాని మిమ్ముబోలు వీరాధివీరులను నేను గనలేదు, వినలేదు. అందుచే మీ మేటిబలమునకు సంతసించితిని. మీరు సమబలులు, సోదరులు, మీకోరిన వరమిత్తును." విష్ణువు వచనములు వినగనే వారికభిమానము మెండయ్యెను. వారు మదనపరవశులునైరి.

ఆ జగదానంద కారిణియగు మహామాయను కామపరవశులై చూచుచు వారు విష్ణువుతో నిట్లనిరి: "ఓ హరీ! మేము యాచకులము గాము. నీకే మేము వరమీయగలము, మేమే దాతలము. కోరుకొమ్ము. నీకే మేము వరమిత్తుము. హృషీకేశా! వాసుదేవా! నీ మనస్సులోని కోరిక దెలుపుము. నీ విచిత్ర యుద్ధమునకు మేమెంతయు సంతసించితిమి." అను దానవుల మాటలు విని హరి వారికిట్లు మారు పలికెను: 

"మీరు నా యెడల ప్రసన్నులైనచో మీరు నా వధ్యులుగండు." 

సూతుడిట్లనియె: ఆ హరి వచనములు విని వారు విస్మితులై మనము వంచింపబడితిమని శోకమున వ్యాకులచిత్తులైరి. అది అంతయును నీటిమయమే. నేలయెచ్చోటను లేదు. అది యెఱింగి దనుజులు హరికిట్లనిరి: 

"దేవా! జనార్దనా! మొదట నీవే మాకు వరమిత్తునంటివి. కనుక సత్యపరాక్రముడనేని నీవే మాకు ముందుగ వరమొసంగుము. నీరు లేనిచోట నీవు మమ్ము వధించుము. అపుడు మేము వధ్యులమగుదుము, ఆ రీతిగ చేసి నీ సత్య ప్రతిజ్ఞను నిలువబెట్టుకొనుము."

అంత చక్రియగు హరి తన చక్రమును మది దలంచి వారితో నవ్వుచు నిట్లు పలికెను : 

"మహాభాగులారా! నీరులేని చోటుననే మిమ్ము హతమార్చగలను. దేవదేవేశుడట్లు పలికి తన పెందొడలను మరింత వెడల్పు చేసి యిదే నీరు లేనిచోటని చూపి వారికిట్లనియెను: 

"ఓ దనుజులారా! నా తొడలపై మీ తలలు విడిచెదరుగాక! అపుడు మీరును నేనును సత్య ప్రతిజ్ఞల మగుదుము. అదివిని మది విచారించి దనుజులు తమ మేనులు వేయి యోజనములంత పెంచిరి. దాని కచ్చెరుమంది భగవంతుడును తన పెందొడలు దానికి రెండింతలు పెంచెను. అపుడు వా రా పరమాద్భుతమైన పెందొడలపై తమ తలలుంచిరి. ప్రభ విష్ణువు తన చక్రముచే వారి తలలు ద్రుంచెను. ఇట్లు మధుకైటభులు ప్రాణములు గోల్పోయిరి. వారి మేదస్సుచే సాగరమంతయు నిండినది. ఆనాటి నుండి భూమికి మేదినియను మరొక పేరు గలిగెను. మునులారా! ఆ కారణముననే మన్ను తినదగనిదైనది. ఈ ప్రకారముగ మీరడగినదంతయును వివరించితిని. కనుక బుధులు నిరంతరము శ్రీ మహామాయా రూపయగు శ్రీ విద్యను సముపాసించ వలయును. ఎల్లసురాసురులు నాపరమ కళ్యాణ శక్తిని సమారాధించవలయును. ఇంతకు మించిన భాగ్యమీముల్లోకములందును మరేదియును లేదు. కనుక సగుణనిర్గుణాత్మిక యగు పరాశక్తి సతతము పూజనీయ అని యెల్ల వేదశాస్త్రార్థములందును వచింప బడినది. ఇది ముమ్మాటికి నిజము నిజము.

అధ్యాయము 10 వ్యాసుడు పుత్రార్థియై శివుని గూర్చి తపమొనర్చుట

పంచాంగం

Thursday, April 9, 2026

Chapter 8 The embodiment of omnipotence is called the goddess of worship - అధ్యాయము 8 సర్వశక్తి స్వరూపిణి యారాధ్య దేవతయనుట

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 8

సర్వశక్తి స్వరూపిణి యారాధ్య దేవతయనుట

ఋషులిట్లనిరి : మహానుభావా! వేదశాస్త్ర పురాణములను పండితుల వచనములను వినుటవలన మా హృదయము లందొక నిశ్చయమై యున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురే సనాతనదేవతలు. ఈ బ్రహ్మాండములందు వీరిని మించిన దెద్దియును లేదని మా నిశ్చయము. కాల పాకవశమున తమ్మిచూలి లోకములు నిర్మించును. తమ్మికంటి బ్రోచును. ముక్కంటి లయింపజేయును. వీరే యన్నిటికి కారణభూతులు. పూర్వమొకటే సద్రూపముండెను. అదే మువ్వురు దేవతలుగ మారెను. ఆ ముగ్గురును సత్త్వము రజస్సు తమస్సను గుణములుగలవారు. వారే బ్రహ్మ హరి హరులు. సకల కార్యకరణ దక్షులు. ఆ మువ్వురిలోన శ్రీ విష్ణుభగవానుడు శ్రేష్ఠతముడు. ఆతడే యాదిదేవుడు - పురుషోత్తముడు - మాధవుడు - జగన్నాథుడు - కార్యదక్షుడు అని పేరొందెను. ఆ మహాతేజస్వియగు హరి యెదుట నిలువబడి యతనిని కాదని యెవ్వడు నేదియు జేయనోపడు. అంతటి లోకైకనాథుని సైతము వివశునిగజేసి యోగమాయ నిద్రపుచ్చినది. ఆ విష్ణుని యద్భుతమైన లీలలును విజ్ఞానమును కార్యాచరణసమర్థతయు నేడేమైనవి? మాకీ విషయమై సందియము గలుగుచున్నది. కనుక మా మనస్సులకు నచ్చునట్టు ఈ సందియమును తీర్చుము. భగవంతుడగు హరిని గూడ జయించిన మా మహాశక్తి యెవరు? ఆమె యెవరి మూలమున నంతగొప్పది యైనది? ఆమెకు అంత సామర్థ్యమెక్కడిది? ఆమెను మహాశక్తియని యేల పిలుతురు? సర్వేశ్వరుడు సచ్చిదానంద విగ్రహుడు పరమాత్మ పరానందుడు వాసుదేవుడు జగద్గురువు శ్రీ విష్ణువు. సకల కర్త - సర్వవ్యాప్తి - పరాత్పరుడు - విరజుడు - పావనుడునగు శ్రీ హరి నిద్రకెట్లు లొంగిపోయెను? మాకిదంతయును మిగుల నాశ్చర్యమును సందేహమును గొల్పుచున్నది. నీ తెలివియను కత్తితో మా యీ సందియమును ఛేదించుము.

