Thursday, April 30, 2026

Gangadi Pradhanansa Svarupinulu - గంగాది ప్రధానాంశస్వరూపిణులు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - గంగాది ప్రధానాంశస్వరూపిణులు

లోకపావనియైన గంగ ప్రధానాంశస్వరూప. విష్ణుపాదోద్భవ. ద్రవరూపిణి. సనాతని. పాపాత్ముల పాపాలు అనే ఎండుకర్రలను కాల్చివేయడానికి అగ్నిలాంటిది. సుఖస్పర్శ. స్నానపానాలతో నిర్వాణపదవిని అందించే శక్తి కలది. గోలోకాన్ని చేరుకోవాలి అంటే గంగానది సుఖంగా సోపానస్వరూపిణి. సర్వనదీ నదతీర్థాలలోకీ ఉత్తమోత్తమైనది. పరమపావని. శివుడి జటాభారానికి కొసను వేలాడేట్టు అలంకరించిన ముత్యాలదండ. తపస్సులను శీఘ్రంగా సిద్ధింపజేసే పవిత్రురాలు. వెన్నెలలాగా పాలలాగా పద్మంలాగా స్వచ్చమైన నీళ్ళతో శుద్ధసత్త్వస్వరూపిణి. నిర్మల, నిరహంకార, సాధ్వి, నారాయణప్రియ.

మరొక ప్రధానాంశస్వరూపిణి - తులసి.
 విష్ణుకామిని, విష్ణభూషణరూప, విష్ణుపాదస్థలనివాసిని, తపస్సంకల్పపూజాదులను సిద్దింపజేసే శక్తి కలది. పత్రపుష్పాలలోకెల్లా ఉత్తమోత్తమైనది. దర్శన స్పర్శనల తో నిర్వాణపదవిని ప్రసాదిస్తుంది. కలియుగంలో కలుషాలను దహించే అగ్ని. సకలతీర్ణాలనూ పవిత్రీకరించే పరమపావని. ఆత్మశుద్ధికోసం తులసీ దర్శనస్పర్శనాలను సకలసృష్టి ఆకాంక్షిస్తూ ఉంటుంది. తులసి లేకపోతే సత్కర్మలుకూడా నిష్ఫలమవుతాయి. తులసి మోక్షప్రద. సర్వకామద. భారత భూమిలో అవతరించిన కల్పవృక్షం.

మరొక్క ప్రధానాంశస్వరూప - మనసాదేవి. కశ్యప ప్రజాపతి కూతురు. శంకరుడికి ప్రియశిష్యురాలు. జ్ఞానవిశారద. అనంతుడికి సోదరి. నాగపూజిత, నాగేశ్వరి. నాగమాత, సుందరి, నాగవాహిని, నాగేంద్రగణ సంయుక్త. నాగభూషణభూషిత, నాగేంద్రవందిత, నాగశాయిని, సిద్ధయోగిని, విష్ణురూప, విష్ణుభక్త, విష్ణుపూజాపరాయణ, తపఃస్వరూప, తపస్విని, తపఃఫలప్రదాయిని. మూడు లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి హరిని మెప్పించి తపస్వినులలోకెల్లా అగ్రగణుర్యాలు అయ్యింది. సర్వమంత్రాధిదేవతయై బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తూ బ్రహ్మస్వరూపగా బ్రహ్మభావనతత్పరగా విరాజిల్లుతోంది. కృష్ణాంశ సంభవుడైన జరత్కారుమునీశ్వరుడికి ఇల్లాలై ఆస్తీకుడికి జన్మనిచ్చింది. ఆస్తీకుడు మునిప్రవరుడయ్యాడు.

నారదా ! మరొక ప్రధానాంశసంభూత దేవసేన. మాతృకలలోకెల్లా పూజ్యురాలు. ప్రకృతిలో ఆరవకళ. అందుకని షష్టి అని కీర్తింపబడుతోంది. త్రిజగద్దాత్రి. పుత్రపౌత్రాదివృద్ధిప్రదాత్రి.

ఈవిడ వృద్ధరూపిణి, యోగిని, శిశుగణ సంరక్షక, పురిటింటిలో ఆరవరోజున ఇరవైయొకటవరోజున అర్చించాలి. అటుపైని ఏడాది దాటేవరకూ నెలనెలా పూజించాలి. శిశువుల క్షేమానికి ఇది అవసరం, ఈ దేవసేన దయారూపిణి. మునివందిత. స్థల జల అంతరిక్షాలలో శిశువులకు రక్షణకారిణి.

