Saturday, March 7, 2026

Yamadharmaraju’s explanation to his messengers (Yamadutas) about Lord Vishnu - యమధర్మరాజు తన దూతలకు విష్ణువును గూర్చి దెలుపుట

యమధర్మరాజు తన దూతలకు విష్ణువును గూర్చి దెలుపుట

అజామిళుని కథను పూర్తిగా విన్న పరీక్షిత్తు శుక మహర్షితో ఓ మహర్షీ! యమకింకరుల ద్వారా జరిగిన కథను మొత్తం విన్న యముడు ఏమన్నాడు? ఈ విధంగా యముని ఆజ్ఞ తిరస్కరింపబడిన సందర్భం ఇంతకు ముందు ఏదైనా ఉందా? ఎక్కడైనా జరిగిందా? తెలియజేయగలరు. ఇలాంటివాటికి మీరు తప్ప ఇంకెవరు సమాధానం చెప్పగలరు? అందువల్ల మీ సుధామయవాక్కులతో నన్ను అనుగ్రహించగలరు అని కోరగా శుకుడు ఇలా అన్నాడు.

శ్రీమహావిష్ణువుదూతలచే నిశ్చేష్టితులైన యమభటులు, తమచేత బంధింపబడిన అజామిళుడు దేవదూతలచే విడిపింపబడిన వృత్తాంతాన్ని యమునికి పూర్వం తెలియజేసి ఉన్నారు. ఆ సంగతిని నీకు చక్కగా వివరిస్తాను వినుము.

యముని సన్నిధిని చేరిన యమకింకరులు ఓ స్వామీ! జీవులు సత్త్వ, రజస్తమో గుణాలచే, మనోవాక్కాయ కర్మలచే చేసిన పలురకాల కర్మలకు ఫలితాన్ని నిర్ణయించేవారు మీరు కాక ఇంకా ఎవరైనా ఉన్నారా? తెలియజేయుమని కోరారు.

ఓ యమధర్మరాజా! లోకంలో నీవు కాక శిక్షలు వేసేవారు ఇంకా చాలామంది ఉంటే, ఈ జనన మరణ సంబంధాలైన క్రియా కలాపాలు ఈ లోకంలో సక్రమంగా ఎలా జరుగుతాయి?

లోకంలో చిన్న చిన్న అధిపతులను కూడా శాసకులని ఎలా అంటామో అలాగే లోకంలోని కర్మఫలాలకు శిక్షను విధించేవారు ఎక్కువగా ఉన్నట్లైతే 'శాసకుడు' అనే మాట కేవలం మర్యాదకోసమే అవుతుంది తప్ప నిజం కాదు కదా?

ఓ ధర్మపాలకా! ఈ ముల్లోకాలలో జీవుల కర్మలకు అనుగుణంగా ఫలితాన్ని నిర్ణయించగలిగే సమర్దుడైన అధికారివి నీవు మాత్రమే కదా? మరి అలాంటి తిరుగులేని నీ శాసనాన్ని మార్చగలిగే శక్తిమంతులు ఎవరైనా ఉన్నారా?

ఓ సూర్యపుత్రా! ఈ జీవుల కర్మలకు నిష్పక్షపాతంగా శిక్షలు నిర్ణయించ గలిగేది నీవు ఒక్కడివే కదా! అందుకే నిన్ను పాశహస్తుడని అంటారు. అలాంటి నువ్వు కాక ఇంకెవరైనా శాసకులు ఉన్నారా?

ఈ ముల్లోకాలలో నిరాటంకంగా మీ ఆజ్ఞయే ప్రవర్తిస్తూ ఉండగా, ఈనాడు మీ ఆజ్ఞతో భూలోకంనుండి మేము తీసుకురాబోయిన దుర్మార్గుని జీవాత్మను మానుండి నలుగురు దివ్యపురుషులు లాగుకొని, విడిపించి మమ్మల్ని భయపెట్టి, అడ్డగించి తరిమి వారు ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. వారు ఎక్కడి నుండి వచ్చారో ఎవ్వరో దయచేసి మాకు తెలియజేయండి.

అని అడిగారని చెబుతూ శుకమహర్షి తిరిగి ఇలా అన్నాడు. తన కింకరుల ద్వారా జరిగినదంతా తెలుసుకున్న యమధర్మరాజు సర్వం గ్రహించినవాడై నారాయణుని పాదపద్మాలను మనసులో నిలుపుకొని పరమభక్తితో నమస్కరిస్తూ తన భటులకు ఇలా సమాధాన మిచ్చాడు.

ఉన్నాడు. నాకంటే ఘనుడైనవాడు ఒకడున్నాడు. అతడు బయటికి కానరాకుండా ప్రపంచమంతటా నిండి ఉన్నాడు. అత్యద్భుతంగా సమగ్రంగా చీరలో దారాల రీతిగా వ్యాపించి ఉన్నాడు. అతని ఆజ్ఞానుసారం జీవులందరూ త్రాళ్లతో కట్టబడిన పశువుల మాదిరిగా ఆ యా నామాలతో సంకేతాలతో గిరగిర తిరుగుతున్నారు. నేను చేసే పూజలన్నీ ఆయన పాదాలకే అంకితం. ప్రాణులు పుట్టటం బ్రతకటం మరణించటం అన్నీ ఆయన లీలావిలాసాలే. ఈ సమస్త జగత్తూ ఆయనలోనే లీనమై ఉంటుంది. ఆయన నామాలు ఉచ్చరిస్తే చాలు సమస్త కర్మబంధాలూ నిర్మూలమైపోతాయి.

ఇంకా చెబుతాను వినండి. నేనేకాదు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని నిరృతి, వాయుదేవుడు; సూర్యచంద్రులు; బ్రహ్మ, ఈశ్వరుడు, రుద్రుడు, ప్రమథగణాలు, బ్రహ్మర్షులు మొదలైన వారు ఎవరు కూడా ఆ పరమ పురుషుణ్ణి దర్శించలేరు.

సత్త్వగుణప్రధానులై ఉండికూడా పొరపాటున రజస్తమో గుణాలకు వశులైనవారు, శ్రీహరియొక్క సదా ఏకత్త్వంతో ఉండే తత్త్వాన్ని దర్శింపలేరు. ఇక నిరంతరం త్రిగుణాలతో కూడినవారికి ఆ దివ్యతత్త్వాన్ని దర్శించడం సాధ్యమా? (సాధ్యంకాదు).

జన్మలేనివాడూ, ప్రమాణాలకు దొరకనివాడూ, నాశం లేనివాడూ, అంతంలేనివాడూ, నిత్యసత్యమైనవాడూ, సకలజీవుల్లో జీవాత్మ, పరమాత్మ అనే రెండు రూపాల్లో తానే ప్రకాశిస్తుండేవాడూ, అయిన పురుషోత్తముణ్ణి త్రికరణవైభవంతో గరిష్ఠులై బాహ్యంగా ఎంత శోధించికూడా ఆ వెర్రిజీవులు అన్ని వస్తువులను స్పష్టంగా చూడగల్గిందైనా - కన్ను తనను తాను చూడలేనట్లుగా - ఆ భగవంతుణ్ణి చూడలేరు.

ఆయన పరమాత్ముడు. భక్తులను పరిపాలించేవాడు. దుష్టులను సంహరించేవాడు. గరుత్మంతునిపై అధిష్టించి సమస్త లోకాలలో విహరిస్తూ ఉంటాడు. ఆ మహానుభావుని ప్రియమైన దూతలుకూడా ఆకారంలో, గుణాలలో స్వభావంలో ఆ శ్రీహరినే పోలి ఉంటారు. ఆ దేవుని దూతలకు దేవేంద్రుడు సైతం చేతులు మోడ్చి నమస్కరిస్తాడు. అటువంటి విష్ణుదూతలు తమ దేహకాంతులు దిక్కులనిండా వ్యాపింపగా లోకమంతటా సంచరిస్తుంటారు.

మహోన్నతమైన తేజస్సుతో, అత్యంత బలవంతులై, శాంతమూర్తులై, వీరులై, దేవతలచేత సేవింపబడుతున్న వారైన విష్ణుదూతలు శ్రీహరిభక్తుల రక్షణార్థమై సర్వత్రా వ్యాపించి ఈ లోకంలో సంచరిస్తూ ఉంటారు.

నాచేతా, మీచేతా, దేవతలచేతా, రాక్షసులచేతా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఈ ముల్లోకాలలోని విష్ణుభక్తులను విష్ణుదూతలు రక్షిస్తూ ఉంటారు.

భగవంతుడు ప్రతిష్టించిన ధర్మాన్నికాని, భగవత్తత్త్వాన్నికాని, దేవతలు, గరుడులు, ఉరగులు, సిద్దులు, సాధ్యులు, మానవులు, పక్షులు, మునులు, యక్షులు, విద్యాధరులు, ఖేచరులు మొదలైనవారు ఎవరూ కూడా సంపూర్ణంగా గ్రహించలేరు. వారి బుద్ధికి అందదు కూడా!

ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు వీరందరూ ఎంతటివారైనా ఏనాటికీ కూడా శ్రీహరి తత్త్వాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోలేరు.

ఈ లోకంలో విష్ణుపరమైన విశేషజ్ఞానసంపదను, సత్‌, చిత్‌, ఆనంద స్వరూపాన్ని శుద్ధ, సత్త్వ, పరబ్రహ్మాన్ని పరమశివుడు, బ్రహ్మదేవుడు, కుమారస్వామి, కపిలుడు, నారదుడు, భీష్ముడు, మనుచక్రవర్తి బలిచక్రవర్తి జనకమహారాజు, ప్రహ్లాదుడు, శుకమహర్షి జ్ఞానమూర్తి వేదవ్యాసమహర్షి మొదలయినవారు కొంతవరకు మాత్రమే తెలుసుకోగలరు. వీరు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. సాధ్యం కూడా కాదు.

ఉపనిషద్‌గోచరమైన శ్రీహరియొక్క మహాద్భుతమైన తత్త్వాన్ని పై పన్నెండుగురు మహాత్ములు మాత్రమే గ్రహించగలరు. ఇతరులు ఈ జ్ఞాన, భక్త రక్షణ రహస్యాలను ఏమాత్రం గ్రహించలేరు.

(ఇక్కడ పేర్కొన్న పన్నిద్దరు భాగవతులు 1. పరమశివుడు 2. బ్రహ్మ 3. కుమారస్వామి 4. కపిలుడు 
5. నారదుడు 6. భీష్ముడు 7. మనుచక్రవర్తి 8. బలిచక్రవర్తి 9. జనకమహారాజు 10. ప్రహ్లాదుడు 
11.శుకమహర్షి 12. వేదవ్యాసుడు అనేవారు.)

ఏ నామస్మరణ అమృతత్వాన్ని ప్రసాదిస్తుందో, ఏ నామ జపం ఉత్తమ ధర్మమార్గాన్ని చూపిస్తుందో, ఏ మంత్రమైతే భక్తితత్త్వాన్ని ఒంటబట్టిస్తుందో అదే మూర్తీభవించిన మహిమాన్వితమైన శ్రీహరినామసంకీర్తనం.

ఓ నాయనలారా! ఘోరమైన మృత్యుపాశానికి గురి అయి నరకానికి పోవలసిన అజామిళుడు తన చివరి గడియలలో కలిగిన బుద్ధి విశేషంతో నామస్మరణ చేసి యమపాశం కట్లనుండి విముక్తుడైన సంఘటనను మీరు కళ్ళారా చూశారు కదా?

ఆకతాయి, దుష్టుడు, మహాపాపి ఐన అజామిళుడు చివరిక్షణంలో హరి నామస్మరణ చేసి వైకుంఠాన్ని పొందాడు కదా! మానవులు ఇలా విచారపడడం ఎందుకు? భగవన్నామకీర్తనం భయంకరమైన పాపపు అడవుల్నే కాల్చేస్తుంది. ఇందులో సందేహం లేదు.

(అంత్యకాలంలో భగవంతుని నామాన్ని తలచినవారికి వారు ఎంత పాపకర్ములైనా, సరే భగవత్కృపా పాత్రులవుతారు.)

బుద్ధీహీనులైన మానవులు దాటశక్యం కాని మహామాయలో చిక్కుకొని తమ తెలివిని కోల్పోతున్నారు. ఈ యథార్థమైన విషయాన్ని తమ మనస్సులో కొంచెమైనా ఆలోచించి తెలుసుకోలేరు.

విజ్ఞులైనవారు ఈ రీతిగా ఒకే లక్ష్యమునందు నిల్పిన చిత్తంతో, ఏకారణంలేకనే ఈశ్వరుడైన విష్ణువును హృదయంలో నిల్పుతారు. భగవద్భక్తులయొక్క కలయికచే కల్గిన పరిపాకంవల్ల భగవంతుని చేరుకొంటారు. వారిని దండించాలని మావద్దకు తీసుకురావలదు. పాపాలు తొలగిన తర్వాత దండనార్హులుగా వాళ్లను గుర్తించలేము. పైగా విష్ణుచక్రం వీళ్లను రక్షిస్తూంటుంది. దేవతలు వాళ్లను సేవిస్తుంటారు. ముక్తికారణంగా మిక్కిలి శ్రేష్ఠులు.

విష్ణుభక్తులైన మహానుభావుల కీర్తిని సిద్దులు, సాధ్యులు, ఖేచరులు లలితగీతాలతో గానం చేస్తుంటారు. అటువంటి భాగవతులు ముక్తి సౌధంలో అందమైన చంద్రశాలలలో నివసిస్తుంటారు. సాటిలేనివారూ, సౌందర్యవంతులూ అయిన వైష్ణవోత్తముల చేతులలో శంఖచక్రాలూ గదాఖడ్గాలూ విరాజిల్లుతుంటాయి.

వేదాంతసారమైన భగవంతునియందుమాత్రమే మనస్సును లగ్నం చేయగలవారు, సనకాది మునులు పొందగలిగిన శాశ్వత ఆనందాన్ని అనుభవించేవారు, విష్ణుపాదారవింద అమృతాన్ని ఆస్వాదించి తన్మయులు ఐనవారు, ఐహిక సుఖలంపట పాపాలను పోగొట్టుకో గలిగినవారు, నిత్య సత్య భగవత్స్వరూపాన్ని చూడగలవారు, భక్తి సామ్రాజ్యానికి అభిషిక్తులై ఏనాడు కష్టం పొందని వారు శ్రీమన్నారాయణుని పరమభక్తులు.

కాబట్టి దూతలారా! పరమభాగవతోత్తముల జోలికి మీరు వెళ్ళవద్దు. విష్ణవుయొక్క పాదపద్మాలను ఆశ్రయించని దుర్మార్గులను వారి మరణకాలంలో పట్టీ బంధించి తీసుకురండి.

పరిహాసానికైనా భగవన్నామం పలుకలేని చెడు మాటకారుల్ని, కలలోనైనా భగవంతుని పాదపద్మాలను దర్శించని వారినీ, వేడుకగానైనా హరికథలను వినక చెడువిషయాలు వినేవారిని, దైవసంబంధమైన ఉత్సవాల సమయంలోనైనా దేవాలయం వైపు వెళ్ళని చెడుపాదాలు కలవారిని, హరి భక్తుల పాదధూళిని పరమపవిత్రమైందిగా భావించని వారిని, అలాంటి వారికి సంబంధించినవారిని, వారితో కలిసిన వారిని కూడా ముందుగా బంధించి తీసుకురండి.

ఓ భటులారా! సకల పాపకార్యాలకూ నెలవైన సంసారమనే ఇంటిలో ఉంటూ, జ్ఞానం నశించి, మహాత్ములైన యోగుల సాంగత్యానికి దూరంగా ఉండే నీచ మానవులను పట్టుకురండి.

హరిభక్తులకందరికీ ముక్తి తంగేటిజున్నులాగా సులభ సాధమై ఉంది. హరినామం నుడువనివానికీ, హరిచరణధ్యానం చేయనివానికీ, ముక్తి హరిభక్తులకువలె సులభసాధ్యమవుతుందా? (సులభసాధ్యం కాదు).

శ్రీహరిమీది భక్తి మాత్రమే కైవల్యానికి సోపానమని పూర్తిగా విశ్వసించినవారినీ, వారి బంధువర్గాన్నీ వారితో కలిసి వున్నవారినీ పట్టుకోకండి. వారి మార్గాలవైపు ఏమాత్రం వెళ్ళకండి.

ఈ విధంగా చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. శ్రీకృష్ణనామ సంకీర్తనం లోకాలకు శుభాలను ప్రసాదిస్తుందనీ, లోకాలను సమ్మోహింపజేస్తుందనీ, లోకులందరిచేతా విశేషంగా గానం చేయబడుతుందనీ, పలువిధాలైన మాయాబంధాలనూ తెంపివేస్తుందనీ, అమోఘాలయిన హరిపరాక్రమ గాథలను ఆకర్షించేవారి అంతరంగాలు అత్యంత నిర్మలంగా ఉంటాయనీ, ఈ విధంగా వ్రతాల ఆచరణచే కానీ మనస్సులు పవిత్రంకావనీ, శ్రీకృష్ణదేవుని పాదపద్మాలను హృదయపద్మంలో నిలుపుకొని ఆరాధించేవారిని ఇతరపాపాలుగానీ, అజ్ఞానంగానీ, వ్యసనాలుగానీ అంటనేరవని యమధర్మరాజు తన కింకరులకు ఉపదేశించాడు. తమ ప్రభువుచేత కీర్తింపబడిన దేవదేవుని మహామహిమలను విని కాలకింకరులు ఆశ్చర్యచకితులైనారు. వారు ఆనాటి నుంచీ విష్ణుభక్తుల వైపు కన్నెత్తి చూడటానికి సైతం భయపడసాగారు. ఓ పరీక్షిన్మహారాజా! పరమరహస్యమైన ఈ ఇతిహాసాన్ని సర్వజ్ఞుడైన అగస్త్యమహర్షి సమస్త దుఃఖాలనూ విలయం చేసేదీ, సమస్త పుణ్యాలకూ నిలయమైందీ అయిన మలయపర్వతంమీద దేవాదిదేవుడైన వాసుదేవుణ్ణి ఆరాధిస్తూ నాకు ఈ వృత్తాంతాన్ని తెలియచేశాడు. అని చెప్పిన శుకయోగీంద్రుని మాటలు విని పరీక్షిన్నరేంద్రుడు ఆశ్చర్యం, ఆనందం నిండిన హృదయంతో ఇలా అన్నాడు.

అయ్యా! శుకమహర్షీ! ఇంతకుముందు స్వాయంభువ మనువు వృత్తాంతం చెప్పావు. ఆయన పరిపాలించే కాలంలో దేవతలు, రాక్షసులు, పక్షులు, పాములు, మానవులు మొదలైన ప్రాణుల సృష్టిక్రమాన్ని గూర్చి కొంతకొంత చెప్పావు. ఆ విషయాన్నే ఇంకా విస్తారంగా వివరించి చెప్పు.

ఈ విధంగా పరీక్షిత్తు ప్రశ్నించగా, హృదయ సంస్కారంతో ఆనందించినవాడై శుకమహర్షి సమాధానం చెప్పాడు. ఓ మునులారా! ఏమరుపాటులేకుండా శ్రద్ధగా వినండి.

ప్రజాపతి దక్షుడి పునర్జన్మ

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

The Realization of Ajamila - అజామిళుడి పశ్చాత్తాపం

అజామిళుడి పశ్చాత్తాపం

ఋక్‌, యజుస్‌, సామవేదాల సారభూతం, ఆనందకరం, సమస్తశుభప్రదగుణాలకు నిలయం, పరమాత్ముని దర్మప్రబోధం అయిన విష్ణు, యమదూతల సంవాదాన్ని అజామిళుడు శ్రద్దాళువై ఆలకిస్తూ శ్రీమన్నారాయణునిచరణకమలస్మరణమనే నిర్మలజలం అతని మహాపాతక సమూహాలన్నింటినీ కడిగివేసింది. అతని హృదయం నిశ్చలభక్తికి నిలయమై క్షణమాత్రంలో అతనికి జ్ఞానోదయమయింది.

ఇప్పటిజన్మలో తాను చేసినపాపాలన్నీ అజామిళుడికి మాటిమాటికి జ్ఞాపకానికి వచ్చి, బాధపెడుతుండగా, పశ్చాత్తాపహృదయంతో శ్రీహరిని శరణుకోరుకొంటూ, ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు.

నేను ఆ శూద్రకాంతమీద అనురాగం పెంచుకున్నాను. ఆ జారిణియందు సంతానాన్ని కన్నాను. కులగౌరవాన్ని గోదావరిలో కలిపి వేశాను. నా బ్రతుకు రచ్చల కెక్కించాను. సిగ్గుమాలిన పనులకు పాల్పడి సాటివారిలో తలవంపులు తెచ్చుకొన్నాను. వార్ధక్యం పైనబడినప్పటికీ సంసార బంధాలనుంచి బయటపడలేక - లోకనిందలను లెక్క చేయకుండా వారకాంతా పరాయణుండనై ఆ రోత సుఖాల రొచ్చులో మునిగి తేలుతూ నా బ్రతుకంతా పాడుచేసుకున్నాను. పవిత్రమైన జీవితం భస్మమైపోయింది. నా చదువు చట్టుబండలైంది. నా శాస్త్రజ్ఞానమంతా శూన్యమైపోయింది. నా బుద్ధి పురుగు మేసింది. పుణ్యం బుగ్గి అయింది. నీతి అడుగంటింది. నియమం మరుగుపడింది. నా తెలివి తెల్లవారింది.

నిండుయౌవనం కలిగి, నన్ను మక్కువతో మన్నించే భార్యను వదిలిపెట్టి, మోసగత్తె, తాగుబోతు అయిన ఈ నీచస్త్రీ సాంగత్యం పొంది వ్యభిచారినై భ్రష్టుడనయ్యాను.

నేను తప్ప ఏ ఆధారమూ లేని సౌమ్యులు, సాధుజీవనులు, పెద్దలూ అయిన నా తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా తీవ్రమైన కష్టాలకు గురిచేసి, ఇంటినుండి వెళ్ళగొట్టిన దుర్మార్గుడిని. అటువంటి ఆ ఘోర పాప ఫలితాలు నన్ను మహాఅగ్నిజ్వాలల్లాగా కాల్చకుండా ఎలా ఉండనిచ్చాయో గదా!

చిన్నప్పటి నుండి ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా పెంచి పోషించిన తల్లిదండ్రులను, నా శ్రేయస్సు కోరే చుట్టాలను, నాకు మేలు చేసినవారిని కృతఘ్నుడినై వదలిపెట్టాను.

ఇన్ని ఘోరపాపాలు చేసి భయంకర నరకకూపంలో పడి కొట్టుకొనిపోతున్న నన్ను దయతలచి ఆపదలనుండి రక్షించి, నా పాపాలను పోగొట్టిన ఈ పుణ్యపురుషులు ఎక్కడివారో కదా!

ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందు ఏదో కలవలె అనిపించింది. మరుక్షణంలో ప్రత్యక్షంగా కనిపించింది. నన్ను మృత్యుపాశాలతో బంధించి ఈడ్చుకొని వచ్చిన ఆ భయంకర స్వరూపాలు గల మహావీరులు ఆ వికృతాకారులు ఆ వక్రమార్గసంచారులు తమ ఉద్రేకాన్నీ ఉత్సాహాన్నీ వదలిపెట్టి ఎక్కడికి వెళ్లారో కదా!

మిక్కిలి క్రూరమైన యమపాశాలచే కట్టుబడి నరకమనే సముద్రంలో మునిగిపోతున్న నన్ను కాపాడిన సూర్యుతేజులు, పద్మనేత్రులు, సుందర రూపులు దయ కల్గినట్టి ఆ నలుగురు దివ్యులు ఎటువైపు వెళ్ళారో కదా!

నన్ను కాపాడిన పుణ్యాత్ములు, తామరులవంటి కన్నులతో, నల్లనిశరీరాలతో ప్రకాశించేవారు, పీతాంబరులు, శంఖచక్రాలను ధరించినవారు, ఆజానుబాహులు, నవ్వు ముఖం కలవారు, వేలాడుతున్న చెవి ఆభరణాలు, బంగారు వన్నెగల వస్త్రాలు ధరించిన ఆ దయాసముద్రులు ఎక్కడికి పోయారో కదా!

మిక్కిలి పాపాత్ముడినైన నాకు నేను పూర్వజన్మలోచేసిన పుణ్య విశేషంచేతనే అట్టి దేవతాశ్రేష్ఠుల దర్శనం కలిగింది. తద్ద్వారా మనస్సుకు ప్రశాంతత చేకూరింది. లేకుంటే నీచస్త్రీ సాంగత్యం వలన పాపాత్ముడినైన నాకు మరణ సమయంలో నారాయణ నామస్మరణం ఎలా సాధ్యపడుతుంది? అంతేకాక

పాపాత్ముడను, బ్రహ్మహత్య వంటి ఘోరపాపాలను చేసినవాణ్ణి, దురభిమానుణ్ణి, లోభిని, కామాతురుణ్ణి, మాత్సర్యం కలిగినవాణ్ణి, ఇలాంటి నా మనసుకు ఆ నారాయణుని పవిత్రమైననామగానం చేయాలనే ఆలోచన ఎలా వస్తుంది?

నీచమైన మోహమనే చీకటిలో మునిగి ఉన్నవాడను, పంచమహాపాపాలను చేసినవాడను, కుటిలుడను, జూద వ్యసనపరుడను, నిందాపరుడను, గుణహీనుణ్ణి, అయిన నాకు అద్భుతమైన, విష్ణునామాన్ని స్మరించే అర్హత ఉందా? కేవలం నేను పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యాల ఫలితంవలన మాత్రమే తప్ప, హరినామస్మరణ యోగం ఎలా కలుగుతుంది?

అని పరిపరివిధాల ఆలోచించుకొని, పుణ్యమైన వర్తనంకలదీ, చైతన్యానికి నెలవైన స్థానానికి ఉన్ముఖమైన ఆసక్తి కలదానికీ, మోక్షస్థానంలో అనురక్తితో కూడిందానికీ, సుఖప్రదమైన ప్రయత్న క్రియకు చెందిన సామర్ధ్యం కలదానికి, ధైర్యంతో పొందబడిన శ్రేష్ఠమైనముక్తి కలదానికీ, సమస్త భూమండలాన్నీ ధరించగల ఉత్తమభక్తితో కూడిందానికీ, ఇట్టె విష్ణువ్రతసంపదకై నేను మనస్సును, ఇంద్రియాలను, శ్వాసను నియమించినవాణ్ణై ప్రయత్నిస్తాను.

నారాయణ నామగానంవలన భవబంధాలనుండి విముక్తి పొందాను. మాయవల్ల కలిగిన అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాను. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనే ఆరుగురు అంతశ్శత్రువులను తరిమికొట్టాను. జనన మరణ పరంపర అనే దుఃఖ సాగరాన్ని దాటాను.

దాసీ రూపంలో వచ్చిన స్త్రీ నాలో కోరికలను రగిల్చి నన్ను కోతివలె ఆడించింది. అధోగతికి ఈడ్చిన ఆ మాయ నన్ను తొలగిపోవడం నేను కనుగొన్నాను.

ఈ విధంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్న అజామిళునిలో విష్ణుభక్తి అనే జ్ఞానదీపం ఆత్మచైతన్యమనే తైలంతో ప్రకాశించింది.

పునర్జన్మను పొందిన అజామిళుడు ఉత్తముల సాంగత్యంలో ఉంటూ వారితో జరిపే సంభాషణలవలన పవిత్రుడై, ఇహలోక బంధాలమీద విరక్తిచెంది బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను వదిలి సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుని దయ అనే మహాభాగ్యంకోసం ప్రయత్నిస్తూ
భాగవతులతో జరిపే సత్సంగచర్చలు ఈ లోకంలో ఎప్పటికీ తరగని పుణ్యమనే సొమ్ముల మూటలు. మోక్షలక్షి యొక్క తరగని విలాసాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనే శత్రువులు దగ్గరకు రాలేని రక్షణస్థావరాలు.

(కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు జీవుడి మనస్సులో దాగి ఉండి, కూడని పనులు చేయిస్తాయి. పతనంవైపు నడిపిస్తాయి. అందువల్ల వాటిని 'అరిషడ్వర్గాలు' అంటారు. జీవుడిలోన ఉండే శత్రువులు కనుక 'అంతశ్శత్రువులు' అంటారు.

ఈ విధంగా అజామిళుడు తననుగురించి తాను విమర్శించుకొని పరమాత్మతత్త్వాన్ని తెలుసుకున్నాడు. సంసార బంధాలను వదిలిపెట్టి హరిద్వారం చేరి ఒక దేవాలయంలో ధ్యానంలో ఉన్నాడు. తదనంతరం తన ఆత్మను యోగసమాధి ద్వారా పరమాత్మలో ఐక్యం చేయగా తనను పూర్వం యమభటుల నుండి రక్షించిన విష్ణుదూతలు సాక్షాత్కరించారు. వారిని చూచి అజామిళుడు వినయంగా నమస్కరించాడు.

ఈ ప్రకారంగా అజామిళుడు యోగమార్గం ద్వారా తన శరీరాన్ని పరిత్యజించి దివ్యదేహం ధరించినవాడై మున్ను తన్ను రక్షించిన విష్ణుకింకరులను తన కనులముందు సందర్శించాడు. వారిని తిలకించగానే అతని దేహం ఆనందంతో పులకించింది. పారవశ్యంతో ఒడలంతా చెమర్చింది. ఆనందం చిగిర్చింది. హృదయం హర్షంతో నిండింది. యోగప్రభావం ప్రకాశించింది. విస్మయంతో, ఉత్సాహంతో కూడిన మందహాసం అతని ముఖారవిందం మీద చిందులు త్రొక్కింది. సమస్త లోకాలనూ ప్రకాశింపజేసేదీ, మంగళప్రదమైందీ అయిన భగవంతుని శుభాకారాన్ని సందర్శించాలనే కుతూహలం మనస్సులో కలిగింది. అజామిళుడు విష్ణుదూతలకు నమస్కరిస్తూ గంగాతీరంలో శరీరం విడిచాడు. వెనువెంటనే అతనికి నారాయణ పార్శ్వచరులైన మహాభక్తుల స్వరూపం ప్రాప్తించింది. అనంతరం అతడు విష్ణుదూతలతో కలిసి రత్నాలు పొదిగిన బంగారు విమానాన్ని అధిష్టించి ఆనందమయం, భోగ భాగ్య నిలయం అయిన వైకుంఠనగరంలో ప్రవేశించి శ్రీమన్నారాయణుని చరణారవిందాలను సేవించే పరిణత దశకు చేరుకున్నాడు. ఈ విధంగా అజామిళుడు సర్వధర్మాలనూ ఉల్లంఘించినవాడు, దాసీపుత్రిని పెండ్లాడినవాడు, దుష్కర్మలచేత భ్రష్టుడైనవాడు అయి నరకంలో పడబోతూ కూడా నారాయణ నామస్మరణంవల్ల క్షణమాత్రంలో మోక్షాన్ని అందుకున్నాడు.

కర్మలన్నీ విడిపోవటానికి వేరే ఉపాయం ఏదీ లేదు. చెప్పిన మాట వినకుండా ఎదురుతిరిగి మనస్సు ఎన్నిమార్గాల్లో పోయినా సర్వదా నారాయణ నామాన్ని ఉచ్చరించటమే కర్మఫరిత్యాణానికి సరైన ఉపాయం.

పాండవ వంశాన్ని పావనంచేసే ఓ మహారాజా! ఈ అజామిళుని వృత్తాంతాన్ని ఎవడైనా సరే ఏకాగ్రచిత్తంతో విన్నా, చదివినా అలాంటి మానవుడు మోక్షలక్షికి నెలవై, యమకింకరులకు కనపడకుండా శాశ్వతవైకుంఠవాసి అవుతాడు.

అజామిళుడు కేవలం తన కొడుకు పేరుతో మాత్రమే చివరిదశలో భగవన్నామం ఔపచారికంగా స్మరించి మోక్షాన్ని పొందాడు. ఇంకా సంపూర్ణమైన భక్తితో పలికితే ఫలితం ఇంకెంత ఉంటుందో చెప్పలేము కదా!

విష్ణునామం తలచిన వారికి ముక్తి ఎంత దగ్గరవుతుందో, ఆ నామాన్ని స్మరించని వారికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ ముక్తిపదం దూరంగానే ఉంటుంది.

యమధర్మరాజు తన దూతలకు విష్ణువును గూర్చి దెలుపుట

Sree Maha Bhagavathamu Part 6 - శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీరస్తు శీమహాభాగవతము షష్టస్కంధము

శ్రీ వత్సాంకితకౌస్తుభస్ఫురితలక్ష్మీచారువక్షస్థ్సల
శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుఁ గంజాత భూ
దేవేంద్రాదిసమస్తదేవమకుటోద్దీప్తోరురత్నప్రభా
వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతుం గృపావాసుం బ్రశంసించెదన్‌.


శ్రీవత్సమనే పేరుగల పుట్టుమచ్చ, కౌస్తుభమనే రత్నం, లక్ష్మీదేవికి నివాసస్థానం అయిన వక్షస్థలం, శోభాకరమైన దేహకాంతి, నల్లని శరీరచ్చాయ, శుభప్రదమైన తామరలవంటి కన్నులు, పద్మంనుండి పుట్టిన బ్రహ్మ మహేంద్రుడు మొదలైన సర్వదేవతల కిరీటాల్లోని రత్నకాంతులచే ప్రకాశించే పాదపద్మాలు కలవానిని, నిత్యుడు త్రికాలాలలో ఎల్లప్పుడూ ఉండువాడు, దయాసముద్రుడు అయిన విష్ణుమూర్తిని స్తుతిస్తాను.

విష్ణు పాదారవింద మననం వలన ఆనందం పొందిన శౌనకాది ముని బృందాలతో, పురాణ, ఇతిహాసాల సారాన్ని వివరించడంలో సమర్ధుడైన సూతమహర్షి ఇలా చెప్పసాగాడు.

విష్ణుకథలను వినడంలో ఆసక్తికలిగిన పరీక్షిన్మహారాజు పండితులకు ఆనందం కల్గించడంలో సమర్దుడైన శుకయోగీంద్రుని కథను వినాలనే ఆసక్తితో ఇలా ప్రార్థించాడు.

విశిష్టమైన ఆరుగుణాలు కలిగిన ఓ శుకమునీంద్రా! జీవుడు పరమపదాన్ని పొందే మార్గాన్ని నాకు వివరించి చెప్పావు. నివృత్తి మార్గాన్ని అనుసరించిన జీవుడు ఊర్ధ్వగతిని పొందే మార్గం తేటతెల్లంగా చెప్పావు. జీవుడు స్వతహాగా త్రిగుణాలచే బద్దుడై దుష్కర్మలు ఆచరిస్తూ దాని ఫలితంగా పలురకాలైన దేహాలను ధరిస్తూ జనన మరణ రూపమైన సంసారచక్రంలో బంధింపబడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఆ ప్రవృత్తి మార్గాన్ని నాకు చక్కగా వివరించావు.

(షడ్గుణైశ్వర్యాలు: ఐశ్వర్యం, ధైర్యం, కీర్తి, తేజస్సు, జ్ఞానం, వైరాగ్యం. ఇవి భగవదంశ కలిగిన వారికే శోభిస్తాయి. శుకయోగిని 'ష
డ్గుణైశ్వర్య శాశ్వతమూర్తి' అనే సార్ధక విశేషణంతో సూచించడంవల్ల శుకునిలో భగవతత్త్వం నిండి ఉందని తెలుస్తూంది.)

ఇవేకాక పలురకాలైన నరకాలగురించి; స్వాయంభువుడు, అతనికుమారులైన ప్రియవ్రత, ఉత్తానపాదుల వంశచరితలు; ఈ భూమండలంలో ఉన్న అనేకద్వీపాలు, భూభాగాలు, సముద్రాలు, నదులు, అడవులు మొదలైన సమస్తవిషయాలయొక్క ఆవిర్భావవైశాల్యాలు; జ్యోతిషపరమైన గతుల విశేషాలూ; వీటన్నింటిని పరమాత్మ ఏ విధంగా సృష్టించాడో నాకు తెలియజేశావు. ఇక ప్రస్తుతం

మహానుభావా! శుకదేవా! ఇప్పుడు నాకు ఈ విషయం వివరించి చెప్పు. ఈ ప్రపంచంలోని మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానావిధ నరకకూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉందా! ఉంటే దాన్ని నాకు విశదీకరించు.

ఈ విధంగా అడిగిన మహారాజుతో శుకుడు ఇలా చెప్పాడు.

అకటా! మనోవాక్కాయ కర్మల ఫలితంగా కలిగే పాపాలను, పరిహారం చేసుకొనక పోయినందువల్ల జీవుడు దేహం వదలిన తర్వాత భయంకరమైన నరకాలలో శిక్షలు అనుభవించాలి.

కాబట్టి జీవుడు యమభటుల దర్శనం కాకముందే, చావునుగురించి మనసు కలతపడక ముందే, శరీరంలో ప్రాణం చైతన్యవంతమై ఉండి, బలం తగ్గకముందే, చేసినపాపాలను నిష్కల్మషమైన మనసుతో పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

రోగకారణాన్ని తెలుసుకొని వైద్యుడు ఔషధమిచ్చి రోగాన్ని నివారించే విధంగా, మానవుడు తాను చేసే పాపాల మూలకారణాన్ని తెలుసుకొని కాలం మించిపోకుండా వాటికి నివారణోపాయాలు గుర్తించి పోగొట్టుకోవాలి.

అని పలికిన శుక మహర్షితో పరీక్షిత్తు, “ఓ స్వామీ! మానవుడు ఎటువంటి పాపాలను చూస్తాడో, వింటాడో వాటిని చేయకూడదని అనుకుంటూనే, పరితాపం పొందికూడా తిరిగి అవే పాపాలను చేస్తాడు. అటువంటి వాడికి పాప పరిహారం ఉంటుందా? జీవుడు సందర్భాన్ని అనుసరించి ఒకసారి పాపం చేయడం, మరొకసారి మానివేయడం చేస్తాడు. ఇటువంటి బురదతో నిండిన ఏనుగు నీళ్ళలో మునిగినా ఆ బురద ఏ విధంగా వదలదో అదే విధంగా చంచలమైన మనసు కలిగిన మానవుడు చేసిన పుణ్యాలు సత్ఫలితాన్ని ఇవ్వవని భావిస్తాను. ఈ విషయాలను గురించి సమగ్రంగా తెలియజేయవలసింది.

ఈ విధంగా పలికిన మహారాజుతో శుకమహర్షి ఇలా చెప్పాడు.

ఓ రాజా! ఒక పని వలన కలిగిన ఫలితం మరొక పని వలన తొలగదు. మానవుడు తెలిసిగాని, తెలియకగాని ఏ చెడు కార్యం చేసినా దానిని పరిహరించుకోవడంకోసం ఒక సత్కర్మ చేయాలి.

ఆరోగ్యకరమైన ఆహారం తిన్న కారణంగా మనిషి తన వ్యాధుల్ని ఎలా పోగొట్టుకుంటాడో, అదే విధంగా సత్కర్మలు ఆచరించేవాడు తన నిర్మలమైన మనసుతో తన పాపపురాశి నంతటినీ నశింప జేసుకుంటాడు.

తపస్సు, బ్రహ్మచర్యదీక్ష దానశీలత, ఇంద్రియనిగ్రహం, నామస్మరణం, సత్యవాక్యపాలన వంటి నియమాలతో పవిత్రజీవనం సాగిస్తున్న ధర్మవర్తనులైన దయాసముద్రులు మనోవాక్కాయకర్మల చేత ఏర్పడిన పాపాలగుదిని, అగ్ని వెదురు పొదలను భస్మం చేసినట్లుగా దహించివేస్తారు.

(సత్పురుషునికి ఉండవలసిన లక్షణాలన్నీ ఇక్కడ చెప్పబడ్డాయి. అవి - తపం = అనగా మనస్సును, ఇంద్రియాలను ఏకాగ్రతతో ఉంచడం.

బ్రహ్మచర్యం = స్త్రీలను గురించి ఆలోచించడం, వారిని పొగడడం, వారితో సల్లాపం, కామబుద్ధితో చూడటం, మర్మంగా మాట్లాడటం, స్త్రీలతో పొందుగురించి తపించడం, వారి మీద ధ్యాసతో పనులు చేయకపోవడం మొదలైన వీటన్నిటికీ దూరంగా ఉండటమే బ్రహ్మచర్యం.

దానం = తన సర్వస్వాన్ని ఇతరుల హితం కోసం నిస్వార్థంగా త్యాగం చేయడం.
శమం = మనసు, బుద్ది, చిత్తం, అహంకారం అనే అంతరీంద్రియాలను నియంత్రించడం.
దమం = కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే బాహ్యేంద్రియాలను నిగ్రహించడం.
జపం = పరమాత్మను గురించి నిరంతర ధ్యానం.
సత్యం = ధర్మాన్ని, ధర్మసూక్ష్మాన్ని అనుసరించి యథార్థంగా మాట్లాడటం.
శౌచం = బాహ్యేంద్రియాలను దోషరహితంగా ఉంచడం.
నియమం = జప తపాదులు పాటించడం.
యమం = అహింస, పరుషంగా మాట్లాడకపోవడం వంటివి.

అంతమాత్రమేగాక, మరికొంతమంది శ్రీకృష్ణుని పాదాలు అనే పద్మాలయందలి తేనెను తాగే తుమ్మెద వంటి మనసు నిర్మల వేషధారులై, గోవిందుని భక్తులై, కలిగినవారై, ఆ భక్తి కారణంగా, సూర్యుడు మంచును కరిగించిన విధంగా తమశక్తిచేత పాపాలను సంపూర్ణంగా అంతం చేసుకుంటారు.

సూర్యుడు తన తీక్ష్ణమైన కిరణాలచే దట్టమైన మంచును తొలగించినట్లుగా, ఇంకా కొందరు తమ భక్తి ప్రభావంచేత వారి పాపాలనుకూడ సంపూర్ణంగా నశింపజేసుకుంటారు.

హస్తినాపురాధినాథుడవైన పరీక్షిన్మహారాజా! ఒక రహస్యం చెబుతాను విను. శ్రీహరిభక్తి పాపాత్ముడి పాపాలను పటాపంచలు చేసి అతడికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శమదమాది సద్గుణాలు కూడ హరి భక్తివలె పాపాత్ముణ్ణి పుణ్యాత్మునిగా మార్చలేవు.

విష్ణుభక్తి పరిపూరితులైన వారికీ; ధన, మాన, ప్రాణాలను స్వామికి అర్చించినవారికీ; శ్రీహరి సేవాపరాయణులైన వారికీ; విష్ణుకథాశ్రవణమందు అత్యంతఆసక్తి కలగినవారికీ; లభించే శాశ్వతమైన ఆనందంతో కూడిన కైవల్యం; తపస్సులు, బ్రహ్మచర్యం, శమ దమాది నియమాలు, సత్యపాలనాదులవలన, శుచిత్వంవలన, దానధర్మాలవలన లభించదు.

(హరిభక్తి ఎంత గొప్పదో చెప్పటానికే ఇదంతా. తపస్సు, బ్రహ్మచర్యం, శమదమాదులు కొరగానివని భావించరాదు. అవన్నీ భక్తితో కూడి ఉన్నప్పుడే సత్ఫలితాన్నిస్తాయని శుకమహర్షి ప్రబోధంలోని సారాంశంగా గుర్తించాలి. ఈ భావానికి వివరణే తరువాత కనిపిస్తుంది.)

సాధు జీవనం కలిగి, పుణ్యస్వభావులై చరిస్తూ, సత్పరాయణులై, విష్ణుభక్తి తత్పరులైన వారికి తప్ప ఇతరులకు శాశ్వతమైన విష్ణులోకం ప్రాప్తించదు.

మానవులు సహజంగా పాపపుణ్యాలు చేస్తుంటారు. కల్లుకుండను ఎన్నినదులలో ముంచినా దాన్ని పవిత్రం చేయలేనట్లు హరిభక్తిని ఆచరించకుండా ఎన్ని పుణ్యసమూహాలైనా నరుణ్ణి పవిత్రుణ్ణి చేయలేవు.

ఓ మహారాజా! నిత్యం విష్ణుపాదపద్మాలను ధ్యానిస్తూ, విష్ణుగుణకీర్తనయందు ఆసక్తి కలిగి ఉండేవారు యముణ్ణిగాని, యమపాశాలు ధరించిన యమభటులనుగాని కలలో కూడా చూడరు. అట్టివారు తెలియక చేసిన పాపాలు ఏవైనా ఉన్నా అవి వారిని సమీపించలేవు.

ఈ భక్తివిశేషాన్ని వివరించే ఒక ప్రాచీనమైన కథ ప్రాచుర్యంలో ఉంది. దాన్ని విష్ణుసేవకుల యమకింకరుల సంవాదం అంటారు. ఆ కథ నీకు చెపుతాను శ్రద్ధగా విను.


అజామిళోపాఖ్యానము

విష్ణుదూత యమదూతల సంవాదము








శ్రీమన్నారాయణ కవచ ప్రారంభము








The discussion between Vishnu’s messengers (Vishnudutas) and Yama’s messengers (Yamadutas)- విష్ణుదూత యమదూతల సంవాదము

విష్ణుదూత యమదూతల సంవాదము

విష్ణుసేవకులచే నిరోధింపబడిన యముని బంటులు వారితో ఇలా పలికారు.

ఎవరు మీరు? ఈ విధంగా కర్తవ్య నిర్వహణలో ఉన్న మమ్మల్ని అడ్డగించి మా వశమైన ఈ ప్రాణిని కాపాడుతున్నారు. ఇక ఈ లోకంలో యముని శాసనాలు నవ్వులపాలు కావలసిందేనా?

అది మాత్రమే కాకుండా...

అయ్యా! అద్భుతరూపులై, తమ్మిరేకులవంటి కన్నులతో, శ్రేష్ఠమైన పీతాంబరాలతో, చెక్కిళ్ళపై కదులుతున్న కుండలాలతో, ప్రకాశవంతమైన కిరీటాలతో, పద్మాలదండలతో కూడిన విశాలమైన వక్షఃస్థలంతో, నిత్యయౌవనంతో, రత్నాలుతాపిన భుజకీర్తులతో చతుర్భుజులు, నీల మేఘశ్యాములు అయిన మీరు ఎవరో తెలియజేయండి.

పద్మ, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, ధనుర్బాణాది ఆయుధాలను కలిగిన మీ శరీరాలు లోకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

శాంత స్వరూపంతో ఒప్పే మీ శరీరకాంతులు సర్వలోకాల్లో అన్ని దిక్కులయందు అలముకున్న దట్టమైన చీకట్లను పోగొడుతూ ప్రకాశవంతమైన వెలుగుతో మాకు ఆనందాన్ని కలిగించాయి.

లోకాలన్నింటికి ఆనందం కలిగించే సుందర విగ్రహాలు కలవారు, చూడడానికి సాధ్యంకాని తేజస్సుతో విరాజిల్లుతున్న వారు, సర్వధర్మాలను పాటించేవారు అయిన మీరు యమధర్మరాజు దూతలమైన మమ్ములను అడ్డగించడానికి కారణమేమిటని ప్రశ్నించిన యమదూతలను చూచి చిరునవ్వు చిందుతున్న ముఖారవిందాలు కలవారై గోవిందుని దూతలు మేఘగంభీర భాషణాలతో ఇలా అన్నారు.

మీరు ధర్మపరిపాలన బద్దుడైన యముని భటులు అయితే, ఈతని నివాసమెక్కడో, పుణ్య, పాప స్వభావాలు ఏమిటో మాకు తెలియజేయండి. లోకంలో సర్వప్రాణులు శిక్షార్హులేనా? లేక పాపజీవులు మాత్రమేనా అనేది వివరించండి.

అని పలికిన విష్ణుదూతలతో యమభటులు ఈ విధంగా పలికారు.

సృష్టి ప్రారంభంనుండి వేదం నారాయణ స్వరూపంగా విశ్వసింపబడింది. అట్టి వేద బోధితమైనది ధర్మమనీ, దానికి విరుద్ధమైనది అధర్మమని తెలియజేయబడింది.

శ్రీమన్నారాయణుని సంకల్పబలంచేత సృష్టి కార్యక్రమం ప్రారంభమై సత్త్వరజస్తమోగుణాలతో కూడిన జీవులు జన్మించాయి. ఇవి తమకు అనుకూలమైన నామ, గుణ రూప భేదాలచే వేరు చేయబడి కర్మలను ఆచరిస్తాయి. ఈ జీవుల కర్మలకు సాక్షులుగా పంచభూతాలు, సూర్యచంద్రులు, రాత్రింబవళ్ళు, కాలం మొదలైనవి ఉన్నాయి. వారి సాక్ష్యాలను అనుసరించి జీవులకు శిక్షలు అమలు జరుగుతాయి.

జీవుడు తనకు ఇష్టమైన విధంగా పుణ్యపాపకర్మలు చేస్తాడు. ఆ కర్మల ననుసరించి శుభాలుగాని, అశుభాలుగాని ప్రాప్తిస్తూ ఉంటాయి. ఆలోచించి చూస్తే దేహధారులకు సత్త్వరజస్తమోగుణాల సంపర్కం తప్పదు. అందువల్ల దేహి అయిన ప్రతి జీవీ కర్మాచరణ తప్పక చేయవలసిందే!

జీవుడు ఇప్పటి జన్మలలో చేసిన కర్మల పాప, పుణ్యాలను ఆధారంగా చేసుకొని, తరువాతి జన్మలలో అందుకు తగిన రూపాలు పొందుతాడు. ఈ జన్మ కర్మ ఫలితాలను మరుసటి జన్మలలో తప్పక అనుభవిస్తాడు.

ఇంకా వినండి. సత్త్వరజస్తమోగుణాలలో ఒక్కదానిప్రభావంవల్ల జన్మించినజీవులు సాత్త్వికులు, రాజసులు, తామసులు అని పిలువబడతారు. మొదటివారు ధర్మాచరణపరులై సుఖాలు అనుభవిన్తారు. రెండవ వారు అహంకారపూరితులై ధర్మాధర్మాలను ఆచరిస్తూ సుఖదుఃఖాలు రెంటిని అనుభవిస్తారు. మూడవవారు ఘోరబుద్ధి కలిగి అధర్మపరులై కష్టాలపాలౌతారు. వారి వారి ప్రవర్తనల కనుకూలమైన జన్మలే తదనంతరం వారికి ప్రాప్తిస్తాయి.

సమవర్తి అయిన యముడు సర్వప్రాణులలో అంతరాత్మరూపంలో ఉండి, వారివారిగుణాలకు, కార్యాలకు అంతస్సాక్షిగా ఉండి, వారి ప్రవృత్తులకు ప్రేరణ కల్పిస్తాడు. అజ్ఞానులు తమోగుణప్రధానులై దేహాత్మభావం పొంది ఉంటారు. పూర్వస్మృతిని కోల్పోయి కర్మేంద్రియాలతో పాపకర్మలు చేస్తూ, జ్ఞానేంద్రియాలవలన విషయలంపటులై వాగ్రూపమైన, మానసికమైన, శారీరకమైన పనులు చేస్తుంటారు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు తన్మాత్ర పంచకాలతో గూడి, మనసుతో కలిపి తాను పదిహేడవ వాడయి ఉపాధి సంబంధం కలిగి, సంసారబద్దుడై కొట్టుమిట్టాడుతుంటాడు. పైన చెప్పిన పదహారు అంశాలతో కూడిన జీవుడు సత్త్వగుణం కలవాడైతే హర్షాన్ని రజోగుణంగలవాడైతే శోకాన్ని తమోగుణంగలవాడైతే భయాదులను పొందుతాడు.

అరిషడ్వర్గాన్ని జయించలేక కర్మ సంసారబంధకారణమని తెలిసికూడా, పూర్వజన్మవాసనల కారణంగా ఆయా కర్మలను చేస్తుంటాడు. ఆ కారణంగా పట్టుపురుగు తాను అల్లుకున్న గూటిలో చిక్కుకొని, బయటకు రాలేని విధంగా సంసారజాలంలో చిక్కుకుంటాడు.

ప్రస్తుత వసంతకాలంలోని ఫల, పుష్ప భరితమైన వృక్ష లతాదులను చూచి, భూతకాలంలోను, భావికాలంలోను వాటి స్థితిగతులను ఊహించవచ్చు. అలాగే జీవి ఇప్పటిజన్మలోని నడవడికనుబట్టి భూతకాలంలోని గుణశీలాలు ఎలాంటివో, భావికాలంలో ఎలా ఉండబోతాయో ఊహించవచ్చు.

ఏ ప్రాణి అయినా సరే తనకు విధించిన పనులను చేయకుండా ఉండటం సాధ్యం కాదు. వాసనాబలాన్ని బట్టి ఆ యా గుణాలు ఏర్పడతాయి. ఆ గుణాలకు అనుగుణంగానే జీవుడు కర్మలు తప్పక చేయవలసి ఉంటుంది. అవ్యక్తమైన ఆ వాసనాహేతువుచే ఏర్పడినగుణాలవల్ల జీవి బద్దుడవుతాడు కాబట్టి బలవంతంగానైనా కర్మలు చేస్తూ ఉంటాడు. జన్మపరంపరా రూపమైన ఈ సంసారచక్రంనుండి విముక్తి పొందాలంటే ఆ పరమేశ్వరునియందు అనన్యభక్తి కలిగి ఉండాలి. అపుడే జీవన్ముక్తి లభిస్తుంది.

కనుక ఈ అజామిళుడు పూర్వజన్మ సంస్కారం వల్ల శ్రేష్టమైన బ్రాహ్మణవంశంలో జన్మించి, వేదశాస్త్రాలను గురుసేవతో, ఇంద్రియ నిగ్రహంతో అభ్యసించాడు. పెద్దలను, జ్ఞానులను సేవించాడు, సకల ప్రాణులయందునూ సమత్వదృష్టి కలిగి, మంత్రానుష్థానంతో సిద్ధులు పొందాడు. సత్యవ్రతం, నిత్య నైమిత్తికాదికార్యాలు నిర్వహించాడు. లోభాది దుష్ట వర్తనలను వదిలి, సద్దుణవంతుడైనాడు.

నిత్యం ఆచారనిష్ఠకలవాడై, జ్ఞానాన్ని సముపార్జించే సరైన సమయంలో, తాను ఉత్తముడుగా మారబోతున్న కాలంలోనే అతనికి మన్మథవికారం కలిగించే కోడెవయసు ప్రారంభమైంది.

('యౌవనం ధనసంపత్తిః ప్రభుత్వమవివేకితా, ఏకైక మప్యనర్థాయ కిము యత్ర చతుష్టయమ్‌' అనే సూక్తి వల్ల ఆధారంగా తరువాత వచ్చే అన్ని అనర్థాలకు మూలమై వివేకాన్ని పోగొట్టే దోషాలలో మొదటిదైన నవయౌవనం అని చెప్పవచ్చు.)

మిక్కిలి తేజోవంతుడైన అజామిళుడనే ఆ బ్రాహ్మణునికి యావనదశ ప్రాప్తించిన కాలంలో కన్నుల చివర యౌవన మదం, మనసులో తొందరపాటు, శరీరమంతా మన్మథచేష్టలు, మొగమున లేత నవ్వు, శరీరానికి గొప్పబలం, తలవెంట్రుకల నల్లని నిగారింపు, నడుము బరువుతో తొడలయందు కాంతి, చేతులు పొడవుగా సాగుట, విశాల వక్షఃస్థలం, శరీర లావణ్యం. మొదలైన కొత్తదనాలు రూపుదిద్దుకున్నాయి.

మదిలో పుడుతున్న యౌవనమదం, తన చిహ్నాలను ప్రదర్శిస్తున్నట్లుగా అతనిముఖంపై మొలకెత్తిన నూనూగు మీసాలు నల్లగా అందంగా కనిపించాయి.

అంతేకాక, అరవిరిసిన తామరపూవుమీద తుమ్మెదలగుంపు వాలినట్లుగా అజామిళుని అందమైనముఖం పై చక్కని చిక్కని మీసకట్టు అంకురించింది.

ఇంతలో వసంత ఋతువు వచ్చింది. మన్మథుడనే బ్రహ్మదేవుడు ప్రారంభించిన యజ్ఞానికి వసంతుడనే పురోహితుడు అంకురారోపణం చేసినట్లు ఉద్యానవనాలలోని చెట్లకొమ్మలు కొత్తచిగుళ్లు తొడిగాయి. వాయువేగానికి కదలుతున్న ఆ చిగురాకులు కంపిస్తున్న జారజారిణీ జనహృదయాలలో గుచ్చుకొనే బాకులు లాగా ఉన్నవి. చక్కగా వికసించిన పువ్వులలో నుండి చెలరేగిన పుప్పొడి దుమారాలు ఆకాశాన వేలాడగట్టిన చాందినీలవలె ప్రకాశిస్తున్నాయి. పూలలో చిందుతున్న మకరంద బిందువుల విందులతో మైమరచిన మధుకరాల మధుర ఝంకార నాదాలతో దిక్కులన్నీ పిక్కటిల్లుతున్నాయి. బాగా పండి పగిలినఫలాలను ఆరగిస్తూ ఆనందంతో చిలుకలు మొదలైనపక్షులు కలకల ధ్వనులు చేస్తున్నాయి. ఈ విధంగా అందరికీ ఆనంద దాయకమైన మధుమాసం చెట్లన్నింటికీ కొత్తసాగసులు చేకూర్చింది. ఆ సమయంలో అజామిళుడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలూ, సమిధలూ, పుష్పాలూ, పండ్లూ తీసుకొని రావటంకోసం తోటలోనికి వెళ్లి తిరిగివస్తూ ఒక దట్టమైన పొదరింట్లో తీవ్రమైన రతిసంబంధమైన కోరికతో మన్మథక్రీడ యందు నిష్ణాతురాలైన శూద్రస్త్రీతో కూడిన ఒక పురుషుణ్ణి చూశాడు.

ఆ పొదరింటిలో రతిక్రీడలో ఆరితేరినాడు. యౌవనమద వైభవాన్ని ప్రదర్శించడంలో గడిదేరినవాడూ, సురతేచ్చతో కూడినవాడు, దిసమొలతో ఉన్నవాడూ అగు ఒక విటుణ్ణి చూశాడు.

మధువు తాగిన మత్తులో రతి తరువాత తిరిగి రతికోసం తొందరపడుతూ, కనుబొమలను, కనుగ్రుడ్లను విలాసంగా ఆడిస్తూ, నుదుటక్రమ్ముకొన్న ముంగురులతో, కౌగిలింతకోసం, రతిక్రీడకోసం వెంపర్లాడుతున్న వేశ్యతో, స్వేచ్చారతిలో ఉన్న జారుణ్ణి చూశాడు.

సంభోగసమయంలో అనుకోకుండా నోటి నుండి వచ్చిన మణితం(అవ్యక్త మాటలధ్వని) ఒడ్డాణపు మువ్వల ధ్వనితో కలిసి మధుర ధ్వనులు వినిపిస్తుండగా, రతిలో సంపూర్ణ తమకంతో ఉన్న వనితను చూశాడు.

ఆ యువతి కాలి అందెలు పోటాపోటీగా మోగుతూ, అతనికి ఆనందం కలిగిస్తుంటే వారు పోటీగా ఒకరి మీద ఒకరు పడుతూ చేస్తున్న సంభోగంలోని వివిధ భంగిమలను అజామిళుడు చూశాడు.

ఆ వేశ్య ముఖంపై ముంగురులు కదలాడుతుంటే, కొప్పు వీడిపోయే విధంగా, మెడలోని ఆభరణాలు ఊగుతుండగా నడుము కదలికలకు అనుగుణంగా ఒడ్డాణం తాళం వేస్తుంటే నడుము ఒత్తిడికి గురయ్యే విధంగా తన ఆధిక్యాన్ని చూపిస్తూ పురుషాయిత సంభోగక్రీడ సాగిస్తోంది.

నిండు యౌవనంతో మృదువైన శరీరంతో, ప్రియుని కౌగిలింతలతో పురుషాయిత శృంగారక్రీడలలో ఆరితేరిన కామ విలాసిని అయిన స్త్రీని చూచిన ఆ అజామిళుడు కామోద్రేకం కలవాడై

తేప తేపకూ ఏపుమీరిన తన చూపులనే మోహపాశాలలో చిక్కుకొన్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మలనూ, శాస్త్రపాఠాలనూ, జపతపాలనూ మరచిపోయాడు. అతడి మనస్సనేఅరణ్యంలో కామోద్రేకమనేకార్చిచ్చు చెలరేగ సాగింది. నియమబద్ధమైన అతడిచిత్తం పట్టు తప్పిపోయింది.

అజామిళుడు ఆ క్షణం మొదలు ఆ అందాల భామ చిక్కని చెక్కిళ్లనూ, చిరునవ్వునూ, కదలుతున్న ముంగురులనూ, నున్నని నుదురునూ, చెవులదాకా వ్యాపించిన వాలుకన్నులనూ, బిగువైన కుచాలనూ, విశాలమైన కటిప్రదేశాన్నీ, మాటి మాటికీ స్మరింపసాగాడు. అతడిమనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో క్రుంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనైనాడు.

కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రిగారు సంపాదించిన ఆస్తి నంతటినీ ఆమెపాలు చేశాడు. సాధు లక్షణాలైన సద్గుణాలను విడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలుగన్నుల ఇంతి అందచందాలకు లొంగిపోయాడు.

నిండు యౌవనం కలిగి సుగుణ సంపత్తి కలిగి, కామక్రీడ యందు అతనికి ఆనుకూల్యవతి అయిన భార్యను ఇంటిలోనే వదిలి, తన గౌరవాన్ని పోగొట్టుకొని, నీచుడై ఆ స్త్రీతోనే కాపురం మొదలుపెట్టాడు.

ఈ విధంగా అజామిళుడు చుట్టపక్కాలను దూషించాడు. సజ్జనులను ద్వేషించాడు. దిక్కులేని దీనులను చిక్కులపాలు చేశాడు. చిట్టచివరకు ధనం కోసం దారులు కాచి వచ్చేపొయ్యే జనాన్ని దోచుకున్నాడు. దొంగతనంలో ఆరితేరాడు. ఎవరు ఏ మనుకొన్నాా ఎన్ని తిట్టినా లెక్కచెయ్యకుండా సంపాదించిన ధనమంతా ఆ సుందరి చేతుల్లో పోసి, దానికి దాసుడై దాని దయా దాక్షిణ్యాలపై జీవింపసాగాడు.

వేదాంత చర్చను వదిలి ఆమె స్తన గంధ(లేపన) చర్చను చేసేవాడు. తర్కశాస్త్రంలోని కఠిన విషయాల చర్చను వదిలి ఆమెతో ప్రేమపూర్వక తర్కాన్ని జరిపేవాడు. స్మృతులలోని పద, వాక్య, విశేషాలను వివరించడం మాని, ఆమె మాటల తీరులోని విశేషాలను వర్ణించేవాడు. నాటక, అలంకార పాటవాన్ని కాదని, ఆమె కపట వర్తనలను, ఆభరణాల సౌందర్యాన్ని పొగిడేవాడు. ఈ విధంగా ఏ మార్పు లేక పాపాత్ముడైన అజామిళుడు ప్రీతితో ఆ ఇంతిని సొంత భార్యగా భావించి, ఆమె సంసార భారాన్ని తానే మోస్తూ, మలినదేహుడై చెడుమార్గంలో జీవించాడు.

అందుకని ఇటువంటి పాపాత్ముడిని, దుష్టుడిని, దుర్మార్గుడిని, హింసాపరుడిని మేము తీసుకుపోయి, తప్పక శిక్షిస్తాము. దానివలనమాత్రమే అతడు పాపరహితుడు అవుతాడు.

ఈ విధంగా మాట్లాడుతున్న యమకింకరుల్ని ఆపి, నీతినిపుణులైన విష్ణుదూతలు సమాధానంగా ఇలా అన్నారు.

ఓహో! మీరు ఎంత గొప్ప పండితులో మీ మాటలే చెబుతున్నాయి. మీకు అసలు శిక్షలు అమలుచేసే విధానమేమిటో తెలియకపోవడం వలన అయ్యో! పాపం దండనార్హులు కానట్టి పుణ్యపురుషులు శిక్షలకు గురి చేయబడినారు.

సమబుద్ధి గలవారు, సాధువర్తనులు, శాసనకర్తలు, మంచి దయాపరులు, గొప్ప సుగుణాలు కల్గిన తల్లి దండ్రులే తమ బిడ్డలకు కీడు చేయ తలపెట్టితే ఇక ఆ బిడ్డలు ఎవరితో మొర పెట్టుకోగలరు? మీ మనస్సులలో మీరే కొంచెం ఆలోచించి చూడండి.

వివేకవంతుడు ఏ పనినైతే సరైంది అని చేస్తాడో, ఇతరులు దానినే ఆచరిస్తారు. అతడు ఏది నిజమని చెబుతాడో ఆ విషయాన్నే లోకం కూడా నమ్మి అనుసరిస్తుంది.

ఓ యమకింకరులారా! ఒకడిని స్నేహితుడని నమ్మి అతని ఒడిలో నిద్రిస్తున్న మిత్రుడిని ఎవడైనా దయారహితుడై చంపాలని అనుకుంటాడా? (అనుకోడు).

స్నేహభావంతో వచ్చి, హృదయమిచ్చి, తనకు బాగా నచ్చి, తనను మెచ్చి నమ్ముకున్న వ్యక్తికి దయాదాక్షిణ్యాలు గల బుద్ధిమంతుడు ఏ మాత్రం ఆలోచన లేకుండా ఎలా అపకారం చేస్తాడు? (అపకారం చెయ్యడు.)

అది మాత్రమే గాక, ఈ అజామిళుడు తనకు కలిగిన శ్రీవిష్ణునామోచ్చారణం అనే అమృతప్రాయమైన ఐశ్వర్యం కారణంగా మంచిబుద్ధితో, కోటి జన్మలలో అతనికి సంక్రమించిన మహాపాపసముదాయాన్ని పూర్తిగా ఈ జన్మలో పోగొట్టుకోగలిగాడు.

నారాయణుని గుణ కీర్తనలు అనేవి బ్రహ్మహత్య వంటి మహా పాతకాటవులకు కార్చిచ్చులు. గురుభార్యా సంగమం వంటి పాపాలు అనే పాములకు నెమళ్ళు. బంగారం దొంగిలించడమనే చీకట్లకు సూర్యకిరణాలు. మద్యం తాగడం వంటి పాపాలనే మత్తెక్కిన ఏనుగులకు సింహాలు. ఎంతో గొప్పవైన యోగసమాధివంటి విధులను ఆచరించిన బ్రహ్మాది దేవతా సమూహానికి కూడా లభించని మోక్షసామ్రాజ్యానుభవానికి చెందిన క్రీడలు.

శ్రీమన్నారాయణుని నామగానాలు మోక్షమనే కన్యతో సలిపే సల్లాపాలు. సత్యలోక సౌఖ్యాలకు నెలవైనవి. మహిమాన్వితమైన ముక్తి అనే రాజ్యాధిపత్యానికి ఆలవాలమైనవి. ఎడతెగని దీర్ఘ తపస్సులకు ఫలితమైనవి. పుణ్యానికి ఆధారమైనవి. నిరపాయపోషకాలై కోరికలను తీర్చగలిగేవి, అజ్ఞానాన్ని పోగొట్టేవి, ఉపనిషత్తుల మూలసారాంశాలు.

ఆశించదగింది, శుభలోకాలకు నెలవైంది, ఋషుల మనసులే నివాసంగా కలిగింది, ముక్తికి మార్గమైంది అయినట్టి గోవిందనామస్మరణం నిత్యం చేసేవాడు సర్వసమర్థుడూ అవుతున్నాడు.

అజామిళుడు “నారాయణా” అని పిలిచినప్పుడు ఇతనిహృదయం కుమారునిమీద ఆసక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతునిపేరును ఏ విధంగా పలికినప్పటికీ వాసుదేవుడు రక్షకుడై అందులో ఉండనే ఉంటాడు.

శ్రీమహావిష్ణువును బిడ్దపేరుతోనైనా, విశ్రాంతి సమయంలో అయినా, ఆటల్లోనైనా, పరిహాసంగానైనా, పద్యంలోనైనా, గద్యంలోనైనా, గీతాల్లోనైనా వాటి భావార్థాల్లోనైనా స్మరిస్తే చాలు అది సకల పాపాలను పోగొడుతుంది.

ప్రమాదవశాత్తు జారిపడినపుడూ, గాయపడి ఈతిబాధలతో కుంగినపుడూ, విషజ్వరాలవంటి వ్యాధులు సంక్రమించినపుడు, సంధివాతం ఏర్పడి ప్రేలాపన కలిగినపుడు, పాములవంటి విషజంతువుల వలన బాధకు గురైనపుడు, ఇలాంటి ఏ సందర్భంలోనైనా విష్ణువుని స్మరించగలిగితే అలాంటి వారికి యముని వలన ఏ విధమైన భయం పొందరు. దుఃఖ దశల్ని పొందరు.

పెద్ద పాపాలకు పెద్దప్రాయశ్చిత్తాలనూ, చిన్నపాపాలకు చిన్నప్రాయశ్చిత్తాలనూ మహానుభావులైన మునులు నిర్ణయించే ఉన్నారు. కాని ఆ ప్రాయశ్చిత్తాలవల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప, పూర్తిగా పరిహారం కావు. సమస్తపాపాలనూ సంపూర్ణంగా హరించి, మనస్సును పరిశుద్ధం చెయ్యాలంటే భగవంతునిసేవ ఒక్కటే సరి అయిన త్రోవ. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ యోగిమానసవాసుణ్ణి, ఆ పీతాంబరధారుణ్ణి, ఆ వేదవేద్యుణ్ణి, ఆ పురుషోత్తముణ్ణి సంస్మరిస్తూ ఆయన పాదాలు సేవిస్తే మోక్షం సిద్ధిస్తుంది.

దైవం అంటే ఏమిటో అర్థం తెలియని చిన్నపిల్లవాడుకూడా మిగతా హరిభక్తులతో కలసి భగవన్నామస్మరణ చేస్తేచాలు గాలి సహాయంతో అగ్ని గడ్డిని బూడిదగా ఎలాచేస్తుందో అదేవిధంగా హరినామస్మరణం అతని పాపాలన్నిటిని పటాపంచలు చేస్తుంది.

(వేదాంతశాస్త్ర పరిభాషలో 'బాలుడు' అంటే 'అజ్ఞాని' అని అర్థం. పరమాత్మను తెలుసుకోవటమే జ్ఞానం. తెలుసుకోకపోవటం అజ్ఞానం.)

శక్తిమంతమైన ఔషధం కాకతాళీయంగా తీసుకున్నా అది తన ప్రభావంతో ఏ విధంగా వ్యాధిని తగ్గిస్తుందో, ఆ విధంగా, భగవంతుని నామాన్ని మూర్ఖుడు తెలియక పలికినా, అవహేళనగా పలికినా దాని ప్రభావం ఊరకనే పోదు. దాని మహత్తరగుణాన్ని తప్పకుండా చూపించి తీరుతుంది.

పూర్వజన్మ పుణ్యఫలంగా తప్ప, ధైర్యం కోల్పోయిన మనస్సు భగవన్నామ స్మరణ చేయలేదు. సకల లోకాలను తనలో ఇముడ్చుకోగలిగిన విష్ణువు కేవలం ఒక్కని మనసులో మాత్రమే ఉంటాడా? (ఉండదని భావం).

ఇక ఈ అజామిళుని విషయమంటారా! మరణకాలంలో ఈ మహనీయుడు శ్రీహరినామస్మరణం అనే అమృతాన్ని ప్రత్యక్షంగానే ఆస్వాదించాడు. శాశ్వతమైందీ, నిర్దోషమైందీ, సమస్తమైన చైతన్యానికి ఆలవాలమైందీ, నిత్యసత్యమైందీ, నిరహంకార సుగుణ సంపదలతో కూడిందీ, నియమబద్ధమైందీ, నిర్మలమైందీ అయిన నారాయణనామస్మరణం ఎలా వ్యర్థమవుతుంది?

ఈ విధంగా విష్ణుదూతలు భక్తితత్త్వాన్ని, నామవైశిష్ట్యాన్ని వివరించి, మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మీ ప్రభువైన యమధర్మరాజును అడిగి తెలుసుకొమ్మని చెప్పి పంపించారు. ఇటు అజామిళుడిని మృత్యుభయం నుండి, నరక భీతినుండి విముక్తుణ్జి చేశారు. యమకింకరులు అశక్తులై వెనుదిరిగి యమలోకానికి పోయి, జరిగిందంతా యమునికి తెలియజేశారు. ఆ తర్వాత

యమపాశం నుండి విముక్తుడై అజామిళుడు స్వస్థతపొంది, ఆనందపరవశుడై, విష్ణుదూతలకు మనసులోనే వందనాలు సమర్పించి, లేచి వారికి నమస్కరించి ఏదో చెప్పడానికి ఉత్సహిస్తుండగా అతని మనసును గుర్తించిన విష్ణుదూతలు అద్భశ్యులై వైకుంఠవాసుని వద్దకు వెళ్ళిపోయారు.

అజామిళుడి పశ్చాత్తాపం

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

Ajamilopakyanam - అజామిళోపాఖ్యానము

అజామిళోపాఖ్యానము

మహారాజా! పూర్వం కన్యాకుబ్జమనే పట్టణంలో అజామిళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహాపాపాత్ముడు, పరమదరిద్రుడు, నింద్యచరిత్రుడు, మంచిని తిరస్కరించేవాడు. దురాచారపరుడు, నికృష్ట జీవనుడు. జూదాలన్నాా వివాదాలన్నా ఆదరం మెండు. దొంగతనానికి పెట్టింది పేరు. అతడు యౌవనపు మత్తులో ఒక దాసిని భార్యగా చేసుకొన్నాడు. ఆమెయందు పదిమంది కొడుకులను కన్నాడు. ఆతడు ఆ వ్యామోహసముద్రంలో మునిగిపోయాడు.

ఆ పిల్లల ఆలన పాలనలో, ముద్దుముచ్చట్లలో చాలాకాలం గడిపాడు. సంసారలంపటుడై ఆనందంతో మైమరచాడు. ఆ మురిపాలన్నీ ముగిసి ముసలివాడైనాడు.

మలినమైన మనస్సు చివరకు స్వచ్చతను పొందుతున్నట్లుగా అతని తలవెంట్రుకలు తెల్లబడ్డాయి. భార్యాపిలలయందు మమకారం తగ్గినట్లుగా శరీరం బిగువు తగ్గింది. ఇంద్రియాలు తమకు మోహం వద్దన్నట్లుగా తల అడ్డంగా వణకసాగింది. తీవ్రమైన కోరికలు వయసుతోపాటు తగ్గినట్లు కంటిచూపు మందగించింది. నోటికి అరుచి కలిగింది. దంతాలు ఊడిపోయాయి. ఆయాసం, దగ్గు పెరిగాయి. తలనొప్పి హెచ్చింది. ఈ విధంగా అతనికి ముసలితనం నాటికి మనసు కూడా చెదిరిపోయింది.

ఈ విధంగా అతడు ఎనభైఎనిమిది సంవత్సరాలు నిండినవాడైనప్పటికీ మోహభ్రాంతుడై చివరి కొడుకైన నారాయణుడు అనే వాడియందు మిక్కిలి ప్రేమ కలిగి ఉండేవాడు.

ఓ మహారాజా! అజామిళుడు అతని భార్య కలసి చిన్న కొడుకైన నారాయణుణ్ణి మిక్కిలి ప్రేమతో ముద్దుచేసేవారు.

మనోహరమైన, తిన్నని నుదురు కల్గి, తన తండ్రికి ఆత్మబంధుత్వాన్ని పెంచే స్వభావం కలవాడు, అయిన కుమారుణ్ణి (నారాయణుణ్ణి), చూస్తూ ఆ దుశ్శీల బ్రాహ్మణుడైన అజామిళుడు చాలా సంతోషిస్తున్నాడు.

ఆ ఆఖరి కుమారుడిపై ప్రేమతో ఆహార, పానీయాదులయందు, ఆటపాటలయందు కూడా అతనితో కాలం వెళ్ళదీస్తూ జడుడైనందువల్ల తనకు ఆసన్నమైన మరణాన్ని గుర్తించలేక పోయాడు.

అజామిళుడు ఈ విధంగా అజ్ఞానంతో వ్యామోహంలో ఉంటూనే మృత్యువు ఆసన్నమైన సమయంలో తనకు ప్రియ పుత్రుడైన నారాయణుణ్ణి ఆ పేరుతోనే పిలుస్తూ తనలో తానే ఎక్కువగా తలచుకుంటూ కాలం గడుపుతున్నాడు.

ఆ సమయంలో ఆ అజామిళుడు పలురకాల పాపాలను చేసే సర్వలోక ప్రజలను క్రూరంగా శిక్షించే అతి భయంకరులైన యమభటులను శరీరం పట్టు తప్పుతుండగా భయభ్రాంతుడై చూశాడు.

పాపాత్ములను దండించడంలో కఠినంగా ప్రవర్తించేవారు, భయంకరరూపం గలవారు, నిర్థయాజాతకులు అయిన యమభటులను ఆ బ్రాహ్మణుడు దూరం నుండే చూశాడు.

కోపంతో భయంకరంగా వ్రేలాడుతున్న పెదవులు కలిగిన వికారముఖాలలో తీక్షమైన చూపులు కలిగినవారు, పాపులకు భయం కలిగించే యమపాశాలను, ఆయుధాలను కలిగినవారు, మరణవ్వాప్తితో విశేషంగా భయాన్ని కల్గించేవాళ్లు, తనను తీసుకువెళ్ళడానికి వచ్చిన ముగ్గురు యమదూతలను ఆ బ్రాహ్మణుడు చూచాడు.

జీవితం చివరిదశలో ఉన్న అజామిళునికి వికృతముఖాలతో, మిడిగుడ్లతో, వికారమైన చెక్కిళ్లతో, ఒంటినిండా నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో, సకల జీవులను పీడించి ప్రాణాలను హరించగల అనువైన యమపాశాలు ధరించిన యమకింకరుల దర్శనంతో అవయవపటుత్వం కోల్పోయి, చలిస్తున్న ప్రాణాలు కలవాడై కదలిక లేనివాడై

తన చివరి దశలో దూరంగా ఆడుకుంటున్న తనకు అత్యంత ఇష్ఠుడైన ఆఖరి కుమారుడిని చూడాలనిపించి నారాయణ అని మూడుసార్లు పిలిచాడు.

ఆ అజామిళుడు తన మరణకాలంలో శ్రీమహావిష్ణువును నారాయణా అని స్మరించాడు. ఆ స్మరణను విన్న విష్ణుదూతలు త్వరితగతితో వచ్చి, పరుషంగా మాట్లాడేవారు, భయంకరరూపాలు కలిగినవారు, అత్యధికకోపంకలవారు అయిన యమకింకరులను అడ్డగించారు.

('యం యం వా
పి స్మరన్‌ భావం త్యజత్యంతే కలేబరమ్‌ తం తమేవైతి కౌంతేయ! సదా తద్భావభావితః' (భగవద్గీత, అష్టమ, 6) అనే గీతావాక్యాన్ని అనుసరించి ప్రాణోత్క్రమణ సమయంలో నారాయణ స్మరణం చేసిన మాత్రంచే ఎవరికైనా పాపాలు నశించి విష్ణుదూతల దర్శనమౌతుంది.)

పతితుడైన అజామిళునిశరీరంనుండి అతనిజీవాన్ని యమకింకరులు తీసుకుపోతుంటే విష్ణుదూతలు వారిని బలంతో గెంటివేశారు.

విష్ణుదూత యమదూతల సంవాదము

Friday, March 6, 2026

Sukadeva Provides a Detailed Account of the Narakalokas - శుకయోగి పరీక్షిత్తునకు దెలిపెడి నరకలోక వర్ణనము

శుకయోగి పరీక్షిత్తునకు దెలిపెడి నరకలోక వర్ణనము

మూడులోకాలకు ఆవల దక్షిణదిశలో మిక్కిలి భయంకరాలై, భూమ్యాకాశాల నడుమ విజృంభణంగా నెలకొని నరక లోకాలున్నాయి.

అంతేగాకుండా దక్షిణంలోనే ఉన్న అగ్నిష్వాత్తులు మొదలయిన పితృదేవతలు కూడా తమతమ గోత్రాలలో పుట్టినవారికి శుభం కలగడంకోసం సత్యమయిన దీవనలు ఇస్తుంటారు. అక్కడ పితృపతి అయిన యముడు కూడా తన లోకం చేరుకొనే జీవులకు జీవితకాలంలో వారు వారు చేసిన కర్మలకు తగినట్లు ఫలం ప్రసాదిస్తూ శిక్షిస్తుంటాడు. ఆ యమలోకంలో తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటక శాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయాదనం, అవీచిరయం, రేతఃపానం అనే ఇరువదొక్క నరకాలున్నాయి. అవేగాకుండా క్షారకర్దమం, రక్షోగణ భోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే మరి ఏడు నరకాలున్నాయి. వెరసి దక్షిణంలో ఇరవై ఎన్మిది నరకాలున్నాయని కొందరు చెబుతారు.

ఇతరుల బిడ్డలూ, భార్యలూ అనే ఆదరభావం ఏమాత్రం లేకుండా అకారణంగా వారిని అపహసించే పాపాత్ముణ్ణి యమకింకరులు తాళ్ళతో బంధించి పరిపరివిధాల బాధిస్తారు.

అంతేగాకుండా వారిని తామిస్రమనే నరకంలో పడవేస్తారు. అన్నం పెట్టక, కొండపై నుండి తోసివేస్తూ, కర్రలతో చావబాదుతూ, బెదరిస్తూ యమకింకరులు నానావిధాలుగా శిక్షిస్తారు. ఆ బాధలకు తాళలేక జీవులు భయకంపితులై మూర్చపోతుంటారు.

మగడు ఉండగానే అతణ్జి మోసగించి అతని ఇల్లాలిని కామించి అనుభవించినవాణ్ణి పట్టుకొని యమకింకరులు సంకోచం లేకుండా అతణ్ణి పట్టరాని కోపంతో అంధతామిస్రం అనే నరకంలో తోస్తారు.

ఓ రాజా! ఎవరయితే తన కుటుంబ పోషణకోసం ఇతరులకు ద్రోహం చేస్తారో అటువంటివారు రౌరవ నరకంలో పడతారు. ఎవరయితే ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఇతరులకు ఏ మాత్రం అపకారం తలపెట్టని పశుపక్షి మృగాదులను బాధిస్తారో అటువంటి పాపాత్ములను ఆయా మృగాలు భయంకర రూపాలతో నానాబాధలు పెడతాయి. అటువంటి వారు రౌరవ మహారౌరవ నరకాలంలో పడతారు. ఎవరయితే తమ కడుపు నింపుకోవడం కోసం ఎలుకల కన్నాలు మూసి వాటిని చంపుతారో అటువంటి నిర్థయులను కుంభీపాక నరకంలో పడవేసి హింసిస్తారు.

('పాపాత్ములు రురునామక జంతువులుగా పుడతారు. రురువు అంటే నల్లచారల దుప్పి. మిక్కిలి క్రూరమయిన జంతువు. 'రురు' కారణంగా నరకానికి రౌరవమని పేరు వచ్చింది అనే వివరణ కనిపిస్తుంది (26-11).)

తల్లిదండ్రులకూ, బ్రాహ్మణులకూ కీడు తలపెట్టేవాడు, కాలసూత్రమనే భయంకర నరకంలో పడతాడు. అక్కడ పదివేల యోజనాల పొడవుగల లోహపాత్రలలో అతణ్జి పడవేస్తారు. పైన ఎండ మండిపోతుంటుంది. కింద మంటలు భగ భగ మండుతుంటాయి. అతడు పరుగెత్తుతూ పడుతూ లేస్తూ నిలబడుతూ పక్కకు తప్పుకొంటూ ఆకలితో దప్పికతో అలమటిస్తుంటాడు. ఆవు ఒంటిమీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు అక్కడ యమకింకరులు వాణ్ణి బాధిస్తారు.

వేదమార్గాన్ని వదలిపెట్టి పాషండమార్గం అవలంబించే పురుషుని అసిపత్రవనమనే నరకంలో పడవేస్తారు. అక్కడ కత్తులవంటి ఆకులు గల ఆ చెట్ల నడుమ పరుగెత్తుమని ఆదేశిస్తూ పరిహాసం చేస్తూ కొరడాలతో కొడుతుంటారు. ఇరుప్రక్కల కత్తులవంటి చెట్ల ఆకులు తగిలి శరీర భాగాలు తెగిపోతుంటాయి. అపుడా జీవుడు అడుగడుగునా మొరపెడుతున్నా వినకుండా యమకింకరులు వాణ్ణి వేధిస్తుంటారు.

దండించ తగని సాధువులను దండించినా, బ్రాహ్మణ శ్రేష్ఠులను శారీరకంగా హింసించినా అటువంటి దుర్మార్గుల్ని కాలసూత్రనరకంలో పడవేసి కఠినంగా దండిస్తారు.

అక్కడ ఆ దుర్మార్గుణ్ణి పట్టుకొని యమభటులు చెఱకుగడ విరిచినట్టుగా నడిమికి రెండుగా విరిచి హింసిస్తుంటే వాడు అరుస్తూ, ఆక్రోశిస్తూ, మూర్చపోతూ, మొరపెడుతూ ఉంటాడు.

నరేంద్రా! విధి నియమించిన విధంగా తమ బతుకు తాము గడుపుతున్న జంతువులను హింసించేవాణ్ణి అంధకూప నరకంలో పడతోస్తారు. అక్కడ తాము చేసిన ద్రోహం కారణంగా ఆ నరకకూపంలో దొరలుతూ ఏ జీవులనయితే తాను బాధించాడో క్రూరాలైన ఆ పక్షులు, మృగాలు, పశువులు, పాములు, దోమలు, నల్లులు, ఈగలు వాణ్ణి పీక్కు తింటాయి. కటిక చీకటిలో నిదురకు నోచుకోక తిండికి మొగం వాచి కుత్సిత శరీరంలోని జీవునిలాగా సగం చచ్చి పడి ఉంటాడు.

తాను కూడబెట్టిన సంపదలో ఎవ్వడైనా తన బంధుగణంతోకూడి తగిన రీతిలో ఆరగించకుండా, తాను కూడా కాకి తినేవిధంగా తినేవాడు. తాను కూడబెట్టిన సంపదలో ఏ కొంచెం కూడా తనవారికి పెట్టకుండా తానొక్కడే భక్షించినవాణ్ణి క్రిమి భోజనమనెే నరకంలో తోస్తారు. అక్కడ వాడు పురుగై సుమారు లక్ష యోజనాల విస్తీర్ణం కలిగిన పురుగుల గుంటలో కూరుకుపోయి పురుగులను ఆహారంగా తింటూ ఉంటాడు.

ఈ భూలోకంలో ఎవడయితే తనకు ఎటువంటి కష్టమూ లేకపోయినా దొంగతనంగా బ్రాహ్మణాదుల బంగారాన్ని రత్నాలు మొదలైన విలువ గల వస్తువులను అపహరిస్తాడో అటువంటివాణ్ణి అగ్ని తప్త నరకంలో పడవేస్తారు. మండుతున్న ఇనుపగుండ్లను అతని శరీరంపై విసరివేస్తారు. ఎర్రగా కాలిన ఇనుపచువ్వలు గుచ్చుతారు. మోహంతో కామంతో కళ్ళు కనబడక వావివరుసలు లేకుండా ప్రవర్తించిన స్త్రీ పురుషులను యమలోకంలో తీవ్రమయిన కొరడాలతో కొట్టి గనగన కాలుతున్న ఉక్కుబొమ్మల్ని కౌగిలించుకొనేటట్లు చేస్తారు.

జంతువులతో సంగమం చేసినవాణ్ణి పట్టుకొని వజ్రాల మెకులుగల బూరుగు చెట్లకు కట్టి చితక గొడతారు.

ఓ రాజేంద్రా! ఎవడయితే పాషండదర్శనంపట్ల ఆసక్తి పెంచుకొని ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడో అటువంటివాడు నరకలోకంలో వైతరణీ నదిలో పొరలుతుంటాడు.

ఆ వైతరణీ నదిలోని మొసళ్ళు పాషండమతంపట్ల మోజు పెంచుకొన్నవాణ్ణి పీక్కుతింటాయి. అటువంటి పాషండులు ప్రాణాలు పోతుంటే తాము చేసిన తప్పుల్ని తలచుకొంటూ మలమూత్రాలు, చీమూ నెత్తురు, వెంట్రుకలూ, గోళ్లు, ఎముకలు, కొవ్వు, మాంసం, మూలుగు కలిసిన ప్రవాహంలో మునిగి తేలుతూ పడికొట్టుకొంటుంటారు. ఎవడయితే బ్రాహ్మణుడయి యుండి కూడా శుచిత్వం. సదాచారం వదలిపెట్టి సిగ్గు బిడియం లేకుండా శూద్రస్త్రీలతో పశువువలె ప్రవర్తిస్తాడో అటువంటివాడు నరకలోకంలో మలమూత్రాలు, లాలాజలం, కఫంతో కూడిన ప్రవాహంలో త్రోయబడి అసహ్యకరమైన ఆ వస్తువులనే భుజిస్తూ కాలం గడుపుతాడు.

ఎవడయితే వేటకుక్కల్ని పెంచి ఎప్పుడు పడితే అపుడు వేటకు పోతూ మాంసంకోసం అడవిలోని మృగాలను వధిస్తాడో, అటువంటి నీచుణ్ణి యమలోకంలో పదునైన ఆయుధాలతో నలిగిపోయేట్లుగా పొడుస్తారు.

ఎవడయితే డాబు దర్పంకోసం పశువుల్ని చంపి ఆడంబరంగా యాగాలు నిర్వహిస్తాడో, అటువంటివాణ్ణి యమకింకరులు పొలికేకలు వేస్తూ ఱంపాలతో పరపర కోస్తుంటారు.

ఎవడయితే కామంతో కళ్ళు మూసుకుపోయి తన భార్యచేత రేతపానం చేయిస్తాడో ఆ పాపాత్ముని రేతస్సుతో నిండిన మడుగులో ద్రోసి ఆ రేతస్సునే వానిచేత త్రాగిస్తారు. రాజభటులయినా, దొంగలయినా గ్రామాలపై పడి ఇళ్ళకు నిప్పు అంటించేవారిని, మందు మాకులు పెట్టి ఇతరుల్ని చంపేవారిని, వజ్రాల కోరలున్న ఏడువందల ఇరవై కుక్కలు ప్రతిదినమూ చుట్టుముట్టి పీక్కుతింటాయి.

లంచం పుచ్చుకొని దొంగ సాక్ష్యం చెప్పి ఎదుటివారిని మోసగించిన పాపాత్ముని అవీచి అనే నరకంలో పడవేస్తారు. అక్కడ వానిని పట్టుకొని బంధించి నూరు యోజనాల ఎత్తయిన కొండ శిఖరంనుండి తలక్రిందుగా క్రిందికి విసరివేస్తారు. అపుడు వాడు పెడబొబ్బలు పెడుతూ అలలు లేని కొలనువలె నున్నగానున్న చట్రాతిమీద పడిపోతాడు. అట్లాపడి శరీరం ముక్కలు ముక్కలై మరల అవి కలుసుకొంటూవుంటే చావురాక బ్రతుక లేక ఆకులపాటుతో అవస్థపడుతుంటాడు.

(అవీచి - తరంగములు లేని జలంలో ముంచెత్తడం - 'అవీచి నామక నరకం'. భృగుపతనం / శైలపతనం మాటిమాటికి పర్వత శిఖరం మీదికి ఎక్కించి మరల పడతోయుట. గాలియాడని, ఊపిరి సలుపడానికి వీలులేని దిగ్భంధనాన్ని కూడ 'అవీచి' అంటారు.

సోమయాజి పెళ్ళాన్ని కామించి అనుభవించినవాణ్ణి, సోమపానమంటూ దొంగచాటుగా మద్యపానం చేసే వైశ్యులను, క్షత్రియులను, బ్రాహ్మణులను వదలిపెట్టరు.

అటువంటి వారిని యమదూతలు బంధించి యాతనలకు లోను చేస్తారు. గుండెలపై కాలుమోపి తొక్కుతారు. దిమ్మ తిరిగే లాగున ముఖంమీద మొత్తుతారు. స్పృహరాగానే ఎర్రగా సలసల కాగే ఉక్కుద్రవాన్ని నోటినిండా పోస్తారు.

తక్కువ కులంవారు ఆడంబరంతో కూడిన నిష్ఠలతో తపస్సు, దానం, విద్య, ఆచార వ్యవహారాలతో అహంకరించి పెద్దలను అవమానించినట్లయితే అటువంటి వారిని క్షారకర్దమం అనే నరకంలో తలకిందుగా వేలాడదీసి బాధలు పెడతారు. ఆడవారుగాని, మగవారుగాని తమ ప్రాణాలు కాపాడుకోవడానికి క్షుద్ర దేవతలకు జంతువులనుగాని, మనుష్యులనుగాని బలి ఇస్తే అటువంటి దుర్మార్గులను యమకింకరులు చురకత్తులతో పొడిచి రక్తం తాగుతారు. ఊళ్ళలోనూ, అడవులలోను ఉండే జంతువుల కడుపులలో శూలాలు గ్రుచ్చి హింసిస్తూ ఆ జంతువులు గిలగిల తన్నుకొని బాధపడుతుంటే గంతులువేస్తూ సంతోషించేవారిని యమకింకరులు శూలప్రోతమనే నరకంలో త్రోసి శూలంతో గ్రుచ్చుతారు. అక్కడివారు ఆకలిదప్పులతో నకనకలాడుతుంటే రాబందులూ, గ్రద్దలూ పదునైన ఉక్కుముక్కులతో వారి దేహాలను పొడుచుకొని తింటాయి. ఇంతేగాక నిర్దాక్షిణ్యంగా నోరులేని జంతువుల్ని పీడించే పాపాత్ములను దందశూకమనే నరకంలో పడవేస్తారు. అక్కడ ఐదు తలలూ, ఏడు తలలూగల సర్పాలు వాళ్ళను కరుస్తుంటాయి.

నరేంద్రా! ఇళ్ళలోగాని, పెరళ్ళల్లోగాని తిరిగే పశువుల్ని, పక్షుల్ని జింకలను పట్టి హింసించే పాపాత్ములను నిప్పులతోనూ, విషంతోనూ, పొగలసెగలతోను నిండిన నరకాలలో విసరివేస్తారు.

తన ఇంటికి అతిధిగా అరుదెంచిన మానవుని ఆదరించకుండా చీదరించుకొని కోపోద్రేకంతో చూచిన దుర్మార్గుల కన్నులను వజ్రాల కోరలుగల రాబందులు గ్రద్దలు పొడుచుకొని తింటాయి.

రాజా! ధనరాసులున్న భాగ్యవంతుడు ధర్మకార్యాలు చేయకుండా ఇతరులకు ఏమాత్రం ఉపకారం చేయకుండా ధనం కూడబెట్టడమే ధ్యేయంగా భావించినవాడు చనిపోతే వాణ్ణి యమభటులు 'సూచీముఖ' మనే నరకంలో పడతోస్తారు. అక్కడ భయంకరులయిన యమకింకరులు 'డబ్బుకు కాపలా ఉన్న దయ్యమా' అంటూ వాణ్ణి పట్టి తాళ్ళతో కట్టీ నానా బాధలు పెడతారు.

నరులలో శ్రేష్ఠడయినవాడా! ఇటువంటి నరకాలు యమలోకంలో వేలసంఖ్యలో ఉన్నాయి. ఆ నరకాలలో యమదూతలు అధర్మపరులను ఎల్లప్పుడూ బాధిస్తుంటారు.

పుణ్యచరితా! ధర్మపరులయిన మానవులందరు స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తారు. వారు వారు చేసుకొన్న పుణ్యపాపాలను బట్టి వాటిని అనుభవించడానికై భూలోకంలో పుడుతూ ఉంటారు.

ఓ రాజా! మోక్షమార్గం నీకు ముందే వినిపించాను. ఈ బ్రహ్మాండంలో పధ్నాలుగు లోకాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి బ్రహ్మాండం శ్రీమన్నారాయణుని స్థూలశరీరం. అందువల్ల బ్రహ్మాండ వర్ణన చేసేవారూ, అది విన్నవారూ అన్నిరకాల శుభాలను అనుభవిస్తారు. ఈశ్వరుని స్థూలశరీరం తెలిసినవారికి శ్రద్ధవల్లనయితేనేం, భక్తివల్ల నయితేనేం భగవానుని సూక్ష్మరూపం తెలుసుకోవడానికి వీలుంది. భూగోళమందలి సప్తద్వీపాలు, తొమ్మది వర్షాలు, వాటిలోని నదులు, పర్వతాలు, ఆకాశం, సముద్రం, పాతాళం, దిక్కులు, నరకం, నక్షత్ర సముదాయం మొదలైన సకల జీవరాసులతోకూడి అద్భుతమైన శ్రీమన్నారాయణుని స్టూలశరీర స్వరూపాన్ని నీకు వినిపించాను.

(మూలంలో చివర 'యతనశీలుడయిన సాధకుడు భగవానుని స్థూల రూపాన్ని గురించి, సూక్ష్మమైన స్వరూపాన్ని గురించి శ్రవణం చేసి, స్థూలరూపంలో మనస్సును ఏకాగ్రంచేసి మెల్లగా బుద్ధితో మనస్సును సూక్ష్మమైన స్వరూపం (ఆత్మ)లో విలీనం చేయాలి అని వివరణ ఇవ్వబడింది.

బ్రహ్మ మొదలయిన దేవతలూ, ఋషులూ స్తుతించేవి పుణ్యతీర్థాలవలె పవిత్రమయినవి అయిన పాదపద్మాలు కలవాడవూ, నవరత్నాలతో ప్రకాశించే కాలిఅందెలు కలవాడవూ, కౌస్తుభమణిని భూషణంగా ధరించినవాడవూ, వెల్లివిరిసే తులసీదళాల పరిమళాలూ, కస్తూరీ సుగంధాలూ గుబాళించే దివ్యదేహం కలవాడవూ, లక్ష్మీదేవికి నివాసమయిన వక్ష స్ధలం కలవాడవూ, భూభారాన్ని వహించేవాడవూ, సూర్యచంద్రులే కన్నులుగా కలవాడవూ అయిన శ్రీకృష్ణా! నీకు నమస్కారం.

లక్ష్మీదేవి హృదయంలో నివసిస్తూ నిత్యం జీవుల పాపాలను హరిస్తూ లోకాలన్నిటిని పవిత్రం చేస్తూ అలౌకిక గుణాలకు ఆశ్రయమయినవాడవై ప్రసిద్ధి గలవాడై, దేవతలచేత అర్చింపబడే పాదపద్మాలు కలవాడవై కంసుని సంహరించిన వాడవయిన శ్రీకృష్ణా! నీకు నమస్కారం.

శత్రు బృందాలను రూపుమాపేవాడవు. భక్తుల పాలిటి పెన్నిధివీ, దానశీలుడవూ, సూర్యమండలం మధ్యలో ప్రకాశించువాడవూ, సత్యస్వరూపుడవూ, గద, ఖడ్గం, ధనుస్సు, శంఖం, చక్రం అనే పంచాయుధాలు ధరించినవాడవూ, భూమండలాన్ని ఉద్ధరించినవాడవూ, ఆర్తులను ఆదుకొనేవాడవూ, మదోన్మత్తులయిన రాక్షసులను అణగదొక్కువాడవూ అయిన శ్రీకృష్ణా! నీకు నమస్కారం.

 శ్రీకృష్ణార్పణమస్తు 

Surya(Ravi and Stars (Nakshatras) in the Kala Chakra details - భగణ విషయము

భగణ విషయము

బ్రహ్మాండం మధ్యలో ప్రకాశించే సూర్యుడు తన వెలుగుతో, వేడిమితో ముల్లోకాలనూ ముంచెత్తుతూ ప్రకాశింపజేస్తాడు.

సూర్యునికి ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువత్తులనే మూడు గమనాలు ఉన్నాయి. ఉత్తరాయణంలో ఆగమనం మందకొడిగా, దక్షిణాయనంలో తీవ్రంగా, విషువత్తులలో సమానంగా ఉంటుంది. సూర్యుని ఈ మూడు గమనాలను అనుసరించి ఆరోహణ, అవరోహణ సమస్థానాలలో రాత్రింబవళ్ళు దీర్ఘాలుగా హ్రస్వాలుగా సమానాలుగా మారుతుంటాయి

(రాత్రి, పగలు సమానంగా ఉన్న దినాలకు విషువు / విషువత్తులు అని పేరు= మేష తుల సంక్రమణములు.

మేషరాశిలోనూ, తులారాశిలోనూ సూర్యుడు సంచరించేవేళ పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య ఈ ఐదు రాసులలో సంచరించే సమయాలలో ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి కాలం తగ్గుతూ వస్తుంది. పగలు పెరుగుతూ ఉంటుంది.

ఆలాగే సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే ఐదు రాసులలో ఉన్నప్పుడు ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి పెరుగుతుంటుంది. పగటికాలం తగ్గిపోతుంది.

ఈ ప్రకారంగా అహోరాత్రాలను ఉత్తరాయణ, దక్షిణాయనాలలో పెంచుతూ తగ్గించుచూ ఒక్కొక్క దినంలో తొమ్మిదికోట్ల యాభై ఒక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం పలువైపులా సూర్యరథం తిరుగుతుంటుంది. ఆ పర్వతం తూర్పున దేవధాని అనే ఇంద్రుని పట్టణం. దక్షిణంలో సంయమని అనే యముని పట్టణం, పశ్చిమంలో నిమ్లోచని అనే వరుణుని పట్టణం, ఉత్తరంలో విభావరి అనే సోముని పట్టణం ఉన్నాయి. ఈ నాలుగు పట్టణాలలోనూ సూర్యుడు క్రమంగా ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం అనే కాలభేదాలను కల్పిస్తుంటాడు. ఈ ఉదయాదులు అచ్చటి జీవుల ప్రవృత్తినివృత్తులకు కారణాలవుతుంటాయి. సూర్యుడు ఇంద్రనగరం నుండి యమనగరానికి పయనించేటప్పుడు పదునైదు గడియలలో రెండుకోట్ల ముప్పది ఏడు లక్షల డెబ్బది ఐదువేల యోజనాలు అతిక్రమించి యమనగరానికీ, ఇదేవిధంగా అక్కడనుంచి వరుణ, సోమ నగరాలకూ, చంద్రాది గ్రహాలతో నక్షత్రాలతో సంచరిస్తాడు. పన్నెండు ఆకులూ, ఆరు కమ్ములూ, మూడుకుండలు(నాభి  ప్రదేశాలు) కలిగి ఏకచక్రంతో కూడి సంవత్సరాత్మకమైన సూర్యునిరథం ఇక ముహూర్తకాలంలో ముప్పది నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు ప్రయాణం చేస్తుంది.

(సూర్యుని రథం వేదాత్మకం. ఇరుసునకు అమర్చబడిన సూర్యుని రథం 'తైలయంత్రచక్రవత్‌' 21-13 తిరుగుతుందని మూలంలో వర్ణన. మూలంలో ఇంద్రనగరం పేరు దేవధాని. సూర్యుడు నెలకు ఒక్కొక్క గడియ= 24 నిమిషాల చొప్పున సమయం పెరగగా రాసులలో సంచరిస్తాడు. 'దేవధాని' నే 'అమరావతి' అనికూడ అంటారు.

సూర్యరథ చక్రానికి ఒక ఇరుసు అమర్చబడి ఉన్నది. ఆ ఇరుసుకు ఒకవైపు మేరుపర్వతమూ, రెండవవైపు మానసోత్తర పర్వతమూ ఉన్నాయి. రెండువైపులా వాయుపాశాలతో గట్టిగా బిగింపబడి ఉన్నాయి. ఇవి భూమి రెండు ధ్రువాలకూ అంటి ఉన్నాయి. అటువంటి సూర్యరథానికి అమర్చబడిన కాడి ముప్పయి ఆరు లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ కాడి సూర్యరథానికి కట్టిన గుర్రాల మెడలపై మోపబడి ఉంటుంది.

ఆ సూర్య రథానికి గాయత్రి, బృహతి, ఉష్ణిక్‌, జగతి, త్రిష్టుప్‌, అనుష్టుప్‌, పంక్తి అనబడే ఏడు ఛందస్సులు గుర్రాలుగా ఉన్నాయి. సూర్యునికి అరుణుడు సారథి. అతడు సూర్యుని ముందుభాగంలో కూర్చుండి రథాన్ని నడుపుతుంటాడు. బొటనవేలి కణుపు పరిమాణ దేహం కలిగిన వాలఖిల్యులనే ఋషిపుంగవులు అరవై వేలమంది జ్యోతిర్మయ స్వరూపాలు ధరించినవారు సూర్యునికి ముందుండి వేదసూక్తాలతో స్థోత్రం చేస్తుంటారు. ఎందరో మునులు, గంధర్వులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, గరుడులు మొదలయిన వారు క్రమం తప్పకుండా సూర్యుణ్ణి సేవిస్తుంటారు. తొమ్మది కోట్ల ఏబది యొక్క లక్షల యోజనాల పరిమాణం కలిగిన భూమండలం చుట్టూ సూర్యుడు క్షణానికి రెండువేల యాభై యోజనాల చొప్పున అహోరాత్రంలో సంచరిస్తుంటాడు అని చెప్పిన శుకయోగీంద్రుని చూచి పరీక్షిత్తు కుతూహలంతో ఈ విధంగా ప్రశ్నించాడు.

మునీంద్రా! సూర్యుడు మేరువుకూ, ధ్రువనికీ ప్రదక్షిణంగా తిరుగుతుంటాడని చెప్పావు గదా! బ్రహ్మ స్వరూపుడయిన సూర్యుడు పన్నెండు రాసులలోనూ అభిముఖుడై తిరుగుతాడని కూడా అన్నావు. ఇది ఎలా పొసగుతుంది? నా సందేహాన్ని తీర్చు.

పరీక్షిత్తు కుతూహలంతో కూడిన సందేహాన్ని విన్న శుకయోగి ఒకమారు కళ్ళు మూసుకొని శ్రీహరిని తలచుకొని ఈ విధంగా సమాధానం చెప్పాడు.

ఓ రాజా! కుమ్మరిసారె వేగంగా తిరుగుతుంటుంది. ఆ సారెమీద చీమల బారులు తిరుగుతుంటాయి. అయితే వాటి గమనం ఆ చక్రభమణానికి భీన్నంగా ఉంటుంది. అదేవిధంగా నక్షత్రాలతో రాసులతో నిండిన కూడిన కాలచక్రం తిరుగుతున్నది. ఆ కాలచక్రం ధ్రువమేరువుల్ని ప్రదక్షిణం చేస్తూ తిరిగేటప్పుడు ఆ కాలచక్రం వెంట తిరిగే సూర్యాదిగ్రహాలు నక్షత్రాలతోను, రాసులలోనూ సంచరిస్తుంటాయి. అందువల్ల సూర్యాది గ్రహాలకు కాలచక్రగమనమూ, స్వగమనమూ అనే రెండు రకాల గమనాలు కలుగుతున్నాయి. అంటే తమంత తాము తిరగడమున్నూ, కాలచక్రగమనంతోపాటు తిరగడమున్నూ. ఆదినారాయణుడే సూర్యుడుగా ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యభగవానుడు సమస్త లోకవాసుల యోగక్షేమాలు కోరేవాడు. అతడు ఋగ్యజుస్సామ వేదస్వరూపుడు. మానవులు నిర్వహించే కర్మలకు సిద్ధిప్రదాత. ఆ దేవుని స్వరూపాన్ని దేవర్షిగణాలు వేదాంత పరంగా భావించి సంభావిస్తుంటారు. అటువంటి సూర్యుడు తన స్వరూపాన్ని పన్నెండు విధాలుగా విభజించి వసంతం, గ్రీష్మం మొదలయిన ఋతువులను ఆయా కాలాలలో కలుగజేస్తుంటాడు. అటువంటి పరమపురుషుని మహిమను అర్ధం చేసుకొన్న మహాత్ములు వర్ణాశ్రమాచారాలు పాటిస్తూ వేదాలలో చెప్పబడ్డట్టు. అతిశయమయిన భక్తితో ఆయనను ఆరాధిస్తూ క్షేమంగా ఉంటారు.

సూర్యరూపుడయిన ఆదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రంలో తిరుగుతూ తన తేజస్సుతో గ్రహగోళాదులను వెలిగిస్తూ ద్వాదశరాసులలో ఒక సంవత్సరకాలం సంచరిస్తుంటాడు. ఆ ఆదిపురుషుని గమన విశేషాన్ని లోకులు అయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు అనే పేర్లతో వ్యవహరిస్తుంటారు. రాసులలో ఆరవభాగం సంచారం చేసే కాలాన్ని ఋతువని వ్యవహరిస్తారు. ఆ రాసులలో సగభాగం సంచరిస్తూ ఆరు రాసులలో తిరిగే కాలాన్ని అయనమంటారు. రాసులన్నిటిలోనూ పూర్తిగా తిరిగే కాలాన్ని సంవత్సరమని నిర్ణయిన్తారు. ఆ సమగ్రరాశి సంచారంలో మూడురకాలయిన గమనాలు ఉంటాయి. మొదటిది శీఘ్రగతి. రెండవది మందగతి. మూడవది సమగతి. ఈ గతులు కారణంగా సంవత్సరంలో కలిగిన మార్పులను వరుసగా వత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని ఐదువిధాలుగా చెబుతారు. ఇదే పద్ధతిలో చంద్రుడు సూర్యమండలం మీద లక్ష యోజనాల దూరంనుండి సంవత్సరం, పక్షాలు, రాసులు, నక్షత్రాలు భుక్తులను గ్రహిస్తూ ముందుండి వేగంగా సంచరిస్తుంటాడు. చంద్రుని వృద్ధి క్షయాలవల్ల పితృగణాలకు పూర్వపక్షం, అపరపక్షం అనేవి ఏర్పడతాయి. వీటివల్లనే పగలు, రాత్రి ఏర్పడతాయి. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో ముప్పది సుముహూర్తాల కాలం సంచరిస్తాడు. పదునారు కళలతో మనోమయ, అన్నమయ, అమృతమయ దేహంతో ఒప్పుతుంటాడు. దేవతలకూ, పితృగణానికీ, మానవులకూ, భూతాలకూ, జంతువులకూ, పక్షులకూ పాములు మొదలయిన వాటికీ, తీగలకు, పొదలకూ, ప్రాణప్రదమయిన తాపస్పర్శవల్ల సంతృప్తి కలిగిస్తూ చంద్రుడు సర్వసముడుగా ప్రకాశిస్తాడు.

చంద్రునికి పైన లక్ష యోజనాల ఎత్తు ప్రదేశంలో నక్షత్రమండలం ఉంది. అందలి నక్షత్రాలన్నీ అభిజిత్తుతో కూడా కలిసి మేరుశైలానికి ప్రదక్షిణం చేస్తుంటాయి.

నక్షత్ర మండలానికి రెండు లక్షల యోజనాల ఎత్తున శుక్రుడు సంచరిస్తుంటాడు. ఈతడు సూర్యునికి ముందూ, వెనకా ఉదయిస్తూ సూర్యునివలె సంచారం చేస్తాడు. ఈతని గమనం కొన్నిసార్లు మెల్లగా, కొన్నిసార్లు మృదువుగా మరికొన్నిసార్లు తొందరగా సాగుతుంటుంది. ఈ శుక్రుడు ప్రజలకందరికి అనుకూలుడై వర్షం కురిపిస్తాడు. వర్షాలకు ఆటంకం కలిగించే గ్రహాలకు శాంతి చేసినట్లయితే శుక్రుడు సంతుష్టి పొంది శుభం కలుగజేస్తాడు. శుక్రునికంటె పైన రెండు లక్షల యోజనాల దూరంలో బుధుడు తిరుగుతుంటాడు. అతడు సూర్యమండలాన్ని వదలి దూరంగా కనిపించినా ప్రజలకందరికి కరువు కాటకాలు, దోపిడీల భయం కలిగిస్తాడు.

(మూలంలో అతివాత, అభ్రప్రాయ, అనావృష్టి, ఆదిభయమ్‌ - పెనుగాలి, మేఘములతోనిండిన ఆకాశం మరియు అనావృష్టి మొదలగువాని వలన భయములు చెప్పబడ్డాయి. ఏ కాలమందయితే సూర్యునికంటె బుధుడు దాటి ముందుకు పోవునో అపుడు ఈ అశుభాలని వర్ణితం (22-18). డామరమునకు రూపాంతరం డాంబరం.)

బుధునికన్న పైన రెండు లక్షల యోజనాల దూరంలో అంగారకుడు ఉన్నాడు. అతడు మూడుపక్షాలకాలంలో ఒక్కొక్క రాశి దాటుతూ సంచారం చేస్తాడు. ఆ విధంగా అంగారకుడు పండ్రెండు రాసులలోను రాజసంతో సంచరిస్తాడు. వక్రగతిలోగాని, వక్రగతిలో లేనప్పుడుగాని అంగారకుడు ప్రజలకు పీడలే కలిగిస్తాడు. అతనికి రెండులక్షల యోజనాల దూరంలో బృహస్పతి సంచరిస్తుంటాడు. ఆ అమరగురువు ప్రతి ఒక్కరాశిలో ఒక్కొక్క సంవత్సరం చరిస్తుంటాడు. ఈ గురువు వక్రగతిలో ఉన్నా బ్రాహ్మణులకు ఎప్పటికప్పుడు శుభపరంపరలను ప్రసాదిస్తుంటాడు.

బృహస్పతికన్న రెండు లక్షల యోజనాలకుపైన శని తిరుగుతుంటాడు. అతడు ప్రతి రాశిలోనూ ముప్పయి మాసాలు చరిస్తాడు. ఈ ముప్పయి మాసాలలోను శని ప్రజలకు కష్టాలే కలిగిస్తాడు.

శనికి పదునొకండు లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది. ఆ మండలంలోని ఋషులు బ్రాహ్మణులకూ, ప్రజలకూ తత్తరపాటునొంది మేలు కోరుతుంటారు.

రాజా! సప్తఋషి మండలానికి పదమూడు లక్షల యోజనాల ఎత్తులో శింశుమార చక్రం ఉంది. ఇదే ఆకాశంలో అన్నిటికన్నా పైన ఉన్న చక్రం.

ఆ శింశుమార చక్రంలో పరమభక్తాగ్రేసరుడయిన ధ్రువుడు ఉన్నాడు. అతడు ఇంద్రుడు, వరుణుడు, కశ్యపుడు, యముడు మొదలయిన దేవతలతో, ప్రజాపతులతో విష్ణుపదానికి ప్రతినిత్యం ప్రదక్షిణం చేస్తుంటాడు. అతడు కల్పం చివరిదాకా జీవిస్తాడు. ఉత్తానపాదుని కుమారుడయిన ఆ ధ్రువుడు పూజ్యుడు, మహాత్ముడు. ఆయన మహిమలను బ్రహ్మకూడా వర్ణించలేడు. నాకు తెలిసిన విశేషాలన్నీ ముందే నీకు తెలియజేశాను. ఒకసారి ఆ కథలన్నీ గుర్తుకు తెచ్చుకో.

ధాన్యం నూర్చే కళ్లంలో పశువులను కట్టడంకోసం మధ్య పాతిన గుంజ లాగున ధ్రువుడు ఆ శింశుమార చక్రం నడుమ ప్రకాశిస్తూ ఉన్నాడు. అతనిచుట్టూ గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ కాలవిభాగాలలో నిమేషమాత్రం కూడా ఏమరుపాటులేక ధ్రువుని చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి. ఆకాశంలో మేఘాలు, డేగలు మొదలయిన పక్షులు కర్మానుసారంగా గాలికి లోబడి ఆకాశంలో ఎలా పరిభ్రమిస్తున్నాయో అలాగే జ్యోతిర్గణాలు కర్మను అవలంబించి ప్రకృతి పురుషులకు లోబడి గగనాన తిరుగుతూ ఉంటాయి. ఈ కారణంవల్లనే గ్రహాలు నేలమీద పడడం లేదు.

ఏలాంటి తక్కువలేని గొప్పతనం కల సచ్చరిత్రుడవయిన రాజా! జ్యోతిర్గణాలన్నీ శింశుమార చక్రంలో ఉన్నాయని కొందరు చెబుతుంటారు; ఆ శింశుమారచక్రస్వరూపం నీకు వివరిస్తాను విను.

నిర్మల చరిత్రా! శింశుమార చక్రం తలక్రిందుగా గుండ్రంగా అందంగా ఉంటుంది. ఆ చక్రం తోకచివర ధ్రువుడు సర్వదా ప్రకాశిస్తూ ఉంటాడు.

(మూలంలో నక్షత్ర మండలం నీటికోతి రూపంలో నిలబెట్టబడియున్నదని వర్ణితం. ఇది కూడా వాసుదేవభగవానుని యోగధారణచే అని ఉల్లేఖితం.)

ఆ శింశుమార చక్రం తోకభాగంలో ప్రజాపతి అగ్ని ఇంద్రుడు, ధర్ముడు అను వారుంటారు. తోకముందు భాగంలో ధాత, విధాత ఉన్నారు. నడుముభాగంలో సప్తర్షులున్నారు. దక్షిణావర్తమై కుడివైపుకు చుట్టుకొని, కుండలీభూతంగా ఉన్నదానికి ఉత్తరభాగంలో ఉత్తరాయణ నక్షత్రాలు, దక్షిణభాగంలో దక్షిణాయన నక్షత్రాలు, వీపుమీద దేవమార్గం అనబడే తారకాసముదాయమూ, అక్కడే ఆకాశగంగ కూడా ఉన్నాయి. ఉత్తరభాగంలో పునర్వసు, పుష్యమి నక్షత్రాలు, దక్షిణభాగంలో ఆర్ద్ర ఆశ్లేషలు, కుడిపాదంలో అభిజిత్తు, ఎడమపాదంలో ఉత్తరాషాఢ, కుడివైపు ముకుపుటంలో శ్రవణం, ఎడమవైపున పూర్వాషాఢ ఉన్నాయి. కుడి ఎడమ నేత్రాలలో ధనిష్ఠ మూల నక్షత్రాలున్నాయి. కుడి ఎడమ చెవులలో మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు ఉన్నాయి. ఎడమప్రక్క దక్షిణాయన నక్షత్రాలు, కుడిప్రక్క కృత్తిక, రోహిణీ, మృగశిర అనే మూడు నక్షత్రాలు ఉన్నాయి. ఇవి గాక ఉత్తరాయణ నక్షత్రాలు కూడా అక్కడే ఉన్నాయి. ఎడమ కుడివైపు మూపులయందు శతభిషం, జ్యేష్ట నక్షత్రాలున్నాయి. పై దవడ ప్రదేశంలో అగస్త్యుడు, క్రింది దవడ స్థానంలో యముడు, ముఖమందు అంగారకుడు, మర్మావయవ స్థానంలో శని, పురుషాంగంగా బృహస్పతి ఉన్నారు. వక్షోభాగంలో సూర్యుడు, నాభిలో శుక్రుడు, మనసులో చంద్రుడు, స్తనాలయందు అశ్వినులు, ప్రాణాపానములందు బుధుడు, కంఠభాగంలో రాహువు ఉన్నారు. అయితే కేతువు మాత్రం అన్ని అవయవములను ఆవరించి ఉంటాడు. ఈ శింశుమార చక్రానికి రోమాలుగా ఇంకా ఎన్నో నక్షత్రాలున్నాయి. ఇది సర్వదేవతామయమయిన నారాయణుని దివ్యస్వరూపం. ఇది స్థిరమైనది. ఇది ధ్రువమైనది.

రాజేంద్రా! ఈ దివ్యశరీర సందర్శనంవల్ల కలిగే ఫలితాలను చెబుతాను విను. ఈ శింశుమార చక్రం శ్రీమన్నారాయణుని దివ్యశరీరం. ఎవరు ప్రతిదినమూ సంధ్యాకాలంలో ఈ దివ్యశరీరాన్ని మనసులో నింపుకొని దీక్షతో, నియమంతో భక్తితో స్మరిస్తారో, తత్వాన్ని గ్రహించి మౌనవ్రతం చేబట్టి ఈ చక్రదర్శనం చేస్తూ ఎవరు ఈ స్తోత్రాన్ని ప్రీతితో జపియించి నమస్కరిస్తారో, ఎవరు ప్రశస్తమూ, మునీంద్రసేవ్యము, జ్యోతిస్పరూపము అయిన శింశుమార చక్రానికి వందనం వందనం అంటూ మ్రోక్కులు చెల్లిస్తారో అటువంటి వారికి ఇహలోకంలో సకల సిద్ధులూ లభిస్తాయి. పరలోకంలో ముక్తి ప్రాప్తిస్తుంది.

ఓ రాజా! సూర్యమండలానికి దిగువ పదివేల యోజనాల దూరంలో రాహుమండలం ఉన్నది. ఈ రాహువు అపసవ్యంగా నడుస్తుంటాడు.

రాహువు రాక్షసులలో అధముడు. అయితే అతనికి బ్రహ్మదేవుని వరం ఉంది. ఆ వరం కారణంగా అతడు అమరత్వం పొంది గ్రహాలతోపాటు తానొక గ్రహమై విహరిస్తుంటాడు.

రాహువు యొక్క జన్మ కర్మలను గూర్చి సవిస్తరంగా చెబుతాను. ఆ రాహువు సామాన్యుడు కాదుసుమా. పదివేల యోజనాల విస్తృతి కలిగిన సూర్యమండలాన్ని, పండ్రెండువేల యోజనాల విస్తృతి కలిగిన చంద్రమండలాన్ని రాహువు కప్పేస్తాడు. రాహుమండలం పదమూడు వేల యోజనాల వైశాల్యం కలిగి ఉంది. పూర్ణిమ పర్వదినంలో చంద్రుని, అమావాస్య పర్వదినంలో సూర్యుని రాహువు మాటు పరుస్తాడు. దీనినే గ్రహణం అంటారు. ఆ గ్రహణకాలంలో జనులందరు తమ తమ జపతపోరూపాలయిన ధర్మాలను చక్కగా ఆచరించుకొంటారు. అయితే దయామయుడైన శ్రీహరి సుదర్శన చక్రం సూర్యచంద్ర మండలాలను రక్షించడానికి వస్తుందేమో అనే భయంతో ఐదారు గడియలలోనే రాహువు వారిని వదలిపెట్టి తొాలగిపోతాడు.

పరీక్షిన్మహారాజా! ఆ రాహుగ్రహానికి కిందివైపున సిద్దులు, చారణులు, విద్యాధరులు అను దేవయోనులవారు పదివేల ఆమడల దూరంలో స్థిరంగా నివసిస్తూ సవిలాసంగా అక్కడ సంచరిస్తుంటారు.

సిద్ద విద్యాధరుల నివాసస్థానానికి కింద పదివేల యోజనాల దూరంలో రాక్షసులు. పిశాచులు సేవిస్తుంటే యక్షులూ, భూతప్రేతాలూ తిరుగుతుంటారు.

వారి కింద మేఘమండలం ఉంది. ఆ మబ్బులన్నీ గాలికి చలిస్తూ ఉంటాయి. మేఘమండలం పై భాగంలో ఉంటే దానికి కింది భాగంలో భూమండలం ఉన్నది. వారికింద అంటే భూతప్రేతయక్షనివాసాల కిందట అని అభిప్రాయం.

ఈ భూమండలం కింద ఒకదానికొకటి కిందుగా అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం అనే లోకాలున్నాయి. ఆ లోకాలలో ఒక్కొక్కదానికి మధ్య పదివేల యోజనాల దూరం ఉంటుంది. ఇవి కింద ఉన్నా స్వర్గం వంటివే. నిజం చెప్పాలంటే ఈ కింది స్వర్గాలు పైనున్న స్వర్గాలకంటే ఎంతో గొప్పవి. ఇక్కడ దైత్యులూ, దానవులూ, నాగులూ మొదలయినవారు దేవజాతికి చెందినవారు ఉంటారు. వారందరూ ఐశ్వర్యంవల్ల సంక్రమించిన ఆనందానుభవంతో సుఖభోగాదులతో తులతూగుతూ జీవిస్తారు. సర్వాంగసుందరాలయిన ఉద్యానవనాలలో, క్రీడాప్రదేశాలలో విహరిస్తుంటారు. దైత్యులు, దానవులూ, నాగులూ మొదలైన దేవజాతి విశేషాలు భార్యలతో, బిడ్డలతో, చెలికాండ్రతో, చుట్టాలతో, దాసదాసీజనంతో మణులు చెక్కిన రమణీయమయిన గృహాలలో సర్వదా సంతోషం అనుభవిస్తుంటారు. ఈశ్వరుని కరుణవల్ల వారికి దైహికమయిన ఎటువంటి వ్యాధులు లేవు. మాయతో నిర్మింపబడిన కొంగొత్త కేళీగృహాలలో, విహార మండపాలలో చిత్రవిచిత్రమయిన ఉద్యానవనాలలో క్రీడావినోదాలతో విహరిస్తుంటారు.

అటువంటి పాతాళలోకంలో మయుడు సృష్టించిన మాయాపట్టణాలు ఎన్నో ఉన్నాయి. ఆ పట్టణాలలో నానావిధ రత్నాలతో నిర్మించిన ప్రాకారాలూ, గోపురాలూ, సౌధాలూ, విశాలమయిన సభాసమావేశ స్థలాలు, చైత్యాలూ ఉన్నాయి. వాటియందూ నాలుగుబాటలు కలిసే చత్వర ప్రదేశాలయందూ, దైత్యదానవ నాగదంపతులు విహరిస్తుంటారు. మాయతో వారు నిర్మించుకొన్న విహారప్రదేశాలలో చిలుకలూ, కోకిలలూ, గోరువంకలూ కిలకిలారావాలు చేస్తుంటాయి. పూలవాసనలు, చిగురుటాకుల గుత్తుల బొత్తులు, రకరకాల ఫలసమృద్ధిగల ఆ ఉద్యానవనాలలో లతాసుందరులు పెనవేసుకొన్న తరుశాఖలు కన్నుల పండువు చేస్తుంటాయి.

మనసుకూ, ఇంద్రియాలకూ ఆహ్లాదం కలిగించే సరస్సులు కూడా అక్కడే ఉన్నాయి. ఆ సరోవరాలలో రకరకాలయిన నీటిపక్షుల జంటలు విహరిస్తుంటాయి. అక్కడ నీరు నిర్మలంగా ఉంటుంది. చేపలు ఈదుతూ కోనేటిలో కదలికలు కలిగిస్తాయి. ఆ సరోవరాలలో తెల్లకలువలూ, నల్లకలువలూ, ఎర్రకలువలూ, ఎర్ర తామరపూవులూ ఉన్నాయి. అటువంటి సరస్సులు కలిగిన ఉద్యానవనాలలో వారు ఇళ్ళు ఏర్పరచుకొంటారు. స్వర్గ భూములను మించిన తావులలో వారు విహరిస్తుంటారు. వారికి పగలూ, రాత్రి అనే కాలభేదాలు ఉండవు. శేషుడు మొదలయిన సర్పరాజుల పడగల మీద ఉన్న మణుల కాంతులవల్ల వారికి చీకట్లు ఉండవు. అక్కడ ఎప్పుడూ పట్టపగలులాగే ఉంటుంది. అక్కడివారు దివ్యమయిన మూలికల రసాలను, రసాయనాలను ఆహారంగా స్వీకరించడం వల్ల దేహవ్యాధులుగానీ, మనోవ్యాధులు గానీ వారికి ఉండవు. దేహం పాలిపోదు. ముడుతలు పడదు. జుట్టు నెరిసిపోదు. ముసలితనం రాదు. రోగాలు లేవు. చెమట దుర్వాసనలు ఉండవు. ఆకర్షణీయమయిన ఆకారాలు కలిగి ఉంటారు. వారికి సుదర్శనచక్ర భయం తప్ప మరే మృత్యుభయమూ ఉండదు.

అటువంటి పాతాళలోకంలో విష్ణుభగవానుని సుదర్శనచక్రం ఎపుడు ప్రవేశిస్తుందో అపుడే రాక్షస స్త్రీలకు గర్భస్రావం కలుగుతుంటుంది.

అతలమనే లోకంలో మయుని కుమారుడయిన బలాసురుడు స్వేచ్చగా విహరిస్తుంటాడు. అతడు తొంబైఆరు విధాలయిన మాయలతో వినోదిస్తుంటాడు. ఆ మాయలకు భూలోకంలోని వారు కొందరు లొంగిపోయి సమ్మోహితాత్ములై చరిస్తుంటారు.

బలాసురుని ఆవులింతలనుండి స్వైరిణులు, కామినులు, కులటలు అనే స్త్రీసమూహాలు పుట్టారు. ఆ స్త్రీలు పాతాళంలో ప్రవేశించిన పురుషునికి హాటకరసమనే సిద్ధ ఘుటికను ఇచ్చి అతనిని శృంగారరససిద్దుని చేస్తారు. తమ తళుకుబెళుకు చూపులతో, హావభావ ప్రదర్శనలతో, చిరునవ్వులతో, సరససల్లాపాలతో, కౌగిలింతలతో అతనిని లోబరచుకొంటారు. తమకు నచ్చిన రీతిలో ఆ పురుషునితో విహారం సాగిస్తారు. పాతాళం ప్రవేశించిన ఆ పురుషుడు తానే సిద్ధపురుషుడనని భావిస్తాడు. దర్పంతో అతని కళ్ళు నెత్తికెక్కుతాయి. తాను పదివేల ఏనుగుల బలం కలవాడనని భావించుకొని రకరకాల రతిక్రీడలతో పరమానందం అనుభవిస్తుంటాడు.

వితలమనే లోకానికి హాటకేశ్వరుడనే పేరు గలవాడూ, పార్వతీపతియైన శివుడు అధిపతి. అధిదేవత. భూతగణ సమేతుడయిన శివుడు బ్రహ్మసృష్టిని వృద్ధి పొందించటంకోసం పార్వతీ సంభోగపరుడు కాగా వారి వీర్యంనుండి హాటకి అనే నది పుట్టింది. ఆ నదిలోని జలరూపమయిన వీర్యాన్ని వాయువుతోకూడా అగ్ని ఆహారంగా తీసుకొని ఉమియగా హాటకం అనే పరిశుద్ధమయిన బంగారం పుట్టింది. ఆ వితలంలోని వారికందరికిని ఆభరణరూపంలో ఆ కనకం ఉపయోగపడుతున్నది.

వితలం కింద సుతలం ఉంది. సుతలంలో బలిచక్రవర్తి ఉన్నాడు. అతడు పుణ్యవంతుడయిన విరోచనుని కుమారుడు. శ్రీమన్నారాయణుడు ఇంద్రుని సంతోషపెట్టాలనుకొని అదితిగర్భంలో వామనుడై పుట్టాడు. త్రివిక్రమ రూపం ధరించి ముల్లోకాలను ఆక్రమించాడు. చివరకు విష్ణువు బలిచక్రవర్తికి సుతలంలో ఇంద్రత్వం అనుగ్రహించాడు. ఆ బలిచక్రవర్తి ఎన్నో పుణ్యకర్మలు చేశాడు. శ్రీహరి పాదపద్మాలను సేవించవలెననే అభిలాష కలవాడు. అతడు ఎంతో ఉత్సాహంతో లక్ష్మీశుడయిన శ్రీమన్నారాయణుని ఆరాధిస్తుంటాడు.

ఓ రాజా! వాసుదేవుడు అన్ని ప్రాణులలోనూ అంతర్యామిగా ఉండేవాడు. పైగా పుణ్యతీర్ధంలాగున పవిత్రుడు. అటువంటి వాసుదేవుని మనసులో నిలుపుకొని బలిచక్రవర్తి భూదానం చేశాడు. అటువంటి భూదానానికి శ్రీమన్నారాయణుడు మెచ్చుకొని సాక్షాత్కరించాడు. ఆ సాక్షాత్కారానికి మోక్షమే ఫలం. అంతేగాని, స్వర్గ రాజ్యంగాని పాతాళ రాజ్యంగాని ఫలాలు కావు. అయితే ముక్తి అన్నది ఎవరికీ కనిపించేది కాదు. అందువల్ల, శ్రీహరి బలిచక్రవర్తికి లోకప్రదర్శనార్థం పాతాళస్వర్గ రాజ్యాలు ఇచ్చాడు.

తుమ్మినపుడూ, పడినప్పుడూ, కాలు జారినపుడూ, తెలివి తప్పినపుడూ శ్రీమన్నారాయణుని నామస్మరణంచేసే పురుషునికి కర్మబంధాలు ఉండవు. ఆ బంధాలనుండి విముక్తి పొంది సుజ్ఞానవంతుడవుతాడు. ఆత్మజ్ఞానం అనుగ్రహించే వాసుదేవుడు మాయామయమయిన ఇహలోక సుఖభోగాలనూ, అనశ్వరమయిన ఐశ్వర్యాలను ఏ విధంగా ప్రసాదిస్తాడనే సందేహం వద్దు. శ్రీహరి యాచన నెపంతో బలిచక్రవర్తి సర్వసంపదలను హరించాడు. బలిని కేవలం శరీరమాత్రావశిష్టుని చేశాడు. వారుణ పాశాలతో బంధించి చివరకు వదలిపెట్టినపుడు బలిచక్రవర్తి ఈ విధంగా అన్నాడు.

భగవంతునికి ఎటువంటి పదార్థాలపైన కూడా కాంక్షలేదని తెలుసు. ఇంద్రుడు మొదలయిన దేవతలు ఉపేంద్రుని ప్రార్ధించడంవల్ల ఆ స్వామివచ్చి నిన్ను యాచించాడు. అంతేకాని అసలు శ్రీహరికి కోరికలనేవి లేవు. అదే గంభీరమయిన ఆయన స్వభావం. ఈ దృష్టి ఉన్నవారికి మన్వంతరాధిపత్యమెంత? త్రిలోకాధిపత్యమెంత? మా పితామహుడు ప్రహ్లాదుడు అభిమానవంతుడు. నరసింహావతారంలో ఆ స్వామి ఎంతో సంతోషంతో మా తాతనుచూచి ఏది అడిగితే అది ఇస్తానని అన్నాడు. అప్పుడు మహానుభావుడైన ప్రహ్లాదుడు ఈశ్వరాజ్ఞలోని అంతరార్థం తెలుసుకొన్నాడు.

అందువల్ల ఆయన ఎవరివల్లా భయంలేని తన తండ్రి రాజ్యం కావాలని కోరలేదు. పరమేశ్వరుని దాస్యాన్ని కోరాడు. అప్పుడు 'నీ తండ్రికంటె నీకంటె విశేషంగా ఏ పురుషుడు భగవదనుగ్రహం పొందగలుగుతాడు అంటూ ఆ పుండరీకాక్షుడు పలికిన పలుకుల సారాన్ని తరువాతిభాగంలో (సప్తమ స్కంధంలో) విస్తరించి చెబుతాను. సకల సద్గురుడైన శ్రీమన్నారాయణుడు తనవారిపట్ల దయ కలిగినవాడై శంఖం చక్రం మొదలయిన ఆయుధాలతో గదను ధరించి ఆ బలిచక్రవర్తి గృహద్వారంలో ఇప్పటికి కూడా కాపలా కాస్తున్నాడు. అటువంటి బలిచక్రవర్తి ఉండే సుతల లోకాన్ని జయించాలనే వాంఛగొన్న రావణుడు అనుజ్ఞలేకుండా సుతలంలోనికి ప్రవేశించినపుడు ఆ శ్రీమన్నారాయణుండు తన కాలి బొటనవ్రేలితో లంకేశ్వరుణ్లి పదికోట్ల యోజనాలదూరంలో పడేటట్లు చిమ్మివేశాడు.

ఆ సుతలానికి కిందిభాగంలో తలాతలం ఉంది. ఆ తలాతలానికి మయుడు ప్రభువు. రాక్షసుల పట్టణాలు నిర్మించిన మహాశిల్పిగా ప్రసిద్ధుడయిన మయుడు తలాతలాన్ని పాలిస్తుంటాడు.

శ్రీ మహావిష్ణువు ముల్లోకాలకు హితం కలిగించడంకోసం శివునిచేత త్రిపురాలను బూడిద చేయించాడు. అప్పుడు మయుడు విష్ణువును శరణు పొందాడు. శ్రీహరి మయుని కరుణించి తలాతలానికి రాజుగా చేశాడు. అతనికి విష్ణుదేవుని సుదర్శనచక్రంవల్ల తప్ప మరి దేనివల్లనూ మరణభయం లేదు.

తలాతలానికి కింద మహాతలం ఉంది. ఆ మహాతలంలో కద్రువ కొడుకులయిన సర్పరాజులు ఉన్నారు. వారికి ఒక్కొక్కరికి పెక్కు పడగలున్నాయి. ఆ సర్పగణం క్రోధంతో ఉద్రేకంతో ప్రవర్తిస్తూ ఉంటుంది.

ఆ మహాతలంలో కుహకుడు - తక్షకుడు, కాళియుడు, సుషేణుడు మొదలయిన సర్పముఖ్యులున్నారు. వారు సాటిలేని మేటిరూపం కలవారు. ఆదిపురుషుడయిన నారాయణుని వాహనమయిన గరుత్మంతుని భయంవల్ల కలవరపడుతూ ఎల్లప్పుడూ భార్యలతో, బిడ్డలతో, మిత్రులతో, బాంధవులతో కలిసి ఉంటారు. మహాతలం కింద రసాతలం ఉన్నది. ఆ రసాతలంలో దైత్యులు, దానవులూ అయిన హిరణ్యపురవాసులు, నివాతకవచులు, కాలకేయులు అనువారు నివాసం చేస్తుంటారు. వారు దేవతలపట్ల శత్రుత్వం వహించి ఉంటారు. మహాసాహసవంతులు, తేజస్సు కలవారు అయినా అన్ని లోకాలకూ ప్రభువయిన శ్రీహరి తేజస్సుకు లొంగిపోయినవారై పుట్టలలో దాగిన సర్పాల మాదిరిగా భయంతో బతుకుతుంటారు. ఇంద్రుని దూతి అయిన సరమ ఉచ్చరించే మంత్రాలకు బద్దులై దిగులుదిగులుగా జీవిస్తారు.

చంద్రవంశంలో పుట్టిన మహారాజా! విను. అన్నిటికన్నా దిగువ పాతాళలోకముంది. ఆ పాతాళలోకంలోని నాగజాతివారు ఎంతో తెలివిగలవారయి ఎంతో ఉత్సాహంగా తిరుగుతుంటారు.

వాసుకి, శంఖుడు, కులికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలైనవారు పాతాళలోక వాసులయిన మహానాగులు. వారిలో కొందరు ఐదుతలలవారు. కొందరు ఆరు తలలవారు. మఱికొందరు పది తలలవారు. ఇంకా కొందరు నూరు తలలవారు, వేయితలలవారు కూడా ఉన్నారు. వారి పడగలమీద మణులు మెరుస్తుంటాయి. ఆ మణుల కాంతులు పాతాళంలోని చీకట్లను బారదోలుతుంటాయి.

పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ఉన్నాడు. అతడు ముప్పదివేల యోజనాల వెడల్పున తన శరీరాన్ని చుట్ట చుట్టుకొని ఉంటాడు. విష్ణు మహాదేవుని మహత్తర శరీరమయిన ఆదిశేషునికే అనంతుడు, సంకర్షణుడు అని పేర్లు. అనంతుడని పేరు గల ఆదిశేషుని తలమీద ఆవగింజలాగున ఈ భూమండలం ఉన్నది. ప్రళయకాలంలో లోకాలను సంహరించే నిమిత్తం ఈ ఆదిశేషుడు ప్రచండమయిన కోపంతో పదునొకండు మంది రుద్రులను సృష్టిస్తాడు.

ఆ రుద్రమూర్తులందరూ మూడుకన్నులు కలవారు. త్రిశూలధరులు. ఆ లోకంలోని సర్పరాజగణం శేషుని పాదపద్మాలను భక్తితో సేవిస్తూ ఉంటుంది.

అణకువగలవారై, ప్రతిరోజు మిక్కిలి సంతోషంతో, తమ కోరికలీడేరగా, పడగలమీదనున్న మణులతో నిరంతరం ఆసక్తితో హారతులిస్తుంటారు.

సంకర్షణ మూర్తి అయిన ఆ ఆదిశేషుని దగ్గరికి తమ కోరికలు తీర్చుకోవడానికి నాగకన్యకలు వస్తుంటారు. ఆయన సమక్షంలో తమ శరీరవిలాసాలు ప్రదర్శిస్తుంటారు. అగరు, చందనం, కుంకుమపువ్వుతో కలిపి మెత్తని ముద్దగా తయారు చేసిన సుగంధ లేపనాలతో ఆయనను అర్చిస్తారు. ఆ తరువాత ఆ అనంతుని అపురూపమయిన రూపాన్ని తనివితీరా చూడడంవల్లనూ, ఆ మూర్తిని తాకడంవల్లనూ కామోద్రేకం కలిగిన వారవుతారు. ఆ కారణంగా చిరునవ్వులు చిందిస్తూ సిగ్గు లొలకబోస్తూ, క్రీగంటి చూపులు ప్రసరింపజేస్తూ ఆయన వంక చూస్తుంటారు. అప్పుడు అనంతగుణ సంపన్నుడయిన అనంతుడు తన సహజ కోపాన్ని వదలిపెట్టి శాంతుడవుతాడు. లోకాలన్నిటికి క్షేమాన్ని కాంక్షిస్తాడు. దేవతలు, అమరులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు, అనంతుని సదా ధ్యానం చేస్తుంటారు. అపుడు అనంతుడు సంతోషంతో అరగన్ను మోడ్పులతో, లలితగీతాలతో కూడిన మనోహరమయిన వాద్యధ్వనులకు ఆనందిస్తుంటాడు. తన పరిజనాన్ని ప్రీతితో తిలకిస్తుంటాడు. వైజయంతీ మాలికలను ధరిస్తుంటాడు. ఆ మాలికలు అపుడే కూర్చిన తులసీమంజరులతో కూడినవై ఉంటాయి. ఆ మంజరుల మకరంద సుగంధాలకు క్రమ్ముకొన్న తుమ్మెదలు జుమ్ముజుమ్మని పాటలు పాడుతుంటాయి.

అతడెప్పుడూ నల్లని వస్త్రాలు ధరించి నాగలిని ఆయుధంగా పట్టుకొని ఉంటాడు. అతణ్ణి మహేంద్రుడో, శివుడో అని అసలు జనులు భావిస్తుంటారు. ఆయన ఒక్కొక్కసారి బంగారు వస్త్రాలతోప్రకాశిస్తుంటాడు. ఆ శేషుడు మోక్షార్థులై తనను ధ్యానించేవారి హృదయగ్రంథిని తొలగించి అధ్యాత్మ విద్యతో కూడిన ఆనందాన్ని కలిగిస్తాడు. అందువల్లనే ముక్తిని కోరేవారు అనంతుని భక్తితో ఆరాధిస్తుంటారు. ఇన్ని మహిమలు కలిగినవాడు కావడం వల్లనే బ్రహ్మ మానస పుత్రుడయిన నారదుడు, తుంబురుడు మొదలయిన ఋషిపుంగవులతో కూడి బ్రహ్మదేవుని పేరోలగంలో అనంతుణ్ణి ఈ విధంగా స్తుతిస్తుంటాడు.

ఎవని లీలావినోదాలు సృష్టి స్థితి సంహారాలకు హేతువులవుతాయో, ఎవని చూపులవల్ల సత్త్వరజస్తమోగుణాలు పుట్టాయో, ఎవని రూపం లోకాలను అనేక విధాలుగా కాపాడుతుంటుందో, ఎవని పేరును తెలియకపోయినా స్మరించిన మాత్రాన పాపాలు పటాపంచలవుతాయో అటువంటి సంకర్షణుడూ అవ్యయుడూ అయిన ఆదిశేషుని పొగడడం ఎవరికీ సాధ్యం కానీ పని. ఆ అనంతుడు వాక్కుకూ, మనస్సుకూ అందనివాడు. ముల్లోకాలవారికి అంతు చిక్కనివాడు.

మావంటివారిని కాపాడడంకోసం ఆ ఆదిశేషుడు సత్త్వగుణస్వభావుడై ఉన్నాడు. అటువంటి అనంతునికి ప్రతిదినం నమస్కరిస్తాను.

ఆ ఆదిశేషుణ్ణి ఎవరయినా సరే హఠాత్తుగా తలచుకొన్నాా బాధలలో చిక్కుకొని మొరపెట్టినా అటువంటి వ్యక్తుల పాపాలను పోగొడతాడు. సకల శ్రేయస్సులూ ప్రసాదిస్తాడు. అందువలన ముక్తి కోరేవారు అనంతుని ఆశ్రయించి ధ్యానించి భవబంధాలకు దూరమవుతారు. అతని పడగలమీద భూగోళం అణుమాత్రంగా నిలిచి ఉంటుంది. ఆ అనంతుని మహిమలు లెక్కించడం వేయినాలుకలున్న వానికి కూడ అలవి గాని పని. ఆ అనంతుడు పాతాళంలో నివసిస్తూ అన్ని లోకాలకూ మేలు కోరువాడై భూమిని ధరిస్తాడు. అంటూ లోకాల స్వరూపాలూ, జంతువుల స్వభావములూ, మానవుల నైజాలను శుకుడు పరీక్షిత్తుకు విశదంగా వినిపించి, ఇంకా ఏమేమి వినదలచుకొన్నావో అడుగవలసిందని పలికాడు. అప్పుడు పరీక్షిన్నరేంద్రుడు శుకయోగీంద్రునితో ఈ విధంగా అన్నాడు.

మునీంద్రా! అతలవితలాది లోకాల స్వరూప స్వభావాలను నా మనసులో నాటేవిధంగా నీవు విశదీకరించావు. ఆ లోకాలన్నీ ఒకదానికొకటి సాటిలేనివి. పైగా చాలా చిత్రమయినవి.

పరీక్షిత్తు ఈ విధంగా పలుకగా శుకమహర్షి ఇలా అన్నాడు.

ఓ రాజా! ఈ లోకంలోని జీవులకు సత్త్వరజస్తమోగుణాలను అనుసరించి ఆసక్తులు వేరువేరుగా ఉంటాయి. సాత్విక శ్రద్ధ, రాజసశ్రద్ధ, తామసశ్రద్ధ అనేవానికి అనుగుణంగా వారి కార్యకలాపాలు కూడా వివిధంగా ఉంటాయి. ఈ తారతమ్యాలు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి.

నరేంద్రా! వేదం ఏ పనులను చేయవద్దని చెప్తుందో ఆ పనులు అధర్మాలు. అటువంటి ప్రతిషిద్ధ లక్షణమయిన అధర్మాన్ని ఆచరించే మానవుని శ్రద్ధ విపరీతంగా ఉంటుంది. శ్రద్ధయే భిన్నంగా ఉండడంవల్ల కర్మఫలాలు కూడా భిన్నంగా ఉంటాయి. అందువల్ల అనాదినుండి ఉన్నవి, అజ్ఞానంవల్ల ఏర్పడేవి, స్వేచ్చాప్రవర్తనలవల్ల కలిగేవి, అయిన నానావిధ కర్మగతులను సంగ్రహంగా చెబుతాను. విను. అనగానే పరీక్షిత్తు శుకునితో ఈ విధంగా అన్నాడు.

మునులలో శ్రేష్ఠడవయిన శుకయోగీంద్రా! నరకాలు ఉన్నాయని అంటారు. అవి ఎక్కడ ఉన్నాయి. ముల్లోకాలలోనా? లేక రెండు లోకాల నడుమనా? ఈ రెండూగాక వెలుపల వేరే ప్రదేశంలోనా? ఎక్కడ ఉన్నాయి? నరకమంటూ ప్రత్యేకంగా ఏవయినా లోకాలు ఉన్నాయా? నాకు వివరించి చెప్పు. వినాలని చాల కుతూహలపడుతున్నాను.

పరీక్షిన్మహారాజు ప్రశ్నలు విని శుకమహర్షి ఈ విధంగా అన్నాడు.

శుకయోగి పరీక్షిత్తునకు దెలిపెడి నరకలోక వర్ణనము

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...