సూతు డిట్లనియె : ఈ చరా చర ప్రపంచములందీ సందియమును దీర్పగలవాడొక్కడునులేడు. బ్రహ్మతనయులగు సనాతనమునులే దీనికి ముగ్ధులైరి. నారదుడు కపిలుడు మున్నగువారలే యీ ప్రశ్నను సమాధానించలేక పోయిరి. ఇక దీనిని విమర్శించుటకు నే నెవడను? ఆ విష్ణువే సర్వగుడు సర్వపాలకుడునని వేదములందు గలదు. ఆతని వలననే యీ చరా చర విరాడ్రూపము పుట్టినదని యందు వర్ణింప బడెను. వేలుపు లెల్లరును శ్రీ మన్నారాయణుడు విశ్వాకారుడు హృషీకేశుడు జనార్దనుడు మేఘవర్ణుడునగు విష్ణునకు దోసిలియొగ్గి యుపాసింతురు. కొందఱు చంద్రమౌళి ముక్కంటి పంచవక్త్రుడు వృషవాహనుడు మహాదేవుడు వామదేవుడు సకల నిగమసన్నుతుడు కపర్ది గౌరీదేహార్ధధారి సర్వశక్తి యుక్తుడు దక్షయాగ విధ్వంసకుడునగు శ్రీ సాంబసదా శివుని నిచ్చలు నభిషేకాదులతో సేవించుచుందురు. మఱి కొందఱు వేదవేత్తలు మూడు సంధ్యలందును పెక్కు స్తోత్రములతో పరమసత్య స్వరూపుడగు సవితృదేవుని ధ్యానించి జపింతురు. వేదములన్నియును సూర్యోపాసనమే యుత్తమమనియు సూర్యనారాయణుడే పరమాత్మయనియు నొక్కి వక్కాణించినవి. ఇంకను కొందఱు బ్రహ్మ విదులు నిగమములు పలికిన విధముగ నగ్నిని లోకపాలకుడగు నింద్రుని వరుణుని సంస్తుతింతురు. ఎల్ల ప్రవాహములతో గలిసి ప్రవహించు పావనగంగ నదులలో నుత్తమోత్తమమై యలరును. అఖిల దేవగణములందు పద్మనాభుడు పురుషోత్తముడై తనరును అని మహర్షులు వచింతురు. ఇక ప్రమాణములు ముత్తెఱంగులని పండితులు వాక్రుత్తురు. అవి ప్రత్యక్షము-అనుమానము-శబ్దముననబడును. కొందఱు వానిలో నుపమానమును జేర్చి నాలుగందురు. మఱి కొందఱు వానిలో నర్థాపత్తిని గలిపి ప్రమాణము లైదని పలుకుదురు. మనీషులు వానితో నితిహాసమును పురాణమును గలిపి సప్త ప్రమాణములు గలవందురు. ఇన్ని ప్రమాణములచే గూడ నా పరబ్రహ్మము పరాశక్తి వారికెంతమాత్రమును తెలియబడదు.

స్థితప్రజ్ఞుడు తన నిశ్చయాత్మక బుద్ధిచే వేదాంతార్థములచే నాత్మతత్త్వమును గూర్చి తనయందే స్వాత్మతత్త్వం విచారణ చేయుచుండవలయును. ప్రత్యక్షవస్తు విజ్ఞానముచే బుద్ధిమంతుడు మాటి మాటికిని విత్కరించుచు ఆత్మ చింతన చేయవలయును. తాను దృష్టాంతములతో తన నిజ స్వరూపమును విమర్శించుకొన వలయును. ఆప్తులుదెలుపు సత్య మార్గమున నడువవలయును. ఈ విధముగ స్వాత్మదర్శనము విషయమున పండితులు నుడుపుదురు ఎల్లపురాణములందు నిట్లే కలదు. బ్రహ్మయందు సృజనశక్తి శ్రీ విష్ణువునందు పరిపాలన శక్తి గలదు. రుద్రునియందు సంహారక శక్తి సూర్యునిలోన ప్రకాశన శక్తి శేషునందు కూర్మమునందు భూభరణ శక్తి అగ్నియందు దహనశక్తి వాయువునందు ప్రేరణశక్తి మున్నగు నీ శక్తులన్నియు నా మహాశక్తి పరిణామ స్వరూపములే. కుండలినీ శక్తికి దూరమైనచో శివుడును శవత్వమందును. శక్తి రహితుని పండితులు వీడు చేతకాని వాడని దెప్పుదురు. కాన నీ స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండ మందు గడ్డి మొదలు బ్రహ్మ వఱకుగల భూతములన్నిటి యందు నిటులే శక్తి నిండి యిమిడి వెలుగొందును. అట్టి శక్తిలేని చరాచర వస్తువులు పనికిమాలినవే. శక్తిహీనుడు నడచుటకును తినుటకును పరుల గెలుచుటకును పనికిరాడు. అట్టి సర్వగత మగు శక్తినే పరబ్రహ్మమందురు. ఆ విశ్వశక్తి నాత్మరతితో తెలివివెలుగుతో విచారించి పెక్కుగతుల నిత్యము నుపాసింప వలయును. విష్ణునందు సాత్విక శక్తి గలదు. దానినతడు గోల్పోయినచో నతని యాట కట్టినట్లే. బ్రహ్మయందు రాజస శక్తి గలదు. అది లోపించినచో నతని రచన యాగినట్టే. శివునియందు తామస శక్తి గలదు. దానిచే నతడు సంహారమొనర్పగల్గును అని యిట్లు చక్కగ నెఱింగి వ్యక్తి తన శక్తిని దాను తెలిసి కొనవలయును.

ఆ మూలాధార శక్తియే యీ చరాచర బ్రహ్మాండములను నిర్మించును - పోషించును - సంహరించును. ఆ శక్తి బలమే లేనిచో బ్రహ్మ హరి శివుడు రవి వహ్ని వరుణుడు మున్నగు దేవతలు శక్తిహినులగుదురు. దాన వారి పనులు కుంటుపడినట్లే. దేవత లెల్లరును శక్తియుక్తులైననే తమ తమ పనులు చక్కగ నెరవేర్చుకొందురు. ఆ శక్తియే యన్ని కార్య కారణములందును ప్రత్యక్షముగ వెల్లడి యగుచుండును. ఆ శక్తినే మనీషులు సగుణయనియు నిర్గుణయనియు రెండుగ దెల్పిరి. రాగవంతులు సగుణశక్తిని విరాగులు నిర్గుణశక్తిని గొలుతురు. ఆ శక్తియే ధర్మార్థ కామ మోక్షము లీజాలు స్వామిని. ఆ దేవిని విధి విధానమున నారాధించినచో నామె మనయెల్ల కామితార్థము లీడేర్చగలదు. జడమతులు మాయకు లొంగుటచే నా శక్తి మహిమ నెఱుగ జాలరు. కొందఱాశక్తినే కొలదిగ తెలిసికొందురు. కాని, వారితరులకు దానిని తెలుపనేరక వారిని భ్రమలో ముంతురు. మందమతులగు పండితులు కొందఱు కలిప్రేరితులై పొట్టకూటికై చేయరాని పనులుచేసి పాషండులగుదురు. ఈ కలికాలమున ననేక విపరీతములు తలలెత్తును. కాని యితర యగములం దధర్మములు లేనేలేవు. విష్ణువు దేవి దయకై పెక్కేండ్లు తీవ్ర తపమాచరించు చుండును. స్వయంభువు శంభువు నాధ్రువ శక్తి దయ సంపాదింప నిరంతరముగ ధ్యానింతురు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోననేమేమో కోరికల పుట్టలు పెంచుకొని యనేక యజ్ఞములు సలుపుదురు. వారా పరశక్తిని పరబ్రహ్మమునుగా సనాతనగా పరాత్మికగ నిత్యగా నిత్యము తమ చేతములందు ధ్యానింతురు. కనుక నన్నియు తెలిసిన విద్వాంసులా పరమశక్తినే నిత్యము సంసేవింప వలయును. ఇదే సకల శాస్త్రముల సారమని తెలియవలయును. నిజముగ సకలశాస్త్రము లందును దెలిసికొనదగిన దాశక్తియే. ఇదంతయును నేను శ్రీ వ్యాసుని వలన వ్యాసుడు నారదుని వలన దేవర్షి తన తండ్రి బ్రహ్మ వలన విష్ణుని వలన నెఱింగితిమి. పండితు లితరుల మాటలు వినరాదు - తలంపరాదు. కృతనిశ్చయులగు ధీరులా సత్యశక్తినే సంసేవింప వలయును. అశక్తుని యందలి సత్తువ యెంతటిదో కన్నులార చూచిన గాని తెలియదు. కావుననే సకల భూతము లాపరశక్తినే యెఱగి నిత్యము సమారాధించవలయును.

