వాసుడిట్లనెను : ఒకానొకప్పుడు హరిశ్చంద్రుడు వేట కడవి కేగెను. అతడట చారెడేసి కన్నులు గల్గి యేడ్చు చున్న యొక సుందరిని జూచెను.
మహారాజు దయాపరుడై విశాలాక్షి యగు ఆ కామినితో నిట్లనెను: వరాననా! ఏడ్చెదవేల? నిన్ను బాధ పెట్టిన వాడెవడు? నీ దుఃఖ కారణమేమి? ఈ జనము తిరుగనిచోట నీ వేల యుంటివి? నీ తండ్రి యెవరు? నీ పతి యెవరు !
సుందరీ! నా యేలుబడిలో రాక్షసుడు గూడ పర స్త్రీని బాధింపడు. నిన్ను బాధపెట్టిన వాడెనడో తెల్పుము. వానినిపుడే తును మాడుదును. తలోదరీ! వరారోహా! నా రాజ్యమున పాపాత్ముడుండుటకు వీలులేదు. నీ దుఃఖమేమిటో తెల్పి నిశ్చింతగ నుండుము ఆను రాజు మాటలు విని యువతి తన చెక్కిళ్ళపై జారు కన్నీటి బొట్లు తుడుచు కొనుచు
హరిశ్చంద్ర నరపతితో నిట్లనెను: ఓ రాజా! విశ్వామిత్రముని నన్నింతగ బాధించుచున్నాడు. నన్ను బొందుటకు ఘెరతప మాచరించుచున్నాడు. సత్యవ్రతా! నేను నీ రాజ్యమందతని వలననే యింత దుఃఖ మొందుచున్నాను. నేనా మునిచే కామింపబడిన కాంతనని నన్నెఱుంగుము.
రాజిట్లనెను: విశాలాక్షీ? నేనా తపోనిరతుడగు ముని తపమును వారింపజేతును. నీకిక దుఃఖము గలుగదు. నిశ్చింతగ నుండుము. ఇట్లు రాజు యువతి నూరడించి ముని సన్నిధికేగి తలయొగ్గి యతనికి నమస్కరించి యిట్లనెను.
స్వామీ! మహామతీ? నీవీ శరీరము నేల తపింపజేయుచున్నావు. ఏ మహా కార్యసాధన కింతగ కఠోర తప మొనర్చుచున్నావో నిజము తెల్పుము.
విశ్వామిత్రా! నీ కోరిక సఫల మొనర్పగలను. ఇంక తపము చాలు: వేగమే లేలెమ్ము. సర్వజ్ఞా! నా రాజ్యమందెవ్వడును లోకబాధ గల్గించు ఘోర దారుణ తప మొనరింపరాదు.
ఇట్లు రాజు విశ్వామిత్రుని వారించి తన యింటి కేగెను. విశ్వామిత్రుడు మనస్సులో కోపముంచుకొని తన యాశ్రమ మేగెను.
మాయాసూకరం
No comments:
Post a Comment