Friday, April 17, 2026

Chapter 142 Ekavira Vana Viharamu - అధ్యాయము 142 ఏకవీరుని వనవిహారము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 142

ఏకవీరుని వనవిహారము

ఆ విధముగ రాజు బాలునకు జాతకర్మాది సంస్కారము లొనరించెను. బాలుడు పెంచబడి దినదినాభివృద్ధినందు చుండెను. రాజు పుత్రప్రాప్తివలన సంసార సుఖము లనుభవించి తాను ఋణత్రయ విముక్తుడైనట్లుగ దలంచెను. రాజు బాలుని యారవ మాసమున నన్న ప్రాశన మొనరించెను. మూడవ యేట చూడాకరణమొనరించి విప్రులను పూజించి భూరి ద్రవ్యము లొసంగి గోదానములిచ్చి సత్కరించెను. యాచకులను తనిపెను. పదునొకండవ యేట తన పుత్రున కుపనయన సంస్కారమొనరించి ధనుర్వేదము నేర్పించెను. తన పుత్రుడు వేదమునందు రాజధర్మమునందు నిష్ణాతుడగుటగాంచి రాజతనికభిషేకము చేయదలంచెను. 

ఆదివారమున పుష్యమీ నక్షత్రమున నభిషేకమునకు వలసిన సామగ్రి యంతయు సమకూర్చబడెను. రాజు వేదశాస్త్రపారగులగు బ్రాహ్మణులను పిలిపించి తన కుమారునకు యథావిధిగ పట్టాభిషేకము జరిపెను. అతడు పెక్కు సాగరములనుండియు తీర్థముల నుండియు పవిత్రజలములు దెప్పించి శుభదినమున తాను స్వయముగ తన పుత్రు నభిషేకించెను. అట్లు బ్రాహ్మణులకు భూరిగ ధనములొసంగి రాజ్యము తన తనయుని కొప్పగించి స్వర్గకాముడై రాజు వనముల కరిగెను. అట్లు రాజేకవీరుని రాజుగచేసి మంత్రులను సమ్మానించి తన భార్యతో నడవుల కేగెను. మైనాక గిరిపై ఆ శ్రమమేర్పరచుకొని పత్రఫలములు దినుచు శ్రీ పార్వతిని ధ్యానించు చుండెను.

ఆ విధముగ తన ప్రారబ్ధకర్మము ముగిసిన పిదప రాజు తన భార్యతో మరణించి పుణ్యకర్మల ఫలితముగ స్వర్గసీమ లలంకరించెను. తన తండ్రి దివంగతుడైన పిమ్మట హైహయుడు వేదోక్త ప్రాకరముగ తండ్రి కంత్యక్రియలాచరించెను. పైతృక రాజ్యమును చక్కగ నేలెను. ధర్మవిదుడై విశాల రాజ్యము పడసి మంత్రుల చేత సమ్మానములంది వివిధ భోగము లనుభవించెను. 

అంతనొకనాడతడు తన మంత్రి కుమారులను గూడి హయమునెక్కి పావన గంగా తీరమున కేగెను. అతడచట సుందర తరు వనములు గాంచెను. అవి గండు తుమ్మెదల ఝంకారముల నొప్పు పుష్ప మధువులతో మధుర ఫలరసములతో కోయిలల కలకల కూజనములతో సొంపుమించుచుండెను. అచట దివ్యమునుల పావనాశ్రమములుండెను. అలివేద ఘోషల మారుమ్రోతల కమ్మదనముతో నింగినంటు హోమ ధూమములతో పిల్లలేళ్ళ చెంగలింతలతో సొబగు మీరు చుండెను. అచ్చట బాగుగ పండిన కేదారశాలిధ్యానములును వానిని గాపాడు శాలిగోపికలును విప్పారిన పద్మవనములును తగిన మెత్తని పూపొదరిండ్లును సొంపు వహించుచుండెను. 

ఏకవీరుడు వానినెల్ల వేర్వేర తిలకించుచు చంపక పవనతరులను వికసించిన వకుళ తిలక నీపమందారములను సాల తాల తమాల జంబూ చూత కదంబతరులను పరికించుచు గంగాతోయములందు విరయబూచిన నెత్తమ్ములను గనుచు నెత్తమ్ముల నెత్తావులను గట్టి మూర్కొనెను. అంతలో కమలములకు కుడివైపున వింతకుల్కుల కమలనయన నొకతెను క్రిందికి మీదికి తేరిపార జూచెను.

ఆ సుందరాంగి మిసమిసమను పసిడి వన్నెల చాయది - కొద్దిగ పైకి నిక్కుచున్న గుబ్బలుగలది. సుకేశి-కంబుకంఠి- బింబాధర-తలోదరి - సునాస-శోభనాంగి. ఆమె తన నెయ్యపు చెలులను వీడి విహ్వలయు దుఃఖపీడితయునై యుండెను. ఆ సులోచన ఆ రీతిగ కురరివలె నొంటిగ విలపించుట కన్నులారగాంచి యామెలోని బాధకు కారణమును 

రాజిట్లడిగెను : ఓ శుభాననా! నీ వెవరవు. ఎవ్వని కూతురవు గంధర్వ కన్యవా! దేవకాంతవా! సుందరీ! ఒంటిగ విలపింతువేల? కారణము చూపెట్టుము. ఓ బాలా! తోడు లేకుంటివేమి! ఓ పికస్వరా! నిన్నెవడు వదలిపెట్టెను? ఓ కాంతా! నీకాంతుడెచటికేగెను? నీ తండ్రి యెచటికేగెను? ఇక నా ముందు నీ దాపరికమేల? చెప్పుము. వంకరముంగురుల మోహనాంగీ! నేను నీ బాధ మాన్పగలను. నాతో మాటాడుము. విరిబోడీ! నా యీ రాజ్యమున నిన్ను బాధించునా డితరుడెవ్వడును లేడు. నీకు దొంగ భయము రాక్షస భీతి లేదు. 

నేను నరపతిని. నా యేలుబడిలో భూమిపై దారుణ విపత్తులుగాని వ్యాఘ్రసింహాదుల భయముగాని యెవ్వనికిని లేదు. దిక్కుమొక్కు లేనిదానవై యీ చల్లని గంగా తటమున విలపింతువేల? నీలోని బాధకు కారణమేమో తెలుపుము. 

కామినీ! ఈ భూతలమునందు దైవము వలన ప్రాణులకు సంభవించు దుఃఖములెంత తీవ్రతరములైన వైనను వానిని దొలగించుట నా వ్రతము. విశాలలోచనా! ఇక నీ మనసైన కోర్కెయేదో దాపక బైట పెట్టుము. నేను దాని నీడేర్పగలను.'' అని రాజు సానునయముగ పలుకవిని వలపులూరు పలుకులతో 

నామె నరపతికిట్లు పలికెను : ఓ లోకనాయకా! నా శోకకారణ మాలింపుము. ఏదైన భాధలేక యే ప్రాణియును దుఃఖింపదుగదా! ఓ మహానుబాహూ! నా శోక కారణము బయల్పఱచుచున్నాను వినుము. నీ రాజ్యముకంటె వేరొక రాజ్యముగలదు. దాని రాజు ధార్మికుడు. అతని పేరు రైభ్యుడు. అతని భార్య రుక్మరేఖయన పేరు గాంచెను. వారికి సంతులేదు. ఆ రుక్మరేఖ సుందరి - చతుర - సాధ్వి - సర్వలక్షణ లక్షిత - ఐన నామె పుత్రహీనురాలై విలపించుచు పల్మారు 

తన కాంతునకిట్లనెను : నాథా! నేను పుత్రసౌఖ్యమునకు నోచుకొనని గొడ్రాలను. ఈ నేలపై నేను బ్రదికి యేమి లాభము? నా బ్రతుకెండిన మ్రోడుగదా?