అధ్యాయము 9 శ్రీదేవి దయచే విష్ణువు మధుకైటభుల పరిమార్చుట

పంచాంగం

Chapter 7 Vishnu's sermon - అధ్యాయము 7 విష్ణుప్రబోధము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 7

విష్ణుప్రబోధము

సూతు డిట్లనియె: ఆ బలశాలురగు మధుకైటభ రాక్షసులను జూచి బ్రహ్మ సర్వతంత్రజ్ఞుడగుటవలన సామదానభేదదండో పాయములను గూర్చి యాలోచింపదొడంగెను: 

"వీరికి బలమెంతగలదో నిశ్చయముగ నాకు తెలియదు. కనుక నెదుటివాని బలాబలము లెఱుగక పోరుసలుపుట మేలుగాదు. దుర్మార్గులు మదమత్తులునగు వీరిని నేనిపుడు పొగడినచో నా చేతకానితనము నా చేతనే ప్రకాశింప చేయబడినట్లగును. నా దౌర్బల్యము బట్టబయలైనంతనే వీరిలో నొక్కడే నన్ను దునుమాడగలడు. వీరు దానముచేతను వశముగారు. ఇక వీరిపై భేదోపాయమునెట్లు ప్రయోగింపగలను? కాన నేనిపుడు శేషశయనుడగు భగవంతుని మేలుకొలుపుదును. ఆతడు మహాసత్త్వుడు - జనార్దనుడు - చతుర్భుజుడు - ఆతడే నా వెతలు బాపగలవాడు.'' 

ఈ విధముగ నెమ్మది దలంచి కమలాసనుడగు బ్రహ్మ వేగమే శోకనాశకుడు సర్వము తానయైనవాడు నగు వాసుదేవుని శరణు జొచ్చెను. ఆ జగత్పతి యోగనిద్రలో మునిగి కదలకుండెను. అట్టి నారాయణుని మేలుకొలుపుటకు బ్రహ్మ పలు మేలైన సంబోధనలతో హరి నిట్లు సంస్తుతించెను: 

"ఓ దీననాథా! శ్రీహరీ! మాధవా! వామనా! భక్తత్రాణపరాయణా! జగత్పతీ! మేలుకోగదవయ్యా! సర్వాంతర్యామీ! అమేయాత్మా! వాసుదేవా! విపక్షశిక్షా దక్షా! చక్రగదాధరా! విశ్వాధారా! హృషీకేశా! మేలుకోగదవయ్యా. సర్వజ్ఞా! లోకేశా! సర్వశక్తి సమన్వితా! శోకనాశనా! దీనపరిపాలకా! లేలెమ్ము-మేలుకోగదవయ్యా. ఓ విశ్వంభరా! విశాలాకారా! పుణ్యశ్రవణకీర్తనా! నిరాకారా! లోక సృష్టి స్థిత్యంతకారకా! మేలుకోగదవయ్యా! నీవఖిలాధారుడవే! నీకిదంతయును దెలియుటలేదా! శ్రీ మహావిష్ణో! శరణార్థిని దీనుని దుఃఖితుని నన్నే యుపేక్షించినచో నింకమీదట నీ పాలకత్వమునకు భంగము వాటిల్లదా?" అని పెక్కుభంగుల సన్నుతించినను హరి యోగనిద్రావశుడై మేల్కొనలేదు. అపుడు బ్రహ్మ మరల తన యెదలో నిట్లు తలంచెను:

"ఈ హరియొక మహాశక్తికి లోబడి యుండుటచేత యోగనిద్రకు వశుడయ్యెను. కనుకనే యీ ధర్మాత్ముడెంతకును మేల్కొనుట లేదు. నేను దిక్కు మొక్కు లేని దీనుడను. ఇపుడేమి చేయగలను? ఈ మదమత్తులు దానవులు నన్ను వెన్నాడి చక్కాడ దలచుచున్నారు. ఇపుడేమి చేతును? ఎక్కడికేగుదును? నాకభయమొసంగునాథుడే యింక లేడా?" ఇట్లు బ్రహ్మ తన మదిలో దలపోసిపోసి తుదకేకాగ్ర చిత్తముతో యోగమాయను సంతోషపఱచవలయునని నిశ్చయించుకొనెను. ఏ విశ్వశక్తి మూలమున హరి యచేతనుడై కదలకుండెనో, యా శక్తియే నను బ్రోవ సమర్థురాలగునని నిశ్చయించుకొనెను. ప్రాణము లేనివాడు శబ్దాది విషయము లెఱుగలేనట్లు యోగనిద్రలో నరమోడ్పు గన్నులవాడగు హరియు నేమియు నెఱుగలేకున్నాడు. ఇట్లెన్నెన్ని రీతుల కీర్తించినను హరి తనకూర్కును వదలుటలేదు. అందువలన కునుకితని వశమందులేదు. ఇతడే కున్కునకు వశీభూతుడయ్యెనని తోచుచున్నది. ఎవడెవని వశమున వర్తించుచుండునో వాడు వానికెల్లప్పుడు కింకరుడగును. ఈ కారణమున మాపతియగు హరికి యోగనిద్ర స్వామిని యగును. ఆ జలనిధి కన్యక సైతము హరిని తనవశమందుంచు కొనెను. కనుక నీ బ్రహ్మాండగోళములన్నియును సర్వశక్తుల కాదిశక్తియగు భగవతిచేతి కీలుబొమ్మలే. శ్రీహరి హరుడు రమ పార్వతి భారతి మేమెల్లరము నా శ్రీభగవతికి దాసానుదాసులమే. ఇందేమియు సందియము లేదు. ఆ హరియే సామాన్య మానవుని పగిది నిద్రా దేవతకు వశుడయ్యెను. ఇతర మహాత్ముల గుఱించి వేరుగ జెప్పెడి దేమి గలదు? కనుక నేనిపుడా యోగమాయనే ప్రస్తుతింతును. అపుడుగాని దేవి దయవలన హరి మేల్కాంచి వైరులతో సమరమొనరింపడు.''

అని యిట్లు పద్మాసనుడగు బ్రహ్మతలచి విష్ణునంగములందున్న యోగనిద్ర నిట్లు ప్రస్తుతింపదొడంగెను: 

"ఓ దేవీ ! నీవే యీ యెల్లజగముల కన్నతల్లివని వేదములు పలుకగా చక్కగా నిక్కువ మెఱింగితిని. ఎల్లలోకములను పరమ వివేకమున బాలించు పురుషోత్తముడే నీ ప్రభావమువలన నిపుడు నిద్రావశుడయ్యెను. నీ మోహన విలాసలీల లెవడెరుంగగలడు? హరియును వివశుడై నిదురించుచున్నాడు. నేను మూర్ఖుడను. సకల భూతహృదయములలో నిండియుండు చైతన్యజ్యోతి నీవే. నిర్గుణాత్మికవగు నీ ప్రతిభా ప్రభావములు విబుధకోటులలో నెంత కోవిదుడైన నెఱుగ జాలడు. సాంఖ్యులు నిన్ను పురుష ప్రకృత్యాత్మికగ చైతన్య భావరహితనుగ లోకజనయిత్రిగ భావింతురు. నీవు నిక్కముగ నట్టిదానవా? కావు. నీవు ముమ్మాటికి చైతన్యజ్యోతిఃస్రవింతివే. కనుకనే నేడు విష్ణువు నీ మూలముననే చైతన్యము లేక పడియున్నాడు. నీవు సగుణరూపములతో బహుభంగుల మాయా జగన్నాటక సూత్రధారివై తనర్తువు. నీ కార్యప్రణాళిక నెట్టివాడును గ్రహింపజాలడు. నిన్ను మునులు సంధ్యాదేవతవని పిలుతురు. వారు నీ దివ్యసుగుణములను రేయనక పగలనక నీమముతో ధ్యానించుచు జపించుచుందురు. కనుక నీ విజ్ఞాన వినోదలీల లనంతములు. 

