Friday, April 10, 2026

Chapter 12 Sudyumna Sthuthi - అధ్యాయము 12 సుద్యుమ్నస్తుతి

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 12

సుద్యుమ్నస్తుతి

సూతుడిట్లనియెను : పిమ్మట బుధునకిలయందు పురూరవుడు జన్మించెను. ఆ పురూరవుడు దర్మాత్ముడు. పెక్కు యజ్ఞము లొనరించినవాడు. దానశీలుడు. అట్టి పురూరవుని జన్మవృత్తాంతము వివరింతును, వినుడు. పూర్వము సుద్యుమ్నుడను భూపతి యుండెను. అతడు సత్యవాది, జితేంద్రియుడు, ఒకనాడతడు సింధు దేశోద్భవమగు నశ్వమెక్కి మంత్రులతో గూడి కవచధారియై యందమైన కుండలములు దాల్చి అజగవమను ధనువును బాణములను చేపట్టి వేటకై యడవి కేగెను. ఆ రాజు పెక్కు రురుమృగములు, కుందేళ్ళు, పందులు, గవయములు, ఖడ్గమృగములు, శరభములు, మహిషములు, సృమరములు, వనకుక్కుటములు మున్నగు పవిత్ర వన్యములను యజ్జియములగు పశువులను పక్షులను జెండాడుచు కుమార వనమందు ప్రవేశించెను. ఆ వనమందు మేరుగిరికి దిగువలో మందార తరువులు, పొగడ చెట్లు, అశోక లతలు, సాల, తమాల, చంపక, పనసవృక్షములు మామిడి, కడిమి, ఇప్ప, గురివింద వృక్షములు మాధవీలతా మండపములతో శోభిల్లుచుండెను. దానిమ్మ, కొబ్బరి, అరటి చెట్ల సముదాయమును అడవిమొల్ల మాలతి కుంద పూదీవియలును కనుల పండువుగ నుండెను. ఆ వనము హంస కారండవ పక్షులతో వ్యాప్తమై వేదధ్వనులతోను గండుతుమ్మెదల ఝంకారముతోను చెవుల పండువు సేయుచుండెను. అట్టి సుందర వనమందు సుద్యుమ్నుడు స్వేచ్ఛగ విహరించుచు రంగురంగుల పువ్వులను గనుచు మత్తకోకిల మధురగానములు వినుచు సంతసిల్లుచుండెను. ఆ రాజట్లు తన సేవకులతో వనమును దర్శించుచు పోవుచునే ప్రమోదము నిండార వనమందు జేరగనే ప్రమదగ మారెను. ఆతని మగగుఱ్ఱ మాడుగుఱ్ఱమయ్యెను. ఆ వింతగని రాజు చింతాక్రాంతుడయ్యెను. ఈ వింతకు కారణమేమో యని మాటిమాటికి వంతంజెందుచు తన నారీ రూపమునకు తలవంచుకొనుచు ఈ యాడుదనంబుతో నేనింకేమిజేతును? ఇంటి కెట్టులేదగుదును? రాజ్యమేలుట యెట్లో? వంచించిన దెవ్వరో?' యని రాజు లోలోననే తెలుపరాని బాధ పడుచుండెను.

ఋషులిట్లనిరి : ఓ సూతా! ఆ దేవసన్నిభుడగు సుద్యుమ్నుడు పడతిగనెట్లు మారెను? ఇదంతయును వింతగ నున్నది. రాజా సుందరవనమందు గ్రుమ్మరుటచే నట్లు జరుగుటకు కారణమేమి? ఆ తరువాత నతడేమి చేసెనో తెల్లమొనర్పుము. 

