Saturday, August 22, 2026

Kamsuni Pampuna Nakrurundu Brndhavanambunaku Janudenchuta - కంసుని పంపున నక్రూరుండు బృందావనంబునకు జనుదెంచుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
కంసుని పంపున నక్రూరుండు బృందావనంబునకు జనుదెంచుట

గతజన్మలో నేను ఎటువంటి తపస్సుచెశానో? ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నానో? యోగ్యులైనవారికి ఎటువంటి దానాలు చేశానో? ఆద్యులైన పరమయోగుల దివ్యదృష్టికి సైతం గోచరించని ప్రభువూ, పరబ్రహ్మస్వరూపుడూ అయిన శ్రీ కృష్ణుణ్ణి నేను చూడబోతున్నాను.

పూర్వం ప్రాజ్ఞులైనవారు ఏ పరమపురుషుని ప్రకాశించే పాదాలగోళ్ళ కాంతిపుంజాన్ని ఆశ్రయించి జననమరణాలు అనే చీకట్లలో చిక్కుకొనక తరించారో, అలాంటి పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి పగచేతనైనా జయించదలచి పిలుచుకొని రమ్మని నన్ను అవ్యాజమైనప్రేమతో పంపి, కంసుడు నా కెంతో మేలు చేశాడు. కంసుడితో సమానుడైన చెలికాడు నాకు మరొకడు లభించడు.

ఈ అక్రూరుడు కంసుడి ఆజ్ఞచేత నన్ను బాధించడానికి వచ్చిన పరమ దుర్మార్గుడని భావిస్తాడో! లేక సకలప్రాణుల లోపలా వెలుపలా నడుమా చక్కగ వ్యాపించి ఉన్న పరమాత్మ కనుక నాతత్త్వ మెరిగి నన్ను మంచివాణ్ణిగా ఎంచి ఎంతగా గౌరవిస్తాడో! నాతో ఏ విధంగా సంభాషిస్తాడో చూడాలి. ఇంతకూ నా భాగ్యం ఎట్లుందో తెలియదు.

అని ఇంకా

ఈ అరణ్యంలోని మృగాల సమూహం ఈ మార్గాల గుండా నా కుడివైపునుంచి వెళుతోంది. ఈ శుభశకునాన్నిబట్టి ముంగురులతో శోభిల్లే, చంద్రుడితో సమానమైందీ, నవ్వుల వెలుగులతో విరాజిల్లే, పద్మాలవంటి నయనాలు గల, చెవులలోని మకరకుండలాలచేత దీపించే బుగ్గలు గల, తామర రేకులవంటి కన్నులుగలదైన ఆ శ్రీకృష్ణునిముఖం దర్శించే భాగ్యం నాకు తప్పక లభిస్తుంది.

నేను సంజపొద్దున నందగోకులానికి వెళ్ళి, లక్ష్మీవల్లభుడైన శ్రీకృష్ణునిపాదాలచెంత సాష్టాంగ నమస్కారం చేస్తాను. అలా మొక్కగా ఆయన శీఘ్రగమనం కల్గిన కాలమనే సర్పంయొక్క విజృంభణానికి తల్లడిలే భక్తజనుల భయాన్ని తొలగించే పద్మంవంటి తనహస్తాన్ని నా తలపై మోపి, చిరునవ్వు లొలికిస్తూ కరుణతో నాకు అభయ ప్రదానం చేయక మానడు.

అక్రూరుడు ఈ ప్రకారం పలురీతుల శ్రీకృష్ణుని సందర్శనం కోరుతూ వేగంగా వెళ్ళే అందమైన రథాన్ని అధిరోహించి చాలదూరం వెళ్ళాడు. అలా వెళ్ళి వెళ్ళి

అక్రూరుడు ఎదుట బృందావనాన్ని సందర్శించాడు. ఆ బృందావనం గొప్పగందపుచెట్టు, మొల్ల, అడవిమల్లె, తాటి, మద్ది, ఎర్రగోరింట, మర్రి, తియ్యమామిడి మొదలైన, వృక్షాలనూ కలిగి ఉంది. వికసించిన ఎర్రతామరలతో అది విలసిల్లుతూ ఉంది. ఆ బృందావనం బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి సంతోషపరుస్తున్నది.