ఓ జననీ! నీవే యెల్లజగములకు తెలివి వెలుగు జూపు జ్ఞానరూపవు. దేవతలకు నిత్యసుఖకారిణియగు శ్రీవి. సకల ప్రాణులందలి శ్రద్ధ-బుద్ధి-మతి-ధృతి-కీర్తి-కాంతి-రతి- యివన్నియు నీవే. ఇంతకు మిక్కిలిగ తర్కవితర్కములతో బనియేమి? లోకముల కన్నిటికి నీవే మూలకారణ శక్తివి. నాకు దుఃఖము గలుగుటకును హరి నిద్రాళుడై యుండుటకును నీవే కారణమని నాకు ప్రత్యక్ష ప్రమాణము గోచరించుచున్నది. వేదమాతా! నీవు వేదవిదులకే తెలియరావు. ఆ వేదములు సకలార్థములను వెల్లడించగలవు. ఐన నవి నిన్నెఱుగజాలవు. ఏలయన, నన్నియును వేదమాతవగు నీ నుండియే యావిర్భవించినవిగదా! ఇట్లు సర్వకార్యములు నాకు ప్రత్యక్షముగ దోచుచున్నవి. నీ చరితమును తుదముట్ట తెలిసినవా డెవ్వడు? ఆ వైకుంఠుడు కైలాసవాసి సురలు నా కొమరులగు మునులు నేను నీ మహోజ్జ్వలమహిమ నర్థము చేసికొననేరము. ఎల్ల లోకములకే నీ మహిమ యందరానిది. ఓ పరాదేవీ! యజ్ఞములందు 'స్వాహా' యని నీ నామధేయమే పలుకబడును. అట్లు పలుకనిచో నమరులకు వారి భాగధేయము వారికి లభించదు. కనుక నెల్లదేవతల బ్రతుకుదెరువులు నీ చేతిలోనే కలవు.

ఓ వరదాయినీ! తల్లీ! తొల్లిటి కల్పమందు నీవు నన్ను గాపాడితివి. ఇపుడీ ఘోర క్రూర దానవులను గన్నంతనే నా గుండె జలదరించుచున్నది. వారి భయమున నిన్నే శరణనుచున్నాను. నన్ను బ్రోవుము. ఈ సమయమున హరి నా మొఱ వినునట్టులేడు. అతని తనువు నీ వశమందే కలదు. కనుక నీవు హరి నిద్రా ప్రమత్తతను వదలింపుము. కాదేని యీ దానవులనైన హతమార్చుము. నే జెప్పనేల? నీ కెట్లు ఇష్టమైన అట్లు చేయుము. నీ యపార పరమప్రబావ మెఱుంగని మందమతులు హరిహరులనే కొలిచెదరు. ఆ విష్ణువే యిట వివశుడై నిద్రించుటచే నీ మహిమ నా కిపుడు ప్రత్యక్షముగ బోధపడినది. ఆ లక్ష్మియును నీ కధీనయే. కనుక నామెయును హరిని మేలుకొలుపజాలదు. ఆ లక్ష్మిని సైతము నీవే నీ శక్తితో నీ వశమందుంచుకొంటివని తలంతును. నీవే విశ్వజననివని కోర్కెలుకురియు కామధేనువవని భక్తిపరులు నిష్కామముగ నీ పదకమలములచే నమ్మి నీయందు లీనమై నిన్నే నిచ్చలు సేవింతురు. అట్టివారితరదేవతలను గొలువరు. అట్టివారే ధన్యులు. బుద్ధి కాంతి కీర్తి శుభవృత్తి మున్నగు దివ్యకల్యాణ గుణములు నీ యందే చోటుచేసికొని యున్నవి. ఆ విష్ణువు నందలి సద్గుణములు నే డేమయ్యెనో తోచుటలేదు. నీవు మానవతులలో వన్కెకెక్కినదానవు. అట్టి నీ నిద్రాశక్తికి హరి నేడు పరతంత్రు డయ్యెను. ఈ యెల్ల జగములందు నఖిల ప్రభావముగల పరాశక్తివి నీవే. నీ సంకల్పమాత్రముననే లోకము లన్నియును నిర్మింపబడినవి. నటుడు నాటకమందు స్వేచ్ఛగ విహరించును. నీవు నట్లే నీచే నిర్మితమగు మోహజాలమందు క్రీడించు చుందువు. మున్ను యుగాదియందు నీవే యీ విష్ణువును సృజించి యతినికి లోక రక్షణకై నీ విమల సత్త్వశక్తి నొసంగితివి. ఆతడే యిపుడిట వివశుడై యున్నాడు. నీవు సర్వపరిపాలన దక్షవు. నీ కేది మేలని తోచిన నదియే చేయును. నన్ను నీవే పుట్టించితివి. నన్ను నలుగురిలో నగుబాటుపాలు చేయుటకా? నీ యభిమతమిదియేనా? భవానీ! నీ యచ్చెరువుగొలుపు కార్యములను నేను కొంతకొంత యెఱిగితిని. ఈ యెల్ల భువనములను నీవే స్వతంత్రించి సృజించి యానందింతువు. తుదకు నీ యందే లయ మొనర్చుకొందువు. అట్లే యిపుడు నీవే నా చావు కోరుచున్నచో మంచిదే. ఇందు వింతలేదు. జగదంబికా! నన్ను నీవే వధించిన నాకు మేలే. నా కిక మరణదుఃఖమే యుండదు. మున్ను నీ చేతనే నేను సృష్టికర్తనుగ ప్రకటింపబడితిని. అట్టి నాకే యొక దానవుని చేతిలో చావుగలిగెననిన యపకీర్తి నీకే కల్గును. నీ కది గలుగకుండుగాక! నీవు వెనువెంటనే లెమ్ము. భీకరమూర్తివి గమ్ము. నీ కిష్టమైనచో రక్కసులనే చక్కాడుము. లేదా నన్ను నుగ్గాడుము. కాక హరిని నిద్దుర నుండి మేలుకొల్పుము. ఈ దనుజులను హరియే దునుమాడగలడు. ఇంతకీ సర్వకార్యములును నీ చేతనే సులభసాధ్యము లగును. 

సూతు డిట్లనియె : అని బ్రహ్మ యిట్లు తామసీదేవిని సంస్తుతించెను. దేవి వెంటనే నారాయణుని దేహమునుండి వెడలి యతనిచెంత నిలుచుండెను. ఇట్లు పరమదేవియగు యోగనిద్ర దనుజుల నాశనమునకై అతుల తేజోనిధియగు విష్ణుని దేహావయవములనుండి తొలగినది. అపుడు జనార్దనునకు స్ఫూర్తిగలిగి మేను మెల్లగ గదలెను. అది గనుంగొని బ్రహ్మ పరమానందభరితుడయ్యెను.

అధ్యాయము 8 సర్వశక్తి స్వరూపిణి యారాధ్య దేవతయనుట

Chapter 6 Madhu Kaitabhu's war efforts - అధ్యాయము 6 మధుకైటభుల యుద్ధ ప్రయత్నములు

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 6

మధుకైటభుల యుద్ధ ప్రయత్నములు

ఋషులిట్లనిరి : సూతమునివర్యా! శ్రీహరికి మధుకైటభులతో మహావారాశిలో నైదువేలేండ్లు ఘోరముగ పోరాటము జరిగెనంటివి. దేవతల కజేయులై దుర్ధరులగు నాదానవవీరులు సంద్రమున నెట్లు పుట్టిరి. భగవానుడు వారినెట్లు హతమార్చగల్గెను? మా కా పరమాద్భుత చరిత్ర వెల్లడించుము. మేము సత్కథా శ్రవణ కుతూహలులము. మీరు బహుశ్రుతులు. మహా ప్రవక్తలు. మీ బోటి మహా మునులతో మాకు దైవయోగమున నానందకర సంగమము గల్గినది. మొఱటు వానితో కలియుట విషముకన్న దుర్భరము. సహృదయుడగు రసజ్ఞుతోడి సాంగత్యమమృతరససమము. పశువులన్నియును తమకు స్వభావవిహితమగు ఆహారము దినుచు నొండొంటితో గలియుచు బ్రతుకుచుండును. రతి సుఖమును ననుభవించును. కాని వానికి నిత్యానిత్య వస్తువివేకముగాని మోక్షదాయకమగు జ్ఞానము గాని యుండదు. శ్రీ హరి సత్కథలు విననేరని వానినా పశువుకన్న నీచునిగ నెంచవలయును. జింకలు మున్నగు జంతువులు చెవుల కింపు చేకూర్చు మధురనాదము వినగోరును. ఆ చెవులు లేని పాములు మధుర నాదస్వర మాలించినంతన తన్మయత నందును. జ్ఞానేంద్రియములలో కన్నులు చెవులు ఈ రెండే మంచి మేలొన గూర్చునవి. చెవుల వలన వస్తువునెఱుగు తెలివిగల్గును. చూపుల వలన నుల్లము రంజిల్లును. శ్రవణము సాత్త్వికము. సాహిత్య శ్రవణము రాజసము. యుద్ధవార్తలు నిందలు వినుట తామస శ్రవణము. పండితోత్తములు మరల సాత్త్విక శ్రవణమును ముత్తెఱంగుల విభజించిరి. అవి యుత్తమము మధ్యమము నధమమున నబడును. ఉత్తమము ముక్తి నొసంగును. మధ్యమము స్వర్గసీమ జేర్చును. అధమము భోగదాయకము. నవరస భరితమై రాజసమగు సాహిత్య శ్రవణమును మువ్విధములు స్వీయతోడి రతి విషయమును ప్రతిపాదించునది యుత్తమము. వారాంగనా సంగమ విషయకము మధ్యమము. పరస్త్రీగమన విషయక మధమము.

