వ్యాసు డిట్లనియెను : యవనాశ్వరాజు పరమధార్మికుడు. కాని సంతానము లేనివాడు. అతనికి నూర్గురు భార్యలు గలరు. కాని సంతులేక రాజ నిచ్చలు చింతారతంత్రుడై యుండెను.
యవనాశ్వుడు సంతుకొఱకు వనము లందున్న పుణ్య మున్యాశ్రమములు కేగి రోదించుచు దిగులు పడుచుండెను. అతడచట తాపసోత్తములగు విప్రులు కనికర ముతో కనుచుండగ వేడి నిట్టూర్పులు నిగుడించుచు కటకటపడెను.
వారు రాజుతో నిట్లనిరి : ఓ రాజా : ఏల పరితపింతువు? నీ మనసులోని వెత దెలుపుము. నిజము పలుకుము. మేమెల్ల విధముల నీ దుఃఖము తొలగు నుపాయ మాలోచింతుము.
యవనాశ్యు డిట్లనెను : ఓ మునులారా ! నాకు గొప్ప రాజ్యము- ధనము- గుఱ్ఱములు గలవు. చక్కని భార్యలు నూర్గురు గలరు. నీ కీ ముల్లోకములందును బలవంతుడగు శత్రు వొక్కడును లేడు.
ఓ తాపసులారా ! నా మంత్రిసామంతులు నా మాట జవదాటరు. కాని సంతానములేని లోటు నన్ను పీడించుచున్నది. పుత్రులులేని వానికి సద్గతులు లేవు. స్వర్గము లేనే లేదందురు. కనుక సంతానార్థమింతగ వేత జెందు చున్నాను.
మీరు వేదశాస్త్రార్థపారంగతులు. తత్త్వవిధులు-తాపసులు-శమధనులు. కనుక నాకు సంతు గల్గుటకు తగిన జన్నము దెలుపుడు. తాపసులారా! నాపై దయయున్న ఇంతమాత్రము పని చేయుడు.
వ్యాసు డిట్లనెను: అను రాజు మాటలువిని విపులు దయాంతరంగులైరి. వారంత దేవేంద్రుడు దేవత గగల యజ్ఞమును చక్కగ జరిపించిరి. విప్రుల జలపూర్ణమైన కలశమును స్థాపించిరి. వేదమంత్రములతో పుత్రార్థము జలము నభిమత్రించిరి. ఒక రేయి రాజు దప్పిగొని యజ్ఞశాల కేగెను.
అచట విప్రులందఱు నిద్రించుటగని రాజు స్వయముగ దప్పిదీర మంత్రజలము త్రాగెను. అది రాజు భార్యకొఱకు విధిగ మంత్రములచే సంస్కరింపబడినది. పిదప జలములేని కలశమునుగని విప్రు లనుమానించిరి. వారు జల మెవ్వరు త్రాగిరని రాజునడిగిరి.
రాజు జలము త్రాగెనని తెలిసి వారు దైవ బలమిదియనిరి. మునివిప్రులు యజ్ఞము సంపూర్ణము గావించి తమ తమ యిండ్లకేగిరి. రాజు మంత్ర జలబలమున గర్బముదాల్చెను. నెలలునిండిన పిదప మంత్రులు రాజు కుడి పొట్టను చీల్చియందుండి కుమారుని బయటకు తీసిరి.
దైవకృపచే రాజు చావలేదు. ఆ కుమారునకు పాలెవరిత్తురాయని మంత్రులు మిక్కిలి విచారించిరి. అంత నింద్రు డేతెంచి తన చూపు వ్రేలు చూపి 'మాంధాత' నన్ను చీకుము అని పలికెను.
నాటినుండి యతడు 'మాంధాతృ' మహీపతిగ ప్రసిద్ధుడయ్యెను. రాజా! నీ కిట్లు మాంధాతృ భూపాలచరిత్రము వివరించితిని.
ఆ మాంధాత సర్వభూగోళాన్నీ జయించి చక్రవర్తి అయ్యాడు. దస్యులు ఇతనికి భయపడి గాథారణ్యాలలోకి పారిపోయి కొండగుహలలో దాక్కున్నారు. ఈ లోకోపకారానికి సంతోషించి దేవేంద్రుడు తపదస్యుడు అనే బిరుదునిచ్చి గౌరవించాడు.
శశబిందు మహారాజుగారి గారాల కూతురు బిందుమతి ఇతనికి పట్టమహిషి - ఈ దంపతులకు ఇద్దరు తనయులు కలిగారు. పురుకుత్సుడు - ముచుకుందుడు. వీరిలో పురుకుత్సుడికి అరణ్యకుడు జన్మించాడు. పరమధార్మికుడు. ఇతని కుమారుడు పితృభక్తి పరాయణుడైన బృహదశ్వుడు. ఇతనికి హర్యశ్వుడు తనయుడు. హర్యశ్వుడి కొడుకు త్రిధన్వుడు. త్రిధన్వుడి సంతానం అరుణుడు.
No comments:
Post a Comment