Thursday, April 16, 2026

Chapter 124 Vritra defeats the gods - అధ్యాయము 124 వృత్రుడు దేవతల నోడించుట

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 124

వృత్రుడు దేవతల నోడించుట

వృత్రాసురుడు వేదపారగులగు విప్రులచేత స్వస్తివచనములు చదివించుకొని యింద్రవధకు రథమెక్కి జయబలుదేరెను. వృత్రుడు బలశాలియని మునుపు సురలచేతిలో నోటుపడిన క్రూరరాక్షసులెఱిగి వృత్రుని సేవింప నేతెంచిరి. అట్లు బవరమునకు తరలివచ్చుచున్న రాక్షసులనుగని యింద్రదూతలు వేగ నింద్రునిజేరి వృత్రవృత్తాంతమిట్లు చెప్పిరి : 

స్వామీ! వృత్రుడు నీ శత్రువు. మహాబలశాలి. అతడు రథమెక్కి వచ్చుచున్నాడు. త్వష్ట తన పుత్రనాశమునకు మిగుల వగచి కోపముతో నభిచారమంత్రములతో నీ చావునకు వృత్రుని సృజించెను. వృత్రు డిపుడు రాక్షస పరివృతుడై దుస్సహుడై యున్నాడు. 

మేరుమందరసంకాశుడు అతడు ఘోరముగ శబ్దము చేయుచు వచ్చుచున్నాడు. మీరు సిద్ధపడుడు. అంతలో దేవతలు భయగ్రస్తులై యేతెంచి దూత మాటలు విని సురపతి కిట్లనిరి:

దేవేంద్రా! స్వర్గభూమిలో పెక్కు దుశ్శకునములు పొడముచున్నవి. పక్షులరావములు భయసూచకములుగా నున్నవి. మన భవనములు మీద కాకులు గ్రద్దలు మున్నగు పక్షులు దారుణముగ వికృతధ్వనులు చేయుచున్నవి. పక్షులు చీచీ కూచీ రావములు చేయుచున్నవి. వాహనముల కన్నులనుండి జొట జొట కన్నీరు గారుచున్నది. 

రాత్రియందు భవనాలమీద ఎవరి నోటనుండి వచ్చుచున్నదో తెలియని రోదన ధ్వను లతి దారుణ భీకరముగ వినబడుచున్నవి. పతాకలు గాలి లేకయే నేల బడుచున్నవి. ఇట్లు స్వర్గమునుండియు భూమ్యంతరిక్షములనుండియు పెక్కు మహోత్పాతము లుప్పతిల్లుచున్నవి. 

స్త్రీలు నల్లని చీరలు గట్టి వికృతముఖములతో నింటింట దిరుగుచు వెళ్లుడు వెళ్ళుడని కేకలు వేయుచున్నారు. దేవతాస్త్రీలు కలలందు రాక్షసుల కొప్పుపట్టి భయపెట్టి లాగినట్టుల గనుచున్నారు. ఉల్కాపాతములు-భూకంపముటు-భయకంపములు గల్గించుచున్నవి. 

రాత్రులందు నక్క లంగణములందూలలు పెట్టుచున్నవి. తొండల గుంపులు ప్రతి యింట పుట్టుచున్నవి. భుజాక్షిస్పందము అంగ ప్రస్థురణములు మెరమెరగల్గుచున్నవి. ఇట్లు పెక్కులు దుర్నిత్తములు గల్గుచున్నవి అను సరుల మాట లాలించి యింద్రుడు చింతాక్రాంతుడై బృహస్పతిని రావించి యతనికి తన భావమిట్లు తెల్పెను. 

