Thursday, April 16, 2026

Chapter 133 The beginning of the story of Harishchandra - అధ్యాయము 133 హరిశ్చంద్ర కథారంభము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 133

హరిశ్చంద్ర 
కథారంభము

జనమేజయు డిట్లనెను : మునిసత్తమా! దేవతలు మానవులు సేవింపదగిన పుణ్యతీర్థములు పుణ్యక్షేత్రములు పుణ్య నదులేవేవిగలవో వానిని తెల్పుము. ఏ పవిత్ర తీర్థమున యథావిధిగ స్నానదానాదులు చేసిన ఏమి ఫలము గల్గునో యా తీర్థయాత్రల నియమములేవో వానిని తేటపఱచుము. అన 

వ్యాసుడిట్లనెను : రాజా! ఏయే పుణ్యతీర్థములందు శ్రీదేవి మందిరములు విలసిల్లునో యయా వివిధ తీర్థములుగూర్చి తెలుపుదును. ఆలకింపుము. పావనపుణ్యనదులందు గంగ యమున సరస్వతి నర్మద గండకి సింధు గోమతి కావేరి చంద్రభాగ వేత్రవతి చర్మణ్వతి సరయు తాపి సాభ్రమతి (సబర్మతి) మున్నగునవి పవిత్ర పుణ్యనదులు. 

ఇవికాక భూమిపై పెక్కు నదులు గలవు. వానియందు సముద్రములో గలియు నదులన్నియు అధికతర పుణ్యప్రదములు. జలధిలో చేరనివి తక్కువ పుణ్యప్రదములు. నదులు మహావేగముతో సాగరములో గలిసినచో నవి మహాపుణ్యవంతములు. నదులు శ్రావణ భాద్రపద మాసములందు వర్షములు వలన అపరిశుద్ధమగు నీటితో ప్రవహించును. 

ఇట్లు అవి రజస్వల లగును. పుష్కరము కురుక్షేత్రము మిగుల పావనమగు ధర్మారణ్యము ప్రభాసము ప్రయాగ నైమిశారణ్యము అర్బుదారణ్యము పావనము లని ప్రసిద్ధి గాంచినవి. ఇవ పవిత్ర పర్వతము లెన్నియో కలవు వానిలో శ్రీశైలము మేరువు గంధమాదనము ముఖ్యములు. ఇట్లే పవిత్ర సరస్సులును గలవు. 

వానిలో మానస సరోవరము బిందురసము అచ్ఛోదము ప్రముఖములు. ఆత్మవంతులగు మునీశులు నివసించు పవిత్రాశ్రమములు గలవు. అవి పుణ్యప్రదములు. ఆశ్రమములందు నరనారాయణులు తప మొనరించిన బదరికాశ్రమము మిక్కిలి పుణ్యప్రదమని వన్నెయు వాసియు గాంచెను. 

ఇట్లు వామనాశ్రమమును శతయూపాశ్రమమును పుణ్యకరములే. తప మొనరించిన తాపసుల పేర్లతో నాశ్రమ నామము లేర్పడును. ఈ విధముగ భూతలమునందు లెక్క లేనన్ని పుణ్యతీర్థములు వెలసినవి. ఇవి మునీశుల పావన గీతములతో గానము చేయబడినవి. ఈ పుణ్యక్షేత్రములం దెల్లెడల శ్రీదేవీ స్థానములు విలసిల్లును. ఆ స్థానములను దర్శించిన మాత్రన పాపపంకము లింకిపోవును.

వీనిలో ముఖ్యముగా గొన్నిటిని ప్రసంగానుసారముగ వివరింపగలను. రాజా ! సర్వతీర్థ-వ్రత-దాన-యాగములు ఎల్ల తపములు పుణ్యకర్మములు పరస్పరము పుణ్యమునకు దోహదకారులు. ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి చిత్తశుద్ధి యత్యావశ్యకములు. వీనివలననే ఎల్ల తపములు వ్రతములు తీర్థములు పావనములు పుణ్యదములునై చెన్నలరారును. 

ఒకప్పుడు ద్రవ్యశుద్ధి క్రియా శుద్ధి రెండే యుండవచ్చును. కాని, యెల్లరి కెల్లచోటుల చిత్తశుద్ధి గల్గుట మాత్ర మతి దుర్లభము. ఏలన, చిత్తమతి చంచలము. అది పలు విషయములందు పరిభ్రమించుచుండును. ఇట్లు పెక్కు విధముల భావములకు తావలమైన చిత్త మెట్లు పరిశుద్ధమగును? చిత్తమును కామక్రోధములు మదలోభాహంకారములుండును. 

ఇవి సకల తీర్థవ్రత తపముల విషయమున విఘ్నకారులు. అహింస సత్యము పవిత్రత ఇంద్రియ నిగ్రహము దొంగిలింపకుండుట స్వధర్మపాలన యనునని సకలతీర్థసేవా ఫలములు గల్గింపగలవు. సంగదోషము నిత్యకర్మలోపము అను దోషములు గలవు. ఈ రెండును తీర్థయాత్రల వలన గల్గును. వీనివలన పాపము తగులును. తీర్థము లొడలిమీది మురికిని మాత్రమే పోగొట్టగలవు. అవి చిత్తమాలిన్యమును కడుగజాలవు. 

అవి చిత్తకాలుష్యము బాపజాలినచో గంగాతీర వాసులగు మును లీశ్వర సేవాపరులై యుండిన ద్రోహము లేల యొనర్తును? వసిష్ఠ విశ్వామిత్రాది మునులు వినయశీలురు. వారును రాగద్వేషములకు కామక్రోధములకు వశులై వ్యవహరించిరే! కనుక చిత్తశుద్ధి యను తీర్థము గంగాది తీర్థములకంటె నత్యుత్తమమైనది. 

దైవయోగమున సాధుసజ్జనుల సత్సంగతి లభించవచ్చును. అపుడు చిత్తమాలిన్యము కడుగబడును. వేదశాస్త్రములు దానవ్రతములు తపోయాగములును వీనిలో నే యొక్కటియును చిత్తశుద్ధి గలిగింపజాలవు. వషిష్ఠ మహర్షి బ్రహ్మపుత్రుడు వేదవిద్యా నిష్ణాతుడు గంగాతీరవాసి. అంతటి మహాత్ముడును రాగద్వేషములకు తల యొగ్గెను. వసిష్ఠ విశ్వామిత్రుల పనికిమాలిన ద్వేషము కారణముగ నాడీ బక మహాయుద్ధము సంఘటిల్లెను. అది వేల్పులకును నబ్బురము గలిగించెను.

విశ్వామిత్రుడు తొల్లి హరిశ్చంద్రుని కారణమున వసిష్ఠునిచే శపింపబడి కొంగ యయ్యెను. వసిష్ఠుడును విశ్వామిత్రునిచే శపింపబడి ఆడీరూపము దాల్చెను. ఇట్లు లా మునివరు లాడీ బక రూపములు దాల్చిరి. అవి రెండును మానస సరోవరతీరమున మనుగడ సాగించుచు తమతమ గోళ్లతో ముక్కులతో తీవ్రముగ పోట్లాడుకొనుచుండెను. 
ఆ ఋషు లట్లు రోషముతో మత్తసింహముల మాడ్కి పదివేలేండ్లు పోరిరి. 

రాజిట్లనెను : వారిరువురును ధర్మపరులు తాపసులు మునివరులును గదా! ఐనను వారు పరస్పర మేల శపించుకొనిరి? 

వ్యాసు డిట్లనెను : పూర్వము త్రిశంకుని తనయుడు హరిశ్చంద్రు డను నతడు ప్రసిద్ధి గాంచెను. అతడు సూర్యవంశజుడు శ్రీరామునకు పూర్వుడు. అతనికి సంతులేదు. వరుణుని దయచే తనకు పుత్త్ర ప్రాప్తి గల్గినచో వరుణప్రీతికి తన పుత్త్రుని నరమేథ మొనర్తునని యతడు దుష్కరమగు ప్రతిన బూనెను. అతని యజ్ఞనియమమునకు వరుణుడు సంతుష్టిజెందెను. 

అంతట హరిశ్చంద్రుని భార్య గర్భవతి యయ్యెను. తన భార్య గర్భిణియగుట గని రాజు సమ్మోదముతో నామెకు యథావిధిగ గర్భసంస్కారము లొనరించెను. ఆమె సర్వ లక్షణ సంపన్నుడగు కుమారుని గనెను. రాజు పరమానందబరితుడయ్యెను. అతడా పిల్లవానికి చక్కగ జాతకర్మాది సంస్కారములు జరిపి బ్రాహ్మణులకు బంగారము, పాలిచ్చు గోవులు దానమొనరించెను. 

అట్లు పుత్త్రజనన మహోత్సవము జరుగుచుండగ వరుణుడు విప్రవేషముతో రాజ గృహమున కేతెంచెను, రాజతనిని సత్కరించి కూర్చుండ నియోగించి యతని రాకకు కారణ మడిగెను. 'నేను వరుణుడను. నీ సుతుని పశువుగ జేసి నాకు యజ్ఞ మొనరింపుము. బలి యిమ్ము. నీవు మున్ను నాకు మాట యిచ్చితివి. దాని నిపుడు నిలువబెట్టు కొను' మని వరుణు డనెను.

వరుణుని వాక్కులు వినగనే రాజు నిశ్చేష్టుడై పడి కొంత వడికి తన్నుతా నిబ్బరించుకొని మోడ్పుకేలు నిగుడించి యిట్లనెను : 

స్వామీ! తొల్లి నీకు మాట యిచ్చిన మాట నిజమే. నీకు యథావిధిగ యాగ మొనర్చి సత్యవాది నగుదును. సురవరా ! ఒక నెలకు నా భార్యకు శుద్ధి యగును. ఆమె శుద్ధయైనంతనే నరమేధ మొనర్పగలను అని రాజనగనే వరుణుడు తన నెలవున కరిగెను. రాజు అప్పటికి సంతసించెను. 

కాని లోన దిగులు మాత్ర మతనిని వదలలేదు. ఒక నెల గడిచెను. ప్రియవాదియగు వరుణుడు పిమ్మట పాశము చేతబూని రాజు పరీక్షింప తిరిగి విప్రవేషముతో రాజప్రాసాదమున కేతెంచెను. అంత రాజు వరుణున కాసనమిచ్చి పూజించి సవినయముగ సహేతుకముగా నిట్లు పలికెను : 

స్వామీ! నా కుమారుడింకను సంస్కృతుడు కాలేదు. అట్టి వాని నెట్టుల యూపస్తంభమునకు బంధింపగలను? 

కనుక నతని నొక క్షత్రియునిగ సంస్కరించిన పిదప నుత్తమ నరయాగ మొనర్తును. దేవా! నేను దీనుడను. నీ సేవకుడను. నన్ను కనికరింపుము. సంస్కారహీనుడగు బాలున కెందు నధికారము లేదు గదా! 

వరుణు డిట్లనెను : రాజా! నన్ను మోసగించి మాటిమాటికి రమ్మనుచున్నావు. పుత్రహీనుడవగు నీకు పుత్త్ర వాత్సల్యము మెండు, దీనికి మితి లేకున్నది. 

కనుక నీ మాట చొప్పున తిరిగి నా గృహ మేగుచున్నాను. కొంతకాల మెదురుచూచి తిరిగి నీ యింటికి రాగలను. అపుడైన నీవు నీ మాట నిలువ బెట్టుకొనుము. కానిచో కోపముతో నిన్ను శపింతును. 

రాజిట్లనెను : వరుణదేవా! నా కుమారునకు సమావర్తనము జరుగగానే యతనిని పశువుగ నుంచి యాగమొనర్పగలను. అను రాజు మాటలు విని వరుణుడు హర్షించి యట్లే యని వేగ నేగెను. రాజును శాంతుడయ్యెను. అతని కుమారుడు రోహితనామమున పెరిగి యెల్ల విద్యలందు విశారదు డయ్యెను. అతడు యాగహేతువు నంతయును విని తనకు చావు మూడినందులకు భీతుడయ్యెను. అందుచే అతడు తన తండ్రినుండి పరుగెత్తి యొక గిరి గుహలో వసించెను.

తగిన సమయమునకు యజ్ఞార్థియగు వరుణుడు రాజుచెంత కరిగి యజ్ఞము చేయుమని యడిగెను. అంత రాజు వాడిన మోముతో దిగులొందిన మనముతో నేనిపుడేమిచేతును? నా కొడుకెటకో పారిపోయె' ననియెను. అట్లు రాజు బొంకులాడెను. రాజు మాటలు విని వరుణుడు కోపమున రాజా! నీవు పచ్చిమోసగాడవు. నన్నే మోసగించితివి. 

కనుక నీవు జలోదరమను వ్యాధిచే పీడితుడవగుదువుగాక! అని శపించి తన చోటికి తానేగెను. రాజు తన యింట వ్యాధిపీడితుడై చింతాతురుడై పడియుండెను. శాపవశమున తన తండ్రి రోగపీడితుడగుట రోహితుడు వినెను. ఎట్లన, 

ఒక తెరువరి రోహితుని కిట్లనెను : రాకుమారా! నీ తండ్రి శాపవశమున జలోదర వ్యాధిచే పీడింపబడి దుఃఖించుచున్నాడు. దుర్మతీ! నీ బ్రతుకంతయు పనికిమాలినది. నీ జన్మము నిరర్థకము. నీ తండ్రి దుఃఖించుచుండగ నతనిని విడనాడి నీవీ గిరిగుహలందు సుఃఖింతువా? నీవు కుపుత్త్రుడవు. నీకీ శరీరముండి యేమిలాభము? నీవు పుట్టి మాత్రము ప్రయోజనమేమి? 

అట నీ తండ్రి దుఃఖించుచుండ నీవిట సుఖమున్నావు. తన కన్నతండ్రి మేలుకొఱకు కన్నకొడుకు తన ప్రాణములు సైతము వదల వలయును. నీ తండ్రి వ్యాధిపీడతో నిన్ను తలచితలచి యచట వంతజెందుచున్నాడు.' అది విని రోహితుడు బాటసారివలన సత్యధర్మములగు నీతివాక్యములు గ్రహించి దుఃఖితుడగు తన తండ్రిని గాంచుటకు నిశ్చయించుకొనెను. 

అంతలో నింద్రుడు విప్రవేషమున నతనిని సమీపించి దయగలవానివలె రహస్యముగ నతని కిట్లనియెను : 

''ఓ రాజకుమారా! నీవెంతటి మూర్ఖుడవు. నీ తండ్రి వ్యాధిపీడితుడయ్యెనో లేదో సరిగ నెఱుగక యచ్చోటికి వెళ్లదలతువేల?

అధ్యాయము 134 హరిశ్చంద్రుడు రోగముక్తుడగుట

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

No comments:

Post a Comment

Chapter 137 History of the Haihayus - అధ్యాయము 137 హైహయుల చరిత్ర

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 137 హైహయుల చరిత్ర జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు ...