Monday, September 7, 2026

Sri Krishna Balaramulu Vaikunthamuna Karuguta - శ్రీ కృష్ణ బలరాములు వైకుంఠమున కరుగుట

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - శ్రీ కృష్ణ బలరాములు వైకుంఠమున కరుగుట

పరీక్షిన్మహారాజుతో శుకమహర్షి ఇలా అన్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు అన్యాయవర్తులైన దుర్మార్గులను చంపి, న్యాయవర్తులైన సజ్జనులను కాపాడి బలరామునితో కలసి ద్వారకనుండి వెళ్లిపోగా యాదవులు మద్యపానంచేసి మదించి ఈర్ష్యతో సరదాగా తమలో తాము పోట్లాడుకోవడం మొదలుపెట్టారు.

(అది నిజమైన పోట్లాట (యుద్ధం) గా మారింది). ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాల్బలం (సైనికులు) అనే చతురంగ బలాలతో కూడి అడ్డులేకుండా యుద్దానికి తలపడ్డారు. మునులశాపం కారణంగా ఎత్తెన తుంగపోగులతో అలసిపోయేలా కొట్టుకొంటూ, పొడుచుకొంటూ తలపడ్డారు. 

తుంగపోగులు వజ్రాయుధంతో సమానంగా తగలగా ముక్కలై, కూలిన మొండాలతో, వికలమైన శరీరాలతో, విరిగిన రథాలతో, ఒరిగిన బండ్లతో, నేలపై కూలిన గుర్రాలతో, ఒరిగిపోయిన ఏనుగులతో ఆ యుద్ధభూమి నిండిపోయింది. ఆ యుద్ధంలో యాదవులందరూ చనిపోవడం చూచి నవ్వుకొంటూ శ్రీకృష్ణుడు, బలరాముడు అలా అలా వెళ్లిపోయారు.

అలా వెళ్లి, బలరాముడు ఒక దారిలో పోయి యోగమార్గంతో ఆదిశేషునిలో కలిశాడు (బలరాముని అవతారం సమాప్తమైంది. శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్లి ఒక పొదరింటి మాటున (పడుకొని) విశ్రాంతి తీసుకొంటూ ఒక కాలిమీద మరొక కాలుపెట్టి కదిలిస్తూ వినోదిస్తూ ఉండగా ఒక బోయవాడు వేటకు వచ్చి దిక్కులన్నీ నిక్కి చూస్తూ ఉంటే చెట్టుమాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవివలె కనిపించింది. 

వెంటనే వాడు బాణాన్ని వింటియందు చేర్చి గురిచూసి వదిలాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారాలు చేస్తూ కదులుతూ ఉంటే, బోయవాడు దగ్గరకు వచ్చి జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడని తెలుసుకొని భయంతో 'మహాపరాధిని, పాపాత్ముడను, వక్రబుద్దిని' అని అనేక విధాలుగా దుఃఖిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే వాడిని చూచి కృష్ణుడిలా అన్నాడు. 

'నువ్వెందుకు దుఃఖిస్తావు? పూర్వజన్మలలో చేసిన కర్మలు ఎంతటి వారికైనా అనుభవించవలసిందే. తప్పదు. నీవు కారణమాత్రుడవు అంతే'. అని తెలుపగా వాడు “గొప్ప తప్పులు చేసినవాళ్లు ఊరికే పోరు. దేవతలకు, గురువులకు, వైష్ణవులకు ద్రోహం చేసినవారు ఉండడానికి వీలుకాదు” అని పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశదీక్షకు పూనుకొని ప్రాణాలు వదలి వైకుంఠానికి వెళ్లాడు. అప్పుడు ...

(ఈ వచనంలో ప్రధానాంశం బలరామకృష్ణుల నిర్యాణం. మూలంలో వివరంగా ఉన్న విషయాలను నారయ ఈ వచనంలో సంగ్రహించాడు. మూలభాగవత విషయాలను చూస్తే అవి తెలుస్తాయి.)

తరువాత శ్రీకృష్ణుని రథసారధియైన దారుకుడు అందమైనవాడూ, ఏకాగ్రతతో ఆలోచిస్తున్నవాడూ, సర్వజ్ఞుడూ, మేరుపర్వతం వంటి ధీరుడూ, రాక్షస సంహారకుడూ, ఏకాంతంగా ఉన్నవాడూ అయిన శ్రీకృష్ణుని ఎంతో ప్రీతితో చూశాడు.

అలాచూసి మిక్కిలి భయభక్తులతో చేతులు జోడించి దారుకుడు ఇలా అన్నాడు.

శ్రీకృష్ణా! నిన్ను కనుగొనలేని కన్నులు వ్యర్థాలు. నిన్ను వర్ణించని నాలుక రసహీనం. నిన్ను చూడని రోజులు నిందింపదగినవి. కనులారా చూచి నన్ను ఆదరించు.

అంటూ దారుకుడు దుఃఖంతో ఇలా విన్నవించాడు. 'యాదవసమూహం (సముద్రమంత యాదవసమూహం) నశించింది. చుట్టాలు, గురువులు, మిత్రులు అటూ ఇటూ చెల్లాచెదరైపోయారు. ద్వారకకు పోయి మిత్ర జనంతో ఏమని చెప్పేది?' అని అంటూ ఉన్న సమయంలోనే శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలూ, దివ్యమైన రథాలూ, గుర్రాలూ మాయమైపోయాయి. 

శ్రీకృష్ణుడు దారుకునితో 'అక్రూరునికి, విదురునికి ఈ విషయమంతా చెప్పు. అర్జునుడి వద్దకు వెళ్లి స్త్రీలనూ, పిల్లలనూ, గురువులనూ, వృద్ధజనాన్ని హస్తినాపురానికి తీసుకొని పొమ్మని చెప్పు. ఇక వెళ్లు' అన్నాడు. 

దారుకుడు తిరిగివెళ్లి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు వివరంగా తెలియజేశాడు. అలా చేసేలోపలే ద్వారకానగరం పరిపూర్ణజలంలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించడానికి వీలు లేకపోయింది. 

అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో బయలుదేరి నారదాది మునుల సమూహం, బ్రహ్మరుద్రాది దేవతలు జయజయ నినాదాలతో(తోడుగా) కదలిరాగా తన స్థానానికి(వైకుంఠానికి) వెళ్లిపోయాడు. ఆ నారాయణుని (శ్రీకృష్ణుని) మూర్తి (విగ్రహం) సముద్ర ప్రాంతంలో జగన్నాథుని రూపం పొంది ఉంది అని శుకుడు పరీక్షిత్తు చెప్పెనని తెలిపి -

ఈ శ్రీకృష్ణుని కథను వినినా, వ్రాసినా సంపద, కీర్తి అదృష్టం తప్పక కలుగుతాయి. అలాంటి మానవుడు దీర్ఘాయువుతో, లోకులు మెచ్చగా లోకంలో జీవిస్తాడు. (ఫలశ్రుతి)

నవ్వుమోమూ, చక్కని నడుమూ, నల్లని దేహమూ, లక్ష్మీదేవికి నివాసస్థానమైన వక్షమూ, పెద్దబాహువులూ, అందమైన చెవిపోగులుగల చెవులూ, మదగజగమనమూ, నల్లనిజుట్టూ, దయారసంతోకూడిన చూపూ కలిగిన విష్ణుమూర్తి (శ్రీకృష్ణుడు) ఆనందం కలిగేటట్లు కనులు మూసినప్పుడూ, తెరచినప్పుడూ ప్రత్యక్షమగును గాక.

పద్మాలవంటి కనులు గలవాడా! సద్గుణాలతో శోభిల్లేవాడా! జనకరాజుచే పొగడబడినవాడా! ప్రకాశించే కీర్తి అనే అమృతంలో ఆవరించబడిన బ్రహ్మాండభాండం కలవాడా! రఘువంశానికి తిలకం వంటివాడా!

భూపుత్రి సీతతో ఆనందించువాడా! ధర్మమార్గాన్ని అనుసరించి చరించువాడా! సాటిలేని నీతికలవాడా! దేవతలకు శత్రువులైన రాక్షసులను సంహరించువాడా! గురువులకూ, పండితులకూ సుఖం కలిగించేవాడా! కోసల దేశానికి ప్రభువా! దేవతల భయాన్ని పోగొట్టువాడా! పండితుల హృదయాలలో విహరించువాడా! శ్రీరామా!

శ్రీ కృష్ణార్పణమస్తు 

శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

No comments:

Post a Comment