అక్రూరుడు బృందావనంలో ప్రవేశించాడు. సంజవేళలో దూడలూ, కోడెలూ, తొలిచూలు గేదెలూ గుంపులు గుంపులుగా మేతకై వెళ్ళి అక్కడక్కడ పచ్చని పచ్చికలు మేస్తూ ఎంత సేపటికీ ఇండ్లకు మరలి రాకపోతే వాటిని వెదకటానికి వెళ్ళి పొదలూ, మరుగులూ, మిట్టపల్లాలూ లెక్కించక పొదల్లో దూరి పరుగెత్తుతూ వెదకి ఎక్కడా కనిపించక గోపాలురు ఒకరి నొకరు ఎలుగెత్తి పిలిచే సవ్వడిని ఆలకించాడు. 

మెత్తని పచ్చిక మేసే కుతూహలంతో ఆగి, అంతలో తమ లేగ దూడలను తలచుకొని ఆలసించక మమకారంతో తమకు తామే అంభారావాలు సలుపుతూ, పొదుగులనుండి పాలు కార్చుకుంటూ పరుగెత్తి వస్తున్న ఆవులను ఆలోకించాడు. అపుడే పుట్టినదూడల్ని దగ్గర ఉంచుకొని, పలుపులు చేత పుచ్చుకొని, కొత్తగా ఈనిన బాలెంతగోవులు వెంబడించగా, మెల్లగా వెళుతున్న గొల్లలను విలోకించాడు. 

చిరుతలు, సివంగులు, పెద్దపులులు మొదలైన క్రూరజంతువుల బారిన పడకుండా జాగరూకులై మందకు రెండు వైపులా గండ్రగొడ్డళ్లు, ఈటెలు, విండ్లు ధరించి కావలి కాస్తున్న పసుల కాపర్లను దాటి ముందుకు సాగాడు.

అక్కడ పలురకాలైన మిసిమిగల కసవులు మేసి చక్కగా బలిసి కొట్టాలలోచేరి ఆవులు హాయిగా నెమరు వేస్తున్నాయి. దూడలు పాలుగుడిచి తల్లులయెదుట చెలరేగి చెంగు చెంగున దుముకుతున్నాయి. ఎదకు వచ్చిన ఆవులను దాటుతూ వృషభాలు ఎదురునిలిచి ఒకదానితో ఒకటి డీకొని కొమ్ములతో కుమ్ములాడుతున్నాయి. 

ఆరునెలల వయసుగల దూడలు మొక్కవోని బలంతో మెడపలుపులు తెంచుకొని పొదలు దూరి కుప్పించి దుముకుతూ తల్లిపొదుగులను పొడిచి పొడిచి పాలు కుడుస్తున్నాయి.

వాటిని అదలించి ఇవతలకు పట్టి ఈడువలేక పిల్లలు పెద్దలను పిలుస్తున్నారు. కొడుకులను, భర్తలను, మామలను, మరదులను మోసగించి మన్మథ శరపీడితలై గొల్లమగువలు ఇంటిపనులు మరచి, జంకు గొంకులు వదలి, సంకేత స్థలాలకు చేరి శ్రీకృష్ణుని రాకకై వేచి ఉన్నారు.

గోపకులు పసుల కొట్టాలలో ఆవులకు దూడలను విడుస్తూ, తిరిగి వెనుకకు లాగి కట్టివేస్తూ, మరల విడుస్తూ, పట్టి ఈడుస్తూ ఇలా క్రీడిస్తున్నారు. ఆవులగిట్టలవల్ల పొడిపొడిగా పరుచుకొన్న ఎండుపేడయొక్క దుమ్ము గోవులను పిదికేటప్పుడు చిందిన ఆ పాల తుంపురలవల్ల తడిసి, అణగిపోయి అడుసుగా మారింది.

గోపాలురు పాలుపిండేటప్పుడు ఆవుల చనులనుండి చెంబులలోనికి కారే క్షీరధారలు జుంజుమ్మని చప్పుడు చేస్తున్నాయి. ఆబోతులు తమ మెడ దురద తీర్చుకోడానికని, ఒరసికొనగా నునుపారిన గృహద్వారసీమల్లోని స్తంభాల సమీపాన పరుండి ఉన్న కుక్కలు ఉలికిపడి కొత్తగా వచ్చినవారిని చూచి కోపంతో భౌ భౌ అని మొరుగుతున్నాయి. 

బలరామశ్రీకృష్ణుల భుజదండాలు అనే ప్రాకారంతో పరిరక్షించబడుతూ ఈ రీతిగా ఉన్న ఆ వ్రేపల్లె లోనికి అక్రూరుడు ప్రవేశించాడు.

పద్మం, అంకుశం మొదలైన శుభచిహ్నాలతో కూడిన శ్రీకృష్ణుని అడుగుల గుర్తులను ఆ వ్రేపల్లె దారులలో అక్రూరుడు దర్శించాడు. ఆనందంతో అతడిశరీరం పులకించింది. కనులలో ఆనందబాష్పాలు నిండాయి. శ్రీ కృష్ణుణ్ణి సందర్శించ వలెననే తహతహతో ఆయన రథం నుంచి కిందికి దిగి

అక్రూరుడు కమలాలవంటి కన్నులు గలవారూ, ఒప్పిదమైన దేహాలు గలవారూ, ఆవుల పాలుపిండే వాడలలో మెలగే వారూ, అలంకరించబడినవారూ, మిక్కిలి ప్రకాశమానులూ, పచ్చనివి, నల్లనివి, ప్రకాశించేవి అయిన కొత్త బట్టలు కట్టినవారూ, పుష్పమాలికలు ధరించినవారూ, ధైర్యవంతులూ, మగువల పాలిటికి మన్మథులూ, భువనాలు నమస్కరించదగ్గ విధానాలచేత అధికులూ అయిన శ్రీకృష్ణబలరాముల్ని దర్శించాడు.

బలరామకృష్ణులను చూచి వారిపట్ల తనకుగల భక్తిచేత అక్రూరుడు పరవశించిపోయాడు. శరీరంలో గగుర్పాటు కలుగగా కనులనుండి ఆనందబాష్పాలు వానగా కురియగా వారిపాదాలకు నమస్కరించాడు.

అక్రూరుడు అలా నమస్కరించిన తరువాత

పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు భక్తజనులపట్ల ప్రేమగలవాడు. క్రూరులుగాని మానవుల్ని మంచిస్వభావంతో రక్షించేవాడతడు. అక్రూరుడు తమకు నమస్కరించిన తరువాత సుదర్శన చక్రం ధరించే తన కుడిచేతిని ముందుకు సాచి అతణ్ణికౌగిలించుకొన్నాడు.

అనంతరం అక్రూరుడు బలభద్రుడికి ప్రణమిల్లాడు. అతడు అక్రూరుణ్ణి కౌగిలించి, అతని చేయిపట్టుకొని, కృష్ణునితో గూడ తన గృహానికి తీసుకొని వెళ్ళాడు. కుశలప్రశ్న కావించాడు. 

గద్దెమీద కూర్చుండబెట్టి కాళ్ళు కడిగాడు. మధుపర్కం సమర్పించాడు. ఆవు నిచ్చాడు. సాదరంగా కమ్మనిభోజనం పెట్టించాడు. తాంబూలం, చందనం, పూలదండలు సమర్పించాడు. ఆ సమయంలో నంద మహారాజు ఆసీనుడై ఉన్న అక్రూరుణ్ణి ఆదరించి ఇలా అన్నాడు.

అక్రూరా! చెల్లెలు వేడుకొంటున్నా ఆమె కొడుకుల్ని చంపిన క్రూరుడైన కంసుడు బ్రతికి ఉండగా దశార్హవంశస్థులైన మీకు భూమిమీద మనుగడ లభిస్తుందా? ఇట్టి స్థితిలో మీ క్షేమాన్ని గూర్చి ఏమని విచారించేది?

