Friday, October 10, 2025

Aurva Maharshi - ఔర్వ మహర్షి

భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్రవానుడు. అప్రవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు. బుచి యూరువు మరుగున పుట్టిన బిడ్డడగుటచే అతడు ఔర్వువయాడు. 

ఔర్వుడు బాల్యము నుండియు తపస్సులో మునిగి యుండెడివాడు. అతని తపశ్శక్తి అనలముగా మారినది. ఆ అగ్ని వలన ఉపద్రవము కలుగునని అతని పితృదేవతలు ఔర్వుని చేరి కుమారా?నీ తపోశ్శక్తిచే జనించిన అగ్నిని సముద్రమున విడిచిపెట్టు. అది సముద్రమును దహించును. లేకున్న ఉపద్రవములు కలుగును అని పలకగా ఔర్వుడు దానిని సముద్రమున విడిచిపెట్టాడు. అది ఔర్వానలమై గుర్రం ముఖంతో సముద్ర జలమును త్రాగనారంభించెను. అదే బడబానలం. అనంతరం ఔర్వుడు బ్రహ్మచర్యవ్రత చేయసాగాడు. అంత దేవతలు, రాక్షసులు ఆ మహర్షి వద్దకు వచ్చి పెండ్లి చేసికొని పిల్లలను కనుమని పలికారు. అతడు అందుకు అంగీకరింపలేదు. అతని బ్రహ్మచర్య దీక్షకు అచెరువంది హిరణ్యకశిపుడు శ్రద్ధాభక్తులతో ఆ మహర్షి నమస్కరించి శిష్యునిగా స్వీకరించమని కోరాడు. ఔర్వుడు సంతసించి హిరణ్యకశిపునకు కోరిన వరాలిచ్చి సంతుష్టిపరచి శత్రుభీతి ఉండదని అభయమిచ్చి పంపాడు.

ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు 'కందని' (కందశి) అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ. ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. దుర్వాసుడు తన భార్యయగు కందనితో సమస్త భోగములు అనుభవింపసాగాడు. తనే కోపి. తనకన్న తన భార్య మరీ కోపి. కలహప్రియ. కటుభాషిణి కావడంతో ఆమె బాధ భరించలేక ఆ మహర్షి ఆమెను భస్మం చేశాడు.ఆ విషయం మామ యగు ఔర్వ మహర్షికి తెలియగా వచ్చి అల్లుని నిందించి అవమానాల పాలగుదవని శపించాడు.

ఆయోధ్యను భాషుడను రాజుపాలించుచుండెను. హైహయులు దండెత్తి భాషుని రాజ్యమాక్రమించుకొన్నారు.అంత భాషుడు నిండు గర్భినియగు పట్టమహిషితో కులగురువగు ఔర్వుని ఆశ్రమమును పోయాడు. 

తన సవతి గర్భవతి అయినదని తనకా అదృష్టం లేదని భాషుని మరియొక భార్య పట్టమహిషికి విషం పెట్టింది. ఇది ఎవరకీ తెలియదు. దాంతో గర్భం స్తంభనమైంది. ఏడు సంవత్సరములైననూ ఆమెకు పురుడు రాలేదు. ఇంతలో రాజు ముసలివాడై మరణించాడు. పట్టమహిషి సహగమనానికి పాల్పడినది. కాని ఔర్వుడు నిండు గర్భణి అయినా ఆమెను అగ్ని ప్రవేశము చేయవద్దని వారించాడు. 

ఆమె గురువు వచనాల ప్రకారం ఆ ప్రయత్నం మాని ఆశ్రమమందే కాలక్షేపం చేస్తోంది. కొంతకాలమునకు ఆమె ఒక మగ బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డ విషంతో సహా జన్మించాడు.ఆ విషయము తెలిసికొని ఔర్వమహర్షి ఆ బిడ్డకు సగరుడని పేరు పెట్టాడు. గరమునగా విషయు. విషముతో పుట్టుటచే ఆతనికి సగరుడు అని నామకరణం చేశాడు ఆ మహర్షి. సగురుడు, తల్లి ఆశ్రమ మందే ఉంటున్నారు. సగరుడు పెద్ద వాడయ్యాడు. సమస్త విద్యలు నేర్చుకొన్నాడు. తల్లి వల్ల విషయాలు తెలిసికొని శత్రువులపై దండెత్తి వారినందరను జయించాడు. అతడు రాజ్యాభిషిక్తుడై సప్తద్వీపసమేతముగా భూమండలాన్ని పాలించసాగాడు. ఆయనకి ఇద్దరు భార్యలు ఒకరు విదర్భ రాజకుమారి వైదర్భి. మరొకరు శివి వంశానికి చెందిన శైబ్య. వారివల్ల సంతానం కలుగలేదు.భార్యలను వెంటబెట్టుకుని అతడు ఔర్వమహర్షి ఆశ్రమానికి వచ్చి సంతానం కావాలని అర్థించాడు. గురువు కరుణతో శైబ్యకు అసమంజసుడూ కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుడు గురువుకు నమస్కరించి వెళ్ళిపోయాడు.

సగరుడు చాలాకాలం రాజ్యం చేసి చివరకు ఔర్వుని చేరి తత్త్వముపదేసించమని అర్థించాడు. అంత ఆ మహర్షి అనేక విషయాలు తెలిపాడు. ఔర్వునికి తెలియని విషయాలు లేవు. అతడు మేధావి అస్ఖలిత బ్రహ్మచారి, తపోనిధి, ఉపకారి. అటువంటి మహర్షి చరిత్ర నిజంగా చాలా గొప్పది.

No comments:

Post a Comment

Sri Matangi Devi Sahasra Namavali - శ్రీ మాతంగి దేవి సహస్రనామావళి

శ్రీమాతంగీ దేవి సహస్రనామావళి ఓం సుముఖ్యై నమః । ఓం శేముష్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సురసాయై నమః । ఓం శశిశేఖరాయై నమః । ఓం సమానాస్యాయై నమః ।...