Saturday, April 18, 2026

Ashwini gods are entitled to drink Soma - అశ్వినీదేవతలకు సోమపానార్హత

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అశ్వినీదేవతలకు సోమపానార్హత

జనమేజయరాజా! చ్యవనుడట్లు సోమపాత్రము చేతబునినంతనే దేవేంద్రుడు కోపముతో తన బలము చూపుచు చ్యవనున కిట్లనెను: 

ఓ బ్రాహ్మబంధూ! వీరిని సోమపానముచే గౌరవింపవలదు. అట్లు చేసిన విశ్వరూపుని చంపినట్లు నిన్ను చంపగలను. అన 

చ్యవను డిట్లనెను: ఇంద్రా! ఈ మహాత్ములు నాకు రూపసంపద నొసంగిరి. వీరి నవమానింపకుము. వీరు నన్ను రెండవ దేవునివలె మార్చివేసిరి. దేవేంద్రా! నీవు తొలుత త్రావకున్న దేవతలును త్రాగరు. 

కనుక పరంతపులగు అశ్వి దేవతలను దేవతలుగ నెఱుంగుము. 

ఇంద్రు డిట్లనెను: ఓ మందమతీ! వీరు వైద్యులు. యజ్ఞమున సోమార్హులుగారు, ఒకవేళ వారికి సోమ మిచ్చినచో నీ తల తెగవ్రేతును. ఇంద్రుని మాట లెక్కచేయక భార్గవుడతనిని బెదిరించుచు సోమము గ్రహించెను. వారు సోమపాత్రము చేతుల ధరించి దప్పి దీర్చుకొనదలచిరి. 

అంతలో నింద్రుడు చూచి యిట్లనెను : వీరికై నీవు సోమము గ్రహించినచో నిన్ను రెండవ విశ్వరూపుని చంపినట్లు నా వజ్రముతో చంపుదును. ఇట్లు దేవేంద్రుడు పలుకగనే భార్గవు డభిమానపూర్వకముగ కోపముతో నశ్వినులకొఱకు సొమము యథావిధిగ చేబూనెను. ఇంద్రు డంత కోపముతో నెల్ల సురలు చూచుచండగ సూర్యకోటి ప్రకాశముగల తన వజ్రాయుధము మునిపై విసరెను.

అట్లు ప్రేరితమైన వజ్రమును చూచి చ్యవనమహర్షి తన తపోవీర్యముచే నమితతేజముగల యింద్రుని వజ్రమును స్తంభింపజేసెను. పిదప మహాబాహువగు మునిసత్తముడు దేవేంద్రుని చంపు తలంపుతో కృత్యకొఱకు మారణమంత్రములతో నగ్నిని వేల్చెను. 

చ్యవనుని తపోబలమున కృత్య యుత్పన్నమయ్యెను. కృత్యవలన మహాబలము-గొప్పకాయముగల క్రూర మహాసురుడు గల్గెను. 

అతని పేరు మదాసురుడు. అతడు ఘోరుడు ప్రాణులకు భయంకరుడు. వాని మేను పర్వతమంత గలదు. వాని వాడికోఱలు భయంకరములు. అతని నాల్గుకోఱలు నూఱు యోజనములంత గలవు. తక్కిన కోఱలు పది యోజనములంత గలవు. వాని భుజములు పర్వతములంతటివి. చూపులు క్రూర భీకరములు. నాలుక భయంకరముగ గగన తలమును నాకునేమో యనున ట్లుండెను. 

వాని మేను గిరిశిఖరమువలె కఠిన భీకరముగ నుండెను. గోళ్ళు వాడి పులిగోళ్ళు, వెండ్రుకలు వెఱపు గొల్పునవి. వాని శరీరము నల్లగ కాటుకకొండవలె నుండెను. ముఖమతిభయంకరము. కన్నులు దావాగ్నులవలె భీషణ భయంకరములు. వాని యొక దౌడ నేలను వేరొకటి నింగిని తాకు నట్లుండెను. ఈ విధముగ పెద్ద శరీరముగల మదుడను పేరుగల యసురుడు పుట్టెను.

అతనిని చూడగనే వేల్పు లెల్లరు భయకంపితులైరి. ఇంద్రు డంతటివాడే భయత్రస్తుడై యుద్దము మాట మఱచి పోయెను. ఆ దైత్యుడు తన పెద్దనోట వజ్రము పట్టుకొని ఘోరమైన చూపులతో ముల్లోకములను వ్యాపించు నట్లుండెను. అతడు క్రుద్దుడై యింద్రుని మ్రింగబోయెను. అయ్యో! హతులమైతిమని వేల్పు లెల్ల రొక్కపెట్టున పెద్దగ విలపించిరి. 

ఇంద్రుని భుజములు కదలకస్తంభిచిపోయెను. అతడు వజ్రము వ్రేటువేయుట కశక్తుడయ్యెను. వజ్రహస్తుడగు దేవేంద్రుడు కాలాంతకుడగు దనుజుని చూచి యేమియు తోచక సమయకోవిదుడగు గురుని తలంచెను. ఉదార హృదయుడగు గురుడు తన్ను దలంచినంత మాత్రన యేతెంచెను. 

అప్పటి సమయము కష్టకాలమని యెఱింగెను. గురుడు కృత్యనుగూర్చి యాలో చించి యితడు మహామంత్రములకుగాని వజ్రమునకుగాని సాధ్యుడుగాడని యింద్రుతో ననెను. మహాబలుడగు మదాసురుడు చ్యవనమహర్షి తపోబలమున యజ్ఞకుండమునుండి పుట్టెను. 

దేవేశా! ఇపుడీ యసురుని దేవతలుగాని నీవుగాని నేనుగాని వారింపజాలము. కనుక చ్యవనమహామునిని శరణు పొందుము. శ్రీపరాభట్టారికా భక్తులకు కోపము వచ్చినచో దానినెవరును వారింపజాలరు. చ్యవనుడు తన కృత్యను తానే వారింపగలడు. 

అని గురుడు పలుకగ దేవేంద్రుడు చ్యవనముని సన్నిధికేగి భయవినయములతో తలవంచి నమస్కరించి యిట్లు పలికెను.

మునివరేణ్యా ! సర్వజ్ఞా! నా తప్పు క్షమింపుము. నా పైకి వచ్చుచున్న దనుజుని వారింపుము. ప్రసన్నుడవు కమ్ము. నీ మాట చెల్లింతును. భార్గవా: బ్రాహ్మణోత్తమా! ఈనాటినుండి యశ్వినులు సోమపానమునకు తగినవారగుదురు. నామాట నిజము. నాయెడ దయ చూపుము. 

తపోధనా! ధర్మజ్ఞా! నీ ప్రయత్నము వమ్ముగాదు. నీవు వ్యర్థమైన పనియేదియు చేయవని నాకు తెలియును. అశ్వినులు నీచే నిరంతరముగ సోమపాయులైరి. ఈ శర్యాతిరాజు కీర్తియు శాశ్వతమయ్యెను. 

మునిసత్తమా! నేను చేసిన పనియంతయును నీ తపోవీర్యము నల్గురికి వెల్లడించుటకు నిన్ను పరీక్షించుటకే చేసితిని. బ్రాహ్మణవర్యా! మదాసురుని సంహరింపుము. మమ్ము కనికరింపుము. 

ఎల్ల వేల్పులకు మేలు చేకూర్చుము. అను దేవపతి మాటలువిని పరమార్థవిదుడగు చ్యవనుడు విరోధమువలన గల్గిన కోపమును తీసివేసికొనెను. ఇట్లు భార్గవుడింద్రు నూరడించి మదాసురుని స్త్రీలు త్రాగుడు జూదము వేట యును నాల్గుచోట్లనుండ నియమించెను. 

ఇట్టు ముని దేవేంద్రునోదార్చి మదుని మదమడచి దేవతలను తమ తమ స్థానములకంపి యజ్ఞమును పూర్ణ మొనరించెను. ఆ పిదప సర్వధర్మాత్ముడగు భార్గవుడు పవిత్రమైన సోమమును దేవేంద్రునిచే అశ్వినులచే త్రాగించెను.

రాజా! ఇట్లు రవిపుత్రులు-ఆర్యులు నగు అశ్వినులను చ్యవనమహర్షి తన తపోబలమున సోమపాయులుగ జేసెను. నాటినుండి యా సరస్సు యూపమండితమై యలరారెను. చ్యవన మున్యాశ్రమము భూమిపై ప్రఖ్యాతి గాంచెను. 

అట్లు శర్యాతియు చ్యవనుని మహిమను సంతుష్టుడై జన్నము పూర్తి గావించి మంత్రులగూడి తన నగరి కరిగెను. ఇట్లు ముసుపుత్రుడగు శర్యాతి ప్రతాపముతో ధర్మజ్ఞతతో చక్కగా రాజ్య మేలెను.

అతని కొడు కానర్తుడు. ఆనర్తుని కొడుకు రేవతుడు. రేవతుడు సాగరములో కుశస్థలియను పురము నిర్మంచి యానర్తాది దేశములలోని భోగభాగ్యములను నిరాటంకముగ ననుభవించెను. 

రేవతునకు నూర్గురు కుమారులు. పెద్దవాడు కుకుద్మిఉత్తముడు. కూతురు రేవతి. ఆమె సుందరి-శుభలక్షణ. తన కొమరితకు పెండ్లి వయస్సు రాగానే రేవతుడుత్తమ కులసంజాతులగు రాజపుత్రుల గుఱించి యాలోచించెను. 

అతడు రైవతగిరిపై నివసించుచు విక్రమముతో ఆనర్తాదిదేశము లందు రాజ్యము చేసెను. అతడు తన కూతు నెవని కీయవలయునో తెలియదలచి సురపూజితుడు సర్వజ్ఞుడునైన బ్రహ్మ సన్నిధి కేగదలచెను. 

ఇట్లు తలంచి రేవతుడు రేవతిని తోడ్కొని పితామహు నడుగుటకు బ్రహ్మలోకము జేరెను. ఆ బ్రహ్మ లోకమునందు ఎల్లదేవతలు యజ్ఞములు ఛందములు గిరులు సాగరములు సరస్సులు దివ్యరూపములు దాల్చి వెలుగొందుచుండెను. అట మఱియును సిద్దులు గంధర్వులు ఋషులు చారణులు పన్నగులు మున్నగువారు చేతులు జోడించి బహ్మనుసంస్తుతించుచుండిరి.

రేవతుడిసత్యలోకయాత్ర

No comments:

Post a Comment

Aruna's moral teaching - అరుణుడు చేసిన నీతిబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అరుణుడు చేసిన నీతిబోధ పుత్రా! ధర్మమందు బుద్ధి నిల్పుము. విప్రులు గౌరవపాత్రులు. న్యాయముగ ధనము సంపాదించవలయును...