మరొక ప్రధానాంశస్వరూపిణి - మంగళచండిక. ఈవిడ ప్రకృతి ముఖంనుంచి ఆవిర్భవించింది సర్వమంగళప్రద. సృష్టివిధానంలో మంగళరూప. సంహారసమయంలో కోపస్వరూప. అందుకే పండితులు ఈమెను మంగళచండిక అన్నారు.

ప్రతి మంగళవారంనాడూ ఈ చండికను పూజించాలి. పుత్ర పౌత్ర ధన మంగళ ఐశ్వర్య యశఃప్రదాయిని అవుతుంది. ఈవిడను సంతృప్తిపరెచినవారికి - ప్రధానంగా స్రీలకు - సకలవాంఛలూ తీరుతాయి. ఈవిడకు కోపం వచ్చిందంటే క్షణంలో సకలసృష్టినీ నాశనం చేస్తుంది. అంతటి మహేశ్వరి ఈ మంగళ చండిక.

ఇంకొక ప్రధానాంశస్వరూప - కాళిక. కమలలోచన. ఆదిపరాశక్తికి (ప్రకృతికి) నుదుటినుంచి ఈవిడ అవతరించింది. శుంభనిశుంభులతో భీషణసంగ్రామం చేస్తున్న సమయంలో ఆవిర్భవించింది. తేజస్సులో గుణంలో శక్తిలో ఈ కాళిక ఆ దుర్గాదేవిలో అర్జాంశానికి సమానురాలు. ఈవిడ రూపం కోటిసూర్యసమంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంశసంభవలైన శక్తి స్వరూపిణులందరిలోకీ ఈ కాళిక ప్రధానురాలు. అందరికన్నా బలవంతురాలు. సర్వసిద్ధిప్రద. యోగరూపిణి. కృష్ణభక్త, తేజోవిక్రమగుణాలలో కృష్ణతుల్య. కృష్ణభావనకారణంగా ఈవిడ కృష్ణవర్ణంలోనే ఉంటుంది. ఒక నిట్టూర్పుతో సర్వబ్రహ్మాండాలనూ సంహరించగలదు. మహారాక్షసులతో యుద్ధమంటే ఈ కాళికకు ఒక వినోదక్రీడ, ధర్మార్ధకామమోక్షప్రదాయిని. బ్రహ్మాదిదేవతలూ మునులూ ఋషులూ ఈవిడను నిరంతరం స్తుతులతో పూజలతో సంతృప్తిపరుస్తుంటారు.

ప్రకృతికి ఇంకొక ప్రధానాంశస్వరూప - వసుంధర. సకల ప్రాణికోటికీ ఆధారం. పాడిపంటలకు నిలయం. రత్నాకర - రత్నగర్భ - రత్నాకరాశ్రయ అని ప్రజలు ఈ వసుంధరను కీర్తిస్తారు. సర్యోపజీవ్య, సర్వసంపద్విధాయిని. ఈ వసుంధర లేకపోతే చరాచరజగత్తు నిరాధారమైపోతుంది.

నారదా ! ప్రధానాంశసంభవలైన ప్రకృతి కళారూపిణులను గురించి చెప్పాను. ఇంక ఎయే శక్తులు ఎవరెవరికి భార్యలో చెబుతాను. ఆదికూడా తెలుసుకో.

స్వాహాదేవి అగ్నికి ఇల్లాలు. ఆవిడలేకుండా దేవతలు సైతం హవిర్దానాన్ని స్వీకరించరు. దక్షిణాదేవి యజ్ఞపత్ని, స్వధాదేవి పితృదేవతాపత్ని, ఈవిడను పూజించకుండా చేసిన పితృదానాలు నిష్ఫలమవుతాయి. స్వస్తిదేవి వాయుపత్ని, ఆదానప్రదానాలను సఫలం చేస్తుంది. పుష్టిదేవి గణపతికి పత్ని. ఈవిడను అర్చించకపోతే స్త్రీ పురుషులు క్షీణించిపోతారు. తుష్టిదేవి అనంతపత్ని, సకలదేవతలూ సకలలోకాలూ సంతుష్టిచెందేది ఈవిడ అనుగ్రహంతోనే. సంపత్తిదేవి ఈనాశాపత్ని. ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ దారిద్య్రంతో అలమటిస్తాయి. దృతిదేవి కపిలాపత్ని. ఈవిడను అర్చించకపోతే ఆధైర్యంతో వొణికిపోవాల్సి వస్తుంది. సతీదేవి సత్యపత్ని. ముక్తులు ఈవిడను అర్చిస్తారు. ఈవిడ ఆగ్రహిస్తే లోకం బంధుత్వరహితమైపోతుంది. దయాదేవి మోహపత్ని. ప్రతిష్ఠాదేవి పుణ్యపత్ని. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు జీవస్మృతమైపోతుంది. కీర్తిదేవి సుకర్మపత్ని. ఈవిడ కటాక్షం లేకపోతే జగత్తు  యశోహీనమైపోతుంది. క్రియాదేవి ఉద్యోగపత్ని (ఉద్యోగం = ప్రయత్నం). ఈవిడ అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ విధిహినాలైపోతాయి. మిథ్యాదేవి అధర్మపత్ని. ధూర్తులు ఈవిడను పూజిస్తారు. ఈవిడ అనుగ్రహిస్తే (ఆగ్రహిస్తే) విధి నిర్మితమైన సృష్టి అంతా విచ్చిన్నమవుతుంది. సత్యయుగంలో ఈవిడ కనిపించదు. త్రేతాయుగంలో సూక్ష్మరూపిణిగా ఉంటుంది. ద్వాపరంలో సగం శరీరంతో దాగి ఉంటుంది. కలియుగంలో మాత్రం మహాప్రగల్బురాలై బలవంతురాలై స్పష్టంగా సర్వత్ర వ్యాపించి ఉంటుంది. ఇంటింటా కపటరూపంతో సోదరులతో సమానంగా సంచరిస్తూ ఉంటుంది.

నారదా ! శాంతదేవి లజ్జాదేవు లిద్దరూ సుశీలపత్నులు. వీరు లేకపోతే జగత్తు ఉన్మత్తమైపోతుంది. బుద్ది మేధా ధృతిదేవులు ముగ్గురూ జ్ఞానపత్నులు. వీరి అనుగ్రహం లేకపోతే జగత్తు మూఢమవుతుంది. మూర్తిదేవి ధర్మపత్ని. కాంతిన్వరూప. మనోహర. ఈవిడలేకపోతే విశ్వాత్మకుడైన పరమాత్మ కూడా నిరాధారుడైపోతాడు. ఈవిడ శోభారూప. లక్ష్మీకళారూప. శ్రీరూప. మూర్తిరూప. మాన్య. ధన్య. ఇక నిద్రాదేవి కాలాగ్నిరుద్రపత్ని. రాత్రిపూట యోగశక్తితో లోకాలను ఈవిడ ఆశ్రయిస్తుంది.

కాలానికి రేయి పగలు సంధ్య అని ముగ్గురు భార్యలు. వీరు లేకపోతే బ్రహ్మదేవుడుకూడా కాలాన్ని లెక్కించలేడు. క్షుత్పిపాసలు లోభపత్నులు. వీరివల్లనే లోకం చింతాతురమవుతోంది. తేజస్సుకి ప్రభా - దాహికలిద్దరూ భార్యలు. కాలకన్యలైన మృత్యుజరాదేవులిద్దరూ ప్రజ్వరపత్నులు. వీరివల్లనే జగత్తు క్షీణిస్తోంది. నిద్రా తంద్రా ప్రీతిదేవులు ముగ్గురూ సుఖపత్నులు. సకలప్రాణికోటినీ అలసటనుంచి తేర్చి ఉత్తేజపరుస్తారు. శ్రద్ధాభక్తులు వైరాగ్యభార్యలు. వీరు కారణంగానే లోకం జీవన్ముక్తమవుతోంది.

దేవతాజననిగా అదితి, గోవులకు తల్లిగా సురభి (కామధేనువు), దైత్యజననిగా దితి, నాగమాతగ్గా కద్రువ, పక్షిజననిగా వినతాదేవి - ప్రకృతికి కళాంశసంభవలుగా సృష్టివిధానంలో ఉపయోగపడి కీర్తింపబడ్డారు.

ఇంకా ఇటువంటి కళాంశాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని చెబుతాను, తెలుసుకో. చంద్రపత్నిగా రోహిణీదేవి, సూర్యపత్నిగా సంజ్ఞాదేవి, మనుపత్నిగా శతరూపాదేవి, ఇంద్రపత్నిగా శచీదేవి, బృహస్పతి భార్యగా తారాదేవి, వసిష్ఠుడి ఇల్లాలుగా అరుంధతీదేవి, గౌతమస్త్రీగా అహల్యాదేవి, అత్రి భార్యగా అనసూయాదేవి, కర్దమ జననిగా దక్షపత్నిగా దేవహూతీదేవి. ఇంకా ఇలాగే మాససి - మేనక - వింధ్యావళి (బలిభార్య) - లోపాముద్ర - కుంతి - కుబేరకామిని - వరుణాని - దమయంతి - యశోద - దేవకి - గాంధారి - ద్రౌపది - శైబ్య - సత్త్వవతి - వృషభానుప్రియ - రాధామాత - మందోదరి - కౌసల్య - సుభద్ర - కౌరవి - రేవతి - సత్యభామ - కాళింది - లక్ష్మణ - జాంబవతి - నాగ్నజితి - మిత్రవింద - రుక్మిణి - సీత - యోజనగంధ (వ్యాసమాత) - బాణపుత్రి - (ఉషాదేవి) - చిత్రలేఖ (ఉషాదేవికి సఖి)- ప్రభావతి - భానుమతి (దుర్యోధన పత్ని) - మాయావతి - రేణుక (భృగుజనని) - రోహిణి - ఏకనంద (కృష్ణసోదరి) - వీరంతా ఆదిపరాశక్తి దుర్గకు అంశసంభవలే. ఇంకా లోకంలో ఉన్న గ్రామదేవతలంతా కళాంశాంశ సంభూతలే. లోకాలకు ప్రియం కలిగించే తల్లులే.

నారదా ! లోకంలో స్త్రీలంతా అమ్మవారికి అంశావతారాలే కనక స్త్రీలను అవమానిస్తే ప్రకృతివి పరాభవించినట్టే. వారిని అర్చించిన వనితలు పతిపుత్రవతులై సుఖసంతోషాలు పొందుతారు. వస్త్రాలంకారచందనాదులతో కుమారీపూజ చేసినా (ఎనిమిదేళ్ళలోపు ఆడపిల్ల) ముత్తైదువులను అర్చించినా ఆది ప్రకృతిమాతకు చేసిన ఆరాధనగా మంగళప్రదమవుతుంది.

నారదా ! ఈ ప్రకృతి కళాంశసంభూతలైన స్త్రీమూర్తులలో ఉత్తమ - మధ్యమ - ఆథమ భేదాలున్నాయి. సత్త్వగుణ ప్రధానలై సౌశీల్యంగల పతివ్రతలు ఉత్తమ శ్రేణికి చెందుతారు. రజోగుణప్రధానలై సుఖసంభోగవివశలై స్వకార్యతత్పరలైన స్త్రీలు మధ్యమశ్రేణి. తమోగుణ ప్రధానలై అజ్ఞాతకుల సంభవలై దుర్ముఖలై కలహప్రియలై ధూర్తలై స్వతంత్రలై కులగౌరవ వినాశకలైనవారు అథమశ్రేణికి చెందుతారు. భూలోకంలో వేశ్యలూ స్వర్గోకంలో అప్పరనలూ ఈ కోవలోకి వస్తారు

వీరిలో దుర్గాదేవిని ప్రప్రథమంగా సురథుడు ఆర్చించాడు. అటు పైని రావణవధ సమయంలో రాముడు ఉపాసించాడు. ఈ దుర్గ దక్షుడికి కూతురుగా జన్మించి దానవ సంహారం చేసింది. శివనింద వినలేక, తండ్రి ఇంటిలో జరిగిన అవమానాన్ని తాళలేక దేహం చాలించింది. హిమవంతుడికి పార్వతిగా జన్మించింది. తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది. కృష్ణస్వరూపుడైన వినాయకుడికీ, విష్ణుకళాసంభవుడైన కుమారస్వామికి జన్మనిచ్చింది. 

మరొక కాలంలో సావిత్రీ రూపిణిగా అశ్వపతిపూజలూ లక్ష్మీస్వరూపిణిగా మంగళభూపాలుడి పూజలూ మున్ముందుగా అందుకొంది. ఆపైని సర్వదేవతలూ సకలమునీశ్వరులూ అర్చించారు. అలాగే సరస్వతీరూపంగా బ్రహ్మదేవుడి సేవలు అందుకొంది. దేవదైత్యమానవజాతులతో సేవింపబడింది. అటుపైని ఆదిపరాశక్తి రాధాదేవిగా గోలోకంలో రాసమండల పూజలు గైకొంది. కార్తికపూర్ణిమనాడు శ్రీకృష్ణుడు గోగోపీగోపక బృందంతో ప్రథమార్చన చేశాడు. ఆపైని నారాయణుడి ఆజ్ఞమేరకు బ్రహ్మాదిదేవతలు ధూపదీపనైవేద్యాది, సకలోపచారాలూ చేశారు. భూలోకంలో సుయజ్ఞుడు అర్చించాడు. పుణ్యక్షేత్రమైన భారతదేశంలో గ్రామగ్రామానా నగరనగరానా శంకరుడి ఆజ్ఞ ప్రకారం పరాశక్తి పూజలు నేటికీ సాగుతున్నాయి. నారదా ! ఇదీ దేవీకలారూపాల మహిమ. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు. నాకు తెలిసినమటుకు చెబుతాను - అన్నాడు నారాయణమహర్షి

శ్రీకృష్ణుడు - శక్తిస్వరూపాలు


No comments:

Post a Comment

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...