ఓ మహాత్మా! ఇపుడు ఘోర దుర్నిమిత్తములు పెక్కులు గల్గుచున్నవి. గాలి బగబగ వీచుచున్నది. నింగి నుండి పడు ఉల్కలు కనకన లాడుచున్నవి. నీవు సర్వజ్ఞుడవు; విఘ్ననాశనమున దక్షుడవు; ధీశాలివి; శాస్త్రవేత్తవు; సురగురుడవు. ఇపుడు నీవు నా శత్రునాశమున కుపాయమాలోచించి నా చిత్తమునకు శాంతి చేకూర్చుము.

బృహస్పతి యిట్లనెను : ''ఓ సహస్రాక్షా! నేనేమి చేతును? నీవు నిరపరాధుడగు ముని తల నరకించి దుష్కార్య మొనర్చితివి. అందుచే నింతగ చపలత్వ మందితివి. తీవ్రములగు పుణ్యపాపములకు ఫలితము బిఱబిఱ గల్గును. సంపదలు గోరువారు వివేకముతో నాలోచించి చక్కగ చేయవలయును. 

ఇతరులకు బాధగల్గించు పని యెన్నడును చేయరాదు. అవివేక మాపదలకు మూలము. పరపీడాపరాయణుడు శాంతిజెందడు. ఓ యింద్రా! నీవు లోభమోహములకు వశుడవై బ్రహ్మహత్య చేసితివి. ఆ పాపఫలితమే యిది. సురలంద ఱొక్కటిగ జేరినను వృత్రుడు చంపబడడు. అతడు నిన్ను చంపుటకు దానవులను గూడి వచ్చుచున్నాడు. అతడు త్వష్టవలన వజ్రమునుబోలు పెక్కు దివ్యాయుధములు బడసి సిద్ధముగ నున్నాడు. 

మహావీరుడగు అతడు ప్రళయము పుట్టించుచు చావులేనివాడై యేతెంచుచున్నాడు అని యిట్లు గురుడు వచించుచుండగనే పెద్ద కోలాహలము చెలరేగెను. అంత గంధర్వ-కిన్నర-యక్ష-ముని-తాపసులు దేవతలు తమతమ నెలవులు విడిచి గజిబిజిగ పారిపోయిరి. అది చూచి యింద్రుడు విచారగ్రస్తుడయ్యెను. 

అతడు తన సేవకులను సైన్యమాయత్తము చేయుట కిట్టు లాజ్ఞాపించెను : వసు-రుద్ర-అశ్వినులు-దివాకరులు-పూష-భగ-యమ-వాయు-కుబేరులు సాయుధులై విమానములెక్కి రావలయును. శత్రువు మనపై దండెత్తివచ్చుచున్నాడు. అని యాజ్ఞనొసంగి యింద్రుడైరావతమెక్కి -బృహస్పతిని ముందిడుకొని తన మందిరము వెడలెను. 

దేవత లెల్లరును తమ తమ వాహనము లలంకరించిరి. వారు శస్త్రములు దాల్చి యుద్ధసన్నద్ధులై తరలిరి. అట వృత్రుడు దానవులనుగూడి మానస సరస్సునకు నుత్తరమున విడిసెను. అచట మంచి వృక్షములుగల పర్వతము గలదు. అది దేవతావాసమున కనువుగ నెలవు. ఇంద్రుడు నచ్చటి కేతెంచి పోరునకు గడంగెను. 

అతడు గురుని తన ముందుంచుకొని సురలతో నేతెంచెను. అంత వృత్ర వాసవులకు ఘోర సమరము సంఘటిల్లెను. వారికి గద-అసి-పరిఘ-శక్తి-బాణ-పాశములతో గొడ్డండ్లతో మానవకాల జీవనప్రమాణము ననుసరించి నూరేండ్లు పోరు సాగెను. ఆ పోరు నర-ఋషులకు భయము గల్గించెను. వరుణుడు వాయువు అగ్ని-యమ-ఇంద్రులు క్రమముగ నోటుపడి రణమునుండి పారిపోయిరి. 

అట్టు లింద్రాదులు పారిపోవుటను వృత్రుడు చూచి ప్రమోదముతో తన తండ్రి యాశ్రమము చేరి యతనికి ప్రణమిల్లి నీ చెప్పిన పని చేసితి' ననెను. మృగరాజును గని గజములు-మృగములు-పారిపోవును. అట్లే నన్ను గని యింద్రుడు సురలును పారిపోయిరి. ఇంద్రుడు పాదచారియై కాలికి బుద్ధి చెప్పెను. ఇదిగో! యైరావతమును తెచ్చితిని. స్వీకరింపుము. పిరికిపందలను చంపుట తగదని వారిని వదలిపెట్టితిని. ఓ తండ్రీ! నా చేయవలసిన పిన యింకేమో తెలుపుము. దేవతలును గడగడలాడుచు శ్రమజెంది పరుగిడిరి. ఇంద్రుడైరావతము వదలి కాలికొద్ది పరుగెత్తెను.

ఆ మాటలు విని త్వష్ట ముదమంది యిట్లనెను : నేను నేడు గదా నిజముగ పుత్త్రవంతుడ నైతిని! నా జీవితము నేడు గదా సఫలమైనది! నేను నీ వలన పవిత్రుడ నైతిని. నా మనోవ్యాధి తగ్గెను. నీ లోకాద్భుత విక్రమము గాంచి నా యెడద శాంతించినది. ఇపుడు నీకు మేలు బాట తెల్పెదను. వినుము. నీవు స్థిరాసముననుండి సావధానముగ తప మొనర్చుము. 

ఇంద్రుడు నానా విధముల మోసము చేయుటలో నేర్పరి. ఆతనిని నమ్మకుము. తపమువలన రాజలక్ష్ములు - విజయశ్రీలు - బలవృద్ధి గల్గును. బ్రహ్మవలన వరము బడయుము. బ్రహ్మహత్యాపాపి- దురాచారియగు నింద్రుని చంపుము. బ్రహ్మ మేళ్ళు గురియువాడు. అతని గూర్చి సావధానముగ తప మొనర్చుము. అతడు తుష్టిజెంది నీ కోరిక లీడేర్పగలడు. ప్రజాపతి తేజశ్శాలి. నీ వతనిని మెప్పించి యమరుడవు గమ్ము. పాపియగు నింద్రుని సంహరింపుము. 

పుత్త్రా! ఇంద్రుడు నా పుత్త్రుని చంపిన బాధ నన్ను పట్టి వేధించుచున్నది. నాకు కంటినిండ నిద్రపట్టుటలేదు. చిత్తశాంతి కఱవయినది. నా కొడు కే పాప మెఱుగనివాడు. తపస్వి. అత డొక పాపి చేతిలో చచ్చుటచే నాకు సుఖశాంతులు లేవు. ఈ దుఃఃతు నుద్ధరింపుము అను తన తండ్రి వచనములు విని తండ్రి యనుమతి బడసి కోపముతో వృత్రుడు తపమునకు గంధమాదనగిరి కేగెను. 

అతడు గంగలో గ్రుంకివచ్చి దర్భాసనము పై స్థిరాసనమున నుండెను. అన్నము నీరు వదలి ప్రాణాయామ పరాయణుడై ప్రజాపతిని చిత్తమందు గీలుకొల్పి ధ్యానించుచుండెను. అతడు తప మొనరించు టెఱిగి యింద్రుడు చింతాగ్రస్తు డయ్యెను. ఆత డతని తపోవిఘ్నమునకు గంధర్వులను-యక్ష-పన్నగ-సర్పములను-విద్యాధరాప్సరసలను పెక్కు దేవదూతలను పంపెను. వారెల్లరును మాయలు పన్ని వృత్రుని తపోవిఘ్నమునకు బూనుకొనిరి. కాని యా పరమతాపసు డే మాత్రము చలింపలేదు.

అధ్యాయము 125 వృత్రుడు స్వర్గము నలంకరించుట

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...