Friday, April 17, 2026

Chapter 150 Magical Influence - Narada's Story - అధ్యాయము 150 మాయా ప్రభావము - నారద వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 150

మాయా ప్రభావము - నారద వృత్తాంతము

నారదు డిట్లనెను : వ్యాసమహర్షీ! అట్లు తాలధ్వజరాజు పలుకగ నేను నెమ్మది నంతయు నాలోచించుకొని యతని కిట్లంటిని : 

భూపతీ! నేనెవరి కూతురనో! నా తలిదండ్రు లెవరో! ఈ కొలకులో నన్నెవ రుంచిరో యథార్ధము నాకే తెలియదు. నరపతీ! నేనిపుడింకేమి చేతును? ఇంకెక్కడి కేగుదును! దిక్కుమాలిన దాననైతిని. నాకు ముందు మేలెట్లు జరుగునా యని చింతించుచున్నాను. 

మహీపాలా! రమణీప్రియా! దైవము బలవత్తరమైనది. పౌరుషము పనికిమాలినది. నీవు ధర్మజ్ఞుడవు. నన్ను నీ మది కింపగునట్టు లేమైన చేసికొమ్ము. వద్దనను. నాకిపుడు తల్లి - తండ్రి - బంధువు - పోషకుడు - నాథుడు - నాయను వాడెవ్వడును లేడు. ఏకాంతను. కాంతను అని నేను నెయ్యము తియ్యము దోప పల్కితిని. అంత నా రాజులో పట్టరాని మదనావేశము ముంచుకొని వచ్చెను. 

అతడు తన సేవకుల కిట్లనెను : ఈ వరారోహ యారోహించుటకు నలుగురు మోయు చక్కని పల్లకి తెండు. అందు మెత్తని పట్టు వస్త్రములు వేయవలయును. అది మెత్తని పడక గావలయును. పల్లకి చతురస్రముగ సువిశాలముగ సువర్ణమయమై యుండవలయును అను రాజు వాక్కులు వినగనే సేవకులు వేగముగ వెళ్ళి నా కొఱకు వస్త్రము గప్పిన బంగారు పల్లకి తెచ్చిరి. 

నేను రాజునకు ప్రియుముగూర్చు తలపుతో నందు గూర్చంటిని. రాజు మోదభరితుడై నన్ను తన యింటికి గొనిపోయెను. ఆ రాజొక శుభదినమున శుభలగ్నమున నన్ను పాణిగ్రహణము చేసికొనెను. ఆ పెండ్లి విధిప్రకార మగ్ని సన్నిధిలో జరిగెను. 

నే నతనికి ప్రాణములకన్న మిన్నగ ప్రియురాలనైతిని. అతడు నాకు సౌభాగ్యసుందరియను క్రొత్త పేరు పెట్టెను. ఆ రాజు కామశాస్త్రమునందు చెప్పిన చొప్పున పెక్కు భోగవిలాసములతో నాతో క్రీడించుచు సుఖము నందెను. అతడు రేబవళ్ళు కామకళయం దాసక్తుడై రాచకార్యము లందేమరుపాటు జెంది కాలగతి గుర్తింపకుండెను.

ఆ కామకళాకోవిదుడు రమ్యహర్మ్యములందు నుద్యానముల వలపునెత్తావులందు డిగ్గియలందు వరశైలములందును నన్ను దనిపి తనిసెను. అతడు వనములందును నన్ను విడనాడక భోగించెను. అతడు సురాపానమత్తుడై నాతోడ విహరించుచు నెల్లపనులు విడనాడి నాకు వశుడయ్యెను. 

అతని గూడిన క్రీడారసమునకు లోబడి నా మొదటి మేను పురుషత్వము మునిజన్మము మఱిచితిని. అతడే నా పతి. నేనే యతని ప్రియభార్యలందు పట్టమహిషిని. విలాసవతిని. నా బ్రదుకు కడుధన్యము అని నేను దలపోయుచు రేయనక పగలనక యతని ప్రేమకు కట్టువడి సుఖప్రాప్తికొఱకతనికి వశురాలనై క్రీడలలో మునిగి తేలుచుంటిని. 

నా చిత్తమతనియందే చిక్కుకొని యుండెను. అపుడు నేను బ్రహ్మజ్ఞానము విజ్ఞానము ధర్మశాస్త్ర పరిజ్ఞానము పూర్తిగ మఱచితిని. 

మునీ! ఇట్లు కామక్రీడాసక్తనైనా యిచ్చ చొప్పున విహరించుచుండగ పదిరెండేండ్లొక్క క్షణమువలె గడచిపోయెను. అంతలోన నేను గర్భము ధరించితిని. రాజు సంతోషించి యధావిధిగ నాకు గర్భసంస్కారక్రియలు జరిపించెను. రాజు నాకు గల్గు కోర్కు లెట్టివో మాటిమాటికి నన్నడుగుచుండెను. 

అపుడు నేను సిగ్గు పడుచుంటిని. దానికి రాజెంతయో మోదమందుచుండెను. పదవనెలలో నొక శుభదినమున గ్రహలగ్న తారాబలములు మంచిగ నుండగ కొమరుడు గల్గెను. పుత్రజననమున రాజు పరమానంద భరితుడయ్యెను. భవనములో పుత్రజనన మహోత్సవము జరిపించెను. 

పరంతపా! సూతకము తీరిన పిమ్మట రాజు పుత్రముఖ మవలోకించి యుత్సాహ మందెను. నేను రాజునకు పూర్వమువలె ప్రియభార్యనైయుంటిని.

ఆ పిదప రెండేడ్లకు నాకు మఱల గర్భము నిలిచెను. అంత సర్వలక్షణములతో శోభిల్లు రెండవ కుమారుడు నాకు జన్మించెను. అతనికి రాజు సుధన్వుడను పేరుపెట్టెను. బ్రాహ్మణులు పెద్దవానికి వీరవర్మయని పేరు పెట్టిరి. 

ఈ ప్రకారముగ నేను రాజువలన పండ్రెండు మంది కుమారులను గంటిని. వారి ముద్దముచ్చటలలో లాలనపాలనలో నానందమందుచుంటిని. ఆ పిమ్మట వరుసగా నెనిమిది మంది మరల జన్మించిరి. 

ఇట్లు నా గృహస్థ జీవితము సుఖసాధనములతో నిండి తామరతంపరగ నొప్పెసగెను. రాజు వారందఱికి సకాలమున వివాహవిధు లొనరించెను. ఇట్లు నా కుటుంబము కొడుకులతో కోడండ్రతో కళకళలాడుచుండెను. అటు పిదప నాకు పెక్కురు మనుమలు గల్గిరి. వారు పెక్కు విధముల నాటలాడుచుండగ గాంచి నా మనస్సు మోహములో మునిగిపోవుచుండెను. 

ఒక్కొక్కప్పుడు నేను సుఖసంపదలందుచుంటిని. నేను మఱొకప్పుడు పుత్రుల రోగములవలన దుఃఖములు గల్గుటచే కృశించుచుంటిని. అప్పుడప్పుడు నా కొడుకులలో కోడండ్రలో కొట్లాటలు సాగుచుండెను. ఆ దారుణము చూచి నేనెంతయో కుందుచుంటిని. 

మునివరా! ఇట్టి కోర్కుల మూలముగ గల్గిన సుఖదుఃఖములుగల సంసార సాగరములో గూలితిని. నా పూర్వజ్ఞానము శాస్త్రవిజ్ఞానము నశించెను. అన్ని విధములగు నింటి పనులందు నేనే యజమానురాలనను తలపుతో నుంటిని. అపుడు నాలో మోహకమైన గర్వము మిన్నుముట్టెను. వీరందరు నా బలగము. వీరు నాక్న కొడుకులు. 

వీరు నా కోడండ్రు. నా వంశాభివృద్ధికరులు. నా కొడుకులు నేర్పుతో నా యింట నాడుకొందురు. ఆహా! ఈ ప్రపంచమందలి స్త్రీజాతిలో నేను ధన్యురాలను గదా! అనుకొంటినే కాని నేను పూర్వము నారదుడను. నన్ను వైష్ణవమాయ మోసగించెను' అని నేనెన్నడును మనస్సులో తలంచనేలేదు.

వ్యాసమునీ! నేను రాజపత్నిని. సదాచారను. ప్రజావతిని. పతివ్రతను. ధన్యురాలనని యీ మాయాసంసారమున బడి మోహభ్రాంతిలో మునిగితిని. అటు తర్వాత నొక పరదేశపు రాజు నా పతితో వైర మూనెను. అతడు రథగజములతో సేనలు గూర్చుకొని కయ్యమునకు కాలుదువ్వి కన్యాకుబ్జపురమునకు తరలి వచ్చెను. 

నగరము శత్రు సేనలతో ముట్టడింపబడెను. అపుడు నా కొడుకులు మనుమలు నగరము వెల్వడిరి. శత్రునకు నా కొడుకులకు నడుమ ఘోరయుద్ధము సంఘటిల్లెను. అందు విధి వైపరీత్యమున నా కొడుకులందఱు వైరి చేతులలో మడిసిరి. రాజు భగ్నహృదయుడై రణమునుండి యింటికి వెనుదిరిగి వచ్చెను. దారుణరణమున నా కొడుకులెల్లరు నశించిరని వింటిని. శత్రురాజు నా సుతులను మనుమలను చంపి వెళ్ళిపోయెను. నేనపుడు వలవల విలపించుచు సమరభూమికి వెళ్ళితిని. 

ఆయుష్మంతుడా! నా వారెల్లఱు హతులగుటగని శోక సాగరమును మునిగి గుండె చెఱువుగ బిట్టు వాపోతిని. ఓ నా కన్న కొడుకులారా ! మీరంద రేమైతిరి? నేటికి నే నీ పాపిష్ఠ దైవము చేతలో వంచింపండితిని గదా! అని యేడ్చితిని. 

అంతట నచ్చటికి మధుసూదనభగవానుడొక వృద్ధబ్రాహ్మణ వేషముతో తేజరిల్లు చేతెంచెను. అతడు పవిత్ర వస్త్రములు దాల్చి వేద ఘోషతో నాచెంత కేతెంచెను. నేను దీనముగ యుద్ధభూమిలో పలవించుటగని యతడు నా కిట్లనెను : 

ఓ తన్వంగీ! కలకంఠ కంఠీ! నీవు పతి-పుత్ర-గృహముల మోహభ్రాంతిలో మునిగినదానవువలె దోచుచున్నావు. ఏల యేడ్చెదవు? సులోచనా! ఇంక నేనెవరను? ఈ నాసుతులెవరు? నా గతి యేమి? అని విచారించుకొని రోదనము మాని లెమ్ము. స్వస్థవుగమ్ము. కామినీ! ఇపుడు నీవు పరలోక గతులైన నీ పుత్రులకై విధిప్రకారముగ స్నానముచేసి తిలతర్పణము లాచరింపుము.

మృతుల బంధువులెప్పుడైన తీర్థములందే క్రుంకవలయునుకాని యింట స్నానమాడరాదని ధర్మశాస్త్రములు వక్కాణించును అను ముదుసలి విప్రుని బోధములకు ప్రబోధమొంది నేను - నా రాజు-నా బంధువులు-కండ్లు తెఱచితిమి. ముందుగ బ్రాహ్మణ రూపము దాల్చిన భూతభావనుడగు భగవానుడు నడుచు చుండగ నతనివెంట నేను పరమ పావన తీర్థమున కేగుదెంచితిని. 

శ్రీహరి నన్ను పుంతీర్థమను పుణ్యసరోవరమునకు జేర్చి నాతో నిట్లనెను : ఓ గజగామినీ! పనికి మాలిన శోకముడుగుము. ఈ తటాకమున మునుగుము. నీ పుత్రుల కూర్ధ్వ కర్మలు చేయు సమయ మాసన్నమైనది. జన్మజన్మలనుండి కోటానుకోట్ల కొడుకులు - తండ్రులు - పతులు - సోదరులు - అల్లుండ్రు - మఱందఱో పుట్టిగిట్టిరి. ఈ మాయ సంసారము కోర్కుల వలన పుట్టినది - కలవంటిది - వట్టి భ్రమవంటిది. 

జీవులకు మోహతాపములు గల్గించును. ఇట్టి కపట సంసారమున నింకెవరి కొఱకేడ్చెదవు? అని పలుకు అతని హితములాలించి నేను విష్ణు ప్రేరితనై స్నానమాడదలచి పుంతీర్థమున దిగితిని. ఆ పుణ్యజలములందు మునిగిన వెంటనే నేను పురుషుడనైతిని. శ్రీహరి నా వీణ చేబూని తీరమున నిజరూపమున ప్రకాశించుచుండెను. 

ద్విజవరా! నేను మునిగి లేవగనే తీరమున కమలాక్షుని వీక్షించితిని. అంత నా చిత్తమందు పూర్వజ్ఞానము గల్గెను. నేను నారదుడను - ఇక్కడికి నేతెంచి మాయామోహితుడనైతినని తలంచితిని. అంతలోననే నారదా! రారమ్ము నీట నేమి చేయుచున్నావు? అని హరి యనెను. నేను దుర్భరమైన స్త్రీభావము వదలి పురుషరూప మేకారణమున బొందితినా యని యచ్చెరు వందితిని.

అధ్యాయము 151 మాయాగుణముల వివరణ

No comments:

Post a Comment

Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము -  సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగ...