Monday, September 7, 2026

Yugadharmaprakruthaadi Pralayachathustaya Vivechanamu - యుగధర్మప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము

శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము - 
యుగధర్మప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము

అలా చెప్పిన యోగిశ్రేష్ఠుడైన శుకమహర్షిని పరీక్షిత్తు ఇలా ప్రశ్నించాడు. “కలియుగం మహాపాతకాలతో కూడినది. కాబట్టి ప్రజలు తమకు పాపాలు రాకుండా ఎలా చేస్తారు? కాలం ఏ విధంగా నడుస్తుంది? కాలస్వరూపుడైన హరి ప్రభావం ఎలా తెలుస్తుంది?” అని రాజు ప్రశ్నించగా శుకమహర్షి ఇలా చెప్పాడు. 

కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని నాలుగు యుగాలు క్రమంగా ప్రవర్తిస్తాయి. ధర్మానికి సత్యం, దయ, తపస్సు, దానం అనేవి నాలుగు పాదాలు. మొదటిదైన కృతయుగంలో శాంతి, దాంతి, ఆత్మజ్ఞానం, వర్జాచారాలు ఆశ్రమాచారాలు మొదలైన వాటిని కలిగి ధర్మం నాలుగు పాదాలతో సంపూర్ణత్వం పొంది నడుస్తుంది. 

రెండవ యుగమైన త్రేతాయుగంలో శాంతి, దాంతి, కర్మాచరణం అనేవాటితో ధర్మం మూడు పాదాలతో నడుస్తుంది. మూడవ యుగమైన ద్వాపరయుగంలో బ్రాహ్మణపూజ, అహింసావ్రతం, జపం, అనుష్ఠానం మొదలైన లక్షణాలు కలిగి ధర్మం రెండు పాదాలతో నడిచి ప్రకాశిస్తుంది.

నాలుగవయుగం కలియుగం. ఈ యుగంలో జనులు అధర్మపరులుగా, అన్యాయపరులుగా; క్రోధం, మాత్సర్యం, మోహం, లోభం మొదలైన దుర్గుణాలతో కూడుకొన్న వాళ్లుగా ఉంటారు. వర్ణాచారాలను, ఆశ్రమాచారాలను వదలిపెట్టేస్తారు. దురాచారాలు అవలంబిస్తారు. 

తినకూడని అన్నం తింటారు. శూద్రులను సేవించడంలో ఇష్టం కలిగి ఉంటారు. దయలేనివాళ్లై, నిష్కారణంగా శత్రుత్వం వహించిన వాళ్లవుతారు. దయ, సత్యం, శౌచం మొదలైన గుణాలు లేనివాళ్లై, అబద్దాలాడుతూ, కపటోపాయాలు పన్నుతూ, ధనం లేనివాళ్లై, దోషం మాత్రమే గ్రహించే వాళ్లై, పాపపరులైన రాజులను సేవిస్తూ ఉంటారు. 

తండ్రులను, కొడుకులను, సోదరులను, చుట్టాలను, దాయాదులను, స్నేహితులను విడిచిపెట్టి, కేవలం కామకర్మలయందే అపేక్ష గలిగి కులపవిత్రతను నాశనం చేస్తారు. అంతేగాక కరవు, ఉపద్రవాలు వచ్చి ప్రజలు నశిస్తారు. బ్రాహ్మణులు అయోగ్య దానాలను గ్రహిస్తూ, ఇతరుల ధనం మీద ఆసక్తి కలిగి యజ్ఞయాగాది కర్మలు చేస్తూ నీచులు కావడం వల్ల నశిస్తారు.

కావున, ఈ కలియుగంలో ఒక క్షణమైనా విష్ణుభక్తి పరులై 'శ్రీనృసింహా! వాసుదేవా! సంకర్షణా! మొదలైన శ్రీహరి నామాలను సుస్థిరమైన భక్తితో స్మరించే వాళ్లకు వంద యజ్ఞాలు చేస్తే వచ్చినంత ఫలం లభిస్తుంది. 

అందుచేత ఓ రాజ చూడామణి! నువ్వు నిరంతరం విష్ణువును స్మరించు. కలియుగం అనేక పాపాలకు నిలయం. కాబట్టి ఒక నిమిష మాత్రం విష్ణువును స్మరించినా పరమ పవిత్రతను పొంది కృతార్థుడ వవుతావు' అని చెప్పి ఇంకా

మూడవది అయిన ద్వాపరయుగంలో ఎంతో వేడ్కతో హరిని గురించి పాడుతూ కృష్ణా అనుకొంటూ బుద్ధిమంతులై కలిని తలచి భగవంతుని యందు క్రీడిస్తారు.

పరీక్షిత్తు కల్పాంతంలో వచ్చే ప్రళయం ఏ విధంగా జరుగుతుందని అడిగాడు. దానికి శుకుడు ఇలా చెప్పాడు. యుగచతుష్టయాలు ఒక వెయ్యి గడిస్తే బ్రహ్మకు ఒక పగలు అవుతుంది. అట్లే రాత్రికూడా అంత ప్రమాణం కలిగి ఉంటుంది. ఇటువంటి రాత్రింబవళ్లు కలిస్తే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. 

బ్రహ్మకు అయ్యే ఆ ఒక్కరోజు నైమిత్తిక ప్రళయంగా పిలవబడుతుంది. ఆ సమయంలో బ్రహ్మ లోకాలన్నింటిని తన ఆత్మలో చేర్చుకొని నిద్రిస్తాడు. అప్పుడు ప్రకృతి నశిస్తుంది. అది ప్రాకృత ప్రళయం అనబడుతుంది. ఆ ప్రళయ విషయం చెపుతాను విను. పగటి పూట నైమిత్తిక ప్రళయం, రాత్రిపూట ప్రాకృత ప్రళయం అయితే అది బ్రహ్మకు ఒకరోజు అవుతుంది. 

ఇటువంటి రోజులు మూడు వందల అరవై అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం పూర్తి అవుతుంది. అటువంటి సంవత్సరాలు నూరయితే

అంతట బ్రహ్మకు అంతిమసమయం వచ్చినపుడు నూరేండ్లు భూమిలో వానలు కురవవు. దానితో మానవులు ఆకలిదప్పులకు తట్టుకోలేక ఒకరినొకరు తినడం మొదలుపెట్టి కాలవశులై నశిస్తారు. 

అప్పుడు కమలమిత్రుడైన సూర్యుడు సముద్రాలలోను, శరీరాలలోను, భూమిలోను ఉన్న జలాలను తన కిరణ సముదాయంచేత కాల్చి పీల్చివేస్తాడు. అప్పుడు ప్రళయాగ్ని సంకర్షణం అనే పేరుతో అన్ని దిక్కులలో వ్యాపించి ఆక్రమిస్తుంది. అప్పుడు నూరు సంవత్సరాలపాటు బలమైన గాలి వీస్తుంది.

ఈ విధంగా నూరేండ్లపాటు వానలుండవు. తరువాత నూరేండ్లు పండ్రెండుగురు సూర్యుల తీవ్రమైన కిరణాలు తాండవిస్తాయి. పిదప నూరేండ్లు ప్రళయకాలాగ్నిచేత దగ్ధమవుతుంది. తరువాత ఏడు రకాల గాలులు సుడిగాలి వేగంతో వీస్తాయి. ఆపై నూరేండ్లు నూతనమేఘాలు మహాధ్వనులతో ఏనుగుతొండాలవంటి జలధారలను కురిపించి సకల భూమిని జలమయం చేస్తాయి. 

బ్రహ్మాండమంతా జలమయం కావడంచేత భూమి తన గంధగుణాన్ని పోగొట్టుకొని నీటిలో లీనమైపోతుంది. నీరు తన రసగుణాన్ని పోగొట్టుకొని కాంతిలో అణగిపోతుంది. కాంతి అనగా తేజస్సు తన రూపగుణాన్ని పోగొట్టుకొని వాయువులో కలుస్తుంది. వాయువు తన స్పర్శగుణాన్ని పోగొట్టుకొని ఆకాశంలో చేరుతుంది.

ఆకాశం తన శబ్దగుణాన్ని పోగొట్టుకొని ఆదిభూతంలో ప్రవేశిస్తుంది. అది తేజోమయమైన మహద్రూపంతో అహంకారం కలదై, వికారగుణాలు కలదై ఇంద్రియాలను లీనం చేసుకొంటుంది. అహంకారం సత్త్వాది గుణాలను మింగుతుంది. అది కాల ప్రేరితమై ప్రకృతిలో అణగుతుంది. 

ఆ ప్రకృతి అనాదిగా ఉంది. అది శాశ్వతమైనది. దానికి నాశం కాని మార్పు కాని లేదు. మాటలకు గాని, మనస్సుకు గాని గోచరం కాక, సత్త్వరజస్తమస్సులనే గుణత్రయం లేనిదై మహత్తు మొదలైన వానితో కలయిక లేనిదై, స్వప్నావస్థ మొదలైన అవస్థాత్రయం లేనిదై, పృథివి మొదలైన పంచభూతాలు లేనిదై, తర్కానికి అందనిదై ఉంటుంది. 

దానిని మూలభూతమైన పదార్ధంగా చెపుతారు. కాలం విపరిణామం చెందినపుడు పురుషుడూ, అవ్యక్తుడూ ఒకరిలో ఒకరు లీనం అవుతారు. ఆ స్థితిని 'ప్రాకృత ప్రళయం' అంటారు.

మరొక విషయం ఉంది. దాన్నికూడా విను. బుద్ధి, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలైన విషయాలు అనే మూడింటినీ ఆశ్రయించుకొని జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ జ్ఞానం గోచరం కావడం అనే లక్షణం కలిగి, విరుద్ధం కాకపోవడమనే లక్షణం కలిగి, ఆదినీ అంతాన్ని కలదై ఉంటుంది. 

కాంతికంటె దీపం, నేత్రం, వస్తురూపం వేరుకావు. అదే విధంగా బుద్ధి, ఇంద్రియ, విషయాలు పదార్థమూర్తి అయిన పరమాత్మకంటె భిన్నమైనవి కావు. ప్రధానమనేది బుద్ధియందు పుడుతుంది. మెలకువగా ఉండడమనే జాగ్రదవస్థ, కలలు కనడం అనే స్వప్నావస్థ, నిద్రపోవడం అనే సుషుప్తి అవస్థ అనే మూడు విధాలైన అవస్థలు ఆత్మమయాలై బుద్ధితో కలసినట్లయితే అదే 'యోగం' అనిపించుకొంటుంది.

జీవజాలం ఈశ్వరుడిలో లయించడం, పుట్టడం పొందుతూ ఉంటుంది. అన్నీ పరస్పరం ఆశ్రయం లేనివై, మొదలూ తుదీ కలవి కావడం చేత వస్తువులు కానివై వర్తిస్తాయి. ఒకే కాంతి అనేక రంధ్రాలలో నుండి అనేక కాంతులుగా గోచరించినట్టు, ఒకే పరమాత్మ అనేక విధాలుగా భావింపబడుతున్నాడు. నగల భేదాన్నిబట్టి అనేక రీతులుగా కనిపించినప్పటికీ బంగారాన్ని ఒకే విధంగా భావించినట్లు పరమాత్మను ఒక్కటిగానే భావించాలి. 

కళ్లకు అడ్డుగా ఉన్న మబ్బుతెర తొలగితే సూర్యబింబం కనిపించినట్లు బంధకారణమైన అహంకారం ఆత్మజ్ఞానం వల్ల తొలగిపోయినప్పుడే పరమాత్మ స్వచ్చంగా కనిపిస్తుంది. ఆ పరమాత్మను యోగులు నిరంతరం స్మరిస్తూ అతనియందే లగ్నమైన మనస్సు కలవారై ఉంటారు. 

కాలవేగం చేత జగత్తుకంతటికీ భిన్నదశలు కలుగుతూ ఉంటాయి. పరమేశ్వర స్వరూపమైన కాలంలో ఆకాశంలో పగలు నక్షత్రాలు కనిపించని విధంగా, కల్పావస్థలు కనిపించకుండా సంచరిస్తూ ఉంటాయి.

నిత్యప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఆత్యంతిక ప్రళయం అని ప్రళయాలు నాలుగు విధాలు. ఆయా కాలాల్లో సంభవించే శ్రీమన్నారాయణుని లీలలైన అవతారాలను బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన వారైనా చెప్పలేరు(వివరించలేరు). నాకు తెలిసినంతవరకూ చెప్పాను. 

సంసారమనే సముద్రాన్ని దాటడానికి 'విష్ణుకథ' అనే నావ ఒక్కటే సాధనం. మరొక సాధనం లేదు. అని చెప్పి-

(ద్వాదశభాస్కరులు : సూర్యులు పండ్రెండుగురుగా ప్రసిద్ధి ఉంది. ద్వాదశాదిత్యులు అనే మాటా ప్రసిద్ధమే. అదితి సంతానం కనుక ఆదిత్యులు. వరుణుడు, సూర్యుడు, సహస్రాంశుడు, ధాత, తపనుడు, సవితృడు, గభస్తి, రవి, పర్జన్యుడు, త్వష్ట, మిత్రుడు, విష్ణువు - ఈ పండ్రెండుగురు సూర్యులు. మరొక అభిప్రాయం ప్రకారం - ఆర్యముడు, మిత్రుడు, అరుణుడు, అర్కుడు, భగుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, పూషుడు, పర్జన్యుడు, త్వష్ట, విష్ణువు, అజఘన్యుడు - పండ్రెండుగురు సూర్యులు. 

వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని 'ఆదిత్యహృదయం' స్తోత్రంలో ఈ పేర్లలో చాలా, ఇవిగాక మరికొన్ని కనిపిస్తాయి.

అహంకారం : అహమంటే నేను అని అర్థం. నేను అని భావించడమే అహంకారం. నావి అనే దేహాది ఉపాధులతో కలవకుండా భావించగలిగితే అహంకారం ఆత్మస్వరూపం అవుతుంది.

మహత్‌ : సాంఖ్యుల పంచవింశతి తత్త్వాలలో ఒకటి. అవ్యక్తమైన ప్రధానం నుండి వచ్చినదది. గొప్పది, పవిత్రమైనది అనే సామాన్యార్థాలు కూడా ఉన్నాయి. తనయందు ఆరోపితమైన గుణదోషాలను అంటనివ్వకుండా ఉండేది మహత్తు.

రాజా! నేను చనిపోతాననే భయాన్ని పూర్తిగా మనస్సునుండి విడిచిపెట్టు. పుట్టిన మానవుల కందరికీ చావు తప్పదు. కాబట్టి శ్రీహరిని ధ్యానించు. దీనివల్ల నీవు మళ్లీ భూమిపై పుట్టడం జరుగదు. మాధవలోకమైన వైకుంఠంలో నివసించి సుఖించేయోగం పొందుతావు.

(నిరంతరం విష్ణునామస్మరణచేస్తే ఒక్క పరీక్షిత్తుకే గాక మానవుల కందరకూ వైకుంఠవాససౌఖ్యం కలుగుతుంది. శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పిన భాగవతసారం, ఇచ్చిన సందేశం ఇదే. మూలశ్లోకం కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నది.

'త్వంతు రాజన్‌ మరిష్యేతి పశుబుద్ధిమిమాం జహి
న జాతః ప్రాగభూతో
ద్య దేహవత్త్వం న నంక్ష్యసి' (12-5-2)

రాజా! మరణించెదననే బుద్దిని విడిచిపెట్టు. ఈ బుద్ది దేహమే ఆత్మ అనే అవివేకం నుండి పుట్టింది. నీవు ఇదివరకు పుట్టలేదు. ఇప్పుడు నశించవు. దేహం పుట్టింది. అదిమాత్రమే నశిస్తుంది. 'నీవు' అంటే ఆత్మ అని అర్థం. ఆత్మ శాశ్వతమైనది.

దానికి చావు పుట్టుకలు లేవు. చావు పుట్టుకలు శరీరానికే!

పరీక్షిత్తు తక్షకునిచే దష్టుండై మృతి నొంద నతని పుత్త్రుడు సర్పయాగము సేయుట
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Shukayogi Parikshittunaku Bhavikalagathulu Jepputa - శుకయోగి పరీక్షిత్తునకు భావికాలగతులు జెప్పుట

శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము - శుకయోగి పరీక్షిత్తునకు భావికాలగతులు జెప్పుట

రాజోత్తమా! ఈ ప్రశ్నలకు సమాధానం సరిగా చెప్పడానికి సాధ్యం కాదు. అయినా, నేనునా సమర్థతతో దర్శించి తగినట్లుగా రాగల కాల గమనాలను నీకు వరుసగా చెపుతాను.

(రాజు 'భావికార్యంబులన్నియు' ఎరిగించుమని అడగడంలో అనేక ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఒకటి రెండు మాటలలో చెప్పడం సాధ్యం కాదు. విడమరచి చర్చాపూర్వకంగా చెప్పవలసిన సమాధానాలవి. అందువల్ల ప్రశ్నలకు అనకుండా ప్రశ్నములకు అని ఉంది. ప్రశ్నము అంటే చర్చించడం అని కూడా అర్ధం.)

రాగల కాలంలో రాజుల గురించి చెపుతాను. బృహద్రథుడు అనే రాజుకు పురంజయుడు పుడతాడు. అతనికి శునకుడనే అమాత్యుడుంటాడు. శునకుడు పురంజయుని సంహరించి తానే రాజ్యం పరిపాలిస్తూ ఉంటాడు. అతనికి కొంతకాలానికి ఒక కొడుకు పుడతాడు. వాడికి ప్రద్యోతనుడని పేరు పెట్టి రాజ్యం కట్టబెడతాడు.

ప్రద్యోతనునికి విశాఖరూపుడు, అతనికి నందివర్ధనుడు పుడతారు. ఈ రాజులైదుగురు నూట ముప్పె ఎనిమిది సంవత్సరాలు భూమిని పాలించి వృద్ధి చెందుతారు. ఆ తరువాత శిశునాగుడు అనే రాజు జన్మిస్తాడు. అతనికి కాకవర్ణుడనే కొడుకు కలుగుతాడు. ఆ కాకవర్ణుని కొడుకు క్షేమవర్ముడు. 

క్షేమవర్మ మహారాజుకు క్షేత్రజ్ఞుడు పుడతాడు. అతనికి విధిసారుడు, విధిసారునికి అజాతశత్రువు, అజాతశత్రువుకు దర్భకుడు, దర్భకునికి అజయుడు, అజయునికి నందివర్ధనుడు, నందివర్ధనునికి మహానంది ఉదయిస్తారు. 

శైశునాగులు అనే పేరుతో ప్రసిద్ధులైన యీ పదిమంది రాజులు కలికాలంలో మూడువందల అరవై సంవత్సరాలు అవిచ్చిన్నంగా రాజ్యపాలన చేస్తారు.

తరువాత మహానందికి శూద్రవనిత కడుపున మహాపద్ముడు పుడతాడు. అతడు మహాబలవంతు డవుతాడు. అయినా అతనితో క్షత్రియవంశం అంతరించి పోతుంది. ఆ సమయంలో రాజులు శూద్రప్రాయులై, ధర్మహీనులై చరిస్తారు. 

మహాపద్మునికి సుమాల్యుడు మొదలైన ఎనిమిదిమంది కొడుకులు కలుగుతారు. వందసంవత్సరాలపాటు వారి పరిపాలన సాగుతుంది. ఆ పిమ్మట కార్ముకుడు మొదలైన తొమ్మిదిమంది రాజులు పుడతారు. వారికి నవనందులని పేరు. ఆ నవనందులను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు సమూలంగా మట్టుబెడతాడు. నందులు లేకపోవడం చేత కొంతకాలం పాటు మౌర్యులు పరిపాలనచేస్తారు.

ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు చంద్రగుప్తనికి రాజ్యం అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునికి వారిసారుడు ఆవిర్భవిస్తాడు. క్రమంగా వారిసారుని కొడుకు అశోకవర్ధనుడు, అతని తనయుడు సుయశస్సు, వాని కొడుకు సంయుతుడు, అతని కొడుకు శాలిశూకుడు, వాని పుత్రుడు సోమశర్ముడు, వాని కొడుకు శతధన్వుడు, వాని కుమారుడు బృహద్రథుడు రాజులవుతారు. 

మౌర్యునితో కలసి ఆ పదిమంది రాజులు నూటముప్పయ్యేడు సంవత్సరాలు నిరాఘాటంగా రాజ్యపాలన చేస్తారు. ఆ సమయంలో బృహద్రథుని సైన్యాధిపతి శుంగవంశజుడైన పుష్యమిత్రుడు అతనిని చంపి రాజ్యాన్ని ఆక్రమిస్తాడు.

పుష్యమిత్రునికి అగ్నిమిత్రుడు పుట్టి రాజవుతాడు. అతని తరువాత సుజ్యేష్ఠుడు, అతనికి వసుమిత్రుడు, అతనికి భద్రకుడు, అతనికి పుళిందుడు, అతనికి ఘోషుడు, అతనికి వజ్రమిత్రుడు, అతనికి భాగవతుడు, వానికి దేవభూతి ఉద్భవిస్తారు.

ఈ శుంగులు వరుసగా తమ తండ్రుల నుండి సంక్రమించిన రాజ్యాన్ని తాము గ్రహించి పరిపాలిస్తారు. ఈ పదిమంది శుంగులు నూటపన్నెండుసంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు. 

తరువాత శుంగవంశీయులలో చివరివాడైన దేవభూతిని కణ్వమంత్రి అయిన వసుదేవుడు వధించి తానే రాజ్యాధిపతి అవుతాడు. అతనికి భూమిపుత్రుడనే పుత్రుడు కలుగుతాడు. ఆ మహానుభావునికి నారాయణుడనే కొడుకు పుడతాడు. కణ్వవంశస్థులు మూడువందలనలబైఅయిదుసంవత్సరాలు భూపరిపాలన చేస్తారు.

(నవనందులను నిర్మూలించిన బ్రాహ్మణశ్రేష్ఠుని పేరు చాణక్యుడు. ఇతనికి కౌటిల్యుడు అని కూడా మరొక పేరుంది. చాణక్యుడు చంద్రగుప్తుని రాజుగాచేసి తాను మంత్రిగా మంత్రాంగం నెరుపుతాడు. ఇతనిపేరుమీద 'అర్ధశాస్త్రం' ఒక ప్రఖ్యాత రాజనీతిశాస్త్ర గ్రంథంగా ప్రచారంలో ఉంది. 

నవనందులను నిర్మూలించి చాణక్యుడు వాళ్లదగ్గర మంత్రిగా ఉండిన రాక్షసమంత్రిని చంద్రగుప్తనికి మంత్రిగా చేస్తాడు. ఈ కథ విశాఖదత్తుడు సంస్కృతంలో రచించిన 'ముద్రారాక్షసం' అనే నాటకంలో విపులంగా ఉంది.)

పరీక్షిన్మహారాజా! రాజులు ఎంతో నేర్పుతో ఈ భూమిని పాలించినా తమ మనస్సులోని అజ్ఞానాన్ని తొలగించుకోలేరు. కాలం మిక్కిలి అస్థిరమైనదనే సత్యాన్ని తెలుసుకోలేక పోతున్నారు గదా!

రాజుల గొప్పతనాన్ని సంపూర్ణంగా ఆదిశేషుడుకూడా వర్ణించలేడు. ఆ రాజులు ఎంతోకాలం భూపాలన చేసి భ్రాంతిమగ్నులై క్రమంగా చివరకు ఈ భూమిలోనే నశించిపోతారు.

ఏనుగులు, గుర్రాలు మొదలైన సంపదలు స్థిరమని నమ్మరాదు. ప్రశాంత హృదయంలో నిరంతరం శ్రీహరిని స్మరించే సజ్జనులు అతనిలోకి చేరుకుంటారు.

కణ్వవంశంలో సుశర్ముడనే రాజు పుడతాడు. అతని భృత్యుడైన వృషలుడు అనే ఆంధ్రజాతీయుడు సుధర్ముడిని వధించి అధర్మమార్గంలో నడుస్తూ ఆ రాజ్యాన్ని నిరాటంకంగా పరిపాలిస్తాడు. 

అతని తరువాత అతని తమ్ముడు రాజవుతాడు. ఆ తరువాత శాంతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, శిబిలకుడు, మేఘస్వాతి, దండమానుడు, హాలేయుడైన అరిష్టకర్మ, తిలకుడు, పురీషసేతుడు, సునందనుడు, వృకుడు, జటాపుడు, శివస్వాతి, అరిందముడు, గోమతి, పురీమంతుడు, దేవశీర్షుడు, శివస్కందుడు, యజ్ఞశీలుడు, శ్రుతస్కందుడు, యజ్ఞశత్రుడు, విజయుడు, చంద్రబీజుడు, సులోమధి అనే పేర్లుగల రాజులు పితృక్రమంగా వచ్చిన రాజ్యాన్ని నాలుగు వందల ఏభై సంవత్సరాలు పరిపాలిస్తారు.

ఆ తరువాత ఆభీరవంశజులు ఏడుమంది, గర్దభవంశజులు పదిమంది, కంకవంశజులు పదహారుమంది, భూభారాన్ని ధరించి పాలిస్తారు. తరువాత ఎనిమిదిమంది యవనులు, పదునాలుగుమంది బర్బరులు ప్రభువులవుతారు. వాళ్ల తరువాత పదమూడుమంది గురుండులు, పదకొండుమంది మౌనులు గర్వంతో ఒక వెయ్యితొమ్మది వందల తొమ్మిది సంవత్సరాలు పాలన సాగిస్తారు. 

తరువాత మౌనవంశంలో పుట్టిన పదకొండుమంది రాజులు మత్సరంతో మూడువందల సంవత్సరాలు పాలిస్తారు. అదే సమయంలో కైకిలులు అనే యవనులు భూపాలకులవుతారు.

ఆ తరువాత భూతనందుడు, నవభంగిరుడు, శివనందుడు, అతని తమ్ముడైన యశోనందుడు, ప్రవీరకుడు అనేవాళ్లు వీరులై నూటారు సంవత్సరాలు పాలకులవుతారు. ఆ రాజులకు పదమూడు మంది కొడుకులు పుడతారు. వాళ్లలో ఆరుమంది బాహ్లికదేశానికి అధిపతులవుతారు. మిగిలిన ఏడుమంది కోసల దేశానికి అధిపతు లవుతారు.

అప్పుడు వైడూర్యపతులు నిషధదేశానికి అధీశ్వరులవుతారు. పురంజయుడు మగధ దేశాధీశుడుగా పుట్టి పుళిందులూ, యదువంశస్థులూ, మద్రదేశీయులూ అయిన హీనజాతి జనం బ్రహ్మజ్ఞాన, హరిభక్తి విహీనులు కాగా వారికి ధర్మోపదేశం చేసి శ్రీమన్నారాయణుని మీద భక్తి కలిగేటట్లు చేస్తాడు. బలపరాక్రమాలుగల క్షత్రియవంశాలను అణగదొక్కి పద్మావతీ నగరం రాజధానిగా చేసుకొని గంగనుండి ప్రయాగ వరకు గల భూమిని పరిపాలిస్తాడు.

శూద్రప్రాయులైన రాజులు, సంస్కారహీనులు, వేదధర్మాలను విడచిన వారు అయిన బ్రాహ్మణులు సౌరాష్ట్రం, అవంతి, ఆభీరం, అర్బుదం, మాళవం అనే దేశాలకు అధిపతులవుతారు. 

సింధుతీరంలోనూ, చంద్రభాగానదీప్రదేశాలలోనూ, కాశ్మీరదేశంలోనూ తెలివిలేని వారైన మ్లేచ్చజాతి రాజులు భూపరిపాలన చేస్తారు. వాళ్లకు ధర్మం, సత్యం, దయ ఉండవు. 

క్రోధమాత్సర్యాలతో అతిశయించి స్త్రీలనూ, బాలకులనూ, గోవులనూ, బ్రాహ్మణులనూ వధించడానికి వెనుదీయరు. పరధనాసక్తి పరవనితాసక్తి కలిగి రజోగుణంలోనూ, తమోగుణంలోనూ మునిగి అల్పాయువులూ, అల్పబలులూ అవుతారు. 

శ్రీహరి పాదపద్మాల మకరందంలోని రుచి వాళ్లకు తెలియదు. ఒకరిపట్ల ఒకరు వైరం పెంచుకొని యుద్దాలకు సిద్ధపడి ప్రాణాలు పోగొట్టుకొంటారు. ఆ సమయంలో ప్రజలు కూడా వాళ్ల వేషభాషలను, శీలవృత్తులను అనుసరిస్తారు. కాబట్టి.

(పురాణానికున్న పంచలక్షణాల్లో వంశానుచరితం ఒక లక్షణం. వంశానుచరితమంటే కలియుగ రాజవంశాల చరిత్ర. శ్రీకృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రారంభమైనట్లు పురాణాలు చెపుతున్నాయి.

'యస్మిన్‌ కృష్ణో దివం యాతా స్త స్మిన్‌ ఏవ తదాహని
ప్రతిపన్నం కలియుగం ఇతి ప్రాహుః పురావిదః'

అనే భాగవతంలోని శ్లోకం పై విషయానికి ఆధారం. యాదవ వంశానికి అలంకారమైన శ్రీకృష్ణుడు తన ధామానికి వెళ్లిన పిదప భూలోకంలో ఏ వంశం ఉండిందో తనకు తెలుపుమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగినట్లు ద్వాదశ స్కంధంలోని మొదటి శ్లోకం -

'స్వధామానుగతే కృష్ణే యదువంశ విభూషణే
కస్య వంశో
భవ త్పృథ్వ్యామేత దా చక్ష్వ మే మునే'

అని చెపుతున్నది. ఆ ప్రశ్నకు శుకుడు బార్హద్రథ వంశానికి చెందిన పురంజయుడితో మొదలుపెట్టి కలియుగ రాజవంశాలను వివరించాడు.

భాగవత పురాణంతో పాటు మత్స్య, వాయు, బ్రహ్మాండ, విష్ణు, గరుడ, భవిష్య పురాణాలలో కూడా కలియుగ రాజవంశాలను గురించిన వివరణలున్నాయి. 

ఏయే వంశపు రాజులు ఎన్నెన్ని సంవత్సరాలు పాలన చేశారనే విషయం కూడా ఉంది. పురాణాల ప్రకారం బార్హదథవంశం తరువాత మగధసామ్రాజ్యం ఏర్పడింది. ఈ రెండు రాజ్యాల మధ్యకాలంలో కూడా ప్రద్యోతనులు, శిశునాగులు పాలించినట్లు తెలుస్తున్నది. 

కలియుగరాజుల పట్టికలు పురాణాలలో క్రీ.శ. నాలుగైదు శతాబ్దాల వరకు పాలించిన రాజులను గురించి చెపుతున్నాయి. ప్రాచీనభారతదేశచరిత్రను నిర్మించిన చరిత్రకారులకు ఇలాంటి పౌరాణిక విషయాలు ఎంతగానో సహాయపడినాయి. 

వివిధ పురాణాలలో కనిపించే కలియుగ రాజవంశాలను గురించి ఎఫ్‌.ఇ.పర్‌గిటర్‌ అనే ఆంగ్ల, చారిత్రక పండితుడు 'పురానిక్‌ టెక్‌స్టు ఆఫ్‌ ది డైనాస్టీస్‌ ఆఫ్‌ ది కలి ఏజ్‌' అనే గ్రంథం రచించాడు. దీన్ని చౌకాంబా సంస్కృత సీరస్‌, వారణాసి వాళ్లు 1962లో ద్వితీయముద్రణగా ముద్రించారు. 

'హిస్టరీ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ పీపుల్‌' అనే పేరుతో భారతీయ విద్యాభవన్‌, బొంబాయి వాళ్లు 1951లో అనేక సంపుటాలలో భారతదేశచరిత్రను ముద్రించారు. ఆ సంపుటాలలో రెండవ సంపుటం పేరు 'ది ఏజ్‌ ఆఫ్‌ ఇంపీరియల్‌ యూనిటీ'. ఈ సంపుటంలో కలియుగ రాజవంశాలకు చెందిన బోలెడు విషయాలున్నాయి.)

రోజురోజుకూ లోకంలో ఆశ్చర్యకరంగా ధర్మాలు నశిస్తాయి. నాలుగు కులాలలో ధనవంతుడైన వాడే భూమికి పరిపాలకుడవుతాడు.

బలమున్నవాడే కులం లేనివాడయినా గొప్ప సద్గుణవంతుడవుతాడు. కలిమీ, బలిమీ అనే రెండూ ఉంటే లోకంలో అతడే రాజు. ఇక చెప్పడానికేముంది?

(ప్రస్తుత దేశకాల పరిస్థితులను బట్టి చూస్తే పైన  చెప్పిన విషయం అక్షరసత్యం.)

అందుచేత ప్రజలు పిసినారులై వ్యభిచారం, దొంగతనం మొదలైన వాటికి పాల్పడి ధనహీనులవుతారు. అడవులలో దొరికే కూరలు, దుంపలూ, పండ్లూ తింటూ అడవులలో, కొండలలో, దుర్గమ ప్రదేశాలలో తిరుగుతూ బక్కచిక్కి కరవుకు, చలికి, గాలికి, ఎండకు, ఆకలిబాధకు భీతి చెందుతారు. వాళ్ల ఆయుర్ధాయం తరిగిపోతుంది. స్వల్ప శరీరాలు గల వాళ్లవుతారు. ఇక రాజులు తామే దొంగలై తిరుగుతూ ఉంటారు. అధర్మంగా సంచరిస్తూ వర్ణాశ్రమధర్మాలను విడిచిపెట్టి శూద్రులతో సమానులై ఉంటారు.

ఆ సమయంలో ఔషధపుమొక్కలు అంత ఫలవంతాలు కావు. మబ్బులు నీళ్లు లేనివై వర్షాలు కురవవు. పండే పంటలు సారహీనమవుతాయి. ఈ విధంగా లోకం ధర్మం తప్పి ఉన్నపుడు విష్ణుమూర్తి దుష్టశిక్షణ కొరకు, శిష్టరక్షణ కొరకు శంబల అనే పల్లెలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణునికి కల్కిగా అవతరిస్తాడు. ఆ కల్క్యవతార పురుషుడు దేవతాసమూహాలు చూస్తుండగానే దేవదత్తమనే అశ్వాన్ని అధిరోహించి దుష్టులైన మ్లేచ్చులను తన కత్తితో ఖండఖండాలు చేస్తాడు (నరకుతాడు).

అప్పుడు భూమండలం దుర్జనుల గుంపు లేనిదై ప్రకాశిస్తుంది. మానవులు విష్ణువును ధ్యానించడం, నమస్కరించడం, పూజించడం మొదలైన పనులలో శ్రద్ధకలిగి నారాయణ భక్తి పరాయణులై ప్రవర్తిస్తారు. 

ఈవిధంగా కల్క్యవతార సమయంలో జనులందరూ కృతార్థులవుతారు. అన్నిచోట్లా కృతయుగ ధర్మమే ఆచరణలో ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బృహస్పతులు ఒకే రాశిలో ప్రవేశించగా అది కృతయుగంగా కనిపిస్తుంది. 

రాజోత్తమా! నీ పుట్టుక మొదలుకొని నందుడి పట్టాభిషేకం దాకా నడచిన, నడుస్తున్న రాగల కాలం ఒక వెయ్యి నూటపదిహేను సంవత్సరాలు అయి ఉంటుంది. తరువాత శ్రీమన్నారాయణుడు దుష్టులైన రాజులందరిని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించి వైకుంఠానికి వెళతాడు. అని శుకమహర్షి చెప్పగా

(శ్రీకృష్ణ నిర్యాణంతో కలియుగం ప్రారంభమైంది. పాండవులు రాజ్యపాలనను వదులుకొన్నారు. అభిమన్యుడి పుత్రుడైన పరీక్షిత్తుకు పట్టంకట్టారు. పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. మహాభారత కథంతా జనమేజయరాజుకు వైశంపాయనుడు(వ్యాసుని శిష్యుడు) చెప్పినట్లు నడుస్తుంది. 

పరీక్షిత్తు జననం నుండి నందునికి రాజ్యాభిషేకం జరిగినప్పటికి 1115 సంవత్సరాలు జరిగినట్లు భాగవతం చెపుతున్నది. ఈ నందుడు నందవంశానికి చెందిన మహాపద్మనందుడై ఉండాలి. 

మహాపద్మనందుని వంశంవాళ్లే నవనందులు. నవనందుల తరువాత మౌర్యవంశం ప్రారంభమై మౌర్య చంద్రగుప్తుడు మగధసామ్రాజ్యాధిపతి అయినట్లు చరిత్ర. ఈ భవిష్యవాణికి అనుగుణంగానే భారతదేశ చరిత్రను చూడవచ్చు.)

మునీశ్వరా! చంద్ర గ్రహం, సూర్యగ్రహం ఏ విధంగా సంచరిస్తాయో, కాలం ఎలా జరుగుతూ పోతుందో సంతోషంతో నాకు స్పష్టంగా తెలియజెయ్యవయ్యా!

అని పరీక్షిత్తు అడుగగా శుకుడు చెప్పడం మొదలుపెట్టాడు. సప్తర్షి మండలంలో ఉన్న మొదటి నక్షత్రద్వయానికి సమంగా మధ్యగా రాత్రి సమయంలో ఒక నక్షత్రం కనిపిస్తుంది. అది కనిపించి మనుష్యగణన ప్రకారం నూరు సంవత్సరాల పరిమితి గలదైనపుడు జనార్దనుడైన శ్రీకృష్ణుడు తన స్థానానికి వెళ్లిపోయాడో ఆ రోజుననే భూలోకం కలిచేత ఆక్రమించ బడింది. 

శ్రీకృష్ణుడు భూమిమీద ఉన్నంత కాలం కలి భూమిమీద అడుగు మోపలేదు. సప్తర్షులు మఘా నక్షత్రంలో ఏ రోజున ప్రవేశిస్తారో ఆ నాటికి కలి ప్రవేశించి పండ్రెండు వందల సంవత్సరాలు అవుతుంది. 

ఆ ఋషులు ఏడుగురూ పూర్వాషాఢలో ప్రవేశించినప్పుడు కలి వృద్ధి పొందుతాడు. శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి పరమపదమైన తన లోకాన్ని చేరుకొన్న రోజుననే కలి ప్రవేశించాడు. అప్పటినుండి వెయ్యి దేవ సంవత్సరాలు గడిచిన తరువాత నాలుగో పాదంలో కృతయుగ ధర్మం నడుస్తుంది.

(మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు - ఈ ఏడుగురు సప్తర్షులు. మరొక క్రమం ప్రకారం - కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని వసిష్ఠుడు - సప్తర్షులు. సప్తర్షి మండలంలోని పూర్వనక్షత్ర ద్వయం - పులహుడు, క్రతువు అనే ఋషుల పేర్లతో ఉన్న నక్షత్రాలు. ఈ రెండు నక్షత్రాల మధ్యలో అశ్విని, భరణి, కృత్తిక మొదలైన నక్షత్రాలలో ఒక నక్షత్రం నూరుసంవత్సరాలు ఉన్ననాడు కలియుగం ప్రారంభమైంది. 

అంటే పరీక్షిత్తు పాలనకాలంలో సప్తఋషులలో తూర్పువైపున రెండు నక్షత్రాల మధ్య మఘానక్షత్రం సమంగా నిలిచి ఉండడానికి ఆరంభమైన కాలం కలియుగ ప్రారంభకాలం.)

రాజోత్తమా! పరీక్షిన్మహారాజా! పూర్వరాజుల పేర్లూ, గుణాలూ, వాళ్ల ప్రవర్తనల గుర్తులూ, సిరులూ, సంపదలూ, వాళ్ల అందచందాలూ, రాజ్యాలూ, ఐశ్వర్యాలూ అన్నీ వరుసగా నశించాయి. కాని, వాళ్ల యశస్సులు ఈనాటికీ స్వచ్చంగా, శాశ్వతంగా నిలిచి ఉన్నాయి.

శంతనుని తమ్ముడు దేవాపీ, ఇక్ష్వాకువంశంవాడైన మరుత్తూ యోగవిద్యను అవలంబిస్తూ కలాప గ్రామంలో ఉండి కలియుగాంతంలో వాసుదేవునివల్ల ప్రేరితులై, ప్రజలందరూ చక్కగా ఆశ్రమధర్మాలను పాటించేటట్లు నడిపిస్తూ, నిత్యం విష్ణుస్మరణ చేస్తూ కైవల్యం పొందుతారు. 

ఈ విధంగా నాలుగు యుగాల రాజులూ, నేను చెప్పిన వెనకటి రాజులూ అందరూ లోకంలోని సమస్త వస్తు సముదాయం మీద మమకారం కలిగి, ఉత్సాహంతో జీవితాన్ని గడిపి తరువాత ఈ నేలను వీడి మరణించారు. 

కాబట్టి కాలగతి ఎవరికీ తెలియదు. మా పూర్వులు(మా పెద్దలు) విష్ణుధ్యానపరాయణులై దయా సత్య శౌచ శమ దమాది గొప్ప గుణాలు పాటించి కీర్తిపొంది జీవించారు. అందుచేత,

(దేవాపి - చంద్రవంశపు రాజు. సునందా ప్రతీపుల కొడుకు. శంతనుడు, బాహ్లికుడు ఇతడి సోదరులు. దేవాపికి చర్మవ్యాధి ఉందని రాజ్యానికి అనర్హుడుగా ప్రకటించి శంతనుని రాజును చేస్తారు. దేవాపి అడవికి వెళ్లి తపస్సు చేసి ముక్తి పొందుతాడు.

నాలుగు యుగాలు - కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 'కాలంబుజాడ యెవ్వరికిం గానరాదు' అనే ఈ వాక్యం భారతం మౌసల పర్వంలోని 'కాలమూలంబు సర్వంబు' (పద్యం 222) అని వ్యాసుడు అర్జునుడికి చెప్పిన విషయాన్ని స్ఫురింపజేస్తున్నది. సృష్టిలో అంతా కాలాధీనంగా ఉంటుంది. అందుకే అందరూ 'కాలాయ తస్మైనమః' అని కాలశక్తికి నమస్కరిస్తారు.)

ఓ రాజా! ధర్మం, సత్యం, కీర్తి, అచ్చమైన దయ, విష్ణుభక్తి, సాటిలేని గొప్ప సత్కర్మ, అహింస అనే గుణాలమీద ప్రేమగల వారే పుణ్యాత్ములు.

ఈ లోకాన్ని పాలించే పూర్వ రాజోత్తములు కాలగతిననుసరించి ప్రాణాలు పోగొట్టుకొని, పేరు మాత్రమే మిగిలిన వారయ్యారు. కాబట్టి ఏ విషయంలోనూ మమకారం పెట్టుకోవద్దు.

'గర్వంచేత కన్నులు మూసుకొనిపోయిన రాజులను చూసి భూమాత పరిహసిస్తుంది. శత్రువులను చంపి ఎవరికీ ఇవ్వకుండా తామే పాలిస్తామన్న అజ్ఞానంతో తండ్రులకూ, కొడుకులకూ, సోదరులకూ భ్రమ పుట్టించి, పరస్పర శత్రుత్వాలతో యుద్ధంచేసి, యుద్ధరంగాలలో శరీరాదులను గడ్డిపోచలతో సమానంగా విడిచి దేవలోకం పొందిన(మరణించిన) పృథుచక్రవర్తి యయాతి, గాధి, నహషుడు, భరతుడు, అర్జునుడు, మాంధాత, సగరుడు, రాముడు, ఖట్వాంగుడు, దుంధుమారుడు, రఘుమహారాజు, తృణబిందువు, పురూరవుడు, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కకుత్థ్సుడు, నిషధుడు, హిరణ్యకశిపుడు, వృత్రాసురుడు, రావణుడు, నముచి, శంబరుడు, భౌముడు(నరకుడు), హిరణ్యాక్షుడు, తారకాసురుడు - మొదలైన రాజులలో రాక్షసులు కూడా 'భూమినాది' అనుకోవడం చేతనే కదా కాలానికి లొంగి నాశనమై పోయారు! 

ఇదంతా పైకి కనిపించేదేకాని సత్యం కాదు. కాబట్టి అంతటినీ విడిచిపెట్టి 'జనార్దనా! వైకుంఠా! వాసుదేవా! నృసింహా! అని ఎల్లప్పుడూ శ్రీహరి కథలు అనే అమృతపానం చేసి ముసలితనం, రోగం అనే వికారాలను దూరం చేసుకొని విష్ణుస్థానం పొందు' అని చెప్పి

(భూమి శాశ్వతంగా ఉంటుంది. ఆ భూమిని పాలించే రాజులు పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు. అందువల్ల ఏ రాజుకూ భూమి శాశ్వతం కాదు. ఈ భూమి నాది అని ఒకరినొకరు జయించుకొని తమదిగా చేసుకోవాలనే ప్రయత్నాన్ని చూచి భూదేవి నవ్వుకొంటుంది. 'ఈ రాజులెంత మూర్ఖులు, తాము మృత్యుముఖంలో ఉన్నామని తెలుసుకోలేక మరొకరిని జయించి వాళ్ల భూమిని గ్రహించాలను కొంటున్నారు' అని గేలిచేస్తుంది.

పృథువు ; వేనుడి భుజాలు మర్దించగా పుట్టినవాడు. ఇతడొక చక్రవర్తి. ఇతని భార్యపేరు అర్చి. వేనుడు ఎంత అధర్మంగా పాలించాడో పృథుచక్రవర్తి అంత ధర్మబద్ధంగా పాలించాడు. ప్రజా సంరక్షణకోసం గోరూపంలో ఉన్న భూమినుండి రత్నాలను, ఓషధులను పితికాడు.

యయాతి : నహషుని కుమారుడు. శుక్రాచార్యుడి కూతురు దేవయానిని, వృషపర్వుడనే రాజు కూతురు శర్మిష్ఠను పెండ్లాడాడు. దేవయానికి యదువు, తుర్వసుడు, శర్మిష్ఠకు ద్రుహ్యువు, అనువు, పూరుడు అనే కొడుకులు పుడతారు.

శుక్రాచార్యుడి శాపం వల్ల యయాతి ముసలివాడవుతాడు. తనకింకా భోగేచ్చ ఉన్నదని, తన ముసలితనం తీసుకొని తమ యౌవనం ఇవ్వమని కొడుకులను అడుగుతాడు. కొడుకులందరూ నిరాకరించగా పూరుడు మాత్రం అంగీకరించి తన యౌవనాన్ని ఇస్తాడు. యయాతి చాలకాలం భోగాలనుభవించి మళ్లీ పూరుడినుండి ముసలితనం తీసుకొని అడవికి వెళ్లి తపస్సు చేస్తాడు.

గాధి : కుశికుడి కొడుకు. ఇతని పుత్రుడు విశ్వామిత్రుడు.

నహషుడు : ఇతడొక రాజు. అనేక క్రతువులు చేశాడు. దేవతలు నహషుని ఇంద్రుడుగా ఎన్నుకొన్నారు. ఇతడు గర్వించి దేవతలను, మునులను అవమానించాడు. ఇంద్రుని భార్యయైన శచీదేవిని తనకడకు పంపవలసిందిగా ఆజ్ఞాపించాడు. బృహస్పతి సలహాపై శచీదేవి మునివాహనంపై తనకడకు వస్తే అతడి కోరికను తీరుస్తానంటుంది. నహషుడు అగస్త్యాది మహర్షులను తన పల్లకిని మోయమంటాడు. వారు మోస్తూ ఉండగా త్వరగా నడవండి అనే అర్ధంలో 'సర్ప, సర్ప' అని అదలించాడు. అగస్త్యుడు ఆగ్రహించి సర్పం కమ్మని నహషుని శపించాడు. వెంటనే అతడు సర్పమయ్యాడు. అతడు వేసిన ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పగలిగితే సర్పరూపం పోతుందని చెపుతాడు అగస్త్యుడు. సర్పరూపంలోని నహషుడు తనకు దొరికిన వాళ్లందరినీ ప్రశ్నలు వేస్తుంటాడు. పాండవులు అరణ్యవాసం చేసే సందర్భంలో ధర్మరాజు అక్కడికి వచ్చి నహషుని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పగా నహషుడు శాపవిముక్తుడై పుణ్యలోకాలకు వెళతాదు.

భరతుడు : భరతుడనే పేరుగల వాళ్లు ఇద్దరున్నారు. కైకేయీ దశరథుల కొడుకైన భరతుడు ఒకరు. మరొకరు శకుంతలా దుష్యంతుల కొడుకు. ఈ భరతుడు మనదేశాన్ని పాలించడం వల్లనే భారతదేశమని పేరు వచ్చింది.

అర్జునుడు : నరనారాయణ మునులలోని నరుడే అర్జునుడు. ఇతడు కుంతికి ఇంద్రుడి వరం వల్ల జన్మించాడు.

మాంధాత : కృతయుగ మహీపతులకు తలమానికంగా ప్రసిద్ధిపొందిన సూర్యవంశ ప్రభు వితడు. ఈ వంశంలో దశరథుని పూర్వులలో మాంధాత ఇరవై అయిదవ తరంవాడు. ఇతడు యువనాశ్వుని కొడుకు. గయుడు, అంబరీషుడు మొదలైన షోడశ మహారాజులలో మాంధాత ఒకడు. ఇతడు కారణాంతరాల వల్ల తల్లిగర్భం నుండికాక తండ్రి కడుపు చీల్చుకొని పుట్టాడు.

సగరుడు : అయోధ్యను పాలించిన సూర్యవంశపురాజు. ఇతడు పుట్టకముందే తండ్రి మరణించాడు. తల్లి గర్భవతి. సహగమనం చేయబోగా చ్యవనమహర్షి ఆమెను తన ఆశ్రమానికి తీసుకొని వెళతాడు. అంతకుముందే ఆమె గర్భవతి కావడం సహించలేక సవతులు ఆమెకు గరళం (విషం) పెట్టారు. గర్భంలో గరళమున్నా ఎటువంటి బాధ లేకుండా ఆమె కొడుకును కన్నది. గరసహితుడై (విషంతో) పుట్టడం వల్ల ఆ బిడ్డకు సగరుడని పేరు పెట్టారు. సగరుని భార్య వైదర్భి. వీళ్లకు 60 వేలమంది కొడుకులు కలిగారు. సగరుడు అశ్వమేధయాగంచేసి అశ్వం వెంట తన 60 వేలమంది కొడుకులను పంపాడు. అశ్వం సముద్రతీరంలో సంచరిస్తూ అదృశ్యమైంది. వాళ్లు గుర్రంకోసం సముద్రాన్ని తవ్వి లోపలికి వెళ్లి అక్కడుండిన కపిలమహర్షి కోపానికి బలియై మరణించారు. తరువాత సగరుడు సముద్రాన్ని పుత్రుడుగా భావించి అశ్వాన్ని తెప్పించుకొన్నాడు. అది మొదలు సముద్రం సాగరమైంది. సగరుడు షట్చక్రవర్తులలో ఒకడుగా ప్రసిద్ధికెక్కాడు. హరిశ్చంద్ర, నల, పురుకుత్స, పురూరవ, సగర, కార్తవీర్యార్జునులు షట్చక్రవర్తులు.

దుంధుమారుడు : ఇక్ష్వాకు వంశస్థుడు. అసలుపేరు కువలయాశ్వుడు. దుంధుడు అనే రాక్షసుని చంపడంచేత ఇతనికి ఈ పేరు వచ్చింది.

రఘువు : ఇతడు దిలీపుని కుమారుడు. తల్లి సుదక్షిణాదేవి. సూర్యవంశానికి చెందినవాడు. రఘువు యజ్ఞం నిర్వహించి తన దగ్గర ఉన్న ధనమంతా ఖర్చుపెట్టాడు. ధనం లేని సమయంలో వరతంతుముని శిష్యుడైన కౌత్సుడు రఘువు ఆస్దానానికి వచ్చాడు. తన దగ్గర ఏమీ లేకపోవడం వల్ల అతనికి మట్టి పాత్రతోనే పాద్యం ఇచ్చాడు. కౌత్సుడు గురువుకు ఇవ్వవలసిన దక్షిణను రఘువు వద్ద పొందాలని వచ్చాడు. రఘువు పరిస్థితి చూచి వెళ్లబోగా రఘువు వారించి కుబేరుని నుండి ధనం పొంది కౌత్సునికి ఇచ్చిపంపాడు. రఘువు కుమారుడు అజుడు. ఈ విషయాలు కాళిదాసు రచించిన రఘువంశం కావ్యం లోనివి.

తృణబిందుడు : వేదవంతుని కుమారుడైన బంధుని పుత్రుడు. అలంబుస అనే దేవకామిని ఇతనిని మోహిస్తుంది. వీల్లిద్దరికి ఇలబిల అనే కూతురు పుట్టింది. ఈ ఇలబిలకు విశ్రవసుడికి కుబేరుడు పుట్టాడు.

పురూరవుడు : చంద్రవంశపు రాజు. ఇలా బుధుల కుమారుడు. ఇతని భార్య కౌసల్య. పురూరవుడు ఊర్వశిని చూచి మోహించి ఆమెయందు శ్రుతాయువు, సత్యాయువు అనే కొడుకులను పొందాడు.

శంతనుడు : ఇతడు ప్రతీపుని కొడుకు. గంగాతీరంలో సంచరిస్తుండగా గంగ స్త్రీ రూపంలో కనిపించింది. శంతనుడు ఆమెను కోరుకొన్నాడు. తాను చేసిన పనులను అంగీకరిస్తూ అడ్డు చెప్పకుండా ఉంటే శంతనుడికి భార్యనవుతా నన్నది. అందుకు శంతనుడు అంగీకరించాడు. వారు భార్యాభర్తలైనారు. గంగ గర్భవతి అయింది. బిడ్డ పుట్టగానే నదిలో పడవేసేది. ఆ విధంగా ఏడుగురు బీడ్డలను నదిలో వదిలేసింది. ఎనిమిదవ బిడ్డ జన్మించగా శంతనుడు నదిలో వేయనీయలేదు. తనమాటకు అడ్డు చెప్పినందుకు గంగ శంతనుని విడిచి వెళ్లిపోయింది. వెళ్లిపోయే ముందు తన ఎనిమిదవ బిడ్డ భీష్ముని శంతనునికి అప్పగించి పోయింది.

గయుడు : ఒక గంధర్వుడు. ఆకాశంలో సంచరిస్తూ తన తాంబూలాన్ని ఉమియగా, అది సూర్యుడికి అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుడి దోసిలిలో పడింది. దానికి కారణమైన వాడిని చంపుతానని ప్రతిన చేశాడు కృష్ణుడు. గయుడు అది తెలిసి అర్జునుని శరణువేడాడు. అర్జునుడు గయుడికి అభయమిచ్చాడు. గయుని విషయంగా కృష్ణార్దునులకు యుద్ధం జరిగింది. ఈశ్వరుడు ప్రత్యక్షమై వాళ్లిద్దరిని శాంతపరచాడు. గయుడు రక్షింపబడినాడు.

కువలయాశ్వుడు : శత్రుజిత్తు కొడుకైన ఇతడి అసలుపేరు ఋతధ్వజుడు. గాలవ మునికి కువలయాశ్వాన్ని ఇచ్చినందువల్ల ఇతనికి ఆ పేరు వచ్చింది. ఇతని భార్య మదాలస. విక్రాంతుడు, సుబాహువు, శత్రుమర్దనుడు, అలర్కుడు ఇతని కొడుకులు.

కకుత్థ్సుడు : కకుత్‌ అంటే ఎద్దు మూపురం. ఇంద్రుడు వృషభం కాగా ఇనవంశుజుడైన ఈ రాజు ఆ ఎద్దు మూపురం మీద కూర్చొని రాక్షసులను ఓడించాడు. అందువల్ల ఇతనికి ఆ పేరు వచ్చింది. ఇతని పేరు మీద కకు
త్థ్స వంశం ప్రసిద్ధమైంది. 

నిషధుడు : మాహిష్మతీ పురాధీశుడు. ఇతడు అగ్నిని ప్రార్థించి తన నగరానికి శత్రువులు వస్తే వాళ్లపై నిప్పుల వర్షం కురిసేటట్లు వరం పొందాడు.

వృత్రుడు : త్వష్ట సృజించిన విశ్వరూపుని ఇంద్రుడు చంపడం చేత ఇంద్రుని చంపడానికి త్వష్ట వృత్రుని సృజించాడు. వృత్రుడు బ్రహ్మను ప్రార్థించి రాత్రిగాని, పగలుగాని, సజీవ నిర్జీవాల చేతగాని, స్థలంలోగాని, జలంలోగాని తనకు మరణం లేకుండా వరం పొందాడు. శివజ్వరం సోకిన వృత్రుని ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించి చంపాడు.

శంబరుడు : కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నునిచే తనకు చావు వస్తుందని ఆకాశవాణి మాట విని శంబరుడు ప్రద్యుమ్నుని పురిటి ఎనిమిదవ నాడే ఎత్తుకొని పోయి సముద్రంలో పడవేశాడు. ఆ శిశువును ఒక చేప మింగింది. ఆ చేపను ఒక జాలరివాడు పట్టుకొని తన కూతురికిచ్చాడు. ఆమె దానిని తరిగినపుడు ప్రద్యుమ్నుడు బయటపడినాడు. శంబరుడు ప్రద్యుమ్నునితో యుద్ధం చేసి మరణించాడు.

భౌముడు : భూమి కొడుకు. నరకాసురుడు. శ్రీకృష్ణునిచే సంహరింపబడినాడు.

హిరణ్యాక్షుడు : ఒక రాక్షసుడు. భూమిని చాపచుట్టగా జేసి బాధిస్తూ ఉండగా విష్ణువు వరాహరూపంలో వెళ్లి వాడిని సంహరించాడు. భూదేవిని తనకోరలపై పెట్టుకొని రక్షించాడు.

తారకుడు : ఒక రాక్షసుడు. ఇతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి తనకంటె బలవంతులు లేకుండా వరం పొందాడు. ఆ వరగర్వంతో తారకుడు దేవతలను బాధించడం మొదలుపెట్టాడు. దేవతలు బ్రహ్మతో మొరపెట్టుకోగా బ్రహ్మ శివపార్వతులకు కలిగే కుమారస్వామిచేత వాడు హతుడవుతాడని చెప్పాడు. దేవతలు మన్మథుని సాయంతో పార్వతీ పరమేశ్వరులకు సంయోగం కలిగించారు. కుమారస్వామి జన్మించి తారకాసురుని సంహరించాడు.

రాజులైనా, రాక్షసులైనా మమతానుబంధాలకు చిక్కి కాలవశాన నశిస్తారు. ఎవరూ శాశ్వతం కాదు. ఇదంతా మిథ్య. అందుకే అన్నీ వదలి సర్వేశ్వరుని నామామృతాస్వాదంలో తేలికగా హరిపదాన్ని పొందవచ్చునని వ్యాసహృదయం. పోతన దీనిని సంపూర్ణంగా అనుభవించి మనకందించాడు.

రాజా! గొప్పవారిచే కీర్తింపబడిన వాడూ, దిక్కులన్నిటా సజ్జనులచే పొగడబడిన వాడూ అయిన పరమేశ్వరుని మనస్సులో నిలుపుకొని, ఆయన గుణాలను వర్ణిస్తూ ఉండు.

యుగధర్మప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Sree Maha Bhagavathamu Part 12 - శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము

శ్రీరస్తు శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము

శ్రీ మరుదశనపతిశయన!, కామిత మునిరాజ యోగి కల్పద్రుమ! యు
ద్దామ! ఘనజనకవరనృప, జామాతృవరేశ! రామచంద్రమహీశా!

గాలిని ఆహారంగా భుజించే సర్పములకు రాజైన ఆదిశేషుడు పాన్పుగా కలవాడా! కోరికతో ఆశ్రయించిన మునులకు, రాజులకు, యోగులకు కల్పవృక్షం వంటివాడా! ఉన్నతుడా! ఘనుడైన జనక మహారాజుయొక్క అల్లుండ్రలో ఘనత వహించినవాడా! రామచంద్ర ప్రభూ!

('మునిరాజయోగి' అన్నపుడు 'మునిశ్రేష్ఠులైన యోగులకు' అని కూడా చెప్పవచ్చు. జనక మహారాజుకు రామలక్ష్మణభరతశత్రుఘ్నులు అల్లుండ్రే. అయితే వీరిలో శ్రీరాముడు జామాతృవరేశుడు.)

పూజనీయమైన గుణాలచేత గొప్పవారైన శౌనకాది మునులకు సమస్త పురాణాలను వివరించి చెప్పే సామర్థ్యం గల సూతుడు ఈ విధంగా చెప్పాడు. పరీక్షిన్మహారాజుకు శుకయోగి శ్రీకృష్ణుడు అవతారం చాలించేవరకు జరిగిన జన్మకర్మలు చెప్పగా విని, సంతోషపడి, 'మహాత్మా! శ్రీమన్నారాయణుని కథలను, ఆయన గుణాలను, ఆచార విధులను, జీవాత్మభేదాన్ని, శ్రీహరిని పూజించవలసిన విధానాన్ని జ్ఞానయోగాన్ని అనుష్ఠించే పద్ధతిని, ఇంకా ఇటువంటి వాటి నెన్నిటినో చెప్పి నన్ను విజ్ఞానిని చేసి ఆదరించావు. ఇంక భవిష్యత్తులో జరగబోయే పనులను కూడా తెలియజేయి అని రాజు కోరాడు. శుకమహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు.

శుకయోగి పరీక్షిత్తునకు భావికాలగతులు జెప్పుట





 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Sri Krishna Balaramulu Vaikunthamuna Karuguta - శ్రీ కృష్ణ బలరాములు వైకుంఠమున కరుగుట

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - శ్రీ కృష్ణ బలరాములు వైకుంఠమున కరుగుట

పరీక్షిన్మహారాజుతో శుకమహర్షి ఇలా అన్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు అన్యాయవర్తులైన దుర్మార్గులను చంపి, న్యాయవర్తులైన సజ్జనులను కాపాడి బలరామునితో కలసి ద్వారకనుండి వెళ్లిపోగా యాదవులు మద్యపానంచేసి మదించి ఈర్ష్యతో సరదాగా తమలో తాము పోట్లాడుకోవడం మొదలుపెట్టారు.

(అది నిజమైన పోట్లాట (యుద్ధం) గా మారింది). ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాల్బలం (సైనికులు) అనే చతురంగ బలాలతో కూడి అడ్డులేకుండా యుద్దానికి తలపడ్డారు. మునులశాపం కారణంగా ఎత్తెన తుంగపోగులతో అలసిపోయేలా కొట్టుకొంటూ, పొడుచుకొంటూ తలపడ్డారు. 

తుంగపోగులు వజ్రాయుధంతో సమానంగా తగలగా ముక్కలై, కూలిన మొండాలతో, వికలమైన శరీరాలతో, విరిగిన రథాలతో, ఒరిగిన బండ్లతో, నేలపై కూలిన గుర్రాలతో, ఒరిగిపోయిన ఏనుగులతో ఆ యుద్ధభూమి నిండిపోయింది. ఆ యుద్ధంలో యాదవులందరూ చనిపోవడం చూచి నవ్వుకొంటూ శ్రీకృష్ణుడు, బలరాముడు అలా అలా వెళ్లిపోయారు.

అలా వెళ్లి, బలరాముడు ఒక దారిలో పోయి యోగమార్గంతో ఆదిశేషునిలో కలిశాడు (బలరాముని అవతారం సమాప్తమైంది. శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్లి ఒక పొదరింటి మాటున (పడుకొని) విశ్రాంతి తీసుకొంటూ ఒక కాలిమీద మరొక కాలుపెట్టి కదిలిస్తూ వినోదిస్తూ ఉండగా ఒక బోయవాడు వేటకు వచ్చి దిక్కులన్నీ నిక్కి చూస్తూ ఉంటే చెట్టుమాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవివలె కనిపించింది. 

వెంటనే వాడు బాణాన్ని వింటియందు చేర్చి గురిచూసి వదిలాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారాలు చేస్తూ కదులుతూ ఉంటే, బోయవాడు దగ్గరకు వచ్చి జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడని తెలుసుకొని భయంతో 'మహాపరాధిని, పాపాత్ముడను, వక్రబుద్దిని' అని అనేక విధాలుగా దుఃఖిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే వాడిని చూచి కృష్ణుడిలా అన్నాడు. 

'నువ్వెందుకు దుఃఖిస్తావు? పూర్వజన్మలలో చేసిన కర్మలు ఎంతటి వారికైనా అనుభవించవలసిందే. తప్పదు. నీవు కారణమాత్రుడవు అంతే'. అని తెలుపగా వాడు “గొప్ప తప్పులు చేసినవాళ్లు ఊరికే పోరు. దేవతలకు, గురువులకు, వైష్ణవులకు ద్రోహం చేసినవారు ఉండడానికి వీలుకాదు” అని పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశదీక్షకు పూనుకొని ప్రాణాలు వదలి వైకుంఠానికి వెళ్లాడు. అప్పుడు ...

(ఈ వచనంలో ప్రధానాంశం బలరామకృష్ణుల నిర్యాణం. మూలంలో వివరంగా ఉన్న విషయాలను నారయ ఈ వచనంలో సంగ్రహించాడు. మూలభాగవత విషయాలను చూస్తే అవి తెలుస్తాయి.)

తరువాత శ్రీకృష్ణుని రథసారధియైన దారుకుడు అందమైనవాడూ, ఏకాగ్రతతో ఆలోచిస్తున్నవాడూ, సర్వజ్ఞుడూ, మేరుపర్వతం వంటి ధీరుడూ, రాక్షస సంహారకుడూ, ఏకాంతంగా ఉన్నవాడూ అయిన శ్రీకృష్ణుని ఎంతో ప్రీతితో చూశాడు.

అలాచూసి మిక్కిలి భయభక్తులతో చేతులు జోడించి దారుకుడు ఇలా అన్నాడు.

శ్రీకృష్ణా! నిన్ను కనుగొనలేని కన్నులు వ్యర్థాలు. నిన్ను వర్ణించని నాలుక రసహీనం. నిన్ను చూడని రోజులు నిందింపదగినవి. కనులారా చూచి నన్ను ఆదరించు.

అంటూ దారుకుడు దుఃఖంతో ఇలా విన్నవించాడు. 'యాదవసమూహం (సముద్రమంత యాదవసమూహం) నశించింది. చుట్టాలు, గురువులు, మిత్రులు అటూ ఇటూ చెల్లాచెదరైపోయారు. ద్వారకకు పోయి మిత్ర జనంతో ఏమని చెప్పేది?' అని అంటూ ఉన్న సమయంలోనే శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలూ, దివ్యమైన రథాలూ, గుర్రాలూ మాయమైపోయాయి. 

శ్రీకృష్ణుడు దారుకునితో 'అక్రూరునికి, విదురునికి ఈ విషయమంతా చెప్పు. అర్జునుడి వద్దకు వెళ్లి స్త్రీలనూ, పిల్లలనూ, గురువులనూ, వృద్ధజనాన్ని హస్తినాపురానికి తీసుకొని పొమ్మని చెప్పు. ఇక వెళ్లు' అన్నాడు. 

దారుకుడు తిరిగివెళ్లి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు వివరంగా తెలియజేశాడు. అలా చేసేలోపలే ద్వారకానగరం పరిపూర్ణజలంలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించడానికి వీలు లేకపోయింది. 

అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో బయలుదేరి నారదాది మునుల సమూహం, బ్రహ్మరుద్రాది దేవతలు జయజయ నినాదాలతో(తోడుగా) కదలిరాగా తన స్థానానికి(వైకుంఠానికి) వెళ్లిపోయాడు. ఆ నారాయణుని (శ్రీకృష్ణుని) మూర్తి (విగ్రహం) సముద్ర ప్రాంతంలో జగన్నాథుని రూపం పొంది ఉంది అని శుకుడు పరీక్షిత్తు చెప్పెనని తెలిపి -

ఈ శ్రీకృష్ణుని కథను వినినా, వ్రాసినా సంపద, కీర్తి అదృష్టం తప్పక కలుగుతాయి. అలాంటి మానవుడు దీర్ఘాయువుతో, లోకులు మెచ్చగా లోకంలో జీవిస్తాడు. (ఫలశ్రుతి)

నవ్వుమోమూ, చక్కని నడుమూ, నల్లని దేహమూ, లక్ష్మీదేవికి నివాసస్థానమైన వక్షమూ, పెద్దబాహువులూ, అందమైన చెవిపోగులుగల చెవులూ, మదగజగమనమూ, నల్లనిజుట్టూ, దయారసంతోకూడిన చూపూ కలిగిన విష్ణుమూర్తి (శ్రీకృష్ణుడు) ఆనందం కలిగేటట్లు కనులు మూసినప్పుడూ, తెరచినప్పుడూ ప్రత్యక్షమగును గాక.

పద్మాలవంటి కనులు గలవాడా! సద్గుణాలతో శోభిల్లేవాడా! జనకరాజుచే పొగడబడినవాడా! ప్రకాశించే కీర్తి అనే అమృతంలో ఆవరించబడిన బ్రహ్మాండభాండం కలవాడా! రఘువంశానికి తిలకం వంటివాడా!

భూపుత్రి సీతతో ఆనందించువాడా! ధర్మమార్గాన్ని అనుసరించి చరించువాడా! సాటిలేని నీతికలవాడా! దేవతలకు శత్రువులైన రాక్షసులను సంహరించువాడా! గురువులకూ, పండితులకూ సుఖం కలిగించేవాడా! కోసల దేశానికి ప్రభువా! దేవతల భయాన్ని పోగొట్టువాడా! పండితుల హృదయాలలో విహరించువాడా! శ్రీరామా!

శ్రీ కృష్ణార్పణమస్తు 

శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Avadhuta - Yadusamvadamu - అవధూత - యదుసంవాదము

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - అవధూత - యదుసంవాదము

పద్మనాభుడైన శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద గల కూరిమితో ఇలా చెప్పాడు. ఒకరోజు యదురాజు దగ్గరకు ఎక్కడనుండో ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డులేక అన్ని దిక్కులూ తిరిగేవాడు. ఎప్పుడూ సంతృప్తితో ఉంటాడు. ఈశ్వరుడివేషం ధరించి ఉన్నాడు. యదురాజు ఆ యోగిని ఎక్కడనుండి వచ్చావని అడిగాడు. అందుకా యోగి స్పష్టంగా ఇలా అన్నాడు.

అవధూత ఇలా అన్నాడు. “నిర్మలమైన విజ్ఞానంలో నేర్పరులైన యోగ్యులు ఇరవైనాలుగుమంది నాకు గురువులు అయినారు. వారివల్ల నేను విజ్ఞానినైనాను”.

(అవధూత - వర్ణాశ్రమధర్మాలను వదిలిపెట్టి, శీతోష్ణపరిస్థితులను తట్టుకొంటూ, దేహసంస్కారాలు లేకుండా కేవలం బ్రహ్మనిష్ఠతో మెలిగేవాడు అవధూత).

అంత యాదవరాజు లోభం మోహం మొదలైన వాటిని వదిలిపెట్టి శరీరి ఏ రకంగా విష్ణువును చేరవచ్చునో తెలుపుమనగా అవధూత ఇలా అన్నాడు.

సత్ప్రవర్తనగల ఓ రాజా! పరుల సొమ్మును, పరుల భార్యలను కోరకుండా; ఇతరులను నిందించకుండా, ఇతరుల వస్తువులమీద అభిలాష లేకుండా; ముసలితనంవల్ల రోగాలు రాకముందే; శరీరం వణకకముందే; కంఠంలో కఫం చేరకముందే; శక్తియుక్తులు సన్నగిల్లకముందే; దృఢమైన భక్తిభావంతో దానవాంతకుడైన శ్రీకృష్ణునిపాదపద్మాలను భజిస్తూ తరగని ఆనందాన్ని ప్రతిరోజూ ఎవడు పొందుతాడో అలాంటివాడు భవబంధాలనుండి విముక్తుడు అవుతాడు.

భార్యాపుత్రధన ధాన్యాదులలో పెక్కువిధాల మక్కువను పెంచుకొన్న మనుష్యుడు మిక్కిలి భయంకరమైన వియోగం వల్ల కలిగిన దుఃఖంతో తెలివిని పోగొట్టుకొని చిక్కువడి, నీతి వివేకాలు లేక మానసిక భారంతో నశించి మగపావురం వలె నిజంగా పోతాడు (మరణిస్తాడు).

దీనికొక ఇతిహాసం(కథ) ఉంది. విను. ఒక పెద్ద అడవిలో ఒక పావురం భార్యతో కలసి ఒక గూడు నిర్మించుకొని పరస్పర మోహంతో ఉన్నది. కొంతకాలానికి ఆ పావురందంపతులకు సమృద్ధిగా సంతానం కలిగింది. పిల్లలు అపరిమితంగా అటూఇటూ తిరుగుతూ ఉండగా సంతోషంతో, భోగానుభవంతో కొన్ని నెలలు గడిచాయి. 

ఇలా ఉండగా కాలగతి వలన ఒక బోయవాడు వచ్చి వలలు వేశాడు. ఆ వలలలో ఆడపావురం, పిల్లలూ తగుల్కొన్నాయి. మగపావురం ధైర్యం కోల్పోయి భార్యాబిడ్డలమీద గల ప్రేమాతిశయంతో తానుకూడా ఆ వలలో ప్రవేశించి విచారంతో కృశించి నశించిపోయింది. 

కాబట్టి దేనియందూ ఎక్కువ మోహం పనికిరాదు. కనుక యోగీంద్రులైనవారు ఎప్పుడూ విష్ణువును ధ్యానిస్తూ భూమి, గాలి, ఆకాశం, నీళ్లు, అగ్ని చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, చేప, ముంగిస, లకుముకిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలుచేసేవాడు, సాలెపురుగు, కందిరీగ మొదలైన వాటి గుణగణాలు తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉంటారు.

భూమి మొదలుగా శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ 'నాకు తెలియాలి. నిర్మలమైన బుద్ధితో వీటినిగురించి తెలియజేయ'మని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు వినయవంతుడైన ఉద్ధవునితో శ్రీకృష్ణుడు వెంటనే చెప్పాడు.

ఈ విధంగా భూమివల్ల సహనం, వాయువు(గాలి) వల్ల గొప్పపరోపకారం, ఆకాశంవల్ల కాలం సృజించిన గుణాలతో సాంగత్యం లేకపోవడం. నీటివల్ల ఎప్పుడూ శుచిగా ఉండడం. అగ్నివల్ల నిర్మలంగా ఉండడం, చంద్ర సూర్యులవల్ల వృద్ధి క్షయాలందు సమభావం కల్గి ఉండడం, పావురంవల్ల భార్యాబిడ్డల మీద ప్రేమ, కొండచిలువవల్ల ఇష్టంగా తిరుగుతూ అందిన ఆహారాన్నిమాత్రమే గ్రహించడం, సముద్రంవల్ల ఉత్సాహరోషాలు, మిడుతవల్ల యథాశక్తి అనుకూలకర్మలను ఆచరించడం, తుమ్మెదవల్ల సారంమాత్రమే గ్రహించడం, ఏనుగువల్ల స్త్రీ విముఖత, తేనెటీగవల్ల కూడబెట్టుకొనే గుణం, లేడివల్ల విచారపరత్వం, చేపవల్ల జిహ్వాచపలత, ముంగిసవల్ల దొరికినదానితో తృప్తిపడడం, లకుముకిపిట్టవల్ల మోహత్యాగం, బాలునివల్ల విచారం విడిచి పెట్టడం. బాలికవల్ల సాంగత్యం విడిచిపెట్టడం, బాణాలుచేసేవాడివల్ల ఏకాగ్రత, పామువల్ల పరుల ఇంట నివసించడం, సాలెపురుగువల్ల సంసారబంధంలో చిక్కకుండడం, కందిరీగవల్ల లక్ష్యజ్ఞానం విడువకుండా ఉండడం అనే వీటి గుణాలను తెలుసుకోవాలి.

ఈ గుణాలు గ్రహించి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలనే ఆరుశత్రువులను జయించి; ముసలితనం, మరణం రాకుండా వాయువును(గాలిని) వశంచేసుకొని శరీరం పవిత్రంగా ఉండడానికి యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహాలనే ఆరు కర్మలమీద ఆసక్తి గలవాడై పట్టణాలను, గ్రామాలను, నగరాలను వదలి; కొండలయందు, అడవులయందు తిరుగుతూ; దేహం నిలవడానికి కావలసిన కొద్దిపాటి ఆహారం గ్రహిస్తూ సంతోషం, దుఃఖం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్ని మోహాన్ని వదిలిపెట్టి; ఇంద్రియాలను జయించి; నేను తప్ప మరొకటి తెలియక ఆత్మనిష్ఠతో పవిత్రమైన మనస్సు కలిగిన యోగి నాలో కలుస్తాడు కాబట్టి...

మోహవశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకొని క్రౌర్యానికి వశుడైన మనుష్యుడు ఎప్పుడూ దైన్యంతో దేహాన్ని శ్రమకు గురిచేస్తాడు.

దీనికి నిదర్శనంగా ఒక ప్రాచీనమైన కథ ఉంది. శ్రద్ధతో విను. మిథిలానగరంలో పింగళ అనే ఒక వేశ్యారత్నం ఉంది. ఆమెవలన నాకు కొంత పరిజ్ఞానం కలిగింది. అది ఎలాగంటే - ఆమె డబ్బుమీద ఆశతో తన భర్తను మోసగించి ధనమిచ్చే మరొకనిని చేరదీసింది. వాడిని తన ఇంటిలోనికి తీసుకొనిపోయి రాత్రంతా నిద్రలేకుండా గడిపింది. పట్టణంలోనూ, బజారులలోనూ తిరుగుతూ నిద్రలేకపోవడంవల్ల నీరసపడింది. ధనవ్యామోహంలో పడి తిరిగి తిరిగి బడలిక చెందింది. 

కడకు తనను సుఖపెట్టువాడే భర్త అని ఆలోచించింది. శ్రీమన్నారాయణుని గురించి ఇలా చింతిస్తే ఆయన మోక్షం ప్రసాదిస్తాడుగదా అని భావించింది. తన శయనాగారం, ఇతర సంపదలు త్యజించింది. వెంటనే వాసుదేవుని పాదపద్మాలకు నమస్కరించాలనే కోరిక కలదై శరీరం మెరుపువలె చంచలమైనదని, అశాశ్వతమైనదని నిశ్చయించుకొని పరతత్త్వంపై మనస్సును లగ్నంచేసి మోక్షం పొందింది. అని తెలిపి

పాపరహితుడా! శరీరం స్థిరమైనదికాదని, మోహాన్ని విడిచి మానవుడు సిద్ధిపొందిన మునివలె ప్రవర్తిస్తూ, ఇల్లువిడిచి మోక్షసంపదను పొందుతాడు.

ఇంకా ఒక ప్రత్యేకతగల పురాతనపుణ్యకథ చెపుతాను విను. “కనకావతీపురంలో ఒక బ్రాహ్మణుని కూతురైన కన్యకారత్నం ఉంది. ఆమె మణిమయకంకణాలు ధరించి ఆనందంతో చుట్టాలకు అన్నం వండడానికి వరిధాన్యం దంచుతన్నది. దంచేటప్పుడు రోకలి బరువుతో చేతులలోని కంకణాలు ధ్వనిస్తూ మోగుతున్నాయి. ఆ ధ్వనిని అసహ్యించుకొని ఆ పరమపతివ్రత ఆ కంకణాలనన్నింటిని తీసివేసి ఒక్క కంకణాన్ని మాత్రమే ఉంచుకొన్నది. 

అందుచేత తొందరపడక భగవత్పరమైన, అనన్య మనస్సుతో నిర్మలమనస్కులై నరులు మోక్షం పొందుతారు. కాబట్టి అజ్ఞానం, జ్డానం నేను కల్పించిన మాయ అని తెలిసి, పశువులు వెళ్లే మార్గంలో పోకుండా ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, జ్ఞానం, సిరి, వైరాగ్యం అనే షడ్గుణాలు కలిగిన యోగీశ్వరులవలె సుఖం కోరకుండా ఉండేవాళ్లు ముక్తులవుతారు. సర్వం విష్ణుమాయగా తెలుసుకో” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం చేశాడు. 

అప్పుడతడు “దేవా! నీ రూపాన్ని ఎలా దర్శించవచ్చు” నని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడిలా అన్నాడు. “భక్తి భావనాపరుడై, దయాపరుడై, మితంగా మాట్లాడుతూ, అబద్దాలాడకుండా, చేసే కర్మలన్నీ నాకు అర్పించేవాడు భాగవతుడు అనబడతాడు. 

నా కథలు, నా జననం, నా పనులూ వింటూ నా దాసులైన భాగవతులను ఇంటికి తీసుకొని వెళ్లి, వాళ్లను స్నానం, పూజ, భోజనం, శయనం, ఆసనం మొదలైన సపర్యలచేత సంతోషింపజేసిన వాడయినా భాగవతుడు అనబడతాడు. ఇలా ఎంతకాలం జీవిస్తాడో అంతకాలం ఇదేవిధంగా ఉండేవాడు నా రూపంతో వైకుంఠంలో ఉంటాడు.

అదీగాక శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులూ, అంబరీషుడు, విభీషణుడు, రుక్మాంగదుడు మొదలైన భాగవతులూ శాస్త్రాచారాలు ప్రేరేపించడంచేతనే కాకుండా విశేషించిన భక్తితో, ఏమరపాటు రాకుండా లక్ష్మీసమేతుడను, శంఖ చక్ర గదా శార్‌ఙ్గాదులతో కూడినవాడను అయిన నన్ను గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సమర్పిస్తూ ఎప్పుడూ ధ్యానిస్తూ తెలుసుకొన్నారు. 

మధురాపురానికి బలరామునితో కలసి నేను వెళ్లినప్పుడు గోపికలు ఓపిక లేకే (విరహాన్ని భరించలేక) భక్తియోగంతో నన్నే ధ్యానించి ముక్తి పొందారు. ఇదే భక్తియోగ పద్ధతి అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పాడు. చెప్పగా -

భూపతివైన శ్రీకృష్ణా! ఉదాత్తచరిత్రా! ధ్యానం ఎలా నిలుస్తుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? దాని విషయమంతా వివరంగా నాకు తెలియజేయుమయ్యా!

అని ఉద్ధవుడు అడుగగా శ్రీకృష్ణుడిట్లా అన్నాడు. కొయ్యనడుమ అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా అన్ని శరీరాల్లోనూ ఛేదింప వీలుకాని, దహింప వీలుకాని, ఎండింప వీలుకాని జీవుడు నివసిస్తూ ఉంటాడు. 

ఆ మాట విన్న ఉద్ధవుడు హరితో ఇలా అన్నాడు. 'సనకుడు, సనందుడు మొదలైన యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా బోధించావు? ఆ మార్గం ఎలాంటిది?' చెప్పుమని కోరగా శ్రీకృష్ణుడిలా అన్నాడు. 

'సనకాదులు మొదట ఈ విషయం బ్రహ్మను అడిగారు. బ్రహ్మ తనకు కూడా తెలియదన్నాడు. దానికి వాళ్లు ఆశ్చర్యపడుతుంటే నేనా సమయంలో హంసరూపం ధరించి వాళ్లకు చెప్పిన విధం వినుము. 

పంచేంద్రియాలకు కనిపించే పదార్ధం అనిత్యం(అశాశ్వతం) నిత్యమైంది బ్రహ్మం మాత్రమే. జీవుడు తన కర్మల వల్ల పొందిన శరీరంతో సంసారంలో మమకారాన్ని వదిలిపెట్టి నిశ్చలమైన జ్ఞానంతో నా లోకమైన వైకుంఠం చేరుతాడు. కలలో దొరికే పదార్ధం నిజం కానట్లుగా కర్మానుభవం అయినంతవరకు శరీరం ఉంటుంది. అని సాంఖ్యయోగంలో సనకాదులకు తెలిపితే విని బ్రహ్మ మొదలైన దేవతలు తెలుసుకొన్నారు.

అది వాళ్ల వల్ల భూలోకంలో ప్రసిద్ధమైంది. కాబట్టి నీవు కూడా దానిని తెలుసుకొని పుణ్యాశ్రమాలకు వెళ్లు. నాయందు భక్తి కలవాడు, ఆసక్తి కలవాడు అయిన వాని పాదధూళిని తన శరీరానికి తాకించుకొనేవాడు; శంఖచక్రాదిముద్రలు ధరించిన వాళ్లకు, శ్రీ హరిదివ్యనామాలను (ఊర్ధ్వపుండ్రాలను) ధరించినవాళ్లకు అన్నమూ, నీళ్లూ ఇచ్చేవాడు; వాసుదేవునిభక్తులను చూచి సంతోషించేవాడు భాగవతుడు. 

అన్ని సాంగత్యాలను వదిలిపెట్టి అన్యం తెలియక నన్నే తలచే మానవుడికి భుక్తినీ, ముక్తినీ ఇస్తాను” అని ఆనతీయగా ఉద్ధవుడు ధ్యానమార్గస్వరూపాన్ని తెలుపుమన్నాడు. 

శ్రీహరి ఇలా చెప్పాడు. ఏకాగ్రచిత్తులై కరకమలాలు రెండు తొడలపై పెట్టి ముక్కుకొనపై దృష్టి నిలిపి ప్రాణాయామంతో నన్ను హృదయగతుని గావించి, పదునెనిమిది విధాలైన ధారణా యోగసిద్దులను తెలిసికొని, వాటిలో అణిమ మున్నగు వాటిని ముఖ్యసిద్ధులుగా గ్రహించి, ఇంద్రియాలను బంధించి, మనస్సును ఆత్మలోచేర్చి, ఆత్మను ఆత్మతో లగ్నంచేసి బ్రహ్మపదాన్ని పొందే భాగవతశ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్ను పొందుతారు.

పూర్వం పాండురాజు కొడుకైన అర్జునుడు యుద్ధరంగంలో విషణ్ణుడై ఇలాగే అడిగితే అతనికి నేను చెప్పిన విధం నీకు తెలియజేస్తాను. చరాచరాత్మకమైన లోకమంతా నారూపంగా భావించి, భూతాలలో ఆధారభూతం; సూక్ష్మాలలో జీవుడు; జయింపరాని వాటిలో మనస్సు; దేవతలలో బ్రహ్మ వసువులలో అగ్ని, ఆదిత్యులలో(దేవతలలో) విష్ణువు; రుద్రులలో శివుడు; బ్రహ్మలలో భృగువు; ఋషులలో నారదుడు; ఆవులలో కామధేనువు; సిద్ధులలో కపిలుడు; రాక్షసులలో ప్రహ్లాదుడు; గ్రహాలలో(నక్షత్రాలలో) చంద్రుడు; ఏనుగులలో ఐరావతం; గుర్రాలలో ఉచ్చైశ్శ్రవం; సర్పాలలో వాసుకి; జంతువులలో సింహం; ఆశ్రమాలలో గృహస్థాశ్రమం; అక్షరాలలో ఓంకారం; నదులలో గంగ; సముద్రాలలో పాలసముద్రం; ఆయుధాలలో విల్లు; కొండలలో మేరుపర్వతం; చెట్లలో అశ్వత్థం(రావిచెట్టు); మూలికలలో యవలు; యజ్ఞాలలో బ్రహ్మయజ్ఞం; వ్రతాలలో అహింసావ్రతం; యోగాలలో ఆత్మయోగం; స్త్రీలలో శతరూప; వాక్కులలో సత్యవాక్కు, ఋతువులలో వసంత ఋతువు; మాసాలలో మార్గశిరం; నక్షత్రాలలో అభిజిత్తు; యుగాలలో కృతయుగం; భగవంతుని రూపాలలో వాసుదేవుడు; యక్షులలో కుబేరుడు; కోతులలో ఆంజనేయుడు; రత్నాలలో పద్మరాగం, దానాలలో అన్నదానం; తిథులలో ఏకాదశి; నరులలో వైష్ణవుడై భాగవతుడిలా ప్రవర్తించేవాడు ఇవన్నీ నా విభూతులుగా తెలుసుకో' అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా మళ్లీ ఉద్ధవుడిలా అన్నాడు.

పద్మనాభా! కమలనయనా! వర్ణాలు, ఆశ్రమాలు, వాటిధర్మాలు నిర్ణయించి, చెవులకు ఇంపుగా ఆనతిస్తే నేడు వింటాను.

అని ఉద్ధవుడు అడుగగా శ్రీకృష్ణుడు నాలుగువర్ణాల పుట్టుకా, నాలుగు ఆశ్రమాలకు తగిన పనులూ, నాలుగు వేదాలలో చెప్పిన ధర్మాలూ, ప్రవర్తించడానికి, నివర్తించడానికి కారణాలైన పురాణాలూ, ఇతిహాసాలూ, శాస్త్రాలూ, వైరాగ్యానికి సంబంధించిన విజ్ఞానాలూ మొదలైనవన్నీ తెలిపాడు. 

'అన్నిధర్మాలను వదిలిపెట్టి నన్నొక్కడినే శరణుపొందు' అనే ఉపనిషత్తుల్యమైన భగవద్గీతావచనం చొప్పున నాయందు మనస్సు పెట్టి ఉండేవాడు నేనే నని చెప్పబడుతాడు. పలురకాల వాదాలెందుకు? దేనిమీదా మనస్సు లగ్నం కానీక నా మీదనే మనస్సు కలిగి నడచుకో అని చెప్పగా ఉద్ధవుడు ఇలా అన్నాడు.

(వచనంలో ఈ ప్రతిపాదింపబడిన అతి సులభమైన భక్తి, ప్రపత్తి, శరణాగతి ముక్తికి హేతువులుగా చెప్పబడడంవల్ల పాండిత్యం లేనివారు, గొప్పశాస్త్రాలు చదువలేనివారు కూడా ముక్తికోసం దిగులు చెందవలసిన అవసరంలేదని, నిర్మలమైన దైవభక్తి ఉంటే చాలునని తెలుస్తుంది.)

బ్రహ్మకు తండ్రియైనవాడా! భక్తులు నమస్కరించే పాదద్వంద్వం కలవాడా! శ్రీకృష్ణా! నాకు తెలియని విషయాలు కొన్ని చెప్పావు. ఇంకా తెలుసుకోవలసిన వాటినిగురించి చెప్పు. ఉపాయంతో ప్రవర్తిస్తాను.

అని ఉద్ధవుడు అడుగగా జ్ఞానాత్మకుడైన శ్రీకృష్ణుడు చెప్పసాగాడు. ఉద్ధవా! నీ ప్రశ్నలు క్లిష్టమైనవి. అయినా చెపుతాను విను. నియమాలూ, శమదమాలూ మొదలైనవి ఏవి? తపమనగా నేమి? సుఖదుఃఖాలూ, స్వర్గనరకాలూ ఏవి? దరిద్రుడు ఎట్టివాడు? ఈశ్వరుడంటే ఎవరు? అని నీవు నన్నడిగిన విషయాలన్నిటినీ వేరువేరుగా వివరిస్తాను.

మౌనవ్రతమూ, ఓర్పూ, జపమూ, తపమూ, అతిథులను సత్కరించడమూ, పరహితమూ, దొంగతనమూ మొదలైనవి లేకుండుట అనే ఇలాంటివి నియమాలు అనబడతాయి. 

ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, శత్రుమిత్రుల యెడల సమానంగా ఉండడం 'శమ' మని చెప్పబడుతుంది. 

అజ్ఞానులకు జ్ఞానోపదేశం చేయడం, కోరికలను వదిలి పెట్టడం, సమదర్శనం, వైష్ణవభక్తి, ప్రాణాయామం, మనోనిర్మలత్వం అనేవి కల్గి ఉండడం విద్యగా చెప్పబడతాయి. 

శమదమాది గుణాలు లేని వాడుగావడం, నాయందు భక్తి లేనివాడు గావడం 'అవిద్య' అనబడుతుంది. 

చిత్తశుద్ది గలిగి ఎప్పుడూ తృప్తిచెందినవాడుగా ఉండడం 'దమ' మని చెప్పబడుతుంది. 

ఇటువంటి నియమాలూ, గుణాలూ కలిగి నాయందు భక్తి కలిగి ఉండడమే 'సుఖం'. నన్ను తెలుసుకోలేక తమోగుణంతో ఉండడమే 'దుఃఖం'. 

బంధువుల, గురువుల యెడల భేదబుద్ధి పొంది శరీరాన్ని తన ఇల్లుగా భావించేవాడే దరిద్రుడు. ఇంద్రియాలను నిగ్రహించినవాడూ, త్రిగుణ సాంగత్యం లేనివాడు అయినవాడే ఐశ్వర్యవంతుడు. 

నాయందు మనస్సు నిలిపి కర్మయోగమందూ, జ్ఞానయోగమందూ ఇష్టం కలిగిన వాళ్లై జనకరాజు మొదలైనవాళ్లు మోక్షాన్ని పొందారు. భక్తియోగం చేత బలి, ప్రహ్లాదుడు, ముచికుందుడు మొదలైనవాళ్లు పరమపదాన్ని పొందారు. 

కనుక ఈ విషయాన్ని తెలుసుకొని నిరంతరం నీ మనస్సులో భక్తియోగాన్ని నిలుపుకో. మట్టికుండకు రంధ్రం పడితే నీళ్లు కారిపోయే విధంగా రోజురోజుకు ఆయువు తరిగిపోతూ, చావు దగ్గరపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకొని ఎప్పుడూ ఏమరకుండా నన్నే తలుస్తూ ఉండేవాడు నాకు ఇష్టుడు.

పాపరహితుడైన ఉద్ధవా! జీవుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడు పూర్వజన్మ స్మృతి (జ్ఞానం) సంపూర్ణంగా ఉంటుంది. అతడు పుట్టిన పిమ్మట (కడుపులోనుండి భూమిమీద పడగానే) లోపల ఉండిన ఆ జ్ఞానమంతా పోతుంది (నశిస్తుంది).

'అందుచేత మానవుడు బాల్యం, పిన్నతనం, యువకత్వం అనే వయోదశల తరువాతగాని, పెద్దవాడైన తరువాతగాని నన్ను తెలుసుకొంటే కృతార్ధుడవుతాడు. సంపద కలిగించే గర్వంవల్ల గుడ్డివాడయితే చీకటి అనే బావిలో పడతాడు. 

అలాంటి వాడిని దరిద్రుడుగా చేస్తే జ్ఞానోదయమై నా పాదపద్మాలకు నమస్కరించాలనే తలంపుకలిగి మోక్షం పొందుతాడు. అందువల్ల శరీరాభిమానం వదిలిపెట్టి, ఇహలోకపరలోక సౌఖ్యాలను కోరకుండా, మనస్సును నిగ్రహించుకొని ఎప్పుడూ నన్ను స్మరించేవాడు వైకుంఠపదాన్ని పొందుతాడు. నేను కూడా అతనిని విడువలేక అతని వెంటనే వెళుతూ ఉంటాను. నారదాది మునులు భక్తిభావంవల్ల నా రూపం పొందారు'. అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా అతడింకా ఇలా అన్నాడు.

అయ్యా! దేవా! శ్రీకృష్ణా! సర్వజ్ఞనిధీ! సృష్టికర్తయైన బ్రహ్మను ఎవడు నేర్పుతో నడుపుతాడో వెంటనే చెప్పవయ్యా!

అనగా శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు 'ఆ విధంగా నాచేత ప్రేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలసి ఒక గుడ్డు(అండం) గా ఏర్పడ్డాయి. ఆ గుడ్డునుండి నేను పుట్టాను. అంతనా బొడ్డు రంధ్రం నుండి బ్రహ్మ పుట్టాడు. సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదాలు మొదలైన జగాన్నంతా అతనిచేత నేనే నిర్మింపజేశాను. 

ఆ బ్రహ్మకు నూరేండ్లు నిండిన తరువాత భూమి గంధంలో అణగిపోతుంది. గంధం నీటిలో కలుస్తుంది. ఆ నీరు రసంలో లీనమవుతుంది. ఆ రసం తేజోరూపాన్ని ధరిస్తుంది. ఆ తేజస్సు రూపంలో సంక్రమిస్తుంది. ఆ రూపం వాయువు (గాలి) లో కలుస్తుంది. ఆ వాయువు స్పర్శగుణంతో గ్రహింపబడి ఆకాశంలో లయిస్తుంది. ఆ ఆకాశం శబ్దమనే తన్మాత్రచే లోగొనబడినట్లయితే ఇంద్రియాలు మనోవికారాలతో కూడి ఈశ్వరుని పొంది ఈశ్వరత్వం పొందుతుంది.

నేను రజస్సు, సత్త్వం, తమస్సు అనే మూడు గుణాలతో కూడి మూడు మూర్తులు ధరించి సృష్టియొక్క పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికీ కారణుడనై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. పరమ పవిత్రుడవు, పరమ భక్తిసహితుడవు కమ్ము' అని చెప్పాడు. అంత

(మహత్‌ - సాంఖ్యుల పంచవింశతితత్త్వాలలో ఒకటి. అవ్యక్తమైన ప్రధానం నుండి వచ్చిన భూమిక. ఈ తత్త్వాలను కొందరు తొమ్మిదిగా చెపుతారు. పురుషుడు, ప్రకృతి, మహత్తత్త్వం, అహంకారం, ఆకాశం, వాయువు, తేజస్సు, జలం, పృథివి అనేవి తొమ్మది తత్త్వాలు. 

జీవుడు, పరమాత్మ అనే ఇద్దరిని కలిపి పురుషుడు అన్నారు. మహదాదిగుణాలు కలసి 'అండం' ఉద్భవించిందని, దానినుండి భగవానుడు ఉద్భవించాడని భాగవతం చెపుతున్నది. 'అండపిండ బ్రహ్మాండంబు' అంటూ ఉంటారు. వీటిలో అండం అంటే గుడ్డు, పిండం అంటే దేహధారణ చేస్తున్న దశలోని రూపం. బ్రహ్మాండమంటే విశ్వం. పారమార్థికంగా అండం అంటే పంచమహాభూతాలతో కూడిన సృష్టి.

శ్రీమన్నారాయణుడే త్రిమూర్తులను ధరించి సృష్టి స్థితి లయలనే కార్యాలను నిర్వహిస్తాడని భాగవతం చెపుతున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే త్రిమూర్తులు. త్రిమూర్తత్వం ఒకే తత్త్వం. వివిధ కార్యాల నిర్వహణకోసం అది మూడు తత్త్వాలుగా రూపొందింది. మొదటిది బ్రహ్మతత్త్వం. ఈ తత్త్వం సృష్టికార్యాన్ని నిర్వహిస్తుంది. కాబట్టి రజోగుణ సంయుక్తంగా ఉంటుంది. రెండవది విష్ణుతత్త్వం. ఈ తత్వం స్థితికి సంబంధించింది. కాబట్టి సత్వగుణసంయుక్తంగా ఉంటుంది. మూడవది మహేశ్వరతత్త్వం. ఈ తత్త్వం అప్పటివరకు పోషింపబడిన విశ్వాన్ని లయింపజేస్తుంది. 

అందువల్ల ఈ తత్త్వం తమోగుణ ప్రధానంగా ఉంటుంది. గుణ ప్రాధాన్యాన్ని బట్టి, నిర్వహించే పనులను బట్టి త్రిమూర్తులు రజస్సు, సత్త్వం, తమస్సు అనే గుణాలకు ప్రతినిధులుగా గుర్తింపబడినారు.)

రూపంలేని నీకు యోగులు రూపం కల్పించి నిన్ను మహాభక్తితో సేవిస్తూ ఉంటారు. నీవు వాళ్ల కోరికలను ఎలా తీరుస్తావు. నాకు తెలియజెయ్యి.

ఉద్ధవుడు అడిగిన ప్రశ్నకు నారాయణుడు (శ్రీకృష్ణుడు) ఇలా అన్నాడు. నేను అన్ని వర్ణాలవాళ్లకు సమమైన పూజాపద్ధతిని చెపుతాను. రాతితోగాని, మట్టితోగాని, కొయ్యతోగాని తమ ఆచారం ప్రకారం ఒక ఆకారం కల్పించి ఒక పేరు పెట్టి కొందరు పూజిస్తారు. 

కంచుతోగాని, సీసంతోగాని, వెండితోగాని, బంగారుతోగాని చేసిన విగ్రహరూపాలు శ్రేష్ఠమైనవి. ఈ విధంగా నా విగ్రహరూపాలలో నా భావాన్ని భావించి కొలిచిన వారికి నేను ప్రసన్నుడనవుతాను. ఈ లోకంలో మానవులకు ధ్యానం నిలువదు. దేవతాప్రతిమలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అందమైనవి సారవంతాలైనవి మనస్సును ఆకట్టుకొనేవి అయిన రూపాలలో నేను ప్రసన్నమనస్కుడనై ఉంటాను. 

కావున నన్ను పాలకడలిలో పవళించిన వాడినిగా ఎంచి శుభ్రమైన వస్త్రాలు, భూషణాలు, పూలదండలు, మైపూతలు అర్పించి, దివ్యాలైన అన్ని పాఠాలతో, పదహారు విధాలైన రాజోపచారాలతో బాహ్యమైన పూజలు చేసి, నాకు ఇష్టమైన పదార్దాలను సమర్పించి, నిత్యం మనః పూజావిధానాలతో సంతోషింపబజేసి, దివ్యాలైన వస్త్రభూషణాలతో, పూలదండలతో ప్రకాశిస్తూ శంఖ చక్ర కిరీటాదులతో అలంకృతుడనైన దివ్యమంగళ విగ్రహునిగా భావించి ధ్యానపరవశుడైన నా భక్తుడు నాలో చేరుకొంటాడు.

ఉద్ధవా! నీవు ఇటువంటి తీవ్రమైన యోగనిష్ఠతో బదరికాశ్రమంచేరి, నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకొని కలియుగాంతం వరకు ఉండుమని శ్రీకృష్ణుడు చెప్పగా ఉద్ధవుడు ఆనందంతో నిండిన మనస్సు గలవాడై శ్రీకృష్ణుని పాదపద్మాలను హృదయంలో నిలుపుకొని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్లాడు. అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పగా

(సర్వవర్ణాలు - బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులే సర్వవర్ణాలవాళ్లు. ఏ వర్ణం వారికైనా పూజావిధానం ఒకటే అనడానికి భాగవతం ఆ విధంగా చెప్పింది. దేవతాప్రతిమలను రాతితోగాని, మట్టితోగాని, కొయ్యతోగాని చేసి పూజించవచ్చు. 

ఇలాంటి విగ్రహాలకంటె లోహంతో చేసిన విగ్రహాలు శ్రేష్ఠమైనవి. విగ్రహపూజ బాహ్యపూజ. 
మనస్సులోనే ఒక మూర్తిని కల్పించుకొని ఆరాధించవచ్చు. అది ఆభ్యంతర పూజ.

దేవతా విగ్రహాలు ఒకచోట నుండి మరొక చోటికి మార్చదగినవి, ఒకేచోట స్థిరంగా ఉండేవి అని రెండు రకాలు. అలాంటి విగ్రహాలలో మంత్రశక్తితో ప్రాణప్రతిష్టచేస్తే అవి సజీవమై భగవంతునికి వాసస్థానాలవుతాయి.

శుకమహర్షి మాటలు విన్న పరీక్షిత్తు మునిచంద్రా! శ్రీకృష్ణుని కథలను యోగులు మెచ్చేవిధంగా, ఆశ్చర్యం కలిగేవిధంగా, నేర్పుగా చెప్పినప్పటికి నా మనస్సు తృప్తి పడడంలేదు.

తరువాత కృష్ణుడేమైనాడు? యాదవులు ఎలా ప్రవర్తించారు? ద్వారకానగరం ఎలా ఉండింది? తాపసోత్తమా! సంతోషంతో నాకు స్పష్టమయ్యేటట్లు చెప్పు.

శ్రీ కృష్ణ బలరాములు వైకుంఠమున కరుగుట
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Krishnudu Uddhavunaku Paramarthopadesamu Seyuta - కృష్ణుడు ఉద్ధవునకు పరమర్థోపదేశము సేయుట

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - కృష్ణుడు ఉద్ధవునకు పరమర్థోపదేశము సేయుట

ఈ విధంగా స్తుతించి “దేవా! నీవు యాదవజాతిని నాశనం చేసి వెళ్లిపోతే మేము ఏ విధంగా జీవించగలం? నీకు సహచరులమై నీతో కలసి చేసిన స్నాన, పాన, భోజన, శయన, ఆసనాదులను ఎలా మరచిపోగలం?” అని ఉద్ధవుడు అనగా 

శ్రీకృష్ణుడిలా అన్నాడు. “బ్రహ్మ మొదలైన దేవతలు చేసిన విన్నపాన్ని అనుసరించి భూమి బరువును తొలగించాను. ఇక నేటికి ఏడవరోజు సముద్రుడు ద్వారకానగరాన్ని ముంచివేస్తాడు. యాదవజాతి నాశనం అవుతుంది. అంతట కలియుగం వస్తుంది. కలియుగంలో మానవులు ధర్మం వదిలినవారూ, సదాచారరహితులూ, అన్యాయపరులూ, అధికమైన కోపం గలవారూ, మందమతులూ, తక్కువ ఆయువు కలవారూ, బహురోగాలచేత పీడింపబడుతూ ఉండేవారూ, ఫలించని పనులు చేసేవారూ, నాస్తికులూ అయి ఒకరిపై ఒకరికి ఇష్టం లేకుండా ఉంటారు.

కాబట్టి నీవు స్నేహితులు, చుట్టాలు మొదలైనవాళ్ల అనుబంధాన్ని వదిలిపెట్టు. ఇంద్రియసౌఖ్యాలలో మునిగిపోకు. భూతలంమీద గల పుణ్యతీర్ధాలలో స్నానం చెయ్యి. మనస్సుతో పంచేంద్రియాలతో గ్రహింపదగు వస్తుసముదాయమంతా నశించేది అని తెలుసుకో. పురుషుడు(జీవుడు) అనేకాలైన సంపదలను సంపాదించి తన గుణదోషాలతో మోహితుడై ఉంటాడు.

కాబట్టి మావటివాడు మదగజాన్ని కట్టివేసిన విధంగా ఇంద్రియాలనూ, మనోవికారాలనూ నిగ్రహించి; భార్యాపుత్రులు ధనం విషయంలో ఆసక్తి వదలి సుఖదుఃఖాలలో సమంగా ప్రవర్తించు. 

ఈ ప్రపంచమంతా పరమాత్మయే అధిష్ఠానంగా కల్గిందిగా తెలుసుకో. మాయ ఆత్మకు వశమైనదిగా గ్రహించు. జ్ఞానవిజ్ఞానవంతుడవై ఆత్మానుభవంతో తృప్తిపొంది విశ్వాన్ని నన్నుగా భావించి ప్రవర్తించు” అని శ్రీకృష్ణుడు ఆనతిచ్చాడు.

ఉద్ధవుడు భక్తితో, భయంతో, వినయంతో చెతులు జోడించి “మహాత్మా! సన్న్యాస జీవితం చాలా కష్టం. పామరులైనవాళ్లు ఆచరించలేరు. నీ మాయచేత భ్రాంతులైనవారు ఈ సంసారసముద్రాన్ని దాటి ఎలా మోక్షం పొందుతారు? సేవకుడనైన నామీద దయతో చెప్పాలి. బ్రహ్మ మొదలైన దేవతల సమూహం కూడా బాహ్యవస్తువులందు భ్రాంతులై తిరుగుతూ ఉంటారు. 

నీ భక్తులైన పరమభాగవతులుమాత్రమే ఆ మాయను తిరస్కరించగలుగుతారు. గృహిణులకైనా, గృహస్థులకైనా, సన్న్యాసులకైనా ఎప్పుడూ నీ నామస్మరణే మోక్షసామ్రాజ్యాన్ని అందిస్తుంది. 

కాబట్టి పరమేశ్వరా! నీ పాదాలను శరణు పొందుతున్నాను. నామీద కరుణరసాన్ని ప్రసరింపజేయి” అని ప్రియసేవకుడైన ఉద్ధవుడు పలికాడు. అప్పుడు అతనితో శ్రీకృష్ణుడిలా అన్నాడు. 

“పురుషునికి, ఆత్మకు ఆత్మే గురువు. చెడు మార్గాలలోకి వెళ్లకుండా మంచిమార్గంలో వర్తిస్తూ మిక్కిలి గొప్పదైన నా నివాసానికి(వైకుంఠానికి) చేరుకో. సమస్తశక్తులు గల నన్ను సాంఖ్యయోగులు ఎప్పుడూ పురుషభావంతో(పరమాత్మభావంతో) భావిస్తూ ఉంటారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు కాళ్లు కలవి, అసలు కాళ్లు లేనివి అయిన జీవులలో రెండుకాళ్లుగల మనుష్యులు ఉత్తములు. 

అలాంటి ఉత్తములైన మనుష్యులలో నిరంతర ధ్యానగరిష్ఠులైన యోగీశ్వరులు ఉత్తములు. వాళ్లలో సందేహించేవాళ్లు గ్రహించలేని నన్ను సత్త్వగుణులు గ్రహిస్తారని తెలిసి తమ మనః పద్మాలలో జీవాత్మ, పరమాత్మలను ఒకటిచేసి శంఖం, చక్రం, గద, ఖడ్గం, శార్‌ఙ్గం, కౌమోదకి, కౌస్తుభం - వీటితో కూడినవానిగా నన్ను భావించేవారు పరమయోగీంద్రులు, పరమజ్ఞానులు” అని చెప్పి ఇంకా 'అవధూత - యదు సంవాదం' అనే ప్రాచీనమైన కథ ఒకటి ఉంది. చెపుతాను వినుమన్నాడు.

(శ్రీమన్నారాయణుడు “సర్వమూలశక్తి సంపన్నుండు” అంటే సర్వజ్ఞత్వ, సత్య సంకల్పాది శక్తులతో కూడి జగత్‌ సృష్టి చేయగలిగిన వాడని అర్థం. సాంఖ్యయోగపరులంటే -సాంఖ్యయోగాన్ని అభ్యసించినవాళ్లు. సంఖ్యతో కూడినది సాంఖ్యం. సాంఖ్యమంటే జ్ఞానం. జ్ఞానవిచారణలో అనాత్మ వస్తువులను లెక్కించవలసి ఉంటుంది. లెక్కచెప్పేటప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది కాబట్టి సాంఖ్యమని పేరేర్పడింది. ప్రకృతిలోగల తత్త్వాలను లెక్కించి వాటిలో అనాత్మరూపాలను త్యజించి, పరమాత్మజ్ఞానాన్ని గ్రహించడమే సాంఖ్యవిద్య. అందువల్ల ఆత్మానాత్మ రూపమైన విజ్ఞానమే సాంఖ్యం. 

షడ్దర్శనాలలో సాంఖ్య దర్శనం ఒకటి. న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం, మీమాంస, వేదాంతం షడ్దర్శనాలు.

అవధూత - యదుసంవాదము
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Krishnudu Durnimithamulam Gani Yadavula Nella Dwarakanundi Prabhas Tirdhamunaku Bamputa - కృష్ణుడు దుర్నిమిత్తములం గని యాదవుల నెల్ల ద్వారకనుండి ప్రభాస తీర్థమునకు బంపుట

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - కృష్ణుడు దుర్నిమిత్తములం గని యాదవుల నెల్ల ద్వారకనుండి ప్రభాస తీర్థమునకు బంపుట

కాకులు, గుడ్లగూబలు పగటిపూటే బంగారుమేడలలో పెక్కువిధాలుగా ఏడుస్తున్నాయి. గుర్రాల తోకలయందు అగ్గిపుట్టింది. ఎంతో ఆశ్చర్యకరంగా(ధాన్యంలేక) అన్నం మొలకలెత్తింది. రాత్రిపూట చిలుకలు, గోరువంకలు వికృతస్వరాలతో మూర్చిల్లాయి. ఒక జంతువు వేరొక రకమైన జంతువును ఈనింది. పౌరుల ఇండ్లలో ఆకాశంనుండి అగ్నికణాలు కురిశాయి. సూర్యబింబాన్ని నల్లనిరంగు ఆవరించింది. ఇలా అపశకునాలు లేక ఉపద్రవాలు ఎన్నో కనిపించాయి. అందుచేత ఓ యాదవులారా! మీరు ఇక్కడ ఉండవద్దు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రభాసతీర్థానికి వెళ్లండి” అని శ్రీకృష్ణుడు ఆదేశించాడు.

(ప్రభాసతీర్థం గొప్ప పుణ్యక్షేత్రం. దక్షుడి శాపంవల్ల క్షయరోగం కలిగిన చంద్రుడు ప్రభాసతీర్ధంలో స్నానం చేయగానే ఆ రోగం పోయింది. ఆ మాట చెప్పి యాదవులందరినీ ఆ క్షేత్రానికి వెళ్లమన్నాడు శ్రీకృష్ణుడు.)

శ్రీకృష్ణుని మాటలు విని యాదవులు సంతోషంతో తమ బలగాలతోనూ, భార్యలు, బిడ్డలు, మిత్రులతోనూ; ఏనుగుల, గుర్రాల సమూహాలతోనూ కలసి క్రమంగా తొందరగా ప్రభాసతీర్థానికి వెళ్లారు.

ఉద్ధవుడు దివ్యజ్ఞానంతో తన మనస్సులో తెలుసుకొని లక్షీపతీ! శ్రీహరీ! ఆర్తజనుల పాలిటి కల్పవృక్షమా! పండితులను నడిపించువాడా! మాకు నీవే దిక్కని స్తుతించాడు.

కృష్ణుడు ఉద్ధవునకు పరమర్థోపదేశము సేయుట
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Vedavyaasudu Vedamulanu, Puranamulanu Lokamandu Pravartimpa Jeyuta - వేదవ్యాసుడు వేదములను, పురాణములను లోకమందు ప్రవర్తింప జేయుట

శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము -  వేదవ్యాసుడు వేదములను, పురాణములను లోకమందు ప్రవర్తింప జేయుట వ్యాసుడికి పూజ్యులైన పైల, సుమంత, జైమిని మునులూ, ధ...