Thursday, April 16, 2026

Chapter 127 Sridevi kills Vritra - అధ్యాయము 127 శ్రీదేవి వృత్రుని సంహరించుట

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 127

శ్రీదేవి వృత్రుని సంహరించుట

ఈ ప్రకారముగ తపోధనులగు ఋషులను దేవతలును శ్రీదేవి దయచే వరములంది తమలోతాము కూడబల్కుకొని వృత్రు నాశ్రమము జేరిరి. వారు నిజ తేజమున వెలుగొందు వృత్రుని గాంచిరి. అతడు ముల్లోకములను బూది సేయువాడేమో అనునట్లును దేవతలను మ్రింగజూచువాడేమో అనునట్లు నుండెను. ఋషులను దేవకార్యార్థము సరసములు సామములు నగు వచనములతో నిట్లనిరి : 

వృత్రా ! మహానుభావా! సర్వలోకభయంకరా! ఈ బ్రహ్మాండమంతయును నీతో నిండియున్నది. ఇంద్రునితో పగపూనుటవలన నీకు సుఖము గల్గదు. మీ యిర్వురకును దుఃఖకరమగు చింత మిక్కుటయగుచున్నది. అందువలన నీవుగాని యింద్రుడుగాని సుఖముగా నిద్రింపజాలకున్నారు. మీ యిర్వురికిని పోరితము మొదలయి చాలాకాలమైనది. ఐనను మీలో నుండి వైరి భయము వెత యింతవఱకును దొలగుటలేదు. 

మీ కారణముగ సురాసుర నరులెల్లరును బాధలు పడుచున్నారు. ఈ జగతిలో ప్రతివాడును సుఖము లందవలయును. వైరద్వేషములు గలవానికి సుఖశాంతులు సున్న. సమరకోవిదులు రణమును ప్రశంసింతురు. శృంగార ప్రియు లింద్రియ బాధాకరమగు యుద్ధమునకు దిగరు. వారు పూలతోనైన నొకరినిన గొట్టరు. ఇక బాణములతో గొట్టుదురా? యుద్ధమునందు విజయము సందేహముతోగూడి యుండును గదా! అందు బాణఘాతములు మాత్రము తినక తప్పదు. 

ఈ విశ్వమంతయును దైవాధీనము. జయాపజయములును దైవాధీనములే. అని యెఱింగిన వాడెప్పుడు నెక్కడ నెవ్వరితోను పోరడు. సరియగు కాలమున స్నానము - భోజనము - సుఖనిద్ర - పతివ్రతయగు భార్య-యివి నరునకు సుఖసాధనములు. రణమునందు బాణవర్షములు గురియును. రణము ఖడ్గ ప్రహారములతో దారుణముగ నుండును. 

కనుక పోరువానికి సుఖమెట్లుండును? రణములో చచ్చినవానికి స్వర్గసుఖములు గల్గునందురు. కాని, యీ మాట కొండంత యాస గొల్పి రణమునకు ప్రేరించునది మాత్రమే. కనుక స్వర్గకాంక్ష పనికిమాలినిది. వీరుడు తన దేహమును వెతలపాలుచేసి దానిని నక్కల గ్రద్దల పాలు సేయును.

ఇక స్వర్గసుఖము లందుట కే మందమతి కోరుకొనును? అవి నశ్వరములు. కనుక నీ వింద్రునితోడ నేస్తము గల్గి యుండుట మంచిది. దాని వలన నీకు సుఖము, ఇంద్రునకును సుఖము. ఇక గంధర్వాదులు తాపసులు మేము నిజాశ్రమముల కేగుదుము. మే మచ్చట సుఖముగ వసింపగలము. 

కనుక మీరిక వైరము తల పెట్టకూడదు. రేబవళ్ళు పోరు సల్పరాదు. అట్లు మీరు పోరినచో కిన్నర గంధర్వులకు నరములనులకు బాధలు గల్గుచుండును. మే మెల్లప్పుడును శాంతికాలముల క్షేమము కాంక్షింతుము. ఇంద్రుడు నీవు సుఖముగ నుండుటే మా వాంచితము. మీకు చెలికారము గల్గుటకు మేము మీకు మధ్యవర్తులముగ నుందుము. మేము మీ చేత శపథములు చేయింతుము. మీలో మీకు ప్రేమ గూర్తుము. 

ఇంద్రుడు నీ యెదుట ప్రతినలు పూనగలడు. అతడు నీకు ప్రీతి గల్గునట్లు వర్తింపగలడు. ఈ సూర్యుడు ఈ జనములు సర్వము సత్యాధారములు. గాలియును సత్యమువలననే వీచును. జలరాశియును సత్యకారణముగ తన వేల నతిక్రమింపకున్నది. 

కనుక మీ యిర్వురకు చెలిమి కలుగుగాక! మీ రొకేచోట నిదురించుట విహరించుట జలకేళి సల్పుట మంచిది. అన్ని పనులును మీరు కల్లు కోలు తనముతో చేయుట మంచిది. అని యిట్లు మహర్షులు వచించిన వాక్కులు విని 

వృత్రు డిట్లనెను : ఓ మహానుభావులారా! మీరు పరమ మునులు. తాపసోత్తములు. గౌరవపాత్రులు. అబద్ధము లాడనివారు. పరమశాంతులు. సదాచార సంపన్నులు. మోసములు తెలియనివారు. ఇంద్రుడు మాత్రము వైరి. లంపటుడు. శఠుడు. సిగ్గుమాలిన వాడు. అట్టి యింద్రునితో బుద్ధి మంతు డెట్లు కలిసిమెలసి యుండగలడు? అతడు బ్రాహ్మఘాతుకుడు-శఠుడు-టక్కరి- మాయలమారి - సిగ్గుమాలినవాడు.

ఇట్టి చెడు లక్షణములవాని నెప్పుడును నమ్మరాదు. మీరు సాధువులు. పరులకు కీడు తలపెట్టనివారు. మీరు పరమశాంతులగుట వలన దుష్టుల చిత్త మెఱుగజాలకున్నారు అన 

మును లిట్లనిరి : ప్రతి ప్రాణియను తన మంచిచెడ్డల ఫల మనుభవించును. ప్రణష్టచిత్తుడు పరులకు ద్రోహముచేసి యెట్లు శాంతి పడయగలడు? ఇక విశ్వాసఘాతుకులు మిత్రద్రోహులు తప్పక నరకయాతన లనుభవింతురు. విశ్వాసఘాతకుడు దుఃఖముల పాలగును. బ్రహ్మహత్య సురాపానము చేసిన వానికి ప్రాయశ్చిత్తము గలదు. 

కాని విశ్వాసఘాతుకులకు మిత్రద్రోహులకు మాత్రము ప్రాయశ్చిత్తము లేదు. కనుక నీ మదిలోని నియమమును వెల్లడి చేయుము. అట్టి నియమము ప్రకారముగ మీ మధ్య సంధి జరుగగలదు. అన 

వృత్రుడిట్లనెను: 'ఓ విప్రవరులారా! నే నెండిన - తడిసిన - దారుణమైన వస్తులచేగాని రాళ్లచేగాని వజ్రముతోగాని యింద్రునిచేగాని సురలచేగాని రేబవళ్ళుగాని చావకుండవలయును. ఈ నియమాలు మీ రొప్పుకొన్నచో నే నింద్రునితో సంధి కంగీకరింతును. కాని మరే విధమున గాదు.' 

వ్యాసుడిట్లనెను : అంత ఋషు లెల్లరు నట్లే యని యతని మాట నొప్పుకొనిరి. అపుడు వారు సురపతి నాహ్వానించి వృత్ర నియమము లన్నియు వినిపించిరి. ఇంద్రుడును రోష ముడిగి అగ్ని సాక్షిగ మునుల సమక్షమున శపథములు చేసెను. ఇంద్రుని ప్రతినలను వృత్రుడు నిజమనుకొనెను. ఆనాటి నుండియు వృత్రుడు సురపతితో మిత్రుని వలె మెలగుచుండెను. 

వారొక్కప్పుడు నందనవనమున మరొక్కప్పుడు గంధమాదనమున ఇంకొకప్పుడు సాగరతీరములందు పొరపొచ్చెములు లేక సంతోషముతో విహరించుచుండిరి. ఇట్టి సంధికి వృత్రుడు ప్రమోదభరితడయ్యెను. కాని యింద్రుడు మాత్ర ముద్రేకముతో రంధ్రాన్వేషణ సేయుచు వృత్రుని వధించు నుపాయములు పన్నుచుండెను.

అట్లు చాలకాలము గడచిపోయెను. వృత్రునకు కపటి అగు సురపతి యందు నమ్మకము గట్టిపడెను. అట్లు కొన్ని యేండ్లు గడచెను. ఇంద్రుడు మాత్రము వృత్రుని చంపు నాలోచనలోనే మునిగియుండెను. 

ఒకనాడు సురపతిని నమ్ముకొని యున్న వృత్రుని పిలిచి 

విశ్వకర్మ యిట్లనెను: 'మహాత్మా! వృత్రా! నా మాట వినుము. ఒకేసారి వైరము మాని నెయ్యము బూనిన వానిని నమ్మరాదు. ఇంద్రుడు నీ శత్రువు. అసూయాపరుడు. లోభి మత్తుడు ద్వేషి పరదారలంపటుడు. పాపమతి దుఃఖితుడు పరపీడనపరుడు. రంధ్రాన్వేషి-మాయావి. బహురూపి. ద్రోహమదగర్వములు గలవాడు. అతడొకప్పు డసూయతో తన తల్లి గర్భముజొచ్చెను. అందేడ్చుచున్న శిశువును నలువదితొమ్మిది భాగములుగ ఖండించెను. 