అను భార్యమాటలచే ప్రేరితుడై రాజు తెలిసిన విప్రులను పిలిచి గొప్ప యజ్ఞ మొనరించెను. అతడు శాస్త్రమున చెప్పిన చొప్పున గొప్పగ ధనములొసంగి ప్రజ్వరిల్లుచున్న యగ్నిజ్వాలలలో నేయి వేల్చెను. ఆ యగ్ని దేవుని నుండి యొక కన్య యావిర్భవించెను. ఆమె శుభ లక్షణ-సుందరాంగి-బింబాధర-సుదతి-చంద్రముః-అందాల కనుబొమలది. ఆమె బంగారు వన్నెలాడి - సుకేశి - ఎఱ్ఱని పాణిపాద తలములు కన్నులు గలది. ఆ విధముగ నగ్ని నుండి బయలు వెడలిన సుమధ్యయగు కన్నియను హోతలు స్వీకరించి రాజుతో నిట్లు పలికిరి : 

'రాజా! సర్వలక్షణ సమన్వితయగు నీ పుత్రికని స్వీకరింపుము. రాజా! ఈమెనే హోమాగ్నినుండి యేకావళీ మాలవలె నుద్భవించెను. ఈ పుత్రిక లోకమందు నేకావళీ నామమున వాసిగాంచును. రాజా! కొడుకుగ భావించి సంతసించుము. ఈమెను విష్ణుభగవానుడే ప్రసాదించెనని సంతోషించుము'' అను హోత వాక్కులు విని రాజు శుభలోక్షణముల కన్యను గాంచెను. అట్లు హోత యీయగ రాజాబాలను మోదమలర స్వీకరించెను. ఆ చారుముఃఖిని గైకొని తన భార్యచెంతకేగి, సౌభాగ్యవతీ! ఈ కన్నియను గైకొనుమని రాజు పలికెను. 

అంత రాణి కమల పత్రాక్షి మనోరమయగు ఆ బాలికను గ్రహించెను. ఆమె పుత్రోత్సాహమును బొందినంత సంతోషమందెను. వారాబాలకు జాతకర్మాది మంగళ కార్యము లొనరించిరి. పుత్రునకు జరిపించునట్లు వారు యథావిధిగ నామెకన్ని విధులు జరిపించిరి. ఆ విధముగ యజ్ఞము పూర్తిచేసి రాజు బ్రాహ్మణులకు దానదక్షిణలు గొప్పగ నొసంగెను. పిమ్మట అతడు వీడ్కోలుపలికి ముదమున నుండెను. 

ఆ సుందర బాలిక దిన మొక తీరుగ పుత్రుని విధముగ పెంచబడు చుండెను. అట్లు రాణి కూతును బడసి సంతోషించెను. ఆ బాలకు పుట్టిన నాటి పండుగలు జరుపబడెను.

ఆ కన్యయట్లు పుత్రసమముగ నెల్లరకు ప్రియముగ పెరుగుచుండెను. ఓ మదన సుందరా! ధీశాలీ! నేనట్టి రాజు యొక్క మంత్రి కూతురను. నన్ను యశోపతి యందురు. ఆమె నేను సమవయస్కులము. ఆమెతో నాడుకొనుటకు రాజు నన్నామెకు చెలికత్తెగ నియమించెను. నేను రేబవళ్ళు నెమ్మిగదుర నామెకండగ నుందును. ఆ యేకావళి నెత్తావులు విరజిమ్ము కమలములున్న యెడ నుండును. ఆమె యచ్చోటనే యాడుకొనునుగాని వేరొకయెడ నాడుకొనదు. ఈ గంగా తటమునకు దూరముగ పెక్కు కమలములు గలవు. ఆమె నా వెంట నచటి కేగి విహరించును. 

నేనొకనాడు రాజుతో నిట్లంటిని : 'నీ కూతురు కమల సరోవరములు గాంచగోరును. వానిని గాంచుట కామె విజన ప్రదేశమున నెంతదూరమైన వెళ్ళును అంత రాజు తన యింటనే కొలనేర్పరచెను. రాజందు కమల వనము నాటించెను. అవి విప్పారగ వానిపై గండు తుమ్మెదల దండు మూగెను. ఐనను కమలములందలి మక్కువ కొలది రాచకన్య దూరతీరాల కేగును. అంత నామె కంగరక్షకులుగ రాజు శస్త్రపాణులను నియోగించెను. అట్లు రక్షింపబడుచు నాతో తక్కిన చెలులతో విహరించుచు ఆ బాల ప్రతిదినము గంగాతీరమునకు వచ్చి పోవుచుండును.

No comments:

Post a Comment

Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము -  సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగ...