Tuesday, June 3, 2025

Gayatri Devi - గాయత్రీ దేవి

గాయత్రీ దేవి

పురాణాల ప్రకారం గాయత్రీ దేవి జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు ఉద్భవించింది అని కథనం.

గాయత్రి మాతకి మూడు సంధ్యలలో మూడు పేర్లు ఉన్నాయి.

ప్రాతఃకాలం గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయంకాలం సరస్వతి. ఒకే గాయత్రి మూడు నామములతో ఉన్నది.

సరస్వతి, సావిత్రి, గాయత్రి – ఈ మూడూ కూడా సృష్టి కారణమైన చైతన్య స్వరూపమైన జ్ఞాన రూపిణి అన్న అర్థాన్ని చెప్తున్నాయి.

అదేవిధంగా ఈ మూడు రూపాలకి బ్రాహ్మీ, మాహేశ్వరీ, వైష్ణవీ, అని పేర్లు కూడా చెప్పబడుతున్నాయి.

అంటే త్రిమూర్త్యాత్మకమైన శక్తి అంటే త్రిమూర్త్యాత్మకమై ముగురమ్మల స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటిది గాయత్రి.

ఈ విశ్వమంతా "త్రి" అన్న తత్త్వంతోనే ఉన్నది. భూతభవిష్యత్వర్తమాన కాలములు, ముల్లోకాలు, సత్వ - రజో - తమోగుణములు, సృష్టి స్థితి లయలు, అన్నీ మూడింటితోనే చెప్పబడుతున్నాయి.

ఈ మూడింటితో ఉన్న విశ్వమంతా వ్యాపించిన శక్తి గనుక ఆ తల్లి "త్రిపదా గాయత్రి" అనిచెప్పబడుతున్నది.

అలాంటి గాయత్రీ ఆరాధనలో 24 అక్షరములూ కూడా 24 తత్త్వములకు సంకేంతంగా కూడా భావన చేశారు.

అయితే ఈ 24 తత్వాలతోనే విశ్వమంతా ఉన్నది. అందుకే పంచముఖాలలో కూడా విశ్వ తత్త్వమే చెప్పబడుతున్నది.

అక్షరములుగా 24 సంఖ్యలలో ఉందని ప్రత్యేకత కూడా అదే. అంతేకాదు మన వెన్ను దండంలో ఉన్న పూసల సంఖ్య కూడా 24 యే.

అంటే ప్రాణశక్తి సంచరించేటటువంటి వెన్నుదండంలో ఉండేటటువంటి ఆ విభజన కూడా 24 తోనే ఉన్నది.

"ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ" అని వర్ణించిన ప్రకారం. ఈ విధంగా విద్యాధిదేవతగా గాయత్రీదేవిని ఆరాధించడం ఉంది.

సమస్త వేద సాహిత్యానికి, జ్ఞానానికి తల్లి అయిన గాయత్రీ దేవి ఆవిర్భవించిన రోజుకు గుర్తుగా, ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు గాయత్రీ జయంతి జరుపుకుంటారు.

No comments:

Post a Comment

Nirjala Ekadashi - నిర్జల ఏకాదశి

నిర్జల ఏకాదశి జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి  లేదా భీమసేని ఏకాదశి గా జరుపుకుంటారు. ఏకాదశి తిథి ఉపవాసం, విష్ణు ఆరాధనతో ముడిపడి ఉంటుంది....