కనుక కుమారా! అతని నెన్నడును నమ్మియుండకుము. ఒకసారి పాపము చేసినవాడు మరొకసారి చేయుటకు వెనుకాడునా?' అని యిట్లు వృత్రుని తండ్రి సహేతుకముగ బల్కెను. కాని వృత్రుడు తన తండ్రి హితములలోని నిజమెఱుగలేకపోయెను. ఒకనాడింద్రుడు వృత్రుని సముద్రతీరమున గాంచెను. అది సంజవేళ - దార సుముహూర్తము. ఇపుడింద్రుడు బ్రహ్మవరము గుర్తు తెచ్చుకొనెను. 

ఇంద్రుడిట్లు తలపోసెను: ఇపుడు రాత్రిగాని పగలుగాని కాని సంధ్యాసమయము-ఇత్తఱి నా మహాబలమున వృత్రుడు చంపబడగలడు. ఇది నిర్జనప్రదేశము. ఇంత డొంటరివాడు. ఇది మంచి సమయము. ఇతడు నాకు జిక్కినాడు అని నెమ్మదిననుకొని యింద్రుడవ్యయుని హరిని స్మరించెను. అంతపురుషోత్తముడగు శ్రీహరివచ్చి వజ్రాయుధములో అదృశ్యముగ దాగియుండెను. ఇట్లు తలపోసియు నింద్రుడు తన శత్రువగు వృత్రుని రణమున నెట్లు చంపగలనని మరల తలంచెను.

వృత్రుడు దేవదానవుల కజేయుడు. ఒకవేళ నే నతనిని వంచించి నా బలముతో నతనిని చంపలేక పోవచ్చును. అపుడు నా శత్రువు బ్రతుకును. ఇక నా గతి దుర్గతియే అనుకొనుచు అంతలో నింద్రుడు సాగరమునందు పర్వతమువలె పెరుగుచున్న నురుగు చూచెను. ఈ నురుగు తడిసినదిగాదు. ఎండినదిగాదు. ఇది శస్త్రముగాదు అనుకొని యింద్రుడు నీటి నురుగును దీసికొనెను. 

శ్రీ భవానీ దేవిని మహాశక్తిని మనసార సంస్మరించెను. స్మృతి మాత్రన శ్రీదేవిసంహరిణీశక్తి నురుగులో జేరెను. హరిబలముతో బలముపుంజుకొనిన వజ్రాయుధము నురుగుచే గప్పబడెను. అట్టి వజ్రము చేబూని యింద్రుడు వృత్రుని వ్రేటువేసెను. ఆ దెబ్బకు వజ్రముచే గొట్టబడిన గిరివలె వృత్రుడు నేలగూలెను. వృత్రుడు నేలగూలగనే వజ్రి సంతుష్టుడయ్యెను. 

అంత నింద్రు డే పరాశక్తి నాశ్రయించి వృత్రుని చంపెనో యా దేవిని పూజించి పలువిధములగు సంస్తుతులతో నామెను ప్రసన్నురాలిని జేసెను. ఇంద్రుడు నందనోద్యానమందు శ్రీపరాశక్తి మందిరము నిర్మించి యందు పద్మరాగమణిమయమగు దేవీ విగ్రహమును ప్రతిష్ఠింపజేసెను. నాటినుండి విబుధులెల్లరును సంధ్యాసమయములందు దేవదేవిని పూజించుచుండిరి. 

శ్రీదేవి దేవతలపాలిటి కల్పతరువయ్యెను. దేవతల కులదేవతయయ్యెను. శ్రీదేవియే వారి సర్వస్వమయ్యెను. అట్లు దేవభీకరుడు బలశాలియగు వృత్రుడు చావగ నింద్రుడు త్రిభువన పూజ్యుడైన హరిని పూజించెను. గాలి మెల్లమెల్లగ చల్లగ స్వేచ్ఛగ వీవసాగెను. కిన్నర గంధర్వ యక్ష రాక్షసులు సురలును హర్షము వెలిపుచ్చిరి. 

అట్లు త్రిమూర్తి స్వరూపిణి యగు పరాశక్తి నీటి నురుగున నుండి వృత్రుని మోహితుని జేయుటచేతనే యింద్రుడు వృత్రాసురుని చంపగలిగెను. లోకము వాసవుడు వృత్రుని చంపెనందురు కాని వాస్తవముగ చూడగ పరాదేవి వృత్రనిహంత్రియని వన్నెకెక్కినది.

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...