తిరుప్పావై - ఇరవై ఎనిమిదవ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
ఈ రోజు ధనుర్మాసం 28 వ రోజు.
ఈరోజు ఈ పాశురంలో గోపికలు తమ అమాయకత్వాన్ని కృష్ణుడికి చెప్పి శరణు కోరుతున్నారు.
"దివ్యాభరణాలు అలంకరించుకొని, నూతన వస్త్రాలు ధరించి, పరమాత్మతో కలిసి పరమాన్నం తిందాం" అని గోపికలు కోరారు.
"అంతటి ఉన్నతమైన ఫలాన్ని అందుకోవడానికి మీకు ఉన్న అర్హతలు ఏమిటో చెప్పండి" అన్నాడు పరమాత్మ ఈ పాశురంలో.
కఱవైగళ్ పిన్ శెన్రు కానమ్ శేరుందుంబోమ్
అఱివొన్రు మిల్లాద వాయ్ కులత్తు, ఉన్దన్నై ప్పిఱవి పెఱుందనై పుణ్ణియమ్ నాముడైయోమ్
కుఱైవొన్రు మిల్లాద గోవిందా! ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కి ఇంగొళిక్క ఒళియాదు
అఱియాద పిళ్ళైగళోమ్, అంబినాల్ ఉన్దన్నై
శిఱు పేరళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా నీతారాయ్ పఱై, యేలో రెంబావాయ్ || 28 ||
ఈ పాశురం యొక్క భావం చూద్దాం..
"ఓ! కృష్ణా! మేము అవివేకులం. స్వామీ! మేము బ్రతకడం కోసం తెల్లవారగానే చద్ది అన్నం తిని, పశువులను తీసుకొని అడవికిపోయి, వాటిని మేపి సాయంకాలానికి తిరిగి వస్తాం. ఆవులను, గేదెలను కాచుకునే గొల్ల పిల్లలం. వివేకం ఏమాత్రము లేనివారము. అజ్ఞానులము. మా అదృష్టం కొద్దీ నువ్వు మాకులంలో జన్మించావు. నీకూ మాకూ ఉన్న బంధం తెగిపోయింది కాదు. తెగనిది. త్రెంచలేనిది. అందుకే మా గోపికల కులం ధన్యమైంది. నీతోడి సహవాసమే మాకు అదృష్టము."
"నందనందనా! మాకు మర్యాద ఏమాత్రము తెలియక చనువుతో చిన్నచిన్న పేర్లతో కృష్ణా! గోవిందా! ఒరేయ్! ఏరా! సఖుడా! నేస్తమా! అని పిలిచాము. కోపగించుకోవద్దు తండ్రీ! వైకుంఠం నుంచి మమ్మల్ని ఉద్ధరించడానికి దిగివచ్చిన నువ్వు మా మీద దయ ఉంచి 'నిత్యకైంకర్యం' అనే పురుషార్థాన్ని అనుగ్రహించు" అని వేడుకుంటున్నారు.
"హే భగవాన్! లోక సహజంగా అందరూ అడిగే వాటినే మేము కూడా కోరుతున్నామని నీకు అనిపించవచ్చు, కానీ మేము త్రికరణ శుద్ధితో నిన్ను అర్థించేది నీ శాశ్వత కైంకర్యభాగ్యం మాత్రమే" అని చెప్పుకున్నారు.
భగవంతుడు ప్రసన్నుడై, తన విభూతిని దర్శింపచేసి వారిని కృతార్థులను చేశాడు.
తాము సర్వేశ్వరుడైన కృష్ణుణ్ణి ఒక గొల్ల బాలుడిగా భావించి, చిన్నప్పట్నుంచి చనువు తీసుకొని, అతడితో వ్యవహరించిన తీరుకు గోపికలు మరల మరలా క్షమాపణలు కోరుతున్నారు.
ఓ! గోపాలకృష్ణా! నీవు పరిపూర్ణుడవు అని తెలియక, గాఢమైన ప్రేమ భావంతో, అభిమానంతో, నీ పట్ల చనువుగా ఉన్నాం. కుడిచేతికి, ఎడమచేతికి తేడా తెలియని వాళ్ళం. మేము నీ పట్ల తెలియక చేసిన అపరాధాలను మన్నించి, మేము నీ పాదపద్మాలను చేరుకునే దారి చూపించు. నిన్ను శరణు వేడుతున్నాం అని ప్రార్థన చేశారు.
ఆండాల్ తిరువడిగళే శరణం
No comments:
Post a Comment