శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -
వసుదేవునకు నారదుడు పురాతనంబగు విదేహర్షభ సంవాదం దెలువుట
ఓ రాజా! చెపుతాను వినండి. దీనికి ఒక పెద్దదైన, ప్రఖ్యాతమైన వెనకటి కథ ఉంది. దాన్ని కూడా చెపుతాను. ముందొకసారి నారదముని ద్వారకకు వచ్చి ఎంతో ఇష్టంతో తిన్నగా శ్రీకృష్ణుని సందర్శించాడు.
ఆవిధంగా దేవర్షి నారదుడు శ్రీకృష్ణదర్శనానికి వచ్చి ఇంటిలోపలికి వెళ్లగా వసుదేవుడు ఆ మహర్షిసత్తముని అర్ఘ్యపాద్యాదులతో యథావిథిగా పూజించి బంగారు ఆసనంపై కూర్చుండబెట్టి తగిన కథావృత్తాంతాల వినోదాలతో పొద్దుపుచ్చుతూ ఇలా అన్నాడు.
'మునీంద్రా! ఏ మానవుడు నిరంతరం శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఆసక్తిగా భజించడో వాడికి చావు సమీపంలోనే ఉంటుంది. నీ దర్శనంవల్ల ధన్యుడనయ్యాను. అచ్యుత, అనంత, గోవింద మొదలైన నామాలను స్మరిస్తూ ఏకాగ్రమైన చిత్తంగల మీవంటి సుకృతాత్ముల రాకవల్ల లోకులు సుఖాశ్రయులై ఉంటారు. దేవతలను భజించేవాళ్లను దేవతలుకూడా దయతో చూస్తారు. అటువంటి సజ్జనులు, దీనవత్సలులు పూజాదివిధులతో ఆ దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటారు. కాబట్టి శ్రీమద్భాగవతకథలలో గల ధర్మాలను అడుగుతాను.
ఏయే ధర్మాలను వీనులవిందుగా వింటే యమభటుల దెబ్బలు తినకుండా ముకుందుని పాదపద్మాలకు నమస్కరించే కోరిక కలవారై వైకుంఠపదవిని పొందుతారో అలాంటి ధర్మాలను తెలియజేయండి. పూర్వం శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా కోరుకొని మోక్షమార్గం తెలుసుకోలేక దైవమాయలో పడి మనస్సులో పుట్టిన అపాయాంధకారసంసారంలో చిక్కుకొని ఉన్నాను. హరికథామృతాన్ని ప్రవహింపజేయండి. అట్లైతే నాకు సుఖం కలుగుతుంది, అని వసుదేవుడు ప్రార్ధించగా నారదుడు వాసుదేవునికథల ప్రస్తావనవల్ల పరస్పర సంభాషణమూలమైన సంతోషంతో ఇలా అన్నాడు.
(ముకుందుడంటే మోక్షాన్ని ప్రసాదించేవాడని అర్ధం. శ్రీకృష్ణునికి ముకుందుడని పేరుంది.)
జనసుతా! నీవు నన్నడిగిన ప్రశ్నకు సమాధానం వేదశాస్త్రచోదితమైన గొప్పదైన శ్రీహరిగుణకథనమే. వినవలసిందని వేడుకతో వినిపించడం ఆరంభించాడు.
ఎంతటి పాపం చేసినవాళ్లైనా ఎప్పుడూ నారాయణశబ్దాన్ని ఎక్కువగా స్మరించేవాళ్లు ధన్యులు. అలాంటివాళ్లను నుతించడం బ్రహ్మకుకూడా సాధ్యం కాదు.
అందుకని శ్రీమన్నారాయణునిమీద భక్తిని కలిగించేది, మోక్షమార్దాన్ని పెంపొందింపజేసేది అయి ప్రసిద్ధిగా ఉన్న విదేహఋషభసంవాదమని పేరొందిన ప్రాచీనమైన ఒక కథావిశేషాన్ని నీకు చెపుతాను, ఏకాగ్రమైన మనస్సుతో వినుమని ఇలా చెప్పాడు.
ఓ వసుదేవా! విను. స్వాయంభువుడనే మనువుకు ప్రియవ్రతుడనే కొడుకు కలిగాడు. ప్రియవ్రతునికి లోకప్రసిద్ధుడైన ఆగ్నీధ్రుడు అనే పుత్రుడు పుట్టాడు.
(మానవుల పుట్టుకకు మనువు కారణమని చెపుతారు. మనువు దైవాంశసంభూతుడు. పదునలుగురు మనువులన్నారు.
1) స్వాయంభువ, 2) స్వారోచిష, 3) ఉత్తమ, 4) తామస, 5) దైవత, 6) చాక్షుస, 7) వైవస్వత, 8) సావర్ణి, 9) దక్షసావర్ణి, 10) బ్రహ్మ 11) ధర్మసావర్ణి, 12) రుద్రసావర్ణి, 18) శౌచ్య, 14) ఇంద్రసావర్ణి అనే పేర్లు గలవారు మనువులు.
మొదటి మనువైన వైవస్వతమనువు రెండవసృష్టికర్తగా ప్రసిద్ధి పొందాడు. ఇతడే పదిమంది మహర్షులను ఉద్భవింపజేశాడు. మానవధర్మశాస్త్రమైన మనుస్మృతి కర్తకూడా ఇతడే. ఒక మనువు కాలాన్ని మన్వంతరం అంటారు. మనుస్మృతి ప్రకారం ఒక మన్వంతరం 43,20,000 సంవత్సరాలు)
ఆ ఆగ్నీధ్రుడికి పండితుడైన 'నాభి' అనే కొడుకు జన్మించాడు. అతడు బలిచక్రవర్తితో స్నేహంచేసి భూభారం వహించి తన ఆజ్ఞాబలంతో శత్రువుల రాజ్యాలన్నీ స్వాధీనం చేసుకొని పాలించాడు. ఆ 'నాభి' కి 'ఋషభుడు' అనే మంచికొడుకు కలిగాడు. హరిభక్తుడైన ఋషభుడు వందమంది కొడుకులను పొందాడు. ఆ వందమందిలో 'భరతుడు' అనే మహానుభావుడు శ్రీమన్నారాయణుని భక్తుడై ప్రాపంచిక సౌఖ్యాలను పరిత్యజించాడు. గొప్ప తపస్సుచేసి మూడు జన్మలలో బంధాలనుండి విముక్తి పొందాడు. మోక్షసుఖం కలిగిన పరవశత్వంతో శ్రీమన్నారాయణాత్మక పరమపదాన్ని పొందాడు. భరతుడు పాలించిన భూభాగం భరతవర్షం అనే పేరుతో వర్ధిల్లి ప్రఖ్యాతమైంది.
మరలా ఆ ఋషభుని కుమారులలో తొమ్మిదిమంది బలపరాక్రమ, తేజోరూపాలు కలవారై తొమ్మిది భూభాగాలకు అధికారులైనారు. ఇంకా వాళ్లలోని ఎనభై ఒక్కమంది కుమారులు నిత్యకర్మానుష్ఠానాలలో ఆసక్తి కలవారై బ్రాహ్మణత్వాన్ని స్వీకరించారు. ఇక మిగిలినవారిలో కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్దుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమిళుడు, చమసుడు, కరభాజనుడు అనే పేర్లుగల తొమ్మిదిమంది ఋషులు బ్రహ్మవిద్యావిశారదులు అయినారు. మూడు లోకాలను పరమాత్మ స్వరూపంగా భావించారు. ప్రాపంచిక జగత్తుతో సంబంధం లేనివాళ్లయినారు. ఆటంకం లేని రాకపోకలు కలవారై దేవ, సిద్ధ, సాధ్య, యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుష, నాగ లోకాలలో ఇష్టానుసారం విహరిస్తూ ఒకనాడు.
(నిత్యనైమత్తిక కామ్యకర్శలని కర్మలు మూడు రకాలు. ప్రతిరోజూ చేయవలసిన స్నానసంధ్యాద్యనుష్ఠానాలు నిత్యకర్మలు. ఇవి చేయకపోతే దోషం కలుగుతుంది. కొన్నికారణాల నిమిత్తం ఆచరించదగినవి నైమిత్తిక కర్మలు. పిండ ప్రదాన కర్మలు ఇలాంటివి. ఇవి ఆయా సందర్భాల్లో చేయదగినవి. కోరికలు నెరవేర్చుకోడానికి చేసేవి కామ్యకర్మలు. వీటివల్ల ఫలితం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాని ప్రత్యవాయంమాత్రం కలుగదు.)
లోకాలన్నిటికి ఒకే ప్రభువైన శ్రీహరి గుణగణాలను ఎక్కువగా స్మరించుకొంటూ, అతిశయించిన భక్తితో రేయింబవళ్లు, సంధ్యాసమయాలు ఆ శ్రీహరియందే ఎంతో ఆసక్తి కలిగి ఇంద్రియ నిగ్రహులైన ఆ తాపసులు భూలోకంలో
ఎంతో పుణ్యాత్ముడైన విదేహరాజైన నిమి నిర్వర్తించిన యజ్ఞం పరిసమాప్తి పొందుతున్న సమయంలో మోహం వదలిన పుణ్యాత్ములైన తాపసులు రాగా నిమి వాళ్లకు ఎదురువెళ్లి
భూపాలుడైన నిమి తొమ్మిదిమంది మునివర్యులను ఎంతో వేడుకగా అర్ఘ్యపాద్యాది ఉపచారాలతో పూజించాడు. వాళ్లను ఉచితాసనాలమీద కూర్చుండబెట్టి
(ఉచితాసనాలమీద కూర్చుండిన) వాళ్లతో విదేహరాజైన నిమి ఇలా అన్నాడు. 'మీరు విష్ణుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే గొప్ప తపోనిధులు. భయంకరులు, అనేక దుఃఖాలతోను రోగాలతోను కూడినవారు, చెడ్డబుద్ధి గలవారు, అల్పులు అయిన మానవులు సారంలేని సంసారాలను ఎలా దాటగలరో ఆలోచించి జ్ఞానమార్గం తెలియజేయండి'.
అన్ని ప్రాణుల జన్మలకంటె మానవజన్మను పొందడం కష్టసాధ్యం. మానవజన్మ పొందినా శ్రీమన్నారాయణుని పాదాలధ్యానం మీద ఆసక్తి కలగడం మరీ కష్టం. అందువల్ల శాశ్వతమైన శుభాన్నిగురించి అడుగవలసి వచ్చింది. శరణాగతి పొందిన భక్తులకు శ్రీమన్నారాయణుడు సారూప్యం ఎలా అనుగ్రహిస్తాడు? ఆ విషయాన్ని గురించి తెలపండి, అని అడిగిన విదేహరాజుతో శ్రీహరికథలు అనే అమృతం తాగి పారవశ్యం పొందిన మునుల సమూహంలో “కవి” అనే పేరుగల మహానుభావుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు.
కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే వైరివర్గం లోను, మూడు రకాల కోరికలలోను చిక్కి మత్సర స్వభావంతో కూడిన మనస్సుగల మానవుడికి అచ్యుతుని పాదపద్మాలను సేవించే భాగ్యం ఎలా లభిస్తుంది? విశ్వాన్ని ఆత్మను వేరువేరుగా భావించేవాడికి భయం లేకుండా ఎలా పోతుంది? అజ్ఞానమనే చీకటిలో మునిగిన వాళ్లకు శ్రీహరి ధ్యానం ఎలా సిద్ధిస్తుంది? అటువంటి మానవుడు శరీరాన్ని వదిలి పరమాత్మ తత్త్వాన్ని ఎలా చేరుతాడు? కండ్లుమూసుకొన్న మానవుడు దారిలో నడుస్తూ తడబాటుపడి వెళ్లే విధంగా పరమాత్మ జ్ఞానంచేత స్వచ్చమైన మనస్సులో భక్తిభావం నిండుగా ఉండకపోతే వీళ్లకు పరమాత్మ స్థితి ఎలా సిద్ధిస్తుంది? అని అడిగావు. సమాధానం చెబుతాను శ్రద్ధతో విను.
(జీవి తన సర్వకర్మలను భగవత్పరం చేసి 'అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ' అని భగవంతునికి ఆత్మార్పణ చేసుకోవడం శరణాగతి. భగవంతుణ్ణి చేరడానికి కర్మ జ్ఞాన భక్తియోగాలతో పాటు ప్రపత్తియోగాన్ని కూడా ప్రతిపాదించారు వైష్ణవులు. శరణాగతి పొందడమే ప్రపత్తియోగ లక్షణం.
దారైషణ(భార్యమీద కోరిక), ధనైషణ (ధనంమీద కోరిక), పుత్రైషణ(కొడుకు కావాలని కోరిక) అనేవి ఏషణత్రయం. మానవ జీవితంలో ఈ మూడూ ప్రధానమైన కోరికలు. ఇవి మానవుని ప్రాపంచిక స్థితిలో పడవేస్తాయి. వీటిని జయిస్తే తప్ప పారమార్థికమైన ఆలోచనలు కలగవు.)
మానవుడు త్రికరణాలతో ఆయా సమయాల్లో ఏయే కర్మలు చేసినా ప్రతికర్మను 'కృష్ణార్పణం' అని నిర్వర్తించడం సుజ్ఞానమని ముని శ్రేష్ఠులు చెబుతారు.
(మనోవాక్కాయాలు త్రికరణాలు. అంటే మనస్సు, వాక్కు(మాట), కాయం (శరీరం). ఏ పనిచేసినా త్రికరణశుద్ధిగా చెయ్యాలంటారు పెద్దలు.)
జ్ఞాన అజ్ఞానాలలో పడి ఉంటే జ్ఞాపకశక్తి వ్యత్యస్తం అవుతుంది. కాబట్టి తెలివైన మానవుడు గురువునే దైవంగా భావించి, ఉత్తమోత్తముడైన లక్ష్మీనాయకుని మనస్సులో నిలిపి సేవించాలి. కలల్లాంటి కోరికలతో తేలిపోవడం వల్ల ఆలోచన నశిస్తుంది. అందువల్ల కోరికలను తగ్గించుకొని ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడికి చేతిలో ఉసిరిక కాయవలె మోక్షం సులభంగా దొరుకుతుంది.
(శరీర ఇంద్రియాలతో సంబంధంలేని ఆత్మ అద్వితీయమై ఉండే స్థితి కైవల్యం.)
ఓ రాజా! ఎల్లప్పుడూ శ్రీకృష్ణుణ్ణి గురించి పాడే పాటలను చెవులకు ఇంపుగా వినాలి. శ్రీహరినామమాహాత్మ్యాన్ని వివరించే విషయాలను సంతోషంతో పాటలుగా పాడుతూ, ఆటలుగా ఆడుతూ ప్రవర్తించాలి. శ్రీమన్నారాయణుని పవిత్రమైన పేరులోని అక్షరాలను హృదయంలో ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. పద్మలోచనుని లీలలను అడవిలో ఉన్నపుడైనా భక్తితో గానం చెయ్యాలి. విశ్వమంతా నిండి ఉన్న శ్రీహరిని వెర్రివాడువలె కీర్తిస్తూ లోకాన్ని అంటకుండా ఉండాలి. సృష్టి అంతా విష్ణుమయమని తెలుసుకోవాలి. భేదంగా చూడడం పనికిరాదు.
కవి అనే ముని చెప్పిన మాటలు వినిన విదేహరాజు భాగవతధర్మం ఏది? ఆ ధర్మం ఏవిధంగా ప్రవర్తిస్తుంది? భాగవతుల గుర్తులు ఎలా ఉంటాయి; ఆ విషయాలన్నీ తెలియజేయడానికి మీరే తగినవారు అన్నాడు. వెంటనే ఆ ముని సమూహంలోని హరి అనే మహాముని ఇలా అన్నాడు.
సర్వప్రాణులలో ఉండేవాడైన పద్మలోచనుడే తన మనస్సులో ఉండేవాడని, అతడే శంఖచక్రధరుడని నమ్మి భక్తితో ఆసక్తి గలిగి ప్రవర్తించేవాడే భాగవతుడు.
భూపాలా! వర్ణాశ్రమధర్మాలలోను, ఆయా వర్ణాశ్రమాలకు విధించినకర్మలలోను మునిగిపోకుండా సమస్త జగత్తులో నిండినవాడే శ్రీహరి అని భావించేవాడు నిజంగా భాగవతుడు.
ఇలా అన్నిబంధాలను పరిత్యజించి, అన్నింటిని తనలాగా భావించి, సూర్యుడు తన సహస్రకిరణాలతో ముల్లోకాలను పవిత్రం చేస్తున్నవిధంగా తన అడుగుదమ్ముల దుమ్ముచేత ముల్లోకాలను పవిత్రం చేస్తూ దేవదానవులచేత కూడా కొనియాడబడి సేవింపదగిన జనార్దనుని పాదపద్మాలకు నమస్కరించాలనే కోరిక కలిగి, భక్తిని రవ్వంతకూడా సడలనీకుండా, చంద్రోదయం వల్ల ఎండబాధ తొలిగిపోయిన విధంగా శ్రీమన్నారాయణుని చరణ నఖకాంతుల వెన్నెలచే హృదయతాపం పోగొట్టుకొని, తన భక్తి అనే తాడు బంధనంతో బంధింపబడిన వాసుదేవుని పాదపద్మాలను ధ్యానించడంవల్ల కలిగిన ఆనందంలో పరవశించేవాడు ఉత్తమభాగవతుడని చెప్పగా విని విదేహరాజు ఇలా అన్నాడు.
జితేంద్రియుడవైన మహర్షీ! కరిరాజుకు వరమిచ్చి కాపాడిన శ్రీహరిసౌశీల్యవాత్సల్యాది గుణాలు మూడు లోకాలనూ పావనం చేసేవి. అటువంటి గుణాలను స్పష్టంగా మనోరంజకంగా వినాలని నాకు కూతూహలం కలిగింది.
అలా అడిగిన విదేహరాజు మాటలు విని అంతరిక్షుడనే గొప్పఋషి ఇలా చెప్పాడు.
పరబ్రహ్మమని, పరతత్త్వమని, పరమపదమని, పరమేశ్వరుడని, శ్రీకృష్ణుడని, వేరువేరు పేర్లతో శ్రీమన్నారాయణుడే ప్రపంచమంతా నిండి ప్రకాశిస్తున్నాడు.
అవ్యక్తమైన, గుణరహితమైన పరబ్రహ్మంనుండి వ్యత్యాసంగా పుట్టిన జ్ఞానాన్ని 'విష్ణుమాయ' అంటారు. అటువంటి మాయచేత ప్రపంచాన్ని నిర్మించి భగవంతుడు ఎలాంటి చింతా లేకుండా ఉంటాడు. ఇంద్రియసుఖాలకోసం తిరుగులాడే చెడుబుద్ధి గలవారికి గాఢనిద్ర, స్వప్నం, మెలకువ అనే మూడు అవస్థలతోపాటు భగవంతుని పొందలేక పోవడమనే నాలుగో అవస్థకూడా కలుగుతుంది. కలలో గ్రహించదగిందీ, గ్రహించేవాడూ, గ్రహించడం అనే మూడు (త్రిపుటి) భేదాలుంటాయి. (త్రిపుటి) ఈవిధంగా అవిద్య అనే చీకటితో చుట్టుకోబడి మూడువిధాలుగా పరిణమించేకోరిక స్వప్నదశలో అణగినవిధంగా మూడు విధాలైన మాయకూడా ఆత్మలో విలీనమవుతుంది.
పరమేశ్వరుడు మొదట పృథివి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో నిండిన సృష్టిని కలిగించి అందులో పంచభూతాత్మకమైన శరీరానికి పదకొండుఇంద్రియాలతో భేదం పుట్టిస్తూ, గుణాలచే గుణాలను అంగీకరిస్తూ, ఆత్మయందు వ్యక్తమైన గుణాలవల్ల గుణాలను అంగీకరిస్తూ ఉన్నవాడై సృష్టిని తనదిగా భావిస్తాడు. శరీరధారి పూర్వకర్మ మూలంగా నిమిత్తమాత్రాలైనకర్మలు చేస్తూ, అవి కలిగించే ఫలితాన్ని అంగీకరించి దుఃఖానికే వశుడై ప్రవర్తిస్తూ ఉంటాడు. అనేకదుఃఖాలతో మునిగిన ఆ దేహి కర్మఫలాన్ని పొందుతూ జలప్రళయం వచ్చి సర్వభూతాలు అందులో మునిగిపోయే వరకు (స్వేచ్చను కోల్పోయి) ప్రాపంచిక అనుభవాలు పొందుతూ చావుపుట్టుకలలో పడి దొర్లుతూ ఉంటాడు. ప్రళయకాలం(కల్పాంతసమయం) వచ్చినప్పుడు వస్తుగుణాలస్వరూపం పొందిన జగత్తును ఆద్యంతాలు లేని కాలం ప్రకృతిని పొందిస్తుంది.
ఆపైన నూరేండ్లు వాన లేకపోవడంవల్ల లోకాలన్నీ సూర్యతేజం(ఎండ)తో కాల్చివేయబడతాయి; ఆ తరువాత కింది లోకంలోని ఆదిశేషుని ముఖంనుండి వెడలిన అగ్నిజ్వాలలు వాయుసహాయంతో లేచి, అన్ని దిక్కులలో వ్యాపిస్తాయి. అటు తరువాత సంవర్తకాలనీ మేఘాల గుంపు నూరేండ్లు ధారాపాతంగా వర్షిస్తాయి. ఆ వర్షపు నీటిలో బ్రహ్మాండం విలీనమవుతుంది. అప్పుడు ఈశ్వరుడు కట్టెలలో అగ్నివలె అవ్యక్తంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తరువాత భూమండలం తన వాసనగుణాన్ని కోల్పోయి నీటిరూపం ధరిస్తుంది. ఆ నీళ్లు రసాన్ని కోల్పోయి తేజోరూపం పొందుతాయి. ఆ తేజస్సు చీకటితో తొలిగింపబడి వాయువులో అణగుతుంది. ఆ వాయువు స్పర్శగుణాన్ని పోగొట్టుకొని ఆకాశంలో కలుస్తుంది. ఆ ఆకాశం శబ్దగుణాన్ని పోగొట్టుకొని ఆత్మయందు అణగిపోతుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ది వికారాలతో అహంకారాన్ని ప్రవేశిస్తాయి. ఆ అహంకారం తన గుణాలతో కలసి పరమాత్మను చేరుతుంది. ఈ విధంగా మాయ తెలుపు(సత్వగుణం), ఎరువు(రజోగుణం), నలుపు(తమోగుణం) అనే మూడు వర్ణాలు(గుణాలు) కలిగి, సృష్టి స్థితి లయాలకు కారణమవుతుంది. అని మాయా స్వరూపమూ, మాహాత్మ్యమూ వివరించగా విని విదేహరాజు ఇలా అన్నాడు.
జగన్నుతా! సత్యవాక్కుల్ని సద్గుణాల్ని భూషణాలుగా కలవాడా! అజ్ఞానులైన మానవులు కనరాని మాయను లోపల అణచివేసి వైకుంఠాన్ని ఎలా పొందుతారు? ఈ వృత్తాంతాన్ని పూర్తిగా అర్ధమయ్యేటట్లు చెప్పండి అని అడుగగా ప్రబుద్దుడనే ముని ఆదరపూర్వకంగా ఇలా అన్నాడు.
సూర్యోదయ సూర్యాస్తమయంతో ప్రతిరోజూ మానవుల ఆయుస్సు తగ్గిపోతూ ఉంటుంది. శరీరంపైన, భార్యపైన, స్నేహితులపైన, సోదరులపైన నాది, నావారు అనే మమకారంతో కట్టువడి ఆ బంధాన్ని వదిలించుకొనే ఉపాయం కనపడక, సంసారమనే చీకటిలో మునిగి, భూతభవిష్యత్కాలాలు తెలియక గుడ్లగూబలవలె పుట్టుక, ముసలితనం, రోగాలు, ఆపదలు, చావులు పొందుతూ శరీరమే మేలనుకొంటూ ఉంటారు. మోహమనే మద్యపానంతో మదించినవారై, ఇంద్రియ విషయాసక్తులై తమను తాము తెలుసుకోలేక విరక్తిమార్గం తెలియక ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి మూర్ఖులైన మనుష్యుల సమీపానికి పోకుండా, పూర్తిగా శ్రీమన్నారాయణునిమీదే భక్తిభావం కలిగిన సద్గురువును నిత్యమూ పూజించి ఉత్తమ భాగవత ధర్మాలను ఆచరించాలి. ఆ భాగవత ధర్మాలు ఇవి :
1) సత్వగుణం కలిగి ఉండడం, 2) అన్ని ప్రాణులమీద దయగలిగి ఉండడం, 3) శ్రీహరికథలు అనే అమృతాన్ని పానం చేయడం, 4) బ్రహ్మచర్య వ్రతం అవలంబించడం, 5) ఇంద్రియ సుఖాలను మనస్సులో చేరనీయకుండా ఉండడం, 6) సాధువులతో సహవాసం చేయడం, 7) సజ్జనులతో స్నేహం కలిగి ఉండడం, 8) వినయసంపద కలిగి ఉండడం, 9) శుచిగా ఉండడం, 10) తపోలక్షణం కలిగి ఉండడం, 11) ఓర్పు కలిగి ఉండడం, 12) మౌనవ్రతం పాటించడం, 18) వేదశాస్త్రాలను చదివి ఆ యర్ధాలను అనుష్ఠించడం, 14) హింసకు పూనుకోకుండా ఉండడం, 15) సుఖదుఃఖాది ద్వంద్వాలను సహించడం, 16) భగవంతుడు అంతటా ఉన్నట్లు భావించడం, 17) మోక్షేచ్చ కలిగి ఉండడం, 18) జన సాంగత్యాన్ని వదలడం, 19) నారచీరలు మొదలైనవి ధరించడం, 20) తనంత తానుగా లభించిన దానితో తృప్తిపడడం, 21) వేదాంత శాస్త్రార్థాలను తెలుసుకోవాలనే కోరిక ఉండడం, 22) ఇతరదేవతలను నిందించకుండా ఉండడం, 23) మనోవాక్కాయాలతో శుద్ధి కలిగి ఉండడం, 24) సత్యమే మాట్లాడడం, 25) శమదమాది గుణాలు కలిగి ఉండడం, 26) ఇల్లు, తోటలు, పొలాలు, భార్య, సంతానం, ధనం మొదలైన వాటిని పరమేశ్వరార్పణంగా భావించడం, 27) భక్తులు కానివారిని దర్శించకుండా ఉండడం.
మహారాజా! మానవుడు శ్రీహరి భక్తులతో స్నేహంచేస్తూ, శ్రీహరి వృత్తాంతాలను మననం చేసుకొంటూ, ఆనందబాష్పాలు నిండిన కళ్లతో శరీరం పులకితమవుతుండగా విష్ణుమాయను గెలుస్తాడు.
(భాగవతుడికి శ్రీహరి కథలు మదిలో మెదలగానే శరీరం పులకలు రేగుతుంది. ఆ కథలను స్మరిస్తూ ఒకప్పుడు ఏడుస్తూ, మరొకప్పుడు నవ్వుతూ లౌకిక వ్యక్తులకంటె భిన్నమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. ఇది కూడా భాగవతునిలక్షణమే.)
అని చెప్పగా విదేహచక్రవర్తి వాళ్లతో ఇలా అన్నాడు. భాగవతులారా! అన్ని లోకాలకు ప్రభువై నారాయణుడు అనే పేరుతో ప్రసిద్ధుడైన పరమాత్ముని మహిమను వినాలనుకొంటున్నాను ఆనతీయండి అని అడుగగా పిప్పలాయనుడు అనే ముని ఇలా చెప్పాడు.
రాజా! నీమదికి ఇంపు కలిగేవిధంగా లోకేశ్వరుని చరిత్రను తెలియజేస్తాను. విను. సృష్టి స్థితి లయాలకు కారణమైన స్వయం ప్రకాశం కల పరంజ్యోతి స్వరూపం లేదా పరబ్రహ్మం దేహేంద్రియాలలో స్థిరంగా ప్రవేశిస్తుంది. మంటలు అగ్నిలో ప్రవేశింపలేనట్లు ఇంద్రియాలు ఆత్మను పొందలేవు. నాదం పిల్లనగ్రోవిని లోగొనలేదు కదా! సత్త్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలు మహదహంకార రూపమై చైతన్యంతో కలిస్తే జీవమంటారు. ఇదే సత్తు, అసత్తు స్వరూపంగా ఎన్నబడుతుంది.
సత్త్వరజస్తమస్సులనే మూడు గుణాలు కలది ఒక తత్త్వం. ఆ తత్త్వం సకలపదార్థాలకు ఆధారం. దానినుండి వెలువడినవి అహంకారం, మహత్తు అనేవి. ఆ మహదహంకారం నుండి సకల భూతాలు, ఇంద్రియాలు వెలువడతాయి. వీటిలో చైతన్యరూపం కలిస్తే జీవం ఏర్పడుతుంది. ఆ చైతన్యరూపమే పరబ్రహ్మం. జీవుడు కర్మలను ఆచరించి ఆ ఫలాలకు భోక్త అవుతున్నాడు. చేతనాచేతనాలనే సత్తు, అసత్తు అంటారు. రెంటిలోను పరబ్రహ్మమే వ్యాపించి ఉంటుంది.
జీవభావం కంటె అతీతమైన దాన్ని పరమాత్మగా తెలుసుకొని బ్రహ్మ మొదలైనవారు నుతిస్తారు. ఇటువంటి పరమాత్మ స్ధిర చరాలలో ఉండి వృద్ధిక్రయాలు పొందకుండా, నిమిత్తమాత్రంచేత చెట్లు, తీగలు మొదలైన వానిలో ప్రతిస్పందన లేకుండా ఉంటాడు. పిమ్మట ఎల్ల ఇంద్రియాలచేత ఆవరింపబడిన ఆకారం పోగా మనస్సును వదలి వేదబాహ్యుడై తిరుగుతూ ఉంటాడు. స్పష్టమైన జ్ఞానదృష్టి గలవాడు సూర్యకాంతిసమూహాన్ని దర్శించినట్లు మంచి జ్ఞానం కలవాడు. విష్ణుభక్తిచేత గుణాలవల్ల, కర్మలవల్ల కలిగిన మనస్సులోని తప్పులను నశింపజేసుకొని, భగవంతుడిసన్నిధిని చేరుకోగలుగుతాడు. అని చెప్పగా విని విదేహరాజు ఇలా అన్నాడు.
ఓ మునిశ్రేష్ఠా! పిప్పలాయనా! మనిషి ఏయే పనులు(కర్మలు) క్రమంగా చేసి పుణ్యాత్ముడై జీవిస్తాడు? తాను పాపాలను పోగొట్టుకొని శ్రీహరి చరణాల్ని చేరుకుంటాడు?
అని విదేహరాజు అనగా విని ఆవిర్హోత్రుడు అనే ముని ఇలా అన్నాడు. కర్తవ్య కర్మలు చేయడం, కర్మలను చేయకుండడం, నిషిద్ధకర్మలు చేయడం అనే వాటిని తెలిపే వేదాలు ప్రకటించే అభిప్రాయాలు కాబట్టి వాటిని పండితులు కూడా తెలుసుకోలేరు. అవి కర్మాచారాలనిపించుకొంటాయి. పరమ పవిత్రమైన శ్రీహరిసేవ ముక్తిదాయకం. వేదవిధులను ఆచరించకుండా ఫలితాలు కోరే వాళ్లు అనేక జన్మలను పొందుతారు. ముక్తికోరేవాడు శాస్త్రం చెప్పిన విధంగా విష్ణువును పూజించాలి. ఆ పూజావిధానం ఎటువంటి దంటే - పరిశుద్ధమైన దేహంతో భగవంతుని సన్నిధిలో పవిత్రమనస్కుడై పదహారువిధాలైన సేవలతో చక్రధరుని పూజించి, గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు సమర్పించి, సాష్టాంగదండ ప్రణామాలు చేసి భక్తిభావంతో నిండిన మనస్సుగలవాడు హరిని చేరుతాడు - అని ఆవిర్హోత్రుడు చెప్పగా విని విదేహుడు 'భగవంతుడు ఏయే కర్మలు లేదా లీలలు ఆచరించాడో అంతా తెలుపవలసింది' అనగా ద్రమిళుడనే ముని ఇలా అన్నాడు.
(జనార్దన శబ్దానికి ప్రళయకాలంలో జనులందరిని పీడించువాడు అని వ్యుత్పత్యర్థం.
షోడశోపచారాలు - 1) ఆవాహనం 2) ఆసనం 3) పాద్యం 4) అర్ఘ్యం 5) ఆచమనీయం 6) అభిషేకం
7) వస్త్రం 8) యజ్ఞోపవీతం 9) గంధం 10) పుష్పం 11) ధూపం 12) దీపం13) నైవేద్యం 14) తాంబూలం
15) ప్రదక్షిణం 16) నమస్కారం. పూజాసమయంలో ఆచరించవలసినవి ఇవన్నీ.)
ఆకాశంలోని నక్షత్రాలను(చుక్కలను) లెక్కబెట్టవచ్చును. భూమిపై గల దుమ్ముకణాలను కూడా లెక్కబెట్టడానికి సాధ్యమవుతుంది. కాని పరిశీలించి చూడగా బ్రహ్మరుద్రాదులు కూడా శ్రీమన్నారాయణుని గుణవిశేషాలను వర్ణించలేరు.
అందుచేత తాను సృజించిన(సృష్టించిన) పంచభూతసమూహాన్ని శరీరంగా చేసి; దానిలో తన అంశతో ప్రవేశించి, సగుణాకారుడై నారాయణుడు అనే పేరుగల మునివర్యుడైన పరమేశ్వరుడు ప్రకాశించాడు. ఆయన పది ఇంద్రియాలతో నిర్మితాలైన శరీరాలను ధరించి, జగత్తును సృష్టించడం, రక్షించడం, సంహరించడం మొదలైన గుణాలుండడంచేత రజస్సు, సత్త్వం, తమస్సు అనే త్రిగుణాలతో బ్రహ్మ విష్ణువు, రుద్రుడు అనే పేర్లతో ఒప్పుతుంటాడు. త్రిగుణాత్మకుడనబడే ఆ నారాయణునిచరిత్ర చెపుతాను. విను.
(భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఐదూ పంచభూతాలు. ఈ పంచభూతాలతో శరీరం నిర్మించ బడుతుంది. శరీరమే పురం. దేవుడు అందులో ప్రవేశిస్తాడు కాబట్టి పురుషుడు అనేపేరు వచ్చింది. ఈ పురుషుడే పరమాత్మ)
యముడు స్వచ్చమైన మనస్సు కలదైన దక్షప్రజాపతి కుమార్తెను పెండ్లాడి బదరికాశ్రమంలో సత్కర్ముడైన నారాయణఋషిని పుత్రుడుగా కన్నాడు.
(బదరి అంటే రేగుచెట్టు. రేగుచెట్లు విస్తారంగా ఉండడంవల్ల నరనారాయణులు తపస్సుచేసిన ఆశ్రమానికి బదరికాశ్రమమని పేరు.)
అటువంటి నారాయణముని బదరికాశ్రమంలో అంతులేని నియమంతో తపస్సుచేశాడు. ఇంద్రుడు మనస్సులో భీతిచెంది అతని తపస్సును భగ్నం చేయడానికి మన్మథుణ్ణి, దేవ వేశ్యల్ని పంపాడు.
(బలఖేది = బలాసురుని సంహరించినవాడైన ఇంద్రుడు; మన్మథుని జెండాపై చేపబొమ్మ ఉండడంవల్ల మన్మథుడు మీనకేతనుడు.)
మన్మథుడు, దేవవేశ్యలు నారాయణముని తపస్సు చెడగొట్టడానికి అతని ఆశ్రమానికి వచ్చారు. ఆ తోట(తపోవనం) మద్ది, తీయమామిడి, మారేడు, అరటి, ఖర్జూరం, నేరేడు, నిమ్మ, మంచిగంధం, సురపొన్న, మందారం మొదలైన రకరకాల వృక్షాలతో దట్టంగా నిండి ఉన్నది. పూలతో, పండ్లతో నిండి వంగిన కొమ్మలతో కూడి ఉన్నది. గురివెంద పొదల పూలగుత్తుల మకరందం తాగి మదించిన తుమ్మెదలు చేసే ఝంకారాలతో ప్రతిధ్వనిస్తూ ఉన్నది. బంగారు పద్మాలతో, కలువలతో ప్రకాశించే సరస్సులు జంటలుగా విహరిస్తున్న జక్కవలూ, కొంగలూ, క్రోంచపక్షులూ, హంసల గుంపులచే అలంకరింపబడి ఉన్నాయి. తామరతూండ్లను తినడంలో ఆసక్తిగల సారసపక్షుల ముక్కులచే చీల్చబడిన తామరమొగ్గలలోని కేసరాలతో భాసించే సరోవరాలు కలిగి ఉంది. అటువంటి తపోవనంలో ఆ చంద్రముఖులు మెల్లగా నడుస్తూ చెమట బిందువులను కొనగోళ్లతో చిమ్ముకుంటూ నారాయణ మహర్షిని సమీపింపబోయేటప్పుడు...
నారాయణముని మన్మథునిబాణసమూహాలలో మునిగిపోలేదు. ధైర్యం విడువలేదు. ఆ స్త్రీల పదునైన చూపులకు మోహం పొందలేదు. ఏమాత్రం చలించకుండా తన హృదయంలో అచ్యుతుడు, రమేశుడు, అనంతుడు అయిన జగన్నివాసుణ్ణి నిశ్చలభక్తితో నిలుపుకొని ఆ స్త్రీలతో ఇలా అన్నాడు.
(అనంత శబ్దానికి ఆదిశేషుడు అని అర్ధం ఉన్నా - అంతంలేని వాడైన శ్రీహరినే చెప్పాలి.)
ఓ పద్మముఖులారా! మీరు ఇంద్రుడు పంపగా వచ్చారు. విహరించాలని కోరిక ఉంటే ఇక్కడ తిరగండి. అని మహర్షి అనగా వాళ్లు సిగ్గుపడి వెంటనే -
(అంభోరుహం అంటే నీటిలో మొలిచింది పద్మం.)
ఓ దివ్యమునివర్యా! నీ మహనీయ చరిత్రను తెలుసుకొని స్తుతించడానికి ఎవడికి సాధ్యమవుతుంది? ఆలుబీడ్డలనూ, మిత్రులనూ, సుఖాలనూ వద్దనుకొని తపస్సుచేసే ధర్మాత్ములకు అంతరాయాలు కలుగుతాయా? జగదీశ్వరుణ్ణి కొలిచే వాళ్లకు ఆటంకం కలుగుతుందా? కామక్రోధాలుగల మునిచేసే తపస్సు బురదగుంటలోని నీటివంటిది కదా! స్వచ్చమైన మనస్సు కలవాడా! నిన్ను వర్ణించడం మా తరమా? మా తప్పు మన్నించు - అంటూ సన్నుతించగా ఆ ముని ప్రసన్నుడై తన శక్తిని వాళ్లకు తెలియజెయ్యాలనుకొని అప్పుడు
ఆ నారాయణమునివర్యుడు ఎంతో ఆశ్చర్యంగా తన రోమకూపాలనుండి మూడుకోట్ల కన్యలసముదాయాన్ని పుట్టించాడు. గంధర్వ దేవతా కామినులు మిక్కిలి ఆశ్చర్యం, భయం మనస్సులో పుట్టగా ఆ మహార్షిని స్తుతించారు. ఆ అందగత్తెలలో నుండి ఊర్వశి అనే ఒక అందగత్తెను తీసుకొని వెళ్లి ఇంద్రుని సభాస్థానంలో ఉంచి, జరిగిన విషయమంతా విన్నవించారు. ఇంద్రుడు మునిశక్తికి ఆశ్చర్యపడి మిన్నకున్నాడు. అటువంటి నారాయణమునీశ్వరుని చరిత్ర వినేవాళ్లు మిక్కిలి కల్యాణ గుణసంపన్నులు అవుతారు అని చెప్పగా --
('విబుధ' శబ్దానికి దేవత అని అర్థం. 'వృత్రాసురభ్రాతరం శాసితవాన్ పాకశాసనః అని పాకశాసన శబ్దానికి వ్యుత్పత్తి. వృత్రాసురుని సోదరుడైన పాకాసురుణ్ణి చంపినవాడని అర్థం. 'సునాసీర' అనేది ఇంద్రుణ్ణి తెలిపే పదం. శ్రేష్ఠమైన సేనాగ్రభాగం కలవాడు సునాసీరుడు.)
ఋషభునికి ఈవిధంగా ఆత్మయోగాన్ని గురించి చెప్పాడు. తరువాత శ్రీమహావిష్ణువు భూభారాన్ని అణచడానికి(తగ్గించడానికి) క్రమంగా అవతారాలు ధరించి పట్టుదలతో ఎంతో అవలీలగా రాక్షసులను సంహరించాడు.
అటువంటి పరమేశ్వరుడు విలాసంగా గ్రహించిన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, బుద్ధ, కల్కి - ఇత్యాది అవతారాలెన్నో ఉన్నాయి. ఆ అవతారాలనుగురించి తెలుసుకొని వాటిని నుతించడం ఆదిశేషునికైనా, బ్రహ్మదేవునికైనా సాధ్యంకాదు. అని చెప్పి
కొత్తగా వికసించిన పద్మాలవంటి కన్నుల జంట కలవాడా! పాదాలయందు ఆకాశగంగను పుట్టించిన వాడా! వేదములచే కొనియాడబడినవాడా! లక్ష్మీదేవియొక్కస్తన కుంభాలయందు పూయబడిన మనోజ్ఞమైన కస్తూరిచే పరిమళించే హృదయం కలవాడా! భూమిని మోసినవాడా! బ్రహ్మ మొదలైన దేవతల సమూహాల సంస్తుతులతో కూడినవాడా! నడుము మీద అందమైన బంగారువస్త్రం ధరించినవాడా! గరుత్మంతుడు వాహనంగా కలవాడా! వెండికొండ వేలుపుచే నుతింపబడిన వాడా! ఎల్లప్పుడు జపం చేయడంలో ఆసక్తి గలవాడా! నియమబద్ధమైన నడవడి కలవాడా! మత్స్య, కూర్మ వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, కల్కి అవతారాలను తాల్చినవాడా! గజేంద్రునికి వరాలిచ్చినవాడా! మునులచే, నరులచే, దేవతలచే, పక్షులచే పొగడబడినవాడా! కలికాలంలోని పాపాత్ముల ఆనందాన్ని హరించేవాడా!
ఈ రీతిగా ప్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసాలు ఎన్నో ఉన్నాయి. మనస్సుచేత, మాటచేత, శరీరంచేతచేసే, కర్మలతో విష్ణువును పూజించకుండా వ్యత్యస్తాలైన పోకడలతో సంచరించే మూఢులకు మంచి స్థితి ఎలా కలుగుతుంది? అని ముని అనగా ఆ మహారాజు ఆ మహాత్ముని చూచి 'అటువంటి మూఢులు ముక్తి పొందే మార్గం తెలియజేయుమ'ని అడిగాడు. అప్పుడు ఆ మునులలో 'చమసుడు' అనే ముని రాజుతో ఇలా అన్నాడు.
శ్రీహరి ముఖంనుండి, బాహువులనుండి, ఊరువులనుండి, పాదపద్మాలనుండి క్రమంగా నాలుగువర్ణాలవాళ్లు పుట్టారు. వాళ్లలో స్త్రీలూ, శూద్రులూ విష్ణువును స్మరిస్తారు. కలియుగంలో వేద, శాస్త్ర, పురాణాలలో ప్రసిద్దులై, కర్మలను ఆచరిస్తూ బ్రాహ్మణులు మిక్కిలిగర్వంతో విష్ణుభక్తులను ఎగతాళి చేస్తారు. వాళ్లు నరకానికి పోవడం నిజం. మెత్తని పక్వాన్నం తినడం మాని, ప్రాణిహానికి పాల్పడేవాడికి - అంటే జంతువులను చంపి మాంసం భుజించేవాడికి పాపం కలుగుతుంది. హరిని స్తుతించకుండా స్త్రీసౌఖ్యాన్ని అనుభవించాలని వెంపరలాడేవాడికి ఎప్పటికీ నరకమే కలుగుతుంది.
అందుచేత ఇల్లు, పొలం, సంతానం, భార్య, ధనం, ధాన్యం మొదలైన వాటిలో వ్యామోహంచేత మోక్షమార్గాలు కంటికి కనపడేవి కావని(పరోక్షాలని) వాటిని నిందించేవాడూ, హరిభక్తి లేనివాడూ నరకంలో పడతారని చమసుడు అనే మునివర్యుడు ఆనతిచ్చాడు. అప్పుడు విదేహరాజు ఇలా అన్నాడు.
అవ్యయుడు, జగన్నాథుడు అయిన విష్ణువు ఏ యుగంలో ఏ విధంగా ఉన్నాడు? ఏ రూపం ధరించాడు? పూర్వం మునులచే, దేవతలచే ఏవిధంగా స్తుతించబడినాడు.
విదేహరాజు అడిగిన విషయం వినిన మునులలో 'కరభాజనుడు' అనే మునివర్యుడు ఇలా అన్నాడు. “ఎన్నో అవతారాలు, ఎన్నోరూపాలు, పలువిధాలైన రంగులు కలిగి రాక్షసులను సంహరించి; దుర్జనశిక్షణ, సజ్జనరక్షణ చేస్తూ శ్రీమహావిష్ణువు కృతయుగంలో తెల్లనిరంగు కలిగి, నాలుగుచేతులు కలిగి ఉంటాడు. జడలు, నారచీరలు, నల్లజింకచర్మపు ఉత్తరీయం, జపమాల, దండం, కమండలువు ధరించి; తపస్సు; ధ్యానం; అనుష్ఠానం గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సువర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్యనామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్దుడవుతాడు. త్రేతాయుగంలో ఎరుపురంగు కలవాడై నాలుగుచేతులు, మూడు పోగుల మొలనూళ్లు ధరించి, బంగరు రంగు జుట్టు కలిగి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు, స్రువం మొదలైన హోమసాధనాల చిహ్నాలలో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో వేదాంతులచేత నుతింపబడుతాడు. ద్వాపరయుగంలో నీలవర్ణం కలిగి, పీతాంబరం కట్టుకొని, రెండు చేతులు కలిగి, దివ్యాయుధాలు ధరించి, శ్రీ వత్సం, కౌస్తుభం, వనమాల అనే వాటితో ప్రకాశిస్తూ, మహారాజలక్షణాలు కలవాడై జనార్దనుడు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మొదలైన పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతింపబడుతాడు. కలియుగంలో నల్లని రంగు కలిగి, కృష్ణుడనే పేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞగానాలచేత వినుతింపబడతాడు. హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నలినోదరుడు మొదలైన పేర్లతో వేదాంతులైన మునివర్యులు స్తుతిస్తారు. ఇంకా -
ద్రవిడ దేశంలోని తామ్రపర్ణి, సహ్యజ, కృతమాల మొదలైన నదుల దగ్గరకు ఎవడైనా భక్తితో వెళ్లి, అక్కడ ఉండి పితృయజ్ఞాలు చేస్తే పుణ్యం లభిస్తుంది.
ఈ విధంగా కొనియాడదగిన కావేరి మొదలైన మహానదుల పవిత్ర జలాలలో స్నానం, పానం, దానం ఆచరించి; విష్ణుకథలనే అమృతరసం అనుభవించి ప్రసిద్ధులైన భాగవత శ్రేష్ఠులు ఉంటే వాళ్లు నశించనిస్థానం పొందుతారని ఋషభకుమారులు భగవంతునిమారురూపాలైన మహాత్ములవలె విదేహరాజుకు భగవద్భక్తికి సంబంధించిన ధర్మాలను బోధించి అంతర్హితులయ్యారు. మిథిలాధిపతి కూడా జ్ఞానయోగం స్వీకరించి ముక్తిపదం పొందాడు. ఈ కథను ఎవరు రాసినా, చదివినా, విన్నా వాళ్లకు ఆయువు, ఆరోగ్యం, సంపదలూ కలుగుతాయి. కొడుకులు, మనుమలూ కలుగుతారు. కలికాలానికి చెందిన సమస్త దోషాలు తొలగి విష్ణులోకంలో నివసిస్తారు అని నారదమహర్షి వసుదేవుడికి చెప్పాడు. అంతే కాకుండా -
వసుదేవా! నీవు కమలలోచనుడైన శ్రీమన్నారాయణుని పదభక్తికి సంబంధించిన కథలు విని పాపరహితుడవయ్యావు. నీకు లోకప్రసిద్ధమైన మంచి కీర్తి కలుగుతుంది. ఆపై కైవల్యం సిద్ధిస్తుంది. విష్ణువు నీ కొడుకు అనే మోహాన్ని విడిచి ఆయన శ్రీమహావిష్ణువు అని తెలుసుకొని సేవించు. ఆయన నీ కొడుకుగా అవతరించడం చేత నీ జన్మ పవిత్రమైంది. ఆయనతో సరస సల్లాపాలు జరుపుతూ స్నేహంగా మెలగడంవల్ల పవిత్రుడవైనావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురుడు, జరాసంధుడు, కాలయవనుడు శత్రువులైనా సంతోషంతో వాసుదేవునిలో చేరారు. అంటే వైరభక్తితో ముక్తి పొందారని భావం.
(శిశుపాలుడు - శ్రీకృష్ణునిమేనత్త సాత్త్వతి ఇతనితల్లి. తండ్రి దమఘోషుడు. శిశుపాలుడు గతజన్మలో హిరణ్యకశిపుడు. ధర్మరాజు రాజసూయయాగం చేసిన సందర్భంలో కృష్ణుడు తన సుదర్శనాయుధంతో సంహరించాడు.
పౌండ్రకుడు - ఇతడు కరూశదేశాధిపతి. తానే నిజమైన వాసుదేవుడనని చెప్పుకొంటూ శ్రీకృష్ణునికి గల వాసుదేవ నామాన్ని తొలగించుకొమ్మని ఆగడం చేయడంవల్ల శ్రీకృష్ణునిచేతిలో మరణించాడు.
మురుడు - ఇతడు మురుడనే రాక్షసుడు. వరప్రభావంతో గర్వించి దేవేంద్రుని బాధించడంవల్ల శ్రీకృష్ణుడితనిని వధించాడు.
జరాసంధుడు - ఇతడు మగధరాజు బృహద్రథుడికొడుకు. ఇద్దరు స్త్రీలకు సగం సగం శరీర భాగాలతో పుట్టిన ఇతనిని ఆస్త్రీలిద్దరూ పారేస్తారు. జర అనే రాక్షసి ఆ రెండు శరీరభాగాలను కలపడంవల్ల ఇతడు బతుకుతాడు. జర కలిపింది కాబట్టీ ఇతనికి జరాసంధుడు అనే పేరు కలిగింది. కంసుడి మామ అయిన ఈ జరాసంధుడు భీముడి చేతిలో మరణిస్తాడు.
కాలయవనుడు - యవనుడి కొడుకితడు. ఇతనిని నారదుడు ప్రేరేపించి కృష్ణుడి మీదికి యుద్దానికి పంపిస్తాడు. కృష్ణుడు ఎదురుగావెళ్లి పోరాడకుండా నీకు ధైర్యముంటే నన్ను పట్టుకొమ్మని పరుగెత్తి ముచికుందుడు అనే మహర్షి ఉన్న గుహలోకి వెళతాడు. కాలయవనుడు కూడా గుహలోకి వెళ్లి కృష్ణుడనుకొని ముచికుందుణ్ణి తొక్కి అతడి చూపులకు భస్మమవుతాడు.
వైరభక్తి - శ్రీమన్నారాయణుడితో వైరంపూని ఆయనను సంహరించడానికి ప్రయత్నించి తామే ఆయన చేతిలో మృతులై కైవల్యప్రాప్తి పొందిన రాక్షసులెందరో ఉన్నారు. శిశుపాల జరాసంధులు ఇటువంటి వాళ్లే. వైరంతో భగవంతుని అనవరతం వెదుకుతూ, ఆయన నామాన్ని ఇష్టం లేకున్నా ఉచ్చరిస్తూ వైరభక్తిని ప్రకటించుకొన్న వాళ్లు చివరకు మోక్షమే పొందగలిగారు.)
దుర్జనులను శిక్షించడం కోసం, సజ్జనులను రక్షించడంకోసం బ్రహ్మ మొదలైన ఎందరో దేవతలు ప్రార్ధించగా శ్రీహరి లోకంలో అవతరించాడు.
ఆ కారణంచేత లోకాలను రక్షించడంకోసం విష్ణువు అవతరించాడని వివరిస్తూ నారదుడు విష్ణుభక్తికి సంబంధించిన కథలు చెప్పాడు. ఆ కథలను వినిన దేవకీవసుదేవులు ఆశ్చర్యచకితమానసులై శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు. ఈ విషయాలు శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పాడు. పరీక్షిత్తు 'మునివర్యా! యాదవులను శ్రీహరి ఏవిధంగా నశింపజేశాడు? పరివారాలతో కూడినబ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, ఋషులు ద్వారకానగరంలో ఎలా ప్రవేశించారు? తరువాత ఏమైంది? శ్రీకృష్ణుడికథలు అనే అమృతాన్ని వీనులవిందుగా ఆస్వాదించినా ఇంకా తృప్తి కలగడంలేదు. భక్తులను రక్షించే శ్రీహరిచరిత్ర ఎలా కొనసాగింది; ఆపై వృత్తాంతమంతా తెలుపుము' అనగా శుకుడు ఇలా అన్నాడు.