సూతుడిట్లనియెను : పూర్వము సనకాదియోగి పుంగవులు తమలోని దివ్యకాంతిపుంజములు దెసలను వెలిగించు చుండగ శివసందర్శనమున కరిగిరి. అత్తఱి శివుడు పార్వతితో క్రీడించుచుండెను. గిరిజయు వివస్త్రయై శివుని తొడపై క్రీడాసక్తురాలై యుండెను. దిగంబరయై యుండెను. ఆ మానవతి ఋషులను గాంచి తలవంచుకొని వెనువెంటనే శివునంక మందుండి దిగి వస్త్రము ధరించి భరించరాని సిగ్గుతో మేనెల్ల కంపింప నిలుచుండెను. ఆ పార్వతీ పరమేశ్వరులట్లొక్కటై శృంగార క్రీడలో మునింగి ఉండుటగని ఋషులచ్చోటు వదలి గ్రక్కున నరనారాయణాశ్రమ మేగిరి. ఆ పార్వతి లజ్జించుట గాంచి శంకరభగవానుడామెతో నీవేల లజ్జాతురవగుదువు? నీ మదిలోని కుందు బాపుదును. ఈ వనమెవడేని ప్రవేశించినచో నతడు స్త్రీరూపమందును. ఈ వనమీవిధముగ వపింపబడెనని విన్నవాడెవడైనను దోషభూయిష్ఠమైన యీ వనమును ప్రవేశింపరాదు అని పలికెను. ఆ సుద్యుమ్నున కీ శివశాపము తెలియకపోవుటచే తన మంత్రులం గూడి యందు ప్రవేశించి స్త్రీ భావము నందెను. అతడు చేయునది లేక తలవంచుకొని తన భవనమునకేగక వనమందే యటునిటు గ్రుమ్మరుచుండెను. ఆ నారిగ మారిన మహాత్ముడు 'ఇల' యను పేర బరగెను. అంతలో చంద్రుని కుమారుడగు బుధుడు విహరించుచు నచ్చటి కేతెంచి ఆ యిలాకామినిని పెక్కురు చెలికత్తియల నడుమ మనోహరిణిగనున్న దానిని జూచి కామించెను. ఆ యిలయును చంద్రుని కుమారునే తన కాంతునిగ తంచెను. వారిరువుర సంయోగ ఫలితముగ బుధునకా యిలయందు పురూరవుడను కుమారుడు జనించెను.

అటులు ఇల వనమందే తనయుని గని చింతాకులయై తనకులాచార్యుడు మునిసత్తముడగు వసిష్ఠుని నెమ్మదిలో స్మరించినది. ఆ సుద్యుమ్నుని దీనదశ జూడగనే జాలి కలిగి వసిష్ఠుడు లోకశంకరుండగు శంకరుని ప్రార్థించెను. పరమ శివుడు ప్రసాదభావము నొందుట గని రాజునకు మరల పురుషత్వము గలుగవలయునని ముని శివుని వేడుకొనెను. మహేశ్వరుడు తన పలికిన వాక్యము సత్యము జేయుటకై యితడొక నెల పురుషుడుగను నొకనెల స్త్రీగను నుండునని పలికెను. ఇట్లు రాజు వసిష్టుని దయవలన వరము బడసి తన గృహమేగి ధర్మానుసారము రాజ్యమేలుచుండెను. ఆ రాజు స్త్రీగ మారినపుడంతఃపుర మందే యుండును. పురుషుడైనపుడు రాజ కార్యములు చక్కబెట్టుచుండును. దీనికి ప్రజలుద్విగ్నులై సంతోషము జెందకుండిరి. కొంతకాలమునకు తన కుమారుడగు పురూరవుడు యువకుడు కాగా నతనికి ప్రతిష్ఠానపురము రాజధానిగ రాజ్యమొసంగి రాజు వనమున కరిగెను. పలు వృక్షములతో నుల్లము పల్లవింపజేయు రమ్యవనమందా రాజు నారదమునివలన పావనమైన నవాక్షరమంత్రము నుపదేశమంది ఆ శ్రీదేవీ మంత్రమునే భక్తిశ్రద్ధలతో నిరంతరముగ జపించుచుండెను. అంత సర్వగుణోపేతయు తరింపజేయునదియు మంగళరూపిణియు సింహారూఢయు దివ్యరూపిణియు మనోహారిణియు మద్యపానముచే మత్తయు మదముచే నాకులములైన లోచనములు గలదియునగు దేవి యతని యెడ ప్రసన్న యయి సాక్షాత్కరించెను. రాజా దివ్యమంగళమూర్తిని తన యెదుట సందర్శించగనే యతని హృదయము నుండి ప్రేమ భక్తి పెల్లుబికి యా జగదంబికను భక్తితో నీ విధముగ సంస్తుతింప దొడంగెను.

