సర్వశక్తి స్వరూపిణి యారాధ్య దేవతయనుట
ఋషులిట్లనిరి : మహానుభావా! వేదశాస్త్ర పురాణములను పండితుల వచనములను వినుటవలన మా హృదయము లందొక నిశ్చయమై యున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురే సనాతనదేవతలు. ఈ బ్రహ్మాండములందు వీరిని మించిన దెద్దియును లేదని మా నిశ్చయము. కాల పాకవశమున తమ్మిచూలి లోకములు నిర్మించును. తమ్మికంటి బ్రోచును. ముక్కంటి లయింపజేయును. వీరే యన్నిటికి కారణభూతులు. పూర్వమొకటే సద్రూపముండెను. అదే మువ్వురు దేవతలుగ మారెను. ఆ ముగ్గురును సత్త్వము రజస్సు తమస్సను గుణములుగలవారు. వారే బ్రహ్మ హరి హరులు. సకల కార్యకరణ దక్షులు. ఆ మువ్వురిలోన శ్రీ విష్ణుభగవానుడు శ్రేష్ఠతముడు. ఆతడే యాదిదేవుడు - పురుషోత్తముడు - మాధవుడు - జగన్నాథుడు - కార్యదక్షుడు అని పేరొందెను. ఆ మహాతేజస్వియగు హరి యెదుట నిలువబడి యతనిని కాదని యెవ్వడు నేదియు జేయనోపడు. అంతటి లోకైకనాథుని సైతము వివశునిగజేసి యోగమాయ నిద్రపుచ్చినది. ఆ విష్ణుని యద్భుతమైన లీలలును విజ్ఞానమును కార్యాచరణసమర్థతయు నేడేమైనవి? మాకీ విషయమై సందియము గలుగుచున్నది. కనుక మా మనస్సులకు నచ్చునట్టు ఈ సందియమును తీర్చుము. భగవంతుడగు హరిని గూడ జయించిన మా మహాశక్తి యెవరు? ఆమె యెవరి మూలమున నంతగొప్పది యైనది? ఆమెకు అంత సామర్థ్యమెక్కడిది? ఆమెను మహాశక్తియని యేల పిలుతురు? సర్వేశ్వరుడు సచ్చిదానంద విగ్రహుడు పరమాత్మ పరానందుడు వాసుదేవుడు జగద్గురువు శ్రీ విష్ణువు. సకల కర్త - సర్వవ్యాప్తి - పరాత్పరుడు - విరజుడు - పావనుడునగు శ్రీ హరి నిద్రకెట్లు లొంగిపోయెను? మాకిదంతయును మిగుల నాశ్చర్యమును సందేహమును గొల్పుచున్నది. నీ తెలివియను కత్తితో మా యీ సందియమును ఛేదించుము.
సూతు డిట్లనియె : ఈ చరా చర ప్రపంచములందీ సందియమును దీర్పగలవాడొక్కడునులేడు. బ్రహ్మతనయులగు సనాతనమునులే దీనికి ముగ్ధులైరి. నారదుడు కపిలుడు మున్నగువారలే యీ ప్రశ్నను సమాధానించలేక పోయిరి. ఇక దీనిని విమర్శించుటకు నే నెవడను? ఆ విష్ణువే సర్వగుడు సర్వపాలకుడునని వేదములందు గలదు. ఆతని వలననే యీ చరా చర విరాడ్రూపము పుట్టినదని యందు వర్ణింప బడెను. వేలుపు లెల్లరును శ్రీ మన్నారాయణుడు విశ్వాకారుడు హృషీకేశుడు జనార్దనుడు మేఘవర్ణుడునగు విష్ణునకు దోసిలియొగ్గి యుపాసింతురు. కొందఱు చంద్రమౌళి ముక్కంటి పంచవక్త్రుడు వృషవాహనుడు మహాదేవుడు వామదేవుడు సకల నిగమసన్నుతుడు కపర్ది గౌరీదేహార్ధధారి సర్వశక్తి యుక్తుడు దక్షయాగ విధ్వంసకుడునగు శ్రీ సాంబసదా శివుని నిచ్చలు నభిషేకాదులతో సేవించుచుందురు. మఱి కొందఱు వేదవేత్తలు మూడు సంధ్యలందును పెక్కు స్తోత్రములతో పరమసత్య స్వరూపుడగు సవితృదేవుని ధ్యానించి జపింతురు. వేదములన్నియును సూర్యోపాసనమే యుత్తమమనియు సూర్యనారాయణుడే పరమాత్మయనియు నొక్కి వక్కాణించినవి. ఇంకను కొందఱు బ్రహ్మ విదులు నిగమములు పలికిన విధముగ నగ్నిని లోకపాలకుడగు నింద్రుని వరుణుని సంస్తుతింతురు. ఎల్ల ప్రవాహములతో గలిసి ప్రవహించు పావనగంగ నదులలో నుత్తమోత్తమమై యలరును. అఖిల దేవగణములందు పద్మనాభుడు పురుషోత్తముడై తనరును అని మహర్షులు వచింతురు. ఇక ప్రమాణములు ముత్తెఱంగులని పండితులు వాక్రుత్తురు. అవి ప్రత్యక్షము-అనుమానము-శబ్దముననబడును. కొందఱు వానిలో నుపమానమును జేర్చి నాలుగందురు. మఱి కొందఱు వానిలో నర్థాపత్తిని గలిపి ప్రమాణము లైదని పలుకుదురు. మనీషులు వానితో నితిహాసమును పురాణమును గలిపి సప్త ప్రమాణములు గలవందురు. ఇన్ని ప్రమాణములచే గూడ నా పరబ్రహ్మము పరాశక్తి వారికెంతమాత్రమును తెలియబడదు.
స్థితప్రజ్ఞుడు తన నిశ్చయాత్మక బుద్ధిచే వేదాంతార్థములచే నాత్మతత్త్వమును గూర్చి తనయందే స్వాత్మతత్త్వం విచారణ చేయుచుండవలయును. ప్రత్యక్షవస్తు విజ్ఞానముచే బుద్ధిమంతుడు మాటి మాటికిని విత్కరించుచు ఆత్మ చింతన చేయవలయును. తాను దృష్టాంతములతో తన నిజ స్వరూపమును విమర్శించుకొన వలయును. ఆప్తులుదెలుపు సత్య మార్గమున నడువవలయును. ఈ విధముగ స్వాత్మదర్శనము విషయమున పండితులు నుడుపుదురు ఎల్లపురాణములందు నిట్లే కలదు. బ్రహ్మయందు సృజనశక్తి శ్రీ విష్ణువునందు పరిపాలన శక్తి గలదు. రుద్రునియందు సంహారక శక్తి సూర్యునిలోన ప్రకాశన శక్తి శేషునందు కూర్మమునందు భూభరణ శక్తి అగ్నియందు దహనశక్తి వాయువునందు ప్రేరణశక్తి మున్నగు నీ శక్తులన్నియు నా మహాశక్తి పరిణామ స్వరూపములే. కుండలినీ శక్తికి దూరమైనచో శివుడును శవత్వమందును. శక్తి రహితుని పండితులు వీడు చేతకాని వాడని దెప్పుదురు. కాన నీ స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండ మందు గడ్డి మొదలు బ్రహ్మ వఱకుగల భూతములన్నిటి యందు నిటులే శక్తి నిండి యిమిడి వెలుగొందును. అట్టి శక్తిలేని చరాచర వస్తువులు పనికిమాలినవే. శక్తిహీనుడు నడచుటకును తినుటకును పరుల గెలుచుటకును పనికిరాడు. అట్టి సర్వగత మగు శక్తినే పరబ్రహ్మమందురు. ఆ విశ్వశక్తి నాత్మరతితో తెలివివెలుగుతో విచారించి పెక్కుగతుల నిత్యము నుపాసింప వలయును. విష్ణునందు సాత్విక శక్తి గలదు. దానినతడు గోల్పోయినచో నతని యాట కట్టినట్లే. బ్రహ్మయందు రాజస శక్తి గలదు. అది లోపించినచో నతని రచన యాగినట్టే. శివునియందు తామస శక్తి గలదు. దానిచే నతడు సంహారమొనర్పగల్గును అని యిట్లు చక్కగ నెఱింగి వ్యక్తి తన శక్తిని దాను తెలిసి కొనవలయును.
ఆ మూలాధార శక్తియే యీ చరాచర బ్రహ్మాండములను నిర్మించును - పోషించును - సంహరించును. ఆ శక్తి బలమే లేనిచో బ్రహ్మ హరి శివుడు రవి వహ్ని వరుణుడు మున్నగు దేవతలు శక్తిహినులగుదురు. దాన వారి పనులు కుంటుపడినట్లే. దేవత లెల్లరును శక్తియుక్తులైననే తమ తమ పనులు చక్కగ నెరవేర్చుకొందురు. ఆ శక్తియే యన్ని కార్య కారణములందును ప్రత్యక్షముగ వెల్లడి యగుచుండును. ఆ శక్తినే మనీషులు సగుణయనియు నిర్గుణయనియు రెండుగ దెల్పిరి. రాగవంతులు సగుణశక్తిని విరాగులు నిర్గుణశక్తిని గొలుతురు. ఆ శక్తియే ధర్మార్థ కామ మోక్షము లీజాలు స్వామిని. ఆ దేవిని విధి విధానమున నారాధించినచో నామె మనయెల్ల కామితార్థము లీడేర్చగలదు. జడమతులు మాయకు లొంగుటచే నా శక్తి మహిమ నెఱుగ జాలరు. కొందఱాశక్తినే కొలదిగ తెలిసికొందురు. కాని, వారితరులకు దానిని తెలుపనేరక వారిని భ్రమలో ముంతురు. మందమతులగు పండితులు కొందఱు కలిప్రేరితులై పొట్టకూటికై చేయరాని పనులుచేసి పాషండులగుదురు. ఈ కలికాలమున ననేక విపరీతములు తలలెత్తును. కాని యితర యగములం దధర్మములు లేనేలేవు. విష్ణువు దేవి దయకై పెక్కేండ్లు తీవ్ర తపమాచరించు చుండును. స్వయంభువు శంభువు నాధ్రువ శక్తి దయ సంపాదింప నిరంతరముగ ధ్యానింతురు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోననేమేమో కోరికల పుట్టలు పెంచుకొని యనేక యజ్ఞములు సలుపుదురు. వారా పరశక్తిని పరబ్రహ్మమునుగా సనాతనగా పరాత్మికగ నిత్యగా నిత్యము తమ చేతములందు ధ్యానింతురు. కనుక నన్నియు తెలిసిన విద్వాంసులా పరమశక్తినే నిత్యము సంసేవింప వలయును. ఇదే సకల శాస్త్రముల సారమని తెలియవలయును. నిజముగ సకలశాస్త్రము లందును దెలిసికొనదగిన దాశక్తియే. ఇదంతయును నేను శ్రీ వ్యాసుని వలన వ్యాసుడు నారదుని వలన దేవర్షి తన తండ్రి బ్రహ్మ వలన విష్ణుని వలన నెఱింగితిమి. పండితు లితరుల మాటలు వినరాదు - తలంపరాదు. కృతనిశ్చయులగు ధీరులా సత్యశక్తినే సంసేవింప వలయును. అశక్తుని యందలి సత్తువ యెంతటిదో కన్నులార చూచిన గాని తెలియదు. కావుననే సకల భూతము లాపరశక్తినే యెఱగి నిత్యము సమారాధించవలయును.
అధ్యాయము 9 శ్రీదేవి దయచే విష్ణువు మధుకైటభుల పరిమార్చుట
No comments:
Post a Comment