నందమహారాజు ఆ విధంగా అన్నాడు. ఆ పిదప అక్రూరుడు ఒక మంచం మీద హాయిగా కూర్చొని ఉండగా శ్రీకృష్ణుడు అతనితో ఈ విధంగా అన్నాడు.

అక్రూరా! నీకు కుశలమేగదా! మన స్నేహితులు సంతోషంగా ఉన్నారా? బంధువులు క్షేమంగా ఉన్నారా? మథురా నగరంలోని ప్రజలంతా భయంలేకుండ ఉన్నారు గదా! మన వంశంలో జన్మించినవా రందరూ మనస్సంతోషంతో ఉన్నారా? మా మేనమామ కంసుడు భయంలేకుండా ఉన్నాడా? నన్ను కన్నారనే సాకుతో చెరసాలలో బంధితులైన దేవకీవసుదేవులు ఊపిరితో జీవించియున్నారా?

అక్రూరా! నా తలిదండ్రులైన దేవకీ వసుదేవులు ఈ రోజు నీ విక్కడికి వస్తున్నప్పుడు నాకు చెప్పుమని నీతో ఏమైనా చెప్పారా? ఆ వార్తయేమి? కంసుడివల్ల భయపడి తమ కేదారీ లేదని వారెంత కృశించి పోయారో! ఎంత దుఃఖించారో! ఎట్టి దీనావస్థకు లోనయ్యారో! ఎన్నికష్టాల పాలైనారో? నాకు వినిపించు.

అక్రూరా! నీవు ఏమి కారణంగా ఇక్కడికి వచ్చావో చెప్పుమని శ్రీకృష్ణుడు అడిగాడు. అప్పుడు అక్రూరుడు కంసుడి దగ్గరకు నారదుడు వచ్చి విరోధం పెరిగే మాటలు చెప్పి వెళ్ళడం, కంసుడు దేవకీ వసుదేవులను చంపడానికి పూనుకొని, మానుకోవడం, ధనుర్యాగమనే నెపంతో కంసుడు తన్ను పంపించినవిధం బలరామశ్రీకృష్ణులకు తెలిపాడు. ఆ మాటలకు రామకృష్ణులు నవ్వారు. తమ చుట్టూ చేరిన నందుడు మొదలైన గొల్లపెద్దలను చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

గోపకులారా! ప్రభువైన కంసుడు ధనుర్యాగం చూడటానికి మనల్ని పిలుచుక రమ్మని అక్రూరుణ్ణి పంపించాడు. కనుక మనం యాగం దర్శించడానికి వెళ్ళాలి. మీ శక్తి కొలదీ మీ మీ ఇండ్లలో పాలు పెరుగు, నెయ్యి, నూతనవస్త్రాలు మొదలైన కట్నాలూ, కానుకలు సమకూర్చుకొనండి. మథురానగరానికి యాత్రగా మనం వెళ్ళాలి. వాహనాలను తీసుకొనిరండి, వెళ్లండి.

అని శ్రీకృష్ణుడు గొల్లలను ఆజ్ఞాపించాడు. అక్రూరుడు శ్రీకృష్ణుని మధురకు తోడ్కొని పోతాడని గ్రహించి గోపికలు కలత చెంది

లేడి చూపులవంటి చూపులుగల గొల్ల భామలందరూ తమ ఏకాంతగ్భహాలలో గుంపులుగా చేరి, శ్రీ కృష్ణుని చిరునవ్వులూ; పలుకులూ; సరససల్లాపాలూ, విలాసచేష్టలూ, వినోదాలూ, ఆదరణలూ, పద్మాలవంటి హస్తాల ఆలంబనాలూ, పిలుపులూ తమ మనసుల్లో మెదిలి వేదన గల్గించగా ఇక మీద ఇవన్నీ అనుభవించడానికి ఆయనను తమవద్ద నిలుపుకొనే ఉపాయ మేమిటా? అని మంతనాలు సలిపారు.

ఇంకా తమలో తాము ఇలా అనుకొన్నారు.

