Thursday, April 16, 2026

Chapter 134 Harishchandra's recovery - అధ్యాయము 134 హరిశ్చంద్రుడు రోగముక్తుడగుట

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 134

హరిశ్చంద్రుడు రోగముక్తుడగుట

ఇంద్రుడిట్లనెను : ''ఈ విధముగ మున్ను నీ తండ్రి హరిశ్చంద్రుడు తన కోడుకును యాగపశువుగ జేసి యాగమొనర్తునని వరుణునకు మాటయిచ్చెను. కనుక నీవీ పరిస్థితిలో వెళ్ళినచో నీ తండ్రి దయమాలి యూపస్తంభమునకు నిన్ను పశువుగ గట్టి చంపగలడు.' ఇట్లు తేజశ్శాలియగు మహేంద్రుడు వారించుటచే మాయామోహవతుడగుట వలన రాకుమారు డచ్చటనేయుండ నిశ్చయించుకొనెను. 

మొదట తన తండ్రి రోగపీడితుడై యున్నాడని వినినపుడతడు వెళ్ళుటకు తలంచెను. కాని, యంతలో నింద్రుడు వచ్చి యతనిని వారించెను. అట హరిశ్చంద్రుడు దుఃఖార్తుడై యుండెను. 

ఒకనాడతని మేలుగోరు వసిష్టుడతని చెంత నొంటిగ నుండగ నతడు ముని కిట్లనియెను : 

ఓ మహాత్మా! నేను శోకార్తుడను. ఏమి చేతును? ఈ తీరని భీకర వ్యాధిచే బాధపడుచున్నాను. నన్ను గాపాడుము. 

వసిష్ఠు డిట్లనెను : రాజా! వినుము. నీ రోగము తొలగుట కొక యుపాయము గలదు. ధర్మశాస్త్రములందు పుత్రులు పదమూడు విధములుగ జెప్పబడినారు. కనుక నీవొక విప్రునకు కోరిన ధనమిచ్చి యతని కొడుకును కొనితెచ్చి యాగమొనరింపుము. అట్లు యాగము చేయుట వలన నీవు రోగముక్తుడవగుదువు. వరుణుడును తప్పక ప్రసన్నుడుగాడలడు.' ముని మాటలు విని రాజు తన మంత్రితో నిట్లనియెను : 

'మంత్రీ! నీవు మహామతివి. నీవు బాగుగ యత్నించి మనదేశమందలి యొక విప్రకుమారుని కొనితెమ్ము. ధనాశగలవాడెవడైన తన కొడుకు నమ్ముకోగలడు. అతనికి కోరినంత ధనమిచ్చి యతని కొడుకును కొనితెమ్ము. నీవు నా యాగమున కెల్ల భంగులనొక విప్రబాలుని తేవలయును. నా యీ కార్యసాధనకు వెనుకచూపు చూడవలదు. నీ వే బ్రాహ్మణునైన సమీపించి యతనికి ధనమిచ్చి యతని బాలుని యాగపశువుగ నుండుట కిచ్చుట కతని నడుగుము. ఇట్లు మంత్రి రాజునాజ్ఞబడసి రాజకార్యము సాధించుట కూరురు నిల్లిల్లు వెదకుచుండెను.

ఇట్లు మంత్రి వెదుకుచుండగ నొకచోట అజీగర్తుడను పేద విప్రునకు మువ్వురు కొడుకులుండిరి. అపుడు మంత్రి యజీగర్తునకు కోరినధనమిచ్చి నడిమివాడగు శునశ్శేపుని తనవెంట గొనితెచ్చెను. అట్లు కార్యసాధకుడగు మంత్రి శునశ్శేవుని గొనితెచ్చి యీ విప్రకుమారుడు పశుత్వమునకు యోగ్యుడని రాజునకు చెప్పెను. అందులకు రాజు ముదమంది వేదవిధులను పిలిపించి యాగద్రవ్యములు సమకూర్చెను. యజ్ఞము ప్రారంభమయ్యెను. అంతలో నటకు విశ్వామిత్ర మహర్షి యరుగుదెంచెను. 
అట్లు శునశ్శేపుడు గట్టుపడుటగాంచి ముని రాజును యాగమాపుమనుచు : 

''రాజా! దుస్సాహసము వలదు. ఈ విప్రబాలుని విడువుము. నిన్ను నేను వేడుకొనుచున్నాను. నీకు మేలగుత! ఈ బాలుడు విలపించుచున్నాడు. ఇతనిని చూడగనే నా గుండె చెఱువగుచున్నది. నా మాట విని యితనిపై దయబూనుము. తొల్లి క్షత్త్రియవీరులు పరులను రక్షించిరి. వారు స్వర్గకాములై రణములందు తనువులు బాసిరి. 