"భగవతీ! దివ్యమయి విశ్వ ప్రసిద్ధమై అఖిల జగములకు మేలునకనుకూలించు నీ రూపసందర్శన భాగ్యము నాకు నేటికి లభించినది. సకల దేవగుణములు స్మరించు నీ దివ్యచరణములే నాకు శరణములు. నీ పదకమలములు కామ ప్రదములు ముక్తి ప్రదములు. నీ దివ్యస్వరూపము సురలను మునులను మోహింపజేయును. సామాన్య మానవుడెట్లెరుగ గలడు? నీ మహిమ తెలియరానిది. ఈ దీనునిపై దయ దలచితివి. ఎల్లకలుములు ప్రసాదించితివి. ఇదంతయు నా కచ్చెరువు గొల్పుచున్నది. హరి, హరుడు, బ్రహ్మ, అగ్ని, కుబేరుడు, రవి, వరుణుడు, పవనుడు, సోముడ, వసువులను వారియందెవ్వరును నీ దివ్యసుగుణ ప్రభావమెఱుగజాలరు. ఇంక గుణహీనుడగు నరుడెట్లు తెలిసికొనగలడు? మహాద్యుతియగు విష్ణువు సైతము నిన్ను సత్త్వగుణ ప్రధాన శక్తియు సకలార్థ ప్రదాయినియు కడలిపట్టియునగు లచ్చిగనే యెఱుంగును. బ్రహ్మ నిన్ను రాజస శక్తిగను రుద్రుడు తామసశక్తి యగు నుమగను దలంతురు. కాని వారును నీ నిర్గుణశక్తి స్వరూపమెఱుగ నేరరు. మందమతియై యల్ప ప్రభావముగలనే నెక్కడ? నాపై ప్రవహించు నీ మధుర దయాపూరమెక్కడ? ఓ భవానీ! నీ మహోజ్జ్వల చరిత్రను నీ దయామృత సాగరమని భావింతుము. నిన్నెవరు గొలుతురో యా సేవకులపై నీవు దయ గురిపింతువు. పద్మాలయవైన యో పద్మా! నీవు హరిని వరించితివి. ఆ పురుషోత్తముడు మహాలక్ష్మివగు నీ చేత తన పదము లొత్తించుకొనుటకు దగనని దలచి తన పవిత్ర కరములతో నీ పావన పదపద్మములనొత్తును. పురాణ పురుషుడగు హరియును విశోకుడై ప్రమదమున నీ పాదాహతిని గోరుకొనును. అట్టి సకల దేవ సన్నుతుడే మదనార్తుడై నీ పదములకు మ్రొక్కినను నీవు రోషమున నతనిని పాదాతాడన మొనర్తువు. నీలాల మేఘమాలలో మెఱుంగు తీగె శోభిల్లును. నీవా విష్ణుని యెడందసెజ్జపై కలకాలము కాంతులీనుదవు. నీకా జగత్పతియును వాహనముగ నయ్యెను గదా! ఒకవేళ నీవు కోపమున నా మధుసూదనుని విడనాడినచో నపుడా సర్వనుతుడగు హరియును శక్తిహీనుడే యగును. శాంతి శ్రీని గోల్పోయి గుణహీనుడైన వానిని తమవారే విడనాడుట ప్రత్యక్ష విదితమే. ఓ యనంత శక్తీ! బ్రహ్మాది దేవతలును రేబవళ్లు నీ భవ్య పాదపద్మములు భజింతురు. వారే నీ మణి ద్వీపము జేరి యువతులుగ మారుదురు. నీ దయాదృష్టి చేత మరల వారు పురుషులుగ మారుదురని తలంతును. ఇట్టి నీ మహాశక్తి నేమని వర్ణింపగలను? నీవు కేవలము స్త్రీ పురుషాది చిహ్నములు గలదానవే కావు. సగుణపు నిర్గుణవు నిరంజనపు కనుక నిన్నే భక్తి ప్రపత్తులతో సంస్మరించుచు మ్రొక్కులు చెల్లింతురు. నాకు నీయందు నిశ్చల భక్తి యున్న చాలు. నాకు మరే కోర్కెయు లేదు. 

సూతుడిట్లనియె : ఈ ప్రకారముగ నా రాజు సంస్తుతించగనే శ్రీదేవి సుప్రసన్నయై యతనికి బ్రహ్మ నిర్మాణము ప్రసాదించినది. ఇట్లు సుద్యుమ్నుడు దేవీ ప్రసాదమున మునులకును దుర్లభమైన ధ్రువ పరమపదమును జెందెను.

అధ్యాయము 13 ఊర్వశీ పురూరవుల చరిత్ర

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 19 Sri Sukuni's married life - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము

శ్రీ దేవీ భాగవతం ప్రథమస్కంధము - అధ్యాయము 19 శ్రీ శుకుని వైవాహికజీవనము శ్రీ శుకుడిట్లనియె: "ఓ మహాశయా! ఈ మాయామోహములో కొట్టుమిట్టాడు నరుడ...