కాకులు, గుడ్లగూబలు పగటిపూటే బంగారుమేడలలో పెక్కువిధాలుగా ఏడుస్తున్నాయి. గుర్రాల తోకలయందు అగ్గిపుట్టింది. ఎంతో ఆశ్చర్యకరంగా(ధాన్యంలేక) అన్నం మొలకలెత్తింది. రాత్రిపూట చిలుకలు, గోరువంకలు వికృతస్వరాలతో మూర్చిల్లాయి. ఒక జంతువు వేరొక రకమైన జంతువును ఈనింది. పౌరుల ఇండ్లలో ఆకాశంనుండి అగ్నికణాలు కురిశాయి. సూర్యబింబాన్ని నల్లనిరంగు ఆవరించింది. ఇలా అపశకునాలు లేక ఉపద్రవాలు ఎన్నో కనిపించాయి. అందుచేత ఓ యాదవులారా! మీరు ఇక్కడ ఉండవద్దు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రభాసతీర్థానికి వెళ్లండి” అని శ్రీకృష్ణుడు ఆదేశించాడు.
(ప్రభాసతీర్థం గొప్ప పుణ్యక్షేత్రం. దక్షుడి శాపంవల్ల క్షయరోగం కలిగిన చంద్రుడు ప్రభాసతీర్ధంలో స్నానం చేయగానే ఆ రోగం పోయింది. ఆ మాట చెప్పి యాదవులందరినీ ఆ క్షేత్రానికి వెళ్లమన్నాడు శ్రీకృష్ణుడు.)
శ్రీకృష్ణుని మాటలు విని యాదవులు సంతోషంతో తమ బలగాలతోనూ, భార్యలు, బిడ్డలు, మిత్రులతోనూ; ఏనుగుల, గుర్రాల సమూహాలతోనూ కలసి క్రమంగా తొందరగా ప్రభాసతీర్థానికి వెళ్లారు.
ఉద్ధవుడు దివ్యజ్ఞానంతో తన మనస్సులో తెలుసుకొని లక్షీపతీ! శ్రీహరీ! ఆర్తజనుల పాలిటి కల్పవృక్షమా! పండితులను నడిపించువాడా! మాకు నీవే దిక్కని స్తుతించాడు.
No comments:
Post a Comment