Thursday, April 23, 2026

Tarakasura Vijrumbhana - తారకాసుర విజృంభణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - తారకాసుర విజృంభణ

జనమేజయ డిట్లనెను : ఓ మునివరా| పరమ మహస్సగు శ్రీదేవి హిమగిరి శిఖరముపై నవతరించెనని మున్ను నీవు తెలిపితివి. దానిని విశదముగ తెలియపలుకుము. అమృతము త్రాగువానికి చావు వచ్చును. కాని శ్రీదేవీ దివ్యశక్తి కథారసామృతముగ్రోలు ధీశాలికి చావులేదు. అతని కెంత గ్రోలినను తృప్తి గల్గదు. 

వ్యాసు డిట్లనియెను: రాజా! నీవు ధన్యతముడవు-పుణ్యశాలివి. పెద్దనివలన బుద్ధి నేర్చినవాడవు. కనుకనే నీకు శ్రీదేవీ పదపద్మములందు నిశ్చలభక్తి కుదిరినది. రాజా ! అవధరింపుము. మున్నటుల నగ్నిలో సతీదేవి దగ్ధకాగా శివుడు వ్యాకులచిత్తముతో తిరిగివిసిగితుద కొకచోనుండెను. 

ఆయన సంసార వివిధ విషయములు విడనాడి సమాధిలో శ్రీ దేవీ స్వరూపమును ధ్యానించుచు కాలము గడువుచుండెను. అపుడు చరాచర ప్రపంచమంతయు కళాసౌభాగ్యములు కోల్పోయెను. గిరులు-సంద్రములు-దీవులు శక్తిహీనము లయ్యెను. ఎల్లర హృదయములందలి యానందరేఖలును సమసిపోయెను. ఎల్లలోకములు చింతాగ్రస్తములై దిక్కుమాలి యుండెను. అవి దుఃఖ సాగరమున మునిగి రోగగ్రస్తములయ్యెను. ఎల్ల సురలును-గ్రహములను గతులు తప్పిరి. 

రాజా! ఇదంతయును శ్రీసతీదేవి లేని కారణముననే జరిగెను. అట్టి చెడుకాలమున తారకుడను మహాసురుడు పుట్టెను. అతడు బ్రహ్మవలన వరముల బడసి త్రిలోకములకు నాయకుడయ్యెను. శివుని కన్న కొడుకు నిన్ను చంపగలడని బ్రహ్మయతనితో ననెను. ఇట్లు తారకుని చావు నీర్ణీతమయ్యెను. 

అప్పటికి శివునకు కుమారుడు డలుగనందున తారకు డహంకారముతో విఱ్ఱవీగుచుండెను. అతని మహోప ద్రవముల కెల్ల దేవతలును స్థానభ్రష్ఠులైరి. శివునకు కన్నకొడుకు లేమింపజేసి వారు చింతాక్రాంతులైరి. శంకరునకు భార్యయే లేదుగదా! కొడుకెట్లు గల్గును.? మన మెంతటి దురదృష్ట వంతులము. ఇక మనపని యెట్లు నెఱవేరగలదు.?

అని తలపోయుచు వేల్పులు వైంకుఠ మేగి యేకాంతమున హరికి సర్వము నివేదించిరి. అంత హరి వారి కొకయుపాయము చెప్పెను. మీరెల చింతింతురు? శివా భవాని కామకల్పతరువు-మణిద్వీపనివాసిని-భువనేశ్వరి. ఆమె మనపాలగలదు. దేవి- జగదేకమాత. మనకు బుద్ది చెప్పుటకొఱకే మన బాధలు గనియు నామె పట్టించుకొనకున్నది. అంతేకాని వేరేమియు గాదు. తల్లి తన పిల్లవానిని కొట్టునప్పుడును లాలించునప్పడును దయమాలి యుండదు. 

అటులే యీ జగన్ని యంత్రి మనము చేయు తప్పోప్పులకు దయమాలి యుండదు. అడుగడుగునకు కొడుకు తప్పులు చేయుచునే యుండును. వాని నెల్ల తల్లిగా కితరు లెవ్వరీ లోకమున సైచి యుండగలరు.కనుక మీరెల్లరును జాగుసేయక పరాంబికను పొపపొచ్చెములేని చిత్తముతో శరణువేడుడు. ఆమె మీ పనులన్నిటిని చక్కపఱచగలదు. అని వాక్రుచ్చి సురాధిపతియగు మహా విష్ణువు తన భార్యను వెంటగొని దేవతలనుగూడి బయలుదేరెను. 

విష్ణువు పర్వతరాజు మహాశైలమునగు హిమగిరి కేగెను. అట దేవత లెల్లరును దేవీమంత్ర పురశ్చరణ చేయసాగిరి. అంబాయాగ విధాన మెఱింగిన వా రంబాయాగము సాగించిరి. కొందఱు తృతీయాది వ్రత మాచరించుచుండిరి. మఱికొంద ఱంబను గూర్చి సమాధి నిమగ్నులైరి. ఇంకను కొందఱు శ్రీదేవీ నామజప పరాయణత్వమున నుండిరి. కొందఱు దేవీసూక్తము పఠించిరి. కొందఱు నవార్ణమంత్రము జపింపసాగరి. కొందఱు క్బచ్ర్చ చాంద్రాయణ వ్రతము సాగించిరి. కొంద ఱంతర్యాగపరులు. కొందఱు న్యాసపరులైరి. కొందఱు నిశ్చల ముగ పరాశక్తి యంత్రము పూజింపసాగిరి. 

No comments:

Post a Comment

The teachings of Goddess Jaganmata - జగన్మాత చేసిన జ్ఞానబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - జగన్మాత చేసిన జ్ఞానబోధ శ్రీ దేవి యిట్లనెను: దేవతలారా! సావధానముగ నా పలుకులు వినుడు: వానిని విన్నంత మాత్రాన ...