Thursday, April 16, 2026

Chapter 129 Indrani visits Sridevi - అధ్యాయము 129 ఇంద్రాణి శ్రీదేవిని సందర్శించుట

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 129

ఇంద్రాణి శ్రీదేవిని సందర్శించుట


అంతట శచీదేవి బృహస్పతిని శరణు వేడెను. అది విని నహుషుడు తాళలేని మదనబాణ బాధచే బృహస్పతిపై క్రుద్ధుడయ్యెను. 'గురుడు మూఢుడు. అతడింద్రాణికి తన యింట నాశ్రయ మిచ్చెనని వింటిని. కావున నతని చంపుదు' నని నహుషుడు దేవతలతో ననెను. అత డట్లు కుపితుడగుట గాంచి దేవతలు క్రూర నహుషునితో సామవచనములతో నిట్లనిరి: 

'రాజా! కోప ముడుగుము. పాపబుద్ధి వదలుము. పరభార్యను గూడుట ధర్మశాస్త్రములు నిషేధించును. ఇంద్రుని భార్య పతివ్రత. సాధ్వి. ఆమె తన పతి బ్రదికియుండగ మరొక్కని నెట్లు పతిగ బడయగలదు? నీవు త్రిలోకపతివి గదా! ధర్మశాసకుడవే! నీవంటివాడధర్మ మాచరించినచో నిక ప్రజలు తప్పుడు త్రోవలు పట్టకుందురా? ప్రభువగు వాడు శిష్టాచారము గాపాడవలయును. ఇచట శచిని బోలు దేవకామినులు నూర్లకొలదిగ గలరు. శృంగార రసమునకు రతిస్థాయిభావమని సాహితీవేత్తలందురు. స్త్రీని బలాత్కరించినచో రసభంగమగును. 

రాజా! ప్రేమ రాగబంధము ఇర్వురిలోన సమానముగ నున్నచో వారిలోని రసానందము పెంపువహించును. ఇంత గొప్ప దేవేంద్ర పదవి నలంకరించితివి. పరభార్యలను గలియునట్టి చెడుతలంపు వదలుము. మంచి మేలు తలంపులు గల్గియుండుము. సిరిసంపదలు పాపము వలన తరుగును. పున్నెమువలన పెరుగును. కునుక పాపచింతన వదలి సద్భావము గల్గియుండుము' అన 

నహుషు డిట్లనెను : 'సురలారా! ఇంద్రుడు గౌతమపత్నిని చంద్రుడు గురుపత్నిని ననుభవించిననాడు మీరెక్కడ ఉంటిరి? మీరందరును పరోపదేశమున పండితులే. కాని, వారిలో స్వయముగ నాచరించి బోధించువాడు దొరకుట దుర్లభము. శచీదేవిని నా చెంతకు గొనిరండు. దానివలన మీకును ఆమెకును మేలు గల్గును. సుఖములు గల్గును. నేను నిజము చెప్పుచున్నాను. నా మదికి మఱి దేనివలనను శాంతి చేకూరదు. ఆమెను బలముతోగాని వినయమున, గాని తెచ్చి నాతో గూర్చుడు.'

నహుషుని మాటలు విని సురలు మునులు భయత్రస్తులై కామార్తుడగు నహుషునితో మే మింద్రాణితో సామవచనములు పలికి యామెను నీ చెంతకు చేర్తు'మని పలికి గురు నింటి కేగిరి. వేల్పులు గురునకు ప్రణమిల్లి యిట్లనిరి : 

'ఇంద్రాణి మీ యింట తలదాచుకొనుట మే మెఱుగుదుము. ఆమెను నహుషున కీయవలయును. మేము నహుషు నింద్రుని జేసితిమి. ఆ వరవర్ణిని యాతనిని పతిగ వరించును గాక!' ఈ పరుషవాక్కులు విని బృహస్పతి సురలతో శచీదేవి సాధు శీల, నన్ను శరణు బొందినది. నే నామెను విడువను.' అనగా సురలు ఐనచో నహుషుడు సంతృప్తి జెందుటకు తగిన యుపాయ మాలోచింపుడు. కానిచో నతనికి కోపము రెచ్చిపోవును. అపు డతడు దుస్సాధ్యు డగును.' అన 

గురు విట్లనియెను : 'శచీదేవి యచటి కేగి యతని కాసగొల్పి' నా పతి మరణించినచో నిన్ను సేవింపగలను. ఇంద్రుడు బ్రతికి యున్నచో మరొక్కని నెట్లు గొల్వగలను? కనుక నా మహాత్ముని వెదకుటకు నేనేగలవయును.' అని యామె శపథముచేసి నహుషుని వంచించి నా మాట చొప్పున తన పతిని రప్పించుటకు యత్నింపవలయును.' అని యిటు లందఱును కూడ బల్కుకొని దేవతలును బృహస్పతియును శచీదేవిని తోడ్కొని నహుషుని చెంత కేగిరి. 

అట్లు వారు శచీదేవితో నేతెంచుటగని సంతసించుచు నామెతో 'కాంతా! చారులోచనా! నేను నేడు నిజముగ నింద్రుడ నైతిని. నేను ముల్లోకములకు పతిని. పూజ్యుడను. నన్ను పతిగ గొల్వుము. నేను నీ పతి నైతిని.' అనగా 

శచీదేవి గడగడలాడుచు సిగ్గుతో నతని కిట్లనెను : 'రాజా! సురవరా! నీవు నా కొక వర మీయవలయును. ఇంద్రుడు బ్రతికియుండి ఎటనైన దాగెనా చచ్చెనా యను సందేహము నా మదిలో నున్నది. దాని నెఱుగువఱకు కొంచె మోపిక యవసరము. అది నాకు నిశ్చయమైన పిమ్మట నిన్ను చేరగలను. 

రాజా! అంతమటుకు తాళుము. నా మాట నమ్ముము. ఇదే నీవు నా కీయదగు వరము.'' అని యామె పలుకగ నహుషుడు మొదము వెలిపుచ్చి సరే యని సంతోసముతో నామెను వదలి పెట్టెను.

అట్టు లామె విడువబడి సురలతో మీరెల్లరింద్రుని రాకకు బాగుగ ప్రయత్నములు సల్పుడు అనిన'శచి పవిత్ర వాక్కులు దేవతలెల్లరు విని ఇంద్రునికై తీవ్రముగ నాలోచించిరి. అంతట గాలించిరి. శ్రీ వైకుంఠమేగిరి. వారు జగన్నాథుడు శరణాగత వత్సలుడు ఆది దేవుడునగు విష్ణుని సంస్తుతించి యుద్విగ్న మానసులైందేవదేవా! ఇంద్రుడు బ్రహ్మ హత్యా పీడితుడై యెవరికంటబడ కెటకో వెళ్ళెను. 

అతడు నీ ప్రేరణవలననే విప్రుని జంపి బ్రహ్మ హత్యా పాపమొడిగట్టుకొనెను. కనుక నిపుడతనికి మాకును నీవే శరణ్యము. మేము విపన్నులము. ఇంద్రునకు విముక్తి గల్గించుము.'' అని వేడుకొన దేవతల దీనవచనములు విని 

విష్ణువు వారికిట్లనియెను : ఇంద్రుడు తన పాప పరిహారమున కశ్వమేధయాగ మొనరించవలయును. అశ్వమేధ యాగము పుణ్యప్రదము. దానిచే అతడు పాపముక్తుడగును. అతడు మరల నమరులకు పతియై యింద్రత్వమందగలడు. శ్రీ జగదంబికాదేవి యశ్వమేధ యాగమునకు ప్రసన్నయగును. 

ఆ తల్లి బ్రహ్మహత్యా దోషమును తప్పక తొలగించి వేయగలదు. ఆ దేవినొక్కమారు సంస్మరించిన మాత్రన పాపరాసులు పటాపంచలగును. ఇంక దేవీ ప్రీతి కశ్వమేధయాగమొనర్చిన గలుగు ఫలితమెంతని చెప్పగలము? ఇంద్రాణియు నిత్యము శ్రీదేవీ పూజలాచరింపవలయును. శివారాధన వలన తప్పక యోగక్షేమములు గల్గును. 

మహాదేవి మాయకు నహుషుడు మోహితుడుగా గలడు. అతడు తన పాపఫలితముగ కచ్చితముగ నశింపగలడు. ఇంద్రు డశ్వమేధమున పవిత్రుడై తన పూర్వ వైభవమున విరాజిల్లగలడు. ఇంద్రుడు కొలది కాలమునకు తన యింద్రాసనము తిరిగి యధిష్ఠింపగలడు.'' అను మహాతేజస్వియగు విష్ణుని మధుర వాక్కులు సురలు వినిరి.

అంత దేవతలింద్రుడున్నయెడ కిరిగిరి. సురలు గురుని మున్నిడుకొని యింద్రునూరడించిరి. వారింద్రుని చేత నశ్వమేధ మహాయాగ మొనరింపజేసిరి. ఇంద్రుడు తన బ్రహ్మహత్యా పాపమును విభజించి తరువులందు - నదులందు - గిరులందు - భూమియందు - స్త్రీలయందు నుంచెను. ఇట్లు పాపమును వదలించుకొని యింద్రుడు పాపముక్తుడయ్యెను. రోగ రహితుడయ్యెను. 

అతడు సుకాలమునకు దారితెన్నులు జూచుచు పద్మనాళమునం దదృశ్యుడై దాగియుండెను. ఈ విధముగ విబుధులద్భుత కార్యమొనరించి తమ తమ నెలవుల కరిగిరి. అంత నింద్రాణి తన పతి విరహమున బాధపడుచు బృహస్పతితో ఇంద్రుడు యాగమొనరించియు నదృశ్యుడుగ నేలయుండెను? నా ప్రియస్వామిని దర్శించునుపాయము సెలవిమ్ము అనగా 

బృహస్పతి యిట్లనెను : 'ఓ శచీదేవీ! నీవు భగవతియగు శివాదేవి నారాధింపుము. ఆ తల్లి నీకు పాపరహితుడగు నీ పతిని చూపగలదు. జగన్మాతను చక్కగ నారాధించుము. ఆమె నహుషు నోడించగలదు' అది విని యింద్రాణి బృహస్పతి నుండి శ్రీ దేవీ సిద్ధిమంత్రమును విధి పూర్వకముగ గ్రహించెను. 

ఆ విధముగ నింద్రాణి గురుని నుండి మంత్రము బడసి భువనేశ్వరీ దేవిని బలులతో పుష్పార్చనలతో నారాధించెను. ఆమె తన భోగ సామగ్రినంతయు విడనాడి తపస్వినీ వేషముదాల్చి తన ప్రియుని దర్శించు కుతూహలముతో దేవీ నిత్యపూజలాచరించెను. కొంత కాలమునకు శ్రీ రాజరాజేశ్వరి దేవి సుప్రసన్నయై సౌమ్య రూపిణియై రాయంచనెక్కి యింద్రాణికి ప్రత్యక్ష దర్శన భాగ్యమొసంగెను.

శ్రీ దేవి కోటిసూర్య తేజస్విని చంద్రకోటి సమశీతల కోట్ల మెఱపు తీగెల మిఱుమిట్లు గొల్పునది సకల వేద సంపన్నురాలు. పాశ అంకుశ - వర - అభయ కరాంబుజ. మెడనుండి పాదముల వఱకు చెన్నొందు ముత్యాల హారము గలది. కమ్మతమ్ములముతో చిందులాడు చిఱుత నగవుల తల్లి; లోచనత్రయ విభూష; ఆ బ్రహ్మకీట జనని అవ్యాజకరుణా రస సాగర అనంతకోటి బ్రహ్మాండనాయిక మహేశ్వరి అమృత నవరసముల నిండారిన శాంత కుచ ద్వంద్వ విరాజిత. సర్వేశ్వరి - సర్వజ్ఞ - కూటస్థ - అక్షర స్వరూపిణి - సుప్రసాదమూర్తి. దేవి పూజామగ్నయగు శచీదేవిని గని మేఘ గంభీర భాషలతో నిట్లనియెను : 

వాంఛితము కోరుకొనుము. నీ పూజా పరాయణతకు సంతసించితిని. నేనిపుడు వరదాయినినై వచ్చితిని. నా దర్శన మందఱికి నంత సులభముగ నగునది కాదు. నా దివ్య సందర్శనము కోట్ల జన్మ జన్మముల పుణ్య పరిపాకమున గాని లభింపదు. అంత నింద్రాణి శ్రీ దేవికి ప్రణామము లొనరించి సుప్రసన్నయగు పరమేశ్వరి నీ విధముగ ప్రార్థించెను. 

'మాతా! అదృశ్యుడగు నా పతిని చూడగోరుచున్నాను. నాకు నహుషుని భయము తొలగవలయును. స్వర్గ పదవి లభింపవలయును.' అన 

దేవి యిట్లనెను : 'నీవీ దూతిక వెంట శ్రీ మానస సరోవరము జేరుము. అచట శ్రీ విశ్వకామయను పేర నా దివ్యమూర్తి గలదు. అచట భయపీడితుడగు నీ పతిని దర్శింపగలవు. విశాలాక్షీ! స్వస్థురాలవు గమ్ము. నీ కోర్కి యీడేర్తును. కొద్ది కాలమునకు నహుషుని మాయామోహితుని జేసి స్వర్గచ్యుతుని జేయగలను.' 

అపుడు దేవీ దూతిక త్వరితముగ నింద్రాణిని గొనిపోయి ఇంద్రుని చెంతకు చేర్చెను. ఇంద్రాణి రహస్యముగ దాగిన తన పతియగు సురపతిని గాంచెను. తన చిరకాల వాంఛితము తీరినందున శచీదేవి పరమానంద భరితురాలయ్యెను.

No comments:

Post a Comment

Chapter 136 History of Nimi - అధ్యాయము 136 నిమి చరిత్రము

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 136 నిమి చరిత్రము జనమేజయు డిట్లనెను : వ్యాసమహర్షీ! వసిష్ఠుని పునర్జన్మము గుఱించి వివరించితివి. అ...