ఇపుడు నీవు నీ శరీర రక్షణకొక విప్రబాలుని బలిచేయుచున్నావు. పాపము చేయకుము. ఈ బాలునిపై జాలి బూనుమ. ప్రతి ప్రాణికి తన ప్రాణములమీద తీపియుండును గదా! ఇది నీకును దెలియును. కనుక నీ మాట ప్రమాణముగ నమ్మి యితనిని విడువుము'' అనెను. కాని, దుఃఖార్తుడగు రాజు మునిమాటలు లెక్కచేయక బాలుని వదలలేదు. అంతట విశ్వామిత్రుడు రాజుపై కోపించెను. వేదవిదుడగు విశ్వామిత్రుడు దయతో శునశ్శేపునకు వరుణమంత్ర ముపదేశించెను. చావుబాధపడుచున్న శునశ్శేపుడు మంత్రమును ప్లుతస్వరముతో జపించుచు వరుణదేవుని దీనముగ ప్రార్థించెను. 

వరుణుడు కరుణరస సముద్రుడు. అతడు తన్ను నుతించునట్టి విప్రకుమారుని చెంతకేతెంచి యతనిని బంధముక్తుని చేసెను.

వరుణుడు రాజును సైతము రోగముక్తునిజేసి తనచోటికేగెను. అట్లు విశ్వామిత్రుడు విప్రబాలుని మృత్యుముఖము నుండి కాపాడెను. రాజు విశ్వామిత్రుని మాట పెడచెవిని బెట్టినందువలన ముని రాజునెడ రోషముబూని యుండెను. 

ఇది ఇట్లుండ ఒకనాడు హరిశ్చంద్రుడు ఒక పందిని చంపదలచి కౌశికీతీరమునకు వేటకుపోయెను. ఆ మధ్యాహ్న సమయమున విశ్వామిత్రుడొక ముసలి బ్రాహ్మణుని వేషమున వచ్చి రాజును ప్రార్థించి మోసముతో నతని రాజ్యమంతయు తన కైవసము చేసికొనెను. తన యజమానుడగు హరిశ్చంద్రుడట్లు కష్టాలపాలగుట వసిష్టుడెఱిగెను. 

అతడొకనాడడవిలో తనకంటబడిన విశ్వామిత్రునితో నిట్లనెను : 

'క్షత్రియాధమా! దుర్మతీ! నీవు బ్రాహ్మణవేషముదాల్చి దంభాచారుడగు కొంగవలె ప్రవర్తించి వట్టి గర్వము బొందెదవేల? మూఢుడా! హరిశ్చంద్రుడు నా యజమానుడు. నిరపరాధుడు. అట్టి వానిని నీవేల దుఃఖములపాలు చేసితివి? నీవు బక ధ్యానము బూనితివి. కనుక కొంగవగుము.' అని వసిష్ఠుడు శపించెను. 

విశ్వామిత్రుడంత నిట్లనెను : ''ఓ యాయుష్మంతుడా! నీవు ఆడి యను పక్షివగుదువుగాక!' ఇట్లు వారిర్వును కోపముతో శపించుకొనిరి. వెంటనే వారిర్వురు నొక సరస్సుచెంత ఆడీ బక పక్షులుగ బుట్టిరి. అటనొక చెట్టుపై నొక గూడుగట్టుకొని బకరూపుడగు విశ్వామిత్రుడు కొలనిగట్టున జీవించుచుండెను. వేరొకచెట్టుపై గూడుగట్టుకొని వసిష్ఠు డాడియను పక్షి రూపముతో వసించుచుండెను. 

ఆ రెండును పరస్పర క్రోధద్వేషములతో ప్రతిదినమును పోరుచుండెను. అవి లోకమునకు భీతిగల్గునట్లు గోళ్ళు ఱక్కలు ముక్కులు మున్నగువానితో పోరెను. ఆ రెంటి శరీరములు పూచిన మోదుగులవలె నెత్తుట దోగియుండెను. ఇట్లవి పెక్కేండ్లు పక్కిరూపములలో నుండెను.

ఇట్లు మునులు శాపబద్ధులైయుండిరి. అన రాజినట్లనెను. 'ఆ ముని వర్యులు తిరిగి యెట్లు శాపముక్తులైరి? ఓ మునివరా! దానిని వినుటకు నాకుత్కంఠ గల్గుచున్నది. తెలుపుము.' 

వ్యాసుడిట్లనెను : 'అట్లు వారు పోరుచుండుట లోకపితామహుడగు బ్రహ్మగాంచెను. అపుడు బ్రహ్మ దయామయులగు దేవతలను వెంటగొని యచటి కరుదెంచెను. బ్రహ్మ వారి కూరటగలిగించి పోరు మానిపించెను. వారి పరస్పర శాపములను తొలగించెను. పిమ్మట దేవతలు తమ తమ నెలవుల కరిగిరి. బ్రహ్మయును హంసవాహనమెక్కి సత్యలోకమేగెను వసిష్ఠ విశ్వామిత్రులును తమ తమ యాశ్రమములకు జనిరి. 

వారు బ్రహ్మ యొసగిన యాదేశమును పాటించిరి. నాటినుండి యిర్వురు నేస్తముతో నుండిరి. ఇట్లు వసిష్ఠుడు సైతము నిష్కారణముగ పోరెను. మైత్రావరుణియగు వసిష్టుడట్లు విశ్వామిత్రునితో క్లేశకరమగు పోరు సలిపెను. ఈ లోకములో దేవ-దానవ-మానవాదికమగు ప్రాణులు గలరు. వీరిలో నహంకారమును జయించి సుఖముగ నుండి వాడెవ్వడును లేడు. 

కనుక రాజా! చిత్తశుద్ధి మహితాత్ములకు సైతము దుర్లభము. దానిని ప్రయత్నముతో నెటులైన సాధింపవలయును. అహంకారము గెల్వనిచో తీర్థ - దాన - తపస్సులు సత్యధర్మ సాధనములన్నియు వ్యర్థము. (జీవులు ధర్మకర్మలు నిర్వర్తించుటకు శ్రద్ధ యత్యవసరము. అది సాత్త్వికము రాజసము తామసమని ముత్తెఱంగుల నొప్పును. 

అందును లోకమందు సాత్త్వికశ్రద్ధ దుర్లభము. అది పూర్ణఫలము నిచ్చును. విధి పూర్వకముగ ఆచరించిన కర్మములును రాజసశ్రద్ధ ఇచ్చుదానిలో సగము ఫలమే ఇచ్చును. రాజా! తామసశ్రద్ధ కామక్రోధముల వలన గల్గును. ఇది నిష్ఫలము. అపకీర్తికరమైనది.) కనుక శ్రద్ధాళువులు శ్రవణాదుల వలన చిత్తమును వాసనారహిత మొనర్చుకొనవలయును. 

శ్రీదేవీ పూజా తత్పరులై పుణ్యతీర్థములందు వసింపవలయును. ఈ కలిదోషపీడితుడు శ్రీమాతృదేవి దివ్య మధుర నామము లుచ్ఛరింపవలయును. శ్రీ లలితాంబా పాదపద్మములు సంస్మరింప వలయును. నిత్యము దేవీ ధ్యానము చేయుచుండ వలయును. ఇట్టు లాచరించువాని కేనాటికిని కలిభయము సంక్రమించదు. ఇట్టు లాచరించినచో నెంతటి పాపియైనను తప్పక తేలికగ సంసార ముక్తుడగును. ఇది ధ్రువము.

No comments:

Post a Comment

The appearance of Brahma and the gods to Harishchandra - హరిశ్చంద్రుడికి బ్రహ్మాదిదేవతలు ప్రత్యక్షమవ్వడం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిశ్చంద్రుడికి బ్రహ్మాదిదేవతలు ప్రత్యక్షమవ్వడం సూతు డిట్లనెను: అటుతర్వాత హరిశ్చంద్ర నరపతి చితిపై తనకొడుకు...