తామస శ్రవణమును మూడు విధములు. చంపదగిన వారితో బోరుట సాత్త్వికము. పాండవేయుల పగిది విద్వేష కారణముగా పోరుట మధ్యమము. కారణము లేక వివాదములకు కాలుద్రవ్వుట యధమము. ఇన్నిటిలోన నీ పురాణశ్రవణమే ముఖ్యమైనది. అది బుద్ధి వికాసము గల్గించును. పుణ్యప్రదము. పాప ప్రణాశకము. నీవు మున్ను వ్యాసుని వలన సకలార్థ సాధకము శుభకరమునగు పురాణ కథలను వింటివి. వానినే మాకిపుడు వినిపింపుము. 

సూతుడిట్లనెను : ఓ మహాభాగులారా! మీరు సత్కథలు వినగోరుచున్నారు. నేనును మీకు వానిని ప్రవచింప దలంచితిని. కనుక నీ భూతలమున మీరు ధన్యులరు. నేనును ధన్యుడను. పూర్వము ప్రళయకాలమున ముజ్జగములు లయమంది లోకమేకార్ణవమయ్యెను. అప్పుడు శేషశయ్యపై దేవదేవుడగు విష్ణువు యోగనిద్రలో నుండెను. ఆ విష్ణుని చెవి మలము నుండి మహాబలులగు మధుకైటభులను దానవులు పుట్టిరి. వా రా మున్నీటి నీటిలో పెంపొందిరి. అందాస్థూల కాయు లిటునటు తిరుగాడుచు క్రీడాసక్తులై యుండిరి. ఆ దానవ సోదరులు తమ మనములందిట్లు దలపోసిరి: 

"కారణము లేక కార్యము సంభవించదు అను నానుడి లోకమున సహజము. ఆధారములేనిచో నాధేయమును లేదు. కనుక నాధారాధేయములం గూర్చిన భావము మా మనములందు గల్గుచ్న్నుది. ఈ యనంత జలరాశి సుఖము గొల్పుచు నపారమై యున్నది. దీనికి మూలమేది? దీనినెవ్వరెట్లు సృజించిరి? మేమీ మున్నీటిలోన నేల మునిగి యున్నాము? మేమెట్లు పుట్టితిమి? మమ్ము పుట్టించిన తల్లి తండ్రులెవరు? వారెక్కడ? అను విషయములు మాకు దెలియుట లేదు."

సూతు డిట్లనియె : ఇట్లెంతగ నాలోచించినను వారొక నిర్ణయమునకు రాలేకపోయిరి. తుదకు కైటభుడు తన చెంత నున్న మధువును గని యిట్లనియెను : 

"అన్నా ! మన మీ జలమందుండుట కొకానొక మహాశక్తి కారణముగావచ్చును. ఆ శక్తి యచలమైనది. మహాబలముగలదియని నా యభిప్రాయము. మన యునికి కామెయే హేతువుగావచ్చును. ఈ కన్నుచూపు మేరలో నిండి కనిపించు నీ మహాజల మంతటి కామెయే మూలాధారము. ఆమె యాధారముననే జలమంతట నిండియున్నది. ఆ పరమశక్తియే మనకును మూలాధారముగావచ్చును. ఇట్లు చైతన్యవంతులై వారిరువురు తలచుచున్న సమయమున గగన సీమనుండి వాగ్బీజరూపమగు నొక ధ్వని వారి చెవుల బడెను. వారానాదము విని పట్టుదలతో దానినభ్యసింప నారంభించిరి. అంతలో నాకసమున తళుక్కుమను నొక్క మెఱుపు మెఱసి కనబడెను. మనము విన్నది మహామంత్రము. మన ధ్యానమే సగుణమై వెలుగు రూపుదాల్చి పొలిచినది. ఇందు సందియము లేదని వారు తలంచిరి. వారపు డన్నపానీయములు ముట్టక జితేంద్రియులై తన్మయులై వేయేండ్లతిఘోరముగ జపధ్యానములు చేసి తపము సాగించిరి. అంత వారిపై పరమ శక్తికి దయగలిగెను. ఆ క్రూర దానవులింకను పట్టుదలతో తపము సేయ నిశ్చయించుకొనిరి. ఆ రక్కసులు దీనులై యుండుటగని కనికరింపదలచి దేవి యశరీర వాక్కులతో వారితో నిట్లు పలికెను: 

"ఓ దానవులారా! మీ తపమునకు సంతసించితిని. మీ వాంఛితము తెలుపుడు. తప్పక ఈడేర్తును."

సూతు డిట్లనియె : ఆ దేవి వాక్కులు విని దానవు లిట్లనిరి : 

"ఓ దేవీ! మాకు స్వచ్ఛంద మరణము వరముగ నిమ్ము. వాణి యిట్లు పలికెను. ఓ దానవులారా! నా దయచే మీకు స్వచ్ఛంద మరణమే గల్గును. దేవదానవులకు మీ రజేయుల గుదురు. సందియము లేదు. 

సూతు డిట్లనియె : అట్లు దేవి వలన వరములు బడసి యా క్రూరులు మదగర్వితులై నీటిలోని జలచరములతో స్వేచ్ఛగ క్రీడించుచుండిరి. కొంతకాలమునకు తరువాత కమలాసనము నందున్న ప్రజాపతియగు బ్రహ్మ వారి కంటబడెను. ఆ యిరువురు బలశాలురు బ్రహ్మనుగాంచి సంతసించి యుద్ధకాముకులై బ్రహ్మ కిట్లనిరి : 

"మాకు యుద్ధమను గ్రహింపుము. కానిచో నీ వీ కమలము వదలి వేరొక చోటి కేగుము. నీవు కడు దుర్బలుడవు. నీకీ శుభాసనము తగదు. ఇచ్చోటు వీర భోగ్యము. నీవు పిరికివాడవైనచో మమ్ము వదలి యేగుము. దానవుల మాటలు విని బ్రహ్మ చింతాక్రాంతుడయ్యెను. మహాబలవంతులగు వారినిగని నేనిపుడేమి చేయవలయును? అని తాపసుడగు బ్రహ్మ మదిలో చింతింప సాగెను.

అధ్యాయము 7 విష్ణుప్రబోధము

Chapter 5 Description of the incarnation of Sri Hayagriva - అధ్యాయము 5 శ్రీ హయగ్రీవావతారవర్ణనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 5

శ్రీ హయగ్రీవావతారవర్ణనము

ఋషుయిట్లనిరి: ఓ సూత మహర్షీ! లోకములకు వింత - యచ్చెరువు గొలుపు కత మాకు వినిపించితివి. అది విని మా మనంబులు సంశయ సాగరమున కొట్టుమిట్టాడుచున్నవి. ఆ భగవానుడు మాధవుని తల శరీరమునుండి తెగిపడినదనియు ఆ విశ్వకర్తయగు జనార్దనుడు హయగ్రీవ రూపము దాల్చెననియు అంటివి. దేవతలెల్ల రేదేవ దేవుని ప్రస్తుతింతురో విబుధులెల్లరు సర్వము తానయైన యే విష్ణువు నాశ్రయింతురో అతడే జగన్నాథుడు - ఆదిదేవుడు - సర్వకారణ కారణుడును. అట్టివాని తలయును ఎట్టి విధియోగమున దెగిపడినది? ఆ కథయంతయును మాకు విశదముగ తెలుపుము. 

సూతుడిట్లనియె: ఓ మునులారా! దేవదేవుడును పరమతేజస్వియగు శ్రీ మహావిష్ణుని పావన చరిత సావధానముగ చెవులార వినుడు. సనాతనుడును భగవానుడు నగు జనార్దనుడు తొల్లి పదివేలేండ్లు భీకరమైన పోరాటము సలిపి మిక్కిలి యలసట జెందెను. అపుడతడు సమప్రదేశమున పద్మాసనముపై కూర్చుండి ఎక్కు పెట్టిన విల్లు తన కంఠ పురోభాగమునకు నానించుకొని అలసట చెందియుండుటచే వింటికొనపై తన మేనిబరువంతయు నుంచి నిదురించెను. కొంతకాలము గడిచిన పిమ్మట నింద్రుడు మున్నగు దేవతలెల్లరును బ్రహ్మతోగూడి యొక యాగము సేయదలంచిరి. మహాయజ్వయగు విష్ణువే దేవకార్యము నెరవేర్చుటకును యాగాధిపత్యము వహించుటకును సమర్థుడని తలచి బ్రహ్మాదులు జనార్దనుని దర్శింప వైకుంఠమేగిరి.

అచట వారికి హరి కనబడలేదు. వారు జ్ఞానదృష్టితో విష్ణుడున్న జాడ నెఱిగి యచ్చోటి కరిగిరి. నిశ్చలముగ యోగనిద్రలో మునిగిన జగత్పతిని విభుని ఈశానుని గనుంగొనిరి. బ్రహ్మ రుద్రుడు మొదలగు దేవతలు పరమచింతాక్రాంతులైరి. 

అంత నింద్రుడు వారి కిట్లనియె : ఓ సురలారా! ఇపుడు మన కర్తవ్యమేమి? ఆ హరికి నిద్రాభంగము చేయుట తగదు. అది మహాదోషము. కనుక మీరలెట్లేని యజ్ఞకార్యము కొనసాగింపుడు. 

బ్రహ్మ యిట్లనియె : "నేను చెదపురుగును పుట్టించి యీ నేలనున్న వింటికొనను తినుటకు దాని నాదేశింతును. చెద పురుగు వింటికొనను తినగా నారి తెగును. అపుడు గాని యీ దేవదేవుడు నిదురనుండి మేలుకొనడు! దానివలన దేవకార్యము నెరవేరును. ఇందు సంశయము లేదు." అని దేవదేవుడగు బ్రహ్మ చెద పురుగు నాదేశించెను. 

చెద పురు గిట్లనెను : రమాపతియు జగద్గురుడునగు దేవదేవునకు నేను నిద్రాభంగమెట్లు గల్గింతును? ఎవ్వరికైనను నిద్ర చెడగొట్టుట సత్కథలు వినకుండ చేయుట భార్యాభర్తల నడుమ కలతలు పుట్టించుట తల్లినుండి శిశువును వేరు చేయుట - ఇవి బ్రహ్మహత్యాసమములని స్మృతులు వక్కాణించును. ఆ దేవదేవుని నిద్రాసుఖమున కెట్లు నేను భంగము కల్గింతును? దానిని తినుట వలన నాకు వచ్చెడి ఫలితమేమి? నేను పాపినగుటయే కదా? లోకములన్నియు తఱచుగ స్వార్థపీడితములై ఘోరదురితములు చేయుచుండును. అట్టి స్వార్థ మాశించియే నేనును తినవలయునా?

బ్రహ్మయిట్లనియె : యాగములో నీకు కొంత భాగమేర్పరతుము. కనుక నీవు వెంటనే విష్ణుడు మేల్కొనునట్లు చేయుము. మా కార్యము నెరవేర్చుము. యజ్ఞములందు వేల్చునపుడు హవిస్సునుండి కొంత ప్రక్కలకు బడును. అది నీ భాగమని తెలిసికొనుము. ఇక త్వరగ నీ పని కొనసాగింపుము. 

సూతుడిట్లనియె : ఆ విధముగ బ్రహ్మ పలుకగా చెదపురుగు వెనువెంటనే వింటి నారిని కొరికెను. వెంటనే వింటి నుండి నారి తెగిపడెను. తత్ఫలితముగ విల్లు నేలపై బడినది. పడుటయే తడవుగ ఘోర శబ్ద ముప్పతిల్లెను. అది విని దేవతలందఱును భయపడిరి. బ్రహ్మాండము దద్దరిల్లెను. భూమి కంపించెను. సంద్రము లల్లకల్లోలమందెను. జలజంతువు లదరిపడెను. పెనుగాలులు వీచెను. గిరులు గ్రక్కదలెను. దుఃఖసూచకములును మహోత్పాతములునగు ధూమకేతువులు రాలిపడెను. ఎల్లదెసలు ఘోర రూపము దాల్చెను. సూర్యు డస్తమించెను. ఇట్టి దుర్దినమున నేమి మూడునో కదా! యని వేల్పులెల్లరు పెల్లుగ జింతిల్లిరి.

అమరులిట్లు చింతించుచుండగనే దేవదేవుడగు విష్ణునియొక్క కిరీటకుండలములతో శోభిల్లు తల అదృశ్యమయ్యెను. కొంతవడికి వెఱపుగొలుపు పెంజీకట్లు విరిసెను. బ్రహ్మరుద్రాదిదేవతలపుడు తలలేని హరి మొండెమును గని విస్మితులై శోకసాగరమున మునిగి యిట్లు వాపోయిరి : 

"జగన్నాథా, ప్రభూ! ఇది నీ యమానుషలీలా రూపమా యేమి? సనాతనా! దీనివలన వేల్పులకందఱకును వంత మిక్కుటమైనది. నీవు అచ్ఛేద్యుడవు - ఆదాహ్యుడవు - అక్లేద్యుడవు - అశోష్యుడవు - నిత్యుడవు. ఇంతటి నీ తల తెగుట కేదేవతమాయ హేతువో కదా! నీ విటుల తలలేకున్నచో దేవత లెల్లరు వసువులు గోల్పోవుదురు. మాకు నీయందిం కెటుల ప్రీతి గల్గును? కావున మేము మా స్వార్థము గోరి శోకించుచున్నాము. రమావల్లభా! ఇంతటి ఘోరమే దైత్యులచేగాని యక్షులచేతగాని రాక్షసులచేగాని సాధ్యము కాదు. ఇది దేవతల వలననే జరిగి యుండును. కావున నెవరిని నిందించగలము? ఎవరిని దూషించగలము! దేవేశా! మేమెల్ల దేవతలము పరతంత్రులము. మేమిపుడేమి చేయవలయునో యెచటి కేగవలయునో - మూఢమతులమగు మాకింక శరణ్యమెవ్వరో ఏమియును దోచుట లేదు. విష్ణువు మాయాపతి యగుట వలన సత్త్వరజస్తమ శ్శక్తులు గల మాయ యీ జగద్గురుని తల ఛేదింపనోపదు". శివుడు మున్నగు దేవతలీతీరున వాపోవుచుండిరి. 

అదంతయు విని వేదవిదుడగు దేవగురుడు వారి బిట్టేడ్పు చల్లార్పదలచి వారి కిట్లు పలికెను : ఓ మహాభాగులారా! ఇట్లు రోదించుటవలన నేమి ప్రయోజనము? ఇపుడెల్ల విధముల చక్కని బుద్ధితో నుపాయ మాలోచించుటయే మన కర్తవ్యము. ఇంద్రా! అదృష్టము పురుషకారమును రెండును సమానములే. కనుక మతిమంతుడు తొలుత నుపాయ మాలోచించవలయును. పిదప తప్పక దైవ మనుకూలించును.

ఇంద్రు డిట్లనెను : దైవమే బలవత్తరమైనది. పురుషార్థ మనర్థమునకు దారితీయును. అది వ్యర్థము. మనకండ్ల యెదుటనే విష్ణువంతటి వాని తల తెగిపడెనుగదా! 

బ్రహ్మ యిట్లనియె: కాలానుగుణముగ మంచిగాని చెడుగాని యేది ప్రాప్తించిన దానిని తప్పక యనుభవించి తీరవలయును. ఎట్టివాడును దైవమును మీరలేడుగదా! దేహధారియగు జీవుడు సుఖ దుఃఖములనుభవించి తీరవలయును. ఇందు సందియమే లేదు. నేనును కాలబద్ధుట నగుట చేతనే నా తల శివునిచేత ద్రుంప బడినది. శాపకారణమున హరుని లింగము పతనమందినది. నేడును హరితల తెగి లవణ సాగరమున బడినది. దేవేంద్రునంతటి వానికిని సహస్రభగుడగు దుఃఖము తప్పలేదు. అతడును పదభ్రుష్టుడై మానస సరస్సులో తల దాచుకొనెను. ఇంతటి వారే దుఃఖములు గఱచు చుండగ నిక దుఃఖించని మనుజు డెవ్వడు? ఈ ఘోర దుఃఖ సంసార సాగర మేరికిని దాటశక్యము గాదు. కాన తెలివి గల మానవుడు ఆపదలో దుఃఖింపరాదు. అందుచే మన మిపుడా మహామాయ శ్రీ విద్యామయి సనాతన పరా ప్రకృతియగు నిర్గుణదేవిని సంస్మరింతముగాక. ఆ దేవ దేవియే మనయెల్ల కార్యకములు చక్కగ సమకూర్చ గలదు. ఆమెయే బ్రహ్మ విద్య - జగద్ధాత్రి - విశ్వజనయిత్రి - చరా చరాత్మకమైన ముల్లోకములకు తల్లి. ఆ లోకములన్నియు నామెచేతనే నిలిచి వ్యాప్తమై వెలుగొందుచున్నవి.

సూతు డిట్లనియె : అని యీ ప్రకారముగ బ్రహ్మ దేవతలతో పలికెను : పిదప బ్రహ్మ వేదముల నాదేశింపగ నవియు దేవకార్యము సాధించుటకు శరీరములు దాల్చి యతని యెట్టయెదుట నిలుచుండెను. మీరు సర్వ కార్యములు సఫల మొనరించి పరాభట్టారికయు పురాతన బ్రహ్మ విద్యయు గూఢాంగియు మహామాయయు నగు మహాదేవిని సంస్తుతింపుడు అని వేదములను బ్రహ్మ యాదేశించెను. బ్రహ్మ వచనానుసారము సర్వాంగ సుందరములైన వేదములు విశ్వస్థితి కారణియు జ్ఞానగమ్యయునగు మహామాయ నీ విధముగ సంస్తుతింప దొడగినవి : 

"సకల భూతేశ్వరీ! శివకామినీ! విశ్వజననీ! శివాత్మికా! మహామాయాదేవీ! నీకు మా నమస్కారములు! నీవే సర్వభూతములకు మూలాధారమవు. నీవే ప్రాణుల ప్రాణమవు. శ్రీ -క్షమ - బుద్ధి - కాంతి - శాంతి - శ్రద్ధ - మేధ - ధృతి - స్మృతి - ఇవన్నియు నీవే. ప్రణవమందలి బింద్వర్ధ చంద్రస్వరూపమగు నర్థమాత్రవు నీవే. శ్రీగాయత్త్రీ దేవతవు సప్త వ్యాహృతులు జయ - విజయ - ధాత్రి - లజ్జ - కీర్తి - దయ - స్పృహ - ఇవన్నియు నీవే. దయామృత తరంగిణీ! విశ్వమాతా! ముల్లోకముల సృష్టించు భవభవ భంజనీ! వరేణ్యా! మహావిద్యా స్వరూపిణీ! వాగ్బీజ నివాసినీ! ఓ అమ్మా! నిన్ను రేయైన పగలైన సంస్తుతింతుమమ్మా హరిహర బ్రహ్మలు - ఇంద్రాగ్నులు! రవి - సరస్వతి - లోకాధిపతులును నీచేతనే సృజింపబడిరి. ఇంతేకాదు. ఈ స్థావర జంగమముల కన్నింటికి నీవే జనయిత్రివి! నీవీ జగములనెల్ల నిర్మించనెంచి త్రిమూర్తులను సృజించి వారిచే సృష్టి స్థితి లయము లొనరింప జేయుచున్నావు. ఐనను నీవేకాత్మవై తేజరిల్లుటచేత నీలో నీ సంసారవికారవాసనలు లేశమాత్రమున పొడసూపవు.

నీ యనంత నామములును నీ దివ్య స్వరూపమును నీ వస్తుతత్త్వమును నెఱుంగ జాలినవాడు భువనంబు లన్నింటిలో నెవడును లేడు. ఒక చిన్న నీటి పడియను దాటజాలనివాడు సత్యప్రతిజ్ఞుడై మున్నీటి నెట్లు దాటగలడు? ఈ యెల్ల వేల్పులం దొక్కండును నీ యనంత దివ్యవిభూతు లెఱుంగ గలవాడు లేనేలేడు. నీ శ్రీమాతృదేవినామ మెంతయో మధురాతిమధురము, ఈ మిథ్యా జగముల నెల్ల రచించుటకు నీవొక్కతెవే చాలు ననుటకు వేదవాక్కులు ప్రమాణభూతములు. నీవే కోర్కెలును లేనిదానవు. ఎల్ల భువనములకు కారణభూతురాలవు. కాన నో భగవతీ! నీ విచిత్ర చరిత్ర మా మది కద్భుతముగ దోచుచున్నది. వేదములన్నియు నొక్కటైనను మనోవాక్కుల కతీతమైన నీ మహోజ్జ్వల ప్రతిబ నెఱుగలేవు. ఇక మేమేమి గ్రహింపగలము? ఈ విష్ణు శిరము అదృశ్యమగుట నీకు తెలియదా? కాక నీవెఱింగియు తిరిగి తెలిసికొన దలంతువా? కాదేని మధువైరి బలమెంతయో తెలిసికొన జూతువా? హరియం దేదేని బలవత్తరమైన దోషమున్నదందుమా? అదియును సరికాదు, ఏలన - నీ పావన చరణ కమలములు గొల్చువారిని పాతకము తాకనైన తాకలేదు. ఓ విశ్వమాతా! ఈ హరి యెల్ల వేల్పులలో చాల దొడ్డవాడు. ఇతని విషయ ముపేక్షింప దగదు. ఇతని తల తెగిపడుట చూడగ నబ్బురముగ నున్నది. మదిలో వంత గల్గించుచున్నది. ఓ అమ్మా! ఈ చావు పుట్టుకల వలని వంతలనెడి తీగలను త్రుంచుట కీవే సమర్థురాలవు. మరియు మధుసూదనుని తల మరల నతికించుటకు జాగేల యెనరింతువో తెలియుటలేదు. దేవతలును దోష యుతులే యని యెంచి వారి దోషమునకు ఫలముగ హరిశిరమును ద్రుంచితివో! లేక నరుల పాపము రాజునకు సంక్రమించునుగాన నరుల - దేవతల పాతకముల వలన నితని తల తెగిపడినదో! కాక మధుకైటభులను చంపుటచే నితనికి గర్వము బలిసెనని తలచి యతని తలను ఛేదించితివో! దీని కారణమేమో మేమూహింపజాలకున్నాము. భవానీ! రణమున నోటుపడిన రక్కసులు విమల తీర్థములందు తపములు సేయగ వారికి వరములొసంగితివో! కాదయేని తలలేని వాసుదేవునిగని వినోదింపదలచితివో! నీవిందేమనుకొనుచున్నావో కాని మాకు మాత్రము హరి తల కనబడుట లేదు. సనాతనీ! కానిచో లక్ష్మిపై కోపించి యిట్లొనర్చితివో! ఐనచో పతిలేని యామె మొగమెట్లు చూడగలవు? నీ యంశమున బుట్టిన కడలి రాపట్టి చేసిన నేరమును క్షమింపవలయును గదా! కావున నిపుడీ హరిని లేపి మాకానందము జేకూర్చుము తల్లీ!

మేము కార్యకుశలురము. ప్రభావ సంపన్నులము. దేవతలము. రేయైన పగలైన నీ చరణములే నమ్ముదుము. ఓ దేవదేవీ! ఈ లోకాధినాథుని బ్రతికించి మమ్మీ శోకవారిధి నుండి దాటించుము. శ్రీహరి శిరమేమయ్యెనో మాకు దోచుట లేదు. మేమిక మనుట యెట్లో తెలియుట లేదు. అమరులకు జీవనదాన మొసగు దివ్యామృత మూర్తిని నీవే కదా! ఈ జగములకు బ్రతుకు వెలుగు చూపింపగదవే! 

సూతుడిట్లనియె ; ఈ ప్రకారముగ సాంగములగు వేదములతో సామగులు సామగానము సలిపి తన్ను సన్నుతింపగా గుణాతీత - మహేశ్వరి - పరమమాయ పరమానంద భరితురాలయ్యెను. అంతలో నంతరంగముల కభిరామమైన యశరీరవాణి సుస్వరమున వేల్పుల నుద్దేశించి యిట్లు పలికెను. అమరులారా! నేను ప్రాజదవుల చేత ప్రస్తుతింపబడి ప్రసన్నమైతిని. మీరలు చింత - వంత వదలుడు. స్వస్థులుగండు, నా మాట నమ్ముడు. ఎవ్వడీ భూమిపై నన్నీ దివ్యస్తోత్రమున సంస్తుతించునో, భక్తి యుక్తుడై దీనిని చదువునో, వానియెల్ల కోర్కులు తప్పక ఫలించును. వేదస్తోత్రము వేద తుల్యము. కనుక నెవడేని మూడు కాలములందును పరమభక్తి నిండార నీ వేదస్తోత్రము పారాయణమొనరించునో వాడు దుఃఖరహితుడై సుఖించగలడు.

లోకమందు కారణము లేక కార్యము లేదు. కనుక నీ హరి శిరము తెగుటకు గల కారణమాలింపుడు. మున్నొకప్పుడు కడలిరాచూలి హరిప్రియురాలు హరి చెంతనే యుండెను. అత్తఱి మనోరమమగు నామె పద్మవదనముగని హరి నవ్వెను. నన్ను జూచి యూరకే మాధవుడేల నవ్వును? తప్పక యేదేని వికారము నా మొగమందా ప్రభునకు బొడగట్టి యుండనోపును. అకారణముగ నవ్వేల వచ్చును? ఇతని నెమ్మదిలో నన్య వనిత నాకు సవతిగ నిల్చి యుండనోపునని లచ్చి తలంచెను. ఆమె మేనియందప్పుడు తామస శక్తి యావేశించి యుండెను. అందుచే నా మహాలక్ష్మి తమోగుణముచే కోపవంతురాలయ్యెను. ఆ సమయమున దైవయాగమునను దేవకార్యమునకు నామె శరీరమందు దారుణమైన తామసశక్తి నిండి మెండుకొని యుండినందున తదావేశముచే "నీ తలతెగి పడిపోవుగాక!" యని లక్ష్మి మెల్లగ హరితో ననెను.

మునుపు మహావీరుడగు హయగ్రీవుడను దైత్యుడుండెను. అతడు సరస్వతీనదీ తీరమున ఘోరముగ తపమొనర్చెను. అతడన్నపానములు సుఖభోగములు విడనాడి విజితాత్ముడై మాయాబీజమగు నేకాక్షర మంత్రరాజమును జపించుచు లలిత భూషణ భూషితమగు నా తామసిక శక్తి ననుధ్యానించుచు వేయేండ్లతి దారుణమైన తపస్సు చేసెను. అతడెట్టి తామసరూపమును ధ్యానించెనో నేనదే తామసరూపమున నతని యెదుట ప్రత్యక్షమైతిని. సువ్రతా! నీకు వరమొసంగుదును. ఏదేని గోరుకొమ్మని సింహాసనాసీననై నేనతనితో దయదలచి పలికితిని. అతడు నా మాటలు విని బత్తితో నాకు ప్రదక్షిణించి సాగిలపడి మ్రొక్కెను. అతడు నా దివ్యస్వరూపముగాంచి కనులనిండ నానంద బాష్పములునిండ నన్నుకీర్తించెను. 

హయగ్రీవుడిట్లనె : కామమోక్షములొసగు మహామాయాదేవీ! భక్తాసు గ్రహస్వరూపిణీ! సృష్టిస్థిత్యంతకారిణీ! నీకు నమః సహస్రములు. నింగి గాలి నిప్పు నీరు నేలలకును శబ్దస్పర్శరూపరస గంధములకును నీవే మూలమైనదానవు. త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వాఘ్రాణములలో వాక్పాణి పాద పాయూపస్థలును శక్తి చేత తమతమ పనులు జేయుచున్నవి.

శ్రీదేవి యిట్లనియెను : ఓ దానవా! నీ యద్భుత తపమునకు నీ పరభక్తికిని మెచ్చితిని. నీ కెట్టి కోర్కియున్నను తీర్చెద. వరమడుగుము. 

హయగ్రీవుడనియె : అమ్మా! సురాసురుల కజేయుడనై యోగినై యమరుడనై చావకుండునట్లు వరము నా కిమ్ము. 

శ్రీదేవి యిట్లనియె : పుట్టిన ప్రాణి తప్పక గిట్టును. గిట్టినదెల్ల తిరిగి పుట్టును. ఇది లోకమర్యాద. దీనికి విరుద్ధముగ నెట్లు జరుగగలదు? కావున చావు తప్పదని నిశ్చయించుకొని మరేదేని వరమడుగుము. 

హయగ్రీవుడనె : తల్లీ! నా చావు కేవలమొక్క హయగ్రీవుని వలననే జరుగవలయును. ఇతరుని చేత కూడదు. ఇదే నా కోర్కి. నాయీ కోర్కి తీర్చుము. 

శ్రీదేవి యిట్లనియె : ఓ మహాభాగా! నీవిక నీయింటికేగి సుఖముండుము. హయగ్రీవుడుగాక యితరునివలన నీవు చావవు అని పరాంబిక మహామాయ వరమొసగి అదృశ్యయయ్యెను. ఆ రక్కసుడును ప్రమోదించి తన యింటికేగెను. నాటినుండి యతడు వేదవిప్రులను మునినరులను బాధింపదొడగెను. ముల్లోకములలో నతని నెదుర్కొని తెగటార్చువాడెవ్వడును లేకుండెను. కావున దేవతలారా! మీరిపుడొక గుఱ్ఱము తలతెచ్చిఇండు. దానినీ మొండెమున కతికించి హరిని త్వష్ట మరల బ్రతికించును. అపుడా శ్రీ హయగ్రీవ భగవానుడా పాపిష్ఠుడును క్రూరుడునగు హయగ్రీవ దానవుని దప్పక దునుమాడగలడు. 

సూతుడిట్లనియె : ఈ విధముగ శ్రీభువనేశాని పలికి మౌనమూనెను. దేవతలును మోదమలర దేవశిల్పియగు త్వష్టతో శ్రీహరి మొండెమునకు గుఱ్ఱము తల నతికింపుము. ఆ శ్రీ హయగ్రీవుడు హయగ్రీవుని దెగటార్చును. ఇట్లు దేవతల కార్యము సాధింపుము అని వేడిరి. 

సూతుడిట్లనియె : ఆ దేవతల వచనములు విని త్వష్ట సంతసించి వెంటనే వారి సమక్షముననే యొక్క హయము తల ద్రుంచి దానిని హరిమొండెమున కతికించెను. అంత మహామాయ దయవలన హరి హయగ్రీవుడయ్యెను. కొన్ని దినముల పిదప నా శ్రీ హయగ్రీవుడు యుద్ధమున మదగర్వితుడు దేవవైరియగు హయగ్రీవుని నేలగూల్చెను. ఈ సుందరమైన కథను వినిన మానవుడు సర్వదుఃఖములు బాసి సుఖించగలడు. సందేహము లేదు. ఈ శ్రీ మహామాయాదేవి చరిత్ర పవిత్రము, పరమ పావనము, పాపనాశనము. దీనిని చదివిన వారికిని వినిన వారికిని మేలి కలుములు చేకూరును. ఇది ముమ్మాటికి నిజము.

అధ్యాయము 6 మధుకైటభుల యుద్ధ ప్రయత్నములు

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...