బ్రహ్మదేవుడు పెద్ద సంసారి అని చాల విశ్వసించాం. ఆలోచించగా ఆయనలో ఉత్తమగ్భహస్థలక్షణం ఏ మాత్రం లేదు. మన ప్రభువైన కృష్ణుణ్ణి మనతో ఇక్కడ ఉండనీయక వేరొక చోటికి వెళ్లేందుకు నిర్ణయించి చిన్న పిల్లవాడివలె ఆటలాడుతున్నాడు. అయ్యో! ఆతని ఈ దుండగపు చేష్టలుగురించి ఆయన ఇల్లాలు సరస్వతికైనా చెప్పండి.

అని గొల్లపడతులు బ్రహ్మను నిందిస్తూ మన్మథ తాపానికి లోబడ్డ హృదయాలు గలవారై

అక్రూరుడు మధురకు రమ్మని పిలువగానే శ్రీకృష్ణుడు వెళ్ళడానికి సంసిద్దుడయ్యాడేగాని, అయ్యో! ఈ గోపయువతులు నన్నే నమ్ముకొని ఉన్నారు. వీళ్లను మన్మథబాణాల పాలుచేసి నేను వెళితే అధికమైన మదనతాపంతో కుమిలి కృశించి పోతారేమో అని ఏ మాత్రం అనుకోవడం లేదు. ఇకపోతే మన అమ్మలక్కలుగాని, మన గొల్లపెద్దలుగాని మధురకు పయనం మానుకొమ్మని అచ్యుతునితో మాట వరుసకైనా అనడంలేదే! అయ్యో! ఇక మన గతిఏమి?

అక్రూరుడని పేరుపెట్టుకొని వచ్చి ఈ క్రూరాత్ముడు ఈ రోజు మా హృదయేశ్వరుడూ చక్రాయుధుడూ అయిన కృష్ణుణ్ణి మాచెంత ఉండనీయక తనవెంట మథురానగరికి తోడ్కొని వెళ్ళడానికి చక్కగా యోచించి విచ్చేశాడు. ఇతడు క్రూరాత్ముడు. అక్రూరుడే అయితే కుటిల బుద్దులు మానుకొని శ్రీకృష్ణుణ్ణి ఇక్కడే దిగవిడిచి తనదారిని తాను వెళ్ళాలని అనుకోడా?

అయ్యో! క్రూరుడైన ఈ అక్రూర నామధేయుడు శ్రీకృష్ణుణ్ణి మధురానగరికి తోడ్కొని వెళ్ళగానే విప్పారిన తామర రేకులవంటి ముఖాలు గలవారూ, పూర్ణచంద్రబింబాలవంటి ముఖాలు గలవారూ అయిన ఆ మధురానగరిలోని స్త్రీలు రేపు మేడలమీదినుంచి తనమీద పసిడి పేలాలు మెల్లగా చల్లగా వారిని కనులార చూచి, వారితో సాంగత్యం సల్పడానికి యత్నిస్తాడే గాని, వ్రేపల్లెవాడలోని గొల్లపడతులమైన మనమీద పడటానికి అతడు ఉత్సాహపడడుగదా!

పట్టణంలోని నీటుకత్తెల చూపులు, సరససంభాషణాలు, తెరచాటు కలయికలు మరగి, మాధవుడు మనల్ని ఇచ్చగించడు. ఓ యమ్మా! రాజులు కొత్తలను కోరుతుంటారు గదా!

కఠినాత్ముడైన ఆ దేవుడు పుట్టినప్పటినుండి శ్రీహరి ఎలాంటివాడో తెలియని మథురాపురిలో నివసించే యువతులకు ఈయన్ను పతిగా చేసి, అధికమైన విరహాగ్నితాపం అనుభవించడానికి గొల్లపల్లెలోని మగువలమైన మనల్ని వెదకి తెచ్చాడు.

మా మాధవుణ్ణి ఎందుకు మథురకు తీసుక వెళుతున్నావు? అలా తీసుక వెళ్ళవద్దు అని మన మందరం కలిసి ఆ అక్రూరుణ్ణి వేడుకొందామా? యదువల్లభుణ్ణి మధురకు వెళ్ళనివ్వకండి, వ్రేపల్లెలోనే నిల్పండి అని దేవతలను పూజిద్దామా? మథురకు వెళ్ళవద్దని గోవిందుని కాళ్ళకు అడ్డం పడదామా? ఓ దైవమా! మాకీ దుఃస్థితి ఎందుకు కల్పించావని ఆ గోపకాంతలు మన్మథతాపచేత భ్రాంతిచెంది, కొప్పులు వీడడం, కట్టిన చీరలు జారడంకూడా మరచిపోయారు.

గోపకాంతలు లజ్జలు వదలి, కనులజంట నుండి ఎడతెగకుండా దుఃఖబాష్పాలు కారుతుండగా, శరీరాలు మరచి, చెక్కిళ్ళయందు కమలాలవలె కోమలాలైన చేతులుచేర్చి, గాలిచేత మిక్కిలి చలింపజేయబడిన తీగలకు పోల్చదగినవారై, గోవిందా! మాధవా! దామోదరా! అని పిలుస్తూ మమ్మల్ని దయతో రక్షించుమని స్వరబద్ధంగా, లయబద్ధంగా కీర్తనలతో విలపించారు.

ఆ మరుసటిరోజు సూర్యోదయవేళలో తనతో ప్రయాణానికి పూనుకొని నడచివచ్చే గోపికల్ని నేను మథుర నుంచి తిరిగి వస్తానని దూతికలద్వారా చెప్పించి, వారిపయనాన్ని శ్రీకృష్ణుడు మాన్పించాడు. బండ్లలో కానుకలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైన పదార్థాలను ఉంచుకొని, నందుడు మొదలైన గొల్లపెద్దలు వెంబడించగా అక్రూరుడు తోలే రథమెక్కి మథురానగరంవైపు వెళ్ళే సమయంలో

శ్రీకృష్ణుడు మథురకు రథమెక్కి వెళుతుండగా గోపవనితలు గుంపులుగూడి అక్కడనే కదలక నిలిచి 'అడుగో! మన ప్రాణనాయకుడు మథురకు వెళుతున్నాడు. ఆయన ఎక్కిన రథం అదే. జెండా మాత్రం కనిపిస్తున్నది. ఆ వైపు ఆ రథానికి గట్టిన గుర్రాల కాలిగిట్టలవల్ల రేగిన ధూళి చూడండి' - అంటూ తమ హృదయాలలో నెలకొన్న ప్రణయంవల్ల శౌరి వెళ్ళిన రథంవైపే దృష్టి మరల్చి తమ కనులకు అందినంతవరకు ఆ దృశ్యాలనే ఉన్నచోటనే కదలకుండా నిలబడి, వారు చూశారు.

ఈ విధంగా రథమెక్కి శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో, బంధువైన అక్రూరుడితో వెళ్ళీ

శ్రీకృష్ణుడు ఎంతో నిర్మలములైన అలలమీదినుంచి వెడలే చల్లని వాయువుతో కూడిందీ, సకలపాపాలను నశింపజేసేదీ, కవులూ, పండితులచే గౌరవింపదగిన దాన్ని, పరమధన్యాత్మురాలూ, కళిందపర్వతపుత్రీ అయిన యమునానదిని చూచాడు.

శ్రీకృష్ణుడు యమునను చూచి సానబెట్టిన మణిసముదాయంవలె తళతళ మెరుస్తున్న ఆ నదీజలాన్ని తాగి బలరామునితోగూడ చెట్ల సమీపాన ఉన్న రథంలోపలికి చేరాడు. అప్పుడు అక్రూరుడు వారిద్దరికీ నమస్కరించి, అనుజ్ఞ పుచ్చుకొని, కాళిందీనదిమడుగులో దిగి యథావిధిగా వేదమంత్రాలు జపిస్తూ, స్నానం చేశాడు.

అక్రూరుండు యమునలో రామకృష్ణుల దర్శించి నుతించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment