Friday, July 31, 2026

Manusavarni (Suratha) - Devi Mahatmyam - మనుసావర్ణి (సురథుడు) - దేవీమాహాత్మ్యం

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - మనుసావర్ణి (సురథుడు) - దేవీమాహాత్మ్యం

స్వారోచిష మన్వంతరకాలంలో చైత్రవంశంలో సురభుడు అనే మహారాజు ఉండేవాడు. సుప్రసిద్దుడు. బలపరాక్రమశాలి, గుణగ్రాహి, ధనుర్ధారి. స్వయంగా కవి. ధనం సంపాదించడం, సంపాదించినదాన్ని యాచకులకు పంచి పెట్టడం రెండూ తెలిసినవాడు. సర్వశస్త్రాస్త్రకుశలుడు.

ఒకనాడు శత్రువులంతా కూడబలుక్కుని దండెత్తి వచ్చి ఇతడి రాజధానిని చుట్టుముట్టారు. అభిమానధనుడు సురథుడు సైన్యసమేతుడై ప్రాకారం దాటివచ్చి యుద్దానికి తలపడ్డాడు. భీషణంగా జరిగిన యుద్ధంలో కట్టకడపటికి సురథుడు ఓడిపోయాడు. సకలసంపదలూ మిత్రులకూ శత్రువులకూ హస్తగతమైపోయాయి. దిక్కుతోచని సురథుడు ఒక గుర్రాన్ని అధిరోహించి రహస్యమార్గాన అడవులకు వెళ్ళిపోయాడు. వికలమైన మనస్సుతో అడవిలో ఒంటరిగా తిరుగుతూంటే ఒక మునీశ్వరుడు చూసి ఓదార్చి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ ప్రశాంత వాతావరణంలో మునిశిష్యులతో చాలాకాలం గడిపాడు. ఒకరోజున ఆ మునీశ్వరుడు పూజ ముగించే సమయానికి సురథుడు వెళ్ళి నమస్కరించాడు.

మునీశ్వరా! ఎంతకీ దుఃఖం వదలడంలేదు. మనస్సుని బాధిస్తూనే ఉంది. తత్త్వం తెలిసినా దుఃఖాన్ని జయించే ప్రజ్ఞ కరువయ్యింది. శత్రువులు ఓడించారు. రాజ్యం అపహరించారు. ఐనా ఎందుకనో వాళ్ళపట్ల ద్వేషం కలగడంలేదు. కోపం రావడంలేదు. స్ఫుటంగా మమకారమే కలుగుతోంది. అలాగని దుఃఖం తొలిగిపోతోందా అంటే అదీ లేదు. ఇదంతా విచిత్రంగా ఉంది. ఏమి చెయ్యను? ఎక్కడికి వెళ్ళను? మనశ్శాంతి లభించే మార్గం ఏమిటి? నువ్వు వేదవేదాంగవేత్తవు. అనుగ్రహించి ఏదైనా దారిచూపించు.

సురథా! దేవీమాహాత్మ్యం చాలా అశ్చర్యకరంసుమా! ప్రాణికోటి మనస్సులను బలవంతంగా మోహానికి గురిచేన్తూ ఉంటుంది. ఈ జగత్తును సృష్టించేదీ పాలించేదీమాత్రమేకాదు నాశనం చేసేదికూడా ఆ మహాదేవియే. కామదాత్రి, మహామాయ, కాళరాత్రి, దురత్యయ, విశ్వసంహారిణి, కాళి, కమల, కమలాలయ. జగత్తు అంతా ఆవిడలోనే లీనమై ఉంటుంది. ఆవిడ నుంచే ఆవిర్భవిస్తుంది. ఆవిడలోనే లయమవుతుంది. అందుకే పరాత్పర ఆన్నారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనేగానీ ఎవ్వరూ మోహాన్ని జయంచలేరు. మోహాన్ని జయిస్తేనేగానీ మనశ్శాంతి ఉండదు.

మునివరా! ఆ దేవి ఎవరు? ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎందుకని జీవకోటిని సమ్మోహపరుస్తోంది? ఆవిడ దయకు పాత్రుడనవ్వాలంటే ఏమి చెయ్యాలి? సురథుడు ఆత్రంగా ప్రశ్నలవర్షం కురిపించాడు. మునీశ్వరుడు స్థిమితంగా బదులు పలికాడు.

సురథా! అంతా చెబుతాను. విను. కల్పాంతంలో శ్రీమన్నారాయణుడు సృష్టిని ఉపసంహరించి ఆదిశేషుడిమీద యోగనిద్రకు ఉపక్రమించాడు. అతడి చెవులనుంచి గులుగు జారిపడింది. ఆ కర్ణమలంనుంచి మధు-కెటభులనే దానవులు ఆవిర్భవించారు. భీకరభీషణాకారులు. మహాకాయులు. క్రూరాతిక్రూరులు. పుడుతూనే బ్రహ్మదేవుడిని సంహరించబోయారు. బ్రహ్మ భయపడిపోయాడు, శ్రీమన్నారాయణుడు నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఎవరిని శరణువేడాలి - అని బాగా ఆలోచించాడు. బుద్ధిలో మెరుపు మెరిసింది. నారాయణుడిని వశపరుచుకున్న నిద్రాదేవిని శరణువేడదామనుకున్నాడు.

నిద్రాదేవి! నువ్వు ఆనందస్వరూపిణివి. సర్వజంతు సమ్మోహకశక్తివి, కాళరాత్రివి, మహారాత్రివి, మోహరాత్రివి, వ్యాపినివి, మహనీయవు, మహారాధ్యవు, మహామాయవు, లజ్జ, పుష్టి, క్షమ, కీర్తి, కాంతి అన్నీ నువ్వే. కారుణ్యస్వరూపిణివి. జగద్వంద్యవు. నువ్వే జాగ్రత్స్వరూపిణివి.

ఏకాత్మవు, ఏకరూపవు, జీవాత్మపరమాత్మలు ప్రకృతిపురుషులూ నువ్వే కనక ద్వయాత్మవు, త్రివర్గ నిలయవు, తురీయ మోక్షస్వరూపవు, పంచభూతేశ్వరివి, షష్ఠేశ్వరివి, సప్తవారాధినేత్రివి అష్ట వసువులకు అధినాయికవు, నవగ్రహమయివి, నవరాగకళారూపవు, దశదిక్పూజ్యవు. ఏకాదశరుద్ర నిషేవితవు, ఏకాదశీతిథిప్రియవు, ద్వాదశభుజవు, ద్వాదశాదిత్యులకు కన్నతల్లివి. త్రయోదశగణ ప్రియవు, విశ్వేదేవులకు అగ్రణివి, చతుర్దశేంద్రులకు వరప్రదవు, చతుర్దశ మనువులకు జనయిత్రివి, పంచాధికదశీవేద్యవు, షోడశభుజవు, షోడశేందుకళామయివి, షోడశాత్మక చంద్రాంశువ్యాప్త దివ్యశరీరవు, పాడ్యమి మొదలు పూర్ణిమవరకూ అన్ని తిథులూ నువ్వే. గుణత్రయస్వరూపిణీ! నారాయణుడిని ఇప్పుడు వశపరుచుకున్నావు. ఈ రాక్షసులిద్దరూ నన్ను సంహరించబోతున్నారు. అమ్మా! నిద్రాదేవీ! కరుణించు. శ్రీమన్నారాయణుడిని విడిచిపెట్టు. మెలకువ రప్పించు.

బ్రహ్మదేవుడి ప్రార్థనను ఆలకించిన నిద్రాదేవి శ్రీమన్నారాయణుడిని విడిచిపెట్టి మధుకైటభులను ఆవహించింది. విష్ణుమూర్తి నిద్రలేచాడు. మధుకైటభులను చూశాడు. అయిదువేల సంవత్సరాలు యుద్దం చేశాడు. అయినా జయించలేకపోయాడు. అప్పుడు నిద్రాదేవి వారిని సమ్మోహపరిచింది. వారు ఆ మోహంలోపడి శ్రీహరిని వరం కోరుకోమన్నారు. శ్రీహరి వెంటనే వారి వధను వరంగా కోరాడు. నీళ్ళు లేనిచోట మమ్మల్ని సంహరించగలవు అన్నారు. శ్రీహరి తొడలు విస్తరించి చక్రం ధరించి సంహరించాడు. వారి మేదస్సుతో(కొవ్వు) కలిసింది కనక భూమికి మేదిని అనే పేరు వచ్చింది.

సురథా! మధుకైటభ సంహారంకోసం బ్రహ్మదేవుడు స్తుతిస్తే శ్రీమన్మహాదేవి ఇలా స్పందించి సహకరించింది. ఇంక ఆ దేవి సముత్పత్తి గురించి చెబుతాను. విను.

పూర్వకాలంలో మహిషుడనే మహారాక్షసుడున్నాడు. మహాబలశాలి, మహిషరూపుడు దేవతల లోకపాలకులనూ నానాహింసలూ పెట్టేవాడు. ఇంద్రాదులు రాజ్యభ్రష్టులై పారిపోయారు. బ్రహ్మదేవుణ్ణి  అగ్రభాగాన నిలుపుకుని శంకరుడిని విష్ణుమూర్తినీ శరణువేడారు. మహిషాసురుడి దురాగతాలు వింటున్న శ్రీహరికి పట్టరాని కోపం వచ్చింది. ఆ క్షణంలో అతడి నోటినుంచి ఒక మహాతేజస్సు ఆవిర్భవించింది. అలాగే బ్రహ్మరుద్రమహేంద్రాది సకలదేవతల శరీరాలనుంచీ తేజఃపుంజాలు వెలువడ్డాయి. అన్నీ వెళ్ళి ఆ మహాతేజస్సులో కలిసి ఒక ఆకారం రూపుగట్టింది. శంభుతేజస్సు ముఖంగా, యముడి తేజస్సు జుట్టుగా, శ్రీహరితేజస్సు బాహువులుగా, చంద్రతేజస్సు కుచాలుగా, ఇంద్రతేజస్సు నడుముగా, వరుణతేజస్సు తొడలుగా, భూదేవి తేజస్సు నితంబంగా(కటిప్రదేశం), బ్రహ్మతేజస్సు పాదాలుగా, వాసవతేజస్సు వేళ్ళుగా, కుబేరుడి తేజస్సు నాసికగా, ప్రజాపతి తేజస్సు దంతాలుగా, పావకతేజస్సు మూడు కన్నులుగా, సాధ్వుల తేజస్సు కన్బొమలుగా, వాయవ్య తేజస్సు చెవులుగా - ఒక స్త్రీమూర్తి సర్వతేజస్స్వరూపిణి అవతరించింది. శివుడు శూలాన్నీ, విష్ణువు చక్రాన్నీ, వరుణుడు శంఖాన్ని, అగ్నిదేవుడు శక్తినీ, వాయువు ధనుర్భాణాలనూ, ఇంద్రుడు వజ్రాయుధాన్నీ, ఐరావతం ఘంటనూ, యముడు కాలదండాన్నీ, బ్రహ్మదేవుడు అక్షమాలాకమండలువులనూ, సూర్యుడు రశ్మిమాలనూ. కాలుడు కవచఖడ్గాలనూ, సముద్రుడు వస్త్రహారాలనూ చూడామణి కుండల కటక భుజాంగ నూపుర, గ్రైవేయకాది ఆభరణాలనూ, విశ్వకర్మ ఉంగరాలనూ, హిమవంతుడు సింహవాహనాన్నీ, కుబేరుడు సురాభాండాన్నీ పానపాత్రనూ, ఆదిశేషుడు నాగహారాన్నీ - భక్తితో సమర్పించారు. ఇంకా అశేష దేవతలు అశేషాయుధాలనూ ఆభరణాలనూ బహూకరించారు. రకరకాల స్తుతులతో స్తోత్రాలతో పొగడ్తలతో ఆ మహాదేవిని ఉత్తేజపరిచారు. ఉత్సాహపరిచారు.

మహిషాసురవధను సంకల్పించి మహాదేవి భీషణనినాదం చేసింది. మహిషుడు ఆశ్చర్యచకితుడై యుద్దానికి వచ్చాడు. శస్త్రాస్త్రాలతో ఆకాశం నింపేశాడు. చిక్షురుడు సేనాపతి. ఇంకా దుర్ధర - దుర్ముఖ - బాష్కల - తామ్రక - బిడాలవదన ప్రభృతులు అసంఖ్యాకరాక్షస మహావీరులు రణరంగానికి దుమికారు. అందరినీ అవలీలగా సంహరించి మహాదేవి మహిషాసురుడిని ఎదుర్కొంది. వాడు మహామాయా, రకరకాల రూపాలతో వచ్చి యుద్ధం చేస్తోంటే ఒక్కొక్క రూపాన్నీ తునుమాడుతూ వచ్చింది. చిట్టచివరికి మహిషరూపంలో వచ్చాడు. వెంటనే పాశంతో బంధించి ఖడ్గంతో శిరస్సు నరికేసింది. మహిషాసురమర్దిని అయ్యింది. సింహనాదం చేసింది. బతికున్న రాక్షస సైనికులు హాహాకారాలు చేస్తూ పలాయనం చిత్తగించారు. దేవతలు జయజయధ్వానాలు చేశారు. శ్రీమన్మహాదేవిని బహుధా స్తుతించారు. సురథా! మహిషమర్షినిగా ఇది మహాలక్ష్మి అవతారం. ఇక మహాసరన్వతి అవతారగాథ ఏమిటంటే -

ఒకప్పుడు శుంభనిశుంభులనే రాక్షససోదరులు ఉండేవారు. మహాబలపరాక్రమ సంపన్నులు. మాయావులు. దేవతలను పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. ఇంద్రాదులు జగన్మాతను శరణువేడారు. స్తుతించారు. ప్రసన్నురాలయ్యింది. వరం కోరుకోమంది. శుంభనిశుంభులను సంహరించి మా భోగభాగ్యాలను మాకు అందించమన్నారు దేవతలు. మహాదేవి అంగీకరించింది.

శుంభనిశుంభులకు చండముండులని ఇద్దరు భృత్యులున్నారు. వారు మేరుపర్వతగుహలో దాక్కొని ఈ దృశ్యాన్ని చూశారు. దేవీ సౌందర్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. పరుగుపరుగున వెళ్ళి శుంభుడికి వర్ణించి చెప్పారు. మహాప్రభూ! అత్యద్భుత సౌందర్యరాశిని చూసి వచ్చాం. సురాసురగంధర్వ నాగయక్షమానవ జాతులలో అటువంటి అందగత్తె లేదు. ఇకముందు ఉండదు. ఆవిడను అనుభవించడానికి నువ్వు ఒక్కడివే యోగ్యుడివి. అర్హుడివి. ఆవిడను తెచ్చుకో, ఏలుకో - అని ప్రబోధించారు.

శుంభుడికి మనసయ్యింది. మహాదేవి సన్నిధికి దూతను పంపించాడు. వాడు తన ప్రభువు గుణగణాలనూ శక్తిసామర్థ్యాలనూ భోగభాగ్యాలనూ వర్ణించి చెప్పి శుంభుడిని చేపట్టి సుఖించమని ఉపదేశించాడు. అప్పుడు అమ్మవారు అందికదా -

దూతా! నువ్వు చెప్పినది అంతా బాగుంది. కానీ నాకు ఒక ప్రతిజ్ఞ ఉంది. నా బలాన్ని అపహరించి నా దర్పాన్ని ఎగరగొట్టగలిగినవాడినే నేను పెళ్ళాడతాను. అల్పుల్ని నేను అంగీకరించను. ఇది నా ప్రతిజ్ఞ. మీ ప్రభువుతో చెప్పు. ఇది నెరవేర్చి నన్ను స్వీకరించమను. వెళ్ళు.

దూతవెళ్ళి శుంభుడికి యథాతథంగా నివేదించాడు. దానవప్రభువుకు కోపం వచ్చింది. ఆ దుష్టురాలిని జుట్టుపట్టుకుని లాక్కురా - అని గర్జించి ధూమ్రాశనుడిని పంపించాడు. అరవైవేల సైన్యంతో వాడు వెళ్ళి భస్మమైపోయాడు. వర్తమానం అందింది. శుంభుడు మండిపడ్డాడు. చండ - ముండ - రక్తబీజులను వరుసగా పంపించాడు. మహాదేవి చేతిలోని త్రిశూలానికి వాళ్ళు ముగ్గురూ బలిఅయిపోయారు. ఈసారి శుంభ నిశుంభలే స్వయంగా రణరంగానికి దిగారు. భయంకరంగా పోరాడి నిహతులయ్యారు. విబుధులు సంతోషంతో మహాదేవిని వాగీశ్వరిగా కొనియాడారు.

సురథా! సృష్టిస్టితిలయకారిణి ఆ పరమేశ్వరిని నువ్వుకూడా ఆరాధించు. అంతర్బహిశ్శత్రువులు అంతరిస్తారు. మనశ్శాంతీ భోగభాగ్యాలూ లభిస్తాయి - అని మునీశ్వరుడు ఉపదేశించాడు.

నారదా! సురథుడు అప్పటినుంచీ దేవిభక్తి తత్పరుడు అయ్యాడు. జితేంద్రియుడై నిరాహారుడై ఏకాగ్రచిత్తంతో దేవేశిని ఉపాసించాడు. మృణ్మయమూర్తిని ఎట్టయెదుట నిలుపుకొని భక్తిప్రపత్తులతో పూజలు చేశాడు. తన శరీరంలోని రక్తమాంసాలను నైవేద్యం పెట్టాడు. జగన్మాతకు దయ కలిగింది. ప్రసన్నురాలై సాక్షాత్కరించింది. నీ రాజ్యం నీకు లభిస్తుందనీ నిష్కంటకంగా ఏలుకొమ్మనీ మోహం నశించి జ్ఞానం కలుగుతుందనీ వరాలు కురిపించింది. వచ్చే జన్మలో మనుసావర్ణివవుతావు. ఒక మన్వంతరాని అధిపతి వవుతావు. మంచి సంతానం కలుగుతుంది - అనికూడా ఆశీర్వదించి ఆంతర్ధానం చెందింది.

అమ్మవారు ఆదేశించినట్టే సురథుడు సావర్ణిగా జన్మించాడు. ఎనిమిదవ మన్వంతరానికి అధిపతి అయ్యాడు. ఈ ఉపాఖ్యానం చదివినవారూ విన్నవారూ దేవి అనుగ్రహానికి పాత్రులవుతారు.

వైవస్వతమనుసంతతి



Manvantaraalalo Mahadevi - మన్వంతరాలలో మహాదేవి

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - మన్వంతరాలలో మహాదేవి

శౌనకాది మహామునులారా! మొదటి మన్వంతరంలో జగన్మాత - వింధ్యవాసినిగా ఆరాధనలు అందుకుంది. మిగతా మన్వంతరాలలో ఏయే రూపాలతో ఎవరెవరి అర్చనలు అందుకున్నదో తెలియజెప్పమని నారదుడు అడిగాడు. నారాయణమహర్షి ఇలా వివరించాడు -

నారదా! స్వాయంభువుడు మొదటి మనువు. ఆయన వింధ్యవాసినిని ఆరాధించి ఆకంటకంగా రాజ్యపాలన సాగించాడు. ప్రియవ్రత - ఉత్తానపాదులు ఇద్దరూ అతడి కుమారులు. మహా తేజస్వులు. పరిపాలకులుగా సుప్రసిద్దులు. ఈ స్వాయంభువుడి తరవాత స్వారోచిషుడు రెండవ మనువు. ఇతడు ప్రియవ్రతుడి కుమారుడు. అప్రమేయ బలపరాక్రమసంపన్నుడు. కాళిందీ తీరంలో ఆశ్రమం కట్టుకుని మట్టితో దేవీవిగ్రహం చేసి దాని ఎదుటే కూర్చుని తపస్సు చేశాడు. పన్నెండు సంవత్సరాలకి అమ్మవారు అనుగ్రహించింది. కోటిసూర్యప్రభలు విరజిమ్ముతూ ప్రత్యక్షమయింది. స్వారోచిషుడికి సర్వమన్వంతరాలకూ ఆధిపత్యం ప్రసాదించింది. తారిణి అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. తరవాత ఉత్తముడు ఆనే మూడవ మనువు (ప్రియవ్రతసుతుడు) గంగాతీరంలో మూడేళ్ళు తీవ్రంగా తపస్సుచేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. నిష్కంటకంగా రాజ్యం పరిపాలించి ఉత్తమ సంతానం పొంది భోగభాగ్యాలు అనుభవించి ధర్మకార్యాలు ఆచరించి రాజర్షి పదవిని పొందాడు. ప్రియవ్రతుడి నాల్గవ కుమారుడు తామసుడు
మనువు అయ్యాడు. నర్మదానది దక్షిణతీరంలో దేవి సమర్చన చేశాడు. వసంతశరదృతువుల్లో నవరాత్రి సపర్యలు చేశాడు. స్తోత్రాలతో అనుగ్రహం సంపాదించాడు. జలజాక్షిగా అవతరించి జగన్మాత వరాలు ప్రసాదించింది. అకంటకంగా రాజ్యమేలి పదిమంది మహావీరుల్ని పుత్రులుగా పొంది ఉత్తమ లోకాలకు చేరుకున్నాడు. తామసుడి తమ్ముడు రైవతుడు అయిదవ మనువయ్యాడు. కాళిందీతీరంలోనే తపస్సు చేశాడు. సరస్వతీ బీజాక్షరంతో కలిపి అమ్మవారి మహామంత్రాన్ని రహస్యంగా జపించాడు. జగజ్జనని అనుగ్రహానికిపాత్రుడై రాజ్యాన్ని శత్రుపీడారహితంగా పాలించి సత్పుత్రుల్ని పొంది ఇంద్రలోకం చేరుకున్నాడు.

అంగపుత్రుడు చాక్షుషుడు ఆరవ మనువయ్యాడు. సుపులహుడు అనే బ్రహ్మర్షిని శరణువేడాడు. సిరిసంపదలు కలిగే ఉపాయం చెప్పమనీ సమస్తమేదినీమండలానికీ ఆధిపత్యం లభించే తెరువు చూపమనీ అవ్యాహతబుజబలం శస్త్రాస్త్రనైవుణ్యం కావాలనీ ఉత్తమసంతానం అఖండయౌవనం జన్మాంతంలో మోక్షం - ఇవి నా అభిలాషలనీ అభ్యర్థించాడు. ఆ బ్రహ్మర్షి - వాగ్భవబీజయుక్షంగా మహాదేవీ మూలమంత్రాన్ని జపించమనీ త్రిమూర్తులకూ ఆయా శక్తులు అందువల్లనే లభించాయనీ నీకూ అలాగే కోరికలన్ని తీరతాయనీ ఉపదేశించాడు. చాక్షుషుడు విరజానదీ తీరానికి వెళ్ళి దీక్షతో తీవ్రతపస్సు చేశాడు. కేవలం రాలిపడిన ఆకులూ అలములూ తింటూ ప్రాణాలు నిలుపుకుని జపం సాగించాడు. మొదటి సంవత్సరం గడిచింది. రెండవ సంవత్సరమంతా కేవలం నీరు తాగి, మూడవ యేడు అదికూడా మానేసి గాలినిమాత్రమే పీలుస్తూ స్థాణువులా నిలబడి తపస్సు చేశాడు. ఇలా పన్నెండేళ్ళు గడిచాయి. అప్పుడు శ్రీపరమేశ్వరి సాక్షాత్కరించింది. వరం కోరుకోమంది.

మహాదేవీ! నువ్వు సర్వాంతర్యామివి. నా కోరికలు ఏమిటో తెలుసు. అయినా అడగమన్నావు కనక అడుగుతున్నాను. మన్వంతరరాజ్యం కావాలి. సద్గుణసంపన్నులూ మహావీరులూ దేవీభక్తి తత్పరులూ ఆయిన పుత్రులు కావాలి. భోగభాగ్యాలు అనుభవిస్తూ శత్రుపీడారహితంగా రాజ్యాన్ని పరిపాలించాలి. జన్మాంతంలో ముక్తి కలగాలి. దేవేశీ! అనుగ్రహించు - అని అభ్యర్థించాడు చాక్షుషుడు. అమ్మవారు అన్ని వరాలూ ఇచ్చి అంతర్ధానం చెందింది. చాక్షుషుడు మనువుల్లోకెల్లా మాన్యుడయ్యాడు. అతడి కొడుకులు సమర్ధులనిపించుకున్నారు. మన్వంతరకాలం రాజ్యంచేసి చాక్షుషుడు దేవీప్రసాదంవల్ల ముక్తిపాందాడు.

నారదా! వైవస్వతుడు ఏడవ మనువు. సావర్ణి ఎనిమిదవ మనువు. వీరిద్దరూ దేవీ సమర్చనతోనే మన్వంతరాలకు ఆధిపతులయ్యారు. వీరిలో సావర్ణిది జన్మాంతరారాధన. అందుకని పుట్టుకతోనే మన్వంతరపతి అయ్యాడు. ఈ కథ ఏమిటంటే -

మనుసావర్ణి (సురథుడు) - దేవీమాహాత్మ్యం



Agastsudi Dakshinapadhayatra - అగస్త్సుడి దక్షిణాపథయాత్ర

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - అగస్త్సుడి దక్షిణాపథయాత్ర

దేవతలు వెళ్ళాక అగస్త్యుడు ధర్మపత్ని లోపాముద్రను పిలిచాడు. రాకుమారీ! మన కాశీనివాసానికి విఘ్నం రానే వచ్చింది. వింధ్యపర్వతం సూర్యుడి దారికి అవరోధం కలిగించిందిట. దానిని తొలగించమని దేవతల ఆజ్ఞ. మనం వెళ్ళక తప్పదు. కాశీ గురించి పూర్వీకులు చెప్పినమాట వాస్తవం. కాశీలో నివసించేవారికి విఘ్నాలు చాలా వస్తాయి. అయినా ముముక్షువులు అవిముక్తాన్ని (కాశీని) విడిచిపెట్టకూడదు - అన్నారు.

అన్నట్టుగానే అంతరాయం రానే వచ్చింది. సరే పద, దక్షిణాపథానికి బయలుదేరదాం - అన్నాడు. ఇద్దరూ కలిసి మణికర్ణికలో స్నానంచేసి విశ్వేశ్వరుణ్ణి దర్శించారు. అటుపైని దండపాణిని అర్చించారు. కాలభైరవమూర్తిని సందర్శించారు.

కాలరాజా! మహాబాహూ! భయనాశకా! కాశీ పట్టణానికి నువ్వు ప్రభువువు. కాశీవాసులకు కలిగే విఘ్నాలను అన్నింటినీ తొలగించేవాడవు. భక్తులను రక్షించేవాడవు. నన్నెందుకు దూరం చేస్తున్నావు స్వామీ! నేను చేసిన అపరాధం ఏమిటి? ఎవరిమీదనైనా అపవాదులు వేశానా? అసత్యాలు పలికానా? లోభగుణానికి లొంగిపోయానా? ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష విధిస్తున్నావు? ఎందుకు వెళ్ళగొడుత్తున్నావు?

సాక్షిగణపతీ! విఘ్ననివారణా! నీకూ కోపమే వచ్చిందా? కాశీని విడిచివెళ్ళవలసిన అవసరాన్ని ఎందుకు కల్పించావు?

ఆ మునిదంపతులు ఇలా కాశీదేవతలనందరినీ దర్శించి ప్రార్థించి విన్నపాలు చేసుకుని దక్షిణదిక్కుకు బయలుదేరారు. కాశీని విడిచిపెట్టవలసి వస్తోందే అన్న బాధ అనుక్షణం వారిని పీడించింది. గుండె దిటవు పరుచుకుని ప్రయాణం సాగించారు. అడుగడుగునా కాశీని తలచుకుంటూనే నడిచారు. కొంతదూరం వెళ్ళాక నడక చాలించి తపశ్శక్తినే విమానం చేసుకుని ఆకాశమార్గాన దక్షిణాపథం వైపు వచ్చారు.

నిముషన్నరలో ఎట్టయెదుట వింధ్యపర్వతం కనిపించింది. ఆకాశానికి తన్నుకుని నిలబడి ఉంది. మునిదంపతులు ఆశ్చర్యచకితులై చూస్తూ నిలబడ్డారు.

అగస్త్యుడిని ఆల్లంతదూరంలోనే చూసిన వింధ్యుడు వొణికిపోయాడు. మహర్షికి మర్యాదలు చెయ్యాలి. స్వాగతం పలకాలి. ఎలాగ? ఎలాగ? అని కంగారుపడ్డాడు. తనను తాను కుంచించుకుని వినయంగా భక్తిగా సాష్టాంగపడ్డాడు. అగస్త్యుడి మనస్సు ప్రసన్నమయ్యింది. ముఖం విప్పారింది.

వత్సా! దక్షిణాపథానికి వెళ్ళి నేను తిరిగి వచ్చేవరకూ నువ్వు ఇలాగే ఉండు. ఆకాశానికి అడ్డంగా ఎదిగి ఎత్తుగా నువ్వుంటే నీ శిఖరాలను అధిరోహించి దాటివెళ్ళగలిగిన ఓపిక నాకులేదయ్యా. అందుకని పుత్రకా! నేను వెళ్ళివచ్చేవరకూ నువ్వు ఇలాగే ఉండు - అని చెప్పేసి లోపాముద్రాగస్త్యులు వింధ్యను దాటి దక్షిణదిశకు వచ్చేశారు. శ్రీశైలాన్ని దర్శించి మలయాద్రి మీద ఆశ్రమం నిర్మించుకుని కాపురం ఉన్నారు.

అగస్త్యుడి అభ్యర్థనమేరకు శ్రీ మన్మహాదేవి వింధ్యపర్వతాన విడిది చేసింది. భక్తాగ్రేసరుడి అర్చనలకు తానై అందుబాటులో నిలిచింది. వింధ్యవాసినిగా ప్రసిద్దికెక్కింది. 

స్వాయంభువమనువు ఈ వింధ్యవాసినినే ఉపాసించాడని నారాయణమహర్షి నారదుడికి చెప్పిన వృత్తాంతాన్ని సూతుడు శౌనకాది మహర్షులకు వినిపించాడు. ఈ ఉపాఖ్యానం పుణ్యప్రదం. పాపనాశకం. రాజులకు విజయాన్నీ ద్విజులకు జ్ఞానాన్నీ వైశ్యులకు ధనధాన్యసమృద్దినీ మిగిలినవారికి సుఖసంతోషాలనూ కలిగిస్తుంది. ఒక్కసారి చదివినా విన్నా చాలు - అని ఫలశ్రుతి కూడా చెప్పాడు.

మన్వంతరాలలో మహాదేవి



The Story of Vindhyachala - వింధ్యాచల వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - వింధ్యాచల వృత్తాంతం

మహామునులారా! పర్వతాలలోకెల్లా గౌరవాస్పదమైనది వింధ్యపర్వతం. దట్టంగా అడవులు, మహావృక్షాలు, ఫలపుష్పభరితంగా లతలూ పొదలూ. వరాహ మహిష వ్యాఘ్ర శార్దూల వానర శశక ఋక్ష(ఎలుగుబంటి) శృగాలాది(నక్క) జంతువులు. శుకశారికాది పక్షులు. అన్ని ప్రాణులకు తుష్టినీ పుష్టిని కలిగించే మహాపర్వతం. నదీనదజలాలతో ఇసుకతిన్నెలతో దేవగంధర్వ కిన్నర కింపురుషాప్సరో జాతులను ఆకర్షించే గిరిరాజం.

లీలావినోదంగా లోకాలన్నీ పర్యటించే నారదుడు ఒకనాడు వింధ్యాద్రికి వచ్చాడు. వింధ్యుడు ఎదురేగి అర్ఘ్యపాద్యాది అతిథిసత్కారాలు జరిపి సముచితాసనంమీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేశాడు.

దేవర్షీ! ఎక్కడినుంచి ఎక్కడికి వెడుతూ ఇక్కడికి వచ్చావు? నీ రాకతో నా మందిరం పావనమయ్యింది. సూర్యుడిలా నిరంతరం నువ్వు సంచరిస్తూనే ఉంటావు. నీ సంచారం ప్రాణికోటికి అభయప్రదం. మహానుభావా! సృష్టిలో నీకు తెలియని వింతలూ విడ్డూరాలూ ఉండవు. అటువంటి అపూర్వమూ అద్భుతావహమూ వృత్తాంతమేదైనా ఒకటి చెప్పి చెవులకు విందుచెయ్యి.

వింధ్యాద్రీ! నేనిప్పుడు బంగారుకొండ మేరుపర్వతంనుంచి వస్తున్నాను. ఆ శిఖరంమీద ఇంద్రాగ్నియమవరుణలోకాలున్నాయి. అష్టదిక్పాలకులకూ భవనాలున్నాయి. అవ్వి భవనాలంటే భవనాలా? సకల భోగాలకూ భువనాలు - అని చెప్పి నారదుడు గట్టిగా నిట్టూర్చి ఊరుకున్నాడు.

అదేమిటి దేవర్షి! అలా నిట్టూర్చావు. కారణం ఏమిటి? అని సంభ్రమంగా ఆడిగాడు వింధ్యాద్రి.

నారదుడికి ముఖం విప్పారింది. అద్రిరాజా! ఏమి చెప్పమంటావ్‌! హిమవంతుడున్నాడా, పార్వతీదేవికి తండ్రి, శివుడంతటివాడికి మామగారూను. కదా! ఆ శివుడి సంబంధంతో హిమవంతుడు పరమ పూజ్యుడయ్యాడు. అలాగే కైలాసమూను. అది శివుడికి సాక్షాత్తు నివాసభవనమాయె. పూజ్యుడయ్యాడు, పాపవినాశకుడనే కీర్తి పొందాడు. ఇలాగే నిషధ - నీల - గంధమాదనాదులూ ఏవేవో ప్రత్యేకతలతో మన్ననలు అందుకుంటున్నాయి. ఎవరి గౌరవం వారికి దక్కుతోంది. బాగానే ఉంది. కానీ ఆ మేరుపర్వతం ఏమిటో మరీ విర్రవీగుతోంది. విశ్వాత్మకుడు సూర్యుడు గ్రహబృందాలతో నక్షత్రగణాలతో సహా తనచుట్టూ తిరుగుతూ ఉంటాడట. తానేమో కనకపర్వతంట. అన్ని పర్వతాలలోకీ తానే ఉత్తమోత్తమమంట. శ్రేష్ఠంట, వరిష్ఠంట. తనకు సాటివచ్చే పర్వతం మరొకటి ఈ సృష్టిలోనే లేదుట. ఏమిటో ఇలాగ తనకుతాను భావించేసుకుని తెగవిర్రవీగిపోతున్నాడు ఆ మేరుపర్వతరాజు. జ్ఞాపకంవచ్చి నిట్టూర్చాను. అంతకన్నా ఏమీ లేదులే వింధ్యపర్వతరాజా! అయినా నాలాంటి తపస్వులకు ఇలాంటి గొడవలతో పనేమిటి చెప్పు? ఏదో ప్రసంగవశాత్తూ వచ్చింది కాబట్టి, ఆదయినా నువ్వు అడిగావు కాబట్టీ ఈ మాటన్నా చెప్పాను. వెళ్ళొస్తా.

ఈ మాటకాస్తా చెప్పేసి స్వైరచారి దేవర్షి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వింధ్యుడికి మనన్సు కుతకుతలాడిపోయింది. లోపల లోపల చిచ్చు రగుల్కుంటోంది. శాంతి లేదు. ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? మేరువుని జయించడం ఎలాగ? అందాకా శాంతిలేదు. సౌఖ్యం లేదు. ఓడించకపోతే నా ఉత్సాహం ఎందుకు, నా మానాభిమానాలు ఎందుకు, నా కీర్తి ఎందుకు, నా కులం ఎందుకు, నా బలం ఎందుకు, నా పౌరుషం ఎందుకు. నా జ్ఞానం ఎందుకు, నా వంశం ఎందుకు? ఇలా మథనపడుతుండగా అతడి మనస్సులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. దోషకారిణి బుద్దిపుట్టింది.

రోజూ సూర్యుడు గ్రహనక్షత్ర బృందాలతో ప్రదక్షిణం చేస్తాడుటగదా ఆ మేరువుకి. సరే. ఆ సూర్యుడి మార్గానికి అడ్డం నిలుస్తాను. ఎలా ప్రదక్షిణం చేస్తాడో చూస్తాను. మేరువుకి గర్వభంగం చేసాను.

ఈ బుద్ది పుట్టడమేమిటి. వెంటనే వింధ్యాద్రి ఆకాశానికి ఎదిగింది. కొండకొమ్ములతో ఆవరించింది. సూర్యుడు ఉదయించనీ, ఎటు కదులుతాడో చూస్తాను - అని ఆకాశాన్ని తన్నిపెట్టుకు నిలబడింది.

రాత్రి గడిచింది. నిర్మలంగా తెలవారింది. దిక్కులు తేటపడ్డాయి. తూర్పుకొండనుంచి సూర్యరథం కదిలింది. కిరణాలు దశదిశలకూ పరుచుకున్నాయి. పద్మాలు వికసించాయి. కలువలు ముకుళించాయి. లోకులు తమతమ పనులకు ఉపక్రమించారు.

పూర్వాహ్ణ అపరా
హ్ణ మధ్యాహ్న విభాగం కల్పించి హవ్య కవ్య భూతబలులను దేవతలకు వృద్దిపరిచే సూర్యుడు తూర్పునుంచి కదిలి ఆగ్నేయానికి సాగి అక్కడినుంచి దక్షిణదిశగా ప్రయాణం సాగించాడు. అతడు వచ్చి వెడుతూంటే దిక్కాంతలు విరహవేదనకు లోనవుతున్నారు. దక్షిణదిశగా వెడుతున్న రథం హఠాత్తుగా ఆగిపోయింది. సారథి అనూరుడు ఒక్కపెట్టున అరిచాడు.

సూర్యదేవా! వింధ్యపర్వతం ఎదిగి ఆకాశమార్గాన అదిగో అడ్డంగా నిలిచింది. నీ ప్రదక్షిణం కోరి మేరువుతో పోటీపడుతున్నట్టుంది.

సూర్యుడు ఆశ్చర్యపోయాడు. ఆకాశమార్గంలోకూడా అడ్డంకులా! అవునుమరి అభివృద్ధి చెందుతున్న శూరుడు ఏదైనా సాధిస్తాడు. అతడికి అసాధ్యం ఏదీ ఉండదు. రథం ఆగిపోయింది. దేవుడే కాపాడాలి. దైవమే బలీయం. రాహువు బాహువులు సాచి కబళించినా క్షణకాలమైనా ఆగని నేను ఇప్పుడిలా అడ్డగింపబడ్డానంటే విధి బలీయం కాక మరింకేమిటనుకోను!

సూర్యుడు ఆగిపోయాడు. ఏ లోకానికీ దిక్కుతోచలేదు. ఎవరిని శరణువేడాలి? కర్తవ్యం ఏమిటి? ఏమీ తోచలేదు. మానవులేకాదు చిత్రగుప్తాదులుకూడా సూర్యుణ్ణిబట్టే కాలాన్ని గణిస్తారు. ఇప్పుడు ఏమి చెయ్యాలో వారికి పాలుపోలేదు. ఒక పర్వతం సూర్యభగవానుడిని అడ్డుకోవడమా! ఆహా! దైవవిపర్యయం!

జగత్తు స్తంభించిపోయింది. స్వాహా స్వధాకారాలు లేవు. ఇది పశ్చిమ దిక్కువారి అవస్థ. ఇక దాక్షిణాత్యుల పరిస్థితి ఏమిటంటే - రాత్రి తరగడం లేదు. మెలకువ వచ్చినా వేకువ కావడం లేదు. తూర్పు ఊత్తర దిక్కులవారు నిలబడిపోయిన సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక అల్లాడుతున్నారు. ఏ రకంగానైనా మొత్తం ప్రజానీకమంతా మృతమూ నష్టమూ భగ్నమూ వినాశమూ ఆయిపోతోంది. అంతటా హాహాకారాలే వినవస్తున్నాయి. సంధ్యావందన హోమాదిక్రతువులు ఆగిపోయాయి. దానితో ఇంద్రుడీతోసహా దేవతలంతా ఏమి చెయ్యాలోతోచక మడమలు తొక్కుకున్నారు.

శౌనకాది మహామునులారా! పరిస్థితి ఇలా విషమించడంతో ఇంద్రాది దేవతలందరూ కలిసి సృష్టికర్తను ముందు నిలుపుకుని రుద్రుణ్ణి శరణువేడారు.

ఉమాలలిత పంకజా! గణాధ్యక్షా! అష్టసిద్ధి విభూతిదాతా! మహామాయావిలాసస్థానమా! పరమాత్మా! వృషాంకా! అమరేశా! కైలాసవాసా! అహిర్బుధ్నా! మాన్యా! మనూ! మానదా! అజా! స్వాత్మారామా! శంభూ! గణనాధా! దేవా! గిరీశా! మహావిష్ణుస్తుతా! విష్ణుహృదయపద్మనివాసా! మహాయోగరతా! యోగగమ్యా! యోగివిభూ! యోగీశా! యోగఫలప్రదా! దీనరక్షాపరా! దయా సాగరా! ఆర్తిప్రశమనా! ఉగ్రవీర్యా! గుణమూర్తీ! వృషధ్వజా! కాలస్వరూపా! కాలకాలా! నమో నమః, నమో 
నమః - అంటూ అందరూ సాగిలపడ్డారు.

ఉబ్బులింగడు పరవశించాడు. చిరునవ్వులు చిందించాడు. దేవతలారా! మీ స్తోత్రం నన్ను అలరించింది. ప్రసన్నుడిని అయ్యాను. మీ మనోరథాలు ఏమిటో చెప్పండి. తీరుస్తాను - అన్నాడు గంభీరంగా.

సర్వదేవేశా! గిరీశా! శశిమౌళీ! ఆర్తులకు సుఖసంతోషాలు(శమ్‌) కలిగిస్తావు కనక శంకరుడవయ్యావు. ఇప్పుడు మేమంతా ఆర్తులము. నిన్ను శరణు అంటున్నాం. మాకు శమ్‌ కలిగించు. వింధ్యపర్వతమని ఒకటి ఉంది. మేరువుతో దానికి పంతమూ పోటీ. అదిప్పుడు శరీరం పెంచి సూర్యగమనాన్ని నిరోధించింది. లోకాలన్నీ అల్లల్లాడిపోతున్నాయి. దాని విజృంభణాన్ని నిలువరించు. లోకాలకు మేలు చెయ్యి. సూర్యుడే ఆగిపోతే ఇక కాలజ్ఞానం ఎలాగ? యజ్ఞయాగాలులేక స్వాహా స్వధాకారాలులేక మేమంతా జీవించేది ఎలాగ? ఎవరిని శరణువేడాలి అని ఆలోచిస్తే మాకందరికి నువ్వే స్ఫురించావు. ఈ ఆపద తొలగించడానికి నువ్వే సమర్ధుడవు. మాకు మరొక దిక్కులేదు. కాపాడు.

దేవతలారా! మీకు నామీద ఉన్న నమ్మకానికి సంతోషమే కానీ నాకు అంతటి శక్తిలేదు. ఏ పర్వతాన్నయినా అణిచివెయ్యగల సమర్ధుడు రమాకాంతుడొక్కడే, అతడే మనకందరికీ ప్రభువు. సర్వకారణకారణుడు. నేనూ వస్తాను. పదండి. వైకుంఠానికి వెడదాం. శ్రీహరితో విన్నవించుకుందాం. కష్టాలు కడతేరుస్తాడు - అనడమేమిటి శివుడివెంట దేవతలందరూ బయలుదేరి వేగంగా వైకంఠం చేరుకున్నారు.

విష్ణుమూర్తీ! జయము, జయము రమావల్లభా! శరణు, శరణు మహాపురుషా! దైత్యారీ! కామజనకా! సర్వకామఫలప్రదా! మహావరాహా! గోవిందా! మహాయజ్ఞస్వరూపకా! మహావిష్ణు! ధ్రువేశా! జగదుత్పత్తి కారణా! మత్స్యావతారం ధరించి వేదాలను ఉద్దరించావు. సత్యవ్రతా! ధరాదీశా! సురకార్యసాధకా! అమృతాప్తికరా! ఈశానా! నమో నమః. ఆదిదైత్యుడిని సంహరించడానికి ఆదినూకరరూపం ధరించినవాడా! భూమీ భారవాహా! కూర్మరూపా! హిరణ్యకశిపుడిని మట్టుబెట్టడానికి నరసింహావతారం ఎత్తినవాడా! బలిచక్రవర్తిని కికురించడానికి వామనమూర్తివైనవాడా! దుర్మార్గులైన క్షత్రియుల్ని అంతమొందించడానికి రేణుకాజమదగ్నులకు పుత్రుడవైన పరశురామా! దశకంధర సంహారంకోసం భూలోకాన అవతరించిన దాశరథీ! కంసదుర్యోధనాది రాక్షసాంశలను తునిమి భూభారం తొలగించడానికీ ధర్మసంస్థాపనకూ కృష్ణావతారం ధరించినవాడా! పశుహింసను వారించి దుష్టయజ్ఞాలను నిషేధించిన బుద్దావతారా! దుష్టుల పాలనలో మగ్గిపోతున్న లోకాన్ని కాపాడటంకోసం కల్కిరూపం ధరించినవాడా! శిష్టరక్షణకూ దుష్టశిక్షణకూ దశావతారాలు ఎత్తి సర్వదుఃఖహరుడవయ్యావు. భక్తుల ఆర్తిని తొలగించడంకోసం స్త్రీజన్మలేకాదు జలజంతువుల రూపాలనుకూడా ధరించావంటే నీకంటే దయానిధులుంటారా? భక్తార్తిహరా! నమో నమః, నమో నమః - దేవతలు భక్తిప్రపత్తులతో స్తుతించి సాష్టాంగపడ్డారు.

గదాధరుడు ప్రసన్నుడయ్యాడు. మందహాసం చిందించాడు. దేవతలారా! నేను ప్రసన్నుడిని అయ్యాను. మీకింక భయంలేదు. వేదనలన్నీ మరిచిపాండి. భరింపరాని మీ దుఃఖాన్ని తొలగిస్తాను. ఎంతటి దుర్లభమైన వరమయినా సరే - ఇస్తాను. కోరుకోండి. మీ స్తోత్రము ఇంతగా నన్ను ఆనందింపజేసింది. వరువాత లేచి శుచియై ఈ స్తవాన్ని పఠించినవారికి ఏ దుఃఖాలూ రావు. అనారోగ్యంకానీ దారిద్య్రంకానీ వారి ఇళ్ళ దరిదాపులకైనా రావు. దుష్టగ్రహ భూతప్రేత పీడలు ఉండవు. మంచి సంతానంతో భోగభాగ్యాలతో సుఖాలనుభవిస్తూ చిరకాలం జీవిస్తారు. వెయ్యేల, ఈ స్తోత్రం సర్వార్థసాధకం. భుక్తిముక్తి ప్రదాయకం, విబుధులారా! మీ మనస్సులో బాధ ఏమిటో చెప్పండి. తప్పకుండా తొలగిస్తాను. అణుమాత్రం కూడా సందేహించకండి.

శ్రీహరి ప్రసంగంతో ఇంద్ర రుద్ర బ్రహ్మాదిదేవతలకు ఉత్సాహం కలిగింది. వింధ్య వృత్తాంతం విన్నవించారు.

దేవదేవా! మహావిష్టూ! సృష్టిస్థితిలయకారణా! వింధ్యపర్వతం సూర్యభగవానుడిని అడ్డుకుంది. మేమంతా భోగభాగ్యరహితులమైపోయాం. ఏమి చెయ్యాలో ఎక్కడికి పోవాలో దిక్కుతోచక నీ సన్నిధికి వచ్చాం. నువ్వే కాపాడాలి - అని మొరపెట్టుకున్నారు.

దేవతలారా! చరాచరజగత్తుకంతటికీ కన్నతల్లి శ్రీమన్మహామాత. ఆ దేవిని నిరంతరం అర్చించే అగస్త్యమహర్షి వారణాసిలో ఉన్నాడు. మహాతేజస్వి. అతడు వింధ్యగర్వాన్ని అణగ్గొడతాడు. ముక్తిధామమైన అ కాశీకి వెళ్ళి అగస్త్యుణ్ణి అభ్యర్థించండి.

విష్ణుమూర్తి చెప్పిన ప్రకారం దేవతలందరూ కాశీకి వెళ్ళారు. భక్తియుక్తులై మణికర్ణికలో సచేలస్నానాలు చేశారు. దేవపితృతర్పణాలు విడిచిపెట్టారు. దానధర్మాలు చేశారు. అగస్త్యుడి ఆశ్రమం చేరుకున్నారు. ప్రశాంతమైన వాతావరణం. గుబురుగా ఎదిగిన చెట్లు. మయూర సారస హంస చక్రవాకాలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వ్యాఘ్ర శార్దూలాది క్రూరమృగాలు సైతం నిశ్శబ్దంగా ప్రసన్నంగా తపస్వుల్లాగా ఉన్నాయి. కుటీరంలో మహర్షి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. దేవతలు ఆట్టే అలికిడి చెయ్యకుండా వెళ్ళి సాష్టాంగపడ్డారు.

బ్రాహ్మణోత్తమా! పరమపూజ్యా! వాతాపి బలనాశకా! కుంభసంభవా! లోపాముద్రాపతీ! మిత్రావరుణనందనా! సర్వవిద్యానిధీ! శాస్త్రనిధీ! నువ్వు ఉదయిస్తే జలప్రవాహాలు తేరుకుంటాయి. రెల్లు దుబ్బులు వికసిస్తాయి. రావణుడంతటివాడు నీ భక్తుడు. జటామండలధారీ! శిష్యబృందవిహారీ! నమో నమః. దేవతాస్తుత్యగుణరాశీ! ఆపోశితవారాశీ! (సముద్రాలను ఆపోశనం పట్టినవాడా) శరణు. శరణు. స్వామీ! శరణు. శరణు. వింధ్యపర్వతానికి గర్వభంగం చేసి లోకాలను కాపాడు.

దేవతల స్తుతిని అభ్యర్థననూ ఆలకించిన అగస్త్యుడు ప్రసన్నుడై మెల్లగా కన్నులు విప్పాడు. మీరంతా ఉత్తమోత్తములు, దేవతలు త్రిభువనేశ్వరులు, లోకపాలకులు, మహాత్ములు, నిగ్రహానుగ్రహ సమర్థులు తిరుగులేని వజ్రాయుధం చేతబట్టిన ఇంద్రుడున్నాడు. హవ్యకవ్య వాహకుడు అగ్ని ఉన్నాడు. దేవతలకు అతడేకదా ముఖస్థానీయుడు. రాక్షసగణాలను గడగడలాడించగలిగిన వరుణుడున్నాడు. యముడున్నాడు. వీరిలో ఏ ఒక్కరు తలచుకున్నా వింధ్యపర్వతానికి శృంగభంగమైపోతుందే. అలాంటిది అందరూవచ్చి నన్ను కోరుతున్నారంటే వింతగా ఉందే!

మహర్షీ! వింత ఏమీలేదు. ఇది మాకెవ్వరికీ సాధ్యంకాదు. విష్ణుమూర్తి సూచనపై నిన్ను అభ్యర్థిస్తున్నాం. నువ్వే సమర్ధుడివి. నిశ్చేష్టమైపోయిన ముల్లోకాలనూ కాపాడే శక్తి నీకే ఉంది. సూర్యుడికి గతి కల్పించు. వింధ్యుడికి సన్మతి పుట్టించు. నీ తేజస్సుకి లొంగుతాడు. నమ్రుడవుతాడు. కేవలం ఈ పనిమీదనే వచ్చాం. ఉపకారం చేసిపెట్టు. చెయ్యాలి. తప్పదు - దేవతల విజ్ఞప్తిని అగస్తుడు అంగీకరించాడు. సరే అన్నాడు. విబుధుల అంతరంగాలు తేలికపడ్డాయి. తృప్తిగా ఊపిరి పీల్చుకుని తిరిగి వెళ్ళారు.

అగస్త్సుడి దక్షిణాపథయాత్ర



Thursday, July 30, 2026

Vindhyavasini - వింధ్యవాసిని

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - వింధ్యవాసిని

శ్రీహరి నాభిపద్మం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయన జగన్నిర్మాత. సృష్టికర్త. లోకపితామహుడు. చతుర్ముఖుడు. ఆ పరమేష్ఠినుంచి స్వాయంభువమనువు మానసపుత్రుడుగా అవతరించాడు. ఆ మనువుకి ధర్మపత్నిగా ధర్మస్వరూపిణి శతరూప ఆవిర్భవించింది. కొంతకాలం గడిచాక క్షీరసముద్రతీరంలో పరమపావన ప్రదేశంలో తపస్సు చేయనారంభించాడు. మహాభాగ్యప్రద దేవిని ఆరాధించాడు. మట్టితో దేవీమూర్తిని తయారుచేసి ఉపాసించాడు. వాణీబీజసహితంగా మహామంత్రాన్ని మనస్సులో జపించసాగాడు. నిరాహారుడై శ్వాసను బంధించి ఒంటికాలిమీద వర్షంలో నిలిచి నూరేళ్ళు తపస్సు చేశాడు. కామక్రోధాలను జయించాడు. నిరంతరం దేవీపాదపద్మాలనే హృదయంలో ధ్యానిస్తూ స్థావరమైపోయాడు. అమ్మవారికి అనుగ్రహం కలిగింది. దర్శనమిచ్చింది. వరంకోరుకోమంది. ఆ మహారాజు ఆనందపరవశుడు అయ్యాడు. అమరులకైనా అందని వరాలు ఆడిగాడు.

జయదేవి విశాలాక్షి జయ సర్వాంతరస్థితే ।
మాన్యే పూజ్యే జగద్దాత్రి సర్వమంగళమంగళే ॥

దేవీ! జయము జయము. విశాలాక్షీ! సర్వాంతర్యామీ! మాన్యా! పూజ్యా! జగన్మాతా! సర్వమంగళా! జయము - జయము. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించగలుగుతున్నాడన్నా శ్రీహరి పరిపాలిస్తున్నాడన్నా హరుడు సంహరించగలుగుతున్నాడన్నా ఇంద్రుడు ముల్లోకాలనూ శాసిస్తున్నాడన్నా - అంతా నీ కృపాకటాక్షమే. దిక్పాలకులతోసహా అందరూ నీ అంశలే. నీ వల్లనే వారంతా శక్తిమంతులవుతున్నారు. అటువంటి నువ్వు నాకు వరమిస్తానంటే నాజన్మ ధన్యమయ్యింది. నాదొక్కటే వరం. బ్రహ్మమానసపుత్రుడుగా నేను చెయ్యబోయే సృష్టి నిర్విఘ్నంగా కొనసాగుగాక! నేను జపించిన నీ మంత్రాన్ని ఎవరు ఉపాసించినా వారికి సత్వరంగా సకలసిద్దులూ కలుగుగాక! ఈ సంవాదాన్ని విన్నా చదివినా భుక్తిముక్తులు లభించుగాక! జాతి స్మరత్వం వక్తృత్వం సౌష్టవం జ్ఞానసిద్ధి కర్మమార్గసంసిద్ధి కలుగుగాక! పుత్రపౌత్రాదులతో వంశాభివృద్ది జరుగుగాక!

మహాదేవి ఈ వరాల నన్నింటినీ అనుగ్రహించింది. నీ రాజ్యం నిష్కంటకమగుగాక, నీ పుత్రులు వంశకరులగుదురుగాక, నీ భక్తి నిశ్చలంగా నిలిచి ముక్తినిచ్చుగాక అని ఆశీర్వదించి స్వాయంభువ మనువు చూస్తుండగానే వింధ్యపర్వతాలకు వెళ్ళిపోయింది.

నారదా! వింధ్యాద్రిని నువ్వు ఎరుగుదువుగదా! ఒకప్పుడు ఆకాశానికి ఎదిగి సూర్యుడి రథాన్ని అడ్డుకొని గమనాన్ని నిరోధించిన మహాపర్వతం. ఆ పర్వతంమీద అమ్మవారు నివసిస్తుంది. కనకనే వింధ్యవాసినీదేవి అనేపేరు ఏర్పడింది.

నారాయణమహర్షి మాటలుగా సూతుడు ఈ విషయాన్ని చెప్పేసరికి వింటున్న శౌనకాది మహామునులకు వింధ్యపర్వతం కథ తెలుసుకోవాలి అనిపించింది.

సూతమహార్షీ! వింధ్యాచలం ఏమిటీ, ఆకాశానికి ఎదగడమేమిటీ, సూర్యరథాన్ని ఆపడమేమిటి, ఎందుకు ఆపినట్టూ ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయి. అలా ఎదిగిపోయిన పర్వతాన్ని మళ్ళీ ఎవరు కుదించారు? అంతా వివరంగా చెప్పు. నీ ముఖచంద్రమండలంనుంచి జాలువారుతున్న ఈ దేవీచరితమనే అమృతాన్ని ఎంతగ్రోలినా తృప్తి తీరడంలేదు. సవిస్తరంగా తెలియజెయ్యి అని అభ్యర్థించారు.

వింధ్యాచల వృత్తాంతం



SRI DEVI BHAGAVATHAM PART 10 - శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము

శౌనకాది మహామునులారా! శ్రద్ధగా వింటున్నారుగదా! నారదుడు మరికొన్ని ప్రశ్నలు వేశాడు అంటూ సూతుడు తన కథనం నడిపించాడు.

నారాయణమహర్షీ! దుర్గాదేవి మహిమలూ పూజాక్రమమూ తెలుసుకున్నాను. మన్వంతరాలన్నింటా ఆ మహాదేవి ఉంటుంది అన్నావు. ఏయే రూపాలతో ఉంటుంది? ఎలా ప్రాదుర్భవిస్తుంది? ఎలా పూజిస్తే ఏ కోరికలు తీరుస్తుంది? తెలియజెప్పి నావంటి భక్తులను అనుగ్రహించు - అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణమహర్షి మునుపటిలాగానే మందహాసం చిందించి -

నారదా! సకలపాపాలనూ తొలగించి సర్వసంపదలూ కలిగించే దేవీచరితం ఎంత చెప్పినా తరగదు. ఎంత విన్నా తృప్తి కలగదు. మంచి ప్రశ్నలు వేశావు. వివరిస్తున్నాను ఆలకించు - అంటూ కొనసాగించాడు.

వింధ్యవాసిని







శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము



Worship of Goddess Durga - దుర్గారాధన

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దుర్గారాధన

నారదా! ఇప్పుడింక దుర్గాదేవీ ఆరాధన విను. దుర్గను స్మరిస్తే చాలు ఆపదలు పారిపోతాయి. అందరూ హాయిగా ఉపాసించవచ్చు. జగన్మాత శైవి, శక్తి, మహాద్భుతశక్తి, సర్వబుద్ధి అధిదేవి, సర్వాంతర్యామిస్వరూపిణి, కఠిన సంకట విమోచని. అందుకే దుర్గ అయ్యింది. వైష్ణవులూ శైవులూ ఉపాసించదగిన పరాదేవత. మూలప్రకృతిరూప. సృష్టిస్థితిలయకారిణి. నవాక్షరమంత్రం చెప్పనా!

వాగ్భవం శంభువనితా కామబీజం తతఃపరమ్‌

చాముండాయై పదం పశ్చాద్విచ్చే ఇత్యక్షరద్వయమ్‌

ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే - అనే నవాక్షరమంత్రం భక్తులపాలిటి కల్పవృక్షం. దీనికి బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఋషులు. గాయత్రి ఉష్ణిక్కు అనుష్టుప్పులు ఛందస్సులు. మహాకాళీ మహాలక్షీ మహాసరస్వతులు దేవతలు. భ్రామరీ దుర్గా రక్తదంతికలు బీజాలు. నందా శాకంభరీ భీమాదేవీత్రయం శక్తులు. ధర్మార్థకామమోక్షాలలో వినియోగం.

ఋషులను మౌళియందు, ఛందస్సులను వదనంలోనూ దైవతాలను హృదయంలోనూ శక్తి బీజాలను స్తనాలలోనూ - ఇత్యాదిగా అంగన్యాస కరన్యాసాలతో మంత్రశాస్త్రంలో చెప్పబడిన విధానాలను అక్షరాలా పాటిస్తూ దుర్గాదేవిని అర్చించాలి. ఇలా ధ్యానించాలి -

ఖడ్గ చక్ర గదా బాణచాపాని పరిఘం తథా

శూలం భుశుండీం చ శిరః శంఖం సందధతీం కరైః ॥

మహాకాళీం త్రినయనాం నానాభూషణభూషితాం ।
నీలాంజన సమప్రఖ్యాం దశపాదాననాం భజే ॥

మధుకైటభనాశార్థం యాం తుష్టావాంబుజాసనః ।
ఏవం ధ్యాయేన్మహాకాళీం కామబీజస్వరూపిణీమ్‌


అక్షమాలాం చ పరశుం గదేషు కులిశాని చ ॥

పద్మం ధనుష్కుండికాం చ దడం శక్తిమసిం తథా ॥

చర్మాంబుజం తథా ఘంటా సురాపాత్రం చ శూలకమ్‌ ।
పాశం సుదర్శనం చైవ దధతీమరుణప్రభామ్‌


రక్తాంబుజాసవగతాం మాయాబీజస్వరూపిణీమ్‌ ।
మహాలక్ష్మీం భజేదేవం మహిషాసురమర్దినీమ్‌ ॥

ఘంటా శూలే హలం శంఖం ముసలం చ సుదర్శనమ్‌

ధనుర్బాణాన్ హస్తపద్మైర్దధానాం కుందసన్నిభామ్‌ ॥

శుంభాది దైత్యసంహర్త్రీం వాణీబీజస్వరూపిణీమ్‌

మహాసరస్వతీం ధ్యాయేత్‌ సచ్చిదానందవిగ్రవామ్‌ ॥ 

కామబీజస్వరూపిణిగా మహాకాళి, మాయాబీజస్వరూపిణిగా మహాలక్ష్మి, వాణీబీజస్వరూపిణిగా మహాసరస్వతి అయిన దుర్గాదేవిని ఇలా ధ్యానించి షట్కోణసంయుక్త - అష్టదళపద్మ - చతుర్వింశతి పత్రక - భూగృహసమాయుక్త - యంత్ర విచింతన చెయ్యాలి.

సాలగ్రామంలోగానీ మంగళకలశంలోగానీ యంత్రంలోగానీ ప్రతిమలలోగానీ బాణచిహ్నంలోగానీ సూర్యడిలోగానీ ఏకాగ్రచిత్తంతో దేవిని ఆవాహనచేసి ఉపాసించాలి. జయాదిశక్తియుతమైన పీఠంలో నిలిపి పూజించాలి. తూర్పుకోణంలో సరస్వతీసహితుడైన బ్రహ్మను, నైఋతికోణంలో శ్రీసహితుడైన హరిని, వాయుకోణంలో పార్వతీపరమేశ్వరులనూ, దేవికి ఉత్తరంగా సింహాన్నీ, వామభాగంలో మహిషాసురుణ్ణీ నిలిపి అర్చించాలి. నందజ - రక్తదంత - శాకంభరి - దుర్గ - భీమ - భ్రామరి - శక్తులను షట్కోణాలలో కొలవాలి. బ్రాహ్మి - మాహేశ్వరి - కౌమారి - వైష్ణవి - వారాహి - నారసింహి - ఐంద్రి - చాముండక - రూపాలను అష్టదళాలలో యజించాలి. అటు పైని చతుర్వింశతి తత్త్వపత్రాలలో విష్ణుమాయ - చేతన - బుద్ధి - నిద్ర - క్షుధ - ఛాయ - తృష్ణ - శాంతి - జాతి - లజ్జ - క్రాంతి - శ్రద్ధ - కీర్తి - లక్ష్మి - ధృతి - వృత్తి - శ్రుతి - స్మృతి - దయ - తుష్టి - పుష్టి - మాతృ - భ్రాంతి - పరలను అర్చించాలి. ఆ తరవాత భూపురకోణాలలో గణేశ క్షేత్రపాలక వటుక యోగినులను పూజించాలి. ఇంద్రాదిదేవతలనూ వజ్రాద్యాయుధాలనూ ఇలాగే వెలుపల ఆవాహనచేసి అర్చించాలి. సావరణంగా ఇలా అర్చించి రాజోపచారాలు చెయ్యాలి. నవార్ణమంత్రాన్ని జపించాలి. సప్తశతీస్తోత్రం పఠించాలి. ఇటువంటి స్తోత్రం ముల్లోకాలలోనూ లేదు. ఇలా నిత్యం చేసిన భక్తుడు చతుర్విధపురుషార్ధాలకూ ఆలయమవుతాడు.

నారదా! శ్రీదుర్గాపూజావిధానం సమగ్రంగా వివరించాను. చెప్పినందుకు నేనూ విన్నందుకు నువ్వూ కృతార్థులమయ్యాము. సకలదేవతలూ త్రిమూర్తులూ మనువులూ మునులూ జ్ఞానులూ యోగులూ ఆశ్రమవాసులూ లక్ష్మీసరస్వతులూ అందరూ దుర్గాదేవిని ధ్యానిస్తారు. అది కారణంగానే వారందరూ ఆయా పదవులలో నిలిచి కర్తవ్యాలు నిర్వహించడానికి సమర్థులు అవుతున్నారు. పంచప్రకృతులూ తదంశమూర్తుల గురించి రహస్యాతిరహస్యమైన ఆఖ్యానాలను నీకు వివరంగా తెలియజెప్పాను. దీన్ని విన్నవారికి చతుర్విధపురుషార్థాలూ సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇది ముమ్మాటికీ సత్యం. తొమ్మిదిరాత్రుల పాటు దేవీసన్నిధిలో ఈ ఆఖ్యానాలను పఠించినవారికి తీరనికోరికలంటూ ఉండవు. రోజుకి ఒక అధ్యాయంగా పారాయణచేస్తే దుర్గాదేవి వశవర్తిని అవుతుంది. అతడు దేవీ ప్రియకరుడవుతాడు. మనోరథాన్ని సంకల్పించుకొని దేవీభాగవత గ్రంథపూజచేసి కుమారి చేతికిచ్చి లేదా వటువు చేతికిచ్చి తెరవమని - వచ్చిన అధ్యాయాన్ని చదివితే శభాశుభ శకునాలూ ఫలాలూ తెలిసిపోతాయి. ఉదాసీనుడికి ఉదాసీనంగానే ఉంటుందినుమా! అని చెప్పి నారాయణమహర్షి ముగించాడు.

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము


Revati Nakshatra - రేవతి నక్షత్రము

రేవతి నక్షత్రము నక్షత్రం - రేవతి అధిపతి - బుధుడు గణము - దేవ జాతి - పురుష వృక్షం - విప్ప జంతువు - ఏనుగు నాడి - అంత్య పక్షి - నెమలి అధిదేవత - ...