Thursday, April 16, 2026

Chapter 125 Vrtrudu svargamu Nalankarinchuta - అధ్యాయము 125 వృత్రుడు స్వర్గము నలంకరించుట

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 125

వృత్రుడు స్వర్గము నలంకరించుట

అట్లు వృత్రుడు నిశ్చలచిత్తముతో చేయు తపమునకు భంగము గలిగింపలేక దేవతలు హతాశులై తిరిగి వెళ్ళిరి. నూరేండ్లు గడచిన పిమ్మట లోకపితామహుడగు బ్రహ్మ రాయంచ నెక్కి వృత్రుని చెంతకు వచ్చి అతనితో నిట్లనెను. 

'నీవు సుఖ ముండుము. ధ్యానము వదలుము. నీ మదిగల కోరిక కోరుకొనుము. నీవు తపస్సుచే మిక్కిలి కృశించితివి. నిన్ను గాంచి నేను ప్రసన్నుడ నైతిని. నీకు మేలగుత! నీ మదిగల కోరికి తెలుపుము' అనగా వృత్రుడు తన యెదుటనున్న లోకకర్త పలికిన హితవచనములు విని యోగము మాని యానందబాష్పములు జాలువాఱ లేచి నిలుచుండెను. అతడు భక్తి వినయములతో బ్రహ్మపాదములపై తన శిరముంచి లేచి దోయిలించి తన తపమునకు సంతసిల్లి వరము లిచ్చునట్టి ప్రజాపతితో నిట్టు లనియెను : 

ఓ కమలాసనా! నీ దుర్లభ దర్శనమువలన సకల దేవ పదములు పడసితిని. నా మదిలోని భావము నీ వెఱుంగుము. ఐనను నా కొక కోర్కి గలదు. తెల్పుదును. వినుము. నాకు తడిసిన-యెండిన వస్తువులచే గాని లోహ-కాష్ఠ-శస్త్రములచేగాని చావు లేకుండునట్లుగను రణమున నా బలము వృద్ధి జెందునట్లుగను. నే నమరుల కజేయుడ నగునట్లుగను వరము లిమ్ము. 

అట్లు వృత్రుడు ప్రార్థించగా బ్రహ్మ నవ్వుచు 'నీ కోరికి తీరును లెమ్ము. నీవు తడిసిన-యెండిన వస్తువులచే గాని కఠినశిలలచేగాని చావవు. నిజము పల్కుచున్నాను' అని వర మొసగి తన లోక మేగెను. వృత్రుడును ముదమంది తన యింటి కేగెను.

అతడు తన వరప్రాప్తినిగూర్చి తన తండ్రితో చెప్పెను. విశ్వకర్మ తన కొడుకు వరమంది వచ్చుటకు సంతసించి యిట్లనెను : 

'ఓ మహాత్మా! నీకు మేలగుత! త్రిశిరుని చంపిన పాపి యింద్రుడు. అతడు నా వైరి. నీ వతనిని చంపి రమ్ము. యుద్ధములో విజయమంది స్వర్గపతివి గమ్ము. పుత్రనాశమున గల్గిన నా మనోవ్యాధి నుడుపుము. తండ్రి బ్రతికి నంతవఱ కతని మాట పాటించుట తండ్రి మరణించిన పిదప పితృకర్మ లొనర్చి బ్రాహ్మణ సంతర్పణ జరుపుట గయలో పిండ ప్రదానము చేయుట అను మూటిపై పుత్రుని పుత్రత్వ మాధారపడియున్నది. 

పుత్త్రా! ఈ నా దుఃఖము తొలగింప గలిగినవాడవు నీవే. త్రిశిరుడు నా మనస్సునుండి యెంతకును తొలగుటలేదు. అతడు సుశీలుడు. తాపసుడు-సత్యవాది-వేదవిదుడు. అంతటి అతడు నిరాపరాధుడయ్యు పాపియగు నింద్రునిచే చంపబడెను' అను తన తండ్రి మాటలు ఇని 

దుర్జయుడగు వృత్రుడు వేగమే రథమెక్కి తండ్రి యింటినుండి బయల్వెడలెను. ఆ మదగర్వితుడు బయలుదేరగనే రణభేరీ శంఖనాదములు పిక్కటిల్లెను. అట్లు నయయుక్తుడగు వృత్రుడు వెడలుచు తన సేవకుల కిట్లనెను. 

'నేడు నే నింద్రుని చంపి స్వర్గమును అకంటంకముగ గైకొందును' అని పలికి వృత్రుడు సేనలను గూర్చుకొనెను. వృత్రుని సేనల ధ్వనులు దేవతలను భయపెట్టుచుండెను. ఇట్లు వృత్రుడు రణమునకు తరలెను. వృత్రుని రాక యెఱింగి యింద్రుడును సేనలను గూర్చుకొనెను. అతడు లోకపాలుర నెల్లరను రావించి వారిని యుద్ధమునకు పురికొల్పెను. ఇంద్రుడు గృధ్రవ్యూహము పన్నగనే వృత్రు డచ్చోటికి వచ్చెను.

అంత విజయకాములగు నింద్రవృత్రులును దేవదానవులును ఘోరముగ పోరిరి. అట్లు భీకర సమరము జరుగుచుండగ సురలు విషాద మందిరి. రాక్షసులు ముదమందిరి. దేవ దానవులు తోమర-భిందిపాల-ఖడ్గ-పరశు-పట్టిసములతో నొకరి నొకరు పొడుచుకొనిరి. అట్లు దారుణ రణము జరుగుచుండగ వృత్రుడు కోపాటోపముతో నింద్రుని వేగమున బట్టుకొనెను. 

అతడింద్రుని కవచాదులు తొలగించెను. ఇంద్రునితో తనకున్న వెనుకటి పగ గుర్తుకు రాగ వృత్రుడు సంతసముతో నింద్రుని తన నోటిలో వేసికొనెను. అట్లు వృత్రు డింద్రుని మ్రింగగ సురలు హా సురపతీ! యనుచు మాటిమాటికి విలపించిరి. ఇంద్రుడట్లు కవచాదులు లేక వృత్రుని నోటిలో నుండగ దేవతలు కటకటపడి వికలచిత్తులై దీనముగ బృహస్పతి కిట్లనిరి. 

'ఓ ద్విజవరా! నీవు మా గురుడవు. మేమెంతగ రక్షించినను లాభము లేక దేవేంద్రుడు వృత్రునిచే మ్రింగబడెను. ఇపుడు మా కర్తవ్యమేమి? ఇంద్రుడు లేనిచో మేము బలహీనులము. ఏమియు చేయజాలము. కనుక నింద్రుడు మరల వచ్చుట కభిచార హోమములు చేయుము.' 

బృహస్పతి యిట్లనెను: 'ఓ దేవతలారా! ఇంద్రుడు వృత్రుని నోట జీవించియే యున్నాడు. కనుక బ్రదికి యుండగనే బైటికి వచ్చునట్టి యుపాయ మాలోచింపవలయును.

ఇంద్రుడట్లతగుటకు దేవతలెల్లరును చింతాక్రాంతులై యతని విముక్తికి ఉపాయ మాలోచించిరి. వారెల్లరును వృత్రునకు పెద్దగ నావులింత గల్గునట్లు చేసిరి. అపుడు వృత్రుడావులింతచే నోరు పెద్దగ తెఱచెను. అట్టులావులించు వృత్రుని నోటినుండి బలసూదనుడగు నింద్రుడు చెరచెర తన యంగములు చిన్నవిగ చేసికొని బయటపడెను. ఆ నాటినుండి ప్రపంచ మందలి ప్రాణులందఱ కావులింతలు గల్గుచుండెను. 

ఇంద్రుడట్లు ముక్తుడగుటగని సురలు హర్షమందిరి. మరల వారిర్వురి మధ్యలోక భీకరముగ పోరు సాగెను. ఒక వైపున సురలెల్లరు నిలువబడగ వృత్రుడొక్కడే బలముతో ప్రతిపక్షమున నిలుచుండెను. వృత్రుడు తన వరబలముతో యుద్ధమున వృద్ధి పొందుచుండగ నింద్రుడతని తేజముముందు తాళలేక ఓడిపోయెను. 

ఇంద్రుడు యుద్ధములో నోటుపడి విషాదమొందగాగని సురలును వెలవెలవోయి వగచిరి. ఇంద్రాది దేవతలు యుద్ధము వదలి పరుగెత్తిరి. వృత్రుడు వెంటనే స్వర్గసీమ తన హస్తగతము చేసికొనెను. వృత్రుడు పిమ్మట నందనోద్యానములందు విహరింపసాగెను. గజశ్రేష్ఠమైన యైరావతమును స్వాధీనము చేసికొనెను. 

అతడుత్తమాశ్వమగు నుచ్చైః శ్రవమును సకల విమానములను గ్రహించెను. కామధేనువును పారిజాతమును నచ్చరలు మున్నగు వానితో స్వర్గమును. తన కైవసము చేసికొనెను దేవతలు స్వర్గభ్రష్టులై హవిర్భాగములు గోలుపోయి గిరిదుర్గములందు గ్రుమ్మరుచుండిరి.

అట్లు వృత్రుడు మదగర్వముతో సురపదము చేజిక్కించుకొనగ విశ్వకర్మ తన తనయునిగూడి సుఖముండెను. సురలు భీత చిత్తులై యేమిచేయుటకును తోచక మునులజేరి హితమాలోచించు చుండిరి. ఇంద్రాది దేవతలు కైలాసమేగి మహేశునకు సవినయముగ ప్రణమిల్లి యిట్లనిరి: 

ఓ దేవదేవా! మహాదేవా! మహేశ్వరా! కృపాసాగరా! మేము వృత్రుని కోడి భయపడితిమి. మమ్ము కాపాడుము. శంభూ! హరా! శంకరా! వృత్రాసురుడు బలశాలి. అతడు మా సర్వమును గ్రహించెను. ఇపుడు మా కర్తవ్యమేమో నిజము తెలుపుము. మహేశా! మేము స్థాన భ్రష్టులమైతిమి. ఇపుడు మేమెక్కడి కేగవలయును? ఈ దుఃఖము తొలగు నుపాయము తోచుటలేదు. భూతేశా! దయాపరా! మేము దుఃఖితులము. మాకు సాయము సేయుము. వరమద మత్తుడగు వృత్రుని సంహరింపుము. 

శివుడిట్లనెను : ఇపుడు మనమెల్లరమును బ్రహ్మను మున్నిడుకొని విష్ణుసన్నిధికేగి వృత్రవధనుగూర్చి యాలోచింతము. వాసుదేవుడు జనర్దనుడు బుద్ధిబల శక్తులుగలవాడు. మోసమెఱిగినవాడు. దయావారాశి. విశ్వశరణ్యుడు. ఆ దేవ దేవేశుని బలములేనిచో నర్థసిద్ధి చేకూరదు. కనుక సర్వకార్య సిద్ధికి విష్ణు సన్నిధి కేగుదము అని యిట్లాలోచించుకొని శివబ్రహ్మవాసవాదులు భక్తవత్సలుడు విశ్వ శరణ్యుడు నైన విష్ణుని వైకుంఠ ధామము జేరిరి. 

వారు వేదోక్తమగు పురుష సూక్తముతో జగద్గురువు పరమేశ్వరుడునైన శ్రీహరిని సంస్తుతించిరి. కమలాపతియగు జగన్నాథుడు వారికి ప్రత్యక్షమై వారిని సమ్మానించి యిట్లనెను. సురవరులారా! మీరింద్ర బ్రహ్మశివులతో నేలవచ్చితిరి? కారణమేమో తెలుపుడు అను హరి వాక్కులాలించి దేవతలు దీనవదనములతో దోసిళులొగ్గి నిలుచుండిరేకాని వారినోట మాట రాకుండెను.

No comments:

Post a Comment

Chapter 130 Indra is back in Indra's form - అధ్యాయము 130 ఇంద్రుడు మరల నింద్రత్వమందుట

శ్రీ దేవీ భాగవతం  షష్ఠ స్కంధము  - అధ్యాయము 130 ఇంద్రుడు మరల నింద్రత్వమందుట ఇంద్రుడు విశాలాక్షియగు తన భార్యనుజూచి ఆమె శోకార్తయై యొంటిగ గనిపిం...