Friday, April 24, 2026

Mantra Yoga Teachings - మంత్రయోగ ప్రబోధం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్రయోగ ప్రబోధం

ఓ గిరి నాయకా! ఈ పంచ భూతాత్మకమైన శరీరము విశ్వము. ఇది చంద్ర సూర్యాగ్నులతో గూడి జీవ బ్రహ్మల యైక్యమును దెలుపును. ఇట్టి శరీరమున మూడున్నర కోట్ల నాడులు గలవు. వీనిలో పదిముఖ్యమైనవి. ఆ పదింటిలోను మూడు ముఖ్యతరములు. ఈ మూటిలో ముఖ్యతమమైనది చంద్రసూర్యాగ్ని రూపమైన మేరు దండము. 

ఇడానాడి యెడమ వైపుండును. ఇది తెల్లని చంద్రరూపమున నుండును ఇది యమృత శక్తిరూపమైనది.కుడి వైపున పురుష రూపమున సూర్యరూపముగల పింగళా నాడి యుండును. ఇక సర్వ తేజో రాశియై వహ్ని రూపమున సుషుమ్నా నాడి వెలుగొందును. దాని మధ్యవిచిత్రమను నాడి గలదు. దాని యందిచ్చా జ్ఞాన క్రియాత్మకమైన లింగము గలదు. ఇదిస్వయంభూలింగము. కోటి సూర్య సమానమైన ప్రకాశముగలది. 

దానకిపైని హరాత్మకము బిందు నాదాత్మకము మాయా బీజమునైన హ్రీంకారము విలసిల్లుచుండును. దానకిపైకి దీపశిఖ వలె నెఱ్ఱగ దేవీ రూపిణి యగు కుండలినీ శక్తి విరాజిల్లుచుండును. 

గిరీశా ! ఆ శక్తియు నేను నొకటియే. దానికి బైట బంగారు వన్నెగలు నాల్గు దళముల పద్మము గలదు. దానిలోనున్న వ-శ-ష-స-యక్షరములను సాధకుడు ధ్యానించవలయును. దానకిపై నగ్ని వలె వెల్గుచు వజ్రకాంతలీను నారు దళముల పద్మమలరును. బ-భ-మ-య-ర ల అను అక్షరములం దొప్పును. 

అట్టి స్వాధిష్ఠానమును ధ్యానింపవలయును. ఈ షట్కోణమునకు మూలమైనది మూలాధారమనబడును. ఇక స్వయను శబ్దముతో నధిష్ఠానమైనది స్వాధిష్ఠాన మన బరగును. దానకిపైకి నాభీ స్థాన మందు మణిపూరము గలదు. అది మేఘ ముల మెఱగు తీగల కాంతుల పగిది తేజోమయమై ప్రభలు విరజిమ్ముచుండును.

మణుల కాంతులను బోలియుండుటచే దీనిని మణిపూరపద్మ మనియందురు. ఈ పద్మము నందు డ-ఢ-ణ-త-థ-ద-ధ-న-ప-ఫ యను పది యక్షరములుండును. ఇదు శ్రీ మహావిష్ణు వధిష్ఠించియుంట దీని ధ్యానమున శ్రీ విష్ణుసాక్షాత్కారము గల్గును. 

దీనికి పైకి బాలసూర్యప్రకాశమునకు సరివచ్చు ప్రభగల్గు '' ననాహత పద్మము'' తనర్చును. ఇది క-ఖ-గ-ఘ-జ-చ-ఛ-జ-ఝ-ఞ-ట-ఠ యను పండ్రెండు వర్ణములు గలది. సూర్యకోటుల ప్రభలతో తుల తూగునది. దీనిమధ్య బాణలింగము గలదు. ఇందుతాకిడి లేనప్పటికిని చప్పు డుప్పతిల్లును. 

కనుక దీనిని''అనాహత'' మనియు ''శబ్దబ్రహ్మమయ''మనియు శబ్దబ్రహ్మనిష్ణాతులు పేర్కొందురు. ఇది పరమానందనిలయము. ఇందు రుద్రుడు విరాజిల్లును. దీనిమీద పదారుదళముల విశుద్దకమల మొప్పారుచుండును. ఇందు అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-ఋ-ఋ- - - ఏ-ఐ- ఓ-ఔ-అం- అః యను పదునారు వర్ణము లుండును. ఇందుగల ధూమ్రవర్ణము మహాప్రభలు వెలార్చును. ఇచట జీవుడాత్మదర్శనము చేయుటవలన శుధ్ది జెందును. కనుక దీనిని విశుద్దిపద్మమందురు. దీని నాకాశమనియు పల్కుదురు. 

దీనికి మీద నాజ్ఞాచక్ర మలరారును. ఇది ఆత్మ కధిష్ఠానమైనది. ఇచట పరమేశు నాజ్ఞ జీవునకు లభించును. కనుక దీని నాజ్ఞ చక్రమందురు. ఈ పద్మమందుహ-క్ష యను రెండక్షరములుగల దళములు శోభిల్లును. దానికిపైని కైలాసపద్మమును దానిపైని రోధినీపద్మమును చెన్నొందును. వీనిని చక్రములనియునందురు. 

సువ్రతా! ఇట్లు నీకాధారాది చక్రములు వివరించితిని. దీనికి పైగ సహస్రారమను చక్రరాజము దీపిల్లును. ఇదే బిందుస్థానము. శ్రీపరమాత్మ సన్నిధానము. ఇట్లు నీకు దివ్యయోగమార్గమంతయు వివరించితిని. 

No comments:

Post a Comment

Mantra Dharana - మంత్ర ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్ర ధారణ ఓ వత్సా !నీ కిట్లు త్తమమైన యోగధారణ విధానము వివరించితిని. ఇపుటు చిత్తధారణ గూర్చి తెల్